04-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలు - మీరు ఇప్పుడు శ్రీమతము ఆధారముగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు, మీకు తండ్రి నుండి శాంతి యొక్క వారసత్వము లభిస్తుంది, శాంతిలో అన్నీ వచ్చేస్తాయి’’

ప్రశ్న:-
కొత్త ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారము ఏమిటి?

జవాబు:-
పవిత్రత. తండ్రి ఎప్పుడైతే బ్రహ్మా తనువులోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో, అప్పుడు మీరు పరస్పరము సోదర-సోదరీలవుతారు. స్త్రీ, పురుషులు అనే భానము తొలగిపోతుంది. ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవుతారు కావున పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీతో మీరు ఇలా ప్రతిజ్ఞ చేసుకుంటారు - మేము సోదర, సోదరీలుగా అయి ఉంటాము, వికారీ దృష్టిని పెట్టుకోము, ఒకరినొకరు అప్రమత్తము చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము.

పాట:-
మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు మరియు బుద్ధిలో స్వదర్శన చక్రము తిరిగింది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారిగా పిలవబడతారు ఎందుకంటే సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడము అంటే స్వదర్శన చక్రధారిగా అవ్వడము. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. బ్రాహ్మణులైన మీకు అంతా సైలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. మనుష్యులందరూ - ఓ శాంతి దేవా, ఓ శాంతిని ఇచ్చేవారా... అని అంటారు కూడా. కానీ శాంతిని ఎవరు ఇస్తారు మరియు శాంతిధామములోకి ఎవరు తీసుకువెళ్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలు ఎవ్వరూ స్వదర్శన చక్రధారులుగా పిలవబడరు. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు, మీలోని ప్రతి ఒక్కరూ నంబరువారు పురుషార్థానుసారముగా స్వదర్శన చక్రధారులు. తండ్రిని స్మృతి చేయడము, ఇదే ముఖ్యమైన విషయము. తండ్రిని స్మృతి చేయడము అనగా శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకోవడము. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది, నిరోగీ శరీరము కూడా తయారవుతూ ఉంటుంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా తయారుచేయలేరు. ఆ విధంగా ఆత్మయే తయారవుతుంది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే ఎందుకంటే వారిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపన అవుతోంది అని పాటలో కూడా విన్నారు. పాటనైతే మనుష్యులే తయారుచేసారు. తండ్రి కూర్చుని సారము అర్థం చేయిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి, కావున పిల్లలందరూ పరస్పరము సోదరులవుతారు. తండ్రి ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని రచిస్తారో, అప్పుడు ప్రజాపిత బ్రహ్మా ద్వారా మీరు సోదర- సోదరీలవుతారు, ప్రతి ఒక్కరూ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు అవుతారు, ఈ విషయము బుద్ధిలో ఉండడము ద్వారా ఇక స్త్రీ, పురుషుల భానము తొలగిపోతుంది. వాస్తవానికి తాము కూడా పరస్పరము సోదరులేనని మనుష్యులు అర్థం చేసుకోరు. తర్వాత తండ్రి రచనను రచించినప్పుడు సోదర, సోదరీలు అవుతారు, వికారీ దృష్టి తొలగిపోతుంది. మీరు ఓ పతిత-పావనా అని పిలుస్తూ వచ్చారు అని తండ్రి స్మృతిని కూడా ఇప్పిస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. మీకు చెప్తున్నాను - ఈ అంతిమ జన్మలో పవిత్రముగా ఉండండి, తద్వారా మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ ప్రదర్శనీ అయితే మీ ఇంటి-ఇంటిలోనూ ఉండాలి ఎందుకంటే పిల్లలైన మీరు బ్రాహ్మణులు. మీ ఇంటిలో ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. వీటిపై అర్థం చేయించడం చాలా సహజము. 84 జన్మల చక్రమైతే బుద్ధిలో ఉంది. అచ్ఛా - మీకు ఒక బ్రాహ్మణీ (టీచరును) ఇస్తాము. ఆమె వచ్చి సేవ చేసి వెళ్తారు. మీరు ప్రదర్శనీని తెరవండి. భక్తి మార్గములో కూడా ఎవరికైనా శ్రీకృష్ణుని పూజ లేక మంత్రాలు మొదలైనవి రాకపోతే బ్రాహ్మణుడిని పిలుస్తారు. అతను రోజూ వచ్చి పూజ చేస్తారు. అలాగే మీరు కూడా పంపించమని అడగవచ్చు. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. తండ్రి ప్రజాపిత బ్రహ్మా ద్వారా సృష్టిని రచించి ఉంటే మరి తప్పకుండా బ్రహ్మాకుమార, కుమారీలు సోదరీ, సోదరులు అవుతారు. మీరు ఇలా ప్రతిజ్ఞ చేస్తారు - మేమిద్దరమూ సోదర-సోదరీలుగా అయి ఉంటాము, వికారీ దృష్టిని పెట్టుకోము, ఒకరికొకరు అప్రమత్తము చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము. ముఖ్యమైనది స్మృతి యాత్రయే. వారు సైన్స్ బలముతో ఎంత పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు, కానీ పైన ప్రపంచమంటూ ఏమీ లేదు. ఇది సైన్స్ యొక్క అతిలోకి వెళ్ళడము. ఇప్పుడు మీరు శ్రీమతము ఆధారముగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు. వారిది సైన్స్, ఇక్కడైతే మీది సైలెన్స్. ఆత్మ స్వయమే శాంతి స్వరూపమని పిల్లలకు తెలుసు. ఈ శరీరము ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. కర్మ చేయకుండానైతే ఎవ్వరూ ఉండలేరు. తండ్రి అంటారు, స్వయాన్ని శరీరము నుండి వేరుగా ఉన్న ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇది చాలా సహజము. అందరికంటే ఎక్కువగా నా భక్తులు అనగా శివుని పూజారులు ఎవరైతే ఉంటారో, వారికి అర్థం చేయించండి. ఉన్నతోన్నతమైన పూజ శివునిది, ఎందుకంటే వారే సర్వుల సద్గతిదాత.

తండ్రి వచ్చారని, వారు అందరినీ తమతోపాటు తీసుకువెళ్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మన సమయము వచ్చినప్పుడు మనము కూడా డ్రామానుసారముగా కర్మాతీత అవస్థను పొందుతాము, తర్వాత వినాశనము జరుగుతుంది. ఆత్మలమైన మనము సతోప్రధానముగా అవ్వాలి అని పురుషార్థము ఎంతగానో చేయాలి. తండ్రి యొక్క శ్రీమతముపై నడవాలి, శ్రీమద్భగవద్గీత అని అంటారు, ఎంత గొప్ప మహిమ ఉంది. సర్వ గుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు... అని దేవతల మహిమను కూడా గానం చేస్తారు. తండ్రియే వచ్చి సంపూర్ణ పావనముగా తయారుచేస్తారు. ఎప్పుడైతే సంపూర్ణ పతిత ప్రపంచముగా అవుతుందో, అప్పుడే తండ్రి వచ్చి సంపూర్ణ పావన ప్రపంచాన్ని తయారుచేస్తారు. మేము భగవంతుని పిల్లలము అని అందరూ అంటారు, మరి తప్పకుండా స్వర్గ వారసత్వము ఉండాలి కదా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనము ఇప్పుడు సోదర-సోదరీలుగా అయ్యాము. కల్ప పూర్వము కూడా తండ్రి వచ్చారు. శివజయంతిని జరుపుతారు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలుగా అయి ఉంటారు. తండ్రితో ఇలా ప్రతిజ్ఞ చేస్తారు - బాబా, మేము పరస్పరము కంపానియన్లుగా ఉంటూ పవిత్రముగా ఉంటాము, మీ డైరెక్షన్లపై నడుచుకుంటాము. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఇప్పుడు ఇది అంతిమ జన్మ, ఈ మృత్యులోకము అంతమవ్వనున్నది. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఎవరైనా తమను తాము భగవంతునిగా పిలుచుకుంటే, మరి భగవంతుడిని సర్వుల సద్గతిదాత అని అంటారు కదా, అటువంటప్పుడు వారు తమను తాము అలా ఎలా పిలుచుకోగలరు. కానీ దీనిని డ్రామా ఆటగా భావిస్తారు.

తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తున్నారు. తండ్రి అంటారు - ఇప్పుడు సేవలో తత్పరులై ఉండండి. ఇంటి-ఇంటిలోనూ ప్రదర్శనీని తెరవండి. దీని వంటి మహా పుణ్యము ఇంకేదీ ఉండదు. ఎవరికైనా తండ్రి యొక్క మార్గాన్ని చెప్పడమంటే - దీని వంటి దానము ఇంకేదీ లేదు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమవుతాయి. తండ్రిని పిలిచేది కూడా అందుకే, ఓ పతిత-పావనా, ముక్తిప్రదాత, మార్గదర్శకుడా రండి అని పిలుస్తారు. మీకు కూడా పాండవులు అన్న పేరు ఉంది. తండ్రి కూడా పండానే (మార్గదర్శకుడే). వారు ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. వాళ్ళు దైహికమైన పండాలు. వీరు ఆత్మికమైనవారు. అది దైహికమైన యాత్ర, ఇది ఆత్మిక యాత్ర. సత్యయుగములో భక్తి మార్గపు దైహికమైన యాత్రలు ఉండవు. అక్కడ మీరు పూజ్యులుగా ఉంటారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. మరి తండ్రి మతముపై నడవాలి కదా. ఏదైనా సంశయము మొదలైనవి ఉంటే అడగాలి. ఇప్పుడు తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీరు నా ప్రియమైన పిల్లలు కదా. మీరు అర్ధకల్పపు ప్రేయసులు. ఒక్కరికే అనేక పేర్లు పెట్టేసారు, ఎన్ని పేర్లు పెట్టారు, ఎన్ని మందిరాలను తయారుచేస్తారు. కానీ నేను ఒక్కడినే. నా పేరు శివ. నేను 5000 సంవత్సరాల క్రితం భారత్ లోకే వచ్చాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఇప్పుడు కూడా దత్తత తీసుకుంటున్నాను. బ్రహ్మాకు పిల్లలు అయిన కారణముగా మీరు మనవలు, మనవరాళ్ళు అయ్యారు. ఇక్కడ వారసత్వము లభించేది ఆత్మకు. ఇందులో సోదరుడు లేక సోదరి అన్న ప్రశ్న తలెత్తదు. ఆత్మయే చదువుకుంటుంది, వారసత్వాన్ని తీసుకుంటుంది. అందరికీ హక్కు ఉంది. పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచములో ఏదైతే చూస్తారో - ఇదంతా వినాశనము అవ్వనున్నది. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా ఉంటుంది. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కావున త్యాగము కూడా అనంతములో ఉండాలి. మీకు తెలుసు, కల్పపూర్వము కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు, రాజస్వ అశ్వమేధ యజ్ఞాన్ని రచించారు, కనుక ఆ తర్వాత రాజ్యము కొరకు సత్యయుగీ కొత్త ప్రపంచము తప్పకుండా కావాలి. పాత ప్రపంచము యొక్క వినాశనము కూడా జరిగింది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము కదా. ఇదే యుద్ధము జరిగింది, దీని ద్వారా ద్వారాలు తెరుచుకున్నాయి. స్వర్గ ద్వారాలు ఎలా తెరుచుకుంటున్నాయో వచ్చి అర్థం చేసుకోండి అని బోర్డుపై కూడా వ్రాయండి. మీరు అర్థం చేయించలేకపోతే ఇతరులను పిలవచ్చు. ఇక మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మీరు ఎంతమంది ఉన్నారు. వారసత్వము శివబాబా నుండే లభిస్తుంది. వారే అందరికీ తండ్రి. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము అన్న విషయాన్ని బుద్ధిలో మంచి రీతిలో గుర్తు ఉంచుకోవాలి. మనమే దేవతలుగా ఉండేవారము, ఆ తర్వాత చక్రములో తిరిగి వచ్చాము. మనము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత విష్ణుపురిలోకి వెళ్తాము. జ్ఞానము చాలా సహజమైనది. కానీ కోట్లల్లో ఏ ఒక్కరో వెలువడుతారు. ప్రదర్శనీలకు రావడం ఎంతమంది వస్తారు, కానీ ఎవరో అరుదుగా వెలువడుతారు, కొందరైతే - ఇది చాలా బాగుంది, మేము వస్తాము అని కేవలం మహిమ చేస్తారు. కానీ ఎవరో అరుదుగా 7 రోజుల కోర్సు తీసుకుంటారు. ఇప్పుడు ఇంతకీ 7 రోజులు అంటే ఏమిటి. గీతా పఠనమును కూడా 7 రోజులు చేస్తారు. మీరు కూడా 7 రోజులు భట్టీలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మొత్తం చెత్త అంతా తొలగిపోతుంది. దేహాభిమానము అనే అర్ధకల్పపు అశుద్ధమైన రోగము ఉంది, దానిని తొలగించుకోవాలి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. 7 రోజుల కోర్స్ అనేది పెద్దదేమీ కాదు. కొందరికి ఒక్క క్షణములో కూడా బాణము తగలవచ్చు. ఆలస్యముగా వచ్చినవారు ముందుకు వెళ్ళవచ్చు. మేము రేస్ చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని అంటారు. కొందరైతే పాతవారికంటే కూడా వేగంగా వెళ్ళిపోతారు ఎందుకంటే మంచి-మంచి పాయింట్లు రెడీమేడ్ గా లభిస్తున్నాయి. ప్రదర్శనీలు మొదలైనవి అర్థం చేయించడము ఎంత సహజమవుతుంది. స్వయం అర్థం చేయించలేకపోతే - మీరు రోజూ వచ్చి కథ వినిపించి వెళ్ళండి అని అక్కయ్యలను పిలవవచ్చు. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, అది 1250 సంవత్సరాలు కొనసాగింది. ఇది ఎంత చిన్నని కథ. మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఆత్మ అయిన మనము బ్రాహ్మణులుగా అయ్యాము. హంసో అన్న పదము యొక్క అర్థాన్ని ఎంత యుక్తియుక్తముగా అర్థం చేయిస్తారు. విరాట రూపము కూడా ఉంది, కానీ అందులో బ్రాహ్మణులను మరియు శివబాబాను మాయం చేసేసారు. అర్థము ఏమాత్రము అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి విషయములో కృషి చేయాలి. ఏ సంశయములోకి రాకూడదు. వికర్మాజీతులుగా అయి ఉన్నత పదవిని పొందాలంటే - ఇది ఎందుకు జరుగుతోంది, వీరు ఎందుకు ఇలా చేస్తారు, అన్న చింతనను సమాప్తము చేయాలి. ఈ విషయాలన్నింటినీ వదిలి ఒకటే చింతన ఉండాలి - నేను తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వికర్మాజీతులుగా అయి ఉన్నత పదవిని పొందుతారు. ఇకపోతే వ్యర్థమైన విషయాలను విని మీ బుద్ధిని పాడు చేసుకోకూడదు. అన్ని విషయాలలోనూ ఒక విషయము ముఖ్యమైనది, అదేమిటంటే - వారిని మర్చిపోకండి. ఎవరితోనూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ సమయము చాలా విలువైనది. తుఫానులకు భయపడకూడదు. చాలా కష్టాలు వస్తాయి, నష్టము కలుగుతుంది, కానీ తండ్రి స్మృతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. స్మృతి ద్వారానే పావనముగా అవ్వాలి, పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి. ఈ బాబా వృద్ధుడు అయినా ఇంతటి ఉన్నత పదవిని పొందారు, మరి మనము ఎందుకు తయారవ్వలేము. ఇది కూడా చదువే కదా. మీరు ఇందులో పుస్తకాలు మొదలైనవేవీ చదవాల్సిన అవసరము లేదు. బుద్ధిలో మొత్తము కథ అంతా ఉంది. ఇది ఎంత చిన్నని కథ. ఇది ఒక్క క్షణము యొక్క విషయము, జీవన్ముక్తి ఒక్క క్షణములో లభిస్తుంది. ముఖ్యమైన విషయము ఏమిటంటే, తండ్రిని స్మృతి చేయండి. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని మీరు మర్చిపోతారా! అందరూ రాజులుగా అవ్వరు కదా అని అంటారు. అరే, మీరు అందరి గురించి ఎందుకు చింతన చేస్తున్నారు! స్కూల్లో ఎప్పుడైనా - అందరూ స్కాలర్షిప్ ను పొందలేరు కదా అన్న చింత పెట్టుకుంటారా ఏమిటి. చదవడం మొదలుపెడతారు కదా. ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా - వారు ఏ పదవిని పొందబోతున్నారు అనేది అర్థమవుతుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ సమయము చాలా విలువైనది, దీనిని వ్యర్థమైన విషయాలలో పోగొట్టుకోకూడదు. ఎన్ని తుఫానులు వచ్చినా, నష్టాలు కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి.

2. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి అన్న చింతననే చేయాలి, వేరే ఏ చింతన నడవకూడదు. హంసో సోహం అన్న చిన్న కథను చాలా యుక్తిగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి.

వరదానము:-
మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే మాయాజీత్ భవ

మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ను మరియు స్వరూపాలను, అనేక గుణాల అలంకారాలను, సంతోషము, ఆత్మిక నషా మరియు రచయిత, రచనలకు సంబంధించిన అనేక రకాల విస్తారమైన పాయింట్లను, ప్రాప్తుల పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి. మీకు ఏవైతే ఇష్టమో వాటిపై మననము చేయండి, అప్పుడు మగ్న అవస్థ సహజముగా అనుభవమవుతుంది. అప్పుడు ఇక ఎప్పుడూ పరవశులు అవ్వరు, మాయ సదా కాలము కొరకు నమస్కారము చేస్తుంది. సంగమయుగములోని మొదటి భక్తురాలిగా మాయ అవుతుంది. ఎప్పుడైతే మీరు మాయాజీతులుగా, మాస్టర్భగవానులుగా అవుతారో, అప్పుడు మాయ భక్తురాలిగా అవుతుంది.

స్లోగన్:-
మీ ఉచ్చరణ మరియు ఆచరణ బ్రహ్మాబాబా సమానముగా ఉండాలి, అప్పుడే సత్యమైన బ్రాహ్మణులుగా పిలవబడతారు.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

స్మృతిలో నిరంతరము ఉండేందుకు సహజ సాధనము - ప్రవృత్తిలో ఉంటూ పర వృత్తిలో ఉండటము. పర వృత్తి అనగా ఆత్మిక రూపము. ఇలా ఆత్మిక రూపములో ఉండేవారు సదా అతీతముగా మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉంటారు. ఎంత పని చేసినా కానీ, పని చెయ్యటం లేదు కానీ ఆడుకుంటున్నాము అన్నట్లు అనుభవమవుతుంది. ఈ ఆత్మిక నయనాలు, ఈ ఆత్మిక మూర్తి ఎటువంటి దివ్య దర్పణముగా అవుతాయంటే, ఆ దర్పణములో ప్రతి ఆత్మ ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మిక స్వరూపాన్నే చూస్తుంది.