03-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు స్మృతిలో ఉండే పురుషార్థాన్ని తప్పకుండా చేయాలి, ఎందుకంటే స్మృతి బలముతోనే మీరు వికర్మాజీతులుగా అవుతారు’’

ప్రశ్న:-
ఏ ఆలోచన వస్తే పురుషార్థములో పడిపోతారు? ఈశ్వరీయ సేవాధారులైన పిల్లలు ఏ సేవను చేస్తూ ఉంటారు?

జవాబు:-
చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే - ఇప్పుడింకా సమయముంది, తర్వాత పురుషార్థము చేద్దాములే అని, కానీ మృత్యువుకు ఒక నియమమంటూ ఏదీ ఉండదు. రేపు-రేపు అని అంటూ మరణిస్తారు. అందుకే - చాలా సంవత్సరాలు ఉన్నాయి, తర్వాత వేగము ముందుకు వెళ్ళిపోదాములే అని అనుకోకండి. ఈ ఆలోచన మరింత కింద పడేస్తుంది. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండే పురుషార్థము చేస్తూ, శ్రీమతముపై తమ కళ్యాణము చేసుకుంటూ ఉండండి. ఈశ్వరీయ సేవాధారులైన ఆత్మిక పిల్లలు ఆత్మలకు ముక్తిని ఇచ్చే మరియు పతితులను పావనముగా చేసే సేవను చేస్తూ ఉంటారు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
నిరాకార తండ్రి సాకారుడు లేకుండా ఏ కర్మను చేయలేరని, పాత్రను అభినయించలేరని ఇదైతే పిల్లలకు అర్థం చేయించడము జరిగింది. ఆత్మిక తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. యోగబలము ద్వారానే పిల్లలు సతోప్రధానముగా అవ్వాలి, ఆ తర్వాత సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవ్వాలి, ఈ విషయము పిల్లల బుద్ధిలో ఉంది. కల్ప-కల్పము తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు వచ్చి బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు, అంటే వారు మనుష్యులను దేవతలుగా చేస్తారు. దేవీ-దేవతలుగా ఉన్న మనుష్యులే ఇప్పుడు మారి శూద్రులుగా, పతితులుగా అయిపోయారు. భారత్ పారసపురిగా ఉన్నప్పుడు పవిత్రత-సుఖ-శాంతులు అన్నీ ఉండేవి. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. తండ్రి కూర్చుని యథార్థమైన లెక్కను అర్థం చేయిస్తారు. వారి కన్నా ఉన్నతమైనవారైతే ఎవ్వరూ లేరు. ఈ సృష్టిని లేక వృక్షమునే కల్పవృక్షము అని అంటారు, దీని ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తండ్రియే తెలియజేయగలరు. భారత్ లో ఏదైతే దేవీ-దేవతా ధర్మము ఉండేదో, అది ఇప్పుడు కనుమరుగైపోయింది. దేవీ-దేవతా ధర్మమైతే ఇప్పుడిక లేదు. దేవతల చిత్రాలు తప్పకుండా ఉన్నాయి. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేదని భారతవాసులకు తెలుసు. శాస్త్రాలలో శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళి పొరపాటు చేసారు. తండ్రే వచ్చి మర్చిపోయినవారికి పూర్తి మార్గాన్ని తెలియజేస్తారు. మార్గాన్ని తెలియజేసేవారు వచ్చినప్పుడు ఆత్మలన్నీ ముక్తిధామానికి వెళ్ళిపోతాయి, అందుకే వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు. రచయిత ఒక్కరే ఉంటారు, సృష్టి కూడా ఒక్కటే ఉంటుంది, ప్రపంచ చరిత్ర-భౌగోళికము ఒక్కటే, అది రిపీట్ అవుతూ ఉంటుంది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలు, ఆ తర్వాత సంగమయుగము ఉంటుంది. కలియుగములో పతితులు ఉంటారు, సత్యయుగములో పావనమైనవారు ఉంటారు. సత్యయుగము తయారైతే తప్పకుండా కలియుగ వినాశనమవుతుంది. వినాశనానికి ముందే స్థాపన జరుగుతుంది. సత్యయుగములోనైతే స్థాపన జరగదు. పతిత ప్రపంచము ఉన్నప్పుడే భగవంతుడు వస్తారు. సత్యయుగము అయితే పావన ప్రపంచము. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా చేయడానికి భగవంతుడు రావలసి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అత్యంత సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. దేహ సంబంధాలన్నింటినీ వదిలి దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. ఎవరో ఒకరైతే పతిత-పావనుడిగా ఉన్నారు కదా. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు భగవంతుడు ఒక్కరే. భక్తులకు జ్ఞానాన్ని ఇస్తారు. పావనముగా తయారుచేయడానికి పతిత ప్రపంచములోకి జ్ఞానసాగరుడే వస్తారు. యోగముతో పావనముగా అవుతారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ పావనముగా తయారుచేయలేరు. ఈ విషయాలన్నీ ఇతరులకు అర్థం చేయించేందుకని బుద్ధిలో కూర్చోబెట్టడము జరుగుతుంది. ఇంటింటికీ సందేశము ఇవ్వాలి. భగవంతుడు వచ్చారు అని నేరుగా చెప్పకూడదు. చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. వారు తండ్రి కదా అని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి, రెండవవారు పారలౌకిక తండ్రి. దుఃఖము సమయములో పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. సుఖధామములో ఎవ్వరూ స్మృతి చేయరు. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యములో సుఖమే సుఖముండేది. అక్కడ పవిత్రత, శాంతి, సంపదలుండేవి. తండ్రి నుండి వారసత్వము లభించిన తర్వాత ఇక ఎందుకు పిలుస్తారు. మాకు సుఖముంది అని అక్కడ ఆత్మకు తెలుసు. అక్కడ సుఖమే సుఖముందని ఎవ్వరైనా చెప్తారు. తండ్రి దుఃఖము కోసమైతే సృష్టిని రచించలేదు. ఇది తయారై, తయారుచేయబడిన ఆట. ఎవరి పాత్ర అయితే చివరిలో ఉంటుందో, వారు 2-4 జన్మలను తీసుకుంటారు, వారు తప్పకుండా మిగిలిన సమయములో శాంతిలో ఉంటారు. అంతేకానీ డ్రామా యొక్క ఆట నుండే బయటకు వెళ్ళిపోవడమనేది జరగదు. ఆటలోకైతే అందరూ రావలసి ఉంటుంది. ఎవరికైనా 1-2 జన్మలే లభిస్తే, వారు మిగిలిన సమయమంతా మోక్షములో ఉన్నట్లు. ఆత్మ పాత్రధారి కదా. కొంతమంది ఆత్మలకు ఉన్నతమైన పాత్ర లభించి ఉంది, కొంతమందికి తక్కువ పాత్ర లభించి ఉంది. ఈ విషయము కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈశ్వరుని గురించి ఎవ్వరూ సంపూర్ణముగా తెలుసుకోలేరని అంటూ ఉంటారు. తండ్రియే వచ్చి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి సంపూర్ణముగా తెలియజేస్తారు. ఎప్పటివరకైతే రచయిత స్వయముగా రారో, అప్పటివరకు రచయిత గురించి మరియు రచన గురించి తెలుసుకోలేరు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని తండ్రియే వచ్చి తెలియజేస్తారు. నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో, అతనికి తన జన్మల గురించి తెలియదు. నేను కూర్చుని అతనికి 84 జన్మల కథను వినిపిస్తాను. ఎవరి పాత్రలోనూ మార్పు ఉండదు. ఇది తయారై, తయారుచేయబడిన ఆట. ఈ విషయము కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఎప్పుడైతే పవిత్రముగా అయి అర్థం చేసుకుంటారో, అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. మంచి రీతిలో అర్థం చేసుకునేందుకే 7 రోజుల భట్టీ ఉంది. భాగవత పఠనము మొదలైనవి కూడా 7 రోజులు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా, తక్కువలో తక్కువ 7 రోజులైనా లేకుండా ఎవ్వరూ అర్థం చేసుకోలేరని మీకు అర్థమవుతుంది. కొంతమందైతే బాగా అర్థం చేసుకుంటారు, కొంతమందైతే 7 రోజులు విన్నా కూడా ఏమీ అర్థం చేసుకోరు, బుద్ధిలో కూర్చోదు. ఏమంటారంటే - మేమైతే 7 రోజులు వచ్చాము కానీ మా బుద్ధిలో ఏమీ కూర్చోవటం లేదు అని. ఉన్నత పదవిని పొందేది లేనప్పుడు మరి బుద్ధిలో కూర్చోదు. అచ్ఛా, ఎంతైనా వారి కళ్యాణమైతే జరిగింది కదా. ప్రజలైతే అలాగే తయారవుతారు. ఇకపోతే, రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలంటే, అందులో గుప్తమైన శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశనమవుతాయి. ఇక చేయండి, చేయకపోండి కానీ తండ్రి డైరెక్షన్ అయితే ఇదే. ప్రియమైనవారినైతే తలచుకోవడము జరుగుతుంది కదా. భక్తి మార్గములో కూడా - ఓ పతిత-పావనా రండి అని పాడుతారు, ఇప్పుడు వారు లభించారు. వారంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. రాజ్యాధికారము సహజముగా లభించదు. ఎంతోకొంత శ్రమ అయితే ఉంటుంది కదా. స్మృతిలోనే శ్రమ ఉంది. ముఖ్యమైనది స్మృతియాత్రయే. చాలా స్మృతి చేసేవారు కర్మాతీత అవస్థను పొందుతారు. పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు. యోగబలము ద్వారానే వికర్మాజీతులుగా అవ్వాలి. ఇంతకుముందు కూడా యోగబలము ద్వారానే వికర్మలను జయించారు. కలియుగ అంతిమములో పవిత్రమైనవారు ఎవ్వరూ లేనప్పుడు మరి లక్ష్మీ-నారాయణులు ఇంత పవిత్రముగా ఎలా అయ్యారు. ఇందులోనైతే స్పష్టముగా ఉంది. ఇప్పుడు గీతా జ్ఞానము యొక్క అధ్యాయము రిపీట్ అవుతోంది. ‘‘శివ భగవానువాచ’’. పొరపాట్లు అయితే జరుగుతూనే ఉంటాయి కదా. తండ్రియే వచ్చి పొరపాట్లు చేయనివారిగా తయారుచేస్తారు. భారత్ లో ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. తండ్రి అంటారు, నేను ఏదైతే వినిపించానో, అది ఎవ్వరికీ తెలియదు. నేను ఎవరికైతే వినిపించానో, వారు పదవిని పొందారు, 21 జన్మల ప్రారబ్ధాన్ని పొందారు, ఇక తర్వాత జ్ఞానము కనుమరుగైపోతుంది. మీరే చక్రములో తిరిగి వచ్చారు. కల్పక్రితం ఎవరైతే విన్నారో, వారే వస్తారు. మనము మనుష్యులను దేవతలుగా తయారుచేసే అంటు కడుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇది దైవీ వృక్షము యొక్క అంటు. మనుష్యులు ఆ వృక్షాలకు చాలా అంట్లు కడుతూ ఉంటారు. తండ్రి వచ్చి వ్యత్యాసాన్ని తెలియజేస్తారు. తండ్రి దైవీ పుష్పాల అంటు కడతారు. వాళ్ళు అయితే అడవుల కొరకు అంట్లు కడుతూ ఉంటారు. కౌరవులేమి చేసి వెళ్ళారు, పాండవులేమి చేసి వెళ్ళారు, వారి ప్లాన్లు ఏమిటి మరియు మీ ప్లాన్లు ఏమిటి అన్నది మీరు చూపిస్తారు కూడా. వారు జనాభా పెరగకూడదని తమ ప్లాన్లు తయారుచేసుకుంటారు. జనాభా ఎక్కువగా పెరగకూడదని ఫ్యామిలీ ప్లానింగ్ జరగాలి అని అనుకుంటారు. దాని కోసం కష్టపడుతూ ఉంటారు. తండ్రి అయితే చాలా మంచి విషయాన్ని తెలియజేస్తారు. అనేక ధర్మాలు వినాశనమవుతాయి మరియు ఒకే ఒక దేవీ-దేవతా ధర్మము యొక్క ఫ్యామిలీని స్థాపన చేస్తారు. సత్యయుగములో ఒకే ఒక ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క ఫ్యామిలీ ఉండేది, ఇన్ని ఫ్యామిలీలు ఉండేవి కావు. భారత్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి - గుజరాతీ ఫ్యామిలీ, మహారాష్ట్ర ఫ్యామిలీ... వాస్తవానికి భారతవాసులది ఒకే ఫ్యామిలీ ఉండాలి. చాలా ఫ్యామిలీలు ఉన్నట్లయితే తప్పకుండా పరస్పరములో గొడవలే ఉంటాయి, ఇక తర్వాత సివిల్ వార్ (అంతర్యుద్ధము) జరుగుతుంది. ఫ్యామిలీలో కూడా అంతర్యుద్ధము జరుగుతుంది. క్రిస్టియన్లకు తమ ఫ్యామిలీ ఉంటుంది. వారికి కూడా పరస్పరములో అంతర్యుద్ధాలు జరుగుతాయి. పరస్పరములో ఇద్దరు సోదరులు కలవరు, నీరు కూడా వేరు చేసి పంచుకోవడము జరుగుతుంది. సిక్కు ధర్మమువారు - మేము మా సిక్కు ధర్మము వారికి ఎక్కువ సుఖమివ్వాలని భావిస్తారు, వారి పట్ల మోహముంటుంది కావున కష్టపడుతూ ఉంటారు. అంతిమ సమయము వచ్చినప్పుడు మళ్ళీ సివిల్ వార్ లు మొదలైనవన్నీ జరుగుతాయి. పరస్పరములో కొట్లాడుకోవడము ప్రారంభిస్తారు. వినాశనమైతే జరగవలసిందే. బాంబులు ఎన్నో తయారుచేస్తూ ఉంటారు. పెద్ద యుద్ధము జరిగినప్పుడు, అందులో రెండు బాంబులు మాత్రమే వేసారు, ఇప్పుడైతే ఎన్నో బాంబులను తయారుచేసారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. ఇది అదే మహాభారత యుద్ధమని మీరు అర్థం చేయించాలి. ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆపకపోతే, మొత్తం ప్రపంచమంతటికీ నిప్పు అంటుకుంటుంది అని పెద్ద-పెద్ద వారందరూ అంటారు. నిప్పు అయితే అంటుకోవాల్సిందేనని మీకు తెలుసు. తండ్రి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. రాజయోగమనేది సత్యయుగము కోసమే ఉంది. ఆ దేవీ-దేవతా ధర్మము ఇప్పుడు కనుమరుగైపోయింది. చిత్రాలను కూడా తయారుచేసారు. తండ్రి అంటారు, కల్పక్రితము వలె ఏ విఘ్నాలైతే కలిగాయో, అవి మళ్ళీ కలుగుతాయి. వాటి గురించి ముందే తెలియదు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగి ఉంటుందని తర్వాత అర్థం చేసుకుంటారు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. డ్రామాలో మనము బంధింపబడి ఉన్నాము. స్మృతియాత్రను మర్చిపోకూడదు, దీనిని పరీక్ష అని అంటారు. స్మృతియాత్రలో నిలవలేకపోతారు, అలసిపోతారు. రాత్రి ప్రయాణీకుడా... అని పాట ఉంది కదా. దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది స్మృతియాత్ర, ఈ యాత్ర ద్వారా రాత్రి పూర్తయ్యి పగలు వస్తుంది. అర్ధకల్పము పూర్తవ్వగానే మళ్ళీ సుఖము ప్రారంభమవుతుంది. తండ్రియే మన్మనాభవ అర్థాన్ని కూడా తెలియజేసారు. కేవలం గీతలో శ్రీకృష్ణుని పేరు వేసినందుకు ఇక ఆ శక్తి లేదు. ఇప్పుడు కళ్యాణమైతే అందరిదీ జరగనున్నది, అంటే మనము మనుష్యమాత్రులందరి కళ్యాణము చేస్తున్నాము. ప్రత్యేకముగా భారత్ కు మరియు మిగతా ప్రపంచానికి, అందరికీ మనము శ్రీమతముపై కళ్యాణము చేస్తున్నాము. ఎవరైతే కళ్యాణకారులుగా అవుతారో, వారసత్వము కూడా వారికే లభిస్తుంది. స్మృతియాత్ర లేకుండా కళ్యాణము జరగదు.

వారైతే అనంతమైన తండ్రి అని ఇప్పుడు మీకు అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి నుండి వారసత్వము లభించింది. భారతవాసులే 84 జన్మలు తీసుకున్నారు. పునర్జన్మల లెక్క కూడా ఉంది. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు అనేది ఎవ్వరూ అర్థం చేసుకోరు. వారు తమ శ్లోకాలు మొదలైనవి తయారుచేసి వినిపిస్తూ ఉంటారు. గీత అయితే అదే కానీ దానికి ఎన్నో వ్యాఖ్యానాలు వ్రాస్తూ ఉంటారు. గీత కన్నా కూడా భాగవతానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. గీతలో జ్ఞానముంది, భాగవతములో జీవిత కథ ఉంది. వాస్తవానికి గీతకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. జ్ఞానసాగరుడు తండ్రి, వారి జ్ఞానమైతే కొనసాగుతూనే ఉంటుంది. ఆ గీతనైతే అరగంటలో చదివేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అయితే మీరు వింటూనే ఉంటారు. రోజురోజుకు మీ వద్దకు అనేకమంది వస్తూ ఉంటారు, మెల్లమెల్లగా వస్తారు. ఇప్పుడే ఒకవేళ పెద్ద-పెద్ద రాజులు వచ్చినట్లయితే ఇక సమయము పట్టదు, వెంటనే శబ్దము వ్యాపిస్తుంది. అందుకే యుక్తిగా, మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది. ఇది ఉన్నదే గుప్త జ్ఞానము. మనము ఏమి చేస్తున్నాము అన్నది ఎవ్వరికీ తెలియదు. రావణునితో మీ యుద్ధము ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. భగవానువాచ - మీరు సతోప్రధానముగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి. పవిత్రముగా అయినప్పుడే నాతోపాటు తీసుకువెళ్తాను. జీవన్ముక్తి అందరికీ లభించనున్నది. రావణ రాజ్యము నుండి ముక్తిని పొందుతారు. మీరు ఇలా వ్రాస్తారు కూడా - శివశక్తి బ్రహ్మాకుమార-కుమారీలైన మేము 5 వేల సంవత్సరాల క్రితము వలె పరమపిత పరమాత్ముని శ్రీమతముపై శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని స్థాపన చేస్తాము. 5 వేల సంవత్సరాల క్రితము శ్రేష్ఠాచారీ ప్రపంచముండేది. ఇది బుద్ధిలో కూర్చోబెట్టాలి. ముఖ్య-ముఖ్యమైన పాయింట్లు బుద్ధిలో ధారణ అయితే, అప్పుడు స్మృతియాత్రలో ఉంటారు. రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. కొందరు అనుకుంటారు - ఇప్పుడు ఇంకా సమయముంది, తర్వాత పురుషార్థము చేద్దాములే అని. కానీ మృత్యువుకు ఒక నియమమంటూ ఏదీ లేదు. రేపే మరణించవచ్చు. రేపు-రేపు అంటూ మరణిస్తారు. పురుషార్థమైతే చేయలేదు. అందుకే - ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, తర్వాత వేగముగా ముందుకు వెళ్ళిపోదాము అని అనుకోకండి. ఈ ఆలోచన ఇంకా కింద పడేస్తుంది. ఎంత వీలైతే అంత పురుషార్థము చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ శ్రీమతముపై తమ కళ్యాణము చేసుకోవాలి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నేను తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను మరియు ఎంతగా తండ్రి సేవను చేస్తున్నాను అని. ఆత్మిక ఈశ్వరీయ సేవాధారులు మీరే కదా. మీరు ఆత్మలకు ముక్తిని ఇస్తారు. ఆత్మ పతితము నుండి పావనముగా ఎలా అవుతుంది అనేదానికి యుక్తులను తెలియజేస్తారు. ప్రపంచములో మంచి మనుష్యులు మరియు చెడ్డ మనుష్యులైతే ఉండనే ఉంటారు. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిదే. ఇది అనంతమైన విషయము. ముఖ్యమైన కొమ్మలు-రెమ్మలనే లెక్కిస్తారు, ఇకపోతే ఆకులైతే అనేకము ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, కృషి చేయండి, తండ్రితో బుద్ధియోగాన్ని జోడింపజేసేందుకు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. పవిత్రముగా అయినట్లయితే ముక్తిధామానికి వెళ్ళిపోతారని తండ్రి పిల్లలందరికీ చెప్తారు. మహాభారత యుద్ధము ద్వారా ఏమి జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియదు. ఈ జ్ఞాన యజ్ఞము రచింపబడి ఉంది ఎందుకంటే కొత్త ప్రపంచము కావాలి. మన యజ్ఞము పూర్తి అయినట్లయితే అందరూ ఈ యజ్ఞములో స్వాహా అయిపోతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, అందుకే విఘ్నాలకు భయపడకూడదు. విఘ్నాలలో స్మృతియాత్రను మర్చిపోకూడదు. స్మృతియాత్ర ఎప్పుడూ ఆగిపోకుండా అటెన్షన్ ఉంచాలి.

2. పారలౌకిక తండ్రి యొక్క పరిచయాన్ని అందరికీ ఇస్తూ, పావనముగా అయ్యే యుక్తిని తెలియజేయాలి. దైవీ వృక్షము యొక్క అంటు కట్టాలి.

వరదానము:-
‘‘నేను’’ అన్న భావనను త్యాగము చేసి సేవలో సదా మైమరచిపోయి ఉండే త్యాగమూర్త సేవాధారీ భవ

సేవాధారులు సేవలో సఫలతను ఎప్పుడు అనుభవము చేయగలరంటే - ఎప్పుడైతే ఈ ‘‘నేను’’ అన్నదానిని త్యాగము చేస్తారో అప్పుడు. నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేసాను - ఈ రకమైన సేవా భావాన్ని త్యాగము చేయాలి. నేను చేయలేదు కానీ నేను చేసేవాడిని, చేయించేవారు తండ్రి. ఈ ‘‘నేను’’ అన్న భావన బాబా ప్రేమలో లీనమైపోవాలి - ఇటువంటివారినే సేవలో సదా నిమగ్నమై ఉండేవారు, త్యాగమూర్తులు, సత్యమైన సేవాధారులు అని అంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తుడిని. సేవలో ‘‘నేను’’ అన్న భావన కలవడము అనగా దాసులుగా అవ్వడము. సత్యమైన సేవాధారులలో ఈ సంస్కారము ఉండజాలదు.

స్లోగన్:-
వ్యర్థాన్ని సమాప్తము చేసినట్లయితే సేవ యొక్క ఆఫర్ ఎదురుగా వస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

ఏకత కొరకు స్వయములో ఇముడ్చుకునే శక్తి కావాలి, దీని ద్వారా ఇతరుల సంస్కారాలు కూడా తప్పకుండా శీతలమైపోతాయి. సదా పరస్పరము ఒకరి పట్ల ఒకరు స్నేహము, శ్రేష్ఠత యొక్క భావనతో సంపర్కములోకి రండి, గుణగ్రాహకులుగా అవ్వండి, అప్పుడు ఏకత స్థిరముగా నిలవగలదు. సంగఠనలోని మీ శుభ భావన అనేక ఆత్మలకు భావన యొక్క ఫలాన్ని ఇప్పించేందుకు నిమిత్తమవుతుంది. వారికి కొత్త మార్గము లభిస్తుంది.