04-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాబా మిమ్మల్ని కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ (పుష్పాలలో కల్లా రాజు) గా తయారుచేయడానికి వచ్చారు, అందుకే వికారాల దుర్గంధము ఏదీ కూడా మీలో ఉండకూడదు’’

ప్రశ్న:-
వికారాల అంశాన్ని సమాప్తము చేసేందుకు ఏ పురుషార్థము చేయాలి?

జవాబు:-
నిరంతరము అంతర్ముఖులుగా ఉండే పురుషార్థము చేయండి. అంతర్ముఖీ అనగా క్షణములో శరీరము నుండి అతీతము అవ్వడము. ఈ ప్రపంచము యొక్క స్పృహను పూర్తిగా మర్చిపోవాలి. ఒక్క క్షణములో పైకి వెళ్ళాలి మరియు రావాలి. ఈ అభ్యాసము ద్వారా వికారాల అంశము సమాప్తమైపోతుంది. కర్మలు చేస్తూ-చేస్తూ మధ్యమధ్యలో అంతర్ముఖులుగా అవ్వండి. పూర్తిగా నిశ్శబ్దత లేక స్తబ్ధత ఏర్పడినట్లుగా అనిపించాలి. ఏ కదలికా ఉండకూడదు. ఈ సృష్టియే లేదు అన్నట్లుగా ఉండాలి.

ఓంశాంతి
ఇక్కడ ప్రతి ఒక్కరినీ ఏమని చెప్పి కూర్చోబెట్టడం జరుగుతుందంటే - అశరీరిగా అయి తండ్రి స్మృతిలో కూర్చోండి మరియు దానితో పాటుగా ఈ సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేయండి. మనుష్యులు 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోరు. వారు అసలు అర్థం చేసుకోలేరు. ఎవరైతే 84 జన్మల చక్రములో తిరుగుతారో, వారే అది అర్థం చేసుకునేందుకు వస్తారు. మీరు దీనినే స్మృతి చేస్తూ ఉండాలి, దీనిని స్వదర్శన చక్రము అని అంటారు, దీని ద్వారా ఆసురీ ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఎవరో అసురులు ఉన్నారని, వారి శిరస్సు ఖండించబడుతుంది అని ఏమీ కాదు. మనుష్యులు స్వదర్శన చక్రము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇక్కడ లభిస్తుంది. కమలపుష్ప సమానముగా గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వండి. ఇది భగవానువాచ కదా. ఈ ఒక్క జన్మ పవిత్రముగా అయినట్లయితే భవిష్య 21 జన్మలు మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. సత్యయుగాన్ని శివాలయము అని అంటారు, కలియుగాన్ని వేశ్యాలయము అని అంటారు. ఈ ప్రపంచము మారుతోంది. ఇది భారత్ కు సంబంధించిన విషయమే. ఇతరుల మాటలలోకి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు. కొందరు - జంతువుల పరిస్థితి ఏమవుతుంది, ఇతర ధర్మాలవారు ఏమవుతారు అని ప్రశ్నిస్తారు. మీరు చెప్పండి - ముందు స్వయాన్ని గురించి అర్థం చేసుకోండి, ఇతరుల విషయము తరువాత చూద్దాము. భారతవాసులే తమ ధర్మాన్ని మరచి దుఃఖితులుగా అయ్యారు. నీవే తల్లివి, తండ్రివి... అని భారత్ లోనే పిలుస్తారు. విదేశాలలో - నీవే తల్లివి, తండ్రివి అనే పదాలను వాడరు. వారు కేవలం గాడ్ ఫాదర్ (తండ్రి) అని అంటారు. వాస్తవానికి భారత్ లోనే సుఖ సమృద్ధి ఉండేది, భారత్ స్వర్గముగా ఉండేది - ఇది కూడా మీకు తెలుసు. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. తండ్రిని తోట యజమాని అని అంటారు. మీరు వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారుచేయండి అని పిలుస్తారు. తండ్రి పుష్పాల తోటను తయారుచేస్తారు. మాయ మళ్ళీ ముళ్ళ అడవిలా తయారుచేస్తుంది. ఈశ్వరుడా, నీ మాయ చాలా ప్రబలమైనది అని మనుష్యులు అంటూ ఉంటారు కానీ వారు ఈశ్వరుడి గురించి కానీ, మాయను గురించి కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరో ఒక మాట అంటే ఇక దానినే తిరిగి అంటూ ఉంటారు, దాని అర్థమేమీ తెలియదు. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము అనేది డ్రామా యొక్క ఆట అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. రామ రాజ్యములో సుఖము, రావణ రాజ్యములో దుఃఖము ఉంటుంది. ఇది ఇక్కడి విషయమే. ఇది ఏమీ ప్రభువు యొక్క మాయ కాదు. మాయ అని పంచ వికారాలను అంటారు, దానినే రావణుడు అని అంటారు. ఇకపోతే మనుష్యులైతే పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రములోకి వస్తారు. సతోగుణము నుండి తమోప్రధానముగా అవ్వవలసిందే. ఈ సమయములో అందరూ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు - అందుకే వారిని వికారులు అని అంటారు. దీని పేరే వికారీ ప్రపంచము, ఆ తరువాత వచ్చేది నిర్వికారీ ప్రపంచము అనగా పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా ఎలా అవుతుంది అనేది అర్థం చేసుకోవలసిన సామాన్యమైన విషయము. కొత్త ప్రపంచములో మొదట స్వర్గము ఉండేది. స్వర్గ స్థాపన చేసేవారు పరమపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు. అక్కడ సుఖ సమృద్ధి ఉండేది. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి ఎలా ఏర్పడుతుంది, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. బ్రహ్మా మరియు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు పగలు, ఆ తరువాత ఆ బ్రాహ్మణులదే రాత్రి ఉంటుంది అని అంటారు. రాత్రి మరియు పగలు ఇక్కడే ఉంటాయి, ఇది ఎవరూ అర్థం చేసుకోరు. ప్రజాపిత బ్రహ్మా యొక్క రాత్రి అంటే తప్పకుండా అది బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులకు కూడా రాత్రియే. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి.

తండ్రి నిర్వికారీ ప్రపంచాన్ని తయారుచేయడానికి వచ్చారు. తండ్రి అంటారు - పిల్లలూ, కామము మహాశత్రువు, దానిపై విజయము పొందాలి. సంపూర్ణ నిర్వికారులుగా, పవిత్రముగా అవ్వాలి. అపవిత్రముగా అవ్వడం వలన మీరు ఎన్నో పాపాలు చేశారు. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచము. పాపాలు తప్పకుండా శరీరము ద్వారానే చేస్తారు కావున పాపాత్ములుగా అవుతారు. దేవతల పవిత్ర ప్రపంచములో పాపము ఉండదు. ఇక్కడ మీరు శ్రీమతము ద్వారా శ్రేష్ఠ పుణ్యాత్ములుగా అవుతున్నారు. శ్రీశ్రీ 108 యొక్క మాల ఉంది, అందులో పైన పుష్పము ఉంటుంది, దానిని శివ అని అంటారు. వారు నిరాకారీ పుష్పము. ఆ తరువాత సాకారములో స్త్రీ-పురుషులు ఉన్నారు, వారి మాల తయారై ఉంది. శివబాబా ద్వారా వారు పూజ్యనీయులుగా, స్మరణయోగ్యులుగా తయారవుతారు. బాబా మనల్ని విజయమాలలోని మణులుగా తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు. స్మృతి బలము ద్వారా మనము విశ్వముపై విజయము పొందుతాము, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఆ తరువాత మీరు సతోప్రధానులుగా అవుతారు. వారైతే ఏమీ అర్థం చేసుకోకుండానే - ప్రభూ, నీ మాయ ప్రబలమైనది అని అంటారు. ఎవరి వద్దనైనా ధనము ఉంటే - వీరి వద్ద మాయ ఎక్కువగా ఉంది అని అంటారు. వాస్తవానికి మాయ అని పంచ వికారాలను అంటారు, వాటినే రావణుడు అని కూడా అంటారు. వారేమో దానికి బదులుగా 10 తలల రావణుని చిత్రాన్ని తయారుచేశారు. మరి చిత్రముంది కావున దాని గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ఉదాహరణకు అంగదుడి విషయములో కూడా చూపిస్తారు కదా, అతడిని కదిలించేందుకు రావణుడు ప్రయత్నించాడు కానీ కదిలించలేకపోయాడు అని. ఒక ఉదాహరణను తయారుచేశారు. వాస్తవానికి అది ఏమీ లేదు. తండ్రి అంటారు, మాయ మిమ్మల్ని ఎంతగా కదిలించినా కానీ మీరు స్థిరముగా ఉండండి. రావణుడు, హనుమంతుడు, అంగదుడు మొదలైనవారికి సంబంధించి ఇవన్నీ ఉదాహరణలుగా తయారుచేశారు. వీటి అర్థాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. భ్రమరము ఉదాహరణ కూడా ఉంది. భ్రమరము మరియు బ్రాహ్మణీ, వీరి పేర్లు కలుస్తాయి. మీరు పేడ పురుగుల వంటివారికి జ్ఞాన-యోగాలతో భూ-భూ చేసి పతితము నుండి పావనముగా తయారుచేస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా తయారవుతారు. తాబేలు ఉదాహరణ కూడా ఉంది. ఇంద్రియాలను ఇముడ్చుకుని అంతర్ముఖీగా అయి కూర్చుండిపోతుంది. మీకు కూడా తండ్రి చెప్తున్నారు - కర్మలు చేయండి కానీ మళ్ళీ అంతర్ముఖులుగా అయిపోండి. అసలు ఈ సృష్టి అనేది లేదు అన్నట్లుగా ఉండాలి. కదలిక ఆగిపోతుంది. భక్తి మార్గములో బాహ్యముఖులుగా అవుతారు. పాటలు పాడటము మొదలైనవి చేస్తూ ఎంత హడావుడి చేస్తారు, అందులో ఎంత ఖర్చు అవుతుంది. ఎన్ని మేళాలు ఏర్పాటు అవుతూ ఉంటాయి. తండ్రి అంటారు, ఇక వీటన్నింటినీ వదిలి అంతర్ముఖులుగా అయిపోండి, అసలు ఈ సృష్టి అనేది లేదు అన్నట్లుగా ఉండాలి. స్వయాన్ని చూసుకోండి - నేను అర్హునిగా అయ్యానా? నన్ను ఏ వికారమూ సతాయించడం లేదు కదా? నేను తండ్రిని స్మృతి చేస్తున్నానా? ఏ తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారో, అటువంటి తండ్రిని రాత్రింబవళ్ళూ స్మృతి చేయాలి. మనము ఆత్మ, వారు మన తండ్రి. మేము ఇప్పుడు కొత్త ప్రపంచపు పుష్పాలుగా అవుతున్నాము అని లోలోపల ఇది నడుస్తూ ఉండాలి. జిల్లేడు పువ్వులా లేకు సుగంధము లేని విష పుష్పములా అవ్వకూడదు. మనమైతే పూర్తిగా పుష్పాలలో రాజు వలె బాగా సుగంధమయముగా తయారవ్వాలి. మనలో ఏ దుర్గంధమూ ఉండకూడదు. చెడు ఆలోచనలు తొలగిపోవాలి. మిమ్మల్ని కింద పడేసేందుకు మాయ తుఫానులు ఎన్నో వస్తాయి. కానీ కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకూడదు. ఈ విధంగా స్వయాన్ని పక్కా చేసుకోవాలి. స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఏ దేహధారినీ నేను స్మృతి చేయకూడదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయండి, కానీ అందులో నుండి కూడా సమయాన్ని తీసి కేటాయించగలరు. భోజనము చేసే సమయములో కూడా తండ్రి మహిమను చేస్తూ ఉండండి. బాబాను స్మృతి చేస్తూ తిన్నట్లయితే భోజనము కూడా పవిత్రముగా అయిపోతుంది. తండ్రిని ఎప్పుడైతే నిరంతరము స్మృతి చేస్తారో, అప్పుడు ఆ స్మృతి ద్వారానే అనేక జన్మల పాపాలు నాశనమవుతాయి మరియు మీరు సతోప్రధానముగా అవుతారు. స్వయాన్ని చూసుకోవాలి - నేను ఎంతవరకు సత్యమైన బంగారముగా తయారయ్యాను, ఈ రోజు ఎన్ని గంటలు స్మృతిలో ఉన్నాను? నిన్న మూడు గంటలు స్మృతిలో ఉండి, ఈ రోజు రెండు గంటలు ఉంటే, మరి ఈ రోజు నష్టము ఏర్పడినట్లు. ఎక్కడమూ, దిగడమూ అనేది జరుగుతూ ఉంటుంది. యాత్రలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల పైకి ఎక్కడము, మరికొన్ని చోట్ల కిందికి దిగడము జరుగుతుంది. మీ అవస్థ కూడా పైకి, కిందికి అవుతూ ఉంటుంది. మీ ఖాతాను చూసుకోవాలి. ముఖ్యమైనది స్మృతి యాత్ర.

భగవానువాచ అని ఉన్నప్పుడు మరి తప్పకుండా పిల్లలనే చదివిస్తారు. మొత్తం విశ్వమంతటినీ ఎలా చదివిస్తారు. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అంటారు? కృష్ణుడు అయితే శరీరధారి. భగవంతుడు అని నిరాకార పరమపిత పరమాత్మను అంటారు. నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని వారు స్వయమే అంటారు. బ్రహ్మాది కూడా వృద్ధ శరీరముగా గాయనము చేయబడింది. తెల్లని గడ్డము, మీసాలు వృద్ధులకే ఉంటాయి కదా. వారికి కావాల్సింది కూడా తప్పకుండా అనుభవీ రథమే. చిన్న రథములోకైతే ప్రవేశించరు కదా. నా గురించి ఎవరికీ తెలియదు అని వారు స్వయమే చెప్తారు. వారు సుప్రీమ్ గాడ్ ఫాదర్ అనగా పరమ ఆత్మ. మీరు కూడా 100 శాతము పవిత్రముగా ఉండేవారు. ఇప్పుడు 100 శాతము అపవిత్రముగా అయ్యారు. సత్యయుగములో 100 శాతము పవిత్రత ఉండేది కావున అక్కడ శాంతి మరియు సమృద్ధి కూడా ఉండేది. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత కలవారికి అపవిత్రమైనవారు తల వంచి నమస్కరిస్తారని, వారి మహిమ చేస్తారని మీరు చూస్తారు కూడా. సన్యాసుల ఎదురుగా ఎప్పుడూ - మీరు సర్వగుణ సంపన్నులు... మేము పాపులము, నీచులము అని అనరు. దేవతల ఎదురుగా ఇలా అంటారు. బాబా అర్థం చేయించారు - కుమారీలకు అందరూ తల వంచి నమస్కరిస్తారు, కానీ ఆమె వివాహము చేసుకున్న తర్వాత ఆమె అందరి ముందు తల వంచి నమస్కరిస్తుంది ఎందుకంటే వికారీగా అయిపోతుంది కదా. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు నిర్వికారులుగా అయినట్లయితే ఇక అర్ధకల్పము నిర్వికారులుగా ఉంటారు. ఇప్పుడు ఐదు వికారాల రాజ్యమే ఇక అంతమవుతుంది. ఇది మృత్యులోకము, అది అమరలోకము. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. దీనిని తండ్రియే ఇస్తారు. తిలకము కూడా నుదుటిపైనే పెడతారు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానము లభిస్తూ ఉంది, దేని కోసము? మీకు మీరే స్వయముగా రాజ్యతిలకాన్ని దిద్దుకోండి. ఉదాహరణకు బ్యారిస్టరీ చదివేటప్పుడు, వారు అది చదివి తమకు తామే బ్యారిస్టరీ తిలకాన్ని దిద్దుకుంటారు. చదువుకుంటే తిలకము లభిస్తుంది. ఆశీర్వాదముతో లభించదు. అలా అయితే టీచరు అందరిపైనా కృప చూపించాలి, అందరూ పాస్ అయిపోతారు. పిల్లలు తమకు తామే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే చక్రవర్తీ మహారాజుగా అవుతారు. తండ్రి అంటారు, మిమ్మల్ని రాజులకే రాజుగా తయారుచేస్తాను. దేవీ-దేవతలు డబుల్ కిరీటధారులుగా అవుతారు. పతిత రాజులు కూడా వారికి పూజ చేస్తారు. మిమ్మల్ని పూజారీ రాజుల కంటే కూడా ఉన్నతముగా తయారుచేస్తారు. ఎవరైతే బాగా దానపుణ్యాలు చేస్తారో, వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే వారు మంచి కర్మలు చేశారు. ఇప్పుడు ఇక్కడ మీకు అవినాశీ జ్ఞాన ధనము లభించింది, దీనిని ధారణ చేసి తిరిగి దానము చేయాలి. ఇది సంపాదనకు ఆధారము. టీచరు కూడా చదువును దానము చేస్తారు. కానీ ఆ చదువు అల్పకాలము కొరకు. విదేశాల నుండి చదువుకుని వస్తారు, ఒకవేళ రావడముతోనే గుండె ఆగిపోతే ఇక ఆ చదువు అంతమైపోతుంది. అది వినాశీ అయిపోయింది కదా. శ్రమ అంతా వృధా అయిపోయింది. మీ శ్రమ ఆ విధంగా పోదు. మీరు ఎంత బాగా చదువుకుంటే అంతగా 21 జన్మలు మీ చదువు నిలిచి ఉంటుంది. అక్కడ అకాల మృత్యువు ఉండనే ఉండదు. ఈ చదువును మీతోపాటు తీసుకువెళ్తారు.

ఏ విధంగా తండ్రి కళ్యాణకారియో, అలాగే పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి, అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. బాబా అయితే ఎన్నో ఉపాయాలను ఇస్తూ ఉంటారు. ఒక్క విషయము గురించే అర్థం చేయించండి, అదేమిటంటే సర్వ శ్రేష్ఠ శిరోమణి అయిన శ్రీమత్ భగవద్గీతకు ఇంత మహిమ ఎందుకు ఉంది? భగవంతునిదే శ్రేష్ఠ మతము. మరి ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? భగవంతుడైతే ఒక్కరే ఉంటారు. వారు నిరాకారుడు. వారు ఆత్మలందరి తండ్రి. అందుకే పరస్పరము అందరినీ సోదరులు అని అంటారు. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచిస్తారో, అప్పుడు సోదరీ, సోదరులుగా అవుతారు. ఈ సమయములో మీరు సోదరీ, సోదరులు కావున పవిత్రముగా ఉండాలి. ఇది ఒక యుక్తి. వికారీ దృష్టి పూర్తిగా తొలగిపోవాలి. మా కళ్ళు ఎక్కడా ఇష్టానుసారముగా మరియు నిర్లక్ష్యముగా అవ్వలేదు కదా అన్న గమనము ఉంచాలి. బజారులో శనగలను చూసి వాటి వైపుకు మనసు పోలేదు కదా? ఈ విధముగా చాలామందికి మనసు లాగుతూ ఉంటుంది, కొందరు తినేస్తారు కూడా. బ్రాహ్మణి ఎవరైనా సోదరుడితో వెళ్ళినప్పుడు అతను - శనగలు తింటారా, ఒక్కసారి తిన్నంతమాత్రాన పాపమేమీ రాదు అని అంటే, ఎవరైతే కచ్చాగా ఉంటారో వారు వెంటనే తినేస్తారు. దీనికే శాస్త్రాలలో కూడా ఉదాహరణ ఉంది. ఈ కథలన్నీ వారు కూర్చుని తయారుచేశారు. కానీ వాస్తవానికి ఇవన్నీ ఈ సమయములోని విషయాలే.

మీరందరూ సీతలు. మీకు తండ్రి చెప్తున్నారు - ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి. వేరే విషయమేదీ లేదు. రావణుడు అంటే ఒక మనిషి కాదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వికారాల ప్రవేశము జరిగితే రావణుని సంప్రదాయము అంటారు. ఉదాహరణకు ఎవరైనా చెడు పనులు చేస్తే నీవు అసురుడిలా ఉన్నావు అని అంటారు కదా. అక్కడ నడవడిక ఆసురీగా ఉంటుంది. వికారీ పిల్లలను, మీరు కులకళంకితులుగా అవుతారు అని అంటారు. ఇక్కడ అనంతమైన తండ్రి అంటున్నారు, మిమ్మల్ని నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా తయారుచేస్తుంటే మీరు మళ్ళీ నల్ల ముఖము చేసుకుంటారు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారులుగా అయిపోతారు. నల్లగా ఉన్నవారి కంటే నల్లగా అయిపోతారు, అందుకనే వారిని రాతిబుద్ధి కలవారని అంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. మీరు ఎక్కే కళలోకి వెళ్తారు. తండ్రిని గుర్తించినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. సంశయము విషయమేమీ ఉండకూడదు. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్ (స్వర్గ స్థాపకుడైన తండ్రి) కావున తప్పకుండా పిల్లల కొరకు స్వర్గాన్ని కానుకగా తీసుకువస్తారు కదా. శివజయంతిని కూడా జరుపుకుంటారు - ఆ రోజు ఏం చేస్తుంటారు? వ్రతాలు మొదలైనవి పెట్టుకుంటూ ఉంటారు. వాస్తవానికి వికారాల విషయములో వ్రతము పెట్టుకోవాలి. వికారాలలోకి వెళ్ళకూడదు. వీటి ద్వారానే మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖము పొందారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి. పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మీరు చూస్తుండండి, భారత్ లో తొమ్మిది లక్షలమంది మాత్రమే ఉంటారు, ఇక శాంతి ఏర్పడుతుంది. చప్పట్లు కొట్టడానికి మరే ధర్మాలు ఉండనే ఉండవు. ఏక ధర్మ స్థాపన జరుగుతుంది, మిగిలిన అనేక ధర్మాల వినాశనము జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1.అవినాశీ జ్ఞాన ధనాన్ని స్వయములో ధారణ చేసి తిరిగి దానము చేయాలి. చదువు ద్వారా తమకు తాము స్వయమే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. ఏ విధముగా తండ్రి కళ్యాణకారియో అలా కళ్యాణకారులుగా అవ్వాలి.

2. అన్నపానాదుల విషయములో పూర్తి పథ్యము ఉంచాలి. ఎప్పుడూ కూడా కళ్ళు మోసగించకుండా వాటిపై గమనము ఉండాలి. స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి వికర్మలు చేయకూడదు.

వరదానము:-
మనసా శక్తి యొక్క అనుభవము ద్వారా విశాల కార్యములో సదా సహయోగీ భవ

ప్రకృతిని మరియు తమోగుణీ ఆత్మల వైబ్రేషన్లను పరివర్తన చేయడము మరియు రక్తసిక్తమైన వాయుమండలములో, వైబ్రేషన్లలో స్వయాన్ని సురక్షితముగా ఉంచుకోవడము, ఇతర ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వడము, కొత్త సృష్టిలో కొత్త రచనను యోగబలము ద్వారా ప్రారంభించడము - ఈ విశాల కార్యాలన్నింటి కొరకు మనసా శక్తి యొక్క అవసరముంది. మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమము సుందరముగా ఉంటుంది. మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి, ఒక్కరితో లైన్ క్లియర్ గా ఉండడము - ఇప్పుడు ఇందులో అనుభవజ్ఞులుగా అవ్వండి, అప్పుడు అనంతమైన కార్యములో సహయోగులుగా అయి అనంతమైన విశ్వ రాజ్యానికి అధికారులుగా అవుతారు.

స్లోగన్:-
నిర్భయత మరియు నమ్రతయే యోగీ మరియు జ్ఞానీ ఆత్మల స్వరూపము.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల వంటిది, ఈ సుఖదాయకమైన ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనులై ఉన్నట్లయితే ఇక ఎప్పుడూ ఏ పరిస్థితి లేక మాయ అలజడి రాలేదు. పరమాత్మ ప్రేమ తరగనిది, నిశ్చలమైనది, ఆ ప్రేమ ఎంత అపారమైనదంటే, అది సర్వులకు ప్రాప్తించగలదు, కానీ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునేందుకు విధి ఏమిటంటే - అతీతముగా అవ్వటము. ఎంతగా అతీతముగా అవుతారో అంతగా పరమాత్మ ప్రేమ యొక్క అధికారము ప్రాప్తిస్తుంది.