11-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైనపిల్లలూ - అందరికీ స్థిరమైన సుఖ-శాంతుల మార్గాన్ని తెలియజేయడము మీ బాధ్యత, శాంతిగా ఉండండి మరియు శాంతి యొక్క కానుకను ఇవ్వండి’’

ప్రశ్న:-
ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థము చేసుకునేందుకు అనంతమైన బుద్ధి కావాలి?

జవాబు:-
డ్రామాలో ఏ సీన్ ఏ సమయంలో జరగాలో, అది ఆ సమయంలోనే జరుగుతుంది. దీనికి ఏక్యురేట్ ఆయుష్షు ఉంది, తండ్రి కూడా తమ ఏక్యురేట్ సమయానికే వస్తారు, ఇందులో ఒక్క సెకెండు కూడా తేడా రాదు. పూర్తి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి వీరిలోకి ప్రవేశిస్తారు, ఈ గుహ్యమైన రహస్యాన్ని అర్థము చేసుకునేందుకు అనంతమైన బుద్ధి కావాలి.

పాట:-
ప్రపంచము మారినా మేము మారము...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు. పిల్లలకు శాంతిధామము మరియు సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఈ సమయంలో మనుష్యులందరూ విశ్వములో శాంతి కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కూడా కోరుకుంటారు మరియు విశ్వములో కూడా శాంతిని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ - మనసుకు శాంతి కావాలని అంటారు. ఇప్పుడు అది కూడా ఎక్కడి నుండి లభిస్తుంది. శాంతిసాగరుడు అయితే తండ్రి మాత్రమే, వారి నుండే వారసత్వము లభిస్తుంది. వ్యక్తిగతంగానూ లభిస్తుంది, అలాగే హోల్ సేల్ గానూ లభిస్తుంది అనగా అందరికీ లభిస్తుంది. ఏ పిల్లలైతే చదువుకుంటారో, వారు - మేము శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయము కూడా పురుషార్థము చేస్తాము మరియు ఇతరులకు కూడా మార్గాన్ని చెప్తాము అని అర్థము చేసుకోగలుగుతారు. వారసత్వము తీసుకునేందుకు ఎవరు వచ్చినా రాకపోయినా, విశ్వములో శాంతి అయితే ఏర్పడుతుంది. పిల్లలందరికీ శాంతిని అందించడము పిల్లల బాధ్యత. ఇద్దరు-ముగ్గురికి మాత్రమే వారసత్వము లభిస్తే లాభమేమిటి అని అనుకోకూడదు. కొందరికి మార్గాన్ని తెలియపర్చడము జరుగుతుంది కానీ నిశ్చయము లేని కారణంగా ఇతరులను తమ సమానంగా తయారుచేయలేకపోతారు. నిశ్చయబుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు - బాబా నుండి మాకు వరము లభిస్తుంది అని అర్థం చేసుకుంటారు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ అని కూడా వరదానాలను ఇస్తారు కదా. కేవలం అలా అనడం వలన ఆశీర్వాదాలు లభించవు. ఎవరైనా ఆశీర్వాదాలను అడిగితే, వారికి అర్థం చేయించడం జరుగుతుంది - మీకు శాంతి కావాలంటే ఇటువంటి పురుషార్థము చేయండి. కృషి చేసినట్లయితే అన్నీ లభిస్తాయి. భక్తి మార్గంలో ఎన్ని ఆశీర్వాదాలను తీసుకుంటారు. మేము సుఖముగా మరియు శాంతిగా ఉండాలి అని తల్లి, తండ్రి, టీచర్, గురువు మొదలైనవారిని కోరుకుంటారు. కానీ అలా ఉండలేరు ఎందుకంటే ఇంతమంది మనుష్యులున్నారు, వారికి సుఖ-శాంతులు ఎలా లభిస్తాయి. శాంతిదేవా అని కూడా గాయనం చేస్తారు. ఓ పరమపిత పరమాత్మ, మాకు శాంతిని కానుకగా ఇవ్వండి అని బుద్ధిలోకి వస్తుంది. వాస్తవానికి కానుక అనగా ఏదైనా వస్తువును ఎవరికైనా ఇవ్వడము వంటిది. ఇది మీ కానుక, బహుమతి అని అంటారు. తండ్రి అంటారు - ఎవరు ఎన్ని కానుకలు ఇచ్చినా కానీ, ధనము, ఇళ్ళు, వస్త్రాలు మొదలైనవాటన్నింటినీ ఇచ్చినా కానీ, ఆ దాన-పుణ్యాలు అల్పకాలము కొరకే. అవి మనుష్యులు, మనుష్యులకు ఇస్తారు. షావుకార్లు పేదవారికి లేదా షావుకార్లు షావుకార్లకు ఇస్తూ వచ్చారు. కానీ ఇది స్థిరమైన సుఖము మరియు శాంతి. ఇక్కడ ఎవరూ ఒక జన్మ కోసం కూడా సుఖ-శాంతులను ఇవ్వలేరు ఎందుకంటే వారి వద్ద లేనే లేవు. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని సుఖసాగరుడు, శాంతిసాగరుడు, పవిత్రతాసాగరుడు అని అంటారు. ఉన్నతోన్నతమైన భగవంతుని మహిమయే గాయనము చేయబడుతుంది. వారి నుండే శాంతి లభిస్తుందని భావిస్తారు. అయినా ఆ సాధు-సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్తారు ఎందుకంటే ఇది భక్తి మార్గము కదా, కావున వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అవన్నీ అల్పకాలిక పురుషార్థాలు. పిల్లలైన మీరు చేసినవి అవన్నీ ఇప్పుడు సమాప్తమైపోతాయి. అనంతమైన తండ్రి నుండి 100 శాతము పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వాన్ని పొందవచ్చు అని కూడా మీరు రాస్తారు. ఇక్కడ 100 శాతము అపవిత్రత, దుఃఖము, అశాంతి ఉన్నాయి. కానీ మనుష్యులు అర్థము చేసుకోరు. ఋషులు-మునులు మొదలైనవారైతే పవిత్రముగా ఉన్నారు అని అంటారు. కానీ వారి జన్మ విషము ద్వారానే జరుగుతుంది కదా. ఇదే ముఖ్యమైన విషయము. రావణ రాజ్యంలో పవిత్రత ఉండదు. పవిత్రత-సుఖము మొదలైనవాటన్నింటి సాగరుడు తండ్రి ఒక్కరే.

మనకు శివబాబా నుండి 21 జన్మలు అనగా అర్ధకల్పము, 2500 సంవత్సరాల కొరకు వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. ఇది గ్యారెంటీ. అర్ధకల్పము సుఖధామము, అర్ధకల్పము దుఃఖధామము ఉంటుంది. సృష్టిలో రెండు భాగాలు ఉన్నాయి - ఒకటి కొత్తది, మరొకటి పాతది. కానీ కొత్తదిగా ఎప్పుడు ఉంటుంది, పాతదిగా ఎప్పుడు అవుతుంది అనేది కూడా తెలియదు. వృక్షము యొక్క ఆయుష్షును అంత ఏక్యురేట్ గా చెప్పలేరు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ఈ వృక్షము గురించి తెలుసుకున్నారు. ఇది 5 వేల సంవత్సరాల పాత వృక్షము, దీని ఏక్యురేట్ ఆయుష్షు గురించి మీకు తెలుసు, ఇతర వృక్షాల ఆయుష్షు గురించి ఎవరికీ తెలియదు, సుమారుగా చెప్తారు. తుఫాను వచ్చి, వృక్షము పడిపోయిందంటే, దాని ఆయుష్షు పూర్తి అయిపోతుంది. మనుష్యులకు కూడా అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ అనంతమైన వృక్షము యొక్క ఆయుష్షు పూర్తిగా 5 వేల సంవత్సరాలు. ఇందులో ఒక్క రోజు కూడా తక్కువ-ఎక్కువ అయ్యే అవకాశము లేదు. ఇది తయారై-తయారుచేయబడిన వృక్షము. ఇందులో తేడా ఉండదు. డ్రామాలో ఏ సీన్ ఏ సమయంలో జరగాలో, అది ఆ సమయంలోనే జరుగుతుంది. యథావిధిగా రిపీట్ అవుతుంది. ఆయుష్షు కూడా ఏక్యురేట్ గా ఉంది. కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు తండ్రి కూడా రావలసి ఉంటుంది. వారు తమ ఏక్యురేట్ సమయానికి వస్తారు. అందులో ఒక్క సెకెండు కూడా తేడా ఉండదు. ఇప్పుడు మీ బుద్ధి అనంతమైనదిగా అయ్యింది. మీరే అర్థము చేసుకోగలరు. పూర్తి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి వీరిలోకి ప్రవేశిస్తారు, అందుకే శివరాత్రి అని అంటారు. కృష్ణుడు విషయంలోనైతే జన్మాష్టమి అని అంటారు. శివుని జన్మాష్టమి అని అనరు, శివుని రాత్రి అని అంటారు ఎందుకంటే ఒకవేళ జన్మ జరిగితే మళ్ళీ మృత్యువు కూడా సంభవించాలి. మనుష్యుల విషయంలో జన్మదినము అని అంటారు. శివుని విషయంలో ఎప్పుడూ శివరాత్రి అనే అంటారు. ప్రపంచములోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియవు. శివుని విషయంలో శివరాత్రి అని ఎందుకు అంటారు, జన్మాష్టమి అని ఎందుకు అనరు అనేది మీకు తెలుసు. వారి జన్మ దివ్యమైనది, అలౌకికమైనది, ఇంకెవ్వరికీ ఇటువంటి జన్మ జరగదు. శివబాబా ఎప్పుడు, ఎలా వస్తారు అనేది ఎవరికీ తెలియదు. శివరాత్రి అంటే అర్థమేమిటో మీకు మాత్రమే తెలుసు. ఇది అనంతమైన రాత్రి. భక్తి యొక్క రాత్రి పూర్తి అయి పగలు వస్తుంది. బ్రహ్మా రాత్రి మరియు పగలు అంటే అది బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది. ఇది కేవలం ఒక్క బ్రహ్మాకు సంబంధించిన ఆట మాత్రమే కాదు. ఇప్పుడు పగలు ప్రారంభమవుతుందని మీకు తెలుసు. చదువుకుంటూ-చదువుకుంటూ తమ ఇంటికి చేరుకుంటారు, మళ్ళీ పగలులోకి వస్తారు. అర్ధకల్పము పగలు మరియు అర్ధకల్పము రాత్రి అని గాయనం చేయబడుతుంది కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. వారు - కలియుగము ఆయుష్షు ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని, సత్యయుగం ఆయుష్షు లక్షల సంవత్సరాలని అంటారు, అప్పుడు సగం-సగం యొక్క లెక్క కుదరదు. కల్పము ఆయుష్షు గురించి ఎవరికీ తెలియదు. మీకు మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు. ప్రతి 5 వేల సంవత్సరాలకు ఈ సృష్టి తిరుగుతూ ఉంటుంది. విశ్వము అలాగే ఉంటుంది, అందులో పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ మనుష్యులు - ఈ రాకపోకలేమిటి అని విసిగిపోతారు. ఒకవేళ 84 లక్షల జన్మల రాకపోకలు అయ్యి ఉంటే ఇక ఏమైపోతుందో తెలియదు. తెలియని కారణంగా కల్పము ఆయుష్షును కూడా పెంచేసారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో చదువుకుంటున్నారు. మేము ప్రాక్టికల్ గా కూర్చున్నాము అని లోలోపల మీకు అనిపిస్తుంది. పురుషోత్తమ సంగమయుగము కూడా తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు కావున ఎంత పులకరించిపోవాలి. మీరే కల్ప-కల్పము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు అనగా మాయపై విజయాన్ని పొందుతారు, మళ్ళీ ఓడిపోతారు. ఇది అనంతమైన గెలుపు మరియు ఓటమి. ఆ రాజులకైతే ఎంతగానో గెలుపు-ఓటములు జరుగుతూ ఉంటాయి. అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చిన్న యుద్ధం జరిగితే, గెలిచాము అని అంటారు. ఏం గెలిచారు? చిన్న ముక్కను గెలుచుకున్నారు. పెద్ద యుద్ధములో ఓడిపోతే వారు తమ జెండాను కిందకు దించుతారు. మొట్టమొదట ఒక రాజు ఉంటారు, తర్వాత ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటారు. మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది, తర్వాత వేరే రాజులు రావడం మొదలుపెట్టారు. ఏ విధంగా పోప్ విషయంలో చూపిస్తారు, ప్రారంభంలో ఒకరే ఉండేవారు, తర్వాత నంబరువారుగా వేరే పోపులు కూడా వస్తూ ఉన్నారు. ఎవరి మృత్యువు ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు కదా.

పిల్లలైన మీకు తెలుసు - బాబా మనల్ని అమరులుగా చేస్తున్నారు. అమరపురికి యజమానులుగా చేస్తున్నారు, మరి ఎంత సంతోషముండాలి. ఇది మృత్యులోకము. అది అమరలోకము. ఈ విషయాలను కొత్తవారు ఎవరూ అర్థము చేసుకోలేరు. పాతవారికి కలిగే అంతటి ఆనందము కొత్తవారికి కలగదు. రోజు-రోజుకూ వృద్ధి చెందుతూ ఉంటారు. నిశ్చయము పక్కా అవుతూ ఉంటుంది. ఇందులో సహనశీలత కూడా ఎంతగానో ఉండాలి. ఇది ఆసురీ ప్రపంచము, దుఃఖాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేయరు. ఆత్మలైన మీరు అంటారు - ఇప్పుడు మేము బాబా శ్రీమతముపై నడుస్తున్నాము. మే ము సంగమయుగములో ఉన్నాము, మిగిలినవారంతా కలియుగములో ఉన్నారు. ఇప్పుడు మేము పురుషోత్తములుగా అవుతున్నాము. పురుషులలో ఉత్తమ పురుషులుగా చదువు ద్వారానే తయారవుతారు. చదువు ద్వారానే చీఫ్ జస్టిస్ మొదలైనవారిగా అవుతారు కదా. మీకు తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మీరు మీ పురుషార్థానుసారముగా పదవిని పొందుతారు. ఎవరెంత చదువుకుంటారో అంత గ్రేడ్ లభిస్తుంది. ఇందులో రాజ్యాధికారము యొక్క గ్రేడ్ ఉంది. ఆ చదువులో ఈ విధంగా రాజ్యాధికారము యొక్క గ్రేడ్ ఉండదు. మనము రాజులకే రాజులుగా అవుతున్నామని మీకు తెలుసు. మరి లోలోపల ఎంత సంతోషముండాలి. మనము డబల్ కిరీటధారులుగా, చాలా ఉన్నతంగా తయారవుతాము. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. నిరాకార తండ్రి ఎలా వచ్చి చదివిస్తారు అనేది ఎవరూ ఎప్పుడూ అర్థము చేసుకోలేరు. ఓ పతితపావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మనుష్యులు పిలుస్తారు కూడా. అయినా పావనంగా అవ్వరు. కామము మహాశత్రువు అని తండ్రి అంటారు. మీరు ఒకవైపు పతితపావనా రండి అని పిలుస్తారు, ఇప్పుడు నేను వచ్చి - పిల్లలూ, పతితత్వాన్ని వదిలిపెట్టండి అని చెప్తున్నాను, అయినా మీరెందుకు వదిలిపెట్టడం లేదు. తండ్రి మిమ్మల్ని పావనంగా చేస్తూ ఉన్నప్పుడు మీరు పతితులుగా అవుతూ ఉండడము అనేది జరగకూడదు. చాలామంది ఇలా పతితులుగా అవుతూ ఉంటారు. బాబా, ఈ పొరపాటు జరిగింది అని కొందరు సత్యము చెప్తారు. బాబా అంటారు - ఏదైనా పాప కర్మ జరిగినట్లయితే వెంటనే చెప్పండి. కొందరు సత్యము చెప్తారు, కొందరు అసత్యము చెప్తారు. ఎవరు అడుగుతారు? నేనేమీ ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చుని తెలుసుకోను, ఇలా జరగదు. నేను కేవలం సలహాలను ఇచ్చేందుకు మాత్రమే వస్తాను. పావనంగా అవ్వకపోతే మీకే నష్టము జరుగుతుంది. కృషి చేసి పావనులుగా అయ్యి, మళ్ళీ పతితులుగా అయినట్లయితే, చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. మేము స్వయంగా పతితులుగా అయ్యాము, మరి ఇతరులకు - పావనంగా అవ్వండి అని ఎలా చెప్పగలము అని సిగ్గుగా అనిపిస్తుంది. నేను ఆజ్ఞను ఎంతగా ఉల్లంఘించాను అని లోపల మనసు తింటుంది. ఇక్కడ మీరు తండ్రితో డైరెక్ట్ గా ప్రతిజ్ఞ చేస్తారు, బాబా మనల్ని సుఖధామానికి-శాంతిధామానికి యజమానులుగా చేస్తున్నారని మీకు తెలుసు. వారు హాజరై అంతా చూస్తున్నారు, మనము వారి సమ్ముఖంలో కూర్చుని ఉన్నాము. వీరిలో ఇంతకుముందు ఈ జ్ఞానము ఏమైనా ఉండేదా. జ్ఞానాన్ని ఇవ్వడానికి గురువు కూడా ఎవరూ లేరు. ఒకవేళ గురువు ఉన్నట్లయితే, వారేమైనా ఒక్కరికి మాత్రమే జ్ఞానాన్ని ఇస్తారా. గురువులకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కదా. ఒక్కరే ఉండరు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు కదా. సద్గురువు ఒక్కరే. వారు మనకు మార్గాన్ని తెలియజేస్తారు, మనము మళ్ళీ ఇతరులకు తెలియజేస్తాము. మీరు అందరికీ చెప్తారు - తండ్రిని స్మృతి చేయండి. అంతే, ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేస్తేనే ఉన్నత పదవి లభిస్తుంది. మీరు రాజులకే రాజులుగా అవుతారు. మీ వద్ద లెక్కలేనంత ధనము ఉంటుంది. మీరు మీ జోలెను నింపుకుంటారు కదా. బాబా మన జోలెను బాగా నింపుతున్నారని మీకు తెలుసు. కుబేరుని వద్ద చాలా ధనముండేదని అంటారు. వాస్తవానికి మీరు ప్రతి ఒక్కరూ కుబేరులే. మీకు వైకుంఠము రూపీ ఖజానా లభిస్తుంది. ఖుదా దోస్త్ కథ కూడా ఉంది. ఆ కథలో అతడిని ఎవరైతే మొట్టమొదట కలుస్తారో, వారికి ఒక రోజు కోసం రాజ్యాధికారాన్ని ఇచ్చేవారు. ఇవన్నీ ఉదాహరణలు. అల్లా అనగా తండ్రి, వారు అవల్దీన్ ను రచిస్తారు. ఆ తర్వాత సాక్షాత్కారము జరుగుతుంది. మనము తప్పకుండా యోగబలము ద్వారానే విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఆసురీ ప్రపంచములో చాలా-చాలా సహనశీలురుగా అయి ఉండాలి. ఎవరైనా నిందించినా, దుఃఖాన్ని ఇచ్చినా కూడా సహనము చేయాలి. తండ్రి శ్రీమతాన్ని ఎప్పుడూ వదలకూడదు.

2. డైరెక్ట్ గా తండ్రియే పావనముగా అవ్వాలని ఆజ్ఞాపించారు కావున ఎప్పుడూ పతితులుగా అవ్వకూడదు. ఎప్పుడైనా ఏదైనా పాపము జరిగినా, దానిని దాచిపెట్టకూడదు.

వరదానము:-
ఏకనామీ మరియు ఎకానమీ పాఠము ద్వారా అలజడిలో కూడా స్థిరమైనవారిగా-చలించనివారిగా కండి

సమయమనుసారంగా అశాంతి మరియు అలజడి యొక్క వాయుమండలము పెరుగుతూ ఉంది, ఇటువంటి సమయములో స్థిరమైనవారిగా-చలించనివారిగా ఉండేందుకు బుద్ధి లైన్ చాలా స్పష్టముగా ఉండాలి. దీని కొరకు సమయమనుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ పవర్ యొక్క అవసరముంది, దీనిని పెంచుకునేందుకు ఏకనామీ మరియు ఎకానమీ కలవారిగా అవ్వండి. ఏకనామీ మరియు ఎకానమీ చేసే పిల్లల లైన్ స్పష్టముగా ఉన్న కారణంగా బాప్ దాదా డైరెక్షన్లను సహజముగా క్యాచ్ చేసి అలజడిలో కూడా స్థిరమైనవారిగా-చలించనివారిగా ఉంటారు.

స్లోగన్:-
స్థూల-సూక్ష్మ కామనలను త్యజించండి, అప్పుడు ఏ విషయాన్ని అయినా ఎదుర్కోగలుగుతారు.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ఇప్పుడు మనసు యొక్క క్వాలిటీని పెంచుకున్నట్లయితే క్వాలిటీ ఆత్మలు సమీపముగా వస్తాయి. ఇందులో స్వ సేవ మరియు ఇతరుల సేవ, డబల్సేవ జరుగుతుంది. స్వయము కొరకు వేరుగా శ్రమించాల్సిన అవసరము ఉండదు. ప్రారబ్ధము ప్రాప్తించింది అన్న స్థితి అనుభవమవుతుంది. ఈ సమయములోని శ్రేష్ఠ ప్రారబ్ధము - ‘‘సదా స్వయము సర్వ ప్రాప్తులతో సంపన్నముగా ఉండటము మరియు సంపన్నముగా చెయ్యటము’’.