14-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది, అందుకే ఇప్పుడు మీరు దేనివైపుకూ, ఎవరివైపుకూ ఆకర్షింపబడకూడదు’’

ప్రశ్న:-
ఎవరికైతే పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యము ఉంటుందో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తారు, నాదంటూ ఏదీ లేదు అని భావిస్తారు. బాబా, ఈ దేహము కూడా నాది కాదు. ఇది పాత దేహము, దీనిని కూడా వదిలివేయాలి. వారి మోహము అందరిపై నుండి తొలగిపోతూ ఉంటుంది, నష్టోమోహులుగా ఉంటారు. ఇక్కడిది ఏదీ పనికిరాదు, ఎందుకంటే ఇదంతా హద్దులోనిదే అని వారి బుద్ధిలో ఉంటుంది.

ఓంశాంతి
తండ్రి పిల్లలకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రపు ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, దీనిని ఇంకెవ్వరూ వినిపించలేరు. రాజయోగ వర్ణన ఉన్నది ఒక్క గీతలోనే. భగవంతుడు వచ్చి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. ఈ విషయము ఒక్క గీతలో తప్ప ఇంకే శాస్త్రములోనూ లేదు. ఇది కూడా తండ్రియే తెలియజేశారు. వారు అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను, ఈ జ్ఞానము పరంపరగా కొనసాగదు అని కూడా అర్థం చేయించాను. తండ్రి వచ్చి ఏక ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఏ శాస్త్రాలు మొదలైనవేవీ పరంపరగా కొనసాగవు. మిగిలిన ధర్మాలు స్థాపన చేయడానికి ధర్మ స్థాపకులు వచ్చినప్పుడు, ఆ సమయములో వినాశనమేమీ జరగదు కావున అంతా ఏమీ అంతమైపోదు. భక్తి మార్గపు శాస్త్రాలను చదువుతూనే వస్తారు. ఈ బ్రాహ్మణ ధర్మము యొక్క శాస్త్రము గీతయే, కానీ దానిని కూడా భక్తి మార్గములోనే తయారుచేస్తారు, ఎందుకంటే సత్యయుగములో ఎటువంటి శాస్త్రమూ ఉండదు. ఇతర ధర్మాల సమయములో వినాశనమేమీ జరగదు. మళ్ళీ కొత్తగా తయారయ్యేందుకు ఆ సమయములో పాత ప్రపంచమేమీ వినాశనమవ్వదు. అదే కొనసాగుతూ వస్తుంది. ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మనల్ని తండ్రి చదివిస్తున్నారు. గాయనము కూడా ఒక్క గీతకే ఉంది. గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. వేద జయంతి అంటూ ఏదీ లేదు. భగవంతుడు ఒక్కరే, కావున ఆ ఒక్కరి జయంతినే జరుపుకోవాలి. మిగిలినవారంతా రచన, వారి ద్వారా ఏమీ లభించదు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. పినతండ్రులు, మామయ్యలు మొదలైనవారి నుండి వారసత్వమేమీ లభించదు. ఇప్పుడు వీరు మీ అనంతమైన తండ్రి, వీరు అనంతమైన జ్ఞానాన్ని ఇస్తారు. వీరు శాస్త్రాలనేమీ వినిపించరు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి అనే అంటారు. వాటన్నింటి సారాన్ని మీకు అర్థం చేయిస్తాను. శాస్త్రాలు అనేవి చదువేమీ కాదు. చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. ఈ చదువును పిల్లలకు తండ్రి చదివిస్తున్నారు. పిల్లల కొరకు ఇది భగవానువాచ - మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. మేము తండ్రి నుండి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నాము అని పిల్లలకు తెలుసు. దీనిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ ముఖకమలము ద్వారా వినిపిస్తారు. ఇది భగవంతుడు అప్పుగా తీసుకున్న నోరు కదా, దీనిని గోముఖము అని కూడా అంటారు. వీరు పెద్ద తల్లి కదా. వీరి నోటి నుండి జ్ఞానము యొక్క మహావాక్యాలు వెలువడతాయి, అంతేకానీ జలము మొదలైనవి కావు. కానీ భక్తి మార్గములో గోముఖము నుండి జలము వెలువడినట్లుగా చూపించారు. భక్తి మార్గములో ఏమేమి చేస్తుంటారు అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. నీరు తాగేందుకని ఎంత దూరదూరాలలో ఉన్న గోముఖము మొదలైనచోట్లకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి కల్ప-కల్పమూ వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు చదివిస్తారనైతే మీకు తెలుసు. వారు ఎలా చదివిస్తున్నారు అనేది మీరు చూస్తున్నారు. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని మీరు అందరికీ చెప్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయని వారు అంటారు. సత్యయుగములో కొద్దిమంది మనుష్యులే ఉంటారని మీకు తెలుసు. కలియుగములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పిల్లల్లో దైవీ గుణాలు కనిపిస్తాయి, వారిలో క్రోధము యొక్క అంశము కూడా ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా క్రోధము వచ్చినట్లయితే వెంటనే బాబాకు వ్రాస్తారు - బాబా, ఈ రోజు మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, మేము క్రోధము చేసేసాము, వికర్మ చేసేసాము అని. తండ్రితో మీకు ఎంతటి కనెక్షన్ ఉంది. బాబా, క్షమించండి అని అంటారు. బాబా అంటారు, క్షమించడము మొదలైనవేవీ జరగవు. ఇకపోతే, మున్ముందు ఈ పొరపాటు చేయకండి. టీచర్ ఏమీ క్షమించరు. మీ మ్యానర్స్ సరిగ్గా లేవు అని రిజిస్టరు చూపిస్తారు. అలాగే అనంతమైన తండ్రి కూడా అంటారు - మీరు మీ మ్యానర్స్ చూసుకుంటున్నారా. ప్రతిరోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి - ఎవ్వరికీ దుఃఖమునివ్వలేదు కదా, ఎవ్వరినీ విసిగించలేదు కదా? దైవీ గుణాలను ధారణ చేయడానికి సమయమైతే పడుతుంది కదా. దేహాభిమానము ఎంతో కష్టం మీద తొలగుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని దేహీగా భావిస్తారో, అప్పుడే తండ్రి వైపుకు కూడా ప్రేమ వెళ్తుంది, లేదంటే దైహిక కర్మ బంధనాలలోనే బుద్ధి వేలాడుతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీరు శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి, అందులో నుండి సమయము తీయవచ్చు. భక్తి కోసం కూడా సమయము తీస్తారు కదా. మీరా శ్రీకృష్ణుని స్మృతిలోనే ఉండేవారు కదా. ఆమె పునర్జన్మలైతే ఇక్కడే తీసుకుంటూ వచ్చారు.

ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలుగుతుంది. ఈ పాత ప్రపంచములో ఇక పునర్జన్మలు తీసుకునేదే లేదు అని మీకు తెలుసు. అసలు ఈ ప్రపంచమే అంతమైపోతుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఏ విధంగా బాబాలో జ్ఞానము ఉందో, అలాగే పిల్లల్లో కూడా ఉంది. ఈ సృష్టి చక్రము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఉన్నతోన్నతుడు, పతిత-పావనుడైన తండ్రేనని, వారే మనల్ని చదివిస్తున్నారని ఈ విషయము బుద్ధిలో ఉన్నవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఇది కూడా మీకే తెలుసు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రము ఉంది. ఇప్పుడు ఈ నరకములో ఇది అంతిమ జన్మ అని మీకు స్మృతి ఉంటుంది, దీనిని రౌరవ నరకము అని అంటారు. ఇక్కడ ఎంతో అశుద్ధత ఉంది, అందుకే సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. కానీ అది దైహికమైన విషయము. మీరేమో బుద్ధి ద్వారా సన్యసిస్తారు, ఎందుకంటే మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. అందరినీ మర్చిపోవలసి ఉంటుంది. ఈ పాత ఛీ-ఛీ ప్రపంచము ఇక అంతమైపోయినట్లే ఉంది. ఇల్లు పాతబడినప్పుడు, కొత్తది మళ్ళీ తయారవుతూ ఉంటే, ఇప్పుడిక ఈ పాత ఇల్లు కూలిపోతుంది అని మనసులోకి వస్తుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు కదా. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది అని మీకు తెలుసు. ఇప్పుడు ఇంకొద్దిగా ఆలస్యము ఉంది. చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. కొత్త ఇల్లు ఇప్పుడు తయారవుతోంది, పాత ఇల్లు కూలిపోతూ ఉంది. ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి. మీ బుద్ధిలో ఈ అనంతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక మనకు ఈ పాత ప్రపంచము వైపుకు మనసు పోదు. ఇక ఇవేవీ చివరిలో పనికొచ్చేది లేదు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. తండ్రి కూడా అంటారు, పాత ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకండి. తండ్రినైన నన్ను మరియు ఇంటిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. నేను 84 జన్మలను అనుభవించాను కావున ఇప్పుడిక తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి అని ఆత్మకు చింత పట్టుకుంది. తండ్రి మతమనుసారముగా నడుచుకోవాలి, అప్పుడే శ్రేష్ఠ జీవితము తయారవుతుంది. తండ్రి ఉన్నతోన్నతమైనవారు. ఇది కూడా మీకే తెలుసు. తండ్రి మంచి రీతిలో స్మృతిని కలిగిస్తారు, ఆ అనంతమైన తండ్రియే జ్ఞానసాగరుడు, వారే వచ్చి చదివిస్తారు. తండ్రి అంటారు, ఈ చదువును కూడా చదవండి, అలాగే శరీర నిర్వహణార్థము కూడా అన్నీ చేయండి, కానీ ట్రస్టీలుగా అయి ఉండండి.

ఏ పిల్లలకైతే పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము ఉంటుందో, వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేసేస్తారు. నాదంటూ ఏదీ లేదు అని భావిస్తారు. బాబా, ఈ దేహము కూడా నాది కాదు. ఇది పాత దేహము, దీనిని కూడా వదిలివేయాలి. అందరి నుండి మోహము తొలగిపోతూ ఉంటుంది. నష్టోమోహులుగా అయిపోవాలి. ఇది అనంతమైన వైరాగ్యము. అది హద్దులోని వైరాగ్యము. మేము స్వర్గములోకి వెళ్ళి మా మహళ్ళను తయారుచేసుకుంటాము అని బుద్ధిలో ఉంది. ఇక్కడిది ఏదీ పనికిరాదు, ఎందుకంటే ఇదంతా హద్దులోనిదే. మీరు ఇప్పుడు హద్దులో నుండి బయటకు వచ్చి అనంతములోకి వెళ్తారు. మీ బుద్ధిలో ఈ అనంతమైన జ్ఞానమే ఉండాలి. ఇప్పుడు ఇక దేనివైపుకూ, ఎవరివైపుకూ ఆకర్షింపబడరు. ఇప్పుడిక మన ఇంటికి వెళ్ళాలి. కల్ప-కల్పమూ తండ్రి వచ్చి మనల్ని చదివించి తిరిగి తనతోపాటు తీసుకువెళ్తారు. మీ కొరకు ఇది కొత్త చదువేమీ కాదు. మనం కల్ప-కల్పమూ చదువుకుంటామని మీకు తెలుసు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మొత్తం ప్రపంచములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు, కానీ మీకేమైనా తెలుసా, మెల్లమెల్లగా ఈ బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారముగా స్థాపన జరగవలసిందే. మనది ఆత్మిక గవర్నమెంట్ అని పిల్లలకు తెలుసు. మనం దివ్యదృష్టి ద్వారా కొత్త ప్రపంచాన్ని చూస్తాము. ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. భగవంతుడు కూడా ఒక్కరే, వారే చదివించేవారు, రాజయోగాన్ని తండ్రియే నేర్పించారు. ఆ సమయములో యుద్ధము కూడా తప్పకుండా జరిగింది, అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన జరిగింది. మీరు కూడా వారే. కల్ప-కల్పమూ మీరే చదువుతూ వచ్చారు, వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ-తమ పురుషార్థము చేయాలి. ఇది అనంతమైన చదువు. ఈ శిక్షణను మనుష్యమాత్రులెవ్వరూ ఇవ్వలేరు.

తండ్రి శ్యామ-సుందరుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు మనం సుందరముగా అవుతూ ఉన్నామని మీరు కూడా భావిస్తారు. ఇంతకుముందు శ్యామముగా ఉండేవారు. శ్రీకృష్ణుడు ఒక్కరే అలా ఉండేవారని కాదు కదా. మొత్తం రాజధాని అంతా ఉండేది కదా. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇప్పుడు మీకు ఈ నరకము పట్ల అయిష్టము కలుగుతుంది. మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగములోకి వచ్చేశారు. ఎంతోమంది వస్తారు, కానీ వారిలో నుండి కూడా ఎవరైతే కల్పపూర్వము వెలువడ్డారో, వారే వెలువడుతారు. సంగమయుగాన్ని కూడా బాగా స్మృతి చేయాలి. మనం పురుషోత్తములుగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. నరకమేమిటి మరియు స్వర్గమేమిటి అనేది కూడా మనుష్యులు అర్థం చేసుకోరు. వారు ఏమనుకుంటారంటే - అంతా ఇక్కడే ఉంది, ఎవరైతే సుఖముగా ఉన్నారో వారు స్వర్గములో ఉన్నారు, ఎవరైతే దుఃఖితులుగా ఉన్నారో వారు నరకములో ఉన్నారు అని భావిస్తారు. అనేక మతాలు ఉన్నాయి కదా. ఒకే ఇల్లు అయినా కూడా అనేక మతాలు ఉంటాయి. పిల్లలు మొదలైనవారి పట్ల మోహము బంధము ఉంటుంది, అది తెగిపోదు. మోహానికి వశమై ఉన్న కారణముగా తాము ఎలా ఉంటున్నారు అనేది కూడా అర్థం చేసుకోరు. కొడుకుకు వివాహం చేయవచ్చా? అని అడుగుతారు. కానీ పిల్లలకు ఈ నియమము కూడా అర్థం చేయించబడింది. మీరు ఒకవైపు స్వర్గవాసులుగా అయ్యేందుకు జ్ఞానము తీసుకుంటున్నారు, ఇంకొకవైపు వారిని నరకములో వేయనా అని అడుగుతారా? మీరు అలా అడిగితే, చేయండి అనే బాబా అంటారు. బాబాను అడుగుతున్నారంటే, వారికి మోహం ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వద్దు అని చెప్పినా కూడా ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. కూతురికైతే చేయవలసే ఉంటుంది, లేదంటే సాంగత్య దోషములో పాడైపోతుంది. కొడుకులకు అలా చేయకూడదు. కానీ అందుకు ధైర్యము కావాలి కదా! బాబా ఇతని ద్వారా అలా చేయించారు కదా. ఇతడిని చూసి ఇక ఇతరులు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో కూడా ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇదంతా గొడవల ప్రపంచము, ఇది ముళ్ళ అడవి కదా. ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు. స్వర్గాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇది అడవి. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. ఏ ఒక్కరో వెలువడుతారు. ప్రదర్శనీలో సరే, సరే అని అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఒక చెవితో వింటారు, మళ్ళీ ఇంకొక చెవితో వదిలేస్తారు. రాజధానిని స్థాపన చేయడంలో సమయమైతే పడుతుంది కదా. మనుష్యులు తమను తాము ముళ్ళగా భావించరు. ఈ సమయములో ముఖము మనుష్యుల వలె ఉన్నా కానీ బుద్ధి కోతికన్నా హీనంగా ఉంది, కానీ స్వయాన్ని ఆ విధంగా భావించరు. కావున తండ్రి అంటారు - మీ రచనకు అర్థం చేయించాలి, ఒకవేళ అర్థం చేసుకోకపోతే వారిని బయటకు పంపివేయాలి, కానీ అంతటి శక్తి కావాలి కదా. మోహపు పురుగు ఎలా పట్టుకుని ఉంటుందంటే, అది తొలగదు. ఇక్కడైతే నష్టోమోహులుగా అవ్వాలి. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు తండ్రి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. పావనముగా అవ్వాలి. లేదంటే చాలా శిక్షలు అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇప్పుడు స్వయాన్ని సతోప్రధానముగా తయారుచేసుకునే చింతయే ఉంది. శివుని మందిరములోకి వెళ్ళి మీరు ఇలా అర్థం చేయించవచ్చు - భగవంతుడు భారత్ ను స్వర్గాధిపతిగా తయారుచేసారు, ఇప్పుడు వారు మళ్ళీ అలా తయారుచేస్తున్నారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని వారు చెప్తున్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అయి మీ సర్వస్వాన్నీ అర్పణ చేయాలి. నాదంటూ ఏదీ లేదు, ఈ దేహము కూడా నాది కాదు. దీని నుండి మోహాన్ని తెంచి నష్టోమోహులుగా అవ్వాలి.

2. ఎప్పుడూ కూడా రిజిస్టరుపై మచ్చ పడే విధంగా పొరపాటు ఏమీ చేయకూడదు. సర్వ దైవీ గుణాలనూ ధారణ చేయాలి, లోపల క్రోధము యొక్క కొద్దిపాటి అంశము కూడా ఉండకూడదు.

వరదానము:-
చెప్పటము, ఆలోచించటము మరియు చెయ్యటము - ఈ మూడింటినీ సమానముగా చేసే జ్ఞానీ ఆత్మా భవ

ఇప్పుడు వానప్రస్థ అవస్థలోకి వెళ్ళే సమయము సమీపముగా వస్తోంది - అందుకే బలహీనతల విషయములో నావి అన్న భావనను సమాప్తము చేసి మరియు వ్యర్థము యొక్క ఆటను సమాప్తము చేసి చెప్పటము, ఆలోచించటము మరియు చెయ్యటములను సమానము చెయ్యండి, అప్పుడే జ్ఞాన స్వరూపులు అని అంటారు. ఇటువంటి జ్ఞాన స్వరూప, జ్ఞానీ ఆత్మలెవరైతే ఉంటారో, వారి ప్రతి కర్మ, సంస్కారము, గుణము మరియు కర్తవ్యము సమర్థుడైన తండ్రి సమానముగా ఉంటాయి. వారు ఎప్పుడూ వ్యర్థము యొక్క విచిత్ర ఆటలను ఆడలేరు. సదా పరమాత్మ మిలనమనే ఆటలలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితో మిలనము జరుపుకుంటారు మరియు ఇతరులను తండ్రి సమానముగా తయారుచేస్తారు.

స్లోగన్:-
సేవల ఉల్లాసము చిన్న-చిన్న అనారోగ్యాలను మర్జ్ చేసేస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

అంతర్ముఖీ అనగా నోటి మౌనాన్ని మరియు మనసు మౌనాన్ని పెట్టుకునేవారు. నోటి మౌనాన్ని అయితే ప్రపంచములో కూడా పెట్టుకుంటారు, కానీ ఇక్కడ వ్యర్థ సంకల్పాల నుండి మనసు యొక్క మౌనము ఉండాలి. ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు, వ్యర్థము విషయములో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తారో, అలా మధ్యమధ్యలో ఒక రోజు మనసులోని వ్యర్థము యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యండి.