12-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క దృష్టి లభించింది, అందుకే మీ భ్రమించడం ఆగిపోయింది, మీరు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారు’’

ప్రశ్న:-
దేవతలలో ఏ శక్తి ఉంది మరియు ఆ శక్తి ఏ విశేషత కారణముగా ఉంది?

జవాబు:-
దేవతలలో మొత్తం విశ్వముపై రాజ్యము చేసే శక్తి ఉంది. ఆ శక్తి విశేషముగా ఏక మతముపై నడుచుకోవడము (ఒకే డైరెక్షన్ పై నడుచుకోవడము) అనే విశేషత కారణముగా ఉంది. అక్కడ ఏక మతము ఉన్న కారణముగా మంత్రులు మొదలైనవారిని పెట్టుకోవలసిన అవసరం లేదు. దేవతలు సంగమములో తండ్రి నుండి ఎటువంటి శ్రీమతాన్ని తీసుకున్నారంటే, దాని ద్వారా 21 జన్మలు రాజ్యము చేస్తారు. అక్కడ ఒకే రాజుకు చెందిన ఒకే దైవీ కుటుంబము ఉంటుంది, వేరే మతమేదీ ఉండదు.

పాట:-
నయనహీనునికి దారి చూపించండి ప్రభూ...

ఓంశాంతి
పిల్లలకు నయనాలు లభించాయి, ఇంతకుముందు ఆ నయనాలు లేవు, అవి ఏ నయనాలు? జ్ఞానమనే నయనాలు ఇంతకుముందు లేవు, అప్పుడు అజ్ఞానమనే నయనాలైతే ఉండేవి. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే అని పిల్లలకు తెలుసు. ఇంకెవ్వరిలోనూ ఈ ఆత్మిక జ్ఞానము లేదు, ఈ జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది అనగా శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్తారు. సుఖధామము ఏ విధంగా పరివర్తన అయి మళ్ళీ మాయ రాజ్యముగా లేక దుఃఖధామముగా అవుతుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు దృష్టి లభించింది. నయనహీనునికి దారిని తెలియజేయండి అని పిలవడం మొదలుపెడతారు. భక్తి మార్గపు యజ్ఞాలు, దాన-పుణ్యాలు మొదలైనవాటితో శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే మార్గము లభించదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించవలసిందే. తండ్రి అంటారు, నాకు కూడా పాత్ర లభించింది. ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేయండి అని భక్తి మార్గములో పిలుస్తారు. దానికోసం ఎన్ని యజ్ఞ తపాదులు, దాన పుణ్యాదులు మొదలైనవి చేస్తారు, ఎంతగా భ్రమిస్తూ ఉంటారు! శాంతిధామము మరియు సుఖధామములో ఇలా భ్రమించడం ఉండదు. ఇది కూడా మీకే తెలుసు. వారికైతే కేవలం శాస్త్రాల చదువు మరియు దైహికమైన చదువు గురించే తెలుసు. ఈ ఆత్మిక తండ్రి గురించి అయితే అసలు వారికి ఏ మాత్రమూ తెలియదు. ఎప్పుడైతే సర్వుల సద్గతి జరగవలసి ఉంటుందో మరియు పాత ప్రపంచము మారవలసి ఉంటుందో, అప్పుడే ఆత్మిక తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. అప్పుడు మొత్తం సృష్టిపై ఒక్క దేవీ-దేవతల రాజ్యమే ఉంటుంది, దానినే స్వర్గము అని అంటారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము భారత్ లోనే ఉండేదని కూడా భారతవాసులకే తెలుసు. ఆ సమయములో ఇంకే ధర్మమూ లేదు. పిల్లలైన మీ కొరకు ఇప్పుడు ఇది సంగమయుగము. మిగిలినవారంతా కలియుగములో ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమయుగములో కూర్చుని ఉన్నారు. ఎవరెవరైతే తండ్రిని స్మృతి చేస్తారో, తండ్రి శ్రీమతముపై నడుస్తారో, వారు సంగమయుగములో ఉన్నారు, మిగిలినవారంతా కలియుగములో ఉన్నారు. ఇప్పుడు సామ్రాజ్యాలు లేక రాజ్యాలేవీ లేవు. అనేక మతాలతో (డైరెక్షన్లతో) రాజ్యము నడుస్తుంది. సత్యయుగములోనైతే ఒక్క మహారాజు మతమే నడుస్తుంది, అక్కడ మంత్రులు ఉండరు. మహారాజులో అంతటి శక్తి ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే పతితముగా అవుతారో, అప్పుడు మంత్రులు మొదలైనవారిని పెట్టుకుంటారు, ఎందుకంటే అప్పుడు ఆ శక్తి ఉండదు. ఇప్పుడు ఉన్నది ప్రజల రాజ్యమే. సత్యయుగములో ఒకే మతము ఉన్న కారణముగా శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ శక్తిని తీసుకుంటున్నారు, 21 జన్మలు స్వతంత్రముగా రాజ్యము చేస్తారు. మన దైవీ కుటుంబమే ఉంటుంది. ఇప్పుడు ఇది మీ ఈశ్వరీయ పరివారము. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు, ఒకవేళ దేహాభిమానములోకి వచ్చి మర్చిపోయినట్లయితే ఆసురీ పరివారానికి చెందినవారు. ఒక్క క్షణములో ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతారు, మళ్ళీ ఒక్క క్షణములో ఆసురీ సాంప్రదాయానికి చెందినవారిగా అయిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము ఎంత సహజము. కానీ పిల్లలకు కష్టమనిపిస్తుంది.

తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. దేహము ద్వారా కర్మలైతే చేయవలసిందే. దేహము లేకుండానైతే మీరు కర్మలు చేయలేరు. పనులన్నీ చేసుకుంటూ కూడా మేము తండ్రిని స్మృతి చేయాలి అని ప్రయత్నము చేయాలి. కానీ ఇక్కడైతే పని లేకపోయినా కూడా తండ్రిని స్మృతి చేయలేకపోతారు, మర్చిపోతారు. ఇదే శ్రమతో కూడినది. భక్తిలో రోజంతా భక్తి చేయండి అని ఏమీ చెప్పరు. దానికంటూ ఒక సమయము ఉంటుంది. ఉదయము, సాయంత్రము లేక రాత్రి చేస్తారు. ఇకపోతే మంత్రాలు మొదలైనవేవైతే లభిస్తాయో, అవి బుద్ధిలో ఉంటాయి. అనేకానేక శాస్త్రాలు ఉన్నాయి. వాటిని భక్తి మార్గములో చదువుతారు. మీరైతే పుస్తకాలు మొదలైనవేవీ చదవనవసరం లేదు, అలాగే తయారుచేయనవసరం లేదు. ఈ మురళీలు కూడా రిఫ్రెష్ అయ్యేందుకనే ముద్రించబడుతున్నాయి. ఇకపోతే పుస్తకాలు మొదలైనవేవీ మిగలవు. ఇవన్నీ అంతమైపోనున్నాయి. జ్ఞానము అనేది ఒక్క తండ్రిలోనే ఉంది. ఇప్పుడు చూడండి, జ్ఞాన-యోగాలను నేర్పిస్తారు అన్నట్లు జ్ఞాన, విజ్ఞాన భవనము అన్న పేరును పెట్టారు. అర్థం లేకుండా ఇటువంటి పేర్లను పెట్టేస్తారు. జ్ఞానము ఏమిటి, విజ్ఞానము ఏమిటి అనేదేమీ తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞానము మరియు విజ్ఞానము గురించి తెలుసు. యోగము ద్వారా ఆరోగ్యము లభిస్తుంది, దానిని విజ్ఞానము అని అంటారు మరియు ఇది జ్ఞానము, ఇందులో ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు అర్థం చేయించబడతాయి. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. కానీ ఆ చదువు హద్దులోనిది. ఇక్కడైతే మీకు అనంతమైన చరిత్ర-భౌగోళికాలు బుద్ధిలో ఉన్నాయి. మనము ఏ విధంగా రాజ్యము తీసుకుంటాము, ఎంత సమయము మరియు ఎప్పుడు రాజ్యము చేసేవారము, రాజధాని ఎలా లభించేది - ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోకీ రావు. తండ్రియే నాలెడ్జ్ ఫుల్. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది తండ్రియే అర్థం చేయిస్తారు. తయారై, తయారుచేయబడిన డ్రామా గురించి తెలియని కారణముగా మనుష్యులు - ఫలానావారు నిర్వాణము చెందారు, జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు.

మనుష్యమాత్రులందరూ ఈ సృష్టి చక్రములోకి వస్తారని, దీని నుండి ఏ ఒక్కరూ కూడా విముక్తులవ్వలేరని మీకు తెలుసు. మనుష్య ఆత్మ ఒక శరీరము వదిలి ఇంకొక శరీరము తీసుకుంటుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది ఎంత పెద్ద డ్రామా. అందరిలోనూ ఆత్మ ఉంది. ఆ ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. దీని గురించే ఏమంటారంటే - ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఇప్పుడు డ్రామా అని అంటున్నారంటే తప్పకుండా దాని సమయము కూడా ఉండాలి. ఈ డ్రామా 5000 సంవత్సరాలది అని తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి మార్గపు శాస్త్రాలలో డ్రామా లక్షల సంవత్సరాలది అని వ్రాసేశారు. తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించిన ఈ సమయము గురించే - కౌరవులు ఘోర అంధకారములో ఉండేవారు మరియు పాండవులు ప్రకాశములో ఉండేవారు అన్న గాయనము ఉంది. వారైతే కలియుగాంతానికి ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలున్నాయి అని భావిస్తారు. భగవంతుడు వచ్చారని, ఈ పాత ప్రపంచపు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని వారికి తెలియదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. యుద్ధము చూసినప్పుడు, ఇది మహాభారత యుద్ధానికి గుర్తు అని భావిస్తారు. ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. ఇక అలా నడుస్తూ, నడుస్తూ ఆగిపోతుంది. ఇప్పుడు మన పూర్తి స్థాపన ఇంకా జరగలేదని మీకు తెలుసు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించి ఇక్కడే రాజ్యాన్ని స్థాపన చేసారు అని గీతలో లేదు. గీతలోనైతే ప్రళయము చూపించారు. మిగిలినవారంతా మరణించినట్లుగా, కేవలం ఐదుగురు పాండవులు మిగిలినట్లుగా చూపిస్తారు. వారు కూడా పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయారు. కానీ రాజయోగము ద్వారా ఏమి జరిగింది అనేది ఏమీ తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. అది హద్దులోని విషయము, హద్దులోని రచనను హద్దు బ్రహ్మా రచిస్తారు, వారు పాలన కూడా చేస్తారు, కానీ ప్రళయమైతే చేయరు. స్త్రీని దత్తత తీసుకుంటారు. తండ్రి కూడా వచ్చి దత్తత తీసుకుంటారు. వారు అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించి పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తాను, ఇతని ద్వారా పిల్లలను రచిస్తాను. ఇక్కడ తండ్రి కూడా ఉన్నారు, ఫ్యామిలీ కూడా ఉంది, ఈ విషయాలు చాలా గుహ్యమైనవి, ఇవి చాలా గంభీరమైన విషయాలు. ఎవరి బుద్ధిలోనైనా కష్టం మీద కూర్చుంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు, మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మయే ఒక శరీరాన్ని వదలి ఇంకొకటి తీసుకుంటుంది. శరీరానికే భిన్న-భిన్న పేర్లు పెట్టడం జరుగుతుంది. నామ-రూపాలు, ముఖకవళికలు అన్నీ భిన్న-భిన్నముగా ఉంటాయి. ఒకరి ముఖకవళికలు ఇంకొకరితో కలవవు. ప్రతి ఆత్మకు జన్మజన్మాంతరాలు తమ-తమ ముఖకవళికలు ఉంటాయి, తమ పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది, అందుకే దీనిని తయారై, తయారుచేయబడిన డ్రామా అని అంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మరి మనం ఆ తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు. ఇదే శ్రమతో కూడుకున్న విషయము.

పిల్లలైన మీరు స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు మాయ తుఫానులు వస్తాయి, యుద్ధము జరుగుతుంది, వాటిని చూసి భయపడకూడదు. మాయ ఘడియ, ఘడియ స్మృతిని తెంచేస్తుంది. సంకల్ప, వికల్పాలు ఎటువంటివి వస్తాయంటే, అవి ఇక పూర్తిగా బుద్ధిని పాడు చేసేస్తాయి. మీరు కష్టపడండి. బాబా అర్థం చేయించారు, ఈ లక్ష్మీ-నారాయణుల కర్మేంద్రియాలు ఎలా వశమయ్యాయి. వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఈ శిక్షణ వీరికి ఎక్కడి నుండి లభించింది? ఇప్పుడు పిల్లలైన మీకు ఇలా తయారయ్యే శిక్షణ లభిస్తోంది. ఇందులో వికారాలేవీ ఉండవు. అక్కడ రావణ రాజ్యమే లేదు. చివరిలో రావణ రాజ్యము ఉంటుంది. రావణుడు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. డ్రామానుసారముగా ఇది కూడా నిశ్చితమై ఉంది. డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలియదు కావుననే నేతి, నేతి (మాకు తెలియదు, మాకు తెలియదు) అని అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు కదా. వీరి ముందు తల వంచుకునేవారు తమోప్రధానమైన కనిష్ఠ పురుషులు. తండ్రి అంటారు, మొట్టమొదట ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఏ విధంగా 8 గంటలు ప్రభుత్వ ఉద్యోగము ఉంటుంది కదా, అలా ఇప్పుడు మీరు అనంతమైన ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్నారు. మీరు తక్కువలో తక్కువ 8 గంటలు పురుషార్థము చేసి స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మీ అవస్థ ఎంత పక్కాగా అయిపోతుందంటే, దాని ద్వారా మీకు ఇక ఎవ్వరి స్మృతి కలగదు. తండ్రి స్మృతిలోనే శరీరము వదులుతారు. అప్పుడు వారే విజయమాలలోని మణులుగా అవుతారు. ఒక్క రాజుకు ఎంతమంది ప్రజలు ఉంటారు. ఇక్కడ కూడా ప్రజలు తయారవ్వనున్నారు. మీరు విజయమాలలోని మణులుగా, పూజ్యనీయులుగా అయ్యేందుకు యోగ్యులుగా అయ్యారు. 16,108 మాల కూడా ఉంటుంది. అది ఒక పెద్ద డబ్బాలో ఉంటుంది. 8 మణుల మాల కూడా ఉంటుంది, 108 మణులది కూడా ఉంటుంది, చివరిలో మళ్ళీ 16,108 మణులది కూడా తయారవుతుంది. పిల్లలైన మీరే తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుని మొత్తం విశ్వమంతటినీ స్వర్గముగా తయారుచేసారు, అందుకే మిమ్మల్ని పూజించడం జరుగుతుంది. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. నేను స్వయమూ మాలను తిప్పేవాడిని అని ఈ దాదా కూడా అంటారు. లక్ష్మీ-నారాయణుల మందిరములో వాస్తవానికి రుద్రమాల ఉండాలి. మీరు మొదట రుద్రమాలలోని మణులుగా అయి, ఆ తర్వాత రుండమాలలోకి వస్తారు. మొదటి నంబరు మాల రుద్రమాల, అందులో శివుడు కూడా ఉన్నారు. రుండమాలలోకి శివుడు ఎక్కడి నుండి వస్తారు. అది విష్ణుమాల. ఈ విషయాలను కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అంటారు - మేము వెళ్ళి శివబాబా కంఠహారముగా అవుతాము. బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదు. అసలు బ్రాహ్మణుల మాల ఉండదు. మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా అక్కడ కూడా సమీపముగా వచ్చి రాజ్యము చేస్తారు. ఈ చదువు ఇంకెక్కడా లభించజాలదు. ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని వదిలి స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. మొత్తం భారత్ అంతా స్వర్గవాసిగా అవుతుంది. విశేషముగా భారత ఖండమే స్వర్గముగా ఉండేది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము, లక్షల సంవత్సరాల విషయమేదీ ఉండదు. దేవతలు ఉండే 5000 సంవత్సరాలవుతోంది. స్వర్గాన్ని మనుష్యులు మర్చిపోయారు, అందుకే ఊరికే అలా ఏదో అనేస్తారు. అంతేకానీ అందులో ఏమీ లేదు. అంతటి పాత కాలము మొదలైనవేవీ లేవు. అక్కడ ఉన్నదే సూర్యవంశము మరియు చంద్రవంశము, ఆ తర్వాత ఇతర ధర్మాలవారు వస్తారు. పాత వస్తువులు ఎందుకు ఉపయోగపడతాయి. అయినా ఎంతగా కొనుగోలు చేస్తూ ఉంటారు. పాత వస్తువులకు ఎంతో విలువ కడతారు. అందరికన్నా విలువైనవారు శివబాబా, ఎన్ని శివలింగాలను తయారుచేస్తారు. ఆత్మ ఇంత చిన్నని బిందువు, ఇది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఆత్మది అతి సూక్ష్మ రూపము. ఇంత చిన్నని బిందువులో ఇంతటి పాత్ర నిశ్చితమై ఉందని తండ్రియే అర్థం చేయిస్తారు. ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ జ్ఞానము మీకు అక్కడ ఉండదు. ఇది కనుమరుగైపోతుంది. కావున అక్కడ మీకు సహజ రాజయోగాన్ని ఎవరైనా ఎలా నేర్పించగలరు. వీటన్నిటినీ భక్తి మార్గము కోసం కూర్చుని తయారుచేసారు. తండ్రి ద్వారా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, ఈ ధర్మాలు భవిష్య కొత్త ప్రపంచం కొరకు స్థాపన అవుతున్నాయని ఇప్పుడు పిల్లలకు తెలుసు. మీరు ఆ చదువునేదైతే చదువుతారో, అది కేవలం ఈ జన్మ కొరకే. దీని ప్రారబ్ధము మీకు కొత్త ప్రపంచములో లభించనున్నది. ఈ చదువు సంగమయుగములో ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. మనుష్యుల నుండి దేవతలుగానైతే తప్పకుండా సంగమయుగములోనే అయి ఉంటారు. తండ్రి పిల్లలకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. మీరు రోజంతా ఈ స్మృతిలో ఉండలేరని, అది అసంభవము అన్నది కూడా బాబాకు తెలుసు. అందుకే చార్టు పెట్టండి. మేము ఎంతవరకు స్మృతిలో ఉండగలుగుతున్నాము అన్నది చెక్ చేసుకోండి. దేహాభిమానము ఉన్నట్లయితే స్మృతి ఎలా ఉండగలదు! పాపాల భారము తలపై ఎంతగానో ఉంది, అందుకే బాబా అంటారు - స్మృతిలో ఉండండి. త్రిమూర్తి చిత్రాన్ని జేబులో పెట్టుకోండి. కానీ మీరు ఘడియ, ఘడియ మర్చిపోతున్నారు. భగవంతుడిని స్మృతి చేసినట్లయితే వారసత్వము మొదలైనవన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. బ్యాడ్జ్ అయితే సదా పెట్టుకునే ఉండాలి. లిటరేచర్ కూడా ఉండాలి, ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే వారికి ఇవ్వాలి. మంచి వ్యక్తులు ఎప్పుడూ ఉచితంగా తీసుకోరు, దీని ఖరీదెంత అని అడుగుతారు. మీరు ఇలా చెప్పండి - దీనిని పేదవారికైతే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, ఆపై ఎవరు ఎంత ఇస్తే అంత. రాయల్టీ ఉండాలి. మీ ఆచార, పద్ధతులు ప్రపంచముతో పోలిస్తే పూర్తిగా అతీతముగా ఉండాలి. రాయల్ వ్యక్తులు తమంతట తామే ఎంతోకొంత ఇచ్చేస్తారు. వీటిని మేము అందరి కళ్యాణము కోసం ఇస్తున్నాము అని అంటారు. కొందరు అయితే వీటిని చదివిన తర్వాత మీకు డబ్బు పంపిస్తారు. ఖర్చు అయితే మీరే పెడతారు కదా. మేము మా తనువు, మనస్సు, ధనమును భారత్ సేవలో ఖర్చు పెడతాము అని చెప్పండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అనంతమైన ప్రభుత్వానికి సహాయము చేయడానికి తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి. స్మృతిలో మాయ ఏ విఘ్నాలనైతే కలిగిస్తుందో వాటిని చూసి గాభరాపడకూడదు.

2. ఈ పురుషోత్తమ సంగమయుగములో ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా అయి ఈశ్వరుని మతముపై నడవాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి.

వరదానము:-
అంతర్ముఖతా గుహలో ఉంటూ దేహము నుండి అతీతులయ్యే దేహీ భవ

పాండవుల గుహలనేవైతే చూపిస్తారో - అవి ఈ అంతర్ముఖతా గుహలే, ఎంతగా దేహము నుండి అతీతులై, దేహీ రూపములో స్థితులయ్యే గుహలో ఉంటారో, అంతగా ప్రపంచపు వాతావరణము నుండి అతీతమైపోతారు, ఇక వాతావరణ ప్రభావములోకి రారు. గుహ లోపల ఉండటం వలన బయటి వాతావరణము నుండి ఏ విధంగా అతీతమవుతారో, అలా ఈ అంతర్ముఖతా గుహ కూడా అన్నింటి నుండి అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా చేస్తుంది మరియు ఎవరైతే తండ్రికి ప్రియమైనవారో, వారు స్వతహాగానే అన్నింటి నుండీ అతీతమవుతారు.

స్లోగన్:-
సాధన బీజము మరియు సాధనాలు దాని విస్తారము, విస్తారములో సాధనను దాగిపోనివ్వకండి.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

అంతర్ముఖులకు గుర్తు - సదా సాగరము యొక్క లోతులలో మైమరచి ఉండే గంభీర మూర్తులు. ముఖము ద్వారా ఆత్మిక స్థితి యొక్క గుర్తులు కనిపిస్తాయి. ఒకవైపేమో మనన చింతన చేసే ముఖము, మరొకవైపు రమణీకత అనగా చిరునవ్వుతో కూడిన ముఖము, ఈ రెండు లక్షణాలూ వారి ముఖము ద్వారా ప్రత్యక్షమవుతాయి. అంతర్ముఖులుగా ఉండేవారు సదా హర్షితముఖులుగా కనిపిస్తారు ఎందుకంటే మాయ వారిని ఎదిరించడమనేది సమాప్తమైపోతుంది.