10-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ స్మృతియాత్ర పూర్తిగా గుప్తమైనది, పిల్లలైన మీరు ఇప్పుడు ముక్తిధామానికి వెళ్ళే యాత్రను చేస్తున్నారు’’

ప్రశ్న:-
స్థూల వతనవాసుల నుండి సూక్ష్మ వతనవాసులైన ఫరిశ్తాలుగా అయ్యేందుకు పురుషార్థము ఏమిటి?

జవాబు:-
సూక్ష్మ వతనవాసులైన ఫరిశ్తాలుగా అవ్వాలంటే ఆత్మిక సేవలో ఎముక-ఎముకను స్వాహా చేయండి. ఎముకలను స్వాహా చేయకుండా ఫరిశ్తాలుగా అవ్వలేరు ఎందుకంటే ఫరిశ్తాలు ఎముకలు, మాంసము లేకుండా ఉంటారు. ఈ అనంతమైన సేవలో దధీచి ఋషి వలె ఎముక-ఎముకను పెట్టాలి, అప్పుడే వ్యక్తము నుండి అవ్యక్తము అవుతారు.

పాట:-
ఓర్పు వహించు మానవా...

ఓంశాంతి
పిల్లలకు ఈ పాట ద్వారా - ఓర్పు వహించండి అన్న సూచన లభించింది. మనము శ్రీమతము ఆధారముగా పురుషార్థము చేస్తున్నామని మరియు మనము ఈ గుప్తమైన యోగము యొక్క యాత్రలో ఉన్నామని పిల్లలకు తెలుసు. ఆ యాత్ర సమయమనుసారముగా పూర్తవ్వనున్నది. ముఖ్యమైనది ఈ యాత్రయే, దీని గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. యాత్రకు తప్పకుండా వెళ్ళాలి మరియు తీసుకువెళ్ళే పండా కూడా కావాలి. దీనికి పేరు కూడా పాండవ సైన్యము అని పెట్టడము జరిగింది. ఇప్పుడు యాత్రలో ఉన్నారు. ఇందులో స్థూలమైన యుద్ధము యొక్క విషయమేమీ లేదు. ప్రతి ఒక్క విషయము గుప్తమైనది. యాత్ర కూడా చాలా గుప్తమైనది. నన్ను స్మృతి చేసినట్లయితే నా వద్దకు వచ్చి చేరుకుంటారని తండ్రి చెప్పినట్లుగా శాస్త్రాలలో కూడా ఉంది. ఇది యాత్రయే కదా. తండ్రి అన్ని శాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. ప్రాక్టికల్ గా ఆచరణలోకి తీసుకువస్తారు. ఆత్మలమైన మనము మన నిర్వాణధామ యాత్రకు వెళ్ళాలి. ఆలోచిస్తే అర్థం చేసుకోగలరు. ఇది ముక్తిధామానికి వెళ్ళే సత్యమైన యాత్ర. మేము ముక్తిధామానికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. ఈ యాత్ర చేసేందుకు ఎవరైనా ముక్తిధామానికి మార్గాన్ని తెలియజేయాలి. కానీ తండ్రి అయితే తమ సమయానికి తమంతట తామే వస్తారు, ఆ సమయము గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే పిల్లలకు నిశ్చయము కలుగుతుంది. వాస్తవానికి గాయనము చేయబడిన సత్యమైన యాత్ర ఇదే. భగవంతుడే ఈ యాత్రను నేర్పించారు. మన్మనాభవ, మధ్యాజీ భవ. ఈ పదాలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం వీటిని వినిపించింది ఎవరు అన్న విషయములో పొరపాటు చేసేసారు. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి అని అంటారు. ఇతనికి (బ్రహ్మాబాబాకు) కూడా దేహముంది. ఇతనికి కూడా అర్థం చేయించేవారు మరొకరు ఉన్నారు, వారికి తమదంటూ దేహము లేదు, ఆ తండ్రి విచిత్రుడు, వారికి ఏ చిత్రమూ లేదు, మిగిలినవారందరికీ చిత్రాలు ఉన్నాయి (శరీరాలు ఉన్నాయి). మొత్తము ప్రపంచమంతా చిత్రశాల. చిత్రములేని ఆత్మ మరియు చిత్రము, అనగా ఆత్మ మరియు జీవముతో ఈ మనుష్య స్వరూపము తయారుచేయబడి ఉంది. ఆ తండ్రి విచిత్రుడు. నేను ఈ చిత్రాన్ని ఆధారముగా తీసుకోవలసి ఉంటుందని వారు అర్థం చేయిస్తారు. వాస్తవానికి మహాభారత యుద్ధము జరిగినప్పుడు భగవంతుడు ఆ మాట అన్నారని శాస్త్రాలలో కూడా ఉంది. వారు రాజయోగాన్ని నేర్పించారు, తప్పకుండా రాజ్యస్థాపన జరిగింది. ఇప్పుడైతే రాజ్యము లేదు. రాజయోగాన్ని భగవంతుడు నేర్పించారు, కొత్త ప్రపంచము కోసం, ఎందుకంటే ఆ సమయములో వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. స్వర్గ స్థాపన జరిగినప్పుడు ఇలా జరిగిందని అర్థం చేయించడము జరుగుతుంది. ఆ లక్ష్మీ-నారాయణుల రాజ్య స్థాపన జరిగింది. సత్యయుగము ఉండేదని, ఇప్పుడిది కలియుగమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ తండ్రి అవే విషయాలను అర్థం చేయిస్తారు. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు నేను పరంధామము నుండి వచ్చాను అని ఈ విధముగా ఎవ్వరూ చెప్పలేరు. పరమపిత పరమాత్మయే బ్రహ్మా ద్వారా చెప్పగలరు, ఇంకెవ్వరి ద్వారా కూడా చెప్పలేరు. సూక్ష్మవతనములో ఉన్నది బ్రహ్మా, విష్ణు, శంకరులే. వారు అవ్యక్త బ్రహ్మా మరియు వీరు వ్యక్త బ్రహ్మా అని బ్రహ్మా గురించి కూడా అర్థం చేయించారు. మీరు ఇప్పుడు ఫరిశ్తాగా అవుతారు. ఫరిశ్తాలు స్థూలవతనములో ఉండరు. ఫరిశ్తాలకు ఎముకలు-మాంసము ఉండవు. ఇక్కడ ఈ ఆత్మిక సేవలో ఎముకలు మొదలైనవన్నీ సమాప్తము చేసేస్తారు, ఇక ఫరిశ్తాలుగా అయిపోతారు. ఇప్పుడైతే ఎముకలు ఉన్నాయి కదా. తమ ఎముకలను కూడా సేవలో ఇచ్చేసారని ఇది కూడా వ్రాయబడి ఉంది. అనగా తమ ఎముకలను సమాప్తము చేస్తారు. స్థూలవతనవాసుల నుండి సూక్ష్మవతనవాసులుగా అవ్వాలి. ఇక్కడ మనము ఎముకలను ఇచ్చి సూక్ష్మముగా తయారవుతాము. ఈ సేవలో అంతా స్వాహా చేయాలి. స్మృతిలో ఉంటూ, ఉంటూ మనము ఫరిశ్తాలుగా అయిపోతాము. వేటగానికి అది వేట, వేటకు అది మృత్యువు అని కూడా అంటూ ఉంటారు, ఇక్కడ ఈ సామెతలో వేటగాడు అని ఫరిశ్తాను అంటారు. మీరు మనుష్యుల నుండి ఫరిశ్తాలుగా అవుతారు. ఈ సమయములో మిమ్మల్ని దేవతలని అనలేరు. ఇక్కడైతే మీకు శరీరముంది కదా. సూక్ష్మవతనము యొక్క వర్ణన ఇప్పుడే జరుగుతుంది. యోగములో ఉంటూ ఫరిశ్తాలుగా అయిపోతారు. చివరిలో మీరు ఫరిశ్తాలుగా అయిపోతారు. మీకు అంతా సాక్షాత్కారమవుతుంది మరియు సంతోషము కలుగుతుంది. మనుష్యులందరూ మృత్యువుకు బలైపోతారు. మీలో మహావీరులు ఎవరైతే ఉంటారో వారు చలించకుండా ఉంటారు. ఇకపోతే ఏమేమి జరుగుతూ ఉంటుంది! వినాశన దృశ్యమైతే రానున్నది కదా. అర్జునుడికి వినాశన సాక్షాత్కారము జరిగింది. ఇది ఒక్క అర్జునుడి విషయమే కాదు. పిల్లలైన మీకు వినాశనము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. మొట్టమొదట బాబాకు కూడా వినాశనము యొక్క సాక్షాత్కారము జరిగింది. ఆ సమయములో జ్ఞానమైతే ఏమీ లేదు. సృష్టి వినాశనమవుతూ ఉండటాన్ని చూసారు. ఆ తర్వాత చతుర్భుజుని సాక్షాత్కారము జరిగింది. ఇది మంచిదేనని భావించడము మొదలుపెట్టారు. వినాశనము తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతాను అని చూసేటప్పటికి చాలా సంతోషము కలిగింది. వినాశనము మంచిదే అన్న విషయము ఇప్పుడు ప్రపంచానికి తెలియదు. శాంతి కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ చివరికి వినాశనమైతే జరగనున్నది. పతిత-పావనా రండి అని స్మృతి చేస్తారు కావున తండ్రి తప్పకుండా వస్తారు, వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, అందులో మనము రాజ్యము చేస్తాము. ఇది మంచిదే కదా. పతిత-పావనుడిని ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే దుఃఖముంది. పావన ప్రపంచములో దేవతలు ఉన్నారు, పతిత ప్రపంచములోనైతే దేవతల పాదాలు మోపబడవు. కావున తప్పకుండా పతిత ప్రపంచము యొక్క వినాశనము జరగాలి. మహావినాశనము జరిగిందని అంటూ ఉంటారు కూడా. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఏక ధర్మ స్థాపన జరుగుతుంది, అది ఇలాగే జరుగుతుంది కదా. ఇక్కడి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటారు. వినాశనము జరుగుతుంది, ఇక భారత్ లో ఎవరు మిగులుతారు? ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, జ్ఞానాన్ని ఇస్తారో, వారే మిగులుతారు. వినాశనమైతే అందరిదీ జరగనున్నది, ఇందులో భయపడే విషయమేమీ లేదు. పతిత-పావనుడిని పిలుస్తారు, వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు సంతోషము కలగాలి కదా. తండ్రి అంటారు, వికారాలలోకి వెళ్ళకండి. ఈ వికారాలపై విజయాన్ని పొందండి లేదా దానమివ్వండి, అప్పుడు గ్రహణము తొలగిపోతుంది. భారత్ కు పట్టిన గ్రహణము తప్పకుండా తొలగిపోతుంది. నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా ఉన్నవారిగా అవ్వాలి. సత్యయుగములో పవిత్ర దేవతలు ఉండేవారు, వారు తప్పకుండా ఇక్కడే తయారై ఉంటారు.

మనము శ్రీమతము ద్వారా నిర్వికారులుగా అవుతామని మీకు తెలుసు. భగవానువాచ - ఇది గుప్తము. శ్రీమతముపై నడుచుకుని మీరు రాజ్యాధికారాన్ని పొందుతారు. తండ్రి అంటారు, మీరు నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. క్షణములో రాజ్యము లభించగలదు. ప్రారంభములో కుమార్తెలు 4-5 రోజులు కూడా వైకుంఠములోకి వెళ్ళి ఉండేవారు. శివబాబా వచ్చి పిల్లలకు వైకుంఠము యొక్క సాక్షాత్కారము కూడా చేయించేవారు. ఎంత గౌరవ-ప్రతిష్ఠలతో దేవతలు వచ్చేవారు. తప్పకుండా గుప్త వేషములో వచ్చే తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు మనసులో అనిపిస్తుంది. వారు బ్రహ్మా తనువులోకి వస్తారు. బ్రహ్మా యొక్క తనువైతే ఇక్కడ కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన. ఎవరైనా వస్తే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి అని బాబా అర్థం చేయించారు. బి.కె.ల వద్దకు అని అంటారు. అచ్ఛా, బ్రహ్మా పేరును ఎప్పుడైనా విన్నారా? వారు ప్రజాపిత కదా. మనమంతా వచ్చి వారికి చెందినవారిగా అయ్యాము. తప్పకుండా ఇంతకుముందు కూడా అలా అయ్యాము. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది కావున తోడుగా బ్రాహ్మణులు కూడా కావాలి. తండ్రి బ్రహ్మా ద్వారా ఎవరికి అర్థం చేయిస్తారు? శూద్రులకైతే అర్థం చేయించరు. వీరంతా బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు, శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని తమవారిగా చేసుకున్నారు. బ్రహ్మాకుమార-కుమారీలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సెంటర్లు ఉన్నాయి. అన్నింటిలోనూ బ్రహ్మాకుమారీలు చదివిస్తారు. ఇక్కడ మనకు తాతగారి వారసత్వము లభిస్తుంది. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. వారు నిరాకారుడైన కారణముగా, వీరి శరీరాన్ని ఆధారముగా తీసుకుని మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ప్రజాపితకైతే అందరూ పిల్లలే అవుతారు కదా! మనము ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలము. శివబాబా మనకు తాతగారు. వారు దత్తత తీసుకున్నారు. మనము బ్రహ్మా ద్వారా తాతగారి నుండి చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు ఇరువురూ స్వర్గానికి యజమానులు కదా. భగవంతుడు ఒక్క ఉన్నతోన్నతుడైన నిరాకారుడే. పిల్లలకు ధారణ చాలా బాగా జరగాలి. భక్తి మార్గములో ఇద్దరు తండ్రులు ఉన్నారని మొట్టమొదట అర్థం చేయించండి. స్వర్గములో ఒకే తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రి ద్వారా రాజ్యాధికారము లభించిన తర్వాత ఇక వారిని ఎందుకు స్మృతి చేస్తారు. స్మృతి చేయవలసిన అవసరము రావడానికి అక్కడ దుఃఖమే ఉండదు. దుఃఖహర్త-సుఖకర్త అని పాడుతారు. అది ఇప్పటి విషయమే. ఏదైతే గతించిపోతుందో, దానికి గాయనము జరుగుతుంది. మహిమంతా ఒక్కరిదే. ఆ ఒక్క తండ్రే వచ్చి పతితులను పావనముగా తయారుచేస్తారు. ఇది మనుష్యులు అర్థం చేసుకోరు. వారు కూర్చుని గతించిపోయిన కథలను వ్రాస్తారు. తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించారని, దాని ద్వారా రాజ్యాధికారము లభించిందని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీరు 84 జన్మల చక్రములో తిరిగారు. ఇప్పుడు మళ్ళీ మనము చదువుకుంటున్నాము, ఆ తర్వాత 21 జన్మలు రాజ్యము చేస్తాము. ఈ విధముగా దేవతలుగా అవుతాము. ఇలా కల్పక్రితము కూడా అయ్యాము. మేము పూర్తి 84 జన్మల చక్రములో తిరిగాము, ఇప్పుడు మళ్ళీ సత్య, త్రేతాయుగాలలోకి వెళ్తాము అని మీరు అర్థం చేసుకుంటారు, అందుకే తండ్రి అడుగుతారు - ఇంతకుముందు ఎన్ని సార్లు కలిశారు? ఇది ప్రాక్టికల్ విషయము కదా! కొత్తవారు ఎవరైనా విన్నా, 84 జన్మల చక్రమైతే తప్పకుండా ఉందని అర్థం చేసుకుంటారు. మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో, వారి చక్రమే పూర్తి అయ్యి ఉంటుంది. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసి ఉంటుంది. బాబా, ఈ ఇంట్లో, ఈ డ్రెస్సులో మేము మిమ్మల్ని చాలాసార్లు కలుస్తాము మరియు కలుస్తూనే ఉంటాము. పతితము నుండి పావనముగా, పావనము నుండి పతితముగా అవుతూనే వచ్చాము. ఏ వస్తువైనా ఎప్పటికీ కొత్తదిగా ఉండాలంటే, అది జరగదు. అది పాతదిగా తప్పకుండా అవుతుంది. ప్రతి వస్తువు సతో-రజో-తమోలోకి వస్తుంది. కొత్త ప్రపంచము వస్తోందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. దానిని స్వర్గమని అంటారు. ఇది నరకము. అది పావన ప్రపంచము. ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండని చాలామంది పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే దుఃఖము బాగా పెరుగుతూ ఉంటుంది కదా. కానీ మేమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మేమే పూజారులుగా అయ్యాము అని అర్థం చేసుకోరు. ద్వాపరములో పూజారులుగా అయ్యారు. అనేక ధర్మాలు వెలువడుతూ వచ్చాయి. తప్పకుండా పతితము నుండి పావనముగా, పావనము నుండి పతితముగా అవుతూ వచ్చారు. ఈ ఆట అంతా భారత్ పైనే ఉంది.

పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది, ఇప్పుడు మీరు శివజయంతిని జరుపుకుంటారు. మిగిలినవారికెవ్వరికీ శివుని గురించి తెలియనే తెలియదు. మనకు తెలుసు. తప్పకుండా వారే మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన జరుగుతోంది. తప్పకుండా ఎవరైతే యోగము నేర్చుకుంటారో, స్థాపన చేస్తారో, వారే మళ్ళీ రాజ్య భాగ్యాన్ని పొందుతారు. తప్పకుండా కల్ప-కల్పము మనము తండ్రి నుండి ఈ రాజయోగాన్ని నేర్చుకున్నామని మనము అంటాము. బాబా అర్థం చేయించారు - ఇప్పుడు ఈ 84 జన్మల చక్రము పూర్తవుతోంది. మళ్ళీ కొత్త చక్రములో తిరగాలి. చక్రము గురించైతే తెలుసుకోవాలి కదా. ఈ చిత్రాలు లేకపోయినా కానీ మీరు అర్థం చేయించగలరు. ఇది చాలా సహజమైన విషయము. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా ఉంది. కలియుగము ఇప్పుడింకా బాల్యదశలో ఉందని వారు భావిస్తారు. కానీ, ఇది కలియుగ అంతిమము అని మీరంటారు. చక్రము పూర్తవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయడానికి వస్తాను. మనము పావన ప్రపంచములోకి వెళ్ళాలని మీకు తెలుసు. మీరు ముక్తి, జీవన్ముక్తి ధామాలను, శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామాలను కూడా అర్థం చేసుకున్నారు. కానీ అదృష్టములో లేకపోతే, మేము సుఖధామానికి ఎందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన చేయరు. తప్పకుండా ఆత్మలైన మన ఇల్లు ఆ శాంతిధామము. అక్కడ ఆత్మకు ఇంద్రియాలు లేని కారణముగా ఏమీ మాట్లాడదు. అక్కడ శాంతి అందరికీ లభిస్తుంది. సత్యయుగములో ఒకే ధర్మముంటుంది. ఇది అనాది, అవినాశీ వరల్డ్ డ్రామా, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. శాంతిధామములో కూడా కొద్ది సమయము ఉండవలసిందే. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. కలియుగము దుఃఖధామము. అనేక ధర్మాలు ఎన్ని ఉన్నాయి, ఎంత అలజడి ఉంది. ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామముగా అవుతుందో, అప్పుడే తండ్రి వస్తారు. దుఃఖధామము తర్వాత పూర్తిగా సుఖధామము ఉంటుంది. శాంతిధామము నుండి మనము సుఖధామములోకి వస్తాము, ఆ తర్వాత దుఃఖధామముగా అవుతుంది. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు, ఇక్కడ సంపూర్ణ వికారులు ఉన్నారు. ఇది అర్థం చేయించడము చాలా సహజము కదా. దీని కోసం ధైర్యము కావాలి. ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించండి. హనుమంతుడు వెళ్ళి సత్సంగములో వెనుక చెప్పుల వద్ద కూర్చుని ఉండేవారని కూడా వ్రాయబడి ఉంది. మహావీరులు ఎవరైతే ఉంటారో, వారు ఎక్కడికైనా వెళ్ళి - వీరు ఏం చెప్తున్నారో చూద్దాము అని యుక్తిగా వింటారు. మీరు వారి కళ్యాణము చేయడానికి డ్రెస్ మార్చుకుని ఎక్కడికైనా వెళ్ళవచ్చు. బాబా కూడా గుప్త వేషములో మీ కళ్యాణము చేస్తున్నారు కదా. మందిరాలలోకి ఎక్కడికైనా ఆహ్వానము లభిస్తే వెళ్ళి అర్థం చేయించాలి. రోజురోజుకూ మీరు తెలివైనవారిగా అవుతూ ఉంటారు. అందరికీ తండ్రి పరిచయాన్ని అయితే ఇవ్వవలసిందే, ట్రయల్ వేయవలసి ఉంటుంది. చివరిలో సన్యాసులు, రాజులు మొదలైనవారు వచ్చారు అని అయితే అంటూ ఉంటారు. జనక మహారాజుకు క్షణములో జీవన్ముక్తి లభించిందని అంటారు. వారు తర్వాత త్రేతాలో అనుజనకునిగా అయ్యారు (ఇప్పుడు పెద్ద రూపములో ఉన్న జనకుడు భవిష్యత్తులో చిన్న బాలుడిలా అవుతారు). అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతిమ వినాశన దృశ్యాన్ని చూసేందుకు తమ స్థితిని మహావీరుని వలె నిర్భయముగా, స్థిరముగా తయారుచేసుకోవాలి. గుప్తముగా స్మృతియాత్రలో ఉండాలి.

2. అవ్యక్త వతనవాసీ ఫరిశ్తాలుగా అయ్యేందుకు అనంతమైన సేవలో దధీచి ఋషి వలె తమ ఎముక-ఎముకను స్వాహా చేయాలి.

వరదానము:-
మొదటి శ్రీమతము పట్ల విశేషమైన అటెన్షన్ పెడుతూ పునాదిని దృఢముగా చేసుకునే సహజయోగీ భవ

బాప్ దాదా యొక్క నంబర్ వన్ శ్రీమతము ఏమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఒకవేళ ఆత్మకు బదులుగా స్వయాన్ని సాధారణ శరీరధారులుగా భావించినట్లయితే స్మృతి నిలవలేదు. మామూలుగా కూడా ఏవైనా రెండు వస్తువులను జోడించేటప్పుడు, ఆ రెండింటినీ మొదట సమానముగా తయారుచేస్తారు, అదే విధముగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేసినట్లయితే స్మృతి సహజమైపోతుంది. ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది. ఈ విషయము పట్ల పదే-పదే అటెన్షన్ పెట్టినట్లయితే సహజయోగిగా అయిపోతారు.

స్లోగన్:-
కర్మ అనేది ఆత్మ యొక్క దర్శనము చేయించే దర్పణము వంటిది, అందుకే కర్మల ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చెయ్యండి

బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలు అనగా జీవన్ముక్తులు, అంతేకానీ జీవన బంధనము కలవారు కాదు. దేహ బంధనము ఉండకూడదు, దేహ సంబంధాల బంధనము ఉండకూడదు, దేహ పదార్థాల బంధనము ఉండకూడదు. ఒకవేళ తమ దేహము పట్ల ఉన్న మోహాన్ని సమాప్తము చేసినట్లయితే దేహ సంబంధాల బంధనము మరియు పదార్థాల బంధనము వాటంతటవే సమాప్తమైపోతాయి. ప్రయత్నము చేస్తాము అని అనకూడదు. ‘ప్రయత్నము’ అన్న పదమే పాత ప్రపంచము పట్ల ఆకర్షణ ఉంది అన్నదానిని నిరూపిస్తుంది, అందుకే ‘ప్రయత్నము’ అన్న పదాన్ని సమాప్తము చెయ్యండి. దేహభానాన్ని విడిచిపెట్టండి.