10-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది) అనగా మొదట స్వయము ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయండి, ఆ తర్వాత ఇతరులకు చెప్పండి, ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానము ఇచ్చినట్లయితే జ్ఞాన ఖడ్గానికి పదును వచ్చేస్తుంది’’

ప్రశ్న:-
సంగమయుగములో ఏ రెండు విషయాలలో కృషి చేసినట్లయితే సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు?

జవాబు:-
1. సుఖ-దుఃఖాలు, నింద-స్తుతులలో సమాన స్థితి ఉండాలి, ఈ కృషి చేయండి. ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా, క్రోధము చేసినా మీరు మౌనముగా ఉండండి, ఎప్పుడూ నోటితో చప్పట్లు మ్రోగించకండి 2. కనులను శుద్ధముగా చేసుకోండి, అశుద్ధమైన దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి, ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము, ఆత్మగా భావిస్తూ జ్ఞానమివ్వండి, ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేసినట్లయితే సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. సంపూర్ణముగా పవిత్రముగా అయ్యేవారే సింహాసనాధికారులుగా అవుతారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు, ఆత్మలైన మీకు ఈ మూడవ నేత్రము లభించింది, దీనినే జ్ఞాన నేత్రమని కూడా అంటారు, దీని ద్వారా మీరు మీ సోదరులను చూస్తారు. మేము సోదరులను చూసినప్పుడు కర్మేంద్రియాలు చంచలమవ్వవు అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు కదా. ఈ విధముగా చేస్తూ-చేస్తూ అశుద్ధముగా ఉన్న కనులు శుద్ధముగా అయిపోతాయి. తండ్రి అంటారు, విశ్వానికి యజమానులుగా అవ్వడము కోసం కృషి అయితే చేయవలసి ఉంటుంది కదా. కావున ఇప్పుడు ఈ కృషి చేయండి. కృషి చేయడము కోసం బాబా కొత్త-కొత్త గుహ్యమైన పాయింట్లను వినిపిస్తుంటారు కదా. కావున ఇప్పుడు పరస్పరము సోదరులుగా భావిస్తూ జ్ఞానాన్ని ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అప్పుడు, వి ఆర్ ఆల్ బ్రదర్స్ (మనమంతా సోదరులము) అని ఏదైతే అంటూ ఉంటారో, అది ప్రాక్టికల్ అవుతుంది. ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన సోదరులు ఎందుకంటే మీకు తండ్రి గురించి తెలుసు. తండ్రి పిల్లలైన మీతో కలిసి సేవ చేస్తున్నారు. పిల్లలు ధైర్యము చేస్తే, తండ్రి సహాయము చేస్తారు. తండ్రి వచ్చి సేవ చేయడానికి ధైర్యాన్ని ఇస్తారు. మరి అది సహజమవుతుంది కదా. కావున రోజూ ఈ అభ్యాసము చేయవలసి ఉంటుంది, సోమరితనము ఉండకూడదు. ఇటువంటి కొత్త-కొత్త పాయింట్లు పిల్లలకు లభిస్తాయి. సోదరులమైన మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆత్మలు చదువుకుంటాయి, ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. కేవలం ఈ సమయములోనే ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది, ఎందుకంటే తండ్రి వచ్చేదే సంగమయుగములో, సృష్టి పరివర్తన అయ్యేటప్పుడు. సృష్టి పరివర్తన అవ్వబోతున్నప్పుడే ఈ ఆత్మిక జ్ఞానము కూడా లభిస్తుంది. తండ్రి వచ్చి, స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న ఈ ఆత్మిక జ్ఞానాన్నే ఇస్తారు. ఆత్మ వివస్త్రగా (అశరీరిగా) వచ్చింది, ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తుంది. ప్రారంభము నుండి మొదలుకుని ఇప్పటివరకు ఆత్మలు 84 జన్మలు తీసుకున్నారు. కానీ నంబరువారుగా ఎవరెలా వచ్చి ఉంటారో, వారు అదే విధముగా జ్ఞాన-యోగాలలో కృషి చేస్తారు. కల్పక్రితము ఎవరు ఏ విధముగా పురుషార్థము చేశారో, కృషి చేశారో, వారు ఇప్పుడు కూడా అలాగే కృషి చేస్తూ ఉంటారని గమనించడము జరుగుతుంది. స్వయము కోసం కష్టపడాలి. ఇతరులెవరి కోసం చేయవలసిన పని ఉండదు. కావున స్వయాన్నే ఆత్మగా భావిస్తూ స్వయము కృషి చేయవలసి ఉంటుంది. ఇతరులు ఏం చేస్తున్నారు అన్నదానితో మనదేమి పోతుంది. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది) అనగా మొట్టమొదట స్వయము కృషి చేసి, ఆ తర్వాత ఇతరులకు (సోదరులకు) చెప్పాలి. ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తారో, అప్పుడు మీ జ్ఞాన ఖడ్గములో పదును నిండుతుంది. ఇందులో కృషి అయితే ఉంది కదా. కావున తప్పకుండా ఎంతోకొంత సహనము చేయవలసి ఉంటుంది. ఈ సమయములో సుఖ-దుఃఖాలు, నిందా-స్తుతులు, మానావమానాలు మొదలైనవన్నీ ఎంతోకొంత సహనము చేయవలసి ఉంటుంది. కావున ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే మౌనముగా ఉండండి అని అంటారు. ఎవరైనా మౌనముగా ఉంటే, ఇక వారిపై ఎవరైనా ఏమి కోపగించుకోగలరు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఇంకొకరు కూడా మాట్లాడితే, నోటి చప్పట్లు మ్రోగుతాయి. ఒకవేళ ఒకరు నోటి చప్పట్లు మ్రోగించినా, మరొకరు శాంతిగా ఉంటే, అంతా ఆగిపోతుంది. అంతే, తండ్రి ఇదే నేర్పిస్తారు. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా క్రోధములోకి వచ్చినప్పుడు మౌనముగా ఉండండి, దానంతటదే వారి క్రోధము శాంతిస్తుంది. ఇంకొకవైపు చప్పట్లు మ్రోగవు. ఒకవేళ చప్పట్లతో చప్పట్లు కలిస్తే గొడవైపోతుంది, అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, ఈ విషయాలలో మీరు ఎప్పుడూ చప్పట్లు మ్రోగించకండి. వికారాలు, కామము, క్రోధము, దేనికీ స్పందించకండి.

పిల్లలు ప్రతి ఒక్కరి కళ్యాణము చేయవలసిందే, ఇన్ని సెంటర్లు దేని కోసం తయారుచేయబడి ఉన్నాయి? కల్పక్రితము కూడా ఇటువంటి సేవాకేంద్రాలు వెలువడే ఉంటాయి. దేవాది దేవుడైన తండ్రి చూస్తూ ఉంటారు, చాలామంది పిల్లలకు బాబా సెంటర్లు తెరవాలి అన్న అభిరుచి ఉంటుంది. మేము సెంటర్లు తెరుస్తాము, మేము ఖర్చు భరిస్తాము అని అంటారు. కావున రోజురోజుకూ ఇలా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎంతగా వినాశనపు రోజులు సమీపముగా వస్తూ ఉంటాయో, అంతగా ఇటువైపు కూడా సేవ చేయాలనే అభిరుచి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు కావున ప్రతి ఒక్కరినీ చూస్తుంటారు - వీరు ఏం పురుషార్థము చేస్తున్నారు, ఏం పదవిని పొందుతారు అని, ఎవరి పురుషార్థము ఉన్నతముగా ఉంది, ఎవరిది మధ్యమముగా ఉంది, ఎవరిది కనిష్ఠముగా ఉంది అన్నది వారు చూస్తూ ఉన్నారు. టీచర్లు కూడా స్కూల్లో చూస్తూ ఉంటారు, విద్యార్థులు ఏయే సబ్జెక్టులలో పైకి-కిందికి అవుతున్నారు అని. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. కొందరు పిల్లలు బాగా అటెన్షన్ పెడతారు, వారు స్వయాన్ని ఉన్నతముగా భావిస్తారు. కొందరు ఏ సమయములోనైనా పొరపాటు జరిగితే, స్మృతిలో లేనట్లయితే తమను తాము తక్కువగా భావిస్తారు. ఇది స్కూలు కదా. పిల్లలు అంటారు - బాబా, మేము అప్పుడప్పుడు చాలా సంతోషముగా ఉంటాము, అప్పుడప్పుడు సంతోషము తగ్గిపోతుంది. బాబా ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉంటారు, సంతోషముగా ఉండాలనుకుంటే ‘‘మన్మనాభవ’’, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని కూడా స్మృతి చేయండి. ఎదురుగా పరమాత్మను చూడండి, వారు అకాల సింహాసనముపై కూర్చుని ఉన్నారు. ఇదే విధముగా సోదరుల వైపు కూడా చూడండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరునితో మాట్లాడండి. నేను సోదరుడికి జ్ఞానాన్ని ఇస్తున్నాను. సోదరి కాదు, అందరూ సోదరులే. ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఒకవేళ ఇది మీకు అలవాటు అయినట్లయితే మిమ్మల్ని మోసము చేసే అశుద్ధమైన దృష్టి నెమ్మది-నెమ్మదిగా సమాప్తమైపోతుంది. ఆత్మ-ఆత్మతో ఏం చేస్తుంది? ఒకవేళ దేహాభిమానము వస్తే అప్పుడు కింద పడిపోతారు. బాబా, మా దృష్టి అశుద్ధముగా ఉందని చాలామంది అంటారు. అచ్ఛా, అశుద్ధమైన దృష్టిని ఇప్పుడు శుద్ధముగా చేయండి. బాబా ఆత్మకు మూడవ నేత్రాన్ని ఇచ్చారు. మూడవ నేత్రముతో చూస్తే దేహాన్ని చూసే మీ అలవాటు తొలగిపోతుంది. బాబా పిల్లలకు డైరెక్షన్లు అయితే ఇస్తూనే ఉంటారు, ఇతనికి (బ్రహ్మాకు) కూడా ఇలాగే చెప్తారు. ఈ బాబా కూడా దేహములో ఉన్న ఆత్మనే చూస్తారు. దీనినే ఆత్మిక జ్ఞానమని అంటారు. ఎంత ఉన్నత పదవిని పొందుతారో చూడండి. ఇది చాలా గొప్ప పదవి. కావున పురుషార్థము కూడా అలాగే చేయాలి. కల్పక్రితము వలె అందరి పురుషార్థము జరుగుతుందని బాబా కూడా భావిస్తారు. కొందరు రాజా-రాణులుగా అవుతారు, కొందరు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కావున ఇక్కడ కూర్చొని యోగము చేయించినప్పుడు కూడా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరుల భృకుటిలో కూడా ఆత్మనే చూస్తూ ఉంటే, వారి సేవ బాగా జరుగుతుంది. ఎవరైతే దేహీ-అభిమానులుగా అయి కూర్చుంటారో, వారు ఆత్మలనే చూస్తారు. ఈ అభ్యాసము ఎక్కువగా చేయండి. అరే, ఉన్నత పదవిని పొందాలంటే, ఎంతోకొంత కృషి చేయాలి కదా. కావున ఆత్మలు ఇప్పుడు ఇదే కృషి చేయాలి. ఈ ఆత్మిక జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, మరెప్పుడూ లభించదు. కలియుగములో గాని, సత్యయుగములో గాని లభించదు, కేవలం సంగమయుగములో, అది కూడా బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తుంది. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బ్రాహ్మణులుగా అయినప్పుడు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకపోతే దేవతలుగా ఎలా అవుతారు? ఈ సంగమయుగములోనే ఈ కృషి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా, ఇతరులను కూడా ఆత్మగా భావిస్తూ జ్ఞానమివ్వమని మరే సమయములోనూ చెప్పరు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో, దానిపై విచార సాగర మంథనము చేయండి. ఇది సరైనదేనా, నాకు లాభాన్ని కలిగించే విషయమేనా అని నిర్ణయించుకోండి. తండ్రి ఇచ్చే శిక్షణలను సోదరులకు ఇవ్వాలి అన్నది మనకు అలవాటైపోతుంది, స్త్రీలకూ ఇవ్వాలి, పురుషులకు కూడా ఇవ్వాలి. ఇవ్వవలసింది ఆత్మలకే కదా. ఆత్మే పురుషునిగా, స్త్రీగా అవుతుంది. సోదరిగా, సోదరుడిగా అవుతారు.

తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. నేను పిల్లల వైపు, ఆత్మల వైపు చూస్తాను, మరియు ఆత్మలు కూడా - మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తున్నారని అర్థం చేసుకుంటారు, దీనినే రుహానీ అభిమానిగా (ఆత్మాభిమానిగా) అవ్వడమని అంటారు. దీనినే ఆత్మ-పరమాత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడము అని అంటారు. ఈ తండ్రి శిక్షణను ఇస్తున్నారు - ఎవరైనా విజిటర్లు మొదలైనవారు వచ్చినప్పుడు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆ ఆత్మకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలో జ్ఞానముంది, శరీరములో లేదు. కావున వారిని కూడా ఆత్మగా భావిస్తూనే జ్ఞానాన్ని ఇవ్వాలి. దీనితో వారికి కూడా బాగా అనిపిస్తుంది. ఇది మీ నోటిలో పదును ఉన్నట్లు అవుతుంది. ఈ జ్ఞాన ఖడ్గములో పదును నిండుతుంది, ఎందుకంటే దేహీ-అభిమానులుగా ఉంటారు కదా. కావున ఇది కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. బాబా అంటారు - ఇది సరియైనదా కాదా అని మీరు నిర్ణయించి చూడండి. ఇతర పిల్లల కోసం కూడా ఇది కొత్త విషయమేమీ కాదు, ఎందుకంటే తండ్రి సహజము చేసి అర్థం చేయిస్తారు. చక్రములో తిరిగి వచ్చారు, ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, ఇప్పుడు బాబా స్మృతిలో ఉంటారు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు, మళ్ళీ అలాగే మెట్లు దిగుతారు, ఎంత సహజముగా తెలియజేస్తున్నారో చూడండి. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారముగా నేను బంధింపబడి ఉన్నాను. నేను వచ్చి పిల్లలకు చాలా సహజముగా స్మృతి యాత్రను నేర్పిస్తాను. తండ్రి స్మృతిలో అంత మతి సో గతి అవుతుంది (అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ జరుగుతుంది), ఇది ఈ సమయానికి సంబంధించినదే. ఇది అంతిమ కాలము. ఇప్పుడు ఈ సమయములో తండ్రి కూర్చుని యుక్తిని తెలియజేస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే సద్గతి లభిస్తుంది. చదువు ద్వారా ఈ విధముగా అవుతాను, ఫలానాగా అవుతాను అని పిల్లలు కూడా భావిస్తారు. నేను వెళ్ళి కొత్త ప్రపంచములో దేవీ-దేవతగా అవుతానని ఇక్కడ కూడా భావిస్తారు. ఇదేమీ కొత్త విషయము కాదు. తండ్రి అయితే పదే-పదే - నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని అంటారు. ఈ మెట్లు ఎక్కాలి మరియు దిగాలి, జిన్ను భూతము కథ ఉంది కదా. ఆ భూతానికి మెట్లు ఎక్కడము-దిగడము అనే పని ఇవ్వడము జరిగింది. ఈ నాటకమే ఎక్కడము మరియు దిగడానికి సంబంధించినది. స్మృతియాత్రతో చాలా శక్తివంతముగా అవుతారు, అందుకే తండ్రి కూర్చుని పిల్లలకు రకరకాలుగా నేర్పిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఆత్మ అయిన మీరు పూర్తి 84 జన్మలు తీసుకుని తమోప్రధానముగా అయిపోయారు. భారతవాసులే సతో, రజో, తమోగా అవుతారు. పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారని ఇతర ఏ దేశాల వారిని అనరు. నాటకములో ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారికే ఉంటుందని తండ్రి వచ్చి తెలియజేశారు. ఆత్మ ఎంత చిన్ననిది. సైన్స్ వారికి ఇంత చిన్న ఆత్మలో ఇంత అవినాశీ పాత్ర నిండి ఉంది అన్నది అర్థమే కాదు. ఇది అన్నిటికంటే అద్భుతమైన విషయము. ఆత్మ ఎంత చిన్ననిది కానీ అది ఎంత గొప్ప పాత్రను అభినయిస్తుంది! అది కూడా అవినాశీ పాత్ర! ఈ డ్రామా కూడా అవినాశీ అయినది మరియు తయారై, తయారుచేయబడినది. ఇది ఎప్పుడు తయారయ్యింది అని ఎవ్వరూ అడగలేరు. అలా కాదు. ఇది ప్రాకృతికము. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది, ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ, ఎవ్వరూ చెప్పనే చెప్పలేరు. ఈ జ్ఞానాన్ని చెప్పగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు.

ఇప్పుడు పిల్లలకు తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. మా సమానముగా తయారుచేయడానికి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి మేము మా సోదరాత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నాము అన్న అభ్యాసమును ఇప్పుడు చేయండి, ఎందుకంటే ఆత్మలందరికీ హక్కు ఉంది. ఆత్మలందరికీ తమ-తమ సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారు. మనము రాజధానిలో ఉన్నప్పుడు మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. చివరిలో జయజయకారాలు జరుగుతాయి, ఇక్కడ సుఖమే సుఖముంటుంది, అందుకే తండ్రి అంటారు, పావనముగా అవ్వాలి. ఎంతెంతగా మీరు పవిత్రముగా అవుతారో, అంతగా ఆకర్షణ కలుగుతుంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా పవిత్రముగా అవుతారో, అప్పుడు సింహాసనాధికారులుగా అవుతారు. కావున ఈ అభ్యాసము చేయండి. కేవలం ఒక చెవితో విని మరో చెవితో వదిలేయడము అని ఇలా అనుకోకండి. అలా కాదు. ఈ ప్రాక్టీస్ లేకుండా మీరు నడవలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఎదుటివారు కూడా ఆత్మ, ఆ సోదరుడికి కూర్చొని అర్థం చేయించండి. దీనిని ఆధ్యాత్మిక ఆత్మిక జ్ఞానము అని అంటారని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆత్మిక తండ్రి. పిల్లలు ఎప్పుడైతే పూర్తిగా ఆధ్యాత్మికముగా అవుతారో, పూర్తిగా పవిత్రముగా అవుతారో, అప్పుడు వెళ్ళి సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. ఎవరైతే పవిత్రముగా అవ్వరో, వారు మాలలోకి కూడా రారు. మాలకు కూడా ఏదో అర్థముంటుంది కదా. మాల రహస్యము ఇతరులెవ్వరికీ తెలియదు. మాలను ఎందుకు స్మరిస్తారు? ఎందుకంటే ఆ ఆత్మలు తండ్రికి చాలానే సహాయము చేసారు, మరి ఎందుకు స్మరింపబడరు. మీరు స్మరింపబడతారు కూడా. మీ పూజ కూడా జరుగుతుంది మరియు మీ శరీరాన్ని కూడా పూజించడము జరుగుతుంది. నాకైతే కేవలం ఆత్మకే పూజించడము జరుగుతుంది. చూడండి, నా కంటే ఎక్కువగా మీరు డబల్ పూజింపబడతారు. మీరు దేవతలుగా అవుతారు కావున దేవతలను కూడా పూజిస్తారు, అందుకే మీరు పూజలోనూ ముందున్నారు, స్మృతిచిహ్నములోనూ ముందున్నారు మరియు రాజ్యాధికారములోనూ మీరు ముందున్నారు. మిమ్మల్ని ఎంత ఉన్నతముగా తయారుచేస్తున్నానో చూడండి. పిల్లలు చాలా ప్రియముగా ఉంటే, వారిపై ఎక్కువ ప్రేమ ఉంటే, వారిని భుజాలపైకి, తలపైకి కూడా ఎక్కించుకుంటారు. బాబా పూర్తిగా తలపైకి ఎక్కించుకుంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గాయన యోగ్యముగా మరియు పూజకు యోగ్యముగా అయ్యేందుకు ఆధ్యాత్మికముగా అవ్వాలి, ఆత్మను పవిత్రముగా తయారుచేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయాలి.

2. ‘మన్మనాభవ’ అభ్యాసము ద్వారా అపారమైన సంతోషములో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి, కళ్ళను పవిత్రముగా తయారుచేసుకోవాలి.

వరదానము:-
మాస్టర్ రచయిత స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనాన్ని అనుభవము చేసే సంపూర్ణ యోగీ భవ

మాస్టర్ రచయిత స్థితిలో స్థితులై ఉండటము ద్వారా అతి పెద్ద ఆపద కూడా ఒక మనోరంజకమైన దృశ్యముగా అనుభవమవుతుంది. ఏ విధముగా మహా వినాశన ఆపదను కూడా స్వర్గ ద్వారాలను తెరిచేందుకు సాధనముగా చెప్తారో, అలా ఏ విధమైన చిన్న, పెద్ద సమస్య అయినా లేక ఆపద అయినా మనోరంజక రూపముగా కనిపించాలి. ఆర్తనాదాలు చేయడానికి బదులుగా ఓహో అన్న పదము వెలువడాలి - దుఃఖము కూడా సుఖము రూపములో అనుభవమవ్వాలి. సుఖ-దుఃఖాల జ్ఞానము ఉంటూ కూడా వాటి ప్రభావములోకి రాకూడదు. సుఖమయమైన రోజులు వచ్చేందుకు ఈ దుఃఖాలు కూడా ఆధారమే అని భావించాలి - అప్పుడు సంపూర్ణ యోగి అని పిలవబడతారు.

స్లోగన్:-
హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పాలు చేయడము అనగా నేలపై కాలు మోపడము.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మలు చేస్తూ తనువు కూడా తేలికగా ఉండాలి, మనసు యొక్క స్థితి కూడా తేలికగా ఉండాలి. కర్మ యొక్క రిజల్టు మనసును లాగకూడదు. ఎంతెంతగా కార్యము పెరుగుతూ ఉంటుందో, అంతగానే తేలికతనము కూడా పెరుగుతూ ఉండాలి. కర్మలు తమవైపుకు ఆకర్షితము చెయ్యకూడదు కానీ యజమానిగా అయ్యి కర్మ చేయించేవారు చేయిస్తున్నారు మరియు చేసేవారు నిమిత్తముగా అయ్యి చేస్తున్నారు - ఈ అభ్యాసాన్ని పెంచినట్లయితే సంపన్నముగా, కర్మాతీతముగా సహజముగానే అయిపోతారు.