02-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు ఎలాంటి శ్రేష్ఠ కర్మలను
నేర్పించడానికి వచ్చారంటే, దానితో మీరు 21 జన్మల రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని
తీసుకోగలరు, స్థిరమైన, అఖండమైన రాజ్యానికి యజమానులుగా అవ్వగలరు’’
ప్రశ్న:-
గృహస్థులకు
మరియు సన్యాసులకు మధ్యన ఏ ఒక్క సిద్ధాంతములో చాలా పెద్ద తేడా ఉంది?
జవాబు:-
గృహస్థుల
సిద్ధాంతము ఏమిటంటే - భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపములో వస్తారు మరియు సన్యాసుల
సిద్ధాంతము ఏమిటంటే - బ్రహ్మ తత్వాన్ని గుర్తు చేస్తూ-చేస్తూ అందులో లీనమైపోతాము.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - బ్రహ్మ తత్వములో ఎవరూ లీనమవ్వరు. ఆత్మ
అమరమైనది, అది ఎలా లీనమవుతుంది. ఒకవేళ భగవంతుడు వస్తే తప్పకుండా టీచరుగా అయి
శిక్షణనిస్తారు. ప్రేరణ ద్వారానైతే జ్ఞానాన్ని ఇవ్వరు కదా.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము...
ఓంశాంతి
మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు మాత్రమే ‘బాబా’ అని అంటారు.
ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారని అనగా వారు అందరికీ తండ్రి అని
పిల్లలకు తెలుసు. వారిని అనంతమైన పిల్లలందరూ అనగా ఆత్మలందరూ స్మృతి చేస్తారు. వారిని
ఏదో ఒక విధముగా స్మృతి చేస్తారు, కానీ మనము ఆ పరమపిత పరమాత్మ నుండి రాజ్యాధికారాన్ని
తీసుకుంటామని వారికి తెలియదు. మనకు తండ్రి ఇచ్చే సత్యయుగ విశ్వ రాజ్యాధికారము
స్థిరమైనది, అఖండమైనది, అచలమైనది అని మీకు తెలుసు. మన ఆ రాజ్యాధికారము 21 జన్మలు
స్థిరముగా నిలిచి ఉంటుంది. మొత్తం విశ్వముపై మన రాజ్యము ఉంటుంది. దానిని ఎవరూ
లాక్కోలేరు, దోచుకోలేరు. మన రాజ్యము స్థిరమైనది ఎందుకంటే అక్కడ ఒక్క ధర్మమే ఉంటుంది,
ద్వైతము ఉండదు. అది అద్వైత రాజ్యము. పిల్లలు పాటను వినేటప్పుడు తమ రాజ్యము యొక్క నషా
బుద్ధిలోకి రావాలి. ఇటువంటి పాటలు ఇంటిలో ఉండాలి, వాటి ద్వారా తండ్రి మరియు
వారసత్వము వెంటనే గుర్తుకువస్తాయి. తండ్రి స్మృతికి సంబంధించిన ఆనందభరితమైన పాటలు
ఉండాలి. మీదంతా గుప్తము. గొప్ప వ్యక్తులకు చాలా ఆర్భాటము ఉంటుంది. మీకు ఏ ఆర్భాటము
లేదు. బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో, వారిలో కూడా ఏ ఆర్భాటము లేదు అన్నది మీరు
చూస్తున్నారు. వస్త్రాలు మొదలైనవన్నీ అవే ఉన్నాయి. మనకు ఈ రాజ్య భాగ్యాన్ని
ఇవ్వడానికి బాబా వీరిలోకి ప్రవేశించారని మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు.
మొత్తం సృష్టిలో ఈ సమయములో ఉన్న మనుష్యమాత్రులందరూ దేహాభిమానములోకి వచ్చి
అధర్మయుక్తమైన పనులు చేస్తున్నారని, అందుకే వారిని తెలివిహీనులని అంటారని కూడా
పిల్లలకు తెలుసు. అందరి బుద్ధికి తాళం వేయబడి ఉంది. మీరు ఎంత తెలివైనవారిగా,
విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ పూర్తిగా తెలివిహీనులుగా చేసేసింది.
మీరు దేనికి పనికి రానివారిగా అయిపోయారు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞ-తపాదులు
చాలా చేస్తారు కానీ ఏమీ లభించదు. అలాగే భ్రమిస్తూ ఉంటారు. పరమాత్ముని గురించి ఎవరికీ
తెలియదు, వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది కూడా ఎంత తప్పు. పిత (తండ్రి) అనే
పదము బుద్ధిలోకి రాదు. ఎవరైనా తండ్రి అని పిలిచినా, అది కూడా నామమాత్రముగానే అంటారు.
ఒకవేళ వారు పరమపిత అని అర్థం చేసుకుంటే, ఇక బుద్ధి ఒక్కసారిగా ప్రకాశించడము
మొదలవుతుంది. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్.
అటువంటప్పుడు, మనము కలియుగ నరకములో ఎందుకు ఉన్నాము! ఇప్పుడు మనము
ముక్తి-జీవన్ముక్తులను ఎలా పొందగలము, ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు మీకు
వివేకము లభించింది. బాబా మనకు ఈ స్మృతినిప్పించారు - కొత్త ప్రపంచము, కొత్త భారత్
ఉన్నప్పుడు మన రాజ్యముండేది, ఒకే మతము, ఒకే భాష, ఒకే మహారాజు-మహారాణి ఉండేవారు.
సత్యయుగములో మహారాజు-మహారాణి అని, త్రేతాలో రాజు-రాణి అని అంటారు. తర్వాత ద్వాపరములో
వామ మార్గము మొదలవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరి కర్మలపై అనగా కర్మలనుసారముగా ఒక
శరీరాన్ని వదిలి మరొకదానిని తీసుకోవడము అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తండ్రి
అంటారు - నేను మీకు ఎలాంటి కర్మలను నేర్పిస్తానంటే, వాటి ద్వారా 21 జన్మలు
రాజ్యాధికారాన్నే పొందుతూ ఉంటారు. అక్కడ కూడా హద్దు తండ్రి ఉంటారు, కానీ అక్కడ ఈ
రాజ్య వారసత్వము అనంతమైన తండ్రి ఇచ్చినది అనే జ్ఞానముండదు. తర్వాత, ద్వాపరము నుండి
రావణ రాజ్యము మొదలవుతుంది, అప్పుడు సంబంధాలు వికారీగా అయిపోతాయి. అప్పుడిక ఎలాంటి
కర్మలను చేస్తారో, అలాంటి ఫలము లభిస్తుంది. దేవతలు వామ మార్గములోకి వెళ్ళిపోతారు.
ఇక సత్యయుగములో ఉన్నదంతా సమాప్తమైపోతుంది. అప్పుడు, కర్మలనుసారముగా జన్మలు
తీసుకుంటారు. భారత్ లో పూజ్య రాజులు ఉండేవారు, పూజారి రాజులు కూడా ఉండేవారు.
సత్యయుగములో రాజు-రాణి మరియు ప్రజలు అందరూ పూజ్యులుగా ఉంటారు. తర్వాత ద్వాపరములో
భక్తి మొదలైనప్పుడు యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ పూజారులుగా అయిపోతారు. ఆ గొప్ప
సూర్యవంశీ రాజులే పూజారులుగా అయిపోతారు, ఆ తర్వాత వైశ్య వంశీయులుగా అయిపోతారు.
ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతారు. ఆ ప్రారబ్ధము 21 జన్మల వరకు కొనసాగుతుంది,
తర్వాత భక్తి మార్గము మొదలవుతుంది. ఎవరెవరైతే పూజ్య దేవీ-దేవతలుగా ఉండి వెళ్ళారో,
వారి మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. ఇది కేవలం భారత్ లో మాత్రమే జరుగుతుంది.
తండ్రి వినిపించే ఈ 84 జన్మల కథ కూడా భారతవాసుల కోసమే. ఇతర ధర్మాల వారు రావడమే
తర్వాత వస్తారు, వృద్ధి చెందుతూ-చెందుతూ ఎంతోమంది అయిపోతారు. దేవీ-దేవతలకు రకరకాల
ఆచారాలు, పద్ధతులు ఉండేవి, భారత్ లోని గురువులకు అలాంటివి లేవు. అర్ధకల్పము తర్వాత
రావణ రాజ్యము మొదలవ్వడముతో మొత్తం ఆచారాలు, పద్ధతులన్నీ మారిపోతాయి, అప్పుడు
పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. ఒకప్పుడు ఒక్క శివునికి మాత్రమే అవ్యభిచారీ పూజ
చేసేవారు. వారి మందిరాలను నిర్మిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ-నారాయణుల మందిరాలను
నిర్మిస్తారు. ఒకరు లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని నిర్మిస్తే, ఇక ఇతరులు కూడా
నిర్మిస్తారు. తర్వాత సీతా-రాముల మందిరాలను నిర్మించడము మొదలుపెడతారు. కలియుగములో
చూడండి, గణేశుడు, హనుమంతుడు, చండికా దేవి మొదలైన అనేక దేవీల చిత్రాలను తయారుచేస్తూ
ఉంటారు. భక్తి మార్గానికి సామాగ్రి కూడా కావాలి కదా. బీజము ఎంత చిన్నదిగా ఉంటుంది,
కానీ వృక్షము ఎంత పెద్దదిగా ఉంటుంది, అదే విధముగా భక్తి కూడా విస్తారమైపోతుంది.
ఎన్నో శాస్త్రాలను తయారుచేయడము జరుగుతుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు -
ఈ భక్తి మార్గపు సామాగ్రి అంతా సమాప్తమవ్వనున్నది, ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి
చేయండి. భక్తి ప్రభావము కూడా చాలా ఉంది కదా. భక్తి ఎంత సుందరముగా ఉంటుంది. నృత్యాలు,
పాటలు, కీర్తనలు మొదలైనవాటికి ఎంత ఖర్చు చేస్తారు.
ఇప్పుడు తండ్రి అంటారు - తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, ఆది
సనాతన ధర్మాన్ని స్మృతి చేయండి. అనేక రకాల భక్తిని మీరు జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు.
గృహస్థ ధర్మము వారే భక్తిని మొదలుపెడతారు. సన్యాసులైతే భక్తియే చేయరు. యజ్ఞ-తపాదులు,
దాన-పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవన్నీ గృహస్థుల పనులు, సన్యాసులవి కావు. వారు
నివృత్తి మార్గము వారు. వారి నియమము ఏమిటంటే - ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవుల్లో
ఉండడము మరియు బ్రహ్మతత్వాన్ని గుర్తు చేయడము. వారు తత్వ జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు.
వారు తత్వాన్ని అనగా బ్రహ్మతత్వాన్నే ఈశ్వరుడు అని అంటారు. వాస్తవానికి భారతవాసులు
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. కానీ, హిందుస్థాన్ లో ఉండడము వలన తమది
హిందూ ధర్మమని అనుకున్నారు. అదే విధముగా సన్యాసులు కూడా ఆత్మలు నివసించే స్థానాన్ని
అనగా ఆ తత్వాన్ని పరమాత్మగా భావిస్తారు. బ్రహ్మమును లేక తత్వమునే గుర్తు చేస్తారు.
వాస్తవానికి సన్యాసులు సతోప్రధానముగా ఉన్నప్పుడు అడవులలోకి వెళ్ళి శాంతిగా ఉండేవారు.
అలాగని వారు బ్రహ్మతత్వములోకి వెళ్ళి లీనమవుతారని కాదు. తండ్రి అంటారు - ఇది వారి
మిథ్యా (అసత్యమైన) జ్ఞానము. అలా ఎవ్వరూ లీనమవ్వలేరు. ఆత్మ అయితే అవినాశీ కదా. అది
ఎలా లీనమవ్వగలదు. భక్తి మార్గములో ఎంతగా కష్టపడుతూ ఉంటారు. భగవంతుడు ఏదో ఒక రూపములో
ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కలుస్తారని మళ్ళీ అంటారు. ఇప్పుడు ఎవరు రైట్? సన్యాసులేమో
బ్రహ్మతత్వముతో యోగము జోడించి బ్రహ్మములో లీనమైపోతామని అంటారు. గృహస్థులేమో,
భగవంతుడు ఏదో ఒక రూపములో వస్తారని, పతితులను పావనముగా తయారుచేస్తారని అంటారు. కానీ
పై నుండి ప్రేరణ ద్వారా నేర్పిస్తారని కాదు. టీచరు ఇంటిలో కూర్చుని ప్రేరణ ఇవ్వరు
కదా! ప్రేరణ అనే పదమే లేదు. ప్రేరణతో ఏ పనీ జరగదు. శంకరుని ప్రేరణతో వినాశనము
జరుగుతుందని అంటారు. కానీ ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. వారు ఈ మిసైల్స్ మొదలైనవి
తయారుచేయాల్సిందే. ఇక్కడ ప్రేరణ విషయమే లేదు. మనుష్యులైతే - భగవంతుని ప్రేరణతో అంతా
జరుగుతుందని, శంకరుడు మూడవ నేత్రము తెరవగానే ప్రళయము జరిగిందని అంటారు. ఇవన్నీ కథలు,
అర్థాన్ని ఏ మాత్రం తెలుసుకోరు. ఎవరి మందిరానికైనా వెళ్తే - అచ్యుతమ్ కేశవమ్... అని
అంటారు, కానీ దాని అర్థమేమీ వారికి తెలియదు. ఎవరికీ తమ పూర్వజుల మహిమ గురించి
తెలియదు. ధర్మ స్థాపకులను గురువులు అని అంటారు. వాస్తవానికి వారిని గురువు అని అనడము
తప్పు. క్రైస్టు గురువు కారు. వారు కేవలం ధర్మ స్థాపనను చేస్తారు. ఎవరైతే
సద్గతినిస్తారో వారినే గురువు అని అంటారు. ధర్మ స్థాపకులు ధర్మ స్థాపన చేయడానికి
వస్తారు. వారి వెనుక వారి వంశావళి వస్తుంది. వారు ఎవరికీ సద్గతినివ్వరు కావున వారిని
గురువు అని ఎలా అంటారు. గురువైతే ఒక్కరే, వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు.
భగవంతుడైన తండ్రియే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు, ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు.
ఎప్పుడూ ఎవరూ వారిని స్మృతి చేయకుండా ఉండలేరు. మనుష్యులు - ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా,
అని ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ఇదంతా రచన. రచయిత అయిన తండ్రిని నేనే. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు,
వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సోదరుడు సోదరుడికి వారసత్వాన్ని
ఇవ్వలేరు. వారసత్వము సదా తండ్రి నుండి లభిస్తుంది. నేను అనంతమైన పిల్లలందరికీ
అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. అందుకే నన్ను - ఓ పరమాత్మా, క్షమించండి అని
తలచుకుంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు.
తండ్రి అంటారు - నేను మీరు పిలవడము వల్లనేమీ రాను. ఇది డ్రామాలో తయారుచేయబడి ఉంది.
డ్రామాలో నేను వచ్చే పాత్ర కూడా నిశ్చితమై ఉంది. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ
స్థాపన లేక కలియుగ వినాశనము, సత్యయుగ స్థాపన చేయాల్సి ఉంటుంది. నేను నా సమయానికి నా
అంతట నేనే వస్తాను. ఈ భక్తి మార్గానికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. ఇప్పుడు భక్తి
మార్గపు పాత్ర పూర్తయినప్పుడు నేను వచ్చి ఉన్నాను. బాబా, కల్పక్రితం కూడా మీరు
బ్రహ్మా తనువులోకి వచ్చారు. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు లభిస్తుంది. మళ్ళీ ఎప్పుడూ
లభించదు. ఇది జ్ఞానము, అది భక్తి. జ్ఞానము యొక్క ప్రారబ్ధము ఎక్కే కళ. సెకండులో
జీవన్ముక్తి అని అంటారు. జనకునికి సెకెండులో జీవన్ముక్తి లభించింది కదా. కానీ ఒక్క
జనకుడు మాత్రమే జీవన్ముక్తిని పొందారా? జీవన్ముక్తినైతే అందరూ పొందుతారు కదా. మొత్తం
విశ్వమంతా పొందుతుంది. సద్గతి అన్నా జీవన్ముక్తి అన్నా మాట ఒక్కటే. జీవన్ముక్తి అనగా
జీవితాన్ని ఈ రావణ రాజ్యము నుండి ముక్తి చేస్తారు. పిల్లలకు ఎంత దుర్గతి కలిగింది
అనేది బాబాకు తెలుసు. పూర్తిగా దుఃఖితులుగా అయిపోయారు. వారికి మళ్ళీ సద్గతి
కలగనున్నది. ముందు ముక్తిలోకి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతిధామము
నుండి తర్వాత సుఖధామములోకి వస్తారు. ఈ చక్రము యొక్క రహస్యాన్ని తండ్రి అర్థం
చేయించారు. తండ్రి అంటారు - ఈ సమయములో మొత్తం సృష్టి యొక్క వృక్షమంతా శిథిలావస్థకు
చేరుకుంది, తమోప్రధానమైపోయింది, అందుకే ఎవరూ తమను తాము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము
వారమని భావించరు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు,
ఎందుకంటే దేవతలు పవిత్రముగా ఉండేవారు. అపవిత్రముగా, పతితముగా ఉన్న మనము స్వయాన్ని
దేవతలమని ఎలా చెప్పుకోగలము, అందుకే, ఈ వికారాలను వదులుతూ వెళ్ళండి అని అంటారు. ఈ
వికారాలు మొదలైనవి అర్ధకల్పము నుండి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క జన్మ వీటిని వదలడము శ్రమ
అనిపిస్తుంది. శ్రమించకుండా విశ్వానికి యజమానులుగా అవ్వరు. తండ్రిని స్మృతి
చేసినప్పుడే మీకు మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకోగలరు అనగా రాజ్యానికి అధికారులుగా
అవుతారు. ఎంత మంచి రీతిలో స్మృతి చేస్తారో, శ్రీమతాన్ని అనుసరిస్తారో, అంతగా మీరు
రాజులకే రాజుగా అవుతారు. చదివించే టీచరు చదివించడానికి వచ్చారు. ఇది మనుష్యుల నుండి
దేవతలుగా తయారయ్యే పాఠశాల. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే కథను వినిపిస్తారు. ఈ
కథ ఎంత ప్రసిద్ధమైనది. దీనిని అమరకథ, సత్య నారాయణుడి కథ, మూడవ నేత్రము కథ అని కూడా
అంటారు.
పాట ఎంత బాగుందో చూడండి. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఆ
యజమానత్వాన్ని ఎవరూ దోచుకోలేరు. భూకంపాలు మొదలైనవేవీ సంభవించవు. అక్కడ విఘ్నాలు అనే
మాటే ఉండదు. అటువంటి స్థిరమైన, అఖండమైన పవిత్రత సుఖ-శాంతుల రాజ్యాన్ని మీరు ఇప్పుడు
పొందుతున్నారు. కల్పక్రితం వలె ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత భారత్ స్వర్గముగా
అవుతుంది. మనమే దేవతలుగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఈ
విధముగా తయారయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. దీనినే స్వదర్శన
చక్రధారులుగా అవ్వడమని అంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి.
వికారాలన్నింటినీ వదిలేయాలి.
2. బ్రహ్మాబాబా సమానముగా సాధారణముగా మరియు గుప్తముగా ఉండాలి. బాహ్య ఆర్భాటాలు
మొదలైనవి చేయకూడదు. తమ భవిష్య రాజ్యము యొక్క నషాలో ఉండాలి.
వరదానము:-
తమ చంచల వృత్తిని పరివర్తన చేసి సతోప్రధాన వాయుమండలాన్ని
తయారుచేసే బాధ్యతాయుత శ్రేష్ఠ ఆత్మా భవ
ఏ పిల్లలైతే తమ చంచల వృత్తిని పరివర్తన చేస్తారో, వారే
సతోప్రధాన వాయుమండలాన్ని తయారుచెయ్యగలరు ఎందుకంటే వృత్తితో వాయుమండలము తయారవుతుంది.
ఎప్పుడైతే వృత్తిలో ఇంత పెద్ద కార్యపు స్మృతి ఉండదో అప్పుడే వృత్తి చంచలమవుతుంది.
ఒకవేళ ఎవరైనా చాలా ఎక్కువ చంచలమైన పిల్లలు బిజీగా ఉన్నా కూడా చంచలతను
వదిలిపెట్టకపోతే అటువంటి వారిని కట్టేస్తారు. అలాగే ఒకవేళ జ్ఞాన-యోగాలలో బిజీగా
ఉన్నా కూడా వృత్తి చంచలమవుతున్నట్లయితే ఒక్క తండ్రితో సర్వ సంబంధాల బంధనములో
వృత్తిని బంధించినట్లయితే చంచలత సహజముగానే సమాప్తమైపోతుంది.
స్లోగన్:-
నిర్లక్ష్యపు
అలను సమాప్తము చేసేందుకు సాధనము అనంతమైన వైరాగ్యము.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
దాతాతనపు సంస్కారాన్ని
ఇమర్జ్ చేసి మనసు ద్వారా పుణ్య ఖాతాను జమ చేసుకోండి, వాణి ద్వారా బలహీన ఆత్మలను
సంతోషములోకి, వ్యాకులతతో ఉన్న వారిని గౌరవము యొక్క స్మృతిలోకి, నిరాశలో ఉన్నవారిని
ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురండి, సంబంధ-సంపర్కముల ద్వారా ఆత్మకు తమ శ్రేష్ఠ
సాంగత్యపు రంగును అనుభవము చేయించండి, అప్పుడు పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది.