05-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఈ వేశ్యాలయాన్ని శివాలయముగా తయారుచేయడానికి వచ్చారు. వేశ్యలకు కూడా ఈశ్వరీయ సందేశాన్ని ఇచ్చి వారి కళ్యాణము కూడా చేయడము మీ కర్తవ్యము’’

ప్రశ్న:-
ఏ పిల్లలు స్వయాన్ని చాలా ఎక్కువ నష్టపరుచుకుంటారు?

జవాబు:-
ఎవరైతే ఏదో ఒక కారణము వల్ల చదువును అనగా మురళిని మిస్ చేస్తారో వారు స్వయాన్ని చాలా ఎక్కువ నష్టపరుచుకుంటారు. కొందరు పిల్లలైతే పరస్పరము దెబ్బలాడుకున్న కారణముగా అసలు క్లాసుకే రాకుండా ఉంటారు. ఏదో ఒక సాకు తయారుచేసుకుని ఇంటిలోనే పడుకుంటారు, ఇలా చేయడం వల్ల వారు తమను తామే నష్టపరుచుకుంటారు, ఎందుకంటే బాబా అయితే ప్రతిరోజూ ఏవో ఒక కొత్త యుక్తులను తెలియజేస్తూ ఉంటారు, మరి అవి విననే వినకపోతే ఇక వాటిని అమలులోకి ఎలా తీసుకువస్తారు.

ఓంశాంతి
ఇప్పుడు మనము విశ్వానికి యజమానులుగా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. కానీ మాయ కూడా మరపింపజేస్తుంది. కొందరినైతే రోజంతా మరపింపజేస్తుంది. సంతోషము కలిగేందుకు, వారు అసలు స్మృతే చేయరు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. మర్చిపోయిన కారణముగా ఇక తర్వాత సేవ కూడా ఏమీ చేయలేరు. నిన్న రాత్రి బాబా అర్థం చేయించారు - అధమాతి అధములైన వేశ్యలెవరైతే ఉన్నారో వారి సేవను చేయాలి. వేశ్యలకు మీరు ఈ సూచనను ఇవ్వండి - మీరు తండ్రి ఇచ్చే ఈ జ్ఞానాన్ని ధారణ చేసినట్లయితే స్వర్గపు విశ్వ మహారాణిగా అవ్వవచ్చు. షావుకారులు అలా అవ్వలేరు. ఎవరైతే తెలిసినవారు ఉంటారో, చదువుకున్నవారు ఉంటారో, వారు - అటువంటివారికి జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు, దానితో పాపం వారు చాలా సంతోషిస్తారు, ఎందుకంటే వారు కూడా అబలలే, వారికి మీరు అర్థం చేయించవచ్చు. యుక్తులైతే తండ్రి ఎన్నో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు వారికి ఇలా చెప్పండి - మీరే ఉన్నతోన్నతులుగా మరియు నీచాతినీచులుగా అయ్యారు, మీ పేరుతోనే భారత్ వేశ్యాలయముగా తయారయ్యింది, ఇప్పుడు మళ్ళీ మీరు ఈ పురుషార్థము చేయడము ద్వారా శివాలయములోకి వెళ్ళవచ్చు. మీరు ఇప్పుడు ధనము కోసం ఎంత అశుద్ధమైన పని చేస్తున్నారు, ఇప్పుడిక దీనిని వదిలేయండి. ఇలా అర్థం చేయించినట్లయితే వారు చాలా సంతోషిస్తారు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది మంచి విషయము కదా. పేదవారికి ఆధారము భగవంతుడే. ధనము కోసమే చాలా అశుద్ధమైన పని చేస్తూ ఉంటారు. అది వారికి ఒక వ్యాపారములా ఉంటుంది. సేవ వృద్ధి పొందడము కోసం మేము యుక్తులు రచిస్తాము అని ఇప్పుడు పిల్లలు అంటారు. కొందరు పిల్లలు ఏదో ఒక విషయములో అలుగుతూ ఉంటారు కూడా. చదువును కూడా వదిలేస్తారు. మేము చదవకపోతే స్వయాన్నే నష్టపరుచుకుంటాము అన్న విషయాన్ని అర్థం చేసుకోరు. అలిగి కూర్చుండిపోతారు. ఫలానావారు ఇది అన్నారు, ఇలా అన్నారు అని ఇక రావడమే మానేస్తారు. వారానికి ఒకసారి కష్టం మీద వస్తారు. బాబా అయితే మురళీలలో ఒక్కోసారి ఒక్కో సలహాను ఇస్తూ ఉంటారు, కావున మురళిని వినాలి కదా. మరి క్లాసుకు వస్తేనే వినగలుగుతారు. ఏదో ఒక కారణము వల్ల, సాకు చెప్పి పడుకుండిపోయేవారు చాలామంది ఉన్నారు. సరే, ఈ రోజు వెళ్ళను అని అనుకుంటారు. అరే, బాబా ఎంత మంచి-మంచి పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. సేవ చేసినట్లయితే ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఇది ఒక చదువు. బనారస్ హిందూ యూనివర్శిటీ మొదలైనవాటిలో శాస్త్రాలు ఎంతో చదువుతూ ఉంటారు. వేరే ఏ పనీ లేకపోతే ఇక శాస్త్రాలను కంఠస్థము చేసి సత్సంగాన్ని మొదలుపెడతారు. కానీ అక్కడ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ ఉండదు. ఈ చదువు ద్వారానైతే అందరి నావ తీరానికి చేరుతుంది. కావున పిల్లలైన మీరు ఇటువంటి అధముల సేవను చేయాలి. ఇటువంటివారు ఇక్కడికి వస్తున్నారు అన్నది షావుకారులు చూసినట్లయితే ఇక వారికి ఇక్కడికి రావడానికి ఇష్టమనిపించదు. దేహాభిమానము ఉంది కదా. వారికి సిగ్గుగా అనిపిస్తుంది. అచ్ఛా, కావున వేశ్యల కోసం వేరే స్కూలు తెరవండి. ఆ చదువైతే పైసకు కొరగానిది, అది శరీర నిర్వహణ కొరకు ఉంది, కానీ ఈ చదువు 21 జన్మల కొరకు ఉంది. దీని ద్వారా ఎంతమంది కళ్యాణము జరుగుతుంది. బాబా, ఇంట్లో గీతా పాఠశాలను తెరువవచ్చా అని చాలా వరకు మాతలు కూడా అడుగుతుంటారు. వారికి ఈశ్వరీయ సేవ చేయాలనే అభిరుచి ఉంటుంది. పురుషులైతే ఇక్కడికి అక్కడికి, క్లబ్బులు మొదలైనవాటికి తిరుగుతూ ఉంటారు. షావుకారుల కొరకైతే ఇదే స్వర్గములా అనిపిస్తుంది. ఎన్ని ఫ్యాషన్లు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ దేవతల యొక్క ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఎలా ఉంటుందో చూడండి. దానికి, దీనికి ఎంత తేడా ఉంది. మీకు ఇక్కడ సత్యము వినిపించడం జరుగుతుంది కావున ఇక్కడికి ఎంత తక్కువమంది వస్తారు. అందులోనూ పేదవారే వస్తూ ఉంటారు. అటువైపుకు వెంటనే వెళ్ళిపోతారు. అక్కడికి కూడా అలంకరించుకుని వెళ్తారు. గురువులు నిశ్చితార్థాలు కూడా చేయిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరికైనా నిశ్చితార్థము చేయించడం జరిగినా కానీ, అది కేవలం రక్షించడానికి మాత్రమే జరుగుతుంది. కామచితి పైకి ఎక్కడం నుండి రక్షించబడాలి మరియు జ్ఞానచితిపై కూర్చుని పదమాపదమ భాగ్యశాలిగా అవ్వాలి అని అలా చేస్తారు. ఈ నష్టాన్ని కలిగించే వ్యాపారాన్ని వదిలి ఇక స్వర్గానికి పదండి అని తమ తల్లిదండ్రులకు చెప్తే, ఆ తల్లిదండ్రులు అంటారు, మేమేం చేయాలి, లోకులు కులం పేరును అప్రతిష్ఠపాలు చేస్తున్నారు అని మాపై కోప్పడతారు. పెళ్ళి చేసుకోకుండా ఉండటం నియమానికి విరుద్ధమని భావిస్తారు. లోకులు ఏమాంటారో అనే భావనను మరియు కుల మర్యాదలను వారు వదలరు. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గములో గానం చేస్తారు. మీరా పాటలు కూడా ఉన్నాయి. స్త్రీలలో నంబర్ వన్ భక్తురాలిగా మీరా, పురుషులలో నారదుడు గాయనము చేయబడ్డారు. నారదుని కథ కూడా ఉంది కదా. నేను లక్ష్మిని వరించవచ్చా అని మిమ్మల్ని కొత్తవారెవరైనా అడిగితే, మీరు చెప్పండి - స్వయాన్ని చూసుకోండి, అర్హునిగా ఉన్నారా, పవిత్రముగా, సర్వగుణ సంపన్నుడిగా ఉన్నారా? ఇదైతే వికారీ పతిత ప్రపంచము. తండ్రి ఇందులో నుండి బయటకు తీసి పావనముగా తయారుచేయడానికి వచ్చారు. పావనముగా అవ్వండి, అప్పుడే లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా అవ్వగలరు. ఇక్కడకు బాబా వద్దకు వస్తారు, ప్రతిజ్ఞ చేసి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తరువాత వికారాలలో పడిపోతారు. ఇటువంటి సమాచారాలు వస్తాయి. బాబా అంటారు, బ్రాహ్మణి ఇలాంటివారిని తీసుకువచ్చినట్లయితే ఆమెపై కూడా ప్రభావము పడుతుంది. ఇంద్రసభ యొక్క కథ కూడా ఉంది కదా. కావున అలాంటివారిని తీసుకువచ్చేవారికి కూడా శిక్ష పడుతుంది. బాబా బ్రాహ్మణీలకు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు - అపరిపక్వముగా ఉన్నవారిని తీసుకురాకండి, దాని వల్ల మీ అవస్థ కూడా పడిపోతుంది, ఎందుకంటే నియమానికి విరుద్ధముగా తీసుకువచ్చారు. వాస్తవానికి బ్రాహ్మణీగా అవ్వడమనేది చాలా సహజము. 10-15 రోజులలో అలా తయారవ్వచ్చు. బాబా ఎవ్వరికైనా అర్థం చేయించేందుకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు - భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు

నరకవాసులుగా అయిన తర్వాత మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలంటే ఈ వికారాలను వదలండి, కేవలము తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. ఇది ఎంత సహజము. కానీ కొందరు అసలు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. వారు స్వయమే అర్థం చేసుకోకపోతే ఇక ఇతరులకు ఏం అర్థం చేయిస్తారు. వానప్రస్థావస్థలో కూడా మోహపు బంధనము లాగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో వానప్రస్థావస్థలోకి అంత ఎక్కువమంది వెళ్ళడం లేదు. తమోప్రధానముగా ఉన్నారు కదా. ఇక్కడే చిక్కుకుని ఉంటారు. ఇదివరకు వానప్రస్థులకు చాలా పెద్ద-పెద్ద ఆశ్రమాలు ఉండేవి. ఈ రోజుల్లో అన్ని లేవు. 80-90 సంవత్సరాల వయసు వచ్చినా కానీ ఇంటిని వదలరు. వాణి నుండి అతీతముగా వెళ్ళాలని, ఇప్పుడు ఈశ్వరుడిని స్మృతి చేయాలని వారు అర్థమే చేసుకోరు. భగవంతుడు ఎవరు అన్నది అందరికీ తెలియదు. భగవంతుడిని సర్వవ్యాపి అంటే మరి ఎవరిని స్మృతి చేయాలి. తాము పూజారులము అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. తండ్రి అయితే మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తారు, అది కూడా 21 జన్మల కొరకు అలా తయారుచేస్తారు. దీని కోసం పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది.

బాబా అర్థం చేయించారు - ఈ పాత ప్రపంచమైతే వినాశనము కానున్నది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి, కేవలం ఇదే తపన ఉండాలి. అక్కడ వికారీ విషయమేదీ ఉండనే ఉండదు. తండ్రి వచ్చి ఆ పవిత్ర ప్రపంచము కొరకు తయారీ చేయిస్తారు. సర్వీసబుల్ ప్రియమైన పిల్లలనైతే తమ నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. అధములను ఉద్ధరించేందుకు ధైర్యము కావాలి. ఆ ప్రభుత్వములోనైతే పెద్ద-పెద్ద సమూహాలు ఉంటాయి. ఆ చదువుకున్నవారు టిప్ టాప్ గా ఉంటారు. ఇక్కడైతే చాలామంది పేదవారిగా, సాధారణముగా ఉన్నారు. వారిని తండ్రి కూర్చుని ఎంతో ఉన్నతముగా తయారుచేస్తారు. నడవడిక కూడా చాలా రాయల్ గా ఉండాలి. భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువులో ఎవరైనా పెద్ద పరీక్షను పాస్ అయినట్లయితే ఎంత టిప్ టాప్ గా తయారవుతారు. ఇక్కడైతే తండ్రి పేదల పెన్నిధి. పేదవారే ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. ఒకటి, రెండు రూపాయల మనీ ఆర్డర్ ను కూడా పంపిస్తుంటారు. తండ్రి అంటారు, మీరు చాలా భాగ్యశాలురు. ప్రతిఫలముగా ఎంతో లభిస్తుంది. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. సాక్షీగా ఉంటూ డ్రామాను చూస్తారు. తండ్రి అంటారు, పిల్లలూ, బాగా చదువుకోండి. ఇది ఈశ్వరీయ యజ్ఞము, ఏది కావాలంటే అది తీసుకోండి, కానీ ఇక్కడ తీసుకుంటే అక్కడ తగ్గిపోతుంది. స్వర్గములోనైతే అన్నీ లభిస్తాయి. బాబాకు అయితే సేవలో చాలా చురుకైన పిల్లలు కావాలి. సుదేశ్ వలె, మోహిని వలె సేవ పట్ల ఉల్లాసము గల పిల్లలు కావాలి. మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. అప్పుడు మీకు ఎంతో గౌరవము ఇస్తారు. బాబా అన్ని డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. బాబా అయితే చెప్తూ ఉంటారు - ఇక్కడ పిల్లలు ఎంత సమయము లభిస్తే అంత సమయము స్మృతిలో ఉండండి. పరీక్షల రోజులు దగ్గర పడుతుంటే ఏకాంతములోకి వెళ్ళి చదువుకుంటారు. ప్రైవేట్ టీచరును కూడా పెట్టుకుంటారు. మన వద్ద టీచర్లు అయితే ఎంతోమంది ఉన్నారు, కేవలం చదువుకోవాలనే అభిరుచి మాత్రమే ఉండాలి. తండ్రి అయితే చాలా సహజముగా అర్థం చేయిస్తారు. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. ఈ శరీరమైతే నశ్వరమైనది. ఆత్మ అయిన మీరు అవినాశీ. ఈ జ్ఞానము ఒక్కసారే లభిస్తుంది, ఆ తర్వాత సత్యయుగము నుండి కలియుగము వరకు ఎవ్వరికీ లభించదు. ఇది కేవలం మీకు మాత్రమే లభిస్తుంది. నేను ఒక ఆత్మను - ఇది పక్కాగా నిశ్చయము చేసుకోండి. తండ్రి నుండి మనకు వారసత్వము లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అంతే, ఈ విషయాన్నే లోలోపల గుర్తు చేసుకుంటూ ఉన్నా ఎంతో కళ్యాణము జరుగగలదు. కానీ చార్టు అసలు వ్రాయరు. వ్రాస్తూ, వ్రాస్తూ మళ్ళీ అలసిపోతారు. బాబా చాలా సహజము చేసి తెలియజేస్తూ ఉంటారు. ఆత్మ అయిన మనము సతోప్రధానముగా ఉండేవారము, ఇప్పుడు తమోప్రధానము అయిపోయాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అయిపోతారు. ఇది ఎంత సహజము, అయినా కూడా మర్చిపోతూ ఉంటారు. ఎంత సమయము కూర్చుంటే అంత సమయము స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను బాబా బిడ్డను. తండ్రిని స్మృతి చేయడం ద్వారా స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే అర్ధకల్పపు పాపాలు భస్మమైపోతాయి. ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. పిల్లలందరూ వింటున్నారు. ఈ బాబా స్వయం కూడా ప్రాక్టిస్ చేస్తుంటారు కావుననే నేర్పిస్తున్నారు కదా. నేను బాబా రథాన్ని, బాబా నాకు తినిపిస్తున్నారు అని భావిస్తాను. పిల్లలైన మీరు కూడా ఇలాగే భావించండి. శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఎంత లాభము కలుగుతుంది. కానీ మర్చిపోతారు. వాస్తవానికి ఇది చాలా సహజము. వ్యాపారములో కస్టమర్లు ఎవరూ లేకపోతే స్మృతిలో కూర్చుండిపోండి. నేను ఆత్మను, బాబాను స్మృతి చేయాలి. అనారోగ్యములో కూడా స్మృతి చేయవచ్చు. బంధనములో ఉన్నవారు అక్కడ కూర్చుని స్మృతి చేస్తూ ఉన్నా 10-20 సంవత్సరాలవారి కన్నా కూడా ఉన్నత పదవిని పొందగలరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవలో చాలా చాలా చురుకుగా ఉండాలి. ఎంత సమయము లభిస్తే అంత సమయము ఏకాంతములో కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. చదువు పట్ల అభిరుచిని పెట్టుకోవాలి. చదువు పట్ల అలగకూడదు.

2. తమ నడవడికను చాలా-చాలా రాయల్ గా ఉంచుకోవాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, అంతే. పాత ప్రపంచము అంతము కానున్నది, అందుకే మోహ బంధనాలను తెంచుకోవాలి. వానప్రస్థావస్థలో (వాణి నుండి అతీతముగా ఉండే అవస్థలో) ఉండే అభ్యాసము చేయాలి. అధములను కూడా ఉద్ధరించేందుకు సేవ చేయాలి.

వరదానము:-
శ్రేష్ఠ వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేసే సదా సిద్ధి స్వరూప భవ

సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు వృత్తి ద్వారా వృత్తులను, సంకల్పాల ద్వారా సంకల్పాలను పరివర్తన చేసే కార్యము చెయ్యండి, దీనిపై రీసెర్చ్ చెయ్యండి. ఎప్పుడైతే ఈ సేవలో బిజీ అవుతారో, అప్పుడు ఈ సూక్ష్మ సేవ స్వతహాగానే అనేక బలహీనతలను దాటివేసేలా చేస్తుంది. ఇప్పుడు దీని ప్లాన్ ను తయారుచేసినట్లయితే జిజ్ఞాసువులు కూడా ఎక్కువమంది పెరుగుతారు, ఆదాయము కూడా బాగా పెరుగుతుంది, ఇల్లు కూడా దొరుకుతుంది - అన్ని సిద్ధులు సహజమైపోతాయి. ఈ విధియే సిద్ధి స్వరూపులుగా చేస్తుంది.

స్లోగన్:-
సమయాన్ని సఫలము చేస్తూ ఉన్నట్లయితే సమయము చేసే మోసము నుండి రక్షింపబడతారు.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

బాబాకు పిల్లలపై ఎంత ప్రేమ అంటే, వారు ప్రతిరోజూ ఆ ప్రేమకు బదులు ఇవ్వడానికి ఎంతో పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు, ప్రియస్మృతులను ఇస్తారు మరియు సహచరునిగా అయ్యి సదా తోడును నిర్వర్తిస్తారు, కనుక ఈ ప్రేమలో మీ బలహీనతలన్నింటినీ బలిహారము చేసేసెయ్యండి. పరమాత్మ ప్రేమలో ఎలా ఇమిడిపోయి ఉండండంటే, ఇక ఎప్పుడూ హద్దు యొక్క ప్రభావము తనవైపుకు ఆకర్షితము చేయలేకపోవాలి. సదా అనంతమైన ప్రాప్తులలో నిమగ్నమై ఉండండి, తద్వారా ఆత్మికతతో కూడిన సుగంధము వాతావరణములో వ్యాపిస్తుంది.

విశేష సూచన -
బాబా శ్రీమతము అనుసారముగా మురళి కేవలము బాబా పిల్లల కోసము మాత్రమే, అంతేకానీ ఎవరైతే రాజయోగ కోర్సు కూడా తీసుకోలేదో ఇది వారి కోసము కాదు. అందుకే నిమిత్త టీచర్లు మరియు సోదర-సోదరీలందరి పట్ల వినమ్ర నివేదన ఏమిటంటే సాకార మురళీల ఆడియోను లేక వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లేక మరే ఇతర వాట్సాప్ గ్రూపులలోనూ పోస్ట్ చెయ్యవద్దు.