02-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆత్మిక పండాలు (మార్గదర్శకులు), మీరు గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ, కమలపుష్ప సమానముగా అయి స్మృతియాత్రను చేయాలి మరియు చేయించాలి’’

ప్రశ్న:-
తండ్రి పిల్లలకు ఏ అలంకరణను చేస్తారు? ఏ అలంకరణను నిరాకరిస్తారు?

జవాబు:-
బాబా అంటారు - మధురమైన పిల్లలూ, నేను మీకు ఆత్మిక అలంకరణను చేయడానికి వచ్చాను, మీరు ఎప్పుడూ కూడా దైహిక అలంకరణను చేసుకోవద్దు. మీరు బికారులు, మీకు ఫ్యాషన్ పట్ల అభిరుచి ఉండకూడదు. ప్రపంచము చాలా పాడైపోయి ఉంది, అందుకే కొద్దిగా కూడా శరీరము యొక్క ఫ్యాషన్ చేసుకోకండి.

పాట:-
ఆఖరికి ఆ రోజు నేటికి వచ్చింది...

ఓంశాంతి
అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. అనంతము అనగా ఎలాంటి హద్దులు ఉండవు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఇంతమంది లెక్కలేనంతమంది పిల్లలందరికీ తండ్రి ఒక్కరే, వారిని రచయిత అని అంటారు. వారు హద్దు తండ్రులు, వీరు ఆత్మల అనంతమైన తండ్రి. వారు హద్దుకు సంబంధించిన దైహిక తండ్రులు, వీరు ఆత్మల యొక్క ఒకే ఒక్క అనంతమైన తండ్రి. వీరినే భక్తి మార్గములో ఆత్మలందరూ స్మృతి చేస్తారు. భక్తి మార్గము కూడా ఉందని, దానితో పాటు రావణ రాజ్యము కూడా ఉందని పిల్లలైన మీకు తెలుసు. మమ్మల్ని రావణ రాజ్యము నుండి రామ రాజ్యములోకి తీసుకువెళ్ళండి అని ఇప్పుడు మనుష్యులు పిలుస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - చూడండి, దేవీ-దేవతలు ఒకప్పుడు భారత్ కు యజమానులుగా ఉండేవారు, వారు ఇప్పుడు అలా లేరు. వారెవరు అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు. మనమే సత్యయుగీ సూర్యవంశానికి యజమానులుగా ఉండేవారము. రాజా-రాణి అయితే ఉంటారు కదా. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. పిల్లలైన మనకు రాజ్య భాగ్యము యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి, విశ్వానికి యజమానులుగా చేయడానికి బాబా వచ్చి ఉన్నారు. తండ్రి అంటారు, ఇప్పుడు అందరూ భక్తి మార్గములో ఉన్నారు, భక్తి మార్గాన్నే రావణ రాజ్యమని అంటారు. జ్ఞాన మార్గాన్ని కేవలం ఒక్క తండ్రి మాత్రమే పిల్లలైన మీకు నేర్పిస్తారు. ఆ అనంతమైన తండ్రిని భక్తి మార్గములో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మల కొరకు జ్ఞానము యొక్క రాజధాని లభిస్తుంది. ఇక తర్వాత అర్ధకల్పము వరకు మీరు పిలవనే పిలవరు. అయ్యో రామా... అయ్యో ప్రభూ అని పలికే అవసరమే ఉండదు. దుఃఖములో ఉన్నప్పుడు అయ్యో రామా అని అంటారు. అక్కడ మీకు దుఃఖము ఉండనే ఉండదు. ఈ ఆట తయారుచేయబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అర్ధకల్పము జ్ఞానమనే పగలు, అర్ధకల్పము భక్తి అనే రాత్రి ఉంటాయి. భక్తి మనల్ని కిందకు దించేస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో మెట్ల వరుస యొక్క జ్ఞానము తప్పకుండా ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది 84 జన్మల చక్రము, ఈ చక్రాన్ని తెలుసుకోవడముతో మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు. అందుకే బాబా చిత్రాలను కూడా తయారుచేయిస్తున్నారు, ఈ చక్రాన్ని తెలుసుకోవడముతో మనము 21 జన్మల రాజ్య భాగ్యాన్ని తీసుకుంటామని ఈ చిత్రాల ద్వారా ఋజువవుతుంది.

ఇప్పుడు మీరు చాలామంది తయారయ్యారు. పెద్ద ఆత్మిక శక్తి సైన్యము తయారయ్యింది. మీరంతా పండాలు (మార్గదర్శకులు). బాబా కూడా పండానే. వారిని గైడ్ అని అంటారు. పండా అనే పదము శుభప్రదమైనది. యాత్రలకు తీసుకువెళ్ళేవారిని పండాలని అంటారు. యాత్రికులు వెళ్ళినప్పుడు, వారికి అన్నీ చూపించడానికని ఒక గైడ్ ను నియమిస్తారు. తీర్థ యాత్రలలో కూడా పండాలు ఉంటారు. తండ్రి అంటారు - జన్మజన్మలుగా తీర్థ యాత్రలు చేస్తూ వచ్చారు. అమరనాథ యాత్రకు వెళ్తారు, తీర్థ యాత్రలకు వెళ్తారు, ప్రదక్షిణలు చేస్తారు. అక్కడకు వెళ్ళినప్పుడు అవే గుర్తుంటాయి. ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపార-వ్యవహారాలు, అన్నింటి నుండి మనసు తొలగిపోతుంది. మీ ఇంటిలో, గృహస్థములో ఉంటూ వ్యాపార-వ్యవహారాలు కూడా చేసుకుంటూ ఉండండి మరియు ఈ గుప్త యాత్రను కూడా చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు అర్థం చేయించడము జరుగుతుంది. ఇది ఎంత బాగుంటుంది. ఎంత పెద్ద వ్యాపారము చేయాలనుకుంటే అంత చేయండి. ఎవరికీ వద్దని చెప్పరు. కానీ మీ రాజ్యాన్ని కూడా సంభాళించుకోండి. జనక మహారాజుకు కూడా సెకెండులో జీవన్ముక్తి లభించింది. మీకేమీ బయటి యాత్రలు మొదలైనవాటిలో ఎదురుదెబ్బలు తినవలసిన అవసరము లేదు. మీ ఇళ్ళు-వాకిళ్ళను కూడా పూర్తిగా సంభాళించాలి. ఎవరైతే తెలివైన మంచి పిల్లలు ఉంటారో, వారు, మేము ఇంటిలో, గృహస్థములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలని భావిస్తారు. గృహస్థ వ్యవహారముతో విసిగిపోకూడదు. కుమార-కుమారీలైతే సన్యాసుల వంటివారు, వారిలో వికారాలు ఉండవు. వారు 5 వికారాల నుండి దూరంగా ఉంటారు. మన అలంకరణ అసలు వేరుగా ఉంటుందని, బయటివారిది వేరుగా ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారిది తమోప్రధాన అలంకరణ, మీది సతోప్రధాన అలంకరణ. దీనితో మీరు సతోప్రధాన సూర్యవంశీ రాజ్యములోకి వెళ్ళాలి. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - తమోప్రధాన దైహిక అలంకరణను కొద్దిగా కూడా చేసుకోకండి. ప్రపంచము చాలా పాడైపోయి ఉంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఫ్యాషనబుల్ గా అవ్వకండి. ఫ్యాషన్ ఆకర్షిస్తుంది. ఈ సమయములో అందం మంచిది కాదు. నల్లగా ఉంటే మంచిది. ఎవరూ పంజా విసరకుండా ఉంటారు. అందంగా ఉన్నవారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. శ్రీకృష్ణుడిని కూడా నల్లగా చూపిస్తారు. మీరు శివబాబా ద్వారా తెల్లగా (సుందరముగా) అవ్వాలి. వారు పౌడర్ మొదలైనవాటితో తెల్లగా అవుతారు. ఎంత ఫ్యాషన్ ఉంది అంటే ఇక అడగకండి. షావుకారులైతే సర్వనాశనము అవుతున్నారు. పేదవారు బాగున్నారు. పల్లెలకు వెళ్ళి పేదవారి కళ్యాణము చేయాలి. కానీ శబ్దాన్ని వ్యాపింపజేసే పెద్ద మనుష్యులు కూడా కావాలి. మీరందరూ పేదవారు కదా. ఎవరైనా షావుకారులుగా ఉన్నారా? మీరు ఎంత సాధారణముగా కూర్చున్నారో చూడండి. బొంబాయిలో ఫ్యాషన్లు ఎలా ఉన్నాయో చూడండి. బాబా వద్దకు కలవడానికి వచ్చినప్పుడు ఏమంటారంటే - మీరు ఈ దైహిక అలంకరణను చేసుకున్నారు, ఇప్పుడు వస్తే మీకు జ్ఞాన అలంకరణను చేస్తాను, దీనితో మీరు 21 జన్మలకు స్వర్గములోని దేవతలుగా అవుతారు, సదా సుఖమయముగా అవుతారు. ఇక ఎప్పుడూ ఏడవరు, దుఃఖము ఉండదు. ఇప్పుడు ఈ దైహిక అలంకరణను మీరు వదిలేయండి. మీకు నేను జ్ఞాన రత్నాలతో ఎటువంటి ఫస్ట్ క్లాస్ అలంకరణను చేస్తానంటే, ఇక అడగకండి. ఒకవేళ నా మతాన్ని అనుసరించినట్లయితే మిమ్మల్ని పట్టపురాణులుగా చేస్తాను. ఇది మంచిదే కదా. భారతవాసులైన మిమ్మల్నందరినీ ఈ తమోప్రధాన ఆసురీ ప్రపంచమైన నరకము నుండి తీసుకువెళ్ళి స్వర్గములోని మహారాణులుగా తయారుచేస్తాను.

ఈ రోజు మనము తెల్లని వస్త్రాలలో ఉన్నామని, మరుసటి జన్మలో స్వర్గములో బంగారు చెంచాతో పాలు తాగుతామని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. స్వర్గమంటే స్వర్గమే, ఇక అడగకండి. ఇక్కడ మీరు బికారులుగా ఉన్నారు. భారత్ బికారిగా ఉంది. బికారి నుండి రాకుమారునిగా అని అంటూ ఉంటారు. ఈ భారత్ లోనే మళ్ళీ జన్మ తీసుకుంటారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేసారు, రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. తినడానికి కూడా ఏమీ లేని కటిక పేదవారికి దానము ఇవ్వడము జరుగుతుంది. భారత్ యే కటిక పేదరికములో ఉంది. ఈ సమయములో అందరూ తమోప్రధానముగా ఉన్నారని కూడా పాపం వారికి తెలియదు. రోజురోజుకు మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. ఇప్పుడు ఎవరూ మెట్లు ఎక్కలేరు. 16 కళల నుండి 14 కళలు, తర్వాత 12 కళలు... ఇలా కిందకు దిగుతూనే ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా ముందు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు, తర్వాత 14 కళలలోకి దిగుతారు కదా. ఈ విషయాలు కూడా మంచి రీతిలో గుర్తుంచుకోవాలి. మెట్లు దిగుతూ-దిగుతూ పూర్తిగా పతితముగా అయిపోయారు. మళ్ళీ స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారుచేస్తారు? ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. ఈ మాట కూడా అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఏ చరిత్ర రిపీట్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. సత్యయుగము ఆయువు లక్షల కోట్ల సంవత్సరాలని శాస్త్రాలలో వ్రాసేసారు. సత్యయుగము ఎప్పుడు వస్తుంది అని వారిని అడగండి. ఇంకా 40 వేల సంవత్సరాలు పడుతుందని అంటారు. పూర్తి కల్పము ఆయువే 5 వేల సంవత్సరాలని మీరు ఋజువు చేసి చెప్తారు. వారు కేవలం సత్యయుగానికే లక్షల సంవత్సరాలని చెప్తారు. ఘోర అంధకారము కదా. మరి మనుష్యులు, భగవంతుడు వచ్చి ఉంటారని ఎలా నమ్ముతారు. కలియుగాంతము జరిగేటప్పుడు భగవంతుడు వస్తారని వారు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. కానీ కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు. కనుక పాపం, వారు అయ్యో అయ్యో అని అంటూ మరణిస్తారు. మీ జయజయకారాలు జరుగుతాయి. వినాశనములో అయ్యో అయ్యో అనే అంటూ ఉంటారు. విపరీత బుద్ధి కలవారు అయ్యో అయ్యో అనే అంటారు. ఇప్పుడు మీరు సత్యమైనవారి సంతానము, సత్యమైనవారు. నరకము యొక్క వినాశనము జరగకుండా స్వర్గమెలా తయారవుతుంది. ఇది మహాభారత యుద్ధమని మీరంటారు. దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మనుష్యులకేమీ తెలియదు. ఇప్పుడు మాకు దైవీ స్వరాజ్యమనే వెన్న లభిస్తుందని మీ బుద్ధిలో ఉంది. వారు పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు. వారు కూడా మనుష్యులే, మీరు కూడా మనుష్యులే కానీ వారు ఆసురీ సాంప్రదాయానికి చెందినవారు, మీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారు. తండ్రి పిల్లలకు సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీ లోపల సంతోషము ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే తీసుకుంటున్నారో, అలా అనేక సార్లు మీరు ఈ రాజధానిని తీసుకున్నారు. వారు పరస్పరంలో రెండు పిల్లుల వలె కొట్లాడుకుంటారు. మొత్తము విశ్వము యొక్క రాజ్యాధికారమనే వెన్న మీకు లభిస్తుంది. మీరు ఇక్కడకు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే వచ్చారు. మనము బాబాతో యోగము జోడించి కర్మాతీత అవస్థను పొందుతామని మీకు తెలుసు. వారు పరస్పరంలో కొట్లాడుకుంటారు, మనము విశ్వ రాజ్యాధికారాన్ని పొందే తీరుతాము. ఇది మామూలు విషయమే. ఆ బాహుబలం వారు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోలేరు. మీరు యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. మీది అహింసా పరమో దైవీ ధర్మము. అక్కడ రెండు రకాల హింసలు ఉండవు. కామ ఖడ్గము యొక్క హింస అన్నింటికన్నా చెడ్డది, అది మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖము ఇస్తుంది. రావణ రాజ్యము ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని ఇప్పుడు పిలుస్తున్నారంటే తప్పకుండా ఏదో సమయములో పావనముగా ఉండేవారనే కదా. దుఃఖము నుండి విముక్తులుగా చేయండి, శాంతిధామానికి తీసుకువెళ్ళండి, దుఃఖాన్ని హరించి సుఖమివ్వండి అని భారతవాసీ పిల్లలే పిలుస్తారు. శ్రీకృష్ణుడిని హరి అని కూడా అంటారు. బాబా, మమ్మల్ని హరి యొక్క ద్వారానికి తీసుకువెళ్ళండి అని అంటారు. కృష్ణపురియే హరిద్వారము. ఇది కంసపురి. ఈ కంసపురి మనకు ఇష్టమనిపించదు. మాయా మశ్చీంద్రుని ఆటను చూపిస్తారు. రావణ రాజ్యము ద్వాపరము నుండి మొదలవుతుందని మీకు తెలుసు. పావనముగా ఉండే దేవతలు పతితముగా అవ్వడము ప్రారంభిస్తారు, దీని గుర్తులు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. ప్రపంచములో చాలా అశుద్ధత ఉంది. ఇప్పుడు మనము ఆ విషయాలన్నింటి నుండి బయటపడి పరిస్తాన్ లోకి వెళ్తాము. ఇందులో చాలా ధైర్యము, మహావీరత కావాలి. బాబాకు చెందినవారిగా అయి పతితముగా అవ్వకూడదు. స్త్రీ-పురుషులు కలిసి ఉంటూ, నిప్పు అంటుకోకుండా ఉండటమనేది సాధ్యము కాదు అని వారు భావిస్తారు. అందుకే, ఇక్కడ స్త్రీ-పురుషులను సోదరీ-సోదరులుగా చేస్తున్నారు, ఈ విధముగా ఎక్కడా వ్రాసి లేదు, ఇక్కడ ఏమి ఇంద్రజాలముందో తెలియదు అని అంటూ హంగామా చేస్తారు. అరే, మీరు బ్రహ్మాకుమారీల వద్దకు వెళ్ళినట్లయితే ఇక అంతే, వారు మిమ్మల్ని కట్టిపడేస్తారని అంటారు. ఈ విధముగా అక్కడ రేకెత్తిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరి పాత్ర అయితే ఉంటుందో, వారు ఎలాగైనా సరే వచ్చేస్తారు, ఇందులో భయపడే విషయమేమీ లేదు. శివబాబా అయితే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. బ్రహ్మా ద్వారా పతితము నుండి పావనముగా తయారుచేస్తారు. ఎవరైనా వచ్చి చదవగలిగే విధముగా ఈ పదాలను పెద్ద అక్షరాలతో వ్రాయండి. పవిత్రత విషయములోనే ఎన్ని విఘ్నాలను వేస్తారు.

బాబా అంటారు - పిల్లలూ, ఏ దేహధారుల పట్ల మోహము యొక్క బంధము ఉండకూడదు. ఒకవేళ ఎక్కడైనా మోహము యొక్క బంధము ఉన్నట్లయితే చిక్కుకుపోతారు. ఇక్కడైతే, అమ్మ మరణించినా కూడా హల్వా తినాలి... బాబా తమ ఎదురుగా కూర్చోబెట్టుకుని అడుగుతున్నారు - రేపు మీ వారెవరైనా మరణిస్తే ఏడవరు కదా. కన్నీరు వచ్చిందంటే ఫెయిల్ అయినట్లు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకున్నారు - ఇందులో ఏడవాల్సిన విషయమేముంది. ఇతరులెవరైనా ఈ మాటలు వింటే, నోటితో మంచి మాటలు మాట్లాడండి కదా అని అంటారు. అరే, మంచి మాటలే మాట్లాడుతున్నాము. సత్యయుగములో ఏడవడమనేది ఉండనే ఉండదు, మీ ఈ జీవితము దానికన్నా ఉన్నతమైనది. మీరు అందరినీ ఏడవడము నుండి రక్షించేవారు, అటువంటప్పుడు మీరెలా ఏడుస్తారు? మనకు పతులకే పతి లభించారు, వారు మనల్ని స్వర్గములోకి తీసుకువెళ్తారు. అటువంటప్పుడు నరకములోకి పడేసేవారి కోసం మనమెందుకు ఏడవాలి! వారసత్వము తీసుకునేందుకు, బాబా ఎంతటి మధురాతి-మధురమైన విషయాలను వినిపిస్తారు. ఈ సమయములో భారత్ కు ఎంతటి అకళ్యాణము జరిగింది. తండ్రి వచ్చి కళ్యాణము చేస్తారు. భారత్ ను మగధ దేశమని అంటారు. సింధీల అంతటి ఫ్యాషనబుల్ గా ఎవరూ ఉండరు. విదేశాల నుండి ఫ్యాషన్లు నేర్చుకుని వస్తారు. ఈ రోజుల్లో జుట్టును అలంకరించుకునేందుకు ఆడపిల్లలు ఎంత ఖర్చు చేస్తారు. వారిని నరకము యొక్క దేవకన్యలని అంటారు. తండ్రి మిమ్మల్ని స్వర్గము యొక్క దేవతలుగా తయారుచేస్తారు. మాకైతే ఇక్కడే స్వర్గము ఉంది, ఈ సుఖాన్ని అయితే అనుభవించనివ్వండి, రేపు ఏమి జరుగుతుంది అనేది మాకేమి తెలుసు అని అంటారు. ఈ విధముగా రకరకాల ఆలోచనల కలవారు వస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యాతి-సత్యమైన ఆత్మిక పండాలుగా అయ్యి అందరికీ ఇంటి మార్గాన్ని తెలియజేయాలి. శరీర నిర్వహణార్థము వ్యాపారము చేసుకుంటూ స్మృతియాత్రలో ఉండాలి. కార్య వ్యవహారాలతో విసిగిపోకూడదు.

2. జ్ఞాన అలంకరణ చేసుకుని స్వయాన్ని స్వర్గము యొక్క దేవతలుగా తయారుచేసుకోవాలి. ఈ తమోప్రధాన ప్రపంచములో దైహిక అలంకరణను చేసుకోకూడదు. కలియుగీ ఫ్యాషన్లను వదిలేయాలి.

వరదానము:-
బాలక మరియు యజమానత్వపు బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తముగా నడుచుకునే సఫలతామూర్త భవ

ఎంత వీలైతే అంత సేవా సంబంధములో బాలక స్థితి మరియు తమ పురుషార్థపు స్థితిలో యజమాన స్థితి ఉండాలి. సంపర్కము మరియు సేవలో బాలక స్థితి మరియు స్మృతియాత్ర మరియు మంథనము చేయడములో యజమాన స్థితి ఉండాలి. సహచరులు మరియు సంగఠనలో బాలక స్థితి మరియు వ్యక్తిగతముగా యజమానత్వపు స్థితి ఉండాలి. ఈ బ్యాలెన్స్ ద్వారా నడుచుకోవడమే యుక్తియుక్తముగా నడుచుకోవడము. దీని ద్వారా సహజముగానే ప్రతి కార్యములో సఫలత ప్రాప్తిస్తుంది, స్థితి ఏకరసముగా ఉంటుంది మరియు సహజముగానే సర్వుల స్నేహీలుగా అయిపోతారు.

స్లోగన్:-
ఆలోచించడము మరియు చేయడము సమానముగా ఉండాలి, అప్పుడే విల్ పవర్ గల శక్తిశాలీ ఆత్మ అని అంటారు.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

హర్షితముగా ఉండే గుణము పురుషార్థములో చాలా సహాయకారిగా అవ్వగలదు. కానీ మీ ముఖము ఎలా అయితే హర్షితముగా ఉంటుందో, అలాగే ఆత్మ కూడా సదా హర్షితముగా ఉండాలి. ఈ సహజ గుణాన్ని ఆత్మలోకి తీసుకురావాలి. సదా హర్షితముగా ఉంటే మాయకు చెందిన ఎటువంటి ఆకర్షణ కూడా ఆకర్షితము చెయ్యలేదు, ఇది బాబా ఇచ్చే గ్యారంటీ. కానీ సదా హర్షితముగా ఉండేందుకు మీ ఆత్మిక గౌరవములో ఉండాలి మరియు సహనశీలురై సాక్షీదృష్టాగా అయ్యి మాయ ఆటను చూడాలి.