08-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎప్పటివరకైతే జీవించి ఉండాలో, అప్పటివరకు తండ్రిని స్మృతి చేయాలి, స్మృతి ద్వారానే ఆయుష్షు పెరుగుతుంది, చదువు యొక్క సారమే స్మృతి’’

ప్రశ్న:-
పిల్లలైన మీ అతీంద్రియ సుఖము గాయనము చేయబడింది, ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే మీరు సదా తండ్రి స్మృతిలో సంతోషాలను జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు సదా క్రిస్మస్ పండుగే. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. ఇంతకంటే గొప్ప సంతోషము ఇంకేముంటుంది. ఈ సంతోషము మీకు ప్రతి రోజూ ఉంటుంది. అందుకే మీ యొక్క అతీంద్రియ సుఖమే గాయనము చేయబడింది.

పాట:-
నయనహీనులకు దారి చూపండి ప్రభూ...

ఓంశాంతి
జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. కావున ఇప్పుడు పిల్లలకు జ్ఞాన నేత్రము లభించింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - భక్తి మార్గము ఉన్నదే అంధకారమయమైన మార్గము. రాత్రివేళ వెలుతురు లేని కారణముగా మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మా యొక్క రాత్రి, బ్రహ్మా యొక్క పగలు అని అంటూ ఉంటారు కూడా. సత్యయుగములో ‘‘మాకు మార్గము చెప్పండి’’ అని అనరు, ఎందుకంటే ఇప్పుడు మీకు మార్గము లభిస్తుంది. తండ్రి వచ్చి ముక్తిధామానికి మరియు జీవన్ముక్తిధామానికి మార్గము చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉందని, ప్రపంచము మారనున్నదని మీకు తెలుసు. దునియా బదల్నే వాలీ హై (ప్రపంచము మారనున్నది)... అనే పాట కూడా తయారుచేయబడి ఉంది కానీ పాపం మనుష్యులకు ప్రపంచము ఎప్పుడు మారనున్నది, ఎలా మారనున్నది, ఎవరు మారుస్తారు అన్నది తెలియదు, ఎందుకంటే వారికి జ్ఞానము యొక్క మూడవ నేత్రము లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ మూడవ నేత్రము లభించింది, దీని ద్వారా మీరు ఈ సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇదే మీ బుద్ధిలో ఉన్న జ్ఞాన శ్యాక్రీన్. ఎలాగైతే శ్యాక్రీన్ కొద్దిగా అయినా సరే చాలా తియ్యగా ఉంటుందో, అలా ఈ జ్ఞానము యొక్క రెండు మాటలు ‘మన్మనాభవ...’ ఇదే అన్నింటికంటే మధురమైన మాట, కేవలం తండ్రిని స్మృతి చేయండి.

తండ్రి వస్తారు మరియు వచ్చి దారిని చూపిస్తారు. ఎక్కడికి దారిని చూపిస్తారు? శాంతిధామానికి మరియు సుఖధామానికి. కావున పిల్లలకు సంతోషము కలుగుతుంది. సంతోషాలను ఎప్పుడు జరుపుకుంటారు అనేది ప్రపంచానికి తెలియదు. అసలైన సంతోషాలైతే కొత్త ప్రపంచములో జరుపుకోబడతాయి కదా. పాత ప్రపంచములో సంతోషాలు ఎక్కడ నుండి వస్తాయి, ఇది చాలా సామాన్యమైన విషయము. పాత ప్రపంచములో మనుష్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు ఎందుకంటే తమోప్రధానముగా ఉన్నారు. తమోప్రధాన ప్రపంచములో సంతోషాలు ఎక్కడ నుండి వస్తాయి? సత్యయుగ జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు, అందుకే పాపం వారు ఇక్కడే సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలను కూడా ఎంతగా జరుపుకుంటూ ఉంటారో చూడండి. బాబా అయితే అంటారు, ఒకవేళ సంతోషాల గురించి అడగాలంటే గోప-గోపికలను (నా పిల్లలను) అడగండి, ఎందుకంటే తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ మీ వ్యాపార వ్యవహారాల కర్తవ్యాలను చేసుకుంటూ కమల పుష్ప సమానముగా ఉండండి మరియు నన్ను స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియులు ఉంటారు కదా, వారు కూడా వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ ఒకరినొకరు తలచుకుంటూ ఉంటారు. వారికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. లైలా-మజ్ను, హీరా-రాంఝా మొదలైనవారు ఒకరినొకరు ప్రేమించుకునేది వికారాల కోసం కాదు. వారి ప్రేమ గురించి చెప్పుకుంటూ ఉంటారు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ ఇక్కడ అటువంటి విషయము కాదు. ఇక్కడైతే మీరు జన్మ జన్మాంతరాలుగా ఆ ప్రియునికి ప్రేయసులుగానే ఉన్నారు. ఆ ప్రియుడు మీకు ప్రేయసి కారు. మీరు వారిని ఇక్కడకు రమ్మని పిలుస్తారు - ‘‘ఓ భగవంతుడా, మీరు వచ్చి నయనహీనులకు దారిని చూపండి’’. మీరు అర్ధకల్పము పిలిచారు. ఎప్పుడైతే దుఃఖము ఎక్కువవుతుందో, అప్పుడు ఎక్కువగా పిలుస్తారు. ఎక్కువ దుఃఖములో ఎక్కువగా తలచుకునేవారు కూడా ఉంటారు. చూడండి, ఇప్పుడు స్మృతి చేసేవారు అనేకానేకమంది ఉన్నారు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు... అని అంటూ ఉంటారు కదా. ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో, అంత ఎక్కువగా తమోప్రధానమవుతూ ఉంటారు. మీరు పైకి ఎక్కుతూ ఉన్నారు, వారు ఇంకా కిందకు దిగుతూ ఉన్నారు, ఎందుకంటే ఎప్పటివరకైతే వినాశనమవ్వదో, అప్పటివరకు తమోప్రధానత వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజురోజుకూ మాయ కూడా తమోప్రధానమవుతూ, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సమయములో తండ్రి కూడా సర్వశక్తివంతుడే, అలాగే మాయ కూడా సర్వశక్తివంతమైనదిగా ఈ సమయములోనే ఉంది. అది కూడా శక్తిశాలిగా ఉంది.

పిల్లలైన మీరు ఈ సమయములో బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కుల భూషణులు. మీది సర్వోత్తమ కులము, దీనిని ఉన్నతోన్నతమైన కులమని అంటారు. ఈ సమయములో మీ జీవితము అమూల్యమైనది, అందుకే ఈ జీవితాన్ని (శరీరాన్ని) సంభాళించాలి కూడా ఎందుకంటే పంచ వికారాల కారణముగా శరీర ఆయుష్షు కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. బాబా అంటున్నారు, ఈ సమయములో పంచ వికారాలను వదిలి యోగములో ఉన్నట్లయితే ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది. ఆయుష్షు పెరుగుతూ-పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయుష్షు 150 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అలా లేదు. అందుకే తండ్రి అంటారు, ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. లేదంటే ఈ శరీరము పనికి రాదు, ఇది మట్టి బొమ్మ అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ వివేకము లభిస్తుంది - ఎప్పటివరకైతే జీవించి ఉండాలో, అప్పటివరకు బాబాను స్మృతి చేయాలి. ఆత్మ బాబాను స్మృతి చేస్తుంది - ఎందుకు? వారసత్వము కోసము. తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి, అప్పుడు మీరు మళ్ళీ ఇలా లక్ష్మీ- నారాయణులుగా అవుతారు. పిల్లలు చదువును బాగా చదువుకోవాలి. చదువులో సోమరితనము మొదలైనవి ఉండకూడదు లేదంటే ఫెయిల్ అయిపోతారు. చాలా చిన్న పదవిని పొందుతారు. చదువులో కూడా ముఖ్యమైన విషయమేమిటంటే, దానినే సారము అని అనడము జరుగుతుంది, అదేమిటంటే - తండ్రిని స్మృతి చేయండి. ప్రదర్శనీకి లేక సెంటరుకు ఎవరైనా వస్తే, వారికి మొట్టమొదట ‘‘బాబాను స్మృతి చేయండి’’ అని అర్థం చేయించండి, ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైనవారు. ఉన్నతోన్నతమైనవారినే స్మృతి చేయాలి, అంతకంటే తక్కువవారిని స్మృతి చేయకూడదు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని అంటారు. భగవంతుడే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. చూడండి, తండ్రి కూడా అంటారు, కొత్త ప్రపంచ స్థాపనను నేను చేస్తాను, అందుకే మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. ఇది పక్కాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే తండ్రి పతిత-పావనుడు కదా. తండ్రి ఇదే చెప్తున్నారు, నన్ను మీరు పతిత-పావనుడు అని అంటారు అంటే మీరు తమోప్రధానముగా, చాలా పతితముగా ఉన్నారు, ఇప్పుడు మీరు పావనముగా అవ్వండి.

తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీ సుఖము యొక్క రోజులు రాబోతున్నాయి, దుఃఖము యొక్క రోజులు సమాప్తమైపోయాయి. నన్ను మీరు - ఓ దుఃఖహర్త, సుఖదాత అని పిలుస్తారు కూడా. సత్యయుగములో తప్పకుండా అందరూ ఎంతో సుఖవంతులుగా ఉంటారని తెలుసు కదా. కావున తండ్రి పిల్లలకు చెప్తున్నారు - అందరూ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇది సంగమయుగము. నావికుడు మిమ్మల్ని తీరానికి తీసుకువెళ్తారు. ఇందులో నావికుడు లేక నావ యొక్క విషయమేమీ లేదు. నావను తీరానికి చేర్చండి అని వారి మహిమను చేస్తారు. ఇప్పుడు ఒక్కరి నావను మాత్రమే తీరానికి చేర్చరు కదా. మొత్తం ప్రపంచము యొక్క నావను తీరానికి చేర్చాలి. ఈ మొత్తం ప్రపంచము ఒక పెద్ద నావ లాంటిది, దీనిని వారు తీరానికి చేరుస్తారు. పిల్లలైన మీరు చాలా సంతోషాలను జరుపుకోవాలి ఎందుకంటే మీ కొరకు సదా సంతోషమే, సదా క్రిస్మస్ పండుగే. ఎప్పటినుండైతే పిల్లలైన మీకు తండ్రి లభించారో, అప్పటినుండి మీకు సదా క్రిస్మస్ పండుగే, అందుకే అతీంద్రియ సుఖము గాయనము చేయబడింది. చూడండి, వీరు సదా సంతోషముగా ఉంటారు, ఎందుకు? అరే, అనంతమైన తండ్రి లభించారు కదా! వారు మనల్ని చదివిస్తున్నారు, కావున రోజూ ఈ సంతోషము ఉండాలి కదా. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు, వాహ్! ఇది ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? గీతలో కూడా భగవానువాచ ఉంది, నేను మీకు రాజయోగము నేర్పిస్తాను అని ఉంది. ఏ విధముగానైతే వారు బ్యారిస్టరీ యోగాన్ని, సర్జనరీ యోగాన్ని నేర్పిస్తుంటారో, అలా నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్చుకోవడానికి వస్తారు కదా. ఇందులో తికమకపడే అవసరమేమీ లేదు. కావున రాజయోగాన్ని నేర్చుకుని పూర్తి చెయ్యాలి కదా. పారిపోకూడదు. చదువుకోవాలి కూడా, అలాగే ధారణ కూడా బాగా చెయ్యాలి. ధారణ చేయించడము కోసమనే టీచరు చదివిస్తారు.

ప్రతి ఒక్కరికీ తమ-తమ బుద్ధి ఉంటుంది. కొంతమంది బుద్ధి ఉత్తమముగా, కొంతమందిది మధ్యమముగా, కొంతమందిది కనిష్టముగా ఉంటుంది. కావున స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఉత్తమముగా ఉన్నానా, మధ్యమముగా ఉన్నానా లేక కనిష్టముగా ఉన్నానా? తమను తామే పరిశీలించుకోవాలి - నేను ఇటువంటి ఉన్నతోన్నతమైన పరీక్షను పాస్ అయి, ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా, నేను సేవ చేస్తున్నానా? తండ్రి అంటారు - పిల్లలూ, సేవాధారులుగా అవ్వండి, బాబాను అనుసరించండి, ఎందుకంటే నేను కూడా సేవ చేస్తున్నాను కదా. నేను వచ్చిందే సేవ చేయడానికి మరియు ప్రతిరోజు సేవ చేస్తాను ఎందుకంటే రథాన్ని కూడా తీసుకున్నాను కదా. రథము కూడా దృఢముగా బాగుంది మరియు వీరి ద్వారా సేవ అయితే సదా ఉంది. బాప్ దాదా అయితే వీరి రథములో సదా ఉంటారు. వీరి శరీరానికి అనారోగ్యము చేసినా కానీ నేనైతే కూర్చున్నాను కదా. కావున నేను వీరిలో కూర్చుని వ్రాస్తాను కూడా. వీరు నోటితో మాట్లాడలేకపోయినా కానీ నేనైతే వ్రాయగలను. మురళీ అయితే మిస్ అవ్వదు. ఎప్పటివరకైతే కూర్చోగలరో, వ్రాయగలరో, అప్పటివరకు నేను మురళీని కూడా మ్రోగిస్తాను, పిల్లలకు వ్రాసి పంపిస్తాను ఎందుకంటే నేను సేవాధారిని కదా. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి సేవలో నిమగ్నమవ్వండి. బాబా సర్వీస్ అనగా ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. ఎలాగైతే వారు ఆన్ హిజ్ మెజెస్టీ సర్వీస్ (మహారాజుగారి సేవలో) అని వ్రాస్తారో, అలా మీరేమంటారు? ఇది మహారాజుగారి సేవ కంటే ఉన్నతమైన సేవ ఎందుకంటే వీరు మహారాజుగా తయారుచేస్తారు. తప్పకుండా మనము విశ్వానికి యజమానులుగా అవుతామని కూడా మీరు అర్థం చేసుకోగలరు.

పిల్లలైన మీలో ఎవరైతే మంచి రీతిలో పురుషార్థము చేస్తారో, వారినే మహావీరులని అంటారు. బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులెవరు అని గమనించవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, పరస్పరము సోదర ఆత్మలను చూడండి. తండ్రి స్వయాన్ని ‘సోదరులందరి తండ్రిని’ అని భావిస్తారు మరియు సోదరులనే చూస్తారు. వారు అందరినీ అయితే చూడరు. శరీరము లేకుండానైతే ఎవరూ వినలేరు, మాట్లాడలేరు అని ఈ జ్ఞానమైతే మీకు ఉంది. మీకైతే తెలుసు కదా - నేను కూడా ఇక్కడ శరీరములోకి వచ్చాను, నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. శరీరమైతే అందరికీ ఉంది. శరీరముతోనే ఆత్మ ఇక్కడ చదువుకుంటుంది. కనుక బాబా మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు ఆత్మలు అర్థం చేసుకోవాలి. బాబా ఎక్కడ కూర్చుని ఉన్నారు? అకాల సింహాసనముపై. బాబా అర్థం చేయించారు - ప్రతి ఆత్మ అకాలమూర్తియే. అది ఎప్పుడూ వినాశనమవ్వదు, అది ఎప్పుడూ తగలబడదు, ఖండించబడదు, మునగదు. అది చిన్నదిగా-పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నదిగా-పెద్దదిగా అవుతుంది. కావున ప్రపంచములో మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారిలో ఏ ఆత్మలైతే ఉన్నారో, వారి సింహాసనము ఈ భృకుటి. శరీరాలు వేరు-వేరుగా ఉన్నాయి. ఒకరి అకాల సింహాసనము పురుషునిదైతే, మరొకరిది స్త్రీది, ఇంకొకరిది చిన్న పిల్లలది. కావున ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు - నేను ఆత్మను, నా సోదరునితో మాట్లాడుతున్నాను అనే భావించండి. శివబాబా యొక్క సందేశాన్ని ఇలా ఇస్తారు - శివబాబాను స్మృతి చేసినట్లయితే ఈ తుప్పు ఏదైతే పట్టిందో, అది తొలగిపోతుంది. బంగారములో కల్తీ కలిస్తే దాని విలువ తగ్గిపోయినట్లుగా, మీ విలువ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా విలువలేనివారిగా అయిపోయారు. దీనిని దివాలా తీయడమని కూడా అంటారు. భారత్ ఎంత సంపన్నముగా ఉండేది. ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంటారు. వినాశనములోనైతే అందరి ధనము సమాప్తమైపోతుంది. ఇచ్చేవారు, తీసుకునేవారు, అందరూ సమాప్తమైపోతారు. ఇకపోతే, అవినాశీ జ్ఞాన రత్నాలు తీసుకునేవారు ఎవరైతే ఉంటారో, వారు మాత్రం మళ్ళీ వచ్చి తమ భాగ్యాన్ని తీసుకుంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రిని ఫాలో చేసి బాబా సమానముగా సేవాధారులుగా అవ్వాలి. తమను తామే పరిశీలించుకోవాలి - నేను ఉన్నతోన్నతమైన పరీక్షలో పాస్ అయ్యి ఉన్నతమైన పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా?

2. బాబా డైరెక్షన్లపై నడుస్తూ మహావీరులుగా అవ్వాలి. ఏ విధముగా బాబా ఆత్మలను చూస్తారో, ఆత్మలను చదివిస్తారో, అలా ఆత్మ రూపీ సోదరులను చూస్తూ మాట్లాడాలి.

వరదానము:-
శ్రేష్ఠత యొక్క ఆధారముపై సామీప్యత ద్వారా కల్పము యొక్క శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారుచేసుకునే విశేష పాత్రధారీ భవ

ఈ మరజీవా జీవితములో శ్రేష్ఠతకు ఆధారము రెండు విషయాలు - 1. సదా పరోపకారిగా ఉండడము, 2. బాల బ్రహ్మచారిగా ఉండడము. ఏ పిల్లలైతే ఈ రెండు విషయాలలోనూ ఆది నుండి అంతిమము వరకు అఖండముగా ఉన్నారో, ఏ విధమైన పవిత్రత అనగా స్వచ్ఛత పదే-పదే ఖండితమవ్వలేదో మరియు విశ్వము పట్ల మరియు బ్రాహ్మణ పరివారము పట్ల ఎవరైతే సదా ఉపకారులుగా ఉన్నారో, ఇటువంటి విశేష పాత్రధారులు బాప్ దాదాకు సదా సమీపముగా ఉంటారు మరియు వారి ప్రారబ్ధము మొత్తము కల్పము కొరకు శ్రేష్ఠముగా అయిపోతుంది.

స్లోగన్:-
సంకల్పాలు వ్యర్థముగా ఉన్నట్లయితే ఇతర ఖజానాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మాతీత స్థితిని అనుభవము చేసేందుకు జ్ఞానాన్ని వినటము, వినిపించటముతోపాటుగా ఇప్పుడు బ్రహ్మాబాబా సమానముగా అతీతముగా, అశరీరిగా అయ్యే అభ్యాసముపై విశేషమైన అటెన్షన్ పెట్టండి. ఏ విధముగా బ్రహ్మాబాబా సాకార జీవితములో కర్మాతీతముగా అయ్యే కన్నా ముందు అతీతముగా మరియు ప్రియముగా ఉండే అభ్యాసము యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని చేయించారో, సేవను గాని లేక మరేదైనా కర్మను గాని వదలలేదు కానీ అతీతులై చివరి రోజు కూడా పిల్లల సేవను పూర్తి చేసారో, అలా ఫాలో ఫాదర్ చేయండి.