06-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ శరీరము రూపీ ఆటబొమ్మ ఆత్మ రూపీ చైతన్యమైన తాళంచెవి (కీ) తో నడుస్తుంది, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు’’

ప్రశ్న:-
ఆత్మ శరీరముతో పాటు ఆటను ఆడుతూ కిందికి వచ్చింది, కావున దానికి ఏ పేరును పెడతారు?

జవాబు:-
తోలుబొమ్మ. ఏ విధముగా డ్రామాలో తోలుబొమ్మలాటను చూపిస్తారో, అదే విధముగా ఆత్మలైన మీరు కూడా తోలుబొమ్మల వలె 5 వేల సంవత్సరాలు ఆటను ఆడుతూ కిందికి వచ్చేశారు. తోలుబొమ్మలైన మీకు పైకి ఎక్కే మార్గాన్ని తెలియజేసేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు శ్రీమతమనే తాళంచెవి (కీ) ని ఉపయోగించినట్లయితే పైకి వెళ్ళిపోతారు.

పాట:-
సభలో జ్యోతి వెలిగింది...

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తున్నారు - ఎప్పుడైనా ఎవరి నడవడికైనా బాగా లేకపోతే, ‘‘నీకు ఆ ఈశ్వరుడు మంచి మతాన్ని ఇవ్వాలి’’ అని తల్లి-తండ్రులు అంటారు. కానీ ఈశ్వరుడు నిజంగానే మతాన్ని ఇస్తారని పాపం వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది అనగా ఆత్మిక తండ్రి తన పిల్లలకు శ్రేష్ఠముగా తయారయ్యేందుకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు. మేము శ్రేష్ఠాతి-శ్రేష్ఠముగా అవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి మనకు ఎంత ఉన్నతమైన మతాన్ని ఇస్తున్నారు. మనము వారి మతముపై నడుస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. కావున మనుష్యులను దేవతలుగా తయారుచేసేవారు ఆ తండ్రియేనని ఋజువవుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు... అని సిక్కులు కూడా గానము చేస్తారు, అంటే వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే మతాన్ని ఇస్తారు. ఏక్ ఓంకార్, కర్తా పురుష్, నిర్భయ్ (భగవంతుడు ఒక్కరే, వారు ఓంకారుడు, మూల పురుషుడు, నిర్భయుడు)... అని వారి మహిమను కూడా గానము చేసారు. మీరందరూ నిర్భయులుగా అయిపోతారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. ఆత్మకు ఎటువంటి భయము ఉండదు. తండ్రి అంటారు, నిర్భయులుగా అవ్వండి, భయము దేనికి. మీకు ఎటువంటి భయము లేదు. మీరు మీ ఇంట్లో కూర్చుని కూడా తండ్రి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీమతము ఎవరిది? ఎవరిస్తారు? ఈ విషయాలు గీతలోనైతే లేవు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, మీరు పతితులైపోయారు, ఇప్పుడు పావనముగా తయారయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి. పురుషోత్తములుగా అయ్యే ఈ మేళా సంగమయుగములోనే జరుగుతుంది. ఎంతోమంది వచ్చి శ్రీమతాన్ని తీసుకుంటారు. దీనిని ఈశ్వరునితో పాటు పిల్లల మేళా అని అంటారు. ఈశ్వరుడు కూడా నిరాకారుడే. పిల్లలు (ఆత్మలు) కూడా నిరాకారులే. నేను ఆత్మను - ఈ అలవాటును పక్కా చేసుకోవాలి. ఏ విధముగా బొమ్మకు ‘కీ’ ఇచ్చినట్లయితే డాన్స్ చేయడము మొదలుపెడుతుందో, అలా ఆత్మ కూడా ఈ శరీరము రూపీ బొమ్మకు తాళంచెవి వంటిది. ఇందులో ఆత్మ లేకపోతే ఏమీ చేయలేదు. మీరు చైతన్యమైన ఆటబొమ్మలు. బొమ్మకు ‘కీ’ ఇవ్వకపోతే అది పని చేయదు, అలా నిలబడి ఉండిపోతుంది. ఆత్మ కూడా చైతన్యమైన తాళంచెవి మరియు ఇది అవినాశీ, అమరమైన తాళంచెవి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను చూసేది ఆత్మనే. ఆత్మయే వింటుంది - ఈ అలవాటును పక్కా చేసుకోవాలి. ఈ ‘కీ’ లేకుండా శరీరము నడవదు. ఇతనికి కూడా అవినాశీ తాళంచెవి లభించింది. ఈ తాళంచెవి 5 వేల సంవత్సరాలు నడుస్తుంది. చైతన్యమైన తాళంచెవి అయిన కారణముగా చక్రము తిరుగుతూనే ఉంటుంది. వీరు చైతన్యమైన ఆటబొమ్మలు. తండ్రి కూడా చైతన్యమైన ఆత్మనే. ఎప్పుడైతే ఈ ‘కీ’ పూర్తవుతుందో, అప్పుడు తండ్రి మళ్ళీ కొత్తగా యుక్తిని తెలియజేస్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మళ్ళీ ‘కీ’ తిప్పబడుతుంది అనగా ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతుంది. ఉదాహరణకు కారులో పెట్రోలు అయిపోతే మళ్ళీ నింపడము జరుగుతుంది కదా. ఇప్పుడు మనలో పెట్రోలు ఎలా నిండుతుంది అనేది మీ ఆత్మ అర్థం చేసుకుంటుంది. బ్యాటరీ ఖాళీ అయినప్పుడు మళ్ళీ అందులో పవర్ నింపడము జరుగుతుంది కదా. బ్యాటరీ ఖాళీ అయినట్లయితే కరెంట్ సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీ ఆత్మ రూపీ బ్యాటరీ నిండుతుంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పవర్ నిండుతూ ఉంటుంది. ఇంతగా 84 జన్మల చక్రములో తిరిగి బ్యాటరీ ఖాళీ అయిపోయింది. సతో, రజో, తమోలలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి ‘కీ’ ఇచ్చేందుకు మరియు బ్యాటరీని నింపేందుకు వచ్చారు. పవర్ లేకపోతే మనుష్యులు ఎలా అయిపోతారు. కావున ఇప్పుడు స్మృతి ద్వారానే బ్యాటరీని నింపుకోవాలి, వీరిని హ్యూమన్ (మానవ) బ్యాటరీ అని అనవచ్చు. తండ్రి అంటారు, నాతో యోగము జోడించండి. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీ బ్యాటరీ పూర్తిగా నిండుతుంది, దానితో మళ్ళీ 84 జన్మలు పూర్తిగా పాత్రను అభినయిస్తారు. ఏ విధముగానైతే డ్రామాలో తోలుబొమ్మలు నాట్యము చేస్తాయి కదా, అలా ఆత్మలైన మీరు కూడా ఈ తోలుబొమ్మల వంటివారు. పై నుండి కిందికి దిగుతూ 5 వేల సంవత్సరాలలో పూర్తిగా కిందికి వచ్చేస్తారు, మళ్ళీ తండ్రి వచ్చి పైకి ఎక్కిస్తారు. అదైతే ఒక ఆటబొమ్మ. తండ్రి ఎక్కే కళ మరియు దిగే కళ యొక్క అర్థాన్ని అర్థం చేయిస్తున్నారు, ఇది 5 వేల సంవత్సరాల విషయము. శ్రీమతము ద్వారా మాకు ‘కీ’ లభిస్తూ ఉందని మీరు అర్థం చేసుకుంటారు. మనము పూర్తిగా సతోప్రధానముగా అయినప్పుడు మళ్ళీ మొత్తం పాత్రనంతా రిపీట్ చేస్తాము. ఇది అర్థం చేసుకోవలసిన మరియు ఇతరులకు అర్థం చేయించవలసిన ఎంత సహజమైన విషయము. అయినా సరే తండ్రి అంటారు, ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకున్నారో, వారే మళ్ళీ అర్థం చేసుకుంటారు. మీరు ఎంత తల బాదుకున్నా కానీ ఎక్కువేమీ అర్థం చేసుకోరు. తండ్రి అయితే అందరికీ ఒకే రకముగా అర్థం చేయిస్తారు. ఎక్కడ కూర్చున్నా సరే తండ్రిని స్మృతి చేయాలి. మీ ముందు బ్రాహ్మణి లేకపోయినా సరే, మీరు స్మృతిలో కూర్చోవచ్చు. తండ్రి స్మృతి ద్వారానే మన వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు. కావున ఆ స్మృతిలో కూర్చుండిపోవాలి. ఎవరూ కూర్చోబెట్టవలసిన అవసరము లేదు. తింటూ-తాగుతూ, స్నానము మొదలైనవి చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. కొద్ది సమయము కోసం ఎవరో ఒకరు మీ ముందు కూర్చుంటారు. అలాగని వారు మీకు సహాయము చేస్తారని కాదు. అలా కాదు. ప్రతి ఒక్కరూ తమకు తామే సహాయము చేసుకోవాలి. మీరు ఇలా-ఇలా చేసినట్లయితే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అయిపోతుందని ఈశ్వరుడైతే మతాన్ని ఇచ్చారు. ఈ టెంప్టేషన్ ఇవ్వడము జరుగుతుంది. శ్రీమతాన్ని అయితే అందరికీ ఇస్తూ ఉంటారు. కానీ ఒకటైతే వాస్తవము, కొందరి బుద్ధి మందముగా ఉంది, కొందరిది చురుకుగా ఉంది. పావనమైనవారితో యోగము కుదరకపోతే బ్యాటరీ చార్జ్ అవ్వదు. వారు తండ్రి శ్రీమతాన్ని పాటించరు. వారికి యోగమే కుదరదు. మా బ్యాటరీ నిండుతూ ఉందని ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు. తమోప్రధానము నుండి సతోప్రధానముగానైతే తప్పకుండా అవ్వాలి. ఈ సమయములో మీకు పరమాత్ముని శ్రీమతము లభిస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రపంచము ఏ మాత్రము అర్థం చేసుకోదు. తండ్రి అంటారు, నేను ఇచ్చే ఈ మతము ద్వారా మీరు దేవతలుగా అవుతారు, దీనికన్నా ఉన్నతమైన విషయము మరేదీ ఉండదు. అక్కడ ఈ జ్ఞానము ఉండదు. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారుచేయడానికి తండ్రి సంగమయుగములోనే వస్తారు, దీని స్మృతిచిహ్నాన్ని భక్తి మార్గములో జరుపుకుంటారు, దసరా కూడా జరుపుకుంటారు కదా. ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు దసరా జరుగుతుంది. 5 వేల సంవత్సరాల తర్వాత ప్రతి విషయము రిపీట్ అవుతుంది.

పిల్లలైన మీకు మాత్రమే ఈ ఈశ్వరీయ మతము అనగా శ్రీమతము లభిస్తుంది, దీని ద్వారా మీరు శ్రేష్ఠముగా అవుతారు. మీ ఆత్మ సతోప్రధానముగా ఉండేది, ఆత్మ కిందికి దిగుతూ-దిగుతూ తమోప్రధానముగా, భ్రష్టముగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి కూర్చుని జ్ఞాన-యోగాలను నేర్పించి సతోప్రధానముగా, శ్రేష్ఠముగా తయారుచేస్తారు. మీరు మెట్లను ఏ విధముగా కిందకు దిగుతారు అనేది వారు తెలియజేస్తారు. డ్రామా నడుస్తూ ఉంటుంది. ఈ డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు మీకు స్మృతి కలిగింది కదా. ప్రతి ఒక్కరి జన్మ కథను వినిపించలేరు. చదివి వినిపించేందుకు అవేమీ వ్రాయబడి ఉండవు. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరే బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి. తండ్రి అర్థం చేయించారు - బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, ఈ మూడు ధర్మాలను నేను స్థాపన చేస్తాను. మేము తండ్రి ద్వారా బ్రాహ్మణ వంశీయులుగా అవుతామని, ఆ తర్వాత సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఎవరైతే ఫెయిల్ అవుతారో, వారు చంద్రవంశీయులుగా అవుతారు. ఎందులో ఫెయిల్? యోగములో. జ్ఞానాన్ని అయితే చాలా సహజముగా అర్థం చేయించారు. మీరు 84 జన్మల చక్రములో ఎలా తిరుగుతారు అనేది తెలియజేశారు. మనుష్యులు 84 లక్షల జన్మలు అని అనేసరికి ఎంత దూరము వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. ఈశ్వరుడైతే ఒక్కసారి మాత్రమే వస్తారు. కావున వారి మతము కూడా ఒక్కసారే లభిస్తుంది. ఒకే దేవీ-దేవతా ధర్మము ఉండేది. తప్పకుండా వారికి ఈశ్వరీయ మతము లభించింది, దానికంటే ముందైతే సంగమయుగము ఉండేది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని మారుస్తారు. మీరు ఇప్పుడు మారుతున్నారు. ఈ సమయములో మిమ్మల్ని తండ్రి మారుస్తారు. కల్ప-కల్పము మేము మారుతూనే వచ్చాము, మారుతూనే ఉంటామని మీరంటారు. ఇది చైతన్యమైన బ్యాటరీ కదా. అది జడమైనది. 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చారని పిల్లలకు తెలిసింది. వారు శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన మతమును కూడా ఇస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుని యొక్క ఉన్నతమైన మతము లభిస్తుంది, దాని ద్వారా మీరు ఉన్నత పదవిని పొందుతారు. మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు - మీరు ఈశ్వరుని సంతానము కదా అని వారికి చెప్పండి. ఈశ్వరుడు శివబాబా, శివజయంతిని కూడా జరుపుకుంటారు. వారు సద్గతిదాత కూడా. వారికి తమదంటూ శరీరము లేదు. మరి ఎవరి ద్వారా మతమునిస్తారు? మీరు కూడా ఆత్మయే, ఈ శరీరము ద్వారా మాట్లాడుతారు కదా. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. నిరాకార తండ్రి కూడా ఎలా రావాలి? వారు రథముపై వస్తారని గాయనము కూడా ఉంది. దీనిని ఒకరు ఒక రకముగా, మరొకరు మరో రకముగా తయారుచేశారు. త్రిమూర్తులను కూడా సూక్ష్మవతనములో చూపించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ సాక్షాత్కార విషయాలు. ఇకపోతే రచనంతా ఇక్కడే ఉంది కదా. కావున రచయిత అయిన తండ్రి కూడా ఇక్కడికే రావలసి ఉంటుంది. పతిత ప్రపంచములోకే వచ్చి పావనముగా తయారుచేయాలి. ఇక్కడ పిల్లలను డైరెక్టుగా పావనముగా తయారుచేస్తున్నారు. అర్థం చేసుకుంటారు కూడా కానీ జ్ఞానము బుద్ధిలో కూర్చోదు. ఎవ్వరికీ అర్థం చేయించలేకపోతారు. శ్రీమతాన్ని పాటించకపోతే శ్రేష్ఠాతి-శ్రేష్ఠముగా అవ్వలేరు. ఎవరైతే అసలు అర్థమే చేసుకోరో, వారు ఏ పదవిని పొందుతారు? ఎంత సేవ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి అన్నారు, సేవలో ఎముక-ఎముకను ఇవ్వాలి, ఆల్రౌండ్ సేవను చేయాలి. తండ్రి సేవలో మనము ఎముకలను సైతం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాము. చాలామంది పిల్లలు సేవ కోసం తపిస్తూ ఉంటారు. బాబా, మమ్మల్ని విడిపించినట్లయితే మేము సేవలో నిమగ్నమైపోతాము, అప్పుడు అనేకుల కళ్యాణము జరుగుతుంది అని అంటారు. మొత్తము ప్రపంచమంతా అయితే భౌతిక సేవ చేస్తుంది, దాని వలనైతే మెట్లు కిందకు దిగుతూనే వస్తారు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవతో ఎక్కే కళ జరుగుతుంది. ఫలానావారు మా కంటే ఎక్కువ సేవ చేస్తున్నారని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. మంచి సర్వీసబుల్ కుమార్తెలు ఉంటే, వారు సెంటర్లు కూడా సంభాళించగలరు. క్లాసులో నంబరువారుగా కూర్చుంటారు. ఇక్కడైతే నంబరువారుగా కూర్చోబెట్టరు, అలా చేస్తే నిరాశకు లోనవుతారు. కానీ అర్థం చేసుకోగలరు కదా. సేవ చేయకపోతే తప్పకుండా పదవి కూడా తగ్గిపోతుంది. నంబరువారుగా ఎన్నో పదవులు ఉన్నాయి కదా. కానీ అది సుఖధామము, ఇది దుఃఖధామము. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మేము సేవ చేయడము లేదు కావున చాలా తక్కువ పదవిని పొందుతామని అర్థం చేసుకోవాలి. సేవ ద్వారానే పదవి లభించగలదు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికీ తమ అవస్థ గురించి తెలుసు. మమ్మా-బాబా కూడా సేవ చేస్తూ వచ్చారు. మంచి-మంచి పిల్లలు కూడా ఉన్నారు. వారు ఉద్యోగములో ఉన్నా కానీ వారికి ఇలా చెప్పడము జరుగుతుంది - సగము జీతము పై సెలవు తీసుకుని వెళ్ళి సేవ చేయండి పర్వాలేదు అని. ఎవరైతే బాబా హృదయ సింహాసనముపైకి ఎక్కుతారో, వారు భవిష్యత్తులో ఆ నెమలి సింహాసనముపై కూర్చుంటారు, నంబరువారు పురుషార్థానుసారముగా. అటువంటివారే విజయమాలలోకి వచ్చేస్తారు. సమర్పణ కూడా అవుతారు, సేవ కూడా చేస్తారు. కొందరైతే సమర్పణ అవుతారు కానీ సేవ చేయకపోతే పదవి తగ్గిపోతుంది కదా. ఈ రాజధాని శ్రీమతము ద్వారా స్థాపనవుతుంది. ఈ విధముగా ఎప్పుడైనా విన్నారా? లేక చదువు ద్వారా రాజధాని స్థాపనవుతుందని ఎప్పుడైనా విన్నారా, ఎప్పుడైనా చూశారా? అయితే, దానపుణ్యాదులను చేస్తే రాజుల ఇంట్లో జన్మించవచ్చు. అంతేకానీ చదువు ద్వారా రాజ్య పదవిని పొందుతారని ఎప్పుడూ విని ఉండరు. ఇది ఎవ్వరికీ తెలియదు కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మాత్రమే పూర్తి 84 జన్మలను తీసుకున్నారు. మీరు ఇప్పుడు పైకి వెళ్ళాలి. వాస్తవానికి ఇది చాలా ఈజీ. మీరు కల్ప-కల్పము నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. తండ్రి ప్రియస్మృతులను కూడా నంబరువారు పురుషార్థానుసారముగానే ఇస్తారు. ఎవరైతే సేవలో ఉన్నారో, వారికి చాలా ప్రియస్మృతులను ఇస్తారు. కావున స్వయాన్ని చెక్ చేసుకోవాలి, నేను తండ్రి హృదయాన్ని అధిరోహించానా, మాలలోని మణిగా అవ్వగలనా? చదువుకోనివారు తప్పకుండా చదువుకున్నవారి ముందు సేవకులవుతారు. తండ్రి అయితే అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, పురుషార్థము చేయండి, కానీ డ్రామాలో పాత్ర లేకపోతే ఎంతగా తల బాదుకున్నా కానీ ఎక్కనే ఎక్కరు. ఏదో ఒక గ్రహచారము పట్టుకుంటుంది. దేహాభిమానము నుండే ఇతర వికారాలు వస్తాయి. ముఖ్యమైన కఠినమైన రోగము దేహాభిమానమే. సత్యయుగములో దేహాభిమానమనే పేరే ఉండదు. అక్కడ ఉన్నది మీ ప్రారబ్ధము మాత్రమే. ఇది ఇక్కడే తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ విధముగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఇంకెవ్వరూ శ్రీమతాన్ని ఇవ్వరు. ఇది ముఖ్యమైన విషయము. ఇలా వ్రాయాలి - నిరాకార భగవంతుడు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ దేహాన్ని కూడా స్మృతి చేయకండి. భక్తిలో కూడా ఒక్క శివుని పూజయే చేస్తారు. ఇప్పుడు జ్ఞానాన్ని కూడా కేవలం నేను మాత్రమే ఇస్తాను. మిగిలినదంతా భక్తి. అవ్యభిచారి జ్ఞానము ఒక్క శివబాబా ద్వారానే మీకు లభిస్తుంది. ఈ జ్ఞానసాగరుడి నుండి రత్నాలు వెలువడతాయి. ఇది ఆ సాగరుని విషయము కాదు. ఈ జ్ఞానసాగరుడు పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇస్తారు, వీటి ద్వారా మీరు దేవతలుగా అవుతారు. శాస్త్రాలలోనైతే ఏమేమో వ్రాసేశారు. సాగరము నుండి దేవత వచ్చి రత్నాలు ఇచ్చినట్లుగా వ్రాశారు. ఈ జ్ఞానసాగరుడు పిల్లలైన మీకు రత్నాలను ఇస్తారు. మీరు జ్ఞాన రత్నాలను గ్రోలుతారు. ఇంతకుముందు రాళ్ళు ఏరుకునేవారు, కావున రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు రత్నాలను గ్రోలడముతో మీరు పారసబుద్ధి కలవారిగా అయిపోతారు. పారసనాథులుగా అవుతారు కదా. పారసనాథులైన ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భక్తి మార్గములోనైతే అనేక పేర్లు, అనేక చిత్రాలు తయారుచేసి పెట్టారు. వాస్తవానికి లక్ష్మీ-నారాయణులు అన్నా, పారసనాథులు అన్నా ఒక్కరే. నేపాల్ లో పశుపతినాథుని మేళా జరుగుతుంది, వారు కూడా పారసనాథుడే. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏ జ్ఞాన రత్నాలనైతే ఇచ్చారో, వాటిని మాత్రమే గ్రోలాలి, రాళ్ళను ఏరుకోకూడదు. దేహాభిమానమనే కఠినమైన రోగము నుండి స్వయాన్ని రక్షించుకోవాలి.

2. మీ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగము జోడించాలి. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. నిర్భయులుగా ఉండాలి.

వరదానము:-
దాతాతనపు భావన ద్వారా కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవము చేసే తృప్త ఆత్మా భవ

సదా ఒకటే లక్ష్యము ఉండాలి - మేము దాత పిల్లలుగా అయి సర్వాత్మలకు ఇవ్వాలి. దాతాతనపు భావనను పెట్టుకోవడము ద్వారా సంపన్న ఆత్మలుగా అయిపోతారు మరియు ఎవరైతే సంపన్నముగా ఉంటారో వారు సదా తృప్తిగా ఉంటారు. నేను ఇచ్చేటువంటి దాత యొక్క బిడ్డను - ఇవ్వడమే తీసుకోవడము. ఈ భావనయే సదా నిర్విఘ్న స్థితిని మరియు కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవము చేయిస్తుంది. సదా ఒక్క లక్ష్యము వైపే మీ దృష్టి ఉండాలి, ఆ లక్ష్యమే - బిందువు. ఇంకే విషయాల విస్తారాన్ని అయినా చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా ఉండండి.

స్లోగన్:-
బుద్ధి లేక స్థితి ఒకవేళ బలహీనముగా ఉన్నట్లయితే దానికి కారణము - వ్యర్థ సంకల్పాలు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మాతీతముగా అయ్యేందుకు కర్మల లెక్కాచారాల నుండి ముక్తులుగా అవ్వండి. సేవలో కూడా సేవలో బంధింపబడే సేవాధారులుగా ఉండకూడదు. బంధనముక్తులుగా అయ్యి సేవ చెయ్యండి అనగా హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా అవ్వండి. ఏ విధముగా దేహ బంధనము, దేహ సంబంధాల బంధనము ఉన్నాయో, అలాగే సేవలో స్వార్థము ఉండటము - ఈ బంధనము కూడా కర్మాతీతముగా అవ్వడములో విఘ్నము కలిగిస్తుంది. కర్మాతీతముగా అవ్వటము అనగా ఈ రాయల్ లెక్కాచారాల నుండి కూడా ముక్తులుగా అవ్వటము.