ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ,
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ సదా
కోసం సమాప్తమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ సోదర దృష్టితో చూడండి,
అప్పుడు దేహపు దృష్టి, వృత్తి మారిపోతాయి. తండ్రి కూడా అశరీరిగా ఉన్నారు, ఆత్మలైన
మీరు కూడా అశరీరిగా ఉన్నారు. తండ్రి ఆత్మలనే చూస్తారు, అందరూ అకాల సింహాసనముపై
విరాజమానమై ఉన్న ఆత్మలు. మీరు కూడా అందరినీ ఆత్మలుగా, సోదర దృష్టితో చూడండి, ఇందులో
చాలా శ్రమ ఉంది. దేహము యొక్క భానములోకి రావడముతోనే మాయా తుఫానులు వస్తాయి. ఈ
దేహాభిమానము యొక్క ద్వారాన్ని మూసివేసినట్లయితే మాయా తుఫానులు రావడము ఆగిపోతాయి.
దేహీ-అభిమానులుగా అయ్యే ఈ శిక్షణను మొత్తం కల్పములో ఈ పురుషోత్తమ సంగమయుగములో,
తండ్రి మాత్రమే పిల్లలైన మీకు ఇస్తారు.
మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలూ, ఇప్పుడు మీరు నరకము
యొక్క తీరాన్ని వదిలి ముందుకు వెళ్తున్నారు అని మీకు తెలుసు, మధ్యలో ఉన్న ఈ
పురుషోత్తమ సంగమయుగము పూర్తిగా వేరు. మీ నావ ఇప్పుడు సముద్రము మధ్యలో ఉంది. మీరు
సత్యయుగము వారు కాదు, కలియుగము వారు కాదు. మీరు పురుషోత్తమ సంగమయుగీ, సర్వోత్తమమైన
బ్రాహ్మణులు. సంగమయుగము ఉండేది బ్రాహ్మణుల కోసమే. బ్రాహ్మణులు పిలక వంటి వారు. ఇది
బ్రాహ్మణుల యొక్క చాలా చిన్నని యుగము. ఇది ఒకే ఒక్క జన్మ కల యుగము. ఇది మీ సంతోషము
యొక్క యుగము. ఏ విషయములో సంతోషముంది? భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు! ఇటువంటి
విద్యార్థులకు ఎంత సంతోషముంటుంది! మీకు ఇప్పుడు మొత్తము చక్రమంతటి జ్ఞానము బుద్ధిలో
ఉంది. ఇప్పుడు మనమే బ్రాహ్మణులము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ముందుగా మన ఇంటికి,
స్వీట్ హోమ్ కు వెళ్తాము, ఆ తర్వాత కొత్త ప్రపంచములోకి వస్తాము. బ్రాహ్మణులైన మనమే
స్వదర్శన చక్రధారులము. మనమే ఈ పిల్లిమొగ్గల ఆటను ఆడతాము. ఈ విరాట రూపము గురించి కూడా
బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, బుద్ధిలో రోజంతా ఈ విషయాల స్మరణ జరుగుతూ
ఉండాలి.
మధురమైన పిల్లలూ, మీ ఈ పరివారము చాలా ప్రియమైన పరివారము, కావున మీలోని ప్రతి
ఒక్కరూ చాలా-చాలా ప్రియముగా ఉండాలి. తండ్రి కూడా మధురమైనవారు కావున పిల్లలను కూడా
అలా మధురముగా తయారుచేస్తారు. ఎప్పుడూ ఎవరిపైనా కోప్పడకూడదు. మనసా, వాచా, కర్మణా
ఎవరికీ దుఃఖమును ఇవ్వకూడదు. తండ్రి ఎప్పుడూ ఎవరికీ దుఃఖమునివ్వరు. ఎంతగా తండ్రిని
స్మృతి చేస్తారో, అంతగా మధురముగా అవుతూ ఉంటారు. కేవలం ఈ స్మృతి ద్వారానే నావ
తీరానికి చేరుకుంటుంది - ఇది స్మృతియాత్ర. స్మృతి చేస్తూ-చేస్తూ వయా శాంతిధామము
సుఖధామానికి వెళ్ళాలి. పిల్లలను సదా సుఖవంతులుగా చేయడానికే తండ్రి వచ్చారు. భూతాలను
పారద్రోలే యుక్తిని తండ్రి తెలియజేస్తారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఈ భూతాలు
తొలగిపోతూ ఉంటాయి. ఏ భూతాన్నీ కూడా మీతో పాటు తీసుకువెళ్ళకండి. ఎవరిలోనైనా భూతముంటే,
ఇక్కడే నా వద్ద వదిలి వెళ్ళండి. బాబా, మీరు వచ్చి మాలో ఉన్న భూతాలను తొలగించి
పతితుల నుండి పావనులుగా చేయండి అని మీరు అంటారు. కావున తండ్రి ఎటువంటి పుష్పాలుగా
తయారుచేస్తున్నారు. బాప్ మరియు దాదా, ఇరువురూ కలిసి పిల్లలైన మీ అలంకరణను చేస్తారు.
తల్లిదండ్రులే పిల్లల అలంకరణను చేస్తారు కదా. వారు హద్దులోని తండ్రి - వీరు అనంతమైన
తండ్రి. పిల్లలు చాలా ప్రేమగా నడుచుకోవాలి మరియు నడిపించాలి. అన్ని వికారాలను దానము
ఇవ్వాలి, దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. ఇందులో సాకులు మొదలైనవాటి
విషయమేమీ లేదు. ప్రేమతో మీరు ఎవరినైనా వశము చేసుకోవచ్చు. ప్రేమగా అర్థం చేయించండి.
ప్రేమ చాలా మధురమైన భావము - సింహాలను, ఏనుగులను, జంతువులను కూడా మనుష్యులు ప్రేమతో
వశము చేసుకుంటారు. ఇంకా, వారైతే ఆసురీ మనుష్యులు. మీరైతే ఇప్పుడు దేవతలుగా
అవుతున్నారు. కావున దైవీ గుణాలను ధారణ చేసి చాలా-చాలా మధురముగా అవ్వాలి. ఒకరినొకరు
సోదర దృష్టితో లేదా సోదరీ-సోదరుల దృష్టితో చూడండి. ఆత్మ, ఆత్మకు ఎప్పుడూ దుఃఖాన్ని
ఇవ్వలేదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, నేను మీకు స్వర్గము యొక్క రాజ్య
భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు మీకు ఏమి కావాలంటే అది నా నుండి తీసుకోండి.
నేనైతే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటధారులుగా చేయడానికి వచ్చాను.
కానీ కృషి అనేది మీరు చేయవలసి ఉంటుంది. నేను ఎవరిపైనా కిరీటాన్ని పెట్టను. మీరు మీ
పురుషార్థము ద్వారానే మీకు మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. ఈ విధముగా మీరు
స్వయాన్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటధారులుగా చేసుకోవచ్చు అని తండ్రి
పురుషార్థము యొక్క యుక్తులను తెలియజేస్తారు. చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి.
ఎప్పుడూ కూడా చదువును వదలకండి. ఏ కారణము చేతనైనా అలిగి, చదువును వదిలినట్లయితే
చాలా-చాలా నష్టము కలుగుతుంది. లాభ-నష్టాలను చూసుకుంటూ ఉండండి. మీరు ఈశ్వరీయ
యూనివర్శిటీ యొక్క విద్యార్థులు, ఈశ్వరుడైన తండ్రి నుండి చదువుకుంటున్నారు,
చదువుకుని పూజ్య దేవతలుగా అవుతున్నారు. స్టూడెంట్స్ లో కూడా మీరు రెగ్యులర్
స్టూడెంట్స్ గా అవ్వాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ (విద్యార్థి జీవితము
అత్యుత్తమమైనది). ఎంతగా చదువుకుంటారో, చదివిస్తారో మరియు మ్యానర్స్ ను
సరిదిద్దుకుంటారో, అంతగా ది బెస్ట్ గా అవుతారు.
మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీది రిటర్న్ జర్నీ, ఎలాగైతే సత్యయుగము నుండి త్రేతా,
ద్వాపర, కలియుగాల వరకు కిందకు దిగుతూ వచ్చారో, అలా ఇప్పుడు మీరు ఇనుపయుగము నుండి
పైనున్న బంగారుయుగము వరకు వెళ్ళాలి. వెండియుగము వరకు చేరుకున్నప్పుడు, ఇక ఈ
కర్మేంద్రియాల చంచలత్వము సమాప్తమైపోతుంది, అందుకే ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో,
అంతగా ఆత్మలైన మీ నుండి రజో, తమోల తుప్పు వదులుతూ ఉంటుంది, మరియు తుప్పు ఎంతగా
వదులుతూ ఉంటుందో, అంతగా అయస్కాంతమైన తండ్రి వైపుకు ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆకర్షణ
కలగడము లేదంటే తప్పకుండా తుప్పు పట్టి ఉన్నట్లే - తుప్పు పూర్తిగా వదిలి స్వచ్ఛమైన
బంగారముగా అవ్వాలి, అదే అంతిమ కర్మాతీత అవస్థ.
మీరు గృహస్థ వ్యవహారములో, ప్రవృత్తిలో ఉంటూ కూడా కమలపుష్ప సమానముగా తయారవ్వాలి.
తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, మీ ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించండి, శరీర
నిర్వహణార్థము కార్య వ్యవహారాలను కూడా చేయండి, దానితోపాటు ఈ చదువును కూడా చదువుకుంటూ
ఉండండి. చేతులు పని వైపు, మనసు ప్రియుని వైపు ఉండాలని గాయనము కూడా ఉంది. కార్య
వ్యవహారాలు చేసుకుంటూ ప్రియుడైన ఆ తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. మీరు అర్ధకల్పము
యొక్క ప్రేయసులు. నవవిధ భక్తిలో కూడా చూడండి, శ్రీకృష్ణుడు మొదలైనవారిని ఎంత ప్రేమగా
స్మృతి చేస్తారు. అది నవవిధ భక్తి, అచంచల భక్తి. కొందరికి శ్రీకృష్ణుని స్మృతి
అచంచలముగా ఉంటుంది, కానీ దాని ద్వారా ఎవరికీ ముక్తి లభించదు. ఇక్కడ ఇది నిరంతర
స్మృతికి సంబంధించిన జ్ఞానము. తండ్రి అంటారు, పతిత-పావనుడైన తండ్రినైన నన్ను స్మృతి
చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, కానీ మాయ కూడా పెద్ద పహల్వాన్ (వస్తాదు). అది
ఎవరినీ వదిలిపెట్టదు. మాయ చేతిలో పదే-పదే ఓడిపోయినట్లయితే, తల కిందకు దించుకుని
పశ్చాత్తాపపడాలి. శ్రేష్ఠముగా తయారయ్యేందుకే తండ్రి మధురమైన పిల్లలకు శ్రేష్ఠ
మతాన్ని ఇస్తారు. పిల్లలు అంతగా శ్రమ చేయడము లేదని బాబా చూస్తున్నారు, అందుకే బాబాకు
దయ కలుగుతుంది. ఒకవేళ ఈ అభ్యాసాన్ని ఇప్పుడు చేయకపోతే, ఇక తర్వాత చాలా శిక్షలు
అనుభవించవలసి ఉంటుంది మరియు కల్ప-కల్పము అతి చిన్న పదవిని పొందుతూ ఉంటారు.
తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్న ముఖ్యమైన విషయము ఏమిటంటే -
దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మరచి నన్నొక్కరినే
స్మృతి చేయండి, పావనముగా కూడా తప్పకుండా అవ్వాలి. కుమారీ పవిత్రముగా ఉన్నప్పుడు
అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు. వివాహము చేసుకున్న తర్వాత ఆమె పూజారిగా అవుతుంది,
అందరి ముందు తల వంచవలసి వస్తుంది. కన్య ముందు పుట్టింటిలో ఉన్నప్పుడు, సంబంధాలు అంత
ఎక్కువగా గుర్తుకు రావు. వివాహము తర్వాత దేహపు సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి,
అప్పుడు పతి పట్ల, పిల్లల పట్ల మోహము పెరుగుతూ ఉంటుంది. అత్తమామలు మొదలైనవారంతా
గుర్తుకువస్తూ ఉంటారు. ముందు కేవలం తల్లిదండ్రుల పట్ల మాత్రమే మోహముంటుంది. ఇక్కడైతే
ఆ సంబంధాలన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది, ఎందుకంటే వీరొక్కరే మీకు సత్యాతి-సత్యమైన
మాత-పిత కదా. ఇది ఈశ్వరీయ సంబంధము. త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ... అని పాడుతారు
కూడా. ఈ మాత-పితలైతే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు, అందుకే తండ్రి
అంటారు, అనంతమైన తండ్రినైన నన్ను నిరంతరము స్మృతి చేయండి మరియు ఏ దేహధారుల పట్ల
మమకారాన్ని పెట్టుకోకండి. స్త్రీకి తన కలియుగ పతి ఎంత బాగా గుర్తుంటారు, అతడు ఆమెను
మురికి కాలువలో పడేస్తాడు. ఈ అనంతమైన తండ్రి అయితే మిమ్మల్ని స్వర్గములోకి
తీసుకువెళ్తారు. ఇటువంటి మధురమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి మరియు
స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఈ స్మృతిబలముతోనే మీ ఆత్మ బంగారముగా అయి
స్వర్గానికి యజమానిగా అవుతుంది. స్వర్గము అన్న పేరు వినగానే మనసు సంతోషపడుతుంది.
ఎవరైతే నిరంతరము స్మృతి చేస్తూ ఉంటారో మరియు ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తూ ఉంటారో,
వారే ఉన్నత పదవిని పొందుతారు. ఈ పురుషార్థము చేస్తూ-చేస్తూ చివరిలో మీ అవస్థ అలా
తయారవుతుంది. ఈ ప్రపంచము కూడా పాతదే, దేహము కూడా పాతదే, దేహ సహితముగా దేహపు
సంబంధాలన్నీ కూడా పాతవే. వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే
జోడించాలి, అంతిమ సమయములో కూడా ఆ ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి, వేరే సంబంధాలు ఏవైనా
గుర్తుంటే మళ్ళీ అంతిమములో కూడా వారే గుర్తుకువస్తారు మరియు పదవి భ్రష్టమైపోతుంది.
అంతిమ సమయములో ఎవరైతే అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటారో, వారే నరుని నుండి నారాయణునిగా
అవుతారు. తండ్రి స్మృతి ఉన్నట్లయితే శివాలయము ఎంతో దూరము లేదు.
మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు, అనంతమైన తండ్రి వద్దకు
రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారు, ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వ
రాజ్యాధికారము లభిస్తుందని పిల్లలకు తెలుసు. ఇదెప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయము సదా
గుర్తున్నా సరే పిల్లలకు అపారమైన సంతోషముంటుంది. ఈ బ్యాడ్జిని నడుస్తూ-తిరుగుతూ
పదే-పదే చూసుకుంటూ ఉండండి - పూర్తిగా హృదయానికి హత్తుకోండి. ఓహో! భగవంతుని శ్రీమతము
ద్వారా మేమిలా తయారవుతున్నాము. అంతే, బ్యాడ్జిని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి.
బాబా, బాబా అని అంటూ ఉంటే, మేము బాబా ద్వారా ఇలా తయారవుతున్నాము అన్నది సదా
గుర్తుంటుంది. తండ్రి శ్రీమతముపై నడుచుకోవాలి కదా. మధురమైన పిల్లలకు చాలా విశాల
బుద్ధి ఉండాలి. రోజంతా సేవకు సంబంధించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి. బాబాకైతే సేవ
లేకుండా ఉండలేరు అనేటువంటి పిల్లలు కావాలి. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని
చుట్టుముట్టాలి అనగా పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయాలి. మొత్తము విశ్వమంతటినీ
దుఃఖధామము నుండి సుఖధామముగా తయారుచేయాలి. టీచరుకు కూడా చదివించడములో మజా కలుగుతుంది
కదా. మీరైతే ఇప్పుడు చాలా ఉన్నతమైన టీచరుగా అయ్యారు. టీచరు ఎంత బాగుంటే, అంతగా వారు
అనేకులను తమ సమానముగా తయారుచేస్తారు, ఎప్పుడూ అలసిపోరు. ఈశ్వరీయ సేవలో చాలా
సంతోషముంటుంది. తండ్రి సహాయము లభిస్తుంది. ఇది పెద్ద, అనంతమైన వ్యాపారము కూడా,
వ్యాపారస్థులే ధనవంతులుగా అవుతారు. వారు ఈ జ్ఞాన మార్గములో కూడా చాలా ఉత్సాహముతో
ఉంటారు. తండ్రి కూడా అనంతమైన వ్యాపారి కదా. ఈ వ్యాపారము చాలా ఫస్ట్ క్లాస్ అయినది,
కానీ ఇందులో ఎంతో సాహసాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. పురుషార్థములో కొత్త-కొత్త
పిల్లలు, పాతవారి కన్నా ముందుకు వెళ్ళగలరు. ప్రతి ఒక్కరి భాగ్యము ఎవరిది వారిదే,
కావున పురుషార్థము కూడా ఎవరికి వారే చేయాలి. స్వయాన్ని పూర్తిగా చెకింగ్ చేసుకోవాలి.
ఇలా చెకింగ్ చేసుకునేవారు పూర్తిగా రాత్రింబవళ్ళు పురుషార్థములో నిమగ్నమైపోతారు,
మేము మా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని అంటారు. ఎంత వీలైతే అంత సమయాన్ని సఫలము
చేసుకోవాలి. స్వయానికి స్వయమే పక్కా ప్రతిజ్ఞను చేసుకుంటారు - మేము తండ్రిని ఎప్పుడూ
మర్చిపోము, స్కాలర్షిప్ ను తప్పకుండా తీసుకునే తీరుతాము అని. ఇటువంటి పిల్లలకు
సహాయము కూడా లభిస్తుంది. ఇటువంటి కొత్త-కొత్త పురుషార్థీ పిల్లలను కూడా మీరు
చూస్తారు. సాక్షాత్కారాలను పొందుతూ ఉంటారు. ఏదైతే మొదటిలో జరిగిందో, దానినే మళ్ళీ
చివరిలో చూస్తారు. ఎంతగా సమీపముగా వస్తూ ఉంటారో అంతగా సంతోషములో నాట్యము చేస్తూ
ఉంటారు. ఇంకొక వైపు, అనవసరపు రక్తసిక్తమైన ఆట కూడా నడుస్తూ ఉంటుంది.
పిల్లలైన మీ ఈశ్వరీయ రేస్ జరుగుతుంది, ఎంతగా ముందుకు పరుగెడుతూ ఉంటారో, అంతగా
కొత్త ప్రపంచము యొక్క దృశ్యాలు కూడా సమీపముగా వస్తూ ఉంటాయి, సంతోషము పెరుగుతూ
ఉంటుంది. ఎవరికైతే ఆ దృశ్యాలు సమీపముగా కనిపించవో, వారికి సంతోషము కూడా ఉండదు.
ఇప్పుడైతే కలియుగ ప్రపంచము పట్ల వైరాగ్యము మరియు సత్యయుగ కొత్త ప్రపంచము పట్ల చాలా
ప్రేమ ఉండాలి. శివబాబా గుర్తుంటే స్వర్గ వారసత్వము కూడా గుర్తుంటుంది. స్వర్గ
వారసత్వము గుర్తుంటే శివబాబా కూడా గుర్తుంటారు. ఇప్పుడు మనము స్వర్గము వైపుకు
వెళ్తున్నామని, కాళ్ళు నరకము వైపు ఉన్నాయని, ముఖము స్వర్గము వైపు ఉందని పిల్లలైన
మీకు తెలుసు. ఇప్పుడైతే చిన్నా, పెద్దా అందరిదీ వానప్రస్థ అవస్థయే. ఓహో, నేను వెళ్ళి
ఈ చిన్ని శ్రీకృష్ణునిగా అవుతాను అనే నషా బాబాకు సదా ఉంటుంది, వారి కోసం ఇన్
అడ్వాన్స్ కానుకలను కూడా పంపిస్తూ ఉంటారు. ఎవరికైతే పూర్తి నిశ్చయముంటుందో, ఆ
గోపికలే కానుకలను పంపిస్తారు, వారికి అతీంద్రియ సుఖపు అనుభూతి కలుగుతుంది. మనమే
అమరలోకములోని దేవతలుగా అవుతాము. కల్పక్రితము కూడా మనమే అలా అయ్యాము, తర్వాత మనము 84
పునర్జన్మలను తీసుకున్నాము. ఈ పిల్లిమొగ్గల ఆట గుర్తున్నా సరే అహో సౌభాగ్యము - సదా
అపారమైన సంతోషములో ఉండండి, చాలా పెద్ద లాటరీ లభిస్తూ ఉంది. 5000 సంవత్సరాల క్రితం
కూడా మనము రాజ్య భాగ్యాన్ని పొందాము, మళ్ళీ రేపు పొందుతాము. ఇది డ్రామాలో నిశ్చితమై
ఉంది. ఎలాగైతే కల్పక్రితము జన్మ తీసుకున్నామో, అలాగే తీసుకుంటాము, అప్పటి
తల్లిదండ్రులే మళ్ళీ ఉంటారు. ఎవరైతే శ్రీకృష్ణుడికి తండ్రిగా ఉండేవారో, వారే మళ్ళీ
శ్రీకృష్ణుడికి తండ్రిగా అవుతారు. ఎవరైతే రోజంతా ఈ విధముగా ఆలోచిస్తూ ఉంటారో, వారు
చాలా రమణీకముగా ఉంటారు. విచార సాగర మంథనము చేయకపోతే, వారు అనారోగ్యముగా ఉన్నారని
అర్థము. ఆవు భోజనము చేసిన తర్వాత, దానిని రోజంతా నెమరువేస్తూ ఉంటుంది, నోరు
కదులుతూనే ఉంటుంది. నోరు కదలడము లేదంటే అనారోగ్యముగా ఉందని అర్థం చేసుకోవడము
జరుగుతుంది, ఇక్కడ కూడా అలానే ఉంటుంది.
అనంతమైన బాప్ మరియు దాదా, ఇరువురికీ మధురాతి మధురమైన పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది,
ఎంత ప్రేమగా చదివిస్తారు. నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తారు. కావున పిల్లలకు కూడా
సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి. పాదరసము అనేది స్మృతియాత్రతో పైకి ఎక్కుతుంది. తండ్రి
కల్ప-కల్పము చాలా ప్రేమతో ప్రియమైన సేవను చేస్తారు. 5 తత్వాల సహితముగా అందరినీ
పావనముగా చేస్తారు. ఇది ఎంత పెద్ద అనంతమైన సేవ. తండ్రి చాలా ప్రేమగా పిల్లలకు
శిక్షణను కూడా ఇస్తూ ఉంటారు, ఎందుకంటే పిల్లలను సరిదిద్దడము తండ్రి మరియు టీచర్
యొక్క కర్తవ్యమే. శ్రీమతము తండ్రి ఇచ్చినది, దీని ద్వారానే శ్రేష్ఠముగా అవుతారు.
ఎంత ప్రేమగా స్మృతి చేస్తే, అంత శ్రేష్ఠముగా అవుతారు. మేము శ్రీమతముపై నడుస్తున్నామా
లేక సొంత మతముపై నడుస్తున్నామా అన్నది కూడా చార్టులో వ్రాయాలి. శ్రీమతముపై
నడిచినట్లయితే మీరు ఏక్యురేట్ గా అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.