23-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ నోటి నుండి సదా జ్ఞాన రత్నాలు వెలువడాలి, మీ ముఖము సదా హర్షితముగా ఉండాలి’’

ప్రశ్న:-
ఏ పిల్లలైతే బ్రాహ్మణ జీవితములో జ్ఞానాన్ని ధారణ చేసారో వారి గుర్తులేమిటి?

జవాబు:-
1. వారి నడవడిక దేవతల వలె ఉంటుంది, వారిలో దైవీ గుణాల ధారణ జరుగుతుంది. 2. వారికి జ్ఞానాన్ని విచార సాగర మంథనము చేసే అభ్యాసముంటుంది. వారు ఎప్పుడూ ఆసురీ విషయాలను అనగా చెత్తను మంథనము చేయరు. 3. వారి జీవితము నుండి తిట్టడము మరియు నిందించడము సమాప్తమైపోతుంది. 4. వారి ముఖము సదా హర్షితముగా ఉంటుంది.

ఓంశాంతి
తండ్రి కూర్చొని జ్ఞానము మరియు భక్తి గురించి అర్థం చేయిస్తారు. భక్తి ద్వారా సద్గతి జరగదని మరియు సత్యయుగములో భక్తి ఉండదని పిల్లలు అర్థం చేసుకున్నారు. జ్ఞానము కూడా సత్యయుగములో లభించదు. శ్రీకృష్ణుడు భక్తిని చేయరు, అలాగే జ్ఞాన మురళీని మ్రోగించరు. మురళీ అంటేనే జ్ఞానాన్ని ఇవ్వడము. మురళీలో ఇంద్రజాలము ఉందని గాయనము కూడా ఉంది కదా. కనుక తప్పకుండా ఏదో ఇంద్రజాలము ఉంటుంది కదా! కేవలం మురళీని మ్రోగించడమంటే సాధారణ ఫకీరులు కూడా మ్రోగిస్తూ ఉంటారు. ఈ మురళీలో జ్ఞానము యొక్క ఇంద్రజాలము ఉంది. అజ్ఞానాన్ని ఇంద్రజాలమని అనరు. మురళీని ఇంద్రజాలమని అంటారు. జ్ఞానము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగము ఉన్నప్పుడు ఈ జ్ఞానము యొక్క వారసత్వము ఉంటుంది. అక్కడ భక్తి ఉండదు. ద్వాపరయుగములో దేవతల నుండి మనుష్యులుగా అయినప్పుడు భక్తి ఉంటుంది. మనుష్యులను వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. జ్ఞానమని దేనినంటారు? ఒకటి స్వయము యొక్క పరిచయాన్ని మరియు బాబా పరిచయాన్ని, ఇంకా సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని జ్ఞానమని అంటారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. ఆ తర్వాత భక్తి ప్రారంభమైనప్పుడు దిగే కళ అని అంటారు ఎందుకంటే భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోగలదు కానీ దైవీ గుణాలను ధారణ చేయరు. దైవీ గుణాలు ఉన్నట్లయితే జ్ఞాన ధారణ ఉందని అర్థమవుతుంది. జ్ఞాన ధారణ కలవారి నడవడిక దేవతల వలె ఉంటుంది. తక్కువ ధారణ కలవారి నడవడిక మిక్స్ గా ఉంటుంది. ధారణ లేకపోతే ఇక వారు పిల్లలే కారు. మనుష్యులు తండ్రిని ఎంతగా నిందిస్తారు. బ్రాహ్మణ కులములోకి వచ్చినట్లయితే తిట్టడము, నిందించడము సమాప్తమైపోతుంది. మీకు జ్ఞానము లభిస్తుంది, దానిపై మీరు విచార సాగర మంథనము చేసినట్లయితే అమృతము లభిస్తుంది. విచార సాగర మంథనమే చేయకపోతే మరి దేని మంథనము జరుగుతుంది? ఆసురీ ఆలోచనల మంథనము. దాని నుండి చెత్తే వెలువడుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతున్నామని మీకు తెలుసు. దేవతలు ఈ చదువును చదివించరు. దేవతలను ఎప్పుడూ జ్ఞాన సాగరులని అనరు. జ్ఞాన సాగరుడని ఒక్కరినే అంటారు. దైవీ గుణాలు కూడా జ్ఞానము ద్వారా ధారణ అవుతాయి. ఈ జ్ఞానమేదైతే పిల్లలైన మీకు ఇప్పుడు లభిస్తుందో, ఇది సత్యయుగములో ఉండదు. ఈ దేవతలలో దైవీ గుణాలు ఉన్నాయి. సర్వగుణ సంపన్నులు... అని మీరు మహిమ కూడా చేస్తారు. కావున ఇప్పుడు మీరు ఈ విధముగా తయారవ్వాలి. మాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా లేక ఏవైనా ఆసురీ అవగుణాలు ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఆసురీ అవగుణాలు ఉన్నట్లయితే వాటిని తొలగించివేయాలి, అప్పుడే దేవతలని అంటారు. లేకపోతే తక్కువ పదవిని పొందుతారు.

ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు. దీనినే పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఈ సమయములో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు కావున వాతావరణము కూడా చాలా బాగుండాలి. నోటి నుండి ఎటువంటి ఛీ-ఛీ మాటలు వెలువడకూడదు, లేకపోతే వీరు తక్కువ పదవివారు అని అంటారు. మాట, నడవడిక మరియు వాతావరణము ద్వారా వెంటనే తెలిసిపోతుంది. మీ ముఖము సదా హర్షితముగా ఉండాలి, లేకపోతే వారిలో జ్ఞానము లేదని అంటారు. నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంత హర్షితముఖులో చూడండి. ఈ ఆత్మలు జ్ఞాన రత్నాలను ధారణ చేసారు. నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడుతాయి. రత్నాలనే వింటూ-వినిపిస్తూ ఉంటే ఎంత సంతోషము ఉంటుంది. ఏ జ్ఞాన రత్నాలనైతే మీరు ఇప్పుడు తీసుకుంటున్నారో, ఇవన్నీ తర్వాత వజ్ర-వైఢూర్యాలుగా అయిపోతాయి. నవ రత్నాల మాల వజ్ర-వైఢూర్యాలదేమీ కాదు, అది ఈ జ్ఞాన రత్నాల మాల. మనుష్యులేమో ఆ రత్నాలుగా భావించి ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. ఈ జ్ఞాన రత్నాల మాల పురుషోత్తమ సంగమయుగములో ధరింపబడుతుంది. ఈ రత్నాలే మిమ్మల్ని భవిష్య 21 జన్మల కోసం సుసంపన్నముగా తయారుచేస్తాయి. వీటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ మీరు ఈ వజ్ర-వైఢూర్యాలను ధరించినట్లయితే ఎవరైనా వెంటనే ఎవరైనా దోచుకుని తీసుకువెళ్ళిపోతారు. కనుక స్వయాన్ని చాలా-చాలా వివేకవంతులుగా తయారుచేసుకోవాలి. ఆసురీ అవగుణాలను తొలగించివేయాలి. ఆసురీ అవగుణాలతో ముఖము కూడా అదే విధముగా అయిపోతుంది. క్రోధములో ముఖము ఎర్రగా, రాగి వలె అయిపోతుంది. కామ వికారము కలవారైతే నల్లగా అయిపోతారు. కనుక పిల్లలు ప్రతి విషయములోనూ విచార సాగర మంథనము చేయాలి. ఈ చదువు ఉన్నదే చాలా ధనాన్ని పొందేందుకు. ఆ చదువు రత్నాలేమీ కాదు. అయితే, నాలెడ్జ్ చదువుకుని పెద్ద పొజిషన్ ను పొందుతారు. కనుక చదువు ఉపయోగపడింది, అంతేకానీ ధనము కాదు. చదువే ధనము. అది హద్దులోని ధనము, ఇది అనంతమైన ధనము. వాస్తవానికి రెండూ చదువులే. తండ్రి మనల్ని చదివించి విశ్వానికి యజమానులుగా చేస్తారని మీరు ఇప్పుడు భావిస్తున్నారు. అది ఒక్క జన్మ కోసం అల్పకాలిక క్షణ భంగురమైన చదువు. మళ్ళీ మరుసటి జన్మలో కొత్తగా చదువుకోవలసి ఉంటుంది. స్వర్గములో ధనము కోసం చదువు యొక్క అవసరముండదు. అక్కడైతే ఇప్పటి పురుషార్థముతో అపారమైన ధనము లభిస్తుంది. ధనము అవినాశీ అయిపోతుంది. దేవతల వద్ద చాలా ధనము ఉండేది, ఆ తర్వాత భక్తి మార్గములోకి అనగా రావణ రాజ్యములోకి వచ్చినప్పుడు ఎంత ధనముండేది, ఎన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. ఆ తర్వాత ముసల్మానులు మొదలైనవారు వచ్చి ధనాన్ని దోచుకున్నారు. ఎంత ధనవంతులుగా ఉండేవారు! ఈ నాటి చదువులతో ఎవ్వరూ అంత ధనవంతులుగా అవ్వలేరు. మనము ఇంత ఉన్నతమైన చదువును చదువుతున్నామని, దానితో వీరి (దేవీ-దేవతల) వలె తయారవుతామని మీకు ఇప్పుడు తెలుసు. కనుక చదువు ద్వారా మనుష్యులు ఏ విధముగా తయారవుతారో చూడండి! పేదవారి నుండి షావుకార్లుగా అవుతారు. ఇప్పుడు భారత్ కూడా ఎంత పేదగా ఉంది. షావుకారులకైతే తీరికే లేదు. నేను ఫలానాను అని తమ అహంకారముంటుంది. ఇందులో అహంకారము మొదలైనవి సమాప్తమైపోవాలి. నేను ఒక ఆత్మను, ఆత్మ వద్దనైతే ధన-సంపదలు, వజ్ర-వైఢూర్యాలు మొదలైనవేవీ ఉండవు. దేహ సహితముగా అన్ని సంబంధాలను విడిచిపెట్టండి అని తండ్రి కూడా అంటారు. ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే షావుకారుతనము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ కొత్తగా చదువుకుని ధనాన్ని సంపాదించాలి లేదా దాన-పుణ్యాలు బాగా చేసి ఉంటే షావుకారుల ఇంటిలో జన్మ తీసుకుంటారు. గత కర్మల ఫలము అని అంటారు కదా. జ్ఞానాన్ని దానము చేసి ఉన్నట్లయితే లేదా కాలేజ్, ధర్మశాల మొదలైనవి నిర్మించి ఉన్నట్లయితే దాని ఫలము లభిస్తుంది, కానీ అల్పకాలికముగా లభిస్తుంది. ఈ దాన-పుణ్యాలు కూడా ఇక్కడే చేయడము జరుగుతుంది. సత్యయుగములో చేయడము జరగదు. సత్యయుగములో మంచి కర్మలే జరుగుతాయి ఎందుకంటే ఇప్పటి వారసత్వమే లభించి ఉంటుంది. అక్కడ ఎవరి ద్వారా కూడా వికర్మలు జరగవు ఎందుకంటే రావణుడే లేడు. పేదవారి ద్వారా కూడా వికర్మలు జరగవు. ఇక్కడైతే షావుకారుల ద్వారా కూడా వికర్మలు జరుగుతాయి, అందుకే ఈ అనారోగ్యాలు మొదలైన దుఃఖాలు ఉంటాయి. అక్కడ వికారాలలోకే వెళ్ళరు కనుక వికర్మలు ఎలా తయారవుతాయి? మొత్తమంతా కర్మలపైనే ఆధారపడి ఉంది. ఇది మాయా రావణ రాజ్యము, ఇక్కడ మనుష్యులు వికారులుగా అయిపోతారు. తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారుచేయడానికి చదివిస్తారు. తండ్రి నిర్వికారులుగా చేస్తారు, మాయ మళ్ళీ వికారులుగా చేస్తుంది. రామ వంశీయులు మరియు రావణ వంశీయులకు మధ్యన యుద్ధము జరుగుతుంది. మీరు తండ్రి పిల్లలు, వారు రావణుడి పిల్లలు. ఎంతమంది మంచి-మంచి పిల్లలు మాయ చేతిలో ఓడిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. అయినా కూడా ఆశ పెట్టుకుంటారు. అధమాతి అధములుగా (పూర్తిగా పతితులుగా) ఉన్నవారి ఉద్ధరణను కూడా చేయవలసి ఉంటుంది కదా. తండ్రి అయితే మొత్తం విశ్వాన్ని ఉద్ధరించవలసి ఉంటుంది. చాలామంది పడిపోతారు. పూర్తిగా నష్ట ఖాతాలో అధమాతి అధములుగా అయిపోతారు. అటువంటివారిని కూడా తండ్రి ఉద్ధరిస్తారు. రావణ రాజ్యములో అందరూ అధములుగానే ఉన్నారు కానీ తండ్రి రక్షిస్తారు. అయినా కానీ పడిపోతూనే ఉంటారు, ఇకదానితో చాలా అధములుగా అయిపోతారు. వారు మళ్ళీ అంతగా పైకి ఎక్కడము జరగదు. ఆ అధమ స్థితి లోలోపల తింటూ ఉంటుంది. అంతిమ సమయములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో... అని మీరు అంటూ ఉంటారు కదా. వారి బుద్ధిలో ఆ అధమ స్థితియే వస్తూ ఉంటుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, కల్ప-కల్పము మీరే దేవతలుగా అవుతారు. జంతువులేమైనా అవుతాయా? మనుష్యులే అలా అవుతారు మరియు అర్థం చేసుకుంటారు. ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా ముక్కు, చెవులు మొదలైనవి ఉన్నాయి, వారు మనుష్యులే కదా! కానీ వారు దైవీ గుణాలు కలవారు కావున వారిని దేవతలని అంటారు. వారు అటువంటి సుందరమైన దేవతలుగా ఎలా అవుతారు, మళ్ళీ ఎలా పడిపోతారు, ఈ చక్రము గురించి మీకు తెలిసింది. ఎవరైతే విచార సాగర మంథనము చేస్తూ ఉంటారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది. విచార సాగర మంథనమే చేయకపోతే తెలివిహీనులుగా అయిపోతారు. మురళీ నడిపించేవారికి విచార సాగర మంథనము నడుస్తూ ఉంటుంది. ఈ టాపిక్ గురించి ఇలా, ఇలా అర్థం చేయించాలని ఆటోమేటిక్ గా విచార సాగర మంథనము నడుస్తూ ఉంటుంది. ఫలానావారు రానున్నారు అని భావిస్తారు, వారికి కూడా ఉల్లాసముగా అర్థం చేయిస్తారు. వారు కొద్దో-గొప్పో అర్థం చేసుకోవచ్చు, అది వారి భాగ్యముపై ఆధారపడి ఉంది. కొందరు వెంటనే నిశ్చయము ఏర్పరచుకుంటారు, కొందరు ఏర్పరచుకోరు. నమ్మకము పెట్టడము జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు. విశ్వాసముంచాలి కదా! విశ్వాసముంచడము అనగా సేవ పట్ల అభిరుచి ఉన్నట్లు. అలసిపోకూడదు. ఒకవేళ ఎవరైనా చదువుకుని మళ్ళీ అధములుగా అయినట్లయితే, అప్పుడు వచ్చినట్లయితే వారిని తప్పకుండా విజిటింగ్ రూమ్ లో కూర్చోబెడతారా లేదా వెళ్ళిపోమని చెప్తారా? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని వారిని తప్పకుండా అడుగుతారు. వారు మాయతో ఓడిపోయామని చెప్తారు. అలా ఎంతోమంది వస్తారు. జ్ఞానము చాలా బాగుంది కానీ మాయ ఓడించేసింది అని భావిస్తారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలోనైతే ఓడిపోవడము మరియు గెలవడమనే మాటే ఉండదు. ఈ జ్ఞానము ధారణ చేయవలసినది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సత్యమైన గీతను వింటున్నారు, దీని ద్వారా దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. క్రిస్టియన్లు, పారశీయులు, ముసల్మానులలో బ్రాహ్మణులు ఉండరు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు.

భగవంతుడిని స్మృతి చేయాలని మీకు తెలుసు. భగవంతుడిని స్మృతి చేయడము ద్వారానే రాజ్యాధికారము లభిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు కలిసినా కానీ వారికి భగవంతుడిని స్మృతి చేయమని చెప్పండి. భగవంతుడినే ఉన్నతమైనవారని అంటారు. వేలితో భగవంతుడి వైపు సూచిస్తారు కదా! భగవంతుడిని ఒక్కరే అని కూడా అంటారు. భగవంతుడు ఒక్కరే, మిగిలినవారంతా వారి పిల్లలు. తండ్రి అయితే సదా భగవంతుడిగానే ఉంటారు. వారు రాజ్యము చేయరు. వారు జ్ఞానాన్ని కూడా ఇస్తారు, తమ పిల్లలుగా కూడా చేసుకుంటారు, కావున పిల్లలు ఎంత సంతోషములో ఉండాలి. బాబా మనకు ఎంత సేవ చేస్తున్నారు. మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. కానీ వారు స్వయం ఆ కొత్త పవిత్ర ప్రపంచములోకి రారు. పావన ప్రపంచములో వారిని ఎవరూ పిలవనే పిలవరు. పతితులే పిలుస్తారు. వారు పావన ప్రపంచములోకి వచ్చి ఏం చేస్తారు. వారి పేరే పతిత-పావనుడు కావున పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడము వారి డ్యూటీ. తండ్రి పేరు శివ మరియు పిల్లలను సాలిగ్రామాలని అంటారు. వారి పూజ జరుగుతుంది. శివబాబా అని అంటూ అందరూ స్మృతి చేస్తారు. రెండవది బ్రహ్మాను కూడా బాబా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మా అని చాలామంది అంటారు కానీ వారి గురించి యథార్థ రీతిలో తెలియదు. బ్రహ్మా ఎవరి సంతానము? పరమపిత పరమాత్మ శివుడు వారిని దత్తత తీసుకున్నారని మీరు అంటారు. వీరు శరీరధారి కదా! ఆత్మలందరూ ఈశ్వరుని సంతానము. ఆత్మలందరికీ తమ-తమ శరీరాలు ఉన్నాయి, తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి, అది అభినయించవలసిందే. ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చింది. అనాది అనగా ఆదిమధ్యాంతాలు ఉండవు. అంతమవుతుంది అని మనుష్యులు విన్నప్పుడు మళ్ళీ ఎలా తయారవుతుంది అని తికమకపడతారు. ఇది అనాది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడు తయారయ్యింది అని అడగవలసిన అవసరము ఉండదు. ప్రళయమే జరగదు. ఇది కూడా తప్పుగా అలా చెప్పారు. కొద్దిమంది మనుష్యులే మిగులుతారు, అందుకే ప్రళయము జరిగిందని అంటారు. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో, అది ఇప్పుడే ఇమర్జ్ అవుతుంది. మొత్తం సాగరమంతటినీ సిరాగా చేసినా కూడా... అది పూర్తి కాదు అని వీరి గురించే అంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ హర్షితముఖము ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి. జ్ఞాన రత్నాలనే వినాలి మరియు వినిపించాలి. మెడలో జ్ఞాన రత్నాల మాల ధరింపబడి ఉండాలి. ఆసురీ అవగుణాలను తొలగించివేయాలి.

2. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. విశ్వాసముంచి అభిరుచితో సేవ చేయాలి. విచార సాగర మంథనము చేసి ఉల్లాసములో ఉండాలి.

వరదానము:-
కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా లూజ్ కనెక్షన్ ను సరి చేసుకునే సమస్యాముక్త భవ

అన్ని సమస్యలకు మూల కారణము కనెక్షన్ లూజ్ అవ్వడము. కేవలం కనెక్షన్ ను సరి చేసుకున్నట్లయితే సర్వ శక్తులు మీ ముందు తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ కనెక్షన్ ను జోడించడానికి ఒకటి, రెండు నిమిషాలు పట్టినా కూడా ధైర్యాన్ని కోల్పోయి కన్ఫ్యూజ్ అయిపోకండి, నిశ్చయము రూపీ పునాదిని చలింపజేయకండి. నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నా వారు - ఈ ఆధారముతో పునాదిని పక్కా చేసుకున్నట్లయితే సమస్యాముక్తులుగా అయిపోతారు.

స్లోగన్:-
బీజరూప అవస్థలో స్థితులై ఉండటము - ఇదే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్తీ మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

ఎప్పుడైనా సేవలోనైనా లేక తమ పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విషయములోనైనా సఫలత లభించకపోతే ఏదో ఒక విఘ్నానికి వశమైపోతారు. ఆ తర్వాత దాని నుండి ముక్తులుగా అయ్యే కోరికను పెట్టుకుంటారు, కానీ శక్తి లేకుండా ఈ కోరిక పూర్తవ్వలేదు, అందుకే అలంకార రూపులుగా అవ్వండి. శక్తి రూపాన్ని ధారణ చేయండి. అప్పుడు బంధనముక్తులుగా అయిపోతారు.