31-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇక్కడకు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు వచ్చారు అనగా దీపములో జ్ఞానమనే తైలాన్ని వేయడానికి వచ్చారు’’

ప్రశ్న:-
శివుని ఊరేగింపుకు గాయనము ఎందుకు ఉంది?

జవాబు:-
ఎందుకంటే శివబాబా ఎప్పుడైతే తిరిగి వెళ్తారో అప్పుడు ఆత్మలందరి గుంపు వారి వెనుక-వెనుక పరిగెడుతూ వెళ్తుంది. మూలవతనములో కూడా ఆత్మల గోపురము తయారవుతుంది. పవిత్రముగా తయారయ్యే పిల్లలైన మీరు తండ్రితో పాటుగా వెళ్తారు. వారితో పాటుగా వెళ్ళిన కారణముగానే ఊరేగింపుకు గాయనము ఉంది.

ఓంశాంతి
పిల్లలు మొట్టమొదట ఒకే ఒక్క పాయింటును అర్థం చేసుకోవాలి - మనమందరమూ సోదరులము మరియు వారు మనందరికీ తండ్రి, వారిని సర్వశక్తివంతుడని అంటారు. మీలో సర్వశక్తులు ఉండేవి. మీరు విశ్వముపై రాజ్యము చేసేవారు. భారత్ లోనే ఈ దేవీ-దేవతల రాజ్యముండేది అనగా పిల్లలైన మీ రాజ్యముండేది. మీరు పవిత్రమైన దేవీ-దేవతలుగా ఉండేవారు, మీ కులము మరియు వంశము ఉండేది, వారందరూ నిర్వికారులుగా ఉండేవారు. నిర్వికారులుగా ఎవరుండేవారు? ఆత్మలు. ఇప్పుడు మళ్ళీ మీరు నిర్వికారులుగా అవుతూ ఉన్నారు. సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మయే 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. ఆత్మలో ఉన్న సతోప్రధాన శక్తి రోజు-రోజుకూ తగ్గిపోతూ ఉంటుంది. సతోప్రధానము నుండి తమోప్రధానముగా అవుతుంది. ఉదాహరణకు బ్యాటరీలో శక్తి తగ్గిపోయినప్పుడు మోటరు నిలబడిపోతుంది. బ్యాటరీ డిస్ఛార్జ్ అయిపోతుంది. ఆత్మ యొక్క బ్యాటరీ పూర్తిగా డిస్ఛార్జ్ అవ్వదు, ఎంతోకొంత శక్తి మిగిలి ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా మరణిస్తే దీపాన్ని వెలిగిస్తారు, అది ఆరిపోకుండా ఉండేందుకు అందులో తైలము వేస్తూ ఉంటారు. అలానే బ్యాటరీ శక్తి తగ్గిపోతే దానిని మళ్ళీ చార్జ్ చేయడానికి పెడతారు. మీ ఆత్మ సర్వశక్తివంతముగా ఉండేదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు, ఇప్పుడు మళ్ళీ మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధియోగాన్ని జోడిస్తారు. దీని ద్వారా బాబా శక్తి మనలోకి వస్తుంది ఎందుకంటే శక్తి తగ్గిపోయింది. ఎంతోకొంత శక్తి అయితే తప్పకుండా ఉంటుంది. పూర్తిగా సమాప్తమైపోతే ఇక శరీరమే ఉండదు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ పూర్తిగా పవిత్రముగా అయిపోతుంది. సత్యయుగములో మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయి ఉంటుంది, తర్వాత కొద్ది-కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. త్రేతాయుగము వరకు మీటరు తగ్గిపోతుంది, దీనినే కళ అని అంటారు. అప్పుడు సతోప్రధానముగా ఉండే ఆత్మ సతోగా అయ్యిందని అంటారు, శక్తి తగ్గిపోతుంది. మనము సత్యయుగములో మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతామని మీరు భావిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. ఇప్పుడు మీరు తమోప్రధానముగా అయిపోయారు కావున మీ శక్తి దివాలా తీసింది. మళ్ళీ తండ్రిని స్మృతి చేయడముతో పూర్తి శక్తి అంతా వచ్చేస్తుంది, ఎందుకంటే దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ సమాప్తము అవ్వనున్నాయని, అప్పుడు మీకు అనంతమైన రాజ్యము లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి కూడా అనంతమైనవారు కావున వారసత్వము కూడా అనంతమైనదే ఇస్తారు. ఇప్పుడు మీరు పతితముగా ఉన్నారు, మీ శక్తి పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. ఓ పిల్లలూ, ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి, నేను ఆల్మైటీని (సర్వశక్తివంతుడను), నా ద్వారా ఆల్మైటీ రాజ్యము (సర్వశక్తివంతమైన రాజ్యము) లభిస్తుంది. సత్యయుగములోని దేవీ-దేవతలు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు, పవిత్రముగా ఉండేవారు, దైవీ గుణాలు కలవారిగా ఉండేవారు. ఇప్పుడు ఆ దైవీ గుణాలు లేవు. అందరి బ్యాటరీ పూర్తిగా డిస్ఛార్జ్ అవ్వడము మొదలైంది. ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ నిండుతుంది. పరమపిత పరమాత్మతో యోగము జోడించకుండా బ్యాటరీ ఛార్జ్ అవ్వలేదు. ఆ తండ్రియే సదా పవిత్రమైనవారు. ఇక్కడ అందరూ అపవిత్రముగా ఉన్నారు. ఎప్పుడైతే పవిత్రముగా ఉంటారో, అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఉంటుంది. కావున ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఒక్కరినే స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. మిగిలినవారంతా రచన. రచన ద్వారా రచనకు ఎప్పుడూ వారసత్వము లభించదు. రచయిత అయితే ఒక్కరే. వారు అనంతమైన తండ్రి. మిగిలినవారంతా హద్దులోని వారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంది. కావున బాబా మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలు తమ హృదయములో భావించాలి. డ్రామా ప్లాన్ అనుసారముగా స్వర్గ స్థాపన జరుగుతోంది. సత్యయుగము రానున్నదని మీకు తెలుసు. సత్యయుగములో సదా సుఖమే ఉంటుంది. అది ఎలా లభిస్తుంది? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను సదా పవిత్రుడను. నేను మనుష్య తనువును ఎప్పుడూ తీసుకోను. దేవతల తనువునూ తీసుకోను, మనుష్య తనువునూ తీసుకోను అనగా నేను జనన-మరణాలలోకి రాను. కేవలం పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు, వీరు 60 సంవత్సరాల వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు వీరి తనువులోకి వస్తాను. వీరే పూర్తి సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యారు. నంబరువన్ ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, ఆ తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా, విష్ణు, శంకరులు, వీరి సాక్షాత్కారము జరుగుతుంది. సూక్ష్మవతనము మధ్యలో ఉంది కదా. అక్కడ శరీరాలు ఉండజాలవు. సూక్ష్మ శరీరాన్ని కేవలం దివ్యదృష్టితో చూడడము జరుగుతుంది. మనుష్య సృష్టి అయితే ఇక్కడే ఉంది. ఇకపోతే ఫరిశ్తాలు కేవలం సాక్షాత్కారాల కోసమే. ఎప్పుడైతే పిల్లలైన మీరు కూడా అంతిమములో పూర్తిగా పవిత్రముగా అవుతారో, అప్పుడు మీ సాక్షాత్కారము కూడా జరుగుతుంది. అటువంటి ఫరిశ్తాలుగా అయి మళ్ళీ సత్యయుగములో ఇక్కడికే వచ్చి స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఈ బ్రహ్మా ఏమీ విష్ణువును స్మృతి చేయరు. ఇతను కూడా శివబాబాను స్మృతి చేసి ఈ విధముగా విష్ణువుగా అవుతారు. కావున వీరు రాజ్యాన్ని ఎలా పొందారు అనేది అర్థం చేసుకోవాలి కదా! యుద్ధము మొదలైనవైతే ఏవీ జరగవు. దేవతలు హింస ఎలా చేస్తారు!

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కానీ ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు. ఓ పిల్లలూ, దేహ సహితముగా దేహపు సర్వ ధర్మాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని గీతలో కూడా ఉంది. మమకారము ఉండేందుకు వారికి దేహమే లేదు. వారు అంటారు, నేను కొద్ది సమయము కోసం ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను, లేకపోతే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వను! నేను బీజరూపుడను కదా. ఈ వృక్షమంతటి జ్ఞానము నా వద్ద ఉంది. సృష్టి ఆయువు ఎంత, దీని స్థాపన, పాలన, వినాశనము ఎలా జరుగుతుంది అన్నది ఇంకెవ్వరికీ తెలియదు. మనుష్యులకైతే తెలిసి ఉండాలి కదా. మనుష్యులే చదువుకుంటారు. జంతువులైతే చదువుకోవు కదా. వారు హద్దులోని చదువును చదువుకుంటారు. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తారు, దీని ద్వారా మిమ్మల్ని అనంతమైన యజమానులుగా తయారుచేస్తారు. కావున భగవంతుడు అని ఏ మనిషినీ లేక దేహధారినీ అనడము జరగదని అర్థం చేయించాలి. బ్రహ్మా, విష్ణు, శంకరులకు కూడా సూక్ష్మ దేహముంది కదా. వీరి పేర్లే వేరు, వీరిని భగవంతుడని అనడము జరగదు. ఈ శరీరమైతే ఈ దాదా ఆత్మకు సింహాసనము. అకాల సింహాసనము కదా. ఇప్పుడిది అకాలమూర్తి అయిన తండ్రి యొక్క సింహాసనము. అమృత్సర్ లో కూడా ఒక అకాల సింహాసనముంది కదా. గొప్ప-గొప్ప వారు ఎవరైతే ఉంటారో, వారు అక్కడ అకాల సింహాసనముపై వెళ్ళి కూర్చుంటారు. ఇవన్నీ అకాల ఆత్మల సింహాసనాలు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ అకాల్, దానిని మృత్యువు కబళించలేదు. ఇకపోతే సింహాసనాలైతే మారుతూ ఉంటాయి. అకాలమూర్తి అయిన ఆత్మ ఈ సింహాసనముపై కూర్చుంటుంది. మొదట చిన్న సింహాసనముంటుంది, ఆ తర్వాత పెద్దదిగా అవుతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అకాల్ అయినది (మృత్యువు లేనిది). అందులో మంచి లేక చెడు సంస్కారాలుంటాయి, అందుకే కదా ఇది కర్మల ఫలమని అంటారు. ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. ఆత్మల తండ్రి ఒక్కరే. ఇదైతే అర్థం చేసుకోవాలి కదా. ఈ బాబా ఏమైనా శాస్త్రాల విషయాలను వినిపిస్తారా! శాస్త్రాలు మొదలైనవి చదవడము వలన ఎవరూ తిరిగి వెళ్ళలేరు. చివరిలో అందరూ వెళ్తారు. ఉదాహరణకు మిడతల గుంపులు మరియు తేనెటీగల గుంపులు వెళ్తాయి కదా. తేనెటీగలకు కూడా రాణి ఉంటుంది. దాని వెనుక అన్నీ వెళ్తాయి. తండ్రి కూడా వెళ్ళినప్పుడు వారి వెనుక ఆత్మలన్నీ వెళ్తాయి. అక్కడ మూలవతనములో ఆత్మలందరి గోపురము వలె ఉంటుంది. ఇక్కడ మనుష్యుల గుంపు ఉంది. ఈ గుంపు కూడా ఒక రోజు పరుగెత్తనున్నది. తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. శివుని ఊరేగింపు అని అంటారు. పిల్లలు అని అనండి లేక ప్రేయసులు అని అనండి. తండ్రి వచ్చి పిల్లలను చదివించి స్మృతియాత్రను నేర్పిస్తారు. పవిత్రముగా అవ్వకుండానైతే ఆత్మ వెళ్ళలేదు. పవిత్రముగా అయినప్పుడు మొట్టమొదట శాంతిధామానికి వెళ్తుంది. అందరూ అక్కడకు వెళ్ళి నివసిస్తారు. అక్కడ నుండి మళ్ళీ నెమ్మది-నెమ్మదిగా వస్తూ ఉంటారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీరే మొట్టమొదట తండ్రి వెనుక పరుగెడతారు. మీకు తండ్రితో మరియు ప్రేయసులకు ప్రియునితో యోగము ఉంటుంది. రాజధాని తయారవ్వనున్నది కదా. అందరూ కలిసి రారు. అక్కడ ఆత్మలందరి ప్రపంచము ఉంది. అక్కడ నుండి మళ్ళీ నంబరువారుగా వస్తారు. వృక్షము నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. మొట్టమొదటైతే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉంటుంది, దానిని తండ్రి స్థాపన చేస్తారు. మొట్టమొదట మనల్ని బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కదా. అప్పుడు ప్రజలు సోదరీ-సోదరులు అవుతారు. బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు అనేకమంది ఉన్నారు. తప్పకుండా నిశ్చయబుద్ధి కలిగి ఉంటారు, కావుననే ఇంతమంది అయ్యారు. బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు? కచ్చాగా ఉన్నారా లేక పక్కాగా ఉన్నారా? కొందరు 99 మార్కులు తీసుకుంటారు, కొందరు 10 మార్కులు తీసుకుంటారు అనగా కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నట్లు కదా. మీలో కూడా ఎవరైతే పక్కాగా ఉన్నారో, వారు తప్పకుండా మొదటిలో వస్తారు. కచ్చాగా ఉన్నవారు చివరిలో వస్తారు. ఇది పాత్రధారుల ప్రపంచము, ఇది తిరుగుతూ ఉంటుంది. సత్యయుగము, త్రేతాయుగము... ఇది పురుషోత్తమ సంగమయుగము. దీని గురించి ఇప్పుడు తండ్రి తెలియజేసారు. ఇంతకుముందు మనము కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని తప్పుగా భావిస్తూ వచ్చాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఇది పూర్తి 5 వేల సంవత్సరాల చక్రము. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. లక్షల సంవత్సరాల కల్పము ఉన్నట్లయితే అది సగం, సగం కూడా అవ్వలేదు. సుఖ-దుఃఖాల ఈ ప్రపంచము తయారుచేయబడి ఉంది. ఈ అనంతమైన జ్ఞానము అనంతమైన తండ్రి ద్వారా లభిస్తుంది. శివబాబా శరీరానికి పేరేమీ లేదు. ఈ శరీరము ఈ దాదాకు చెందినది. బాబా ఎక్కడున్నారు? బాబా కొద్ది సమయము కోసం అప్పుగా తీసుకున్నారు. నాకు నోరైతే కావాలి కదా అని బాబా అంటారు. ఇక్కడ కూడా గోముఖము తయారుచేయబడి ఉంది. కొండలపై నుండి అక్కడక్కడ నీరు వస్తుంది. ఇక్కడ గోముఖాన్ని తయారుచేసారు, దాని నుండి నీరు వెలువడుతుంది, దానిని గంగా జలముగా భావిస్తారు. ఇప్పుడు గంగ ఎక్కడ నుండి వచ్చింది? ఇదంతా అసత్యము. అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ, ప్రపంచమంతా అసత్యమైనది. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు సత్య ఖండమని అనడము జరిగేది, తర్వాత భారత్ యే పాతదిగా అయినప్పుడు అసత్య ఖండమని అంటారు. ఈ అసత్య ఖండములో అందరూ పతితముగా అయినప్పుడు - బాబా, మమ్మల్ని పావనముగా తయారుచేసి ఈ పాత ప్రపంచము నుండి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. తండ్రి అంటారు, నా పిల్లలందరూ కామచితిపైకి ఎక్కి నల్లగా అయిపోయారు. తండ్రి కూర్చుని పిల్లలతో అంటారు, మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా, స్మృతి కలిగింది కదా. వారు పిల్లలకు అర్థం చేయిస్తారు, మొత్తము ప్రపంచమంతటికీ అర్థం చేయించరు. మీకే అర్థం చేయిస్తారు కావున మా తండ్రి ఎవరు అన్నది మీకు తెలుస్తుంది!

ఈ ప్రపంచాన్ని ఫారెస్ట్ ఆఫ్ థార్న్స్ (ముళ్ళ అడవి) అని అంటారు. అన్నింటికన్నా పెద్దదైన కామమనే ముల్లును గుచ్చుతారు. ఇక్కడ భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు, శాకాహారులు ఉన్నారు, అలాగని వారు వికారాలలోకి వెళ్ళరని కాదు. చాలామంది బాల బ్రహ్మచారులు కూడా ఉంటారు. బాల్యము నుండే ఎప్పుడూ ఛీ-ఛీ భోజనము మొదలైనవి తినరు. నిర్వికారులుగా అవ్వండి అని సన్యాసులు కూడా అంటారు. ఆ హద్దులోని సన్యాసాన్ని మనుష్యులు చేయిస్తారు. మరుసటి జన్మలో మళ్ళీ గృహస్థుల వద్ద జన్మ తీసుకుని, మళ్ళీ ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. సత్యయుగములో ఈ శ్రీకృష్ణుడు మొదలైన దేవతలు ఎప్పుడైనా ఇళ్ళు-వాకిళ్ళను వదులుతారా? లేదు. కావున వారిది హద్దులోని సన్యాసము. ఇప్పుడు మీది అనంతమైన సన్యాసము. మొత్తము ప్రపంచాన్ని, సంబంధీకులు మొదలైనవారందరినీ బుద్ధితో సన్యసిస్తారు. మీ కోసం ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. మీ బుద్ధి స్వర్గమువైపుకే వెళ్తుంది. కావున శివబాబానే స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేయండి అని అనంతమైన తండ్రి అంటారు. మన్మనాభవ, మధ్యాజీభవ, అప్పుడు మీరు దేవతలుగా అవుతారు. ఇది ఆ గీతా అధ్యాయమే. ఇది సంగమయుగము కూడా. నేను సంగమములోనే వినిపిస్తాను. రాజయోగాన్ని తప్పకుండా గత జన్మలో సంగమయుగములో నేర్చుకుని ఉంటారు. ఈ సృష్టి మారుతోంది కదా, మీరు పతితము నుండి పావనముగా అయిపోతారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము, ఇప్పుడు మనము ఈ విధముగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతాము. ప్రతి ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుని నిశ్చయము ఏర్పరచుకోవాలి. ఇలా మనుష్యులేమీ చెప్పడము లేదు. ఇది శ్రీమతము అనగా భగవంతుని యొక్క శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. మిగిలినవన్నీ మనుష్య మతాలు. మనుష్యుల మతము ద్వారా పడిపోతూ వస్తారు. ఇప్పుడు శ్రీమతము ద్వారా మీరు పైకి ఎక్కుతారు. తండ్రి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. దైవీ మతము స్వర్గవాసులది మరియు అది నరకవాసులైన మనుష్యుల మతము, దానిని రావణుని మతమని అంటారు. రావణ రాజ్యము కూడా తక్కువేమీ కాదు. పూర్తి ప్రపంచమంతటిపై రావణుని రాజ్యముంది. ఇది అనంతమైన లంక, దీనిపై రావణుని రాజ్యముంది, మళ్ళీ దేవతల పవిత్రమైన రాజ్యముంటుంది. అక్కడ చాలా సుఖముంటుంది. స్వర్గానికి ఎంత మహిమ ఉంది. స్వర్గస్థులయ్యారని అంటారు కూడా, మరి తప్పకుండా నరకములో ఉండేవారు కదా. నరకము నుండి వెళ్ళారంటే మళ్ళీ తప్పకుండా నరకములోకే వస్తారు కదా! స్వర్గము ఇప్పుడు ఎక్కడుంది? ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఇప్పుడు తండ్రి మీకు పూర్తి జ్ఞానమంతా ఇస్తారు. బ్యాటరీ నిండుతుంది. మాయ మళ్ళీ సంబంధాన్ని తెంచేస్తుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా-వాచా-కర్మణా పవిత్రముగా అయి ఆత్మా రూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి.

2. మన్మతాన్ని మరియు మనుష్య మతాన్ని వదిలి ఒక్క తండ్రి శ్రీమతముపై నడుస్తూ స్వయాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకోవాలి. సతోప్రధానముగా అయి తండ్రితో పాటు ఎగురుతూ వెళ్ళాలి.

వరదానము:-
సత్యతా శక్తి ద్వారా ప్రకృతిని మరియు విశ్వాన్ని సతోప్రధానముగా తయారుచేసే మాస్టర్ విధి-విధాత భవ

ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యతా శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి-విధాతలుగా అవుతారో, అప్పుడు ప్రకృతి సతోప్రధానముగా అవుతుంది, యుగము సత్యయుగముగా అవుతుంది. సర్వాత్మలు సద్గతి యొక్క భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. మీ సత్యత పారసము వంటిది. ఏ విధముగా పారసము లోహాన్ని పారసముగా చేస్తుందో, అదే విధముగా సత్యతా శక్తి ఆత్మను, ప్రకృతిని, సమయాన్ని, సర్వ సామాగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహార-వ్యవహారాలను సతోప్రధానముగా చేస్తుంది.

స్లోగన్:-
యోగీ ఆత్మలు ఎవరంటే, ఎవరినైతే ప్రకృతి యొక్క అలజడి కూడా ఆకర్షితము చేయదో వారు.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్తీ మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

స్వదర్శన చక్రధారులుగా మరియు ఛత్రధారులుగా అవ్వండి. అప్పుడు దేహము యొక్క స్మృతికి చెందిన అనేక వ్యర్థ సంకల్పాల చక్రము నుండి, లౌకిక మరియు అలౌకిక సంబంధాల చక్రము నుండి, తమ అనేక జన్మల స్వభావము మరియు సంస్కారాల చక్రము నుండి మరియు ప్రకృతికి చెందిన అనేక రకాల ఆకర్షణల చక్రము నుండి ఎప్పుడైతే ముక్తులుగా అవుతారో అప్పుడు ఇతర ఆత్మలను కూడా తండ్రి నుండి ప్రాప్తించినటువంటి శక్తుల ద్వారా అనేక చక్రాల నుండి సహజముగానే వదిలింపజేసి జీవన్ముక్తులుగా చెయ్యగలరు.