30-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని జ్ఞానముతో శుద్ధమైన, సుగంధమయమైన పుష్పాలుగా తయారుచేయడానికి వచ్చారు, మీరు ముళ్ళలా అవ్వకూడదు, ముళ్ళను ఈ సభలోకి తీసుకురాకూడదు’’

ప్రశ్న:-
ఏ పిల్లలైతే స్మృతి యాత్రలో కృషి చేస్తూ ఉంటారో వారి గుర్తులేమిటి?

జవాబు:-
స్మృతి విషయములో కృషి చేసే పిల్లలు చాలా సంతోషములో ఉంటారు. బుద్ధిలో ఏమని ఉంటుందంటే - ఇప్పుడు మేము తిరిగి వెళ్తున్నాము, ఆ తర్వాత మేము సుగంధమయమైన పుష్పాలతోటలోకి వెళ్ళాలి. మీరు స్మృతియాత్ర ద్వారా సుగంధమయంగా తయారవుతారు మరియు ఇతరులను కూడా అలా తయారుచేస్తారు.

ఓంశాంతి
తోట యజమాని కూడా కూర్చున్నారు, అలాగే తోటమాలులు కూడా ఉన్నారు, పుష్పాలు కూడా ఉన్నాయి. ఇది కొత్త విషయము కదా. ఎవరైనా కొత్తవారు ఒకవేళ వింటే, వీరు ఏమంటున్నారు? అని అంటారు. తోట యజమాని, పుష్పాలు, ఇదంతా ఏమిటి, ఇటువంటి విషయాలనైతే శాస్త్రాలలో ఎక్కడా వినలేదే? అని అంటారు. పిల్లలైన మీకు తెలుసు, అంతేకాక మీరు ఆ తోట యజమానిని మరియు నావికుడిని స్మృతి కూడా చేస్తారు. ఇక్కడి నుండి మనల్ని ఆవలి తీరానికి తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు వారు ఇక్కడకు వచ్చారు. స్మృతియాత్రలో ఉండాలి అని తండ్రి అంటారు. నేను ఎంతదూరం వెళ్తున్నాను, నా సతోప్రధాన అవస్థకు ఎంతవరకు చేరుకున్నాను అని మిమ్మల్ని మీరే చూసుకోండి. ఎంతగా సతోప్రధాన అవస్థ తయారవుతూ ఉంటుందో, అంతగా ఇప్పుడు మేము తిరిగి వెళ్తున్నాము అని భావిస్తారు. నేను ఎంతవరకు చేరుకున్నాను, మొత్తం ఆధారమంతా స్మృతియాత్రపై ఉంది. సంతోషము కూడా ఎక్కి ఉంటుంది. ఎవరు ఎంతగా కష్టపడుతూ ఉంటారో, అంతగా వారిలో సంతోషము కలుగుతుంది. ఉదాహరణకు పరీక్షల రోజులు వచ్చినప్పుడు - తాము ఎంతవరకు పాస్ అవుతారు అనేది విద్యార్థులకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ కూడా అంతే - తాము ఎంతవరకు సుగంధమయమైన పుష్పాలుగా అయ్యారు, ఎంతవరకు ఇతరులను సుగంధమయమైన పుష్పాలుగా తయారుచేస్తున్నారు అనేది పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. ముళ్ళ అడవి అని అంటూ ఉంటారు కూడా. అది పుష్పాల తోట. ముసల్మానులు కూడా గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. అక్కడ ఒక తోట ఉందని, అక్కడికి ఎవరైతే వెళ్తారో వారికి ఖుదా పుష్పాన్ని ఇస్తారని వారు భావిస్తారు. మనసులో ఏ కామన అయితే ఉంటుందో, దానిని పూర్తి చేస్తారు. అంతేకానీ అక్కడ ఏదో పుష్పము తీసి ఇస్తారని కాదు. ఎవరి బుద్ధిలో ఎలా ఉంటుందో అలా సాక్షాత్కారమవుతుంది. ఇక్కడ ఏదీ సాక్షాత్కారాలపై ఆధారపడి లేదు. భక్తి మార్గములోనైతే సాక్షాత్కారాల కోసం శిరస్సు కూడా ఖండించేసుకుంటారు. మీరాకు సాక్షాత్కారము కలిగింది, ఆమె పట్ల ఎంత గౌరవము ఉంది. అది భక్తి మార్గము. భక్తి అయితే అర్ధకల్పము జరగవలసిందే. జ్ఞానమనేది అప్పుడు అసలు లేనే లేదు. వేదాలు మొదలైనవాటికి ఎంతో గౌరవము ఉంది. వేదాలు అనేవి మా ప్రాణము వంటివి అని అంటారు. ఈ వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గము కొరకేనని ఇప్పుడు మీకు తెలుసు. భక్తి విస్తారము ఎంత ఎక్కువగా ఉంది. అది పెద్ద వృక్షము వంటిది. జ్ఞానము బీజము. ఇప్పుడు జ్ఞానము ద్వారా మీరు ఎంత శుద్ధముగా అవుతారు. సుగంధమయముగా అవుతారు. ఇది మీ పుష్పాల తోట. ఇక్కడ ఎవరినీ ముల్లు అనరు, ఎందుకంటే ఇక్కడ ఎవరూ వికారాలలోకి వెళ్ళరు. కావున ఈ పుష్పాల తోటలో ముళ్ళు ఒక్కరు కూడా లేరు అని అంటారు. ముళ్ళు కలియుగములో ఉంటాయి. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇందులోకి ముళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి. ఒకవేళ ఎవరైనా ముళ్ళు కూర్చుని ఉంటే వారు తమను తామే నష్టపర్చుకుంటారు, ఎందుకంటే ఇది ఇంద్రప్రస్థము కదా. ఇందులో జ్ఞాన దేవ కన్యలు కూర్చుని ఉన్నారు. వీరు జ్ఞాన నాట్యము చేసే దేవ కన్యలు. ముఖ్యమైనవారికి పుష్యరాగము, నీలమణి... మొదలైన పేర్లు పెట్టడం జరిగింది. వారే తర్వాత నవ రత్నాలుగా గాయనము చేయబడతారు. కానీ వారు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి కేవలం - నన్ను స్మృతి చేయండి అని అంటారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానము ఉంది, 84 జన్మల చక్రము కూడా ఇప్పుడు బుద్ధిలో ఉంది. శాస్త్రాలలో అయితే 84 లక్షల జన్మలు అని అనేసారు. మధురాతి మధురమైన చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలకు తండ్రి అర్థం చేయించారు - మీరు 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. ఇది ఎంత సహజము. పిల్లల పట్ల భగవానువాచ ఏమిటంటే - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు సుగంధమయమైన పుష్పాలుగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ముళ్ళలా అవ్వకండి. ఇక్కడ అందరూ మధురాతి మధురమైన పుష్పాలే, ముళ్ళు లేరు. అయితే, మాయ తుఫానులైతే వస్తాయి. మాయ ఎంత కఠినమైనదంటే, అది వెంటనే చిక్కుకునేలా చేస్తుంది. ఆ తర్వాత పశ్చాత్తాపపడతారు - మేము ఇలా చేసామేమిటి, మేము చేసుకున్న సంపాదన అంతా అంతమైపోయిందే అని.

ఇది పుష్పాల తోట. పుష్పాల తోటలో మంచి-మంచి పుష్పాలు కూడా ఉంటాయి. ఈ పుష్పాల తోటలో కూడా కొందరు ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలుగా అవుతూ ఉంటారు. ఉదాహరణకు మొఘల్ గార్డెన్ లో మంచి-మంచి పుష్పాలు ఉంటాయి. వాటిని చూసేందుకు అందరూ వెళ్తారు. ఇక్కడ మీ వద్దకు చూసేందుకు ఎవరూ రారు. మీరు ముళ్ళకు మీ ముఖమునేమి చూపిస్తారు? మురికి పట్టిన వస్త్రాలను ఉతుకుతారు... అని గాయనము కూడా ఉంది. బాబాకు జప సాహెబ్, సుఖమణి మొదలైన గ్రంథాలన్నీ గుర్తుండేవి. అఖండ పఠనము కూడా చేసేవారు. ఎనిమిది సంవత్సరాల వయసులోనే వారు తలకు తలపాగాలా కట్టుకునేవారు. ఉండడమే మందిరములోనే ఉండేవారు. మందిరము యొక్క బాధ్యత అంతా నాపైన ఉండేది. మురికి పట్టిన వస్త్రాలను ఉతకడం అంటే అర్థమేమిటో ఇప్పుడు అర్థమవుతుంది. మహిమ అంతా బాబాదే. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మంచి-మంచి పుష్పాలను తీసుకురండి అని పిల్లలతో అంటారు కూడా. ఎవరైతే మంచి-మంచి పుష్పాలను తీసుకువస్తారో, వారు మంచి పుష్పాలుగా లెక్కింపబడతారు. మేము శ్రీలక్ష్మీ-నారాయణుల వలె అవుతాము అని అందరూ అంటారు అనగా గులాబీ పుష్పాలుగా అయినట్లే కదా. తండ్రి అంటారు, అచ్ఛా, మరి పిల్లలైన మీ నోటిలో గులాబి. ఇప్పుడు పురుషార్థము చేసి ‘సదా గులాబీ’ గా అవ్వండి (చాలా సుగంధమునిచ్చే ఒక రకం దేశీ గులాబీని ‘సదా గులాబీ’ అని అంటారు). లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతున్నారు. అక్కడ ఉండేదే కేవలం రాజు, రాణి మరియు ప్రజలు. సత్యయుగములో మంత్రి ఉండనే ఉండరు, ఎందుకంటే రాజులోనే అంతటి శక్తి ఉంటుంది. మంత్రులు మొదలైనవారి నుండి సలహాలు తీసుకోవలసిన అవసరమే ఉండదు, లేదంటే సలహా ఇచ్చేవారు పెద్దవారైపోతారు. అక్కడ భగవాన్, భగవతీలకు సలహాల యొక్క అవసరముండదు. ఎప్పుడైతే పతితులుగా అవుతారో, అప్పుడే మంత్రులు మొదలైనవారు ఉంటారు. ఇది భారత్ యొక్క విషయమే. ఇలా రాజులు రాజులకు తల వంచి నమస్కరించే ఖండము ఇంకేదీ లేదు. జ్ఞాన మార్గములో పూజ్యులుగా, అజ్ఞాన మార్గములో పూజారులుగా ఉంటారని ఇక్కడే చూపించడం జరుగుతుంది. వారు ద్వి కిరీటధారులు, వీరు ఏక కిరీటధారులు. భారత్ వంటి పవిత్రమైన ఖండము ఇంకేదీ లేదు. ప్యారడైజ్ గా, బహిష్త్ గా ఉండేది. మీరు దాని కోసమే చదువుతున్నారు. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారవ్వాలి. తోట యజమాని వచ్చారు. తోటమాలులు కూడా ఉన్నారు. తోటమాలులు నంబరువారుగా ఉంటారు. ఇది పుష్పాల తోట అని, ఇందులో ముళ్ళు లేవని, ముళ్ళు దుఃఖాన్ని ఇస్తాయని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. తండ్రి అయితే ఎవరికీ దుఃఖమును ఇవ్వరు. వారు దుఃఖహర్త, సుఖకర్త. బాబా ఎంత మధురమైనవారు.

పిల్లలైన మీకు తండ్రిపై ప్రేమ ఉంది. తండ్రి కూడా పిల్లలను ప్రేమిస్తారు కదా. ఇది చదువు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ప్రాక్టికల్ గా చదివిస్తాను. ఇతను కూడా చదువుతారు. చదువుకుని చదివించినట్లయితే ఇతరులు కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. భారత్ మహాదానిగా గానం చేయబడుతుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు మహాదానులుగా అవుతారు. మీరు అవినాశీ జ్ఞాన రత్నాలను దానము చేస్తారు. ఆత్మయే రూప్ (యోగ స్వరూపము) మరియు బసంత్ (జ్ఞాన స్వరూపము) అని బాబా అర్థం చేయించారు. అలాగే బాబా కూడా రూప్-బసంత్. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, వారు అథారిటీ కదా. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. అందుకే - మొత్తం సముద్రమంతటినీ సిరాగా మార్చినా అది తరగదు అన్న గాయనము ఉంది. అలాగే మళ్ళీ ఒక్క క్షణములో జీవన్ముక్తి అన్న గాయనము కూడా ఉంది. మీ వద్ద శాస్త్రాలు మొదలైనవి ఏవీ లేవు. అక్కడ పండితులు మొదలైనవారెవరి వద్దకైనా వెళ్తే - ఈ పండితుడు ఎంతో చదివినవారు, ఇతను అథారిటీ, ఇతను వేద-శాస్త్రాలు మొదలైనవాటన్నింటినీ కంఠస్థము చేసారు అని భావిస్తారు. వారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు, అప్పుడు బాల్యము నుండే వాటిని అధ్యయనం చేస్తారు. మీరు సంస్కారాలు తీసుకువెళ్ళరు. మీరు చదువు యొక్క రిజల్టును తీసుకువెళ్తారు. మీ చదువు పూర్తి అయినట్లయితే ఇక రిజల్టు వెలువడుతుంది మరియు ఆ పదవిని పొందుతారు. ఎవరికైనా వినిపించేందుకు జ్ఞానాన్ని ఏమీ తీసుకువెళ్ళరు. ఇక్కడైతే మీది చదువు, దీని ప్రారబ్ధము కొత్త ప్రపంచములో లభించనున్నది. మాయ కూడా తక్కువ శక్తివంతమైనదేమీ కాదని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. మాయకు దుర్గతిలోకి తీసుకువెళ్ళే శక్తి ఉంది, కానీ మాయకు మహిమనైతే చేయరు కదా. అదైతే దుఃఖమునివ్వడములో శక్తివంతమైనది కదా. తండ్రి సుఖమునివ్వడంలో శక్తివంతులు, అందుకే వారికి గాయనము ఉంది. ఇది కూడా డ్రామాగా తయారచేయబడి ఉంది. మీరు సుఖాన్ని పొందుతారు, అలాగే దుఃఖాన్ని కూడా పొందుతారు. గెలుపు మరియు ఓటములు ఎవరివి అనేదాని గురించి కూడా మీకు తెలిసి ఉండాలి కదా. తండ్రి కూడా భారత్ లోకే వస్తారు, జయంతి కూడా భారత్ లోనే జరుపుకోబడుతుంది. శివబాబా ఎప్పుడు వచ్చారు, వారు వచ్చి ఏమి చేసారు అనేది ఎవ్వరికీ తెలియదు. నామ-రూపాలనే మాయం చేసేసారు. చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుని పేరును పెట్టేసారు. వాస్తవానికి అతి ప్రియమైన తండ్రి మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. వారు నిరాకారుడైతే వీరు సాకారుడు. శ్రీకృష్ణుడిని - సర్వ గుణసంపన్నుడు... అని మహిమ చేస్తారు. శివబాబాను ఇలా మహిమ చేయరు. ఎవరిలోనైతే గుణాలు ఉంటాయో వారిలో అవగుణాలు కూడా ఉంటాయి, అందుకే తండ్రి మహిమయే వేరు. తండ్రిని అకాలమూర్తి అని కూడా అంటారు కదా. మనం కూడా అకాలమూర్తులమే. ఆత్మను మృత్యువు కబళించలేదు. అకాలమూర్తి అయిన ఆత్మకు ఇది సింహాసనము. మన బాబా కూడా అకాలమూర్తియే. మృత్యువు శరీరమునే కబళిస్తుంది. ఇక్కడకు అకాలమూర్తిని పిలుస్తారు. సత్యయుగములో వారిని పిలవరు, ఎందుకంటే అక్కడ అంతా సుఖమే సుఖము ఉంది, అందుకే దుఃఖములో అందరూ స్మరిస్తారు కానీ సుఖములో ఎవ్వరూ స్మరించరు అని గానం కూడా చేస్తారు. ఇప్పుడు రావణ రాజ్యములో ఎంత దుఃఖము ఉంది. తండ్రి అయితే స్వర్గాధిపతులుగా తయారుచేస్తారు, ఇక తర్వాత అక్కడ అర్ధకల్పము ఎవరూ పిలవనే పిలవరు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలను అలంకరించి, వారికి వారసత్వాన్ని ఇచ్చి తాను స్వయం వానప్రస్థావస్థకు వెళ్తారో, ఇదీ అంతే. తండ్రి పిల్లలకు సర్వస్వాన్ని ఇచ్చి, ఇప్పుడు నేను ఇక సత్సంగములోకి వెళ్తున్నాను, తినేందుకు ఏదైనా పంపిస్తూ ఉండు అని అంటారు. ఈ తండ్రి అయితే అలా అనరు కదా. వీరు అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చి వానప్రస్థములోకి వెళ్ళిపోతాను. తినేందుకు ఏమైనా పంపించండి అని నేను అనను. తండ్రిని సంబాళించడం లౌకిక పిల్లల బాధ్యత, లేదంటే వారు ఎలా తింటారు? ఈ తండ్రి అయితే - నేను నిష్కామ సేవాధారిని అని అంటారు. మనుష్యులెవ్వరూ నిష్కాములుగా ఉండరు, లేదంటే ఆకలితో చనిపోతారు. నేనైతే అలా ఆకలితో చనిపోను. నేను అభోక్తను. పిల్లలైన మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత నా పాత్ర పూర్తి అయిపోతుంది. తర్వాత భక్తి మార్గములో ప్రారంభమవుతుంది. ఇది అనాది డ్రామాగా రచింపబడి ఉంది, ఈ రహస్యాన్ని తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీ పాత్ర అందరికన్నా ఎక్కువ, అందుకే బహుమానము కూడా మీకు లభించాలి. నేను విశ్రాంతి తీసుకుంటాను. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులుగా మరియు విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఈ డ్రామా రహస్యము గురించి కూడా మీకు తెలుసు. మీరు జ్ఞాన పుష్పాలు. ఇలా ప్రపంచములో ఒక్కరు కూడా లేరు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగలులోకి వెళ్తారు. ఈ రోజుల్లో వన మహోత్సవాలు ఎలా చేస్తూ ఉన్నారో చూడండి. ఇప్పుడు భగవంతుడు మనుష్యుల వన మహోత్సవాన్ని జరుపుతున్నారు.

తండ్రి ఎటువంటి అద్భుతాన్ని చేస్తున్నారో చూడండి. వారు మనుష్యులను దేవతలుగా, నిరుపేదలను రాజులుగా చేస్తారు. ఇప్పుడు అనంతమైన తండ్రితో మీరు ఒప్పందము కుదుర్చుకునేందుకు వచ్చారు. బాబా, మమ్మల్ని నిరుపేదల నుండి రాజులుగా చేయండి అని మీరు అంటారు. శివబాబా అంటారు, ఇతను చాలా మంచి కస్టమరు. వారిని మీరు దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు కూడా. ఇటువంటి దానము ఇంకేదీ ఉండదు. వారు సుఖాన్ని ఇచ్చేవారు. తండ్రి అంటారు, భక్తి మార్గములో కూడా నేను మీకు ఇస్తాను. సాక్షాత్కారాలు మొదలైనవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. నేను ఏమేమి చేస్తాను అనేది ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మున్ముందు ఇంకా అర్థం చేయిస్తూ ఉంటారు. చివరికి అంతిమములో మీరు నంబరువారుగా కర్మాతీత అవస్థకు చేరుకుంటారు. ఇవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, అయినా కూడా - తండ్రిని స్మృతి చేయండి అని పురుషార్థము చేయించడం జరుగుతుంది. తప్పకుండా ఈ మహాభారత యుద్ధము కూడా ఉంటుంది. అందరూ అంతమైపోతారు. కేవలం భారతవాసులే మిగులుతారు, ఆ తర్వాత మీరు విశ్వముపై రాజ్యము చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివించడానికి వచ్చారు. వారే జ్ఞానసాగరుడు. ఇది కూడా ఆటయే, ఇందులో తికమకపడే విషయమే లేదు. మాయ తుఫానులలోకి తీసుకువస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాటిని చూసి భయపడకండి. చాలా అశుద్ధమైన సంకల్పాలు వస్తాయి. అది కూడా, ఎప్పుడైతే తండ్రి దత్తత తీసుకుంటారో అప్పుడే వస్తాయి. ఎప్పటివరకైతే తండ్రి దత్తత తీసుకోరో అప్పటివరకూ మాయ అంతగా పోట్లాడదు. తండ్రి దత్తత తీసుకున్న తర్వాతనే తుఫానులు వస్తాయి, అందుకే తండ్రి అంటారు, దత్తత తీసుకునే ముందు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. బలహీనముగా ఉంటే ఇక ప్రజల్లోకి వచ్చేస్తారు. రాజ్య పదవిని పొందడమైతే మంచిదే కదా లేకపోతే దాస-దాసీలుగా అవ్వవలసి ఉంటుంది. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతోంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రూప-బసంత్ గా (యోగ స్వరూపులుగా, జ్ఞాన స్వరూపులుగా) అయి అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఏ చదువునైతే చదువుతారో దానిని ఇతరులకు కూడా చదివించాలి.

2. ఏ విషయములోనూ తికమకపడకూడదు మరియు భయపడకూడదు, స్వయాన్ని సంభాళించుకోవాలి. తమను తాము ప్రశ్నించుకోవాలి - నేను ఏ రకమైన పుష్పాన్ని? నాలో ఎటువంటి దుర్గంధమైతే లేదు కదా?

వరదానము:-
దృఢ సంకల్పము ద్వారా బలహీనతల రూపీ కలియుగీ పర్వతమును సమాప్తము చేసే సమర్థీ స్వరూప భవ

నిరాశకు లోనవ్వటము, ఏ సంస్కారానికైనా లేక పరిస్థితికైనా వశీభూతమవ్వటము, వ్యక్తి లేక వైభవాల వైపుకు ఆకర్షితులవ్వటము - ఈ అన్ని బలహీనతలు అనే కలియుగీ పర్వతమును దృఢ సంకల్పమనే చేతివేలుతో సదాకాలము కొరకు సమాప్తము చెయ్యండి అనగా విజయులుగా అవ్వండి. విజయము మా మెడలోని హారము - సదా ఈ స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వండి. ఇదే స్నేహానికి రిటర్న్ ఇవ్వటము. సాకార తండ్రి ఏ విధంగా స్థితిలో స్తంభముగా అయ్యి చూపించారో, అలా ఫాలో ఫాదర్ చేసి సర్వ గుణాల స్తంభముగా అవ్వండి.

స్లోగన్:-
సాధనాలు సేవల కోసం ఉన్నాయి, అంతేకానీ విశ్రాంతి ప్రియులుగా అయ్యేందుకు కాదు.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఏ విధంగా ఆటమ్ బాంబును ఒక్క స్థానములో వదిలితే నలువైపులా దాని అంశాలు వ్యాపిస్తాయి - అలా అది ఆటమ్ బాంబు మరియు ఇది ఆత్మిక బాంబు. దీని ప్రభావము అనేకాత్మలను ఆకర్షితము చేస్తుంది మరియు సహజముగానే ప్రజల వృద్ధి జరుగుతుంది, అందుకే సంగఠిత రూపములో ఆత్మిక స్వరూపపు అభ్యాసాన్ని పెంచండి, స్మృతి స్వరూపులుగా అవ్వండి, అప్పుడు వాయుమండలము శక్తిశాలిగా అవుతుంది.