ఓంశాంతి
తండ్రి ప్రతిరోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు - పడుకునే సమయములో ఆంతరికముగా మీ
లెక్కాపత్రాన్ని చూసుకోండి, నేను ఎవరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా, ఎంత సమయం తండ్రిని
స్మృతి చేసాను? ముఖ్యమైన విషయము ఇదే. నేను తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎంతగా
అయ్యాను, రోజంతటిలో నా మధురమైన తండ్రిని ఎంత సమయము స్మృతి చేసాను - అని మీ లోలోపల
చూసుకోండి అని పాటలో కూడా అంటారు. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. మీ తండ్రిని స్మృతి
చేయండి అని ఆత్మలందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి
వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళి అక్కడి నుండి కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఇదైతే
పాత ప్రపంచము కదా. ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.
మనం సంగమయుగములో కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సంగమయుగములో వచ్చి
స్టీమర్ లో కూర్చుని మళ్ళీ దిగి వెళ్ళిపోతారు, ఇది కూడా విచిత్రమే. ఇప్పుడు మీరు
సంగమయుగములో పురుషోత్తములుగా అయ్యేందుకు, ఆవలి తీరానికి వెళ్ళేందుకు నావలోకి వచ్చి
కూర్చున్నారు. ఇక పాత కలియుగీ ప్రపంచము నుండి మనస్సును తొలగించవలసి ఉంటుంది. ఈ
శరీరము ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో సంతోషముగా
తిరిగి వెళ్ళాలి. మనుష్యులు ముక్తి కొరకు ఎంతగా కష్టపడుతుంటారు, కానీ
ముక్తీ-జీవన్ముక్తుల అర్థాన్ని అర్థం చేసుకోరు. శాస్త్రాలలో ఆ పదాలను కేవలం విన్నారు
కానీ అవి ఏమిటి, వాటిని ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, అదేమీ తెలియదు.
ముక్తీ-జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారని పిల్లలైన మీకు తెలుసు.
అది కూడా ఒక్కసారి ఏమీ కాదు కదా, అనేక సార్లు ఇస్తారు. లెక్కలేనన్ని సార్లు మీరు
ముక్తి నుండి జీవన్ముక్తిలోకి, మళ్ళీ అక్కడి నుండి జీవన బంధనములోకి వచ్చారు. మనం ఒక
ఆత్మ అని, బాబా పిల్లలైన మనకు ఎంతో శిక్షణను ఇస్తారని ఇప్పుడు మీకు అర్థమైంది. మీరు
భక్తి మార్గములో దుఃఖములో తలచుకునేవారు కానీ వారిని గుర్తించేవారు కాదు. ఇప్పుడు
నేను మీకు ఏ విధంగా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అంటూ నా
పరిచయాన్ని ఇచ్చాను. ఇప్పటివరకూ ఎన్ని వికర్మలు జరిగాయి అన్నది మీ లెక్కాపత్రాన్ని
పెట్టుకోవడం ద్వారా తెలుస్తుంది. ఎవరైతే సేవలో నిమగ్నులై ఉంటారో వారికి తెలుస్తుంది.
పిల్లలకు సేవా అభిరుచి ఎంతగానో ఉంటుంది. పరస్పరం కలుసుకుని, చర్చించుకుని, సేవ
చేయడానికి వెళ్తారు, మనుష్యుల జీవితాన్ని వజ్రతుల్యముగా చేయడానికి వెళ్తారు. ఇది
ఎంతటి పుణ్య కార్యము. ఇందులో ఖర్చు మొదలైనవాటి విషయము కూడా ఏమీ లేదు. కేవలం
వజ్రతుల్యముగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. పుష్యరాగము, పచ్చలు మొదలైన పేర్లు
ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరే. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా వజ్రతుల్యముగా అయిపోతారు.
కొందరు మాణిక్యముగా, కొందరు పుష్యరాగముగా అవుతారు. నవ రత్నాలు ఉంటాయి కదా. ఏదైనా
గ్రహచారము పడితే నవ రత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. భక్తి మార్గములో ఎన్నో స్లోగన్లు
ఇస్తారు. ఇక్కడైతే అన్ని ధర్మాలవారి కొరకు ఒకటే స్లోగన్ - మన్మనాభవ, ఎందుకంటే
భగవంతుడు ఒక్కరే. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు లేక ముక్తీ-జీవన్ముక్తులను
పొందేందుకు పురుషార్థము ఒక్కటే, కేవలం తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో కష్టము అనే
విషయమేదీ లేదు. ఆలోచించాలి - నాకు స్మృతి ఎందుకు నిలవడం లేదు, రోజంతటిలో నేను ఇంత
తక్కువగా ఎందుకు స్మృతి చేసాను? ఈ స్మృతి ద్వారా మనం సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా
అవుతాము అన్నప్పుడు మరి మన చార్టును పెట్టుకుని ఉన్నతిని ఎందుకు పొందకూడదు. 3-4
రోజులు చార్టు పెట్టి మళ్ళీ మర్చిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎవరికైనా అర్థం చేయించడం
చాలా సహజము. కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని మరియు పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు.
కలియుగము మారి సత్యయుగముగా అవుతుంది. బదిలీ అవుతుంది కావుననే మనం అర్థం
చేయిస్తున్నాము.
ఆ నిరాకార తండ్రియే బ్రహ్మా తనువులోకి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అన్న పక్కా
నిశ్చయము కూడా కొంతమంది పిల్లలలో లేదు. అరే, మీరు బ్రాహ్మణులు కదా. బ్రహ్మాకుమార,
కుమారీలుగా పిలవబడతారు, అసలు దాని అర్థమేమిటి? వారసత్వము ఎక్కడి నుండి లభిస్తుంది!
ఎప్పుడైతే ఎంతో కొంత ప్రాప్తి ఉంటుందో, అప్పుడే దత్తత తీసుకోవడం జరుగుతుంది. బ్రహ్మా
పిల్లలైన మీరు బ్రహ్మాకుమార, కుమారీలుగా ఎందుకయ్యారు? మీరు నిజంగానే అయ్యారా లేక
ఇందులో కూడా కొందరికి సంశయము కలుగుతుంటుందా. మహాన్ సౌభాగ్యశాలురైన పిల్లలెవరైతే
ఉంటారో, వారు స్త్రీ-పురుషులు కలిసి ఉంటూ కూడా భాయి-భాయిగా (సోదరులుగా) ఉంటారు.
స్త్రీ-పురుషులము అన్న భానము ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా లేకపోతే
స్త్రీ-పురుషులము అన్న దృష్టి మారడానికి కూడా సమయము పడుతుంది. మహాన్ సౌభాగ్యశాలురైన
పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు - నేను కూడా విద్యార్థినే, వీరు కూడా విద్యార్థియే,
మేము సోదరీ-సోదరులము అయ్యాము. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ
సాహసము నడవగలదు. ఆత్మలందరూ అయితే పరస్పరం సోదరులే, మళ్ళీ బ్రహ్మాకుమార, కుమారీలుగా
అవ్వడంతో సోదర-సోదరీలుగా అవుతారు. కొందరైతే బంధనముక్తులుగా కూడా ఉన్నారు, అయినా కానీ
ఎంతో కొంత బుద్ధి అటువైపుకు వెళ్తుంది. కర్మాతీత అవస్థ తయారవ్వడానికి సమయము పడుతుంది.
పిల్లలైన మీలో ఎంతో సంతోషము ఉండాలి. ఎటువంటి జంజాటమూ ఉండకూడదు. ఆత్మలమైన మనం పాత
శరీరము మొదలైనవన్నీ వదిలి ఇప్పుడు బాబా వద్దకు వెళ్తాము. మనం ఎంతటి పాత్రను
అభినయించాము. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. ఇలా, ఇలా మీతో మీరు మాట్లాడుకోవలసి
ఉంటుంది. ఎంతగా మాట్లాడుకుంటూ ఉంటారో, అంతగా హర్షితముగా కూడా ఉంటారు మరియు తమ
నడవడికను కూడా చూసుకుంటూ ఉంటారు - ఎంతవరకు మేము లక్ష్మీ-నారాయణులను వరించేందుకు
యోగ్యులుగా అయ్యాము అని. ఇప్పుడింకా కొద్ది సమయములో పాత శరీరాన్ని వదలాలి అని బుద్ధి
ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీరు పాత్రధారులు కూడా కదా. మీరు స్వయాన్ని
పాత్రధారులుగా భావిస్తారు. ఇంతకుముందు అలా భావించేవారు కాదు. ఇప్పుడు ఈ జ్ఞానము
లభించింది కావున లోలోపల ఎంతో సంతోషము ఉండాలి. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము, ద్వేషము
కలగాలి.
మీరు అనంతమైన సన్యాసులు, రాజయోగులు. ఈ పాత శరీరాన్ని కూడా బుద్ధి ద్వారా
సన్యసించాలి. దీనితో బుద్ధిని జోడించకూడదు అని ఆత్మ భావిస్తుంది. బుద్ధి ద్వారా ఈ
పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసించాము. ఇప్పుడు ఆత్మలమైన మనం వెళ్తాము, వెళ్ళి
తండ్రిని కలుసుకుంటాము. అది కూడా ఎప్పుడైతే ఒక్క తండ్రినే స్మృతి చేస్తారో అప్పుడే
సంభవమవుతుంది. ఇంకెవరినైనా స్మృతి చేస్తే, వాళ్ళ స్మృతి తప్పకుండా కలుగుతుంది,
అప్పుడు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది.
మంచి-మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వారు తమతో తాము ఈ ప్రతిజ్ఞ చేసుకుంటారు -
మేము స్కాలర్షిప్ తీసుకునే తీరుతాము అని. కావున ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికీ ఈ ఆలోచన
లోపల ఉండాలి - మేము తండ్రి ద్వారా పూర్తి రాజ్య భాగ్యాన్ని తీసుకునే తీరుతాము అని.
అప్పుడు వారి నడవడిక కూడా అలాగే ఉంటుంది. మున్ముందు పురుషార్థము చేస్తూ-చేస్తూ
వేగముగా పరుగెత్తాలి. అది ఎప్పుడు సంభవమవుతుందంటే - ప్రతిరోజూ సాయంత్రం వేళలో తమ
అవస్థను చూసుకున్నప్పుడు. బాబా వద్దకు ప్రతి ఒక్కరి సమాచారమైతే వస్తుంది కదా. బాబా
ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకోగలరు. మీలో అది కన్పించడం లేదు అని కొందరితో అనేస్తారు
కూడా. ఈ లక్ష్మీ-నారాయణులలా తయారయ్యే ముఖము కనిపించడం లేదు, మీ నడవడిక, అన్నపానాదులు
మొదలైనవి చూసుకోండి, సేవ ఎక్కడ చేస్తున్నారు! మరి అక్కడ ఏమవుతారు! అప్పుడు - మేము
ఏదో ఒకటి చేసి చూపించాలి అని మనసులో భావిస్తారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు
తమ భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకునేందుకు చదువుకోవాలి. ఒకవేళ శ్రీమతముపై నడవకపోతే
అంతటి ఉన్నత పదవిని కూడా పొందలేరు. ఇప్పుడు పాస్ అవ్వకపోతే ఇక కల్ప-కల్పాంతరాలు కూడా
పాస్ అవ్వరు. మేము ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నాము అని మీకు అంతా
సాక్షాత్కారమవుతుంది. తమ పదవి యొక్క సాక్షాత్కారమును కూడా పొందుతూ ఉంటారు.
ప్రారంభములో కూడా సాక్షాత్కారాలు పొందేవారు, కానీ బాబా వాటిని వినిపించవద్దు అని ఆపు
చేసేవారు. మేము ఎలా తయారవుతాము అని చివరిలో అంతా తెలిసిపోతుంది, కానీ అప్పుడు ఏమీ
చేయలేరు. కల్ప-కల్పాంతరాలు అదే పరిస్థితి ఏర్పడుతుంది. డబుల్ కిరీటధారులుగా అవ్వలేరు,
డబుల్ రాజ్యభాగ్యాన్ని పొందలేరు. ఇప్పుడు పురుషార్థము చేసేందుకు అవకాశము ఎంతగానో
ఉంది. త్రేతా అంతిమము వరకు 16,108 పెద్ద మాల తయారవ్వనున్నది. ఇక్కడకు మీరు నరుని
నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము చేసేందుకు వచ్చారు. ఎప్పుడైతే తక్కువ పదవి
యొక్క సాక్షాత్కారము జరుగుతుందో, అప్పుడు ఆ సమయములో స్వయంపై ద్వేషము కలగడం
మొదలవుతుంది. తల కిందకు దిగిపోతుంది. మేమైతే ఏమీ పురుషార్థము చేయలేదు, చార్ట్
పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని బాబా ఎంతగా అర్థం చేయించారు... అని భావిస్తారు.
అందుకే బాబా అంటారు - ఏయే పిల్లలైతే వస్తారో వారందరి ఫొటోలు ఉండాలి. గ్రూప్ అందరి
ఫోటో కలిసి ఉన్నా పర్వాలేదు. పార్టీలు తీసుకుని వస్తారు కదా. అందులో తారీఖు, ఫిల్మ్
మొదలైనవన్నీ ఉండాలి. అప్పుడు ఎవరెవరు పడిపోయారు అనేది బాబా తెలియజేస్తూ ఉంటారు. బాబా
వద్దకు సమాచారాలైతే అన్నీ వస్తాయి, వారు తెలియజేస్తూ ఉంటారు. ఎంతమందిని మాయ లాక్కుని
తీసుకువెళ్ళిపోయింది. అంతమైపోయారు. కుమార్తెలు కూడా ఎంతోమంది పడిపోతూ ఉంటారు.
పూర్తిగా దుర్గతిని పొందుతారు, ఇక అడగకండి. అందుకే బాబా అంటారు - పిల్లలూ,
జాగ్రత్తగా ఉండండి. మాయ ఏదో ఒక రూపాన్ని ధరించి పట్టుకుంటుంది. అసలు ఎవరి నామ-రూపాల
వైపుకూ చూడకండి కూడా. ఈ కళ్ళతో చూస్తున్నా కానీ బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతే ఉండాలి.
తండ్రినే చూసేందుకు మరియు వారినే స్మృతి చేసేందుకు మూడవ నేత్రము లభించింది.
దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. అలాగని ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కళ్ళను కిందకు
దించుకుని మాట్లాడమని కాదు. అటువంటి బలహీనులుగా అవ్వకూడదు. చూస్తూ కూడా బుద్ధి యోగము
మీ ప్రియమైన ప్రియుడి వైపు ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ - ఇది స్మశానవాటికగా
అవ్వనున్నది, ఇక దీనితో ఏం సంబంధం పెట్టుకుంటాము అని లోలోపల భావిస్తారు! మీకు
జ్ఞానము లభిస్తుంది, దానిని ధారణ చేసి దానిపై నడవాలి.
పిల్లలైన మీరు ప్రదర్శినీ మొదలైనవి అర్థం చేయించేటప్పుడు వేయి సార్లు నోటి నుండి
బాబా, బాబా అని వెలువడాలి. బాబాను స్మృతి చేసినట్లయితే మీకు ఎంత లాభము కలుగుతుంది.
శివబాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి.
శివబాబాను స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. బాబా
అంటారు, నన్ను స్మృతి చేయండి, ఇది మర్చిపోకండి. మన్మనాభవ అని తండ్రి డైరెక్షన్
లభించింది. ఈ ‘బాబా’ అన్న పదాన్ని లోలోపల చాలా బాగా అభ్యాసము చేస్తూ ఉండండి. రోజంతా
బాబా, బాబా అంటూ ఉండాలి. ఇంకే విషయమూ ఉండకూడదు. ముఖ్యమైన నంబర్ వన్ విషయము ఇదే.
మొదట తండ్రిని తెలుసుకోవాలి, ఇందులోనే కళ్యాణము ఉంది. ఈ 84 జన్మల చక్రాన్ని అర్థం
చేసుకోవడం చాలా సహజము. పిల్లలకు ప్రదర్శినీలో అర్థం చేయించే అభిరుచి ఎంతగానో ఉండాలి.
ఒకవేళ ఎక్కడైనా మేము అర్థం చేయించలేము అని గమనిస్తే, అప్పుడు మేము మా పెద్ద
అక్కయ్యను పిలుచుకుని వస్తాము అని చెప్పాలి ఎందుకంటే ఇది కూడా పాఠశాలయే కదా. ఇందులో
కొందరు తక్కువగా, కొందరు ఎక్కువగా చదువుకుంటారు. ఇలా చెప్పడానికి దేహాభిమానము
రాకూడదు. ఎక్కడైనా పెద్ద సెంటర్ ఉంటే అక్కడ ప్రదర్శినీ కూడా తయారుచేయాలి. గేట్ వే
టు హెవెన్ అన్న చిత్రము పెట్టి ఉండాలి. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
ఈ రాబోయే యుద్ధానికి ముందే మీ వారసత్వాన్ని తీసుకోండి. ఏ విధంగా మందిరానికి రోజూ
వెళ్ళవలసి ఉంటుందో, అలాగే మీకు ఈ పాఠశాల ఉంది. చిత్రాలు పెట్టి ఉన్నట్లయితే అర్థం
చేయించడం సహజమవుతుంది. మేము మా పాఠశాలను చిత్రశాలగా ఎలా చేయాలి అని ప్రయత్నించండి.
ఆకర్షణ కూడా ఉండాలి, అప్పుడు మనుష్యులు వస్తారు. వైకుంఠానికి వెళ్ళే మార్గము అనేది
ఒక్క క్షణములో అర్థం చేసుకునే మార్గము. తండ్రి అంటారు, తమోప్రధానులు ఎవరూ
వైకుంఠములోకి వెళ్ళలేరు. కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు సతోప్రధానముగా అవ్వాలి,
ఇందులో ఎటువంటి ఖర్చూ లేదు. అలాగే మందిరములోకి లేక చర్చి మొదలైనవాటిలోకి వెళ్ళే
అవసరమూ లేదు. స్మృతి చేస్తూ, చేస్తూ పవిత్రముగా అయి నేరుగా మధురమైన ఇంటికి
వెళ్ళిపోతారు. ఈ విధంగా మీరు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయిపోతారని నేను గ్యారంటీ
ఇస్తున్నాను. చక్రము చిత్రములో గేట్ పెద్దగా ఉండాలి. స్వర్గము యొక్క గేట్ ఎలా
తెరుచుకుంటుంది... ఎంత స్పష్టముగా ఉంది. నరకము యొక్క గేట్ మూసుకుపోనున్నది.
స్వర్గములో నరకము అన్న మాటే ఉండదు. కృష్ణుడిని ఎంతగా తలుచుకుంటారు. కానీ అతను
ఎప్పుడు వస్తారు అనేది ఎవరికీ తెలియదు, ఏమీ తెలియదు. అసలు తండ్రిని గురించే తెలియదు.
భగవంతుడు మనకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు - ఇది గుర్తున్నా సరే ఎంతటి
సంతోషము ఉంటుంది. మేము ఈశ్వరుడైన తండ్రికి విద్యార్థులము అన్న సంతోషము కూడా ఉండాలి.
దీనిని ఎందుకు మర్చిపోవాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.