06-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - జీవిస్తూనే ఈ శరీరము నుండి వేరవ్వండి,
అశరీరిగా అయి తండ్రిని స్మృతి చేయండి, దీనినే డెడ్ సైలెన్స్ అని అంటారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు
ఇప్పుడు మీ పునాదిని దృఢముగా చేసుకుంటున్నారు, దృఢత్వమనేది దేని ఆధారముగా వస్తుంది?
జవాబు:-
పవిత్రత
ఆధారముగా. ఎంతెంతగా ఆత్మ పవిత్రముగా అనగా సత్యమైన బంగారముగా అవుతూ ఉంటుందో, అంతగా
దృఢత్వము వస్తుంది. బాబా ఇప్పుడు స్వరాజ్యము యొక్క పునాదిని ఎంత దృఢముగా వేస్తారంటే,
ఇక అర్ధకల్పము ఆ పునాదిని ఎవ్వరూ కదిలించలేరు, మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
బాబా అంటారు - నన్ను స్మృతి చేయండి అనగా అశరీరిగా అవ్వండి అనగా డెడ్ సైలెన్స్.
మనుష్యులు మరణించినప్పుడు డెడ్ సైలెన్స్ ఏర్పడుతుంది. వీరి శరీరము శాంతిగా
అయిపోయిందని అంటారు. శరీరము మరియు ఆత్మ వేరైపోయాయి, ఇక అంతమైపోయినట్లు అవుతుంది.
ఇక్కడ కూడా పిల్లలైన మీరు కూర్చున్నప్పుడు, దీనిని డెడ్ సైలెన్స్ అని అంటారు.
జీవిస్తూనే అశరీరిగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి.
ఇది సత్యమైన శాంతి అని మీకు తెలుసు. మనుష్యులకు శాంతి గురించి తెలియదు. డెడ్
సైలెన్స్ యొక్క అర్థమైతే వారికి అసలు తెలియదు. డెడ్ సైలెన్స్ అని ఎందుకంటారు?
వ్యక్తి డెడ్ అయ్యి (మరణించి) సైలెన్స్ (నిశ్శబ్దము) అయిపోయారని స్మృతిని
ఇప్పిస్తారు. మీరు కూడా మరణించండి, మీరు కూడా శాంతిగా అయిపోండి. పెద్ద-పెద్ద
వ్యక్తులు గాంధీ సమాధి వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి, డెడ్ సైలెన్స్ లో అనగా
శాంతిగా కూర్చోండి అని అంటారు. మీకు కూడా తెలుసు - నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని.
ఇది ప్రపంచానికి తెలియనే తెలియదు. మనము మన స్వరూపములో స్థితులైపోతాము, మన స్వధర్మము
శాంతి. మన ఆత్మ శాంతి స్వరూపము. వారికి ఈ విషయము తెలియదు, అందుకే శాంతి కావాలని
అడుగుతారు. శాంతి కావాలని ఆత్మ అంటుంది. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయింది.
వాస్తవానికి ఆత్మ ధర్మమే శాంతి. అటువంటప్పుడు, అశాంతి ఉందని ఆత్మ ఎందుకు అంటుంది?
అశరీరిగా అయి కూర్చుండిపోండి. వారు హఠముతో ప్రాణాయామము చేస్తారు, దానితో
మరణించినట్లుగా అయిపోతారు. దానిని కృత్రిమమైన శాంతి అని అంటారు. మా స్వధర్మము శాంతి
అని పిల్లలైన మీకైతే తెలుసు. ఆత్మ అయిన మీరు స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఆత్మయే
అన్నీ అవుతుంది. ఆత్మయే బ్యారిస్టరుగా అవుతుంది. నాకు రాజ్యము కావాలని, ఆత్మయే
అంటుంది. ఇంతకుముందు కూడా తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ
తీసుకోవడానికి వచ్చారు. మనుష్యులు దేహాభిమానములో ఉన్నారు కనుక దుఃఖములో ఉన్నారు.
నేను ఆత్మను, నా పరమపిత పరమాత్మ నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చానని ఇప్పుడు
మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయిన మీకు రాజ్యము కావాలి. ఈ సమయములో ఆత్మ అనంతమైన
తండ్రిని స్వరాజ్యము అడుగుతుంది. శ్రీకృష్ణునికైతే స్వరాజ్యము ఉండేది, అది తర్వాత
మాయమైపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మలైన మీకు రాజ్యాన్ని ఇస్తారు. దీనిని
రాజయోగమని అంటారు. పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తారు. మనుష్యులు
దేహాభిమానులుగా ఉన్న కారణముగా, ‘నేను ఫలానా’ అని అంటారు. ‘నేను’ అంటే దేహమే అని
అనుకుంటారు. వాస్తవానికి నేను, నేను అని ఆత్మ అంటుంది. నేను ఈ వస్తువును
తీస్తున్నాను అని ఆత్మ అంటుంది. నేను తీస్తున్నాను అని స్త్రీ అంటుంది (స్త్రీ
లింగములో). వాస్తవానికి ఆత్మ అయితే మేల్. ఆత్మనైన నేను తండ్రి సంతానాన్ని. బాబా,
నేను మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకుంటున్నానని ఆత్మ అంటుంది. ఆత్మకు స్వరాజ్యాన్ని
పరమాత్మ ఇస్తారు. భక్తికి మరియు జ్ఞానానికి ఎంత వ్యత్యాసము ఉందో చూడండి. శివుని
మందిరము కూడా ఉంటుంది. గంటలు కూడా అన్నింటికన్నా ఎక్కువగా శివుని మందిరములోనే
మ్రోగుతాయి. వారిని మేలుకొలుపుతారు. వాస్తవానికి అందరినీ మేలుకొలుపుతారు. ఉదయాన్నే
వాయిద్యాలు మోగిస్తారు. ఇక్కడ తండ్రి పిల్లలను మేలుకొలిపి దేవతలుగా తయారుచేస్తారు.
ఇక్కడ గంటలు మొదలైనవి మోగించాల్సిన విషయమేమీ లేదు. తండ్రి అంటారు - మీకు స్వరాజ్యము
కావాలంటే ముందు పవిత్రముగా అవ్వండి. లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంటుంది. నేను
మెట్రిక్ పాస్ అయిన తర్వాత ఇది చేస్తానని విద్యార్థి అంటాడు. మాకు శాంతి లభించాలని
సన్యాసులు కోరుకుంటారు. ఒక కథ కూడా ఉంది కదా - రాణి మెడలోనే హారము ఉంది కానీ బయట
వెతికారు అని. అలాగే, మనుష్యులు కూడా శాంతిని బయట వెతుకుతున్నారు. కానీ ఆత్మ అయితే
స్వయం శాంతి స్వరూపము. ఆత్మ తన స్వధర్మాన్ని మరచి, స్వయాన్ని శరీరముగా భావిస్తూ
కూర్చుంది. తండ్రి మళ్ళీ స్మృతినిప్పిస్తున్నారు - మీరు ఆత్మలు, ఆత్మలైన మీరు 84
జన్మలు అనుభవించారు. ఈ విషయాలను ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి అంటారు - మీకు
మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియజేస్తాను. మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. తండ్రి
అర్థం చేయించారు - పవిత్రత లేకుండా జ్ఞాన ధారణ జరగదు. పులి పాలు కోసం బంగారు పాత్ర
కావాలని అంటారు కదా. అలా ఇక్కడ కూడా బంగారు పాత్ర కావాలి. ఆత్మ తండ్రిని స్మృతి
చేయడముతో బంగారముగా అయిపోతుంది. తండ్రి కూడా సత్యమైన బంగారము. ఆత్మ తండ్రిని స్మృతి
చేసినట్లయితే జ్ఞానము వచ్చేస్తుంది. మీరు సత్యమైన బంగారముగా, పవిత్రముగా ఉండేవారు.
ఈ జ్ఞానము యొక్క ప్రభావము ఇతరులెవరిపైనా పడదు. తండ్రి అంటారు - నేను ఆత్మ అయిన మీకు
స్వరాజ్యాన్ని ఇస్తాను. ఎప్పుడైతే పాత సృష్టి యొక్క అంతము మరియు కొత్త సృష్టి యొక్క
ఆది జరుగుతుందో, అప్పుడు ఈ స్వరాజ్యము లభిస్తుంది. మనుష్యులకు హద్దు రాజ్యము ఉంటుంది.
అనంతమైన రాజ్యము మనుష్యులకెప్పుడూ లభించదు. వారు విశ్వానికి యజమానులుగా అవ్వలేరు.
మీరు తండ్రి ద్వారా అలా అవుతారు. భగవంతుడైన తండ్రికి మాత్రమే మీ 84 జన్మల గురించి
తెలుసు. దేవతలు తమ జన్మల గురించి తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకున్నట్లయితే, ఇక మేము
మెట్లు దిగుతూ వెళ్ళిపోతామా అని దుఃఖితులు అవుతారు! రాజ్యము యొక్క సుఖమే
మాయమైపోతుంది. ఇక్కడ మీకు తెలుసు. నేను ఆత్మను అని మీకు తెలుసు. ఇందులో సంశయము
యొక్క విషయమేమీ లేదు. ఒకరి నుండి ఒకరు వింటూ ఉంటారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ దైవీ
ధర్మము యొక్క వృక్షము స్థాపన అవుతోంది. ఎవరైనా వస్తే, మా బ్రాహ్మణ కులం వారు
వచ్చారని, వీరి భక్తి పూర్తయ్యిందని, మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు
వచ్చారని మీరు అర్థం చేసుకోగలరు. జ్ఞానము పూర్తయిన తర్వాత మళ్ళీ భక్తి
ప్రారంభమవుతుంది. ఈ విషయము ఎవరికీ తెలియనే తెలియదు. ఇల్లు కూడా కొత్తదిగా ఉంటుంది,
తర్వాత పాతదిగా అవుతుంది కదా. పునాది కచ్చాగా ఉన్న ఇంటికి, తప్పకుండా ఆయుష్షు
తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇళ్ళను చాలా పక్కాగా నిర్మిస్తున్నారు. భూకంపాలు
మొదలైనవి వచ్చినా కూడా, ఇళ్ళు కూలిపోకుండా, నష్టము కలగకుండా చాలా దృఢముగా
నిర్మిస్తున్నారు. పునాదిని చాలా పక్కాగా వేస్తున్నారు. ఇప్పుడు స్వరాజ్యానికి
పునాది పడుతూ ఉంది. ఆత్మకు 21 జన్మల కోసం రాజ్యము లభిస్తుంది. ఇక్కడి రాజ్యాలైతే
అసలేమీ కావు. ఈ రోజు రాజ్యము ఉంటుంది, రేపు ఎవరైనా దాడి చేస్తే సమాప్తము. దేనికీ
పునాది అనేదే లేదు. మనుష్యులకు కూడా పునాది లేదు, ఈ రోజు ఉంటారు, రేపు మరణిస్తారు.
ఇప్పుడు మీ పునాదిని బాబా పక్కాగా వేస్తున్నారు, దీనితో 21 జన్మలు మీరు రాజ్య
భాగ్యాన్ని పొందుతారు. మీ రాజ్యానికి పక్కా పునాది పడుతుంది. మిమ్మల్ని ఏ ధరణి
యొక్క తుఫానులు కదిలించలేవు. గీతలో కూడా చెప్తారు - బాబా మాకు స్వరాజ్యాన్ని ఇస్తారు,
దానిని ఎవరూ తీసుకోలేరు, కింద పడివేయనూ లేరు. బాబా ఎటువంటి రాజ్యాధికారాన్ని
ఇస్తారంటే, అక్కడ కొద్దిగా కూడా దుఃఖమనే మాటే ఉండదు. ఆత్మకు ఎంత సంతోషము ఉండాలి.
నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయము లేకపోతే స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులు కారు.
ఎంతమంది బ్రహ్మాకుమార-కుమారీలు వృద్ధి చెందుతూ ఉంటారు.
జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు మమ్మల్ని చదివించి, రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు
తెలుసు. వారేమో శ్రీకృష్ణుడు నేర్పించారని అంటారు. శివబాబా మనుష్య తనువులోకి వచ్చి
నేర్పించారని వారెలా అర్థం చేసుకుంటారు. భారత్ యే పవిత్రముగా ఉండేది, ఇప్పుడు
అపవిత్రముగా, పతితముగా ఉంది. దేవతల ముందుకు వెళ్ళి వారి మహిమను పాడుతారు. మీరు
సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని శివుని ముందుకు వెళ్ళి ఎప్పుడూ ఇలా పాడరు.
శివుని మహిమ వేరు. వారు జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు, సర్వులకు సద్గతిని ఇచ్చేవారు,
సర్వుల జోలిని నింపేవారు, భోళానాథుడు. ఇటువంటి తండ్రిని అందరూ మర్చిపోయారు. మీరు
వచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పరమపిత పరమాత్మను పిలుస్తారు.
సుఖకర్త, దుఃఖహర్త అయితే ఒక్కరే. వారి మతమే శ్రేష్ఠమైనది. ఇది శ్రీ శ్రీ అయిన
భగవంతుని మతము, దీనితో పిల్లలైన మీరు కూడా శ్రేష్ఠముగా అవుతారు. ఇది భ్రష్టాచారీ
ప్రపంచమని గవర్నమెంట్ కూడా అంటుంది. ఇప్పుడు శ్రేష్ఠముగా ఎవరు తయారుచేస్తారు అనేది
ఏమీ తెలియదు. సాధువులు తయారుచేస్తారని భావిస్తారు కానీ వారు శ్రేష్ఠముగా
తయారుచేయలేరు. ఇదైతే తండ్రి పని మాత్రమే. పూర్వము, ఒక్క రాజు ఆజ్ఞలపై నడుచుకునేవారు.
సత్యయుగములో మీకు మంత్రులు మొదలైనవారెవరూ ఉండరు. చక్రవర్తిలో కూడా శక్తి ఉంటుంది.
మంత్రి పేరే ఉండదు. మేము విశ్వానికి యజమానులుగా అయి రాజ్యము చేసామని మీరు అర్థం
చేసుకున్నారు. ఇంతకుముందు ఎలాగైతే రాజ్యము చేసారో, అలాగే వెళ్ళి చేయాలి. తప్పకుండా
సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది కదా. ప్రతి ఒక్కరికి తమ-తమ రాజధాని
లభిస్తుంది. శ్రీకృష్ణుడికి తన రాజధాని ఉంటుంది. వేరే రాజులు కూడా ఉంటారు కదా.
తక్కువలో తక్కువ 8 మందైతే ఉంటారు కదా, తర్వాత 8 మంది ఉంటారా లేక 108 మంది ఉంటారా
అనేది మున్ముందు తెలుస్తుంది. ఏ జ్ఞానమైతే తర్వాతర్వాత ఇచ్చేది ఉంటుందో, దానిని
ఇప్పుడే ఇవ్వరు కదా. ఎవరైతే జీవించి ఉంటారో, వారికి తండ్రి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు.
ఇవ్వాల్సిందే. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. పరమాత్ముని పాత్ర ఇప్పుడే ఉంది. ఈ
జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర ఇప్పుడే నిశ్చితమై ఉంది.
తండ్రి అంటారు - మున్ముందు మీరు చాలా అర్థం చేసుకుంటారు. రోజురోజుకు అర్థం చేయిస్తూ
ఉంటారు. అక్కడ మనము రాజ్యము ఎలా చేస్తాము, స్వయంవరం ఎలా జరుగుతుంది అనేది కూడా
తెలుసుకోవాలి. మీరు ధ్యానములోకి వెళ్ళినప్పుడు, వైకుంఠములోకి వెళ్ళి అక్కడ బంగారు
మహళ్ళు ఎలా ఉంటాయి అనేది చూస్తారు కూడా. అక్కడ బంగారమే బంగారము ఉంటుంది. స్వయాన్ని
పారసపురిలో చూసుకుంటారు. బంగారు ఇటుకలతో ఇళ్ళు తయారవ్వడాన్ని చూస్తారు. కొన్ని
ఇటుకలను తీసుకువెళ్దామని అనుకుంటారు. తర్వాత ధ్యానము నుండి తిరిగి వచ్చినప్పుడు,
స్వయాన్ని ఇక్కడ ఉన్నట్లుగా చూసుకుంటారు. మీరా కూడా ధ్యానములో స్వయాన్ని
శ్రీకృష్ణునితో రాస్ చేస్తున్నట్లుగా చూసేవారు. మీరు సూక్ష్మవతనములోకి వెళ్తారు.
అక్కడ ఎముకలు, మాంసం ఉండవు, ఫరిశ్తాలుగా అవుతారు. బ్రహ్మా యొక్క సూక్ష్మ శరీరము కూడా
కనిపిస్తుంది. వీరే ఫరిశ్తాగా అయిపోతారు. మీరు పుష్పాల తోటలు మొదలైనవి చూస్తారు.
తండ్రి వీటిని సాక్షాత్కారము చేయిస్తారు. బాబా మాకు శూబీ రసాన్ని తాగించారని
మీరంటారు. కానీ సూక్ష్మవతనములోనైతే తాగించలేరు. పుష్పాలు, ఫలాలు వైకుంఠములో చాలా
ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. సూక్ష్మవతనములోనైతే తోటలు మొదలైనవి ఉండవు. తోటలోకి వెళ్ళాను,
అక్కడ రాకుమారుడు ఉన్నాడని మీరు చెప్తారు, అది వైకుంఠము అయినట్లు కదా. వైకుంఠము
యొక్క వైభవాలు ఇక్కడ లభించవు. అక్కడైతే ఫస్ట్ క్లాస్ వైభవాలు ఉంటాయి. తండ్రి అంటారు
- నేను మిమ్మల్ని వైకుంఠానికి యజమానులుగా చేస్తాను. ఇక్కడైతే దుఃఖమే దుఃఖముంది. ఓ
భగవంతుడా, దుఃఖము నుండి విడిపించండి అని అడగని మనుష్యులెవరూ ఇక్కడ లేరు. దుఃఖములోనే
తలచుకుంటారు. శ్రీకృష్ణుని పూజారులు కృష్ణ అని అనమంటారు. హనుమంతుని పూజారులు
హనుమంతునికి జై అని అంటారు... ఇక్కడ తండ్రి అంటారు - నిరంతరము తండ్రినైన నన్ను
స్మృతి చేయండి. ఎలా స్మృతి చేయండి అంటే ఇక అంతిమ సమయములో ఇంకెవ్వరి స్మృతి రాకూడదు.
కాశీలో కత్తుల బావిలోకి దూకేవారు, అందులోకి దూకినప్పుడు వారికి ఎలా అనిపిస్తుందంటే,
వారు చేసిన పాపాలకు జన్మజన్మల శిక్షలు అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. చాలా
పాపాలు చేసారు. దీనినే పాపాత్ముల ప్రపంచమని అంటారు. ఆత్మ పాపిగా ఉంది. ఓ పరమపిత
పరమాత్మ, పరంధామములో నివసించే ఓ శివబాబా, అని ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. వారి
అసలు పేరైతే ఒక్కటే. వారు ఆత్మలకు తండ్రి. రుద్రుడు అనే పదము ఉపయోగించినప్పుడు
సాలిగ్రామాలు అనే పదము శోభించదు. శివుడు మరియు సాలిగ్రామాలు - అనే పదాలు శోభిస్తాయి.
మట్టితో శివలింగాన్ని తయారుచేసినప్పుడు సాలిగ్రామాలను కూడా తయారుచేస్తారు.
పతిత-పావనుడైతే వారే కదా. ఇక్కడ యజ్ఞాలను కూడా రచిస్తారు. భారత్ అన్నింటికంటే
ఉన్నతమైనది. కానీ దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము.
అదైతే కొనసాగాలి. హిందూ అనేది ధర్మము కాదు. దేవతా ధర్మమువారే సతో, రజో, తమోలలోకి
వస్తారు. ఎప్పుడైతే తమోలోకి వస్తారో, అప్పుడు తమను తాము దేవతలుగా చెప్పుకోలేరు.
వాస్తవానికి హిందూ అనేది ధర్మము కాదు. మీరు దేవీ-దేవతలుగా అవ్వగలరు, వచ్చి
తెలుసుకోండి అని అర్థం చేయించడము జరుగుతుంది. అప్పుడు వారు, తీరిక ఎక్కడ ఉంది అని
అంటారు! తండ్రి అంటారు - సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను మిమ్మల్ని
నావారిగా చేసుకుంటాను. కొన్ని పరివారాలు పరస్పరములో కలిసి ఉంటారు, చాలా ప్రేమగా
నడుచుకుంటారు, అందరి సంపాదన కలిపి జరుగుతుంది, ఎటువంటి హంగామాలు ఉండవు, కానీ అలాగని
వారిది స్వర్గమని అనరు కదా. సత్యయుగములో ఒక్క ఇంటిలో కూడా అనారోగ్యము కలవారు,
దుఃఖితులు ఉండరు. దాని పేరే స్వర్గము. అక్కడ అందరూ సుఖముగా ఉంటారు. తండ్రి నుండి
మీరు సదా సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు. మీకు జ్ఞానము లభించింది.
మీరు అంటారు - బాబా, మీరు పతిత-పావనుడు, మమ్మల్ని కూడా పావనముగా చేయండి. తండ్రితో
పాటు పిల్లలైన మీరు కూడా ఈశ్వరీయ సేవాధారులు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రత యొక్క పునాదిని ఇప్పటినుండే ధృఢముగా
చేసుకోవాలి. ఎలాగైతే తండ్రి పతిత-పావనుడో, అలా తండ్రి సమానముగా పావనముగా అవ్వాలి.
2. తమ శాంత స్వధర్మములో స్థితులై ఉండాలి. ఎంత వీలైతే అంత దేహాభిమానాన్ని వదిలి,
దేహీ-అభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్ ను అనగా అశరీరిగా ఉండే అభ్యాసము చేయాలి.
వరదానము:-
అన్యాత్మల సేవతోపాటుగా స్వయము యొక్క సేవను కూడా చేసుకునే
సఫలతామూర్త భవ
సేవలో సఫలతామూర్తులుగా అవ్వాలంటే ఇతరుల సేవతోపాటుగా మీ
సేవను కూడా చేసుకోండి. ఏ సేవకైనా వెళ్ళినప్పుడు సేవతోపాటుగా మీ పాత సంస్కారాలను కూడా
అంతిమ సంస్కారము చేస్తున్నట్లుగా భావించండి. ఎంతగా సంస్కారాల అంతిమ సంస్కారము
చేస్తారో అంతగానే సత్కారము లభిస్తుంది. ఆత్మలందరూ మీ ముందు మనసుతో నమస్కరిస్తారు.
బయటకి నమస్కారము చేసేవారిగా తయారుచేయకండి, మనసుతో నమస్కారము చేసేవారిగా తయారుచేయండి.
స్లోగన్:-
అనంతమైన సేవ
యొక్క లక్ష్యము పెట్టుకున్నట్లయితే హద్దులోని బంధనాలన్నీ తెగిపోతాయి.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
ఎప్పటివరకైతే మీ
స్మృతి జ్వాలా రూపముగా అవ్వదో, అప్పటివరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలా
రూపాన్ని పొందదు. భగ్గుమంటుంది కానీ మళ్ళీ శీతలమైపోతుంది, ఎందుకంటే జ్వాలా మూర్తులు
మరియు ప్రేరక ఆధారమూర్త ఆత్మలు ఇప్పుడు స్వయమే సదా జ్వాలా రూపులుగా అవ్వలేదు.
ఇప్పుడు జ్వాలా రూపులుగా అయ్యే దృఢ సంకల్పాన్ని చేయండి మరియు సంగఠిత రూపములో
మనసు-బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగానికి చెందిన వైబ్రేషన్లను నలువైపులా
వ్యాపింపజేయండి.