ఓంశాంతి
తండ్రి పిల్లలకు అర్థం చేయించారు - మీరు కూడా, ఓం శాంతి అని అంటారు, తండ్రి కూడా ఓం
శాంతి అని అంటారు అనగా ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు, తండ్రి కూడా శాంతి స్వరూపుడు.
ఆత్మ స్వధర్మము శాంతి, పరమాత్ముని స్వధర్మము కూడా శాంతి. మీరు కూడా శాంతిధామ
నివాసులు. తండ్రి కూడా అంటారు - నేనూ అక్కడి నివాసినే. పిల్లలైన మీరు పునర్జన్మలలోకి
వస్తారు, నేను రాను. నేను ఈ రథములో ప్రవేశిస్తాను, ఇది నా రథము. ఒకవేళ శంకరుడిని
అడిగినట్లయితే, వాస్తవానికి అడగలేరు, కానీ ఒకవేళ ఎవరైనా సూక్ష్మవతనానికి వెళ్ళి
అడిగినట్లయితే, శంకరుడు - ఈ సూక్ష్మ శరీరము నాది అని అంటారు. శివబాబా అంటారు - ఇది
నా శరీరము కాదు, నేను దీనిని అప్పుగా తీసుకున్నాను ఎందుకంటే నాకు కూడా
కర్మేంద్రియాల ఆధారము కావాలి. మొట్టమొదట - పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు శ్రీకృష్ణుడు
కాదు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వాత్మలను పతితము
నుండి పావనముగా చేయరు, వారు వచ్చి పావన ప్రపంచములో రాజ్యము చేస్తారు. ముందు
రాకుమారుడిగా అవుతారు, ఆ తర్వాత మహారాజుగా అవుతారు. అతనిలో కూడా ఈ జ్ఞానము లేదు.
రచన యొక్క జ్ఞానమైతే రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుడిని రచన అని అంటారు. రచయిత
అయిన తండ్రియే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి రచిస్తున్నారు, మీరు నా
పిల్లలు అని అంటారు. మీరు కూడా - బాబా, మేము మీ వారము అని అంటారు. బ్రహ్మా ద్వారా
బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేదంటే బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు.
సూక్ష్మవతనములోని బ్రహ్మా వేరే ఎవరో కాదు. పైనున్న వారే కిందనున్న వారు, కిందనున్న
వారే పైనున్న వారు. ఇరువురూ ఒక్కరే. అచ్ఛా, విష్ణువు మరియు లక్ష్మీ-నారాయణులు కూడా
ఒక్కరే. వారు ఎక్కడివారు? బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. బ్రహ్మా-సరస్వతులే
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, మళ్ళీ వారే మొత్తం కల్పములో 84 జన్మలు తీసుకున్న
తర్వాత సంగమములో బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులు కూడా మనుష్యులే,
వారిది దేవీ-దేవతా ధర్మము. విష్ణువుకు కూడా 4 భుజాలను చూపించారు. ప్రవృత్తి
మార్గానికి గుర్తుగా అలా చూపించారు. భారత్ లో ప్రారంభము నుండే ప్రవృత్తి మార్గము
కొనసాగుతూ వస్తుంది, అందుకే విష్ణువుకు 4 భుజాలను చూపించారు. ఇక్కడ
బ్రహ్మా-సరస్వతులు ఉన్నారు. ఈ సరస్వతి దత్త పుత్రిక. వారి అసలు పేరు లఖీరాజ్,
తర్వాత వారికి బ్రహ్మా అని పేరు పెట్టారు. శివబాబా వీరిలో ప్రవేశించారు మరియు రాధను
తమవారిగా చేసుకున్నారు, సరస్వతి అని పేరు పెట్టారు. సరస్వతికి బ్రహ్మా లౌకిక తండ్రి
ఏమీ కాదు. వీరిరువురికీ తమ-తమ లౌకిక తండ్రులు ఉండేవారు, ఇప్పుడు ఆ తండ్రులు లేరు. ఈ
శివబాబా బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. బ్రహ్మా
కూడా శివబాబా కుమారుడు. బ్రహ్మా ముఖకమలము ద్వారా రచిస్తారు కావున బ్రహ్మాను కూడా
తల్లి అని అంటారు. మీరు తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖము
లభిస్తుంది... అని పాడుతారు కదా. బ్రాహ్మణులైన మీరు వచ్చి పిల్లలుగా అయ్యారు. ఇది
అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. పిల్లలైన మీరు శివబాబా నుండి
వారసత్వాన్ని తీసుకుంటారు. బ్రహ్మా ఏమీ స్వర్గ రచయిత లేక జ్ఞానసాగరుడు కాదు.
జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మకు తండ్రియే జ్ఞానసాగరుడు. ఆత్మ కూడా
జ్ఞానసాగరునిగా అవుతుంది కానీ ఆత్మను జ్ఞానసాగరుడు అని అనరు ఎందుకంటే సాగరుడు ఒక్కరే
ఉంటారు. మీరందరూ నదులు. సాగరుడికి తన శరీరమంటూ ఏమీ లేదు, నదులకు శరీరాలు ఉన్నాయి.
మీరు జ్ఞాన నదులు. కలకత్తాలోని బ్రహ్మాపుత్ర నది చాలా పెద్దది, ఎందుకంటే దానికి
సాగరముతో కనెక్షన్ ఉంది. అక్కడ చాలా పెద్ద మేళా జరుగుతుంది. ఇక్కడ కూడా మేళా
జరుగుతుంది. సాగరుడు మరియు బ్రహ్మాపుత్ర, ఇరువురూ కలిసి ఉన్నారు. ఈ మేళా చైతన్యమైనది,
అది జడమైనది. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు.
శాస్త్రాలు భక్తి మార్గపు డిపార్టుమెంట్. ఇది జ్ఞాన మార్గము, అది భక్తి మార్గము.
అర్ధకల్పము భక్తి మార్గపు డిపార్టుమెంట్ నడిచింది. అందులో జ్ఞానసాగరుడు లేరు.
పరమపిత పరమాత్మ, జ్ఞానసాగరుడైన తండ్రి సంగమములో వచ్చి జ్ఞాన స్నానముతో అందరికీ
సద్గతినిస్తారు.
మనము అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ సుఖాల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నామని మీకు
తెలుసు. తప్పకుండా మనము సత్య, త్రేతాయుగాలలో పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారము. ఇప్పుడు
మనము పూజారి మనుష్యులుగా ఉన్నాము. మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు.
బ్రాహ్మణుల నుండి దేవతా ధర్మములోకి వచ్చారు, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా,
శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు దిగవలసి వచ్చింది. ఇది
కూడా తండ్రి మీకు తెలియజేశారు. ఇంతకుముందు మీకు మీ జన్మల గురించి తెలియదు. 84
జన్మలను కూడా మీరే తీసుకుంటారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో, వారే పూర్తి 84 జన్మలను
తీసుకుంటారు. యోగముతోనే మాలిన్యము తొలగుతుంది, యోగములోనే శ్రమ ఉంది. కొంతమంది
పిల్లలు జ్ఞానములో చురుకుగా ఉన్నారు కానీ యోగములో కచ్చాగా ఉన్నారు. బంధనములో ఉన్న
కుమార్తెలు యోగము విషయములో బంధనములేనివారి కన్నా బాగున్నారు. వారు శివబాబాను
కలుసుకునేందుకు రాత్రింబవళ్ళు తపిస్తూ ఉంటారు కానీ మీరైతే బాబాను కలుసుకున్నారు.
మీకు, స్మృతి చేయండి అని చెప్పడము జరుగుతుంది, అయినా మీరు పదే-పదే మర్చిపోతూ ఉంటారు.
మీకు తుఫానులు చాలా వస్తాయి. వారు స్మృతిలో తపిస్తూ ఉంటారు. మీరు తపించరు. వారు
ఇంటిలో కూర్చుని ఉన్నా కానీ వారికి ఉన్నత పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండటము
ద్వారా మనకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధముగా ఒక
బిడ్డ గర్భము నుండి బయటకు రావడానికి తపిస్తాడో, అదే విధముగా బంధనములో ఉన్న
కుమార్తెలు - శివబాబా, ఈ బంధనము నుండి బయటకు తీయండి అని తపిస్తూ-తపిస్తూ పిలుస్తూ
ఉంటారు, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తూ ఉంటారు. మీకు తండ్రి లభించారు, మీరు
నిర్లక్ష్యులుగా అయిపోయారు. మనము బాబా పిల్లలము, మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి
రాకుమారులుగా అవుతాము అని లోలోపల ఈ స్థిరమైన సంతోషము ఉండాలి. కానీ మాయ స్మృతిని
నిలవనివ్వదు. స్మృతి వలన చాలా సంతోషముగా ఉంటారు. స్మృతి చేయకపోతే ఇబ్బందులు పడుతూ
ఉంటారు. అర్ధకల్పము మీరు రావణ రాజ్యములో దుఃఖాన్ని చూసారు. అకాల మృత్యువులు జరుగుతూ
వచ్చాయి. దుఃఖమైతే ఎలాగూ ఉండనే ఉంది. ఎంతటి షావుకారులైనా కానీ దుఃఖమైతే ఉంటుంది.
అకాల మృత్యువు జరుగుతుంది. సత్యయుగములో ఇలాంటి అకాల మృత్యువులు సంభవించవు. ఎప్పుడూ
రోగగ్రస్థులుగా అవ్వరు. సమయము వచ్చినప్పుడు తమకు తామే, కూర్చుని-కూర్చునే ఒక
శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. దాని పేరే సుఖధామము. మనుష్యులైతే స్వర్గము
యొక్క విషయాలను ఊహ అని భావిస్తారు. స్వర్గము ఎక్కడ నుండి వచ్చింది అని అంటారు.
మనమైతే స్వర్గములో ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ఈ ఆట
అంతా భారత్ పైనే తయారుచేయబడి ఉంది. మనము 21 జన్మలు పావన దేవతలుగా ఉండేవారమని, ఆ
తర్వాత మనము క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యామని, ఇప్పుడు మళ్ళీ
బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. ఈ స్వదర్శన చక్రము చాలా సులభమైనది. దీనిని
శివబాబా కూర్చుని అర్థం చేయిస్తారు.
శివబాబా బ్రహ్మా రథములోకి వచ్చారని మీకు తెలుసు. ఎవరైతే బ్రహ్మాగా ఉన్నారో, వారే
సత్యయుగము ఆదిలో శ్రీకృష్ణునిగా ఉండేవారు. వారు 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యారు,
మళ్ళీ వారిలో తండ్రి ప్రవేశించి దత్తత తీసుకున్నారు. తండ్రి స్వయముగా అంటున్నారు -
నేను ఈ తనువును ఆధారముగా తీసుకుని మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను, తర్వాత
మిమ్మల్ని స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారుచేస్తాను. ఎవరైతే యోగ్యులుగా అవుతారో,
వారే రాజ్యములోకి వస్తారు. దీని కోసం మంచి మ్యానర్స్ కావాలి. ముఖ్యమైనది పవిత్రత. ఈ
విషయములోనే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అక్కడక్కడ పురుషులపై కూడా అత్యాచారాలు
జరుగుతాయి. వికారాల కోసం ఒకరినొకరు విసిగించుకుంటారు. ఇక్కడ మాతలు ఎక్కువమంది ఉన్న
కారణముగా శక్తి సైన్యమనే పేరు గాయనము చేయబడింది, వందే మాతరమ్. ఇప్పుడు మీరు కామ చితి
నుండి దిగి సుందరముగా అయ్యేందుకు జ్ఞాన చితిపై కూర్చున్నారు. ద్వాపరము నుండి
మొదలుకుని కామ చితిపై కూర్చున్నారు. ఒకరికొకరు వికారాలను ఇచ్చుకునే బంధాన్ని వికారీ
బ్రాహ్మణులు ముడి వేస్తారు. మీరు నిర్వికారీ బ్రాహ్మణులు. మీరు ఆ బంధాన్ని
క్యాన్సిల్ చేసి జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. కామ చితి వలన నల్లగా అయిపోయారు, జ్ఞాన
చితి వలన సుందరముగా తయారవుతారు. తండ్రి అంటారు, మీరు కలిసే ఉండండి కానీ మేము
వికారాలలోకి వెళ్ళము అన్న ప్రతిజ్ఞను చేయండి, అందుకే బాబా ఉంగరాన్ని కూడా
ధరింపజేస్తారు. శివబాబా, తండ్రి కూడా, ప్రియుడు కూడా, వారు సీతలందరికీ రాముడు. వారే
పతిత-పావనుడు. అంతేకానీ రఘుపతి రాఘవ రాజా రాముడి విషయము కాదు, వారు సంగమములోనే ఈ
ప్రారబ్ధాన్ని పొందారు. అతనికి హింసాత్మక బాణాలను చూపించడము తప్పు. చిత్రములో కూడా
అలా చూపించకూడదు. కేవలం చంద్రవంశీ అని వ్రాయాలి. శివబాబా వీరి ద్వారా మనకు ఈ చక్రము
యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి.
సత్యనారాయణుని కథ ఉంటుంది కదా, అది మనుష్యులు తయారుచేసిన కథ. (ఆ కథ ద్వారా) ఎవరూ
నరుని నుండి నారాయణునిగా అవ్వరు. సత్యనారాయణుని కథ యొక్క అర్థమే నరుని నుండి
నారాయణునిగా అవ్వడము. అమరకథను కూడా వినిపిస్తారు కానీ దాని ద్వారా అమరపురిలోకైతే
ఎవరూ వెళ్ళరు. మృత్యులోకము 2500 సంవత్సరాలు కొనసాగుతుంది. మూడవ నేత్రము యొక్క కథను
మాతలు వింటారు. వాస్తవానికి అది జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ. ఇప్పుడు
జ్ఞానమనే మూడవ నేత్రము ఆత్మకు లభించింది కావున ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఈ
శరీరము ద్వారా ఇప్పుడు దేవతగా అవుతాను, నాలోనే ఈ సంస్కారాలు ఉన్నాయి. మనుష్యులందరూ
దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి వచ్చి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. మనుష్యులు
ఆత్మ-పరమాత్మ ఒక్కటేనని, పరమాత్మయే ఈ రూపాలన్నింటినీ ధారణ చేసారని అంటారు. తండ్రి
అంటారు, అదంతా రాంగ్, దానిని మిథ్యా అభిమానము, మిథ్యా జ్ఞానము అని అంటారు. నేను
బిందువు వలె ఉంటానని బాబా అంటున్నారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు, ఇతనికి కూడా
తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇందులో సంశయము కలగకూడదు,
నిశ్చయముండాలి. బాబా తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. సంశయబుద్ధి వినశ్యంతి.
అటువంటివారు పూర్తి వారసత్వాన్ని పొందలేరు. ఆత్మాభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది.
భోజనము తయారుచేస్తున్నప్పుడు, బుద్ధి తండ్రి వైపు జోడించబడి ఉండాలి. ప్రతి
విషయములోనూ ఇది ప్రాక్టీస్ చేయాలి. రోటీ తయారుచేస్తూ తమ ప్రియుడిని స్మృతి చేస్తూ
ఉండాలి - ఈ అభ్యాసము ప్రతి విషయములోనూ చేయాలి. ఎంత సమయము తీరిక లభిస్తే అంత సమయము
స్మృతి చేయాలి. స్మృతితోనే మీరు సతోప్రధానముగా అవుతారు. 8 గంటలు కర్మల కోసం అనుమతి
ఉంది. కర్మల మధ్యలో కూడా ఏకాంతములోకి వెళ్ళి కూర్చోవాలి. మీరు అందరికీ బాబా
పరిచయాన్ని కూడా వినిపించాలి. ఈ రోజు వినకపోతే రేపు వింటారు. తండ్రి స్వర్గ స్థాపనను
చేస్తారు. మనము స్వర్గములో ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ నరకవాసులుగా అయ్యాము. ఇప్పుడు
మళ్ళీ తండ్రి నుండి వారసత్వము లభించాలి. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు.
తండ్రి రావడము కూడా భారత్ లోనే వస్తారు. చూడండి, మీ వద్దకు ముసల్మానులు కూడా వస్తారు,
వారు కూడా సెంటర్లను సంభాళిస్తారు. వారూ శివబాబాను స్మృతి చేయండి అని చెప్తారు.
సిక్కులు కూడా వస్తారు, క్రిస్టియన్లు కూడా వస్తారు, మున్ముందు చాలామంది వస్తారు. ఈ
జ్ఞానము అందరి కోసము ఉంది ఎందుకంటే ఇది ఉన్నదే సహజమైన స్మృతి మరియు తండ్రి యొక్క
సహజమైన వారసత్వము. కానీ పవిత్రముగా అయితే తప్పకుండా అవ్వవలసి ఉంటుంది.
దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. ఇప్పుడు భారత్ పై రాహు గ్రహణముంది, తర్వాత
21 జన్మల కోసం బృహస్పతి దశ ప్రారంభమవుతుంది. ముందు బృహస్పతి దశ ఉంటుంది, ఆ తర్వాత
శుక్ర దశ ఉంటుంది. సూర్యవంశీయులపై బృహస్పతి దశ ఉంటుందని, చంద్రవంశీయులపై శుక్ర దశ
ఉంటుందని అంటారు. ఆ తర్వాత దశలు తగ్గిపోతూ ఉంటాయి. అన్నింటికన్నా చెడ్డది రాహు దశ.
బృహస్పతి అంటే గురువెవరో కాదు. ఇది వృక్షపతి దశ. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు
బృహస్పతి దశ మరియు శుక్ర దశ ఉంటాయి. రావణుడు వచ్చినప్పుడు రాహు దశ ఉంటుంది.
పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంటుంది. కేవలం వృక్షపతిని స్మృతి చేయండి,
పవిత్రముగా అవ్వండి, అంతే. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.