27-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ సమయము చాలా విలువైనది, అందుకే వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి’’

ప్రశ్న:-
మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు తండ్రి ద్వారా ఏ శ్రీమతము లభించింది?

జవాబు:-
పిల్లలూ, మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు కావున ఏ రకమైన ఆసురీ స్వభావము ఉండకూడదు, 2. ఎవరిపైనా క్రోధము చేయకూడదు, 3. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, 4. ఎటువంటి వ్యర్థమైన విషయాలనూ చెవుల ద్వారా వినకూడదు. బాబా శ్రీమతము ఏమిటంటే - చెడును వినకండి...

ఓంశాంతి
పిల్లలైన మీరు కూర్చోవడం చాలా సాధారణమైనదే, మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. అడవిలోనైనా కూర్చోండి, పర్వతముపైనైనా కూర్చోండి, ఇంట్లోనైనా కూర్చోండి లేక కుటీరములోనైనా కూర్చోండి, మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడం ద్వారా పిల్లలైన మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇప్పుడు మనం మనుష్యులము, భవిష్యత్తులో దేవతలుగా అవుతున్నాము, మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. బాబా తోట యజమాని కూడా మరియు తోట మాలి కూడా. మనం తండ్రిని స్మృతి చేయడం ద్వారా మరియు 84 జన్మల చక్రమును తిప్పడం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాము. ఇక్కడైనా కూర్చోండి లేక ఎక్కడైనా కూర్చోండి, మీరు ట్రాన్స్ఫర్ అవుతూ, అవుతూ మనుష్యుల నుండి దేవతలుగా అవుతూ ఉంటారు. మేము ఇలా అవుతున్నాము అని బుద్ధిలో లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. ఏ పనులు చేసుకుంటున్నా, రోటీ చేస్తున్నా బుద్ధిలో కేవలం తండ్రిని స్మృతి చేయండి. నడుస్తూ, తిరుగుతూ, అన్నీ చేస్తూ కేవలం స్మృతిలో ఉండండి అని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారా వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది, 84 జన్మల చక్రము కూడా గుర్తుకు వస్తుంది. ఇందులో ఇంకే కష్టము ఉంది, ఏమీ లేదు. మనం దేవతలుగా అవుతాము కావున ఎటువంటి ఆసురీ స్వభావము కూడా ఉండకూడదు. ఎవరి పైనా క్రోధము చేయకూడదు, ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు, ఎటువంటి వ్యర్థమైన విషయాలనూ చెవుల ద్వారా వినకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ప్రాపంచిక పరచింతనా విషయాలనైతే ఎన్నో విన్నారు. అర్ధకల్పము నుండి ఇవి వింటూ, వింటూ మీరు కిందికి పడిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇక ఈ పరచింతన చేయకండి. ఫలానావారు ఇలా ఉన్నారు, వీరిలో ఇది ఉంది అంటూ ఎటువంటి వ్యర్థమైన విషయాలనూ మాట్లాడకూడదు. అది మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. మీ సమయము చాలా విలువైనది. చదువు ద్వారానే మీ కళ్యాణము జరుగుతుంది. దాని ద్వారానే పదవిని పొందుతారు. ఆ చదువులో ఎంతో కష్టపడవలసి వస్తుంది. పరీక్షలో పాస్ అయ్యేందుకు విదేశాలకు వెళ్తారు. మీకైతే ఎటువంటి శ్రమనూ ఇవ్వరు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆత్మలకు చెప్తారు. ఒకరి ఎదురుగా ఒకరిని కూర్చోబెడతారు, అప్పుడు కూడా తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతిలో కూర్చుంటూ, కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది ఎంత మంచి యుక్తి, కావున తండ్రి శ్రీమతముపై నడవాలి కదా. ప్రతి ఒక్కరికీ వేర్వేరు రోగాలు ఉంటాయి, ప్రతి రోగం కొరకు సర్జన్ ఉన్నారు. గొప్ప-గొప్ప వ్యక్తులకు ప్రత్యేకమైన సర్జన్లు ఉంటారు కదా. మీకు ఎవరు సర్జన్ గా అయ్యారు? భగవంతుడు. వారే అవినాశీ సర్జన్. వారు అంటారు, నేను మిమ్మల్ని అర్ధకల్పము కొరకు నిరోగులుగా తయారుచేస్తాను. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఇది గుర్తుంచుకునేందుకు కొంగుముడి వేసుకోవాలి. స్మృతి ద్వారానే మీరు నిరోగులుగా అవుతారు, మళ్ళీ 21 జన్మల వరకూ ఎటువంటి రోగమూ ఉండదు. ఆత్మ అయితే అవినాశీ అయినదే, కేవలం శరీరమే రోగగ్రస్థముగా అవుతుంది, కానీ అనుభవించేది అయితే ఆత్మయే కదా. అక్కడ అర్ధకల్పము మీరు ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు. కేవలం స్మృతిలో తత్పరులై ఉండండి. సేవనైతే పిల్లలు చేయవలసిందే. ప్రదర్శినీలో సేవ చేస్తూ, చేస్తూ పిల్లల గొంతులు ఎండిపోతాయి. కొందరు పిల్లలు - మేము సేవ చేస్తూ, చేస్తూ బాబా వద్దకు వెళ్ళిపోతాము అని భావిస్తారు. ఈ సేవా విధానము కూడా చాలా బాగుంది. ప్రదర్శినీలో కూడా పిల్లలు అర్థం చేయించాలి. ప్రదర్శినీలో మొట్టమొదట ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూపించాలి. ఇది ఏ-వన్ చిత్రము. భారత్ లో నేటికి 5000 సంవత్సరాల క్రితం తప్పకుండా వీరి రాజ్యము ఉండేది. అపారమైన ధనము ఉండేది. పవిత్రత, సుఖ, శాంతులన్నీ ఉండేవి. కానీ భక్తి మార్గములో సత్యయుగానికి లక్షల సంవత్సరాలు చూపించారు; కావున ఏ విషయమైనా ఎలా గుర్తుకు రాగలదు? ఈ లక్ష్మీ-నారాయణులది ఫస్ట్ క్లాస్ చిత్రము. సత్యయుగములో 1250 సంవత్సరాలు వీరి వంశము రాజ్యం చేసింది. ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతి కలిగించారు - మీరు మొత్తం విశ్వముపై రాజ్యం చేసారు, మీరు అది మర్చిపోయారా? 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు. పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉంటారు. 84 జన్మలను మీరు ఎలా తీసుకున్నారు - ఇది అర్థం చేసుకోవలసిన చాలా సింపుల్ విషయము. కిందకు దిగుతూ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ తండ్రి పైకి ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. నీవు ఉన్నతిలోకి వెళ్ళే సమయములో నీ కారణముగా సర్వులకు మేలు జరుగుతుంది అని గానం కూడా చేస్తారు. ఇంకా శంఖము మొదలైనవాటిని మోగిస్తారు. హాహాకారాలు జరుగుతాయని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పాకిస్తాన్ లో ఏమి జరిగిందో చూడండి - అందరి నోటి నుండీ ఓ భగవంతుడా, ఓ రామా, ఇప్పుడు ఏమి జరుగుతుంది అన్న మాటే వెలువడేది. ఇప్పుడు ఈ వినాశనమైతే చాలా పెద్దది, ఆ తర్వాత జయజయకారాలు జరుగుతాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఈ అనంతమైన ప్రపంచము ఇప్పుడు వినాశనమవ్వనున్నది. అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని మీకు వినిపిస్తారు. హద్దులోని విషయాలైన చరిత్ర-భౌగోళికాలను గురించి మీరు వింటూ వచ్చారు. లక్ష్మీ-నారాయణులు రాజ్యము ఎలా చేసారు అన్నది ఎవ్వరికీ తెలియదు. వీరి చరిత్ర-భౌగోళికాలను గురించి ఎవ్వరికీ తెలియదు. వీరు ఇన్ని జన్మలు రాజ్యము చేసారు అని మీకు బాగా తెలుసు. ఆ తర్వాత మిగిలిన ధర్మాలు ఉంటాయి. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు, దీనిని ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు ఇస్తారు. అక్కడైతే మనుష్యులు మనుష్యులను చదివిస్తారు, ఇక్కడ ఆత్మలైన మనల్ని పరమాత్మ తమ సమానముగా తయారుచేస్తున్నారు. టీచర్ తప్పకుండా తమ సమానముగానే తయారుచేస్తారు.

తండ్రి అంటారు, నేను మిమ్మల్ని నా కన్నా కూడా ఉన్నతమైనవారిగా, డబుల్ కిరీటధారులుగా తయారుచేస్తాను. స్మృతి ద్వారా ప్రకాశ కిరీటము లభిస్తుంది మరియు 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు కర్మ-అకర్మ-వికర్మల గతులను కూడా అర్థం చేయించారు. సత్యయుగములో కర్మలు అకర్మలుగా ఉంటాయి. రావణ రాజ్యములో కర్మలు వికర్మలుగా ఉంటాయి. మెట్లు దిగుతూ వస్తారు, కళలు తగ్గుతూ-తగ్గుతూ కిందకు దిగవలసిందే. ఎంత అశుద్ధముగా అయిపోతారు. అప్పుడు తండ్రియే వచ్చి భక్తులకు ఫలాన్ని ఇస్తారు. ప్రపంచములో అందరూ భక్తులే. సత్యయుగములో భక్తులెవ్వరూ ఉండరు. భక్తి మార్గము ఇక్కడే ఉంది. అక్కడైతే జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. మనము తండ్రి నుండి అనంతమైన ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికైనా మొట్టమొదట ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రముపై అర్థం చేయించండి. నేటికి 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యము ఉండేది, విశ్వములో సుఖ-శాంతులు, పవిత్రత అన్నీ ఉండేవి, ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఈ సమయములోనైతే అనేక ధర్మాలు ఉన్నాయి, కానీ ఆ మొదటి ధర్మము లేదు, ఆ మొదటి ధర్మము మళ్ళీ తప్పకుండా రావాలి. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తారు. యుద్ధము యొక్క విషయమేమీ లేదు. ఇది బికారీ జీవితము, పరాయి రాజ్యము. మనదంతా గుప్తమైనదే. బాబా కూడా గుప్తమైనవారే. వారు కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఇప్పుడు దేహాభిమానములోకి వచ్చింది. ఇప్పుడు తండ్రి అంటారు, దేహీ-అభిమానులుగా అవ్వండి. తండ్రి వేరే ఏ కష్టమునూ కొద్దిగా కూడా ఇవ్వరు. తండ్రి గుప్త రూపములో వచ్చినప్పుడు పిల్లలైన మీకు గుప్త దానముగా విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు. మీదంతా గుప్తమైనదే. అందుకే ఆచారము రూపములో కన్యకు కట్నము ఇచ్చేటప్పుడు దానిని గుప్తముగానే ఇస్తారు. వాస్తవానికి గుప్త దానము మహాపుణ్యము అని గానం చేస్తారు. ఇద్దరు, ముగ్గురికి తెలిస్తే ఆ శక్తి తగ్గిపోతుంది.

తండ్రి అంటారు - పిల్లలూ, మీరు ప్రదర్శినీలో మొట్టమొదట ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రముపై అందరికీ అర్థం చేయించండి. విశ్వములో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారు కదా. కానీ అది ఎప్పుడు ఉండేది, ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. సత్యయుగములో పవిత్రత, సుఖ, శాంతులన్నీ ఉండేవని ఇప్పుడు మీకు తెలుసు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని తలుచుకుంటారు కూడా, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరికి ఏది వస్తే అది అనేస్తారు, అర్థమేమీ లేదు. ఇది డ్రామా. మేము 84 జన్మల చక్రమును చుట్టి వస్తాము అని మధురాతి మధురమైన పిల్లలకు బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది. ఇప్పుడు తండ్రి పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. తండ్రి స్మృతిలో ఉంటూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఆ తర్వాత మనం చక్రవర్తీ రాజులుగా అవుతాము. అలా తయారుచేసేవారు తండ్రియే. ఆ పరమ ఆత్మ అయితే సదా పవిత్రమైనవారే. పవిత్రముగా తయారుచేయడానికి వారే వస్తారు. సత్యయుగములో మీరు సుందరముగా అవుతారు. అక్కడ సహజసిద్ధమైన సౌందర్యము ఉంటుంది. ఈ రోజుల్లోనైతే కృత్రిమమైన అలంకరణ చేసుకుంటూ ఉంటారు కదా. ఎలాంటి ఫ్యాషన్లు వెలువడుతూ ఉన్నాయి, ఎలాంటి డ్రస్సులు వేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎవరి దృష్టి పడకూడదని స్త్రీలు ఎంతగానో పరదాలో ఉండేవారు. ఇప్పుడైతే పరదా తెరిచేసారు, ఇక ఎక్కడపడితే అక్కడ అశుద్ధత పెరిగిపోయింది. తండ్రి అంటారు - చెడు వినకండి.

రాజులో శక్తి ఉంటుంది. ఈశ్వరార్థము దానం చేస్తే అందులో శక్తి ఉంటుంది. ఇక్కడైతే ఎవరిలోనూ శక్తి లేదు. ఎవరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. మనుష్యులు చాలా అశుద్ధముగా ఉన్నారు. మీరు చాలా సౌభాగ్యశాలులు ఎందుకంటే నావికుడు మీ చేతిని పట్టుకున్నారు. మీరే కల్ప-కల్పమూ నిమిత్తులవుతారు. మొదట ముఖ్యమైనది దేహాభిమానమని, దాని తర్వాతే అన్ని భూతాలూ వస్తాయని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇందులో కష్టపడాలి, ఇది చేదు మందేమీ కాదు. ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. తండ్రి స్మృతిలో ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా సరే కాళ్ళు ఎప్పుడూ అలసిపోవు, తేలికగా అయిపోతారు, ఎంతో సహాయము లభిస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు. మేము విశ్వాధిపతులుగా అవుతాము అని మీకు తెలుసు. మీరు తండ్రి వద్దకు వచ్చారు, వారు ఇంకే శ్రమనూ ఇవ్వరు. కేవలం చెడును వినకండి అని మాత్రం పిల్లలకు చెప్తారు. సేవాధారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడుతాయి. జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయము వారి నోటి నుండి వెలువడదు. మీరు వ్యర్థమైన పరచింతనా విషయాలను ఎప్పుడూ వినకూడదు. సేవ చేసేవారి నోటి నుండి సదా రత్నాలే వెలువడుతాయి. జ్ఞాన విషయాలు తప్ప మిగిలినవన్నీ రాళ్ళు విసురుకోవడమే. రాళ్ళు విసరటం లేదంటే తప్పకుండా జ్ఞాన రత్నాలనే ఇస్తారు. అయితే రాళ్ళు విసురుకుంటారు లేదా అవినాశీ జ్ఞాన రత్నాలను ఇచ్చుకుంటారు. వాటిని వెల కట్టలేరు. తండ్రి వచ్చి ఇప్పుడు మీకు జ్ఞాన రత్నాలను ఇస్తారు.

బాబా చాలా, చాలా మధురమైనవారని పిల్లలకు తెలుసు. నీవే తల్లివి, తండ్రివి... అంటూ అర్ధకల్పము గానం చేస్తూ వచ్చారు కానీ అర్థమును ఏ మాత్రమూ తెలుసుకునేవారు కారు. చిలుక వలె కేవలం గానం చేస్తూ ఉండేవారు. పిల్లలైన మీకు ఎంతటి సంతోషము ఉండాలి. బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని, విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం మనం విశ్వాధిపతులుగా ఉండేవారము. ఇప్పుడు అలా లేము, మళ్ళీ అలా అవుతాము. శివబాబా బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. బ్రాహ్మణ కులము కావాలి కదా. భగీరథుడు అని అనడం ద్వారా కూడా అర్థం చేసుకోలేరు, అందుకే బ్రహ్మా మరియు వారి బ్రాహ్మణ కులము అంటారు. బ్రహ్మా తనువులోకి ప్రవేశిస్తారు, అందుకే వారిని భగీరథుడు అని అంటారు. బ్రహ్మా పిల్లలు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు పిలక వంటివారు. విరాట రూపములో కూడా ఇలాగే ఉంటుంది, పైన బాబా ఉంటారు, ఆ తర్వాత సంగమయుగీ బ్రాహ్మణులు, వారే ఈశ్వరీయ సంతానముగా అవుతారు. మీకు తెలుసు - ఇప్పుడు మనము ఈశ్వరీయ సంతానము, తర్వాత దైవీ సంతానముగా అవుతాము, అప్పుడు డిగ్రీ తగ్గిపోతుంది. ఈ లక్ష్మీ-నారాయణుల డిగ్రీ కూడా తక్కువే, ఎందుకంటే వీరిలో జ్ఞానము లేదు. జ్ఞానము బ్రాహ్మణులలోనే ఉంది. అలాగని లక్ష్మీ-నారాయణలను అజ్ఞానులు అని అనరు. వీరు జ్ఞానము ద్వారా ఈ పదవిని పొందారు. బ్రాహ్మణులైన మీరు ఎంత ఉన్నతమైనవారు, తర్వాత దేవతలుగా అయ్యాక ఇంకే జ్ఞానమూ ఉండదు. వారిలో జ్ఞానము ఉన్నట్లయితే అది దైవీ వంశములో పరంపరగా కొనసాగుతూ వచ్చేది. మధురాతి మధురమైన చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలకు అన్ని రహస్యాలను, అని యుక్తులను తెలియజేస్తారు. ట్రైన్ లో కూర్చుని కూడా మీరు సేవ చేయవచ్చు. మీరు పరస్పరం కూర్చుని ఒక చిత్రము గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంతోమంది వచ్చి పోగవుతారు. ఈ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు బాగా ధారణ చేసి ప్రజలుగా అవుతారు. సేవ చేయడానికి చిత్రాలైతే ఎంతో మంచి-మంచివి ఉన్నాయి. భారతవాసులమైన మనం మొదట దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడైతే ఏమీ లేదు. మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుంది. మధ్యలో ఇది సంగమయుగము, ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయాలూ నోటి నుండి వెలువడకూడదు. పరచింతనా విషయాలను ఎప్పుడూ వినకూడదు. నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి, రాళ్ళు కాదు.

2. సేవతోపాటు స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి. అవినాశీ సర్జన్ అయిన భగవంతుడు స్వయంగా మనకు లభించారు, వారు 21 జన్మల కొరకు నిరోగులుగా తయారుచేస్తారు... ఈ నషాలో మరియు సంతోషములో ఉండాలి.

వరదానము:-
ప్రతి కర్మలోనూ ఫాలో ఫాదర్ చేస్తూ స్నేహానికి బదులు ఇచ్చే తీవ్ర పురుషార్థీ భవ

ఎవరి పట్లనైతే స్నేహము ఉంటుందో, వారిని ఆటోమేటిక్ గా ఫాలో చెయ్యటము జరుగుతుంది. సదా స్మృతిలో ఉండాలి - ఈ కర్మలేవైతే చేస్తున్నామో, అవి ఫాలో ఫాదర్ చేస్తున్న కర్మలేనా? ఒకవేళ అలా లేకపోతే వాటిని ఆపు చేయండి. తండ్రిని కాపీ చేస్తూ తండ్రి సమానముగా అవ్వండి. కాపీ చేయడానికి ఏ విధంగా కార్బన్ పేపర్ ను పెడతారో, అలా అటెన్షన్ అనే పేపర్ ను పెట్టినట్లయితే కాపీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడే తీవ్ర పురుషార్థులుగా అయ్యి స్వయాన్ని ప్రతి శక్తితో సంపన్నముగా తయారుచేసుకునే సమయము ఇది. ఒకవేళ స్వయమే స్వయాన్ని సంపన్నముగా చేసుకోలేకపోతే సహయోగము తీసుకోండి. లేకపోతే మున్ముందు ‘టూ లేట్’ అయిపోతారు.

స్లోగన్:-
సంతుష్టత యొక్క ఫలము ప్రసన్నత, ప్రసన్నచిత్తులుగా అవ్వటం ద్వారా ప్రశ్నలు సమాప్తమైపోతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఏ బలహీన ఆత్మ యొక్క బలహీనతను చూడకండి. అందరూ వెరైటీ ఆత్మలు అన్నది స్మృతిలో ఉండాలి. సర్వుల పట్ల ఆత్మిక దృష్టి ఉండాలి. వారిని ఆత్మ రూపములో స్మృతిలోకి తీసుకువచ్చినట్లయితే వారికి శక్తిని ఇవ్వగలుగుతారు. ఆత్మ మాట్లాడుతుంది, ఇది ఆత్మ యొక్క సంస్కారము, ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే అందరి పట్ల స్వతహాగానే శుభ భావన ఉంటుంది.