21-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఒక్క తండ్రి స్మృతితో మీరు సుప్రీమ్ గా అవ్వాలంటే పొరపాటున కూడా ఇతరులెవ్వరినీ స్మృతి చేయకండి’’

ప్రశ్న:-
తండ్రి పట్ల ఏ ఆశను పెట్టుకోకూడదు, కృపను చూపించమని అడగడానికి బదులుగా మీ కృషి మీరు చేయాలి?

జవాబు:-
పాత శరీరానికి చెందిన ఏ కర్మభోగము వచ్చినా, దివాలా తీసినా లేక అనారోగ్యము వచ్చినా, తండ్రి అంటారు - ఇది మీ లెక్కాచారము. ఇందులో బాబా కృప చూపించాలి అన్న ఈ ఆశను పెట్టుకోకండి. మీ కృషిని మీరు చేసి యోగబలాన్ని ఉపయోగించండి, స్మృతి ద్వారానే ఆయుష్షు పెరుగుతుంది, కర్మభోగము సమాప్తమవుతుంది. ప్రాణాలకన్నా ప్రియమైన తండ్రి పట్ల ఎంతగా ప్రేమ ఉంటుందో అంతగా స్మృతి ఉంటుంది మరియు కళ్యాణము జరుగుతూ ఉంటుంది.

ఓంశాంతి
అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు మీ ఇంటిని స్మృతి చేయండి. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్, టవర్ ఆఫ్ సుఖము అని అంటారు. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఉన్నతోన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్ లోకి మీరు ఎలా వెళ్ళగలరు, ఇది కూడా టవర్ లో ఉండే తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. అది తండ్రి ఇల్లు. నడుస్తూ-తిరుగుతూ ఇలా అనుకోవటము అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది అన్నది తండ్రికి తెలుసు. ఎవరైతే ఆత్మ అభిమానులై ఉంటారో వారిని మహావీరులు అని అంటారు. స్మృతి ద్వారానే మీరు మహావీరులుగా, సుప్రీమ్ గా అవుతారు. సుప్రీమ్ అనగా శక్తివంతులు.

స్వర్గానికి యజమానులుగా తయారుచేసే బాబా, విశ్వానికి యజమానులుగా తయారుచేసే బాబా మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు సంతోషము ఉండాలి. ఆత్మ బుద్ధి బాబా వైపుకు వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రేమ ఒక్క బాబాతోటే ఉండటము అంటే ఇదే. ఉదయముదయమే లేచి బాబాతో మధురాతి మధురమైన మాటలను మాట్లాడండి. బాబా, మీదైతే అద్భుతము, మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారని స్వప్నములో కూడా అనుకోలేదు. బాబా, మేము మీ శిక్షణలపై తప్పకుండా నడుస్తాము. ఎటువంటి పాపపు పనులు చెయ్యము. బాబా ఎటువంటి పురుషార్థమును చేస్తారో దానిని పిల్లలకు కూడా వినిపిస్తారు. శివబాబాకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. చింత అయితే ఉంటుంది కదా. ఎంతమంది పిల్లలను సంభాళించవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఈశ్వరీయ పరివారములో కూర్చుని ఉన్నారు. తండ్రి మీ సమ్ముఖములో కూర్చున్నారు. నీతోనే తింటాము, నీతోనే కూర్చుంటాము... మీకు తెలుసు, శివబాబా వీరిలోకి వచ్చి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచము, పాత దేహము అంతమైపోనున్నాయి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంతవరకు ప్రపంచము మరణించినట్లే అని నానుడి కూడా ఉంది. పురుషార్థము కొరకు కాస్త సంగమయుగ సమయము ఉంది. బాబా, ఈ చదువు ఎప్పటివరకు కొనసాగుతుంది అని పిల్లలు అడుగుతారు. దైవీ రాజధాని స్థాపన అయ్యేవరకు వినిపిస్తూ ఉంటాను, ఆ తర్వాత కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరము, ఏదో ఒక కర్మభోగము నడుస్తూ ఉంటుంది. ఇందులో బాబా సహాయము చేయాలి అన్న ఈ ఆశను పెట్టుకోకూడదు. దివాలా తీసినా, అనారోగ్యము వచ్చినా - ఇది మీ లెక్కాచారము అని తండ్రి అంటారు. అయినా కూడా యోగముతో ఆయుష్షు పెరుగుతుంది. మీ కృషి మీరు చేయండి. కృప చూపించమని అడగకండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అందులోనే కళ్యాణము ఉంది. ఎంత వీలైతే అంత యోగబలము ద్వారా పని చేయండి. నన్ను మీ కనురెప్పలలో దాచుకోండి.... అని పాడుతారు కూడా కదా. ప్రియమైనవారిని ప్రకాశ రత్నము, ప్రాణ ప్రియులు అని అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైనవారు, కానీ గుప్తమైనవారు. వారి పట్ల ఎంత ప్రేమ ఉండాలంటే ఇక అడగకండి. పిల్లలనైతే తండ్రి కనురెప్పలలో దాచుకోవలసి ఉంటుంది. కనురెప్పలు అంటే ఈ నేత్రాలు ఏమీ కావు. అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు, వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు అని దీనిని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. పిల్లలకు ఎంత నిష్కామ సేవను చేస్తారు. పతిత శరీరములోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని వజ్రము వలె తయారుచేస్తారు. వారు ఎంతటి మధురమైన బాబా. మరి పిల్లలు కూడా ఆ విధముగా మధురముగా తయారవ్వాలి. బాబా ఎంత నిరహంకారిగా అయి పిల్లలైన మీ సేవ చేస్తారు. కనుక పిల్లలు కూడా అంత సేవ చెయ్యాలి. శ్రీమతముపై నడవాలి. ఎక్కడైనా తమ మతాన్ని చూపించినట్లయితే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము, బ్రహ్మా సంతానమైన సోదరీ-సోదరులు, ఈశ్వరీయ మనవలు-మనవరాళ్ళు. వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంతగా పురుషార్థము చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇందులో సాక్షీగా ఉండేందుకు కూడా చాలా అభ్యాసము ఉండాలి. బాబా అంటారు - మధురమైన పిల్లలూ, ఓ ఆత్మలూ, నన్కొక్కరినే స్మృతి చేయండి. పొరపాటున కూడా బాబాను తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యకూడదు. మీ ప్రతిజ్ఞ ఏమిటంటే - బాబా, నాకైతే మీరొక్కరే. నేను ఆత్మను, మీరు పరమాత్మ. మీ నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. మీ ద్వారానే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, దీని ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందుతాము.

మధురమైన పిల్లలూ, మీకు తెలుసు, ఇది అనాది డ్రామా, ఇందులో గెలుపు ఓటముల ఆట నడుస్తుంది. ఏదైతే జరుగుతుందో అది సరైనదే. రచయితకు డ్రామా తప్పకుండా ఇష్టమనిపిస్తుంది కదా. కావున రచయిత పిల్లలకు కూడా అది ఇష్టమనిపిస్తుంది. ఈ డ్రామాలో బాబా ఒకేసారి చాలా-చాలా హృదయపూర్వకముగా, ప్రేమగా, ప్రాణప్రదముగా పిల్లల సేవ చేయడానికి వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైనవారే. సత్యయుగములో కూడా అందరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారని మీకు తెలుసు. జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువంటూ ఏదీ ఉండదు. కావున పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఇక్కడ అలా తయారైనట్లయితే ఆ సంస్కారము అవినాశీగా అయిపోతుంది. తండ్రి అంటారు, కల్పపూర్వము వలె పూర్తిగా అదే విధముగా ప్రియమైనవారిగా తయారుచేయడానికి వచ్చాను. ఎప్పుడైనా పిల్లల క్రోధపూరిత మాటలు విన్నట్లయితే బాబా వారికి ఇలా శిక్షణను ఇస్తారు - పిల్లలూ, కోప్పడటము మంచిది కాదు. దాని వలన మీరు కూడా దుఃఖితులవుతారు మరియు ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు. తండ్రి సదా కాలము యొక్క సుఖాన్ని ఇచ్చేవారు కావున పిల్లలు కూడా తండ్రి సమానముగా అవ్వాలి. ఇతరులకు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వకూడదు.

శివబాబా ప్రాతః స్మరణీయ సాయి (ప్రభువు) అని మీకు తెలుసు. వారు రాత్రిని పగలుగా లేక ఉదయముగా తయారుచేసేవారు. సాయి అని అనంతమైన తండ్రిని అంటారు. వారు ఒక్కరే సాయి బాబా, భోళానాథ శివబాబా, వారు పేరే భోళానాథుడు. వారు భోళాగా ఉన్న (అమాయకులైన) కన్యలు, మాతలపై జ్ఞాన కలశాన్ని పెడతారు. వారినే విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. వారు ఎంతటి సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు. ఎంత ప్రేమతో మీకు జ్ఞాన పాలన చేస్తారు. ఆత్మను పావనముగా తయారుచేసుకునేందుకు స్మృతియాత్రలో ఉండండి. యోగ స్నానము చెయ్యాలి. జ్ఞానము చదువు. యోగ స్నానము ద్వారా పాపాలు భస్మమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసాన్ని చేస్తూ ఉన్నట్లయితే ఈ దేహ అహంకారము పూర్తిగా తొలగిపోతుంది. యోగము ద్వారానే పవిత్రముగా, సతోప్రధానముగా అయ్యి బాబా వద్దకు వెళ్ళాలి. కొంతమంది పిల్లలు ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోరు. తమ చార్టును సత్యాతి సత్యముగా చెప్పరు. అర్ధకల్పము అసత్య ప్రపంచములో ఉన్నారు. కనుక అసత్యము లోపల పేరుకుపోయి ఉంది. సత్యతతో మీ చార్టును తండ్రికి వినిపించాలి. నేను ముప్పావు గంట కూర్చున్నాను, అందులో ఎంత సమయము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసాను అన్నదానిని చెక్ చేసుకోవాలి. చాలామందికి నిజము చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. మేమైతే ఇంత సేవ చేసాము, ఇంతమందికి అర్థం చేయించాము అని ఇటువంటి విషయాలను వెంటనే వినిపిస్తారు కానీ స్మృతి చార్టు ఎంత ఉంది అన్న సత్యాన్ని వినిపించరు. స్మృతిలో ఉండని కారణముగానే మీ బాణము ఎవరికీ తగలదు. జ్ఞానమనే ఖడ్గములో పదును నిండదు. కొందరు అంటారు - మేమైతే నిరంతరము స్మృతిలో ఉంటాము అని, కానీ బాబా అంటారు, అటువంటి అవస్థ లేదు. నిరంతర స్మృతి ఉన్నట్లయితే కర్మాతీత అవస్థ ఏర్పడాలి. జ్ఞాన పరాకాష్ఠ కనిపించాలంటే, అందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానులుగా అంత సులభముగా అయిపోరు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇతరులెవ్వరి స్మృతి ఉండకూడదు. ఈ దేహము కూడా గుర్తుకు రాకూడదు. ఇటువంటి అవస్థ మీకు చివరిలో ఏర్పడుతుంది. స్మృతియాత్ర ద్వారానే మీ సంపాదన జరుగుతూ ఉంటుంది. ఒకవేళ శరీరము పోయినట్లయితే ఇక సంపాదన చేసుకోలేరు. ఆత్మ సంస్కారాలను తనతో పాటు తీసుకువెళ్ళినా కానీ స్మృతిని కలిగించటానికి టీచర్ అయితే కావాలి కదా. తండ్రి ఘడియ, ఘడియ స్మృతిని కలిగిస్తూ ఉంటారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ, ఉద్యోగము మొదలైనవి చేసుకుంటూ కూడా మరింత ఉన్నత పదవిని పొందేందుకై శ్రీమతముపై నడుస్తూ తమ భవిష్యత్తును కూడా జమ చేసుకుంటూ ఉండే అటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వారు బాబా నుండి సలహాలు తీసుకుంటూ ఉంటారు. ధనముంటే దానిని ఎలా సఫలము చేసుకోవాలి అని సలహాలు తీసుకుంటూ ఉంటారు. బాబా అంటారు, సెంటర్ తెరవండి, దాని వలన చాలామంది కళ్యాణము జరుగుతుంది. మనుష్యులు దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు, మరుసటి జన్మలో దాని ఫలము లభిస్తుంది. మీకు కూడా భవిష్య 21 జన్మల కొరకు రాజ్య భాగ్యము లభిస్తుంది. ఇది మీ నంబర్ వన్ బ్యాంక్, ఇందులో నాలుగు అణాలు పెట్టినట్లయితే అది భవిష్యత్తులో వెయ్యి రూపాయలుగా అయిపోతుంది. రాతి నుండి బంగారము వలె అయిపోతుంది. మీ ప్రతి వస్తువూ బంగారముగా అయిపోతుంది. బాబా అంటారు, మధురమైన పిల్లలూ, ఉన్నత పదవిని పొందాలంటే మాత-పితలను పూర్తిగా ఫాలో చేయండి మరియు మీ కర్మేంద్రియాలపై కంట్రోల్ ఉంచుకోండి. ఒకవేళ కర్మేంద్రియాలు వశములో లేకపోతే, నడవడిక మంచిగా లేకపోతే ఉన్నత పదవి నుండి వంచితులైపోతారు. మీ నడవడికను తీర్చిదిద్దుకోవాలి. ఎక్కువ కోరికలను పెట్టుకోకూడదు.

బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతగా జ్ఞానముతో అలంకరింపజేసి సత్యయుగ మహారాజు, మహారాణులుగా తయారుచేస్తారు. ఇందుకు సహనశీలతా గుణము చాలా బాగా కావాలి. దేహము పట్ల అతి మోహము ఉండకూడదు. యోగబలమునే ఉపయోగించాలి. బాబాకు దగ్గు మొదలైనవి ఎంత ఉన్నా కానీ వారు సదా సేవలో తత్పరులై ఉంటారు. జ్ఞాన-యోగాలతో అలంకరణ చేసి పిల్లలను యోగ్యులు తయారుచేస్తారు. మీరు ఇప్పుడు ఈశ్వరీయ ఒడిలో, మాత-పితల ఒడిలో కూర్చుని ఉన్నారు. బాబా బ్రహ్మా ముఖము ద్వారా పిల్లలైన మీకు జన్మనిస్తారు కావున వీరు తల్లి అయ్యారు. కానీ మీ బుద్ధి మళ్ళీ శివబాబా వైపుకు వెళ్తుంది. మీరు తల్లి, తండ్రి, మేము మీ పిల్లలము... మీరు సర్వ గుణ సంపన్నులుగా ఇక్కడే అవ్వాలి. ఘడియ, ఘడియ మాయతో ఓడిపోకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విధముగా స్వయాన్ని భావించడము ఎంత మధురముగా అనిపిస్తుంది. మనము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అవుతున్నాము.

ఈ డ్రామా ఎంత అద్భుతముగా తయారుచేయబడి ఉంది. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. మీరు ఇంత మాత్రమే గుర్తుంచుకున్నా కానీ నిశ్చయము ఏర్పడుతుంది - మేము సత్యయుగములోకి వెళ్ళబోతున్నాము, ఇప్పుడు సంగమయుగములో ఉన్నాము, మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి, అందుకే పావనముగా తప్పకుండా అవ్వాలి. లోపల చాలా సంతోషము ఉండాలి. ఓహో, అనంతమైన తండ్రి అంటున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానముగా అవుతారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు. వారు కేవలం టీచర్ రూపములో చదివించి ఇంటికి వెళ్ళిపోతారు అని కాదు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా. మిమ్మల్ని చదివిస్తారు కూడా. మీకు స్మృతియాత్రను కూడా నేర్పిస్తారు.

ఈ విధముగా విశ్వానికి యజమానులుగా తయారుచేసే, పతితము నుండి పావనముగా తయారుచేసే తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. ఉదయముదయమే లేవగానే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ చెప్తే అనగా స్మృతి చేస్తే చాలా సంతోషముగా ఉంటారు. మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము అని పిల్లలు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మనుష్యులు భక్తిని కూడా ఉదయమే చేస్తారు కదా. భక్తిని ఎంత ప్రేమతో చేస్తారు. కానీ చాలామంది పిల్లలు మనసుతో, ప్రాణప్రదముగా, ప్రేమగా స్మృతి చేయడం లేదని బాబాకు తెలుసు. ఉదయాన్నే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి, జ్ఞాన చింతనలో ఉన్నట్లయితే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపాల భారము ఎలా తొలగుతుంది. ముఖ్యమైన విషయము స్మృతియే, దీని ద్వారా మీ భవిష్యత్తుకు చాలా భారీ సంపాదన జరుగుతుంది. కల్ప-కల్పాంతరాలు ఈ సంపాదన ఉపయోగపడుతుంది. చాలా ఓపికతో, గంభీరతతో మరియు అవగాహనతో (వివేకముతో) స్మృతి చేయవలసి ఉంటుంది. పైపైకి చాలావరకు మేము బాబాను చాలా స్మృతి చేస్తున్నాము అని అంటారు, కానీ ఏక్యురేట్ గా స్మృతి చేయడములో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంట్ ఎక్కువగా లభిస్తుంది ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. యోగము మరియు జ్ఞానము, రెండు వేర్వేరు. యోగము యొక్క సబ్జెక్ట్ వేరు. అది చాలా భారీ సబ్జెక్ట్. యోగము ద్వారానే ఆత్మ సతోప్రధానముగా అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానముగా అవ్వడము అసంభవము. మంచి రీతిలో ప్రేమగా తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆటోమేటిక్ గా కరెంట్ లభిస్తుంది, ఆరోగ్యముగా అయిపోతారు. కరెంట్ ద్వారా ఆయుష్షు కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేసినట్లయితే వారికి బాబా కూడా సెర్చ్ లైట్ ఇస్తారు. బాబా పిల్లలైన మీకు ఎంత భారీ ఖజానాను ఇస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే, నయనాలలోని తారలైన పిల్లలకు మాత-పిత బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమపూర్వకమైన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రిని చాలా ఓపికతో, గంభీరతతో మరియు అవగాహనతో స్మృతి చేయాలి. స్మృతి ఏక్యురేట్ గా ఉన్నట్లయితే తండ్రి నుండి కరెంట్ లభిస్తుంది, ఆయుష్షు పెరుగుతుంది, ఆరోగ్యవంతముగా అవుతారు.

2. ఉన్నత పదవిని పొందాలంటే మీ నడవడికను తీర్చిదిద్దుకోండి, ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు. కర్మేంద్రియాలపై పూర్తి కంట్రోల్ ను ఉంచుకోవాలి. మాత-పితలను పూర్తిగా ఫాలో చెయ్యాలి.

వరదానము:-
‘‘ఫాలో ఫాదర్ మరియు సీ ఫాదర్’’ (తండ్రిని అనుసరించండి మరియు తండ్రిని చూడండి) అన్న మహామంత్రము ద్వారా ఏకరస స్థితిని తయారుచేసుకునే శ్రేష్ఠ పురుషార్థీ భవ

‘‘సీ ఫాదర్, ఫాలో ఫాదర్’’ (తండ్రిని చూడండి, తండ్రిని అనుసరించండి) - ఈ మంత్రాన్ని సదా ఎదురుగా ఉంచుకుంటూ పైకి ఎక్కే కళలోకి వెళ్తూ ఉండండి మరియు ఎగురుతూ ఉండండి. ఎప్పుడూ కూడా ఆత్మలను చూడకండి ఎందుకంటే ఆత్మలందరూ పురుషార్థులే. పురుషార్థములో మంచి కూడా ఉంటుంది మరియు కొంత లోపము కూడా ఉంటుంది, సంపన్నముగా ఉండరు, అందుకే తండ్రిని అనుసరించండి, అంతేకానీ సోదరీ-సోదరులను కాదు. అప్పుడు ఏ విధముగా తండ్రి ఏకరసముగా ఉన్నారో, అలా వారిని అనుసరించేవారు స్వతహాగా ఏకరసముగా అయిపోతారు.

స్లోగన్:-
పరచింతన యొక్క ప్రభావములోకి రాకుండా శుభచింతన చేసే శుభచింతక మణిగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్తీ మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

ఏ విధముగానైతే ఇతర స్థూలమైన వస్తువులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకుంటారు మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేస్తారు, అలా దేహ భానాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేసి దేహీ-అభిమానులుగా అవ్వండి. ఏదైనా స్థూల వస్తువును వదలటము ఎంత సహజమో, ఈ దేహ భానాన్ని వదిలే ప్రాక్టీస్ కూడా అంతే సహజముగా ఉండాలి. రచయిత ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచనను ఆధారముగా తీసుకోవాలి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచన యొక్క ఆధారాన్ని వదిలేయాలి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతీతముగా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రియముగా అవ్వాలి - అంతగా బంధనముక్తులుగా అవ్వండి.