16-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఏ కర్మలనైతే చేస్తారో, వాటి ఫలము తప్పకుండా లభిస్తుంది, నిష్కామ సేవనైతే కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు’’

ప్రశ్న:-
ఈ క్లాస్ చాలా అద్భుతమైనది, ఎలా? ఇక్కడ ఏ ముఖ్యమైన కృషిని చేయవలసి ఉంటుంది?

జవాబు:-
ఈ ఒక్క క్లాస్ లో మాత్రమే చిన్న పిల్లలు కూడా కూర్చున్నారు, వృద్ధులు కూడా కూర్చున్నారు. ఈ క్లాస్ ఎంతటి అద్భుతమైనదంటే, ఇందులో అహల్యలు, కుబ్జలు, సాధువులు కూడా వచ్చి ఒకానొక రోజు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి విషయములోని కృషియే. స్మృతి ద్వారానే ఆత్మ మరియు శరీరము యొక్క నేచర్ క్యూర్ జరుగుతుంది, కానీ స్మృతి కోసం కూడా జ్ఞానము కావాలి.

పాట:-
రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక తండ్రి పిల్లలకు దీని అర్థాన్ని కూడా అర్థం చేయిస్తారు. విచిత్రమేమిటంటే గీత లేక శాస్త్రాలు మొదలైనవి తయారుచేసేవారికి దీని అర్థం తెలియదు. ప్రతి ఒక్క విషయానికి తప్పుడు అర్థాన్నే వివరిస్తారు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అయిన ఆత్మిక తండ్రి కూర్చుని దీని అర్థాన్ని తెలియజేస్తారు. రాజయోగాన్ని కూడా తండ్రియే నేర్పిస్తారు. ఇప్పుడు ‘మళ్ళీ’ రాజులకే రాజులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. వేరే స్కూళ్ళలో ఎవ్వరూ - మేము ‘మళ్ళీ’ బ్యారిస్టరుగా అవుతున్నామని ఈ విధముగా అనరు. ‘మళ్ళీ’ అన్న ఈ పదాన్ని వాడటము ఎవ్వరికీ రాదు. మేము 5 వేల సంవత్సరాల క్రితము వలె ‘మళ్ళీ’ అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నామని మీరు అంటారు. ఈ వినాశనము కూడా తప్పకుండా ‘మళ్ళీ’ జరగనున్నది. ఎంత పెద్ద-పెద్ద బాంబులను తయారుచేస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైనవి తయారుచేస్తారు. వాటిని అలా దాచిపెట్టుకునేందుకైతే తయారుచేయరు కదా. ఈ వినాశనము కూడా శుభకార్యము కోసమే కదా. పిల్లలైన మీరు భయపడవలసిన అవసరమేమీ లేదు. ఇది కళ్యాణకారీ యుద్ధము. తండ్రి వచ్చేదే కళ్యాణము చేయడము కోసము. తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా స్థాపనను, శంకరుని ద్వారా వినాశన కర్తవ్యాన్ని చేయిస్తారని కూడా అంటారు. కావున ఈ బాంబులు మొదలైనవి ఉన్నది వినాశనము కోసమే. వీటికన్నా పెద్దవి ఇంకేవీ లేవు. వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. వాటినేమీ ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు. ఈ ప్రాకృతిక వైపరీత్యాలు డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. ఎన్ని పెద్ద-పెద్ద బాంబులను తయారుచేస్తూ ఉంటారు. మేము పట్టణాలకు పట్టణాలనే అంతము చేసేస్తామని అంటారు. ఆ మధ్యన జపాన్ యుద్ధములో వేసిన బాంబులు అయితే చాలా చిన్నవి. ఇప్పుడైతే పెద్ద-పెద్ద బాంబులను తయారుచేసారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాలలో పడతారో, ఇక సహించలేకపోతారో, అప్పుడిక బాంబులు వేయడము మొదలుపెట్టేస్తారు. ఎంత నష్టము జరుగుతుంది. వారు కూడా ట్రయల్ వేసి చూస్తున్నారు. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. వీటిని తయారుచేసేవారి జీతము కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పాత ప్రపంచమే వినాశనమవ్వనున్నదని పిల్లలైన మీకు సంతోషముండాలి. పిల్లలైన మీరు కొత్త ప్రపంచము కొరకు పురుషార్థము చేస్తున్నారు. పాత ప్రపంచము తప్పకుండా అంతమవ్వనున్నదని వివేకము కూడా చెప్తుంది. కలియుగములో ఏముంది, సత్యయుగములో ఏముంటుంది అనేది పిల్లలు అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పుడు సంగమములో నిలబడి ఉన్నారు. సత్యయుగములో ఇంతమంది మనుష్యులు ఉండరు కావున వీటన్నింటి వినాశనము జరుగుతుందని మీకు తెలుసు. ఈ ప్రాకృతిక వైపరీత్యాలు కల్పక్రితము కూడా జరిగాయి. పాత ప్రపంచము సమాప్తమయ్యేదే ఉంది. ఇటువంటి వైపరీత్యాలు అయితే ఎన్నో జరుగుతూనే వచ్చాయి కానీ అవి తక్కువ పరిమితిలోనే జరిగేవి. ఇప్పుడైతే ఈ పాత ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. పిల్లలైన మీకైతే చాలా సంతోషముండాలి. ఆత్మిక పిల్లలైన మనకు తండ్రి అయిన పరమపిత పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఈ వినాశనము మీ కొరకే జరుగుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయింది అని గాయనము కూడా ఉంది. గీతలో ఉన్న ఎన్నో విషయాల యొక్క అర్థము చాలా బాగుంది, కానీ వాటి అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. వారు శాంతిని కోరుకుంటూ ఉంటారు. త్వరగా వినాశనమైతే మేము వెళ్ళి సుఖముగా ఉండవచ్చు అని మీరు అంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే సతోప్రధానము అవుతారో, అప్పుడు సుఖముగా ఉంటారు. తండ్రి అనేక రకాల పాయింట్లను ఇస్తూ ఉంటారు, అవి కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటాయి. వృద్ధ మాతలు - కేవలం శివబాబాను స్మృతి చేయాలి అని భావిస్తారు, అంతే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని వారికి అర్థం చేయించడము జరుగుతుంది. అయినా కూడా వారసత్వాన్ని అయితే పొందుతారు. వారు కలిసి తోడుగా ఉంటారు. ప్రదర్శనీలకు అందరూ వస్తారు. అజామిళ్ వంటి పాపాత్ములు, వేశ్యలు మొదలైనవారందరి ఉద్ధరణ జరగనున్నది. ఊడ్చేవారు కూడా మంచి వస్త్రాలను ధరించి వస్తుంటారు. గాంధీజీ అంటరానివారిని విముక్తులుగా చేసారు, వారితో కలిసి భోజనము కూడా చేస్తారు. బాబా అయితే అసలు నిరాకరించరు. వీరి ఉద్ధరణ కూడా చేయవలసిందేనని బాబా భావిస్తారు. వారు చేసే పనితో సంబంధమేమీ లేదు. ఇక్కడ మొత్తమంతా తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడముపైనే ఆధారపడి ఉంది. తండ్రిని స్మృతి చేయాలి. నేను అంటరానివాడిని అని ఆత్మ అంటుంది. మనము సతోప్రధాన దేవీ-దేవతలుగా ఉండేవారమని, ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ చివరి సమయానికి చేరుకుని పతితముగా అయ్యామని, ఇప్పుడు మళ్ళీ ఆత్మనైన నేను పావనముగా అవ్వాలని ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము. మీకు తెలుసు - సింధ్ లో ఒక కొండజాతి స్త్రీ వచ్చేవారు, ఆమె ధ్యానములోకి వెళ్ళేవారు, ఆమె పరుగెత్తుకుని వచ్చి కలుసుకునేవారు. ఆమెలో కూడా ఆత్మ అయితే ఉంది కదా అని అర్థం చేయించడము జరిగేది. తన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడమనేది ఆత్మ యొక్క హక్కు. ఆమెను జ్ఞానము తీసుకోనివ్వండి అని ఆమె ఇంటివారికి చెప్పడము జరిగింది కానీ వారు - మా వంశములో గొడవ జరిగిపోతుంది అని అన్నారు. భయముతో ఆమెను తీసుకువెళ్ళిపోయారు. అలా ఎందరో మీ వద్దకు కూడా వస్తారు, మీరు ఎవ్వరినీ నిరాకరించడానికి వీల్లేదు. అబలలు, వేశ్యలు, కొండజాతి స్త్రీలు, సాధువులు మొదలైనవారందరినీ ఉద్ధరిస్తారని అంటూ ఉంటారు. సాధువుల నుండి కొండజాతి స్త్రీల వరకు, అందరినీ ఉద్ధరిస్తారు.

పిల్లలైన మీరు ఇప్పుడు యజ్ఞ సేవను చేస్తారు, ఈ సేవతో చాలా ప్రాప్తి కలుగుతుంది. అనేకుల కళ్యాణము జరుగుతుంది. రోజురోజుకు ప్రదర్శనీ సేవ చాలా వృద్ధి చెందుతుంది. బాబా బ్యాడ్జీలు కూడా తయారుచేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జ్ పై ఈ విధముగా అర్థం చేయించాలి - వీరు తండ్రి, వీరు దాదా, ఇది తండ్రి ఇచ్చే వారసత్వము అని. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అన్నది గీతలో కూడా ఉంది. కేవలం అందులో నా పేరును తీసేసి కొడుకు పేరును పెట్టేసారు. రాధా-కృష్ణులకు పరస్పరములో ఏమి సంబంధము ఉంది అనేది భారతవాసులకు కూడా తెలియదు. వారి వివాహము మొదలైన చరిత్రను గురించి ఏమీ చెప్పరు. ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారు. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దీనిని ఒకవేళ అర్థం చేసుకుని ‘శివ భగవానువాచ’ అని అన్నట్లయితే, ఇక అందరూ వారిని తరిమేస్తారు. నీవు ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నావు? ఆ గురువు ఎవరు? అని అడుగుతారు. బి.కె.లు అని చెప్పారంటే అందరూ గొడవ చేస్తారు. ఈ గురువుల రాజ్యాలే సమాప్తమైపోతాయి. ఇటువంటివారు చాలామంది వస్తారు, వ్రాసి కూడా ఇస్తారు, మళ్ళీ మాయమైపోతారు.

తండ్రి పిల్లలకు ఏ కష్టము ఇవ్వరు. చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఎవరికైనా పిల్లలు లేకపోతే సంతానాన్ని ప్రసాదించండి అని భగవంతుడిని అడుగుతారు. సంతానము కలిగితే వారికి చాలా మంచి పాలన చేస్తారు, చదివిస్తారు. ఆ బిడ్డ పెద్దవారైన తర్వాత - ఇప్పుడిక నీ వ్యాపారము చేసుకో అని అంటారు. తండ్రి పిల్లలను పాలన చేసి వారిని యోగ్యులుగా తయారుచేస్తారు, కావున వారు పిల్లలకు సేవకుడైనట్లు కదా. ఈ తండ్రి అయితే పిల్లలకు సేవ చేసి తనతో పాటు తీసుకువెళ్తారు. కొడుకు పెద్దవాడై వ్యాపారములో నిమగ్నమైతే, ఇక మేము వృద్ధులమైనప్పుడు మా సేవ చేస్తాడు అని ఆ లౌకిక తండ్రి అనుకుంటారు. ఈ తండ్రి అయితే సేవ అడగరు. వీరు నిష్కాములు. ఎప్పటివరకైతే జీవించి ఉంటానో, అప్పటివరకు మమ్మల్ని సంభాళించడము పిల్లల బాధ్యత అని లౌకిక తండ్రి భావిస్తారు. ఈ కోరిక పెట్టుకుంటారు. ఈ తండ్రి అయితే అంటారు - నేను నిష్కామ సేవ చేస్తాను. నేను రాజ్యము చేయను. నేను ఎంతటి నిష్కాముడిని. మిగిలినవారు ఏం చేసినా వారికి దాని ఫలము తప్పకుండా లభిస్తుంది. వీరైతే అందరికీ తండ్రి. నేను పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇస్తానని అంటారు. మీరు ఎంతటి ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటారు. నేనైతే కేవలం బ్రహ్మాండానికే యజమానిని, ఆ మాటకొస్తే మీరు కూడా యజమానులే, కానీ మీరు రాజ్యాన్ని తీసుకుంటారు మరియు పోగొట్టుకుంటారు. నేను రాజ్యాన్ని తీసుకోను, పోగొట్టుకోను. నాకు డ్రామాలో ఈ పాత్ర ఉంది. పిల్లలైన మీరు సుఖము యొక్క వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థము చేస్తారు. మిగిలినవారంతా కేవలం శాంతిని కోరుకుంటారు. సుఖము కాకిరెట్టతో సమానమని ఆ గురువులు అంటారు, అందుకే వారు శాంతినే కోరుకుంటారు. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. వారికి సుఖము గురించి తెలియనే తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, శాంతి మరియు సుఖము యొక్క వారసత్వాన్ని ఇచ్చేది నేనొక్కడినే. సత్య, త్రేతాయుగాలలో గురువులు ఉండరు, అక్కడ రావణుడే లేడు. అది ఉన్నదే ఈశ్వరీయ రాజ్యము. ఈ డ్రామా తయారై ఉంది. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. కావున పిల్లలు బాగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందాలి. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. కొత్త ప్రపంచ రాజధాని స్థాపనవుతోందని మీకు తెలుసు. మీరు ఉన్నదే సంగమయుగములో. మిగిలినవారంతా కలియుగములో ఉన్నారు. వారు కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఘోర అంధకారములో ఉన్నారు కదా. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారని అంటారు కూడా. విజయమైతే పాండవులకే లభించిందని అంటూ ఉంటారు.

మీరు బ్రాహ్మణులు. యజ్ఞాన్ని బ్రాహ్మణులే రచిస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద అనంతమైన భారీ ఈశ్వరీయ రుద్ర యజ్ఞము. ఆ హద్దు యజ్ఞాలు అనేక రకాలవి ఉంటాయి. ఈ రుద్ర యజ్ఞము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్య, త్రేతాయుగాలలో ఇక ఎటువంటి యజ్ఞాలు ఉండవు ఎందుకంటే అక్కడ ఆపదలు మొదలైనవాటి విషయమేమీ లేదు. అవన్నీ హద్దు యజ్ఞాలు. ఇది అనంతమైనది. ఇది అనంతమైన తండ్రి ద్వారా రచింపబడిన యజ్ఞము, ఇందులో అనంతమైన ఆహుతి జరగనున్నది. ఇక తర్వాత అర్ధకల్పము ఎటువంటి యజ్ఞాలు ఉండవు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యము ప్రారంభమవ్వడముతో ఇక మిగిలినవన్నీ ప్రారంభమైపోతాయి. అనంతమైన యజ్ఞము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, అందులో ఈ పాత సృష్టి అంతా స్వాహా అయిపోతుంది. ఇది అనంతమైన రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో ముఖ్యమైనవి జ్ఞానము మరియు యోగము విషయాలు. యోగము అనగా స్మృతి. స్మృతి అనే పదము చాలా మధురమైనది. యోగమనే పదము సామాన్యమైపోయింది. యోగము యొక్క అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. యోగము అంటే తండ్రిని స్మృతి చేయడము అని మీరు అర్థం చేయించవచ్చు. బాబా, మీరైతే మాకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆత్మ అంటుంది - బాబా, మీరు మళ్ళీ వచ్చారు. మేమైతే మిమ్మల్ని మర్చిపోయాము. మీరు మాకు రాజ్యాధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. మీ శ్రీమతముపై మేము తప్పకుండా నడుచుకుంటాము. ఈ విధముగా లోలోపల మీతో మీరే మాట్లాడుకోవలసి ఉంటుంది. బాబా, మీరైతే మాకు చాలా మంచి మార్గాన్ని తెలియజేస్తున్నారు. మేము కల్ప-కల్పము మర్చిపోతాము. ఇప్పుడు తండ్రి మళ్ళీ తప్పులు చేయని వారిగా తయారుచేస్తున్నారు, అందుకే ఇప్పుడు తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వారసత్వము లభిస్తుంది. నేను ఎప్పుడైతే సమ్ముఖములోకి వస్తానో, అప్పుడు మీకు అర్థం చేయిస్తాను. అప్పటివరకు మీరు దుఃఖహర్త, సుఖకర్త అని పాడుతూ ఉంటారు. మహిమ పాడుతారు కానీ ఆత్మ గురించి గాని, పరమాత్మ గురించి గాని తెలియదు. ఇంత చిన్నని బిందువులో అవినాశీ పాత్ర నిశ్చితమై ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. వారిని పరమపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ అని అంటారు. అంతేకానీ వేలాది సూర్యుల వలె పెద్దగా ఏమీ ఉండరు. నేను టీచర్ వలె చదివిస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఈ క్లాస్ ఎంత అద్భుతముగా ఉందో చూడండి. ఇక్కడ ఎవరెవరు చదువుకుంటున్నారు? అబలలు, కుబ్జలు, సాధువులు కూడా ఒకానొక రోజు వచ్చి కూర్చుంటారు. వృద్ధ మాతలు, చిన్న పిల్లలు మొదలైనవారందరూ కూర్చున్నారు. ఇటువంటి స్కూల్ ను ఎప్పుడైనా చూసారా. ఇక్కడ స్మృతి విషయములో కృషి చేయవలసి ఉంటుంది. ఈ స్మృతియే సమయము తీసుకుంటుంది. స్మృతి యొక్క పురుషార్థము చేయడము - ఇది కూడా జ్ఞానమే కదా. స్మృతి కొరకు కూడా జ్ఞానము ఉంది, చక్రాన్ని అర్థం చేయించడానికి కూడా జ్ఞానము ఉంది. దీనిని న్యాచురల్, సత్యాతి-సత్యమైన నేచర్ క్యూర్ (ప్రకృతి వైద్యము) అని అంటారు. మీ ఆత్మ పూర్తిగా పవిత్రముగా అయిపోతుంది. అక్కడ శరీరానికి వైద్యము జరుగుతుంది. ఇది ఆత్మకు వైద్యము. ఆత్మలోనే మాలిన్యము చేరుతుంది. సత్యమైన బంగారముతో సత్యమైన ఆభరణము తయారవుతుంది. శివబాబా సమ్ముఖముగా వచ్చి ఉన్నారని ఇప్పుడు ఇక్కడ పిల్లలకు తెలుసు. పిల్లలు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. మనము ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ తీరము నుండి ఆవలి తీరానికి వెళ్ళాలి. తండ్రిని, వారసత్వాన్ని మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి. అది స్వీట్ సైలెన్స్ హోమ్. దుఃఖమనేది అశాంతి వలన కలుగుతుంది, శాంతితో సుఖము కలుగుతుంది. సత్యయుగములో సుఖము, శాంతి, సంపద అన్నీ ఉన్నాయి. అక్కడ గొడవలు, కొట్లాటల విషయమే ఉండదు. పిల్లలకు ఇదే చింత ఉండాలి - మేము సతోప్రధానముగా, సత్యమైన బంగారముగా అవ్వాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందుతాము. ఈ ఆత్మిక భోజనము లభిస్తుంది, దీనిని నెమరువేయాలి... ఈ రోజు ఏయే ముఖ్యమైన పాయింట్లు విన్నాను అని నెమరువేయాలి. యాత్రలు రెండు ఉంటాయి, ఆత్మిక యాత్ర మరియు దైహిక యాత్ర, అని ఇది కూడా అర్థం చేయించారు. ఈ ఆత్మిక యాత్రయే ఉపయోగపడుతుంది. భగవానువాచ - మన్మనాభవ. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ వినాశనము కూడా శుభ కార్యము కొరకే జరుగుతుంది, అందుకే భయపడకూడదు, కళ్యాణకారీ తండ్రి సదా కళ్యాణ కార్యాలనే చేయిస్తారు, ఈ స్మృతితో సదా సంతోషముగా ఉండాలి.

2. సతోప్రధానమైన, సత్యమైన బంగారముగా అయి ఉన్నత పదవిని పొందాలి అని సదా ఒక్క చింతనే ఉంచుకోవాలి. ఆత్మిక భోజనమేదైతే లభిస్తుందో, దానిని నెమరువేయాలి.

వరదానము:-
స్వయాన్ని బాధ్యతాయుతముగా భావిస్తూ ప్రతి కర్మను యథార్థ విధితో చేసే సంపూర్ణ సిద్ధి స్వరూప భవ

ఈ సమయములో సంగమయుగీ శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ప్రతి శ్రేష్ఠ కర్మ మొత్తము కల్పము కొరకు చట్టముగా, శాసనముగా అవుతోంది. కావున స్వయాన్ని ఆ శాసనము యొక్క రచయితగా భావిస్తూ ప్రతి కర్మను చేయండి, దాని ద్వారా నిర్లక్ష్యము స్వతహాగా సమాప్తమైపోతుంది. సంగమయుగములో మనము శాసనము యొక్క రచయితలము, బాధ్యతాయుతమైన ఆత్మలము - ఈ నిశ్చయముతో ప్రతి కర్మను చేసినట్లయితే యథార్థ విధి ద్వారా చేసిన కర్మలకు సంపూర్ణ సిద్ధి తప్పకుండా లభిస్తుంది.

స్లోగన్:-
సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నట్లయితే మాయ పేపర్ టైగర్ గా అయిపోతుంది.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

సదా జీవన్ముక్తులుగా ఉండేందుకు సహజ సాధనము - ‘‘నేను’’ మరియు ‘‘నా బాబా’’! ఎందుకంటే నాది-నాది అన్నదాని యొక్క బంధనమే ఉంది. వారు నా బాబా అయిపోయిన తర్వాత ఇక నావి అన్న మిగిలినవన్నీ సమాప్తము. ఎప్పుడైతే ‘‘ఒక్క నాది’’ వలన ‘నావి-నావి’ అన్న మిగిలినవన్నీ సమాప్తమైపోతాయో, అప్పుడు బంధనముక్తులుగా అయిపోయినట్లే. కనుక బ్రాహ్మణులమైన మనము జీవన్ముక్త ఆత్మలము అన్నదానినే గుర్తుంచుకోండి.