04-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞపై నడుస్తూ ఉండండి, ఆజ్ఞపై నడుచుకోవటముతోనే శ్రేష్ఠముగా అవుతారు’’

ప్రశ్న:-
ఏ పిల్లలను సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులని అంటారు?

జవాబు:-
ఎవరైతే రాజ్యాన్ని పొందే పురుషార్థము చేస్తారో మరియు ఇతరులను కూడా తమ సమానముగా తయారుచేస్తారో, అటువంటి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండే పిల్లలు సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు. వారిని చూసి ఇతరులు కూడా సహయోగులుగా అవుతారు.

ఓంశాంతి
మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ చెప్పాలి. శివబాబా ఉన్నారని మీకు తెలుసు, వారి మందిరాలకు కూడా వెళ్తారు, కానీ శివబాబా ఎవరు అన్నది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కనుక శివబాబా స్మృతిని ఇప్పించాలి. ఇక్కడ కూర్చుని ఉన్నా సరే, చాలామంది బుద్ధియోగము ఎక్కడెక్కడికో భ్రమిస్తూ ఉంటుంది, అందుకే మీ పని స్మృతిని ఇప్పించడము. సోదరీ-సోదరులారా, ఏ తండ్రి నుండైతే వారసత్వము లభించనున్నదో, ఆ తండ్రిని స్మృతి చేయండి. మీరు ఇప్పుడు సత్యమైన సోదరీ-సోదరులు. వారు కేవలం స్త్రీ, పురుషులైన కారణముగా, సోదరీ-సోదరులని అంటారు. లెక్చర్లలో కూడా బ్రదర్స్, సిస్టర్స్... అని అంటారు. అది శరీరము పరంగా సోదరీ-సోదరులు అయినట్లు. ఇక్కడ ఆ విషయము కాదు. రచయిత అయిన మీ తండ్రిని స్మృతి చేయండి, వారి నుండి వారసత్వము లభించనున్నదని ఇక్కడ ఆత్మలకు అర్థం చేయించడము జరుగుతుంది. తేడా ఉంది కదా. సోదరీ-సోదరులు అనే పదాలు సాధారణమైనవి. ఇక్కడ తండ్రి పిల్లలకు చెప్తున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని. ఆ శివబాబా ఆత్మిక తండ్రి మరియు ప్రజాపిత బ్రహ్మా దైహిక తండ్రి. బాప్ దాదా ఇరువురూ అంటారు - పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి మరియు బుద్ధి యోగము ఇంకెక్కడికీ వెళ్ళకూడదు. బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గములో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని ఎదురుగా లేక ఇంకెవరైనా దేవతల ఎదురుగా కూర్చుని మాలను తిప్పుతారు. బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతూ ఉంటుంది. దేవతలు ఎవరు? వారికి ఈ రాజ్యము ఎలా లభించింది, ఎప్పుడు లభించింది! ఇది ఎవరికీ తెలియదు. గురునానక్ సిక్కు మార్గాన్ని స్థాపన చేసారని సిక్కులకు తెలుసు. ఆ తర్వాత వారి మనవళ్ళు, గురువులుగా కొనసాగుతూ వస్తారు. వాళ్ళు పునర్జన్మల్లోకి వస్తూ ఉంటారు, ఈ విషయాలు ఎవరికీ తెలియవు. వారు సదా గురునానక్ ను గుర్తు చేయరు. అచ్ఛా, ఒకవేళ గురునానక్ ను అయినా, బుద్ధుడిని అయినా లేదా ధర్మ స్థాపకులెవరినైనా స్మృతి చేసినా, వారిప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికీ తెలియదు. వారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు లేదా వాణికి అతీతముగా వెళ్ళిపోయారని అంటారు లేదా శ్రీకృష్ణుడు అంతటా హాజరై ఉన్నారని, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు, రాధనే రాధ అని అంటారు. ఇలా అంటూ ఉంటారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - భారతవాసులైన మీరు దేవతలుగా ఉండేవారు. మీ ముఖము మనుష్యుల వలె, లక్షణాలు దేవతల వలె ఉండేవి. దేవతల చిత్రాలైతే ఉన్నాయి కదా. చిత్రాలు లేకపోయి ఉంటే, ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు. రాధా-కృష్ణులకు, లక్ష్మీ-నారాయణులకు ఉన్న సంబంధమేమిటి అనేది తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ నిరాకార బాబా మాకు అర్థం చేయిస్తున్నారని మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. వాస్తవానికి అందరూ నిరాకారులే. ఆత్మ నిరాకారి, ఈ సాకార రూపము ద్వారా మాట్లాడుతుంది. నిరాకార రూపములో మాట్లాడలేదు. మా బాబాయే, మీ బాబా అని మీరు అర్థం చేయించవచ్చు. శివబాబా జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, అనంతమైన తండ్రి. వారికి కూడా శరీరమైతే కావాలి కదా. నేను ఈ బ్రహ్మా తనువులోకి వస్తాను, అప్పుడే ఈ బ్రాహ్మణ ధర్మ స్థాపన జరుగుతుందని వారు స్వయంగా అంటారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల రచనే జరుగుతుంది. తండ్రి బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు, ఇంకెవరికీ అర్థం చేయించరు, పిల్లలకే అర్థం చేయిస్తారు. నేను శివబాబా సంతానాన్ని కనుక నేను భగవంతుడిని అని కాదు, అలా కాదు. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. అయితే, పిల్లలు ఎప్పుడైతే పెద్దవారై, తండ్రి అవుతారో, పిల్లలకు జన్మనిస్తారో అప్పుడు వారిని తండ్రి అని అంటారు. వీరికైతే ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదా. నిశ్చయబుద్ధి గల పిల్లలకే అర్థం చేయిస్తారు. నిశ్చయబుద్ధి గల పిల్లలు తండ్రి ఆజ్ఞపై నడుస్తారు ఎందుకంటే శ్రీమతము ద్వారానే శ్రేష్ఠముగా అవ్వగలరు.

మనము ఆ దేవతల వలె అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. జన్మ-జన్మలుగా మనము దేవతల మహిమను పాడుతూ వచ్చాము. ఇప్పుడు మనము శ్రీమతము ఆధారముగా అలా తయారవ్వాలి, రాజ్యము స్థాపన అవ్వనున్నది. అందరూ అయితే శ్రీమతముపై పూర్తిగా నడవరు, నంబరువారుగా నడుస్తారు ఎందుకంటే అది చాలా పెద్ద రాజ్యము. రాజ్యములో ప్రజలు, నౌకర్లు, చండాలులు మొదలైనవారందరూ కావాలి. ఫలానా వారు చండాలుని కుటుంబములోకి వెళ్తారని, అలాంటి నడవడిక గలవారి గురించి కూడా సాక్షాత్కారము జరుగుతుంది. చండాలుడు ఒక్కరే ఉండరు, అతని కుటుంబము కూడా ఉంటుంది. చండాలులకు కూడా యూనియన్ ఉంటుంది. అందరూ పరస్పరములో కలుసుకుంటారు. సమ్మెలు మొదలైనవి చేసినప్పుడు అన్ని పనులు వదిలేస్తారు. సత్యయుగములోనైతే ఇలాంటి విషయాలుండవు. మీ వద్ద ఒక చిత్రము కూడా ఉంది, దానిని చూపించి, మీరు ఏమవ్వాలని అనుకుంటున్నారు - బ్యారిస్టర్ గా అవుతారా, దేవతగా అవుతారా అని మీరు అడుగుతారు. మీ రాజధాని అంతా స్థాపనవుతూ ఉంది, ఇది చిన్న విషయమేమీ కాదు. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు, అది బుద్ధిలో కూర్చుండిపోవాలి. మనము భవిష్యత్తు కోసం పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందుతాము. శ్రీమతము ఆధారముగా మనము శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన రాజ్య పదవిని పొందుతాము మరియు ఇతరులను ఎప్పుడైతే తమ సమానముగా తయారుచేస్తారో, అప్పుడు ఈశ్వరీయ సేవాధారులని అంటారు. ఎవరి విషయాలు ఏమీ దాగి ఉండవు. మున్ముందు అంతా తెలుస్తుంది. దీనినే జ్ఞాన ప్రకాశము అని అంటారు, ప్రకాశము లభిస్తూ ఉంటుంది. మనుష్యులకేమీ తెలియదు. లోపల (అండర్ గ్రౌండ్ లో) బాంబులు కూడా తయారుచేస్తూ ఉంటారు. ఏ వస్తువునైనా అలాగే ఉంచుకునేందుకు తయారుచేయడము జరగదు. మొదటిలో ఖడ్గాలతో యుద్ధాలు జరిగేవి, ఆ తర్వాత తుపాకీలు తయారుచేసారు, వాటిని అలాగే ఉంచుకోవడానికి కాదు, ఉపయోగించేందుకని తయారుచేసారు. వాటి ద్వారా మృత్యువు సంభవిస్తుందని కూడా అర్థం చేసుకుంటారు. ట్రయల్ వేసి చూసారు కదా. హిరోషిమాలో ఒక్క బాంబుతోనే ఎంతమంది మరణించారు, ఆ తర్వాత ఎంత ఉన్నతిని చేసారో, ఎన్ని భవనాలను నిర్మించారో చూడండి. ఇప్పుడు హాస్పిటల్ లో పడి ఉండేలాంటి వినాశనము జరగదు. హాస్పిటల్స్ మొదలైనవి ఉండవు ఎందుకంటే భూకంపాలు మొదలైనవి కూడా అప్పుడే వస్తాయి. ప్రాకృతిక ఆపదలను ఎవరూ ఆపలేరు. ఇదంతా ఈశ్వరుని చేతిలో ఉందని అంటుంటారు కూడా. వినాశనమైతే జరగాల్సిందేనని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. కరువు వస్తుంది, నీరు లభించదు... ఇదంతా మీకు తెలుసు, ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కల్పము యొక్క జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేదని అంటారు కూడా. కానీ శాస్త్రాలలో కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేసారు! ఎవరికీ దాని పట్ల అటెన్షన్ వెళ్ళదు, ఆ మాటను విని మళ్ళీ తమ వ్యాపారాలు మొదలైనవాటిలో నిమగ్నమైపోతారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు త్వరత్వరగా పురుషార్థము చేయండి. స్మృతిలో ఉన్నట్లయితే మాలిన్యము తొలగుతూ ఉంటుంది. మీరు ఇక్కడే సతోప్రధానముగా అవ్వాలి లేదంటే శిక్షలను అనుభవించి, మళ్ళీ తమ-తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు. భగవంతుని శ్రీమతము లభిస్తుంది. శ్రీకృష్ణుడైతే రాకుమారుడు, అతను ఎవరికైనా ఏ మతాన్ని ఇస్తారు! ఈ విషయాల గురించి ప్రపంచములో ఎవరికీ తెలియవు. శివబాబాను స్మృతి చేయండి అని ప్రేమగా అర్థం చేయించాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా స్వయంగా అంటారు. వారు కళ్యాణకారి కూడా, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. మీరు భారత్ యొక్క నావను తీరానికి చేర్చేవారు. సత్యనారాయణుడి కథకు కూడా భారత్ తోనే సంబంధముంది. ఇతర ధర్మాలవారు ఎప్పుడూ సత్యనారాయణుడి కథను వినరు. ఎవరైతే నరుని నుండి నారాయణునిగా తయారయ్యేవారిగా, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉన్నారో, వారే వింటారు. వారే అమరకథను వింటారు. అమరలోకములో దేవీ-దేవతలుండేవారు, వారు తప్పకుండా అమరలోకములో అమరకథ ద్వారా ఆ పదవిని పొంది ఉంటారు. ఒక్కొక్క విషయము గుర్తుంచుకునేందుకు యోగ్యమైనది. ఒక్క విషయమైనా బుద్ధిలో మంచి రీతిలో కూర్చున్నట్లయితే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని ధ్యాసలో ఉంచుకోవాలి. శివబాబాతో పాటు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోవాలి.

సత్యమేమిటి, అసత్యమేమిటి అనేది తండ్రియే అర్థం చేయిస్తారు. సత్యము వారొక్కరే, మిగిలినదంతా అసత్యము. లంకలో రావణుడుండేవాడు, ఇది ఒక్కరి విషయమేనా! సత్య, త్రేతాయుగాలలోనైతే ఇలాంటి విషయాలుండవు. మనుష్యులుండే ఈ ప్రపంచమంతా లంకయే, ఇది ఉన్నదే రావణ రాజ్యము. సీతలందరూ ఒక్క రాముడినే స్మృతి చేస్తారు అనగా భక్తురాళ్ళందరూ, ప్రేయసులందరూ, ప్రియుడైన ఆ భగవంతుడు ఒక్కరినే స్మృతి చేస్తారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. సన్యాసులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. అందరూ దుఃఖితులుగా ఉన్నారు, శోక వాటికలో ఉన్నారు. కలియుగము శోక వాటిక, సత్యయుగము అశోక వాటిక. ఇక్కడైతే అడుగడుగులోనూ శోకముంది, దుఃఖముంది. మిమ్మల్ని బాబా శోకము లేని స్వర్గములోకి తీసుకువెళ్తారు. ఇక్కడైతే మనుష్యులు ఎంత శోకములో ఉంటారు. ఎవరైనా మరణిస్తే పిచ్చివారిలా అయిపోతారు. స్వర్గములోనైతే ఈ విషయాలేవీ ఉండవు. స్త్రీ విధవగా అయ్యేందుకు, అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ సంభవించవు, అక్కడైతే సమయానికి ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొకటి తీసుకుంటారు. పురుష శరీరము గాని, స్త్రీ శరీరము గాని తీసుకుంటారు, అది సాక్షాత్కారము అవుతుంది. ఎవరెవరు ఏమవుతారు అనేది చివరిలో అంతా తెలిసిపోతుంది. మేమింత సమయమూ శ్రమ చేయలేదే అని ఆ సమయములో అంటారు. కానీ ఆ సమయములో అలా అనడము వలన ఏమవుతుంది. సమయమైతే గడిచిపోయింది కదా, అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, కృషి చేయండి, సేవలో సత్యమైన రైట్ హ్యాండ్ గా అయినట్లయితే రాజ్యములోకి వచ్చేస్తారు. సేవలో తత్పరులై ఉండండి. కుటుంబాలకు కుటుంబాలే సేవలో ఎలా తత్పరులై ఉన్నారు అనే ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. ఈ కుటుంబము అటువంటి మంచి కర్మలేవో చేసి ఉంటుంది, అందుకే అందరూ ఈశ్వరీయ సేవలో తత్పరులయ్యారని అంటారు. తల్లి, తండ్రి, పిల్లలు... అందరూ తత్పరులై ఉండటము మంచిదే కదా. సేవ వెనుక తిరుగుతూ ఉంటారు. మనుష్యాత్మలకు సంతోషము కలిగే విధముగా, వారికి మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని పిల్లలైన మీకు చాలా ఉత్సాహముండాలి. మీరు ఎంతమందికి మార్గాన్ని తెలియజేస్తారు. అలా చేసినప్పుడు మీరు ప్రజలను తయారుచేసుకున్నట్లు. బీజము నాటారు కదా. జన్మిస్తూనే ఎవరూ రాజుగా అవ్వరు. ముందు ప్రజలుగా అయ్యేందుకు అధికారులుగా అవుతారు, ఆ తర్వాత పురుషార్థము చేస్తూ-చేస్తూ ఎలా ఉన్నవారు ఎలా అవ్వగలరు. మీరు సేవ చేయడము చూసి, ఇతరులకు కూడా ఉత్సాహము కలుగుతుంది, మేము కూడా అటువంటి పురుషార్థాన్ని ఎందుకు చేయకూడదని అనిపిస్తుంది. లేదంటే ఇక కల్ప-కల్పము ఇలాంటి పరిస్థితే ఉంటుంది. చాలామంది వస్తారు, పశ్చాత్తాపపడతారు. ఆ సమయములో మనుష్యులు అనుభవించే దుఃఖాన్ని, వారు మొత్తము జీవిత కాలములో ఎప్పుడూ అనుభవించరు. శ్రీమతముపై నడవని కారణముగా చివరిలో ఎలాంటి దుఃఖాన్ని చూస్తారంటే, ఇక అడగకండి, ఎందుకంటే అనేక వికర్మలను చేసారు. బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు - కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలియజేయండి.

మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. ఎలాగైతే క్రిస్టియన్ ధర్మానికి చెందిన మనుష్యులుంటారో, ఇస్లామ్ ధర్మానికి చెందిన మనుష్యులుంటారో, అలాగే మీరు కూడా. దేవీ-దేవతలు అందరికన్నా పవిత్రమైనవారు. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు, అర్ధకల్పము మీరు పవిత్రముగా ఉంటారు. స్వర్గము మరియు నరకము అని అంటూ ఉంటారు. స్వర్గము అని దేనినంటారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి భారత్ లోనే వచ్చి పిల్లలను మేలుకొలుపుతారు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో, వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు, మళ్ళీ తండ్రి వచ్చి పావన స్వర్గవాసులుగా తయారుచేస్తారు. ఒక్క ప్రియుడు వచ్చి ప్రేయసులందరినీ తన అశోక వాటికలోకి తీసుకువెళ్తారు. కనుక మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి - అని అందరికీ చెప్పండి. లేదంటే ఇక్కడ కూర్చున్నప్పటికీ, బుద్ధి ఎక్కడెక్కడికో భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గములో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. బాబా అనుభవజ్ఞులు కదా. అన్నింటికన్నా మంచి వ్యాపారము వజ్రాల వ్యాపారము. అందులో సత్యమైనవాటిని, నకిలీవాటిని చాలా కష్టము మీద గుర్తిస్తారు. ఇక్కడ కూడా సత్యము దాగి ఉంది, అంతటా అసత్యమే అసత్యము నడుస్తూ ఉంటుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మనమంతా డ్రామాలోని పాత్రధారులమని మీకు తెలుసు, దీని నుండి ఎవరూ బయటపడలేరు. ఎవరూ మోక్షాన్ని పొందలేరు. వివేకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పాత్రను అభినయిస్తూనే ఉంటారు, మళ్ళీ కల్పము తర్వాత అదే పాత్రను రిపీట్ చేస్తారు. మనుష్యులు ఎలా మరణిస్తారు అనేది మీరు చూస్తారు, వినాశనము జరగనున్నది. ఆత్మలందరూ నిర్వాణధామానికి వెళ్ళిపోతారు. బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది. సేవలో తత్పరులై ఉన్నట్లయితే అనేకుల కళ్యాణము జరుగుతుంది. మొత్తము పరివారమంతా ఈ జ్ఞానము మార్గములో నిమగ్నమై ఉన్నట్లయితే చాలా అద్భుతము జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతిమములోని భయంకరమైన దృశ్యాలు మరియు దుఃఖాల నుండి విముక్తులుగా అయ్యేందుకు ఇప్పటినుండే తండ్రి శ్రీమతముపై నడవాలి. శ్రీమతము ఆధారముగా తమ సమానముగా తయారుచేసే సేవను చేయాలి.

2. సేవలో తండ్రికి రైట్ హ్యాండ్ గా అవ్వాలి. ఆత్మలకు సంతోషాన్ని కలిగించే మార్గాన్ని తెలియజేయాలి. అందరి కళ్యాణము చేయాలి.

వరదానము:-
స్వయము యొక్క సంకల్పాల అలజడి నుండి అనగా ఆ శిక్షల నుండి కూడా అతీతముగా ఉండే పాస్ విత్ ఆనర్ భవ

పాస్ విత్ ఆనర్ అనగా మనసులో కూడా సంకల్పాల ద్వారా శిక్షలు అనుభవించకూడదు. ధర్మరాజు ద్వారా లభించే శిక్షలు విషయము తర్వాత కానీ ముందుగా తమ సంకల్పాల అలజడి నుండి కూడా అనగా ఆ శిక్షల నుండి కూడా అతీతముగా ఉండటము - ఇది పాస్ విత్ ఆనర్ గా అయ్యేవారి గుర్తు. వాణి, కర్మ, సంబంధ-సంపర్కాల విషయము స్థూలమైనది కానీ సంకల్పాలలో కూడా అలజడి కలగకూడదు, ఇటువంటి ప్రతిజ్ఞను చేయండి, అప్పుడు పాస్ విత్ ఆనర్ గా అవుతారు.

స్లోగన్:-
జ్ఞానమనే తైలము మరియు యోగమనే ఒత్తు సరిగ్గా ఉన్నట్లయితే సంతోషము యొక్క దీపము వెలుగుతూ ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చెయ్యండి’’

ప్రపంచములో ఏ విధమైన అలజడి అయినా అచంచలమైన-స్థిరమైన స్థితిలో విఘ్నము కలిగించకూడదు. ఇటువంటి విఘ్న వినాశకులుగా, అచంచలముగా-స్థిరముగా అయ్యి ప్రతి విఘ్నాన్ని దాటి వేయండి. ఇది విఘ్నము కాదు, ఒక ఆట అన్నట్లు అనిపించాలి. పర్వతము ఆవగింజ వలె అనుభవమవ్వాలి ఎందుకంటే నాలెడ్జ్ ఫుల్ ఆత్మలకు - ఇవన్నీ రావాల్సిందే, జరగాల్సిందే అని ముందు నుండే తెలుసు.