11-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సంగమయుగములో మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, మీరు ఇప్పుడు మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణముగా అనంతమైన సన్యాసము చేస్తారు?

జవాబు:-
మీకు డ్రామా గురించిన యథార్థ జ్ఞానముంది, డ్రామానుసారముగా ఇప్పుడు ఈ మృత్యులోకమంతా భస్మీభూతమవ్వనున్నది అని మీకు తెలుసు. ఇప్పుడీ ప్రపంచము పైసకు కొరగానిదిగా అయిపోయింది, మనము ఎంతో విలువైనవారిగా అవ్వాలి. ఇందులో ఏదైతే జరుగుతుందో, అది మళ్ళీ యథావిధిగా కల్పము తర్వాత రిపీట్ అవుతుంది, అందుకే మీరు ఈ పూర్తి ప్రపంచము నుండి అనంతమైన సన్యాసము చేసారు.

పాట:-
రాబోయే రేపటికి మీరు...

ఓంశాంతి
పిల్లలు పాటలోని లైన్ విన్నారు. రాబోయేది అమరలోకము. ఇది మృత్యులోకము. అమరలోకానికి మరియు మృత్యులోకానికి మధ్యన ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు తండ్రి సంగమయుగములో చదివిస్తారు, వారు ఆత్మలను చదివిస్తారు, అందుకే ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని పిల్లలకు చెప్తారు. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అన్న ఈ నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. మన లక్ష్యము-ఉద్దేశ్యము లక్ష్మీ-నారాయణులుగా అవ్వడము లేక మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వడము. ఇటువంటి చదువునైతే ఎప్పుడూ చెవుల ద్వారా విని ఉండరు. అలాగే - పిల్లలూ, మీరు ఆత్మాభిమానులై కూర్చోండి అని ఎవరూ చెప్పడము కూడా చూసి ఉండరు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని నిశ్చయము ఏర్పరచుకోండి. ఏ తండ్రి? అనంతమైన తండ్రి అయిన నిరాకార శివుడు. మనము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, తర్వాత మీరు దేవతలుగా అవ్వాలి. ఇంతకుముందు శూద్ర సాంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారు. తండ్రి వచ్చి రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా చేస్తారు. మొదట సతోప్రధాన పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతారు. సత్యయుగానికి యజమానులుగా ఉండేవారమని అనకూడదు, సత్యయుగములో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ-దిగుతూ సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వచ్చారు. మొదట సతోప్రధానముగా ఉన్నప్పుడు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, ఆ తర్వాత ఆత్మలో మాలిన్యము చేరుతుంది. మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. తండ్రి అంటారు - మీకు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. అంధవిశ్వాసములో ఉండేవారు. ఎవరి గురించైనా తెలుసుకోకుండా వారిని పూజించడాన్ని లేక స్మృతి చేయడాన్ని అంధవిశ్వాసమనే అంటారు. అలాగే తమ శ్రేష్ఠ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మలను కూడా మర్చిపోవడముతో కర్మ భ్రష్టులుగా, ధర్మ భ్రష్టులుగా అవుతారు. భారతవాసులు ఈ సమయములో దైవీ ధర్మము నుండి కూడా భ్రష్టులుగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి మీరు ప్రవృత్తి మార్గములోని వారు. ఆ దేవతలే అపవిత్రులుగా అయినప్పుడు వారిని దేవీ-దేవతలని అనలేరు, కావుననే పేరు మార్చి హిందు ధర్మమని పెట్టేసారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారముగానే జరుగుతుంది. ఓ పతిత-పావనా, రండి అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. వారొక్కరే గాడ్ ఫాదర్, వారు జనన మరణ రహితుడు. నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆత్మ మరియు పరమాత్మల రూపము చాలా సూక్ష్మమైనది, దానిని నక్షత్ర రూపము లేక బిందువని అంటారు. శివుడిని పూజిస్తారు, వారికి శరీరమైతే లేదు. ఇప్పుడు బిందువైన ఆత్మకు పూజ చేయలేము, అందుకే పూజించేందుకని రూపాన్ని పెద్దగా తయారుచేస్తారు. శివుడిని పూజిస్తున్నామని భావిస్తారు కానీ వారి రూపమేమిటి అన్నది తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి ఈ సమయములోనే వచ్చి అర్థం చేయిస్తున్నారు. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 లక్షల యోనులని తప్పుగా చెప్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవ్వాలి. కలియుగీ మనుష్యులు శూద్రులు. బ్రాహ్మణులైన మీ లక్ష్యము-ఉద్దేశ్యము మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము. ఈ మృత్యులోకము పతిత ప్రపంచము. ఎక్కడైతే ఈ దేవీ-దేవతలు రాజ్యము చేసేవారో, అది కొత్త ప్రపంచము. వీరి రాజ్యము ఒక్కటే ఉండేది. వీరు విశ్వమంతటికీ యజమానులుగా ఉండేవారు. ఇప్పుడైతే ఇది తమోప్రధాన ప్రపంచము. అనేక ధర్మాలు ఉన్నాయి. ఈ దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. దేవీ-దేవతల రాజ్యము ఎప్పుడు ఉండేది, అది ఎంతకాలం కొనసాగింది, ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికములను గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి మీకు అర్థం చేయిస్తారు. ఇది గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్శిటీ (భగవంతుడైన తండ్రి యొక్క విశ్వవిద్యాలయము), దీని లక్ష్యము-ఉద్దేశ్యము అమరలోకపు దేవతలుగా తయారుచేయడము. దీనిని అమరకథ అని కూడా అంటారు. మీరు ఈ జ్ఞానము ద్వారా దేవతలుగా అయి మృత్యువుపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ మృత్యువు కబళించలేదు. అక్కడ మరణించడము అన్న మాటే ఉండదు. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయము పొందుతున్నారు, డ్రామా ప్లాన్ అనుసారముగా. భారతవాసులు కూడా పంచవర్ష లేక దశవర్ష ప్రణాళికలు తయారుచేస్తారు కదా. మేము రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని వారు భావిస్తారు. అనంతమైన తండ్రి ప్లాన్ కూడా రామ రాజ్యాన్ని తయారుచేయాలి అన్నదే. వారంతా మనుష్యులు. మనుష్యులైతే రామ రాజ్యాన్ని స్థాపన చేయలేరు. రామ రాజ్యమని సత్యయుగాన్ని అనడము జరుగుతుంది. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు ఎంతగా భక్తి చేస్తారు, దైహిక యాత్రలు చేస్తారు. పగలు అనగా సత్య, త్రేతాయుగాలలో ఈ దేవతల రాజ్యముండేది. మళ్ళీ రాత్రివేళలో భక్తి మార్గము ప్రారంభమవుతుంది. సత్యయుగములో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము, వీటిని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వైరాగ్యము రెండు రకాలుగా ఉంటుంది - ఒకటి నివృత్తి మార్గానికి చెందిన హఠయోగులది, వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులకు వెళ్తారు. ఇప్పుడు మీరైతే మొత్తం మృత్యులోకాన్ని అనంతమైన సన్యాసము చేయాలి. తండ్రి అంటారు, ఈ ప్రపంచమంతా భస్మీభూతమవ్వనున్నది. డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా పేను వలె నెమ్మది-నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడేదైతే జరుగుతుందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల కల్పము తర్వాత యథావిధిగా రిపీట్ అవుతుంది. దీనిని చాలా బాగా అర్థం చేసుకుని అనంతమైన సన్యాసము చేయాలి. ఒకవేళ ఎవరైనా విదేశాలకు వెళ్తే, మేము ఈ జ్ఞానాన్ని అక్కడ చదవవచ్చా అని అడుగుతారు. తండ్రి అంటారు, అవును, దీనిని మీరు ఎక్కడ కూర్చునైనా చదవవచ్చు. ఇందులో మొదట 7 రోజుల కోర్స్ తీసుకోవలసి ఉంటుంది. ఇది చాలా సహజము, ఆత్మ కేవలం ఇది అర్థం చేసుకోవలసి ఉంటుంది - మనము సతోప్రధాన విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉండేవారము, ఇప్పుడు తమోప్రధానమైపోయాము, 84 జన్మలు తీసుకుని పూర్తిగా పైసకు కొరగానివారిగా అయిపోయాము, ఇప్పుడు మనము మళ్ళీ విలువైనవారిగా ఎలా అవ్వాలి? ఇప్పుడు ఇది కలియుగము, తప్పకుండా మళ్ళీ సత్యయుగము రానున్నది, తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తున్నారు. మనము సతోప్రధానము నుండి తమోప్రధానముగా ఎలా అయ్యాము అని 7 రోజుల కోర్సును అర్థం చేసుకోవాలి. కామ చితిపై కూర్చుని తమోప్రధానముగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితిపై కూర్చుని సతోప్రధానముగా అవ్వాలి. ప్రపంచ చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతుంది, చక్రము తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సంగమయుగము, మళ్ళీ సత్యయుగము రానున్నది. ఇప్పుడు మనము కలియుగీ వికారులుగా అయ్యాము, మళ్ళీ సత్యయుగీ నిర్వికారులుగా ఎలా అవ్వాలి? దాని కోసం తండ్రి మార్గాన్ని తెలియజేస్తున్నారు. మాలో ఏ గుణాలు లేవు, ఇప్పుడు మమ్మల్ని ఈ విధముగా గుణవంతులుగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. కల్పక్రితము ఎవరైతే తయారయ్యారో, వారే మళ్ళీ తయారయ్యేది ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొట్టమొదటైతే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు మాత్రమే మీకు దేహీ-అభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. అలాగని మీరు సదా దేహీ-అభిమానులుగా ఉంటారని కాదు. అలా కాదు. సత్యయుగములోనైతే శరీరాలకు పేర్లు ఉంటాయి. లక్ష్మీ-నారాయణుల పేర్లతోనే కార్య వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఇప్పుడిది సంగమయుగము, ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు వివస్త్రగా (అశరీరిగా) వచ్చారు, మళ్ళీ అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే పాపము భస్మమవుతుంది, దీనిని యోగాగ్ని అని అంటారు. స్మృతి అయితే మీరు ఎక్కడ ఉన్నా చేయవచ్చు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, మనము మెట్లు ఎలా దిగుతాము అన్నది 7 రోజులలో అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క జన్మలోనే ఎక్కే కళ ఏర్పడుతుంది. విదేశాలలో పిల్లలు ఉంటారు, అక్కడికి కూడా మురళి వెళ్తుంది. ఇది స్కూల్ కదా. వాస్తవానికి ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీ (ఈశ్వరీయ విశ్వవిద్యాలయము). ఇది గీతలో ప్రస్తావించిన రాజయోగము. కానీ శ్రీకృష్ణుడిని భగవంతుడని అనరు. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా కూడా తప్పకుండా ఇక్కడ ఉంటారు కదా. ప్రజాపిత అంటే మానవుడే కదా. ప్రజలు తప్పకుండా ఇక్కడే రచింపబడతారు. హమ్ సో యొక్క అర్థాన్ని తండ్రి చాలా సహజ రీతిలో అర్థం చేయించారు. భక్తి మార్గములోనైతే ఆత్మ అయిన మనమే పరమాత్మ అని అంటారు, కావుననే పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. తండ్రి అంటారు, అందరిలోనూ వ్యాపించి ఉన్నది ఆత్మ. నేను ఎలా వ్యాపించి ఉంటాను? మీరు నన్ను - ఓ పతిత పావనా రండి, మమ్మల్ని పావనముగా చేయండి అనే పిలుస్తారు. నిరాకార ఆత్మలన్నీ వచ్చి తమ-తమ రథాలు తీసుకుంటాయి. ఇది ప్రతి అకాలమూర్తి అయిన ఆత్మకు సింహాసనము. సింహాసనమని అనండి లేక రథమని అనండి. తండ్రికైతే రథము లేదు. వారిని నిరాకారుడు అనే మహిమ చేస్తారు. వారికి సూక్ష్మ శరీరమూ లేదు, స్థూల శరీరమూ లేదు. నిరాకారుడు స్వయంగా రథములో కూర్చున్నప్పుడే మాట్లాడగలరు. రథము లేకుండా పతితులను పావనముగా ఎలా తయారుచేస్తారు? తండ్రి అంటారు, నిరాకారుడినైన నేను వచ్చి వీరి శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. తాత్కాలికముగా అప్పుగా తీసుకున్నాను, వీరిని భాగ్యశాలి రథమని అంటారు. తండ్రియే సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను తెలిపి పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. ఇతర మనుష్యులెవ్వరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. ఈ సమయములో అందరూ నాస్తికులుగా ఉన్నారు. తండ్రి వచ్చి ఆస్తికులుగా తయారుచేస్తారు. రచయిత-రచనల రహస్యాన్ని తండ్రి మీకు తెలియజేశారు. ఇప్పుడు మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మీరే ఈ జ్ఞానము ద్వారా మళ్ళీ ఇంత ఉన్నతమైన ఈ పదవిని పొందుతారు. ఈ జ్ఞానము కేవలం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. తండ్రి సంగమములోనే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. వారంతా భక్తి మార్గములోని గురువులు. సద్గురువు ఒక్కరే. వారిని ‘‘వాహ్! సద్గురు వాహ్!’’ అని అంటారు. దీనిని పాఠశాల అని కూడా అంటారు. ఇక్కడ నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. అవన్నీ భక్తి మార్గములోని కథలు. గీత ద్వారా కూడా ఎటువంటి ప్రాప్తి లభించదు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని సమ్ముఖములోకి వచ్చి చదివిస్తాను, దీని ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రముగా అయ్యే విషయము. తండ్రి స్మృతిలో ఉండాలి. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ జ్ఞానము పిల్లలందరి వద్దకు వెళ్తుంది. ఎప్పుడూ మురళి మిస్ అవ్వకూడదు. మురళి మిస్ అయితే ఆబ్సెంట్ పడుతుంది. మురళి ద్వారా ఎక్కడ కూర్చున్నా సరే రిఫ్రెష్ అవుతూ ఉంటారు. శ్రీమతముపై నడవవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - బయటకు వెళ్ళినా సరే, పవిత్రముగా తప్పకుండా అవ్వాలి, వైష్ణవులై ఉండాలి. వైష్ణవులలో కూడా రెండు రకాలవారు ఉంటారు. ఒకటి వైష్ణవులలో, వల్లభాచారులు కూడా ఉంటారు కానీ వారు వికారాలలోకి వెళ్తారు. పవిత్రముగా అయితే ఉండరు. మీరు పవిత్రముగా అయి విష్ణు వంశీయులుగా అవుతారు. అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు, వికారాలలోకి వెళ్ళరు. అది అమరలోకము, ఇది మృత్యులోకము, ఇక్కడ వికారాలలోకి వెళ్తారు. ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు, అక్కడ వికారాలు ఉండవు. అది నిర్వికారీ ప్రపంచము. యోగబలముతో మీరు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. వారిరువురూ పరస్పరములో కొట్లాడుకుంటారు, మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అందరికీ ఇదే సందేశము ఇవ్వాలి. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. శివబాబాకు పిల్లలు కదా. కావున అందరికీ హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అందరికీ చెప్పాలి. తల్లిదండ్రులకు జ్ఞానముంటే శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు కూడా నేర్పిస్తారు. శివబాబాను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఒక్కరి స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. దీని కోసం చాలా బాగా చదువుకోవాలి. విదేశాలలో ఉంటూ కూడా మీరు చదువుకోవచ్చు. ఇందులో పుస్తకాలు మొదలైనవేవీ అవసరము లేదు. ఎక్కడ కూర్చున్నా మీరు చదువుకోవచ్చు. బుద్ధి ద్వారా స్మృతి చేయవచ్చు. ఈ చదువు అంత సహజమైనది. యోగముతో లేక స్మృతితో బలము లభిస్తుంది. మీరు ఇప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనముగా తయారుచేస్తారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఇందులో పథ్యము చాలా బాగా ఉండాలి. ఈ లక్ష్మీ-నారాయణుల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి కదా. అన్నపానాదుల విషయములో కూడా పథ్యము ఉండాలి, మరియు రెండవ విషయము - తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. దీనిని రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ రాజయోగమని అంటారు. ఒకవేళ రాజ్యము తీసుకోకపోతే పేదవారిగా అయిపోతారు. శ్రీమతముపై పూర్తిగా నడిచినట్లయితే శ్రేష్ఠముగా అవుతారు. భ్రష్టుల నుండి శ్రేష్ఠులుగా అవ్వాలి. దాని కోసం తండ్రిని స్మృతి చేయాలి. కల్పక్రితము కూడా మీరే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. సత్యయుగములో ఇతర రాజ్యమేదీ లేదు. దానిని సుఖధామమని అంటారు. ఇప్పుడిది దుఃఖధామము మరియు ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనము వచ్చామో, అది శాంతిధామము. ప్రపంచములోని మనుష్యులు ఏమేమి చేస్తూ ఉంటారు, శివబాబాకు ఆశ్చర్యమనిపిస్తుంది. తక్కువమంది పిల్లలు పుట్టాలి అన్నదానికి కూడా ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు. ఈ పని ఒక్క తండ్రిదేనని వారు అర్థం చేసుకోరు. తండ్రి వెంటనే ఏక ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన అనేక ధర్మాల వినాశనాన్ని ఒక్క వేటుతో చేసేస్తారు. వాళ్ళు జనన నియంత్రణ చేసేందుకు ఎన్ని మందులు మొదలైనవి కనుగొంటూ ఉంటారు. తండ్రి వద్దనైతే ఒకే మందు ఉంది. ఏక ధర్మ స్థాపన జరగనున్నది. వీరు పవిత్రముగా అవుతున్నారు అని అందరూ అనే సమయము వస్తుంది. అప్పుడు మందులు మొదలైనవాటి అవసరము కూడా ఏముంది. మీకు బాబా మన్మనాభవ అనే ఎటువంటి మందును ఇచ్చారంటే, దాని ద్వారా మీరు 21 జన్మల కోసం పవిత్రముగా అయిపోతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పవిత్రముగా అయి పక్కా వైష్ణవులుగా తయారవ్వాలి. అన్నపానాదుల విషయములో కూడా పూర్తి పథ్యముండాలి. శ్రేష్ఠముగా అయ్యేందుకు శ్రీమతముపై తప్పకుండా నడవాలి.

2. మురళి ద్వారా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి, ఎక్కడ ఉన్నా సతోప్రధానముగా అయ్యే పురుషార్థము చేయాలి. మురళిని ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు.

వరదానము:-
స్వ కళ్యాణము యొక్క ప్రత్యక్ష ఋజువు ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా సఫలతామూర్త భవ

ఏ విధముగానైతే ఈ రోజుల్లో శారీరక రోగాలలో హార్ట్ ఫెయిల్ ఎక్కువగా ఉందో అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో నిరాశ అనే రోగము ఎక్కువగా ఉంది. అటువంటి నిరాశ కలిగి ఉన్న ఆత్మలకు ప్రాక్టికల్ పరివర్తనను చూడటము ద్వారానే ధైర్యము మరియు శక్తి రాగలవు. వినటమైతే చాలానే విన్నారు కానీ ఇప్పుడు చూడాలని అనుకుంటున్నారు. ఒక ఉదాహరణను చూసి పరివర్తన అవ్వాలని కోరుకుంటున్నారు. కావున విశ్వ కళ్యాణము కొరకు స్వ కళ్యాణాన్ని ముందుగా శ్యాంపుల్ రూపములో చూపించండి. విశ్వ కళ్యాణము యొక్క సేవలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు సాధనమే ప్రత్యక్ష ఋజువు, దీని ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఏదైతే చెప్తారో అది మీ స్వరూపము ద్వారా ప్రాక్టికల్ గా చూపించాలి, అప్పుడు ఒప్పుకుంటారు.

స్లోగన్:-
ఇతరుల ఆలోచనలను తమ ఆలోచనలతో కలుపుకోవటము - ఇదే గౌరవాన్ని ఇవ్వడము.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మాతీతముగా అయ్యేందుకు చెక్ చేసుకోండి - ఎంతవరకు కర్మల బంధనము నుండి అతీతముగా అయ్యాను? లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధము, ఈ రెండింటిలో స్వార్థ భావము నుండి ఎంతవరకు ముక్తునిగా అయ్యాను? ఎప్పుడైతే కర్మల లెక్కాచారాల నుండి మరియు ఎటువంటి వ్యర్థ స్వభావ-సంస్కారాలకు వశమవ్వటము నుండి ముక్తులవుతారో, అప్పుడే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. ఏదైనా సేవ గాని, సంగఠన గాని, ప్రకృతి నుండి వచ్చే పరిస్థితులు గాని స్వ స్థితిని లేక శ్రేష్ఠ స్థితిని కింద-మీద చెయ్యకూడదు. ఈ బంధనము నుండి కూడా ముక్తులుగా ఉండటమే కర్మాతీత స్థితి యొక్క సమీపత.