11-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పిల్లలైన మిమ్మల్ని తమ సమానముగా మహిమా యోగ్యులుగా తయారుచేయడానికి బాబా వచ్చారు, తండ్రి మహిమ ఏదైతే ఉందో, దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు’’

ప్రశ్న:-
భక్తి మార్గములో ప్రియుడైన పరమాత్ముని గురించి పూర్తిగా తెలియకపోయినా కానీ ఏ పదాలతో చాలా ప్రేమగా మాట్లాడుతారు మరియు స్మృతి చేస్తారు?

జవాబు:-
ఓ ప్రియతముడా, మీరు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మేము కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము, మిగిలినవారందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి మీతో జోడిస్తాము అని చాలా ప్రేమగా మాట్లాడుతారు మరియు స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, నేను వచ్చాను కావున దేహీ-అభిమానులుగా అవ్వండి. మీ మొదటి కర్తవ్యము - ప్రేమగా తండ్రిని స్మృతి చేయడము.

ఓంశాంతి
మధురాతి మధురమైన జీవాత్మలకు, పరమపిత పరమాత్మ (వారిప్పుడు శరీరాన్ని లోన్ గా తీసుకున్నారు) కూర్చుని అర్థం చేయిస్తున్నారు - నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను, వచ్చి ఎంతోమంది పిల్లలను చదివిస్తాను. బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. తప్పకుండా నోటి ద్వారానే అర్థం చేయిస్తారు మరియు ఎవరికి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, భక్తి మార్గములో మీరు నన్ను ఓ పతిత-పావనా, అని పిలుస్తూ వచ్చారు. విశేషముగా భారత్ లో మరియు మొత్తము ప్రపంచములో అందరూ పిలుస్తారు. భారత్ యే పావనముగా ఉండేది, మిగిలినవారంతా శాంతిధామములో ఉండేవారు. సత్య, త్రేతాయుగాలని వేటిని అంటారు, ద్వాపర, కలియుగాలని వేటినంటారు అనేది పిల్లలు స్మృతిలో ఉంచుకోవాలి. అక్కడ ఎవరెవరు రాజ్యము చేసేవారు అన్న పూర్తి జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఎలాగైతే తండ్రికి రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానముందో, అదే విధముగా మీ బుద్ధిలో కూడా ఉంది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో, అది పిల్లల్లో కూడా తప్పకుండా ఉండాలి. తండ్రి వచ్చి పిల్లలను తమ సమానముగా తయారుచేస్తారు. తండ్రికి ఎంత మహిమ ఉందో, పిల్లలకు కూడా అంత మహిమ ఉంది. తండ్రి పిల్లలను అధిక మహిమా యోగ్యులుగా తయారుచేసారు. శివబాబా వీరి ద్వారా నేర్పిస్తారని ఎల్లప్పుడూ అనుకోండి. ఆత్మయే ఇతరులతో మాట్లాడుతుంది. కానీ మనుష్యులు దేహాభిమానులుగా ఉన్న కారణముగా ఫలానావారు చదివిస్తున్నారని భావిస్తారు. వాస్తవానికి అంతా చేసేది ఆత్మనే. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎప్పటివరకైతే స్వయాన్ని ఆత్మగా భావించరో, అప్పటివరకు తండ్రిని కూడా స్మృతి చేయలేరు, మర్చిపోతూ ఉంటారు. మీరు ఎవరి సంతానము అని మిమ్మల్ని అడగడము జరుగుతుంది. అప్పుడు, మేము శివబాబా సంతానమని అంటారు. విజిటర్ బుక్ లో కూడా, మీ తండ్రి ఎవరు అని వ్రాయబడి ఉంది. అప్పుడు వెంటనే దేహము యొక్క తండ్రి పేరును చెప్తారు. అచ్ఛా, ఇప్పుడు దేహీ (ఆత్మ) యొక్క తండ్రి పేరు చెప్పండి. అప్పుడు కొందరు శ్రీకృష్ణుని పేరును, కొందరు హనుమంతుని పేరును వ్రాస్తారు లేదా మాకు తెలియదు అని వ్రాస్తారు. అరే, మీకు లౌకిక తండ్రి గురించి తెలుసు, కానీ ఏ పారలౌకిక తండ్రినైతే మీరు దుఃఖములో ఎల్లప్పుడూ స్మృతి చేస్తారో, వారి గురించి తెలియదా! ఓ భగవంతుడా, దయ చూపించండి అని అంటారు కూడా. ఓ భగవంతుడా, ఒక బిడ్డను ఇవ్వండి అని అడుగుతారు కదా. ఇప్పుడు తండ్రి పూర్తిగా సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు దేహాభిమానములో ఎంతగానో ఉంటారు, అందుకే తండ్రి వారసత్వము యొక్క నషా ఎక్కడము లేదు. మీకైతే చాలా నషా ఎక్కాలి. భగవంతుడిని కలుసుకునేందుకనే భక్తిని చేస్తారు. యజ్ఞ-తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి చేయడము, ఇదంతా భక్తి. అందరూ ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. తండ్రి అంటారు - నేను మీకు పతులకే పతిని, తండ్రులకే తండ్రిని. అందరూ తండ్రి అయిన భగవంతుడిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మలే స్మృతి చేస్తారు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము మెరుస్తుంది... అని అంటారు కూడా. కానీ దీని అర్థం తెలియకుండానే అలా అనేస్తారు. రహస్యము గురించి ఏమీ తెలియదు. మీకు ఆత్మ గురించే తెలియనప్పుడు, ఆత్మల తండ్రి గురించి ఎలా తెలుసుకోగలరు. భక్తి మార్గము వారికి సాక్షాత్కారాలైతే జరుగుతాయి. భక్తి మార్గములో పూజ కోసం పెద్ద-పెద్ద లింగాలను పెడతారు ఎందుకంటే ఒకవేళ బిందు రూపాన్ని చూపించినా సరే, ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది సూక్ష్మమైన విషయము. ఏ పరమాత్మనైతే అఖండ జ్యోతి స్వరూపుడని అంటారో, వారి రూపము చాలా పెద్దదని మనుష్యులంటారు. బ్రహ్మ సమాజ మఠము వారు జ్యోతిని పరమాత్మ అని అంటారు. పరమపిత పరమాత్మ ఒక బిందువని ప్రపంచములోనివారికెవరికీ తెలియదు, అందుకే తికమకలో ఉన్నారు. పిల్లలు కూడా అంటారు - బాబా, ఎవరిని స్మృతి చేయాలి. ఇంతకుముందు మేము వారు పెద్ద లింగమని, వారిని ఆ రూపములో స్మృతి చేయడము జరుగుతుందని విన్నాము, ఇప్పుడు బిందువును ఎలా స్మృతి చేయాలి? అరే, ఆత్మ అయిన మీరు కూడా బిందువే, తండ్రి కూడా బిందువే. ఆత్మను పిలుస్తారు, ఆత్మ తప్పకుండా ఇక్కడే వచ్చి కూర్చుంటుంది. భక్తి మార్గములో సాక్షాత్కారాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో, అదంతా భక్తి. భక్తి కూడా ఒక్కరికే చేయరు, అనేకమందిని భగవంతుడిగా చేసారు. ఏ భక్తులైతే భక్తి చేస్తూ ఉంటారో, వారిని భగవంతుడని ఎలా అంటారు. ఒకవేళ పరమాత్మను సర్వవ్యాపి అన్నట్లయితే, మరి ఎవరికి భక్తి చేస్తారు. అది కూడా అనేక రకాల భక్తిని చేస్తారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మేము అనేక సంవత్సరాలు జీవిస్తాము అని అనుకోకండి. ఇప్పుడు సమయము చాలా సమీపముగా వస్తూ ఉంది. బాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేయించనున్నారని నిశ్చయము ఉంచుకోవాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను ఇతని ద్వారా మీకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తాను. బ్రహ్మా ద్వారా స్థాపన అని పాడుతారు కూడా. కొత్త ప్రపంచాన్ని విష్ణుపురి అని అంటారని అనగా విష్ణువు యొక్క రెండు రూపాలు రాజ్యము చేసేవారని వారికి తెలియదు. విష్ణువు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులుగా అయి పాలన చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు, విష్ణుపురి అనగా స్వర్గము యొక్క పాలన చేస్తారు. తండ్రి జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని మీ బుద్ధిలోకి రావాలి. వారికి ఈ డ్రామా ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. వారే పతిత-పావనుడు, తండ్రి వ్యాపారము ఏదైతే ఉందో, అదే మీ వ్యాపారము. మీరు కూడా పతితుల నుండి పావనులుగా చేస్తారు. ప్రపంచములో ఒక్క తండ్రికి ముగ్గురు లేక నలుగురు పిల్లలుంటారు, అందులో ఒక బిడ్డ చాలా ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉంటారు, ఒకరు పూర్తిగా కింద ఉంటారు. ఇక్కడ తండ్రి మీకు ఒకే వ్యాపారాన్ని నేర్పిస్తున్నారు - మీరు పతితులను పావనముగా చేయండి. నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారని అందరికీ ఇదే లక్ష్యాన్ని ఇవ్వండి. గీతలో శ్రీకృష్ణ భగవానువాచ అని తప్పుగా వ్రాశారు. భగవంతుడైతే నిరాకారుడు, పునర్జన్మ రహితుడని మీరు అర్థం చేయించాలి. కేవలం ఈ పొరపాటే జరిగింది. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీకృష్ణపురికి యజమానులుగా అవుతున్నారు. కొందరు రాజధానిలోకి వస్తారు, కొందరు ప్రజల్లోకి వస్తారు. దానిని శ్రీకృష్ణపురి అని అంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు అందరికీ ఎంతో ప్రియమైనవారు. పిల్లలు ప్రియమనిపిస్తారు కదా. పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది. తర్వాత ప్రేమ అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు స్వయాన్ని శరీరముగా భావించకండి. ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. ఆత్మాభిమానులుగా అవ్వండి. తండ్రి కూడా నిరాకారుడే. మీకు అర్థం చేయించేందుకని, ఇక్కడ శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. శరీరము లేకుండా అర్థం చేయించలేరు. మీకైతే మీ శరీరముంది. బాబా లోన్ తీసుకుంటారు. ఇకపోతే ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి స్వయముగా అంటారు - నేను ఈ శరీరాన్ని ధారణ చేసి పిల్లలను చదివిస్తాను ఎందుకంటే మీ ఆత్మ ఏదైతే తమోప్రధానముగా అయ్యిందో, దానిని ఇప్పుడు సతోప్రధానముగా చేయాలి. పతిత-పావనా రండి అని పాడుతారు కూడా, కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. తండ్రి ఏ విధముగా వచ్చి పావనముగా చేస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగములో కేవలం మనదే ఒక చిన్న వృక్షము ఉంటుందని కూడా మీకు తెలుసు. మీరు స్వర్గములోకి వెళ్తారు. ఇకపోతే ఈ మిగతా ఖండాలేవైతే ఉన్నాయో, వీటి నామ-రూపాలు కూడా ఉండవు. భారత ఖండమే స్వర్గముగా అవుతుంది. పరమపిత పరమాత్మయే వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడిది నరకము. ప్రాచీన భారత ఖండములోనే దేవతల రాజ్యముండేది, ఇప్పుడది లేదు. ఇక్కడ వారి మందిరాలు, చిత్రాలు ఉన్నాయి. ఇది భారత్ కు మాత్రమే సంబంధించిన విషయము. భారత్ స్వర్గముగా ఉండేదని, ఈ లక్ష్మీ-నారాయణులు యజమానులుగా ఉండేవారని, అప్పుడు ఇంకే ఖండమూ ఉండేది కాదని భారతవాసులెవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడైతే అనేక ధర్మాలు వచ్చేసాయి. భారతవాసులు ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడని అంటారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. నిజంగా వారు శ్యామముగా ఉండేవారు కదా. శ్రీకృష్ణుడిని సర్పము కాటేసింది, అందుకే నల్లగా అయిపోయారని అంటారు. వాస్తవానికి వారు సత్యయుగ రాకుమారుడిగా ఉండేవారు, వారు నల్లగా ఎలా అవుతారు. ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల కన్నా శ్రీకృష్ణుడే ఉత్తమునిగా గాయనము చేయబడ్డారు. వారి తల్లిదండ్రులకు మహిమ ఏమీ లేదు. వాస్తవానికి ఏ తల్లిదండ్రులకైతే ఇటువంటి బిడ్డ జన్మించారో, ఆ తల్లిదండ్రులు కూడా ప్రియముగా ఉండాలి. కానీ అలా లేదు, మహిమ అంతా రాధా-కృష్ణులకే ఉంది. వారి తల్లిదండ్రులకు ఏ మహిమ లేదు. మీ బుద్ధిలో జ్ఞానముంది. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. అంధకారమయమైన రాత్రిలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు.

ఇంటిలో ఉండండి, ఈ సేవను కూడా చేస్తూ ఉండండి అని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడము జరుగుతుంది. ఒక్క ప్రియునికి, మీరు అర్ధకల్పపు ప్రేయసులు అని ఎవరికైనా సరే అర్థం చేయించండి. భక్తి మార్గములో అందరూ వారిని స్మృతి చేస్తారు కనుక ప్రేయసులు అయినట్లు కదా. కానీ ప్రియుని గురించి పూర్తిగా తెలియదు. ఓ ప్రియతముడా, మీరు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మేము కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము, మిగిలిన అందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి మీతో జోడిస్తాము అని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. ఇంతకుముందు ఇలాగే పాడేవారు కదా, కానీ తండ్రి నుండి మనకు ఏ వారసత్వము లభిస్తుంది, ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు దేహీ-అభిమానులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయడమనేది పిల్లలైన మీ మొదటి కర్తవ్యము. కొడుకు ఎప్పుడూ తండ్రిని, కూతురు తల్లిని స్మృతి చేస్తారు. తోటివారు కదా. నేను తండ్రికి వారసుడినవుతానని కొడుకు భావిస్తారు. కూతురు అలా అనరు, నేను పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళాల్సి ఉంటుందని ఆమె భావిస్తారు. ఇప్పుడు మీకు నిరాకార పుట్టినిల్లు మరియు సాకార పుట్టినిల్లు ఉన్నాయి. ఓ పరమపిత పరమాత్మ, దయ చూపించండి, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి, మమ్మల్ని విముక్తులుగా చేయండి, మాకు మార్గదర్శకులుగా అవ్వండి అని పిలుస్తారు కూడా. కానీ దాని అర్థం పెద్ద-పెద్ద విద్వాంసులు, ఆచార్యులకు కూడా తెలియదు. తండ్రి అయితే సర్వుల ముక్తిదాత, వారే అందరి కళ్యాణకారి. ఇకపోతే మనుష్యులు తమ కళ్యాణమే చేసుకోలేనప్పుడు, ఇక ఇతరులకేమి చేస్తారు. ఇక్కడ తండ్రి అంటారు - నేను గుప్తముగా వస్తాను, ఖుదా-దోస్త్ కథను విన్నారు కదా. ఇప్పుడిది కలియుగానికి మరియు సత్యయుగానికి మధ్యనున్న వంతెన, అటువైపుకు వెళ్ళాలి. ఇప్పుడు ఖుదా అయితే తండ్రి, వారు స్నేహితుడు కూడా. తల్లి, తండ్రి, శిక్షకుని పాత్రను కూడా అభినయిస్తారు. ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరిగితే, ఇంద్రజాలము, ఇంద్రజాలము అని అంటూ ఉంటారు. మరి సాక్షాత్కారాలైతే నవవిధ భక్తి చేసేవారికి కూడా జరుగుతాయి, చాలా గాఢమైన భక్తి చేసేవారు ఉంటారు. దర్శనమివ్వండి, లేకపోతే మేము శిరస్సును ఖండించుకుంటామని అంటారు, అప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది, దానిని నవవిధ భక్తి అని అంటారు. ఇక్కడ నవవిధ భక్తికి సంబంధించిన విషయము లేదు. ఇంటిలో కూర్చుని ఉండగా కూడా చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. దివ్యదృష్టి తాళంచెవి నా వద్ద ఉంది. అర్జునుడికి కూడా నేను దివ్యదృష్టిని ఇచ్చాను కదా - ఈ వినాశనాన్ని చూడు, నీ రాజ్యాన్ని చూడు, ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఈ విధముగా తయారవుతావు అని. విష్ణువు ఎవరు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వయముగా మందిరాలను నిర్మించేవారికి ఈ విషయము తెలియదు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. నాలుగు భుజాల అర్థము - రెండు భుజాలు పురుషునివి, రెండు స్త్రీవి. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు. కానీ వారేమీ అర్థం చేసుకోరు. ఎవరి గురించి జ్ఞానము లేదు. శివబాబా గురించి గాని, విష్ణువు గురించి గాని జ్ఞానము లేదు. మొదటిలో బాబా ఆకర్షణ ఉండేది, చాలామంది వచ్చేవారు. ప్రారంభములో పూర్తి ప్రాంగణమంతా నిండిపోయేది. జడ్జి, మెజిస్ట్రేట్ అందరూ వచ్చేవారు. తర్వాత వికారాల గురించి గొడవలు ప్రారంభమయ్యాయి. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా నడుస్తుందని, ఇది సృష్టి వృద్ధి చెందేందుకు ఉన్న నియమము అని అనడము మొదలుపెట్టారు. కామము మహాశత్రువు, దానిపై విజయము పొందాలి అని గీతలో ఉన్న భగవానువాచను మర్చిపోయారు. స్త్రీ-పురుషులిరువురూ కలిసి వచ్చినట్లయితే, వారికి జ్ఞానాన్ని ఇవ్వండి, కేవలం ఒక్కరే వస్తే ఇవ్వకండి అని అనడము మొదలుపెట్టారు. ఇప్పుడు ఇరువురూ వచ్చినట్లయితే ఇవ్వాలి కదా. చూడండి, ఇరువురికీ కలిపి ఇచ్చినా సరే, కొందరు జ్ఞానాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. భాగ్యములో లేకపోతే ఏమి చేయగలము. ఒకరు హంసగా, ఒకరు కొంగగా అవుతారు. ఇక్కడ బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉత్తమమైనవారు. మనము ఈశ్వరీయ సంతానమని, శివబాబా సంతానమని మీకు తెలుసు. అక్కడ స్వర్గములో మీకు ఈ జ్ఞానముండదు. అలాగే నిరాకారీ ప్రపంచమైన ముక్తిధామములో ఉన్నప్పుడు కూడా ఈ జ్ఞానముండదు. ఈ జ్ఞానము శరీరముతో పాటే సమాప్తమైపోతుంది. ఒక్క బాబాయే చదివిస్తున్నారని ఇప్పుడు మీకు జ్ఞానముంది. ఇప్పుడు ఈ ఆట పూర్తవుతుంది, పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. బాబా కూడా వచ్చారు. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు కూడా వస్తూ ఉంటారు. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో, అప్పుడు వినాశనమవుతుంది, అప్పుడు తండ్రి అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. అందరూ వెళ్ళాల్సిందే, ఈ పతిత ప్రపంచ వినాశనము జరగనున్నది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పతితులను పావనముగా తయారుచేసే తండ్రి వ్యాపారము ఏదైతే ఉందో, ఆ వ్యాపారమే చేయాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు పావనముగా అవ్వండి అని అందరికీ లక్ష్యము ఇవ్వాలి.

2. ఈ బ్రాహ్మణ జీవితము దేవతల కన్నా ఉత్తమమైన జీవితము, ఈ నషాలో ఉండాలి. బుద్ధియోగాన్ని మిగిలినవారందరి నుండి తెంచి ఒక్క ప్రియుడిని స్మృతి చేయాలి.

వరదానము:-
త్యాగము మరియు స్నేహము యొక్క శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే స్నేహీ సహయోగీ భవ

ఏ విధముగా ప్రారంభములో జ్ఞానము యొక్క శక్తి తక్కువగా ఉండేది కానీ త్యాగము మరియు స్నేహము ఆధారముగా సఫలత లభించింది. బుద్ధిలో రాత్రింబవళ్ళు బాబా మరియు యజ్ఞము వైపే తపన ఉండేది, బాబా మరియు యజ్ఞము అన్న మాటలు ఎంతో ప్రేమగా వెలువడేవి. ఈ స్నేహమే అందరినీ సహయోగములోకి తీసుకువచ్చింది. ఈ శక్తితోనే సేవాకేంద్రాలు తయారయ్యాయి. సాకార స్నేహము ద్వారానే మన్మనాభవగా అయ్యారు, సాకార స్నేహమే సహయోగులుగా చేసింది. ఇప్పుడు కూడా త్యాగము మరియు స్నేహము యొక్క శక్తితో చుట్టుముట్టినట్లయితే సఫలత లభిస్తుంది.

స్లోగన్:-
ఫరిశ్తాలుగా అవ్వాలంటే వ్యర్థమైన మాటలు మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

ఏ విషయము జరిగినా కానీ, ప్రకృతికి సంబంధించినది అయినా, వ్యక్తులకు సంబంధించినది అయినా, రెండూ అచంచల స్థితి అనే ఆసనాన్ని కొంచెము కూడా కదిలించలేవు. ఇంత పక్కాగా ఉన్నారు కదా! ఏ విధముగా శరీరమనేది ఆసనముపై సరిగ్గా స్థితి అవ్వకపోతే అలజడి కలుగుతుంది కదా! అలా మనసు అలజడినైతే కలిగించటం లేదు కదా? సదా అచంచలము-స్థిరము, కొంచెము కూడా అలజడి ఉండకూడదు. ఒకవేళ ఒక్కోసారి అలజడి, ఒక్కోసారి అచల స్థితి ఉన్నట్లయితే సింహాసనము కూడా ఒక్కోసారి లభిస్తుంది, ఒక్కోసారి లభించదు.