20-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పిల్లలైన మీకు సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు, మీ స్వధర్మమే శాంతి, అందుకే మీరు శాంతి కొరకు భ్రమించరు’’

ప్రశ్న:-
ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల కొరకు తరగని ఖజానాలతో తూకము వేసేందుకు యోగ్యులుగా అవుతారు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే కొత్త సృష్టిని రచిస్తారో, అప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు. మీ సర్వస్వాన్ని వారి కార్యములో సఫలము చేస్తారు, అందుకే తండ్రి దానికి రిటర్న్ లో 21 జన్మల కొరకు మిమ్మల్ని తరగని ఖాజానాలతో ఎలా తూకము వేస్తారంటే ఇక ఎప్పటికీ ఆ ధనము తరగదు, దుఃఖము కూడా కలగదు, అకాల మృత్యువు కూడా జరగదు.

పాట:-
నాకు ఆధారాన్ని ఇచ్చేవారు...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ‘‘ఓం’’ యొక్క అర్థాన్ని అయితే వినిపించాము. కొంతమంది కేవలం ఓం అని అంటారు కానీ ఓం శాంతి అని అనాలి. కేవలం ఓం అని అంటే దాని అర్థము ఓం ఆత్మ. ఓం శాంతి యొక్క అర్థము నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నేను ఆత్మను, ఇది నా శరీరము. మొదట ఆత్మ, ఆ తర్వాత శరీరము. ఆత్మ శాంతి స్వరూపము, ఆత్మ యొక్క నివాస స్థానము శాంతిధామము. అంతేకానీ అడవులకు వెళ్ళడముతో సత్యమైన శాంతి లభించదు. సత్యమైన శాంతి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే లభిస్తుంది. రెండవది - ఎక్కడైతే అశాంతి ఉంటుందో, అక్కడ శాంతి కావాలి అని కోరుకుంటారు. అశాంతిగా ఉన్న ఈ దుఃఖధామము వినాశనమైపోతుంది, ఆ తర్వాత శాంతి ఏర్పడుతుంది. పిల్లలైన మీకు శాంతి యొక్క వారసత్వము లభిస్తుంది. అక్కడ ఇంట్లో గాని, బయట రాజధానిలో గాని అశాంతి ఉండదు. దానిని శాంతి రాజ్యమని అంటారు, ఇక్కడ ఉన్నది అశాంతి రాజ్యము ఎందుకంటే ఇది రావణ రాజ్యము. అది ఈశ్వరుని ద్వారా స్థాపించబడిన రాజ్యము. మళ్ళీ ద్వాపరము తర్వాత ఆసురీ రాజ్యము ఉంటుంది, అసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు. ఇంట్లో, దుకాణములో ఎక్కడ చూస్తే అక్కడ అశాంతియే అశాంతి ఉంటుంది. 5 వికారాల రూపీ రావణుడు అశాంతిని వ్యాపింపజేస్తాడు. రావణుడు అంటే ఏమిటి అన్నది విద్వాంసులు, పండితులు మొదలైనవారికెవ్వరికీ తెలియదు. మేము రావణుడిని ప్రతి సంవత్సరము ఎందుకు హతమారుస్తున్నాము అన్నది అర్థం చేసుకోరు. సత్య-త్రేతాయుగాలలో ఈ రావణుడు ఉండనే ఉండడు. అది ఉన్నదే దైవీ రాజ్యము. ఈశ్వరుడైన బాబా మీ ద్వారా దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. వారొక్కరే అయితే చేయరు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఈశ్వరునికి సహాయకులు. ఇంతకుముందు రావణుడికి సహాయకులుగా ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి సర్వుల సద్గతిని చేస్తున్నారు. పవిత్రత, సుఖ-శాంతులను స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. సత్య-త్రేతాయుగాలలో దుఃఖమనే మాటే ఉండదు. అక్కడ ఎవ్వరూ నిందించరు, అశుద్ధమైన పదార్థాలను తినరు. ఇక్కడైతే ఎంత అశుద్ధమైన పదార్థాలను తింటారో చూడండి. శ్రీకృష్ణునికి ఆవులు చాలా ప్రియముగా అనిపించేవి అని చూపిస్తారు. అలాగని శ్రీకృష్ణుడు గోవుల కాపరి, గోవులను చూసుకునేవారు అని కాదు. అలా కాదు. అక్కడి ఆవులకు, ఇక్కడి ఆవులకు చాలా, చాలా తేడా ఉంటుంది. అక్కడి ఆవులు సతోప్రధానముగా, చాలా సుందరముగా ఉంటాయి. దేవతలు ఏ విధముగా సుందరముగా ఉంటారో, ఆవులు కూడా ఆ విధముగా ఉంటాయి. వాటిని చూడటముతోనే మనసుకు సంతోషము కలుగుతుంది. అది ఉన్నదే స్వర్గము. ఇది నరకము. అందరూ స్వర్గాన్ని తలచుకుంటారు. స్వర్గానికి, నరకానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. రాత్రి అనగా అంధకారము, పగలులో ప్రకాశము ఉంటుంది. బ్రహ్మా యొక్క పగలు అనగా బ్రహ్మా వంశీయులకు కూడా పగలు. మొదట మీరు కూడా ఘోర అంధకారమయమైన రాత్రిలో ఉండేవారు. ఈ సమయములో భక్తి యొక్క తీవ్రత ఎంతగా ఉంది, మహాత్ములు మొదలైనవారిని బంగారముతో తూకము వేస్తూ ఉంటారు, ఎందుకంటే వారు శాస్త్రాలలో గొప్ప విద్వాంసులు. వారి ప్రభావము ఇంత ఎక్కువగా ఎందుకుంది? ఇది కూడా బాబా అర్థం చేయించారు. వృక్షములో కొత్త-కొత్త ఆకులు వచ్చినప్పుడు అవి సతోప్రధానముగా ఉంటాయి. పై నుండి కొత్త ఆత్మలు వస్తే తప్పకుండా వారి ప్రభావము అల్పకాలికముగా ఉంటుంది కదా. వాళ్ళను బంగారము లేక వజ్రాలతో తూకము వేస్తారు, కానీ అవన్నీ సమాప్తమవ్వనున్నాయి. మనుష్యుల వద్ద ఎన్ని లక్షల విలువ గల భవనాలు ఉన్నాయి. మేమైతే చాలా షావుకారులమని భావిస్తారు. ఈ షావుకారుతనము ఇంకా కొద్ది సమయము కోసమే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది... అని అంటూ ఉంటారు. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు, ఆ కార్యములో ఎవరైతే తమ వద్ద ఉన్నది ఉపయోగిస్తారో వారికి 21 జన్మల కోసం వజ్ర-వైఢూర్యాల మహళ్ళు లభిస్తాయి. ఇక్కడైతే ఒక జన్మకు మాత్రమే లభిస్తుంది. అక్కడ మీకు 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో, దేహ సహితముగా అంతా భస్మమైపోనున్నది. పిల్లలైన మీకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారము కూడా జరుగుతుంది. వినాశనమైన తర్వాత ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది. మనము మన రాజ్య భాగ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. 21 తరాలు రాజ్యము చేశాము, ఆ తర్వాత రావణుని రాజ్యము నడిచింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. భక్తి మార్గములో అందరూ తండ్రినే తలచుకుంటారు. దుఃఖములో అందరూ తలచుకుంటారు... అని గాయనము కూడా ఉంది. తండ్రి సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తారు, తర్వాత ఇక స్మృతి చేసే అవసరము ఉండదు. నీవే తల్లివి, తండ్రివి... అని అంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లలకు తల్లిదండ్రులు అవుతారు. కానీ ఇది పారలౌకిక తల్లి-తండ్రి యొక్క విషయము. ఇప్పుడు మీరు ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకు చదువుతున్నారు. పాఠశాలలో పిల్లలు బాగా పాస్ అయినట్లయితే టీచర్ కు బహుమతిని ఇస్తారు. మరి ఇప్పుడు మీరు వారికి ఏ బహుమతిని ఇస్తారు? మీరు గారడితో వారిని మీ కొడుకుగా చేసుకుంటారు. శ్రీకృష్ణుని నోటిలో తల్లి వెన్నముద్దను చూసినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యయుగములో జన్మ తీసుకున్నారు. వారు వెన్న మొదలైనవి తినరు. వారు విశ్వానికి యజమాని. మరి ఈ విషయము ఏ సమయానికి చెందినది? అది ఇప్పుడు సంగమయుగానికి చెందిన విషయము. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న బిడ్డగా అవుతాము, విశ్వానికి యజమానిగా అవుతాము అని మీకు తెలుసు. క్రైస్తవులిరువురూ పరస్పరములో కొట్లాడుకుంటారు మరియు వెన్న అనేది పిల్లలైన మీకు లభిస్తుంది. రాజ్యము లభిస్తుంది కదా. వాళ్ళు భారత్ లోని వారు పరస్పరములో గొడవ పడేలా చేసి, స్వయము వెన్నను తినేశారు. క్రిస్టియన్ రాజ్యము 3 వంతులు ఉండేది. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. పూర్తి విశ్వముపై మీరు తప్ప ఇంకెవ్వరూ రాజ్యము చేయలేరు. మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. ఇప్పుడు మీరు బ్రహ్మాండానికి యజమానులుగా మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు. విశ్వము అంటే అందులో బ్రహ్మాండము ఉండదు. సూక్ష్మవతనములో కూడా రాజ్యము ఉండదు. సత్య, త్రేతాయుగాలు... ఈ చక్రము ఇక్కడ స్థూల వతనములో ఉంటుంది. ధ్యానములో ఆత్మ ఎక్కడికీ వెళ్ళదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము అంతమైపోతుంది. ఇవన్నీ సాక్షాత్కారాలు. రిద్ధి-సిద్ధి (మంత్ర తంత్రాలు) ద్వారా కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతాయి, ఇక్కడ కూర్చునే విదేశాలలోని పార్లమెంటు మొదలైనవి చూడవచ్చు. బాబా చేతిలో దివ్యదృష్టి యొక్క తాళంచెవి ఉంది. మీరు ఇక్కడ కూర్చునే లండన్ ను చూడవచ్చు. దీని కోసం వేరే పరికరాలు మొదలైనవి కొనవలసిన అవసరము లేదు. డ్రామాలో ఏదైతే ముందు నుండే నిశ్చితమై ఉందో, డ్రామానుసారముగా ఆ సమయానికి అదే సాక్షాత్కారమవుతుంది. ఉదాహరణకు భగవంతుడు అర్జునుడికి సాక్షాత్కారము చేయించినట్లు చూపిస్తారు కదా. డ్రామానుసారముగా వారికి సాక్షాత్కారము కలిగేది ఉంది. ఇది కూడా నిశ్చితమై ఉంది. ఇందులో ఎవరి గొప్పతనమూ లేదు. ఇదంతా డ్రామానుసారముగా జరుగుతుంది. శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారునిగా అవుతారు అనగా వెన్న లభిస్తుంది. విశ్వమని దేనినంటారు, బ్రహ్మాండమని దేనినంటారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాండములో ఆత్మలైన మీరు నివసిస్తారు. సూక్ష్మవతనానికి వెళ్ళడం-రావడం, సాక్షాత్కారాలు జరగడం మొదలైనవి ఇప్పుడు జరుగుతాయి, మళ్ళీ 5 వేల సంవత్సరాల వరకు సూక్ష్మవతనము యొక్క పేరు ఉండదు. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు, మళ్ళీ శివ పరమాత్మాయ నమః అని అంటారు, అనగా వారు అందరికంటే ఉన్నతమైనవారు అయినట్లు కదా. వారిని భగవంతుడు అని అంటారు. ఆ దేవతలు కూడా మనుష్యులే కానీ వారు దైవీ గుణాలు కలవారు. అంతేకానీ 4-8 భుజాలు గల మనుష్యులెవ్వరూ ఉండరు. అక్కడ కూడా 2 భుజాల మనుష్యులే ఉంటారు, కానీ వారు సంపూర్ణముగా పవిత్రముగా ఉంటారు, అపవిత్రత అన్న మాటే ఉండదు. అకాల మృత్యువులు ఎప్పుడూ జరగవు. కావున పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఆత్మలైన మనము ఈ శరీరము ద్వారా బాబానైతే చూసాము. చూసేందుకు శరీరమే కనిపిస్తుంది, పరమాత్మను గాని, ఆత్మను గాని చూడలేము. ఆత్మను, పరమాత్మను తెలుసుకోవలసి ఉంటుంది. చూడటము కోసమని దివ్యదృష్టి లభిస్తుంది. మిగిలిన వస్తువులన్నీ దివ్యదృష్టితో పెద్దవిగా కనిపిస్తాయి. రాజధాని కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. కానీ ఆత్మ కేవలం ఒక బిందువు. బిందువును చూసినంత మాత్రాన మీరు ఏమీ అర్థము చేసుకోరు. ఆత్మ అయితే చాలా సూక్ష్మమైనది. ఆత్మను పట్టుకునేందుకు చాలామంది డాక్టర్లు మొదలైనవారు ప్రయత్నించారు కానీ ఎవ్వరికీ తెలియనే తెలియదు. అక్కడ వారైతే బంగారముతో, వజ్రాలతో తూకము వేస్తారు. మీరు జన్మ-జన్మాంతరాల కొరకు పదమపతులుగా అవుతారు. మీకు బాహ్య ఆడంబరము కొద్దిగా కూడా ఉండదు. నేను సాధారణ రీతిలో ఈ రథములో కూర్చుని చదివిస్తాను. వీరి పేరు భగీరథుడు. ఇది పతిత, పురాతనమైన రథము, ఇందులోకి తండ్రి వచ్చి ఉన్నతోన్నతమైన సేవ చేస్తారు. తండ్రి అంటారు, నాకైతే నాదంటూ శరీరము లేదు. నేను జ్ఞాన సాగరుడిని, ప్రేమ సాగరుడిని... మరి నేను మీకు వారసత్వాన్ని ఎలా ఇవ్వాలి! పై నుండి అయితే ఇవ్వను. ప్రేరణ ద్వారా చదివిస్తానా? తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. భక్తి మార్గములో నన్ను పూజిస్తారు, నేను అందరికీ ప్రియమనిపిస్తాను. గాంధీ, నెహ్రూల చిత్రాలు ప్రియముగా అనిపిస్తాయి, వారి శరీరాలను తలచుకుంటారు. అవినాశీ అయిన ఆత్మ అయితే వెళ్ళి మరో జన్మ తీసుకుంది. వారి వినాశీ చిత్రాలను తలచుకుంటూ ఉంటారు. అది భూత పూజ అయినట్లు కదా. సమాధి కట్టి దానిపై పుష్పాలు మొదలైనవి సమర్పిస్తారు. ఇది స్మృతిచిహ్నము. శివుని మందిరాలు ఎన్ని ఉన్నాయి, అన్నిటికంటే పెద్ద స్మృతిచిహ్నము శివునిదే కదా. సోమనాథ మందిరానికి గాయనముంది. మహమ్మద్ గజనవీ వచ్చి దానిని దోచుకున్నాడు. మీ వద్ద అంత ధనముండేది. బాబా పిల్లలైన మిమ్మల్ని రత్నాలతో తూకము వేస్తారు. నేను స్వయానికి తూకము వేయించుకోను. నేను అంత ధనవంతునిగా అవ్వను కానీ మిమ్మల్ని అలా తయారుచేస్తాను. అక్కడైతే వారిని ఈ రోజు తూకము వేస్తారు, రేపు మరణిస్తారు, ఆ ధనము ఏమీ ఉపయోగపడదు. ఒకవేళ శ్రీమతముపై నడుచుకున్నట్లయితే, తండ్రి మిమ్మల్ని తరగని ఖజానాలతో ఏ విధముగా తూకము వేస్తారంటే అది ఇక 21 జన్మల కోసము మీతోనే ఉంటుంది. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు, ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. మృత్యువుకు భయపడరు. ఇక్కడ ఎంతగా భయపడతారు, ఏడుస్తారు. మీరు వెళ్ళి యువరాజులుగా అవుతారు అని అక్కడ ఎంత సంతోషముంటుంది. ఇంద్రజాలికుడు, వ్యాపారి, రత్నాకరుడు అని శివ పరమాత్మను అంటారు. అటువంటి రాకుమారులుగా అవుతారని మీకు కూడా సాక్షాత్కారము చేయిస్తారు. ఈ రోజుల్లో సాక్షాత్కారాల పాత్రను బాబా ఆపివేశారు. దాని వల్ల నష్టము కలుగుతుంది. ఇప్పుడు జ్ఞానము ద్వారా తండ్రి మీ సద్గతిని చేస్తారు. మీరు మొదట సుఖధామములోకి వెళ్తారు. ఇప్పుడు ఇది దుఃఖధామము. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుందని మీకు తెలుసు, అందుకే తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఒకవేళ సంస్కారాలు శరీరములోనే ఉంటే, శరీరముతో పాటు అవి కూడా భస్మమైపోవాలి. మీరు శివబాబా అని అంటారు. ఆత్మలమైన మేము ఈ శరీరము ద్వారా చదువుకుంటున్నామని మీరంటారు. ఇది కొత్త విషయము కదా. ఆత్మలైన మనల్ని శివబాబా చదివిస్తున్నారు. ఈ విషయము పక్కాగా గుర్తుంచుకోండి. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి కూడా, టీచర్ కూడా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నాకు నాదంటూ శరీరము లేదు. నేను కూడా ఆత్మనే, కానీ నన్ను పరమాత్మ అని అంటారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మ అయితే ఆత్మనే. నేను పరమాత్మను, నేను మీ వలె పునర్జన్మలు తీసుకోను. డ్రామాలో నా పాత్రయే ఈ విధముగా ఉంది, నేను వీరిలో ప్రవేశించి మీకు వినిపిస్తున్నాను, అందుకే వీరిని భాగ్యశాలి రథమని అనడం జరుగుతుంది. వీరిని పాత చెప్పు అని కూడా అంటారు. శివబాబా కూడా పాత లాంగ్ బూట్ వేసుకున్నారు. తండ్రి అంటారు, నేను ఇతని అనేక జన్మల అంతిమములో ప్రవేశించాను. మొట్టమొదట వీరు తయారవుతారు, ఆ తర్వాత మీరు కూడా అదే విధముగా అవుతారు. బాబా అంటారు, మీరైతే యువత. మీరు నా కంటే బాగా చదువుకుని ఉన్నత పదవిని పొందాలి, కానీ నాతోపాటు బాబా ఉన్నారు కావున నాకు పదే-పదే వారి స్మృతి కలుగుతుంది. బాబా నాతోపాటు పడుకుంటారు కూడా, కానీ బాబా నన్ను ఆలింగనము చేసుకోలేరు. మిమ్మల్ని ఆలింగనము చేసుకుంటారు. మీరు భాగ్యశాలులు కదా. శివబాబా అప్పుగా తీసుకున్న ఈ శరీరాన్ని మీరు ఆలింగనము చేసుకోగలరు. నేను ఎలా ఆలింగనము చేసుకోగలను! నాకు ఆ భాగ్యము లేదు, అందుకే మీరు లక్కీ సితారలుగా గాయనము చేయబడ్డారు.

పిల్లలు సదా భాగ్యశాలులుగా ఉంటారు. తండ్రి తన ధనాన్ని పిల్లలకు ఇచ్చేస్తారు, అంటే మీరు లక్కీ సితారలు అయినట్లు కదా. మీరు నా కంటే భాగ్యశాలులని శివబాబా కూడా అంటారు, మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా చేస్తాను, నేను విశ్వానికి యజమానిగా అవ్వను కదా. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు. ఇకపోతే నా వద్ద మాత్రమే దివ్యదృష్టి అనే తాళంచెవి ఉంది. నేను జ్ఞాన సాగరుడిని. మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా తయారుచేస్తాను. మీరు ఈ పూర్తి చక్రాన్ని తెలుసుకుని చక్రవర్తి మహారాజు, మహారాణులుగా అవుతారు. నేను అలా అవ్వను. వృద్ధాప్యము వచ్చినప్పుడు వీలునామా వ్రాసి పిల్లలకు ఇచ్చి స్వయము వానప్రస్థములోకి వెళ్ళిపోతారు. పూర్వము ఇలా జరిగేది. ఈ రోజుల్లోనైతే వారికి పిల్లలపై మోహముంటుంది. పారలౌకిక తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలోకి ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా, విశ్వాధిపతులుగా తయారుచేసి, అర్ధకల్పము కోసం సదా సుఖవంతులుగా తయారుచేసి, నేను వానప్రస్థములోకి వెళ్ళి కూర్చుంటాను. ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు. సన్యాసులు మొదలైనవారు శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు. తండ్రి అయితే జ్ఞాన సాగరుడు. వారు స్వయము అంటారు, ఈ వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములోని సామాగ్రి. జ్ఞాన సాగరుడిని అయితే నేనే. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శరీర సహితముగా ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో, ఇదంతా భస్మమైపోనున్నది, అందుకే మీ సర్వస్వాన్ని సఫలము చేసుకోవాలి.

2. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు చదువు చదువుకోవాలి. సదా తమ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకుని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధిపతులుగా అవ్వాలి.

వరదానము:-
వాహ్ డ్రామా వాహ్ అనే స్మృతితో అనేకుల సేవను చేసే సదా సంతోషముగా ఉండేవారిగా కండి

ఈ డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తున్నా, వాహ్ డ్రామా వాహ్ అన్న స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ భయపడరు, ఎందుకంటే డ్రామా జ్ఞానము ఏమని లభించిందంటే - వర్తమాన సమయములో ఉన్నది కళ్యాణకారీ యుగము, ఇందులో ఏ దృశ్యము ఎదురుగా వచ్చినా, అందులో కళ్యాణమే ఇమిడి ఉంది. వర్తమానములో కళ్యాణము కనిపించకపోయినా కానీ, భవిష్యత్తులో ఆ ఇమిడి ఉన్న కళ్యాణము ప్రత్యక్షమైపోతుంది. కావున వాహ్ డ్రామా వాహ్ అనే స్మృతితో సదా సంతోషముగా ఉంటారు, పురుషార్థములో ఎప్పుడూ ఉదాసీనత రాదు. స్వతహాగానే మీ ద్వారా అనేకుల సేవ జరుగుతూ ఉంటుంది.

స్లోగన్:-
శాంతి శక్తియే మనసా సేవకు సహజ సాధనము. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఎంతగా అవ్యక్త లైట్ రూపములో స్థితులవుతారో, అంతగా శరీరము నుండి అతీతమయ్యే అభ్యాసము ఉన్న కారణముగా, ఒకవేళ రెండు-నాలుగు నిమిషాల కోసం అశరీరిగా అయినా కూడా నాలుగు గంటలు విశ్రాంతి తీసుకున్నట్లుగా అనుభవమవుతుంది. ఎటువంటి సమయము వస్తుందంటే, నిద్రపోవడానికి బదులుగా 4-5 నిమిషాలు అశరీరిగా అవుతారు మరియు దానితో శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. లైట్స్వరూపపు స్మృతిని దృఢముగా చేసుకున్నట్లయితే లెక్కాచారాలను సమాప్తము చేసుకోవటములో కూడా లైట్రూపముగా అవుతారు.