16-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు సద్గతి కోసం అన్నింటికన్నా అతీతమైన మతము లభించింది, అదేమిటంటే - దేహపు ధర్మాలన్నింటినీ త్యజించి ఆత్మాభిమానులుగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి’’

ప్రశ్న:-
ఎవరైతే పరమాత్మను నామ-రూపాలకు అతీతమైనవారని అంటారో, వారిని మీరు ఏ ప్రశ్న అడగవచ్చు?

జవాబు:-
వారిని అడగండి - గీతలో అర్జునుడికి అఖండ జ్యోతి స్వరూపము సాక్షాత్కారమైనప్పుడు, వారు ఇక చాలు, నేను సహనము చేయలేకపోతున్నాను అని అన్నారని చూపిస్తారు, అటువంటప్పుడు వారిని నామ-రూపాలకు అతీతమైనవారని ఎలా అంటారు. బాబా అంటారు, నేనైతే మీకు తండ్రిని. తండ్రి రూపాన్ని చూసి బిడ్డ సంతోషిస్తాడు, అంతేకానీ, నేను సహనము చేయలేకపోతున్నాను అని ఎలా అంటాడు.

పాట:-
నీ ద్వారములో నిలబడి ఉన్నాను...

ఓంశాంతి
మేము చాలా నిరుపేదలుగా అయిపోయామని భక్తులు అంటారు. ఓ బాబా, మా అందరి ఒడిని నింపండి అని జన్మ-జన్మలుగా భక్తులు పాడుతూ ఉంటారు. సత్యయుగములో భక్తి ఉండదు. అక్కడ పావనమైన దేవీ-దేవతలు ఉంటారు. భక్తులను ఎప్పుడూ దేవతలని అనడము జరగదు. ఎవరైతే స్వర్గవాసులైన దేవీ-దేవతలుగా ఉంటారో, వారు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ నరకవాసులుగా, పూజారులుగా, భక్తులుగా, నిరుపేదలుగా అవుతారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి గురించి మనుష్యులు ఒక్కరికి కూడా తెలియదు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడే వారి పరిచయాన్ని ఇస్తారు. భగవంతుడినే బాబా అని అంటారు. భక్తులందరికీ భగవంతుడు ఒక్కరే. మిగిలినవారంతా భక్తులే. చర్చి మొదలైనవాటికి వెళ్తున్నారంటే తప్పకుండా వారు భక్తులు అన్నట్లే కదా. ఈ సమయములో అందరూ పతితముగా, తమోప్రధానముగా ఉన్నారు, అందుకే అందరూ పిలుస్తారు - ఓ పతితులను పావనముగా చేసేవారా రండి, ఓ బాబా, భక్తులైన మా ఒడిని నింపండి అని. భక్తులు భగవంతుడిని ధనము కోరుకుంటారు. పిల్లలైన మీరు ఏమి కోరుకుంటారు? మీరు అంటారు, బాబా, మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయండి. అక్కడైతే అపారమైన ధనముంటుంది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. మనము భగవంతుని ద్వారా రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని పొందుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇది సత్యమైన గీత. అది గీత కాదు. ఆ పుస్తకాలు మొదలైనవి భక్తి మార్గము కోసం తయారుచేయబడినవి. వారికి భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు. భగవంతుడైతే ఈ సమయములో నరుని నుండి నారాయణునిగా తయారుచేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. రాజుతో పాటు ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కేవలం లక్ష్మీ-నారాయణులు మాత్రమే తయారవ్వరు, మొత్తం రాజధాని అంతా తయారవుతుంది. భగవంతుడు ఎవరు అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇతర మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని మీరు అంటారు, మరి మీ గాడ్ ఫాదర్ యొక్క పేరు, రూపము, దేశము, కాలము ఏమిటో చెప్పండి అని తండ్రి అంటారు. వారికి భగవంతుని గురించీ తెలియదు, వారి రచన గురించీ తెలియదు. తండ్రి వచ్చి చెప్తున్నారు, నేను కల్ప-కల్పము సంగమములో వస్తాను. మొత్తం రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ‘‘రచయిత’’ అయిన నేనే వచ్చి అర్థం చేయిస్తాను. కొందరు ఏమంటారంటే, వారు నామ-రూపాలకు అతీతమైనవారు, వారు రాలేరు అని. తండ్రి వచ్చారు అని మీకు తెలుసు. శివజయంతి కూడా నిరాకారుడిదే అని అంటూ ఉంటారు, అలాగే శ్రీకృష్ణ జయంతి గురించి కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు శివజయంతి ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియాలి కదా. క్రిస్టియన్లకు, క్రైస్టు యొక్క జన్మ ఎప్పుడు జరిగింది, క్రిస్టియన్ ధర్మము ఎప్పుడు స్థాపన అయ్యింది అనేది తెలుసు. ఇది భారత్ కు సంబంధించిన విషయము. భగవంతుడు భారత్ యొక్క ఒడిని ఎప్పుడు నింపుతారు? ఓ భగవంతుడా, ఒడిని నింపండి, సద్గతిలోకి తీసుకువెళ్ళండి ఎందుకంటే మేము దుర్గతిలో ఉన్నాము, తమోప్రధానముగా ఉన్నామని భక్తులు పిలుస్తూ ఉంటారు. ఆత్మయే శరీరము ద్వారా అనుభవిస్తుంది. కొంతమంది మనుష్యులు, సాధువులు, సత్పురుషులు మొదలైనవారు ఆత్మ నిర్లేపి అని అంటారు. మంచి మరియు చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయని, దాని ఆధారముగా ఆత్మ జన్మ తీసుకుంటుందని అంటారు కూడా. మళ్ళీ ఆత్మ నిర్లేపి అని అంటారు. అర్థం చేయించే తెలివైన మనుష్యులెవరూ లేరు. ఇందులో కూడా అనేక మతాలు ఉన్నాయి. ఎవరైతే ఇంటిపై అలిగి వెళ్ళిపోతారో, వారు శాస్త్రాలను తయారుచేస్తారు. శ్రీమత్ భగవద్గీత ఒక్కటే ఉంది. వ్యాసుడు ఏవైతే శ్లోకాలు మొదలైనవి తయారుచేసారో, వాటిని భగవంతుడేమీ వినిపించలేదు. భగవంతుడు నిరాకారుడు, వారు జ్ఞానసాగరుడు, భగవంతుడు ఒక్కరేనని వారు కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భారతవాసులకు ఈ విషయము తెలియదు. ఈశ్వరుడు ఇచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవని పాడుతారు కూడా. అచ్ఛా, ఏ గతి, మార్గము అతీతమైనవి? ఈశ్వరుడు ఇచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవి అని ఎవరు చెప్పారు? తన సద్గతి కోసం లభించిన మతాన్ని శ్రీమతము అని అంటారని ఆత్మ చెప్తుంది. కల్ప-కల్పము వచ్చి మీకు మన్మనాభవ అని అర్థం చేయిస్తాను. దేహపు ధర్మాలన్నింటినీ త్యజించి ఆత్మాభిమానీ భవ. నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఈ రాజయోగము యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము లక్ష్మీ-నారాయణులుగా అవ్వడము. చదువు ద్వారా ఎవ్వరూ రాజులుగా అవ్వరు. అటువంటి స్కూల్ ఏదీ లేదు. పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని గీతలో మాత్రమే ఉంది. నేను రావడము కూడా ఎప్పుడు వస్తానంటే, ఏ రాజు యొక్క రాజ్యము లేనప్పుడు. నా గురించి మనుష్యుల్లో ఒక్కరికి కూడా ఏ మాత్రము తెలియదు. బాబా అంటారు, పిల్లలైన మీరు ఇంత పెద్ద లింగాన్ని ఏదైతే తయారుచేసారో, నా రూపము అదేమీ కాదు. పరమాత్మ అఖండ జ్యోతి రూపము, తేజోమయుడని మనుష్యులు అంటారు. అర్జునుడు వారిని చూసి ఇక చాలు, నేను సహనము చేయలేకపోతున్నాను అని అన్నట్లుగా చెప్తారు. అరే, తండ్రి రూపాన్ని చూసి బిడ్డ సహనము చేయలేకపోవడమా, ఇది ఎలా జరుగుతుంది. బిడ్డ అయితే తండ్రిని చూసి సంతోషిస్తాడు కదా. తండ్రి అంటారు, నాకు అటువంటి రూపమేమీ లేదు. నేను ఉన్నదే పరమపిత అనగా అతీతమైన స్థానములో నివసించే పరమ ఆత్మను అనగా పరమాత్మను. పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపుడని కూడా పాడుతారు. భక్తులు వారి మహిమను చేస్తారు. సత్య, త్రేతాయుగాలలో వారి మహిమను ఎవరూ చేయరు ఎందుకంటే అక్కడ సుఖము ఉంది. దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు, సుఖములో ఎవరూ చేయరని పాడుతారు కూడా. దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. అందరూ చిలుకల వలె అంటూ ఉంటారు. సుఖము ఎప్పుడు ఉంటుంది, దుఃఖము ఎప్పుడు కలుగుతుంది. ఇది భారత్ యొక్క విషయమే కదా. 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గముండేది, ఆ తర్వాత త్రేతాలో 2 కళలు తగ్గాయి. సత్య, త్రేతాయుగాలలో దుఃఖము యొక్క పేరే ఉండదు. అది ఉన్నదే సుఖధామము. స్వర్గము అని అనగానే నోరు తీపి అవుతుంది. మరి స్వర్గములో దుఃఖము ఎక్కడ నుండి వచ్చింది. అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు మొదలైనవారు ఉండేవారని అంటారు కానీ అలా జరగదు.

మేము నవ విధ భక్తి చేస్తే సాక్షాత్కారము కలుగుతుందని భక్తులు భావిస్తారు. సాక్షాత్కారము కలగడమంటే భగవంతుడు లభించినట్లుగా భావిస్తారు. లక్ష్మిని పూజించి, వారి దర్శనము కలిగితే, ఇక మాకు అంతా లభించేసిందని భావిస్తారు, అందులోనే సంతోషపడతారు. కానీ అందులో ఏమీ లేదు. అల్పకాలము కొరకు సుఖము లభిస్తుంది. దర్శనము కలిగింది, అంతే, అది సమాప్తమైపోయింది. అంతేకానీ ముక్తి-జీవన్ముక్తులను పొందారని కాదు, ఏమీ లభించదు. భారత్ ఉన్నతోన్నతముగా ఉండేదని బాబా మెట్ల వరుస చిత్రములో కూడా అర్థం చేయించారు. భగవంతుడు కూడా ఉన్నతోన్నతమైనవారు. భారత్ లో ఉన్నతోన్నతమైన వారసత్వము ఈ లక్ష్మీ-నారాయణులది. స్వర్గము ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉండేవారు, మళ్ళీ కలియుగ అంతిమములో అందరూ తమోప్రధానముగా అయిపోతారు. మేము పూర్తిగా పతితులుగా అయిపోయామని పిలుస్తారు. తండ్రి అంటారు, నేను కల్పము యొక్క సంగమయుగములో మీకు రాజయోగాన్ని నేర్పించడానికి వస్తాను. నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా యథార్థముగా నా గురించి ఎవరికీ తెలియదు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. మెట్ల వరస చిత్రాన్ని చూపించాలి. ఇవి భారత్ యొక్క మెట్లు. సత్యయుగములో దేవీ-దేవతలు ఉండేవారు. 5 వేల సంవత్సరాల క్రితం భారత్ ఇలా ఉండేది. శాస్త్రాలలో కల్పము లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. తండ్రి అంటారు, లక్షల సంవత్సరాలు కాదు, కల్పము 5 వేల సంవత్సరాలు. సత్య, త్రేతాయుగాలు కొత్త ప్రపంచము, ద్వాపర, కలియుగాలు పాత ప్రపంచము. సగం-సగం ఉంటుంది కదా. కొత్త ప్రపంచములో భారతవాసులైన మీరు ఉండేవారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీకు మీ జన్మల గురించి తెలుసు, అంతేకానీ రథము మొదలైనవాటి విషయమేమీ లేదు. శ్రీకృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు. శ్రీకృష్ణుని ఆ రూపాన్ని దివ్యదృష్టితో తప్ప ఇక దేనితోనూ చూడలేరు. వీరు చైతన్య రూపముతో సత్యయుగములో ఉండేవారు, ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆ రూపము లభించదు. ఆ తర్వాత నామ, రూప, దేశ, కాలాలు మారిపోతాయి. 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలలో 84 మాతా-పితలు లభిస్తారు. రకరకాల నామ-రూపాలు, కర్తవ్యాలు ఉంటాయి. ఇప్పుడివి కేవలం భారత్ యొక్క మెట్లే. మీరు ఇప్పుడు బ్రాహ్మణ కుల భూషణులు. బాబా కల్పక్రితము కూడా వచ్చి మిమ్మల్ని దేవీ-దేవతలుగా తయారుచేసారు. అక్కడ మీరు సర్వోత్తమమైన కర్మలు చేసేవారు. మీరు 21 జన్మలు సదా సుఖముగా ఉండేవారు. తర్వాత మిమ్మల్ని ఈ దుర్గతిలోకి ఎవరు తీసుకువచ్చారు? నేను కల్పక్రితము మీకు సద్గతిని ఇచ్చాను, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ తప్పకుండా కిందకు దిగవలసి వస్తుంది. సూర్యవంశములో 8 జన్మలు, చంద్రవంశములో 12 జన్మలు, ఆ తర్వాత అలా దిగుతూ వచ్చారు. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు, మీరే పూజారులుగా, పతితులుగా అయ్యారు. భారత్ ఇప్పుడు నిరుపేదగా ఉంది. భగవానువాచ, మీరు 100 శాతము పవిత్రముగా, సంపన్నముగా, సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. రోగము, దుఃఖము అన్న విషయమేమీ ఉండేది కాదు, సుఖధామముగా ఉండేది. దానిని గార్డెన్ ఆఫ్ అల్లా (భగవంతుని పూదోట) అని అంటారు. అల్లా తోటను స్థాపన చేసారు. ఇంతకుముందు దేవీ-దేవతలుగా ఉన్నవారు ఇప్పుడు ముళ్ళగా అయ్యారు. ఇప్పుడు అడవిలా అయిపోయింది. అడవిలో ముళ్ళు గుచ్చుకుంటాయి. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, దానిపై విజయము పొందండి. అది ఆదిమధ్యాంతాలు మీకు దుఃఖమునిచ్చింది. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడమనేది అన్నింటికంటే పెద్ద పాపము. తండ్రి కూర్చుని తమ పరిచయాన్ని ఇస్తున్నారు - నేను పరంధామములో ఉండే పరమ ఆత్మను. నేను సృష్టి యొక్క బీజరూపుడను, నన్ను పరమ ఆత్మ అని అంటారు, నేను అందరికీ తండ్రిని. ఓ పరమపిత పరమాత్మ, అని ఆత్మలన్నీ తండ్రిని పిలుస్తాయి. ఏ విధముగా ఆత్మ అయిన మీరు నక్షత్రము వలె ఉన్నారో, బాబా కూడా పరమ ఆత్మ, వారు కూడా ఒక నక్షత్రము వలె ఉన్నారు. మీ కన్నా చిన్నగానో, పెద్దగానో ఉండరు. తండ్రి అంటారు, నేను అంగుష్టము వలె కూడా ఉండను. నేను పరమ ఆత్మను. నేను మీ అందరికీ తండ్రిని. వారిని సుప్రీమ్ సోల్, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను నాలెడ్జ్ ఫుల్, మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడను. పరమాత్మ సత్ చిత్ ఆనంద స్వరూపుడని, వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడని భక్తులు నా గురించి అంటారు. నాకు ఎంతటి మహిమ ఉంది. ఒకవేళ నామ-రూప-దేశ-కాలాలు లేకపోతే ఎవరిని పిలుస్తారు. సాధు-సత్పురుషులు మొదలైనవారంతా మీకు భక్తి మార్గపు శాస్త్రాలను వినిపిస్తారు. నేను వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞాన సాగరుడినైన, తండ్రినైన నన్ను మీరు పతిత-పావనుడు అని అంటారు. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. భారత్ కు సద్గతిని తండ్రి మాత్రమే ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. అందరికీ దుర్గతిని కలిగించేది ఎవరు? రావణుడు. ఇప్పుడు మీకు ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? వీరు పరమ ఆత్మ. ఆత్మ అయితే నక్షత్రము వలె అతి సూక్ష్మమైనది. పరమాత్మ కూడా డ్రామాలో పాత్రను అభినయిస్తారు. వారు క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్. ఉన్నతోన్నతమైన పాత్రధారులు ఎవరు అనేది తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. వారితోనే ఆత్మలైన పిల్లలైన మీరంతా ఉంటారు. పరమాత్మ అందరినీ పంపిస్తారని అంటారు కూడా. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము. డ్రామా అయితే అనాదిగా తయారై ఉంది. తండ్రి అంటారు, నన్ను మీరు జ్ఞాన సాగరుడు, మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలు తెలిసినవారు అని అంటారు. ఇప్పుడు ఈ శాస్త్రాలు మొదలైనవేవైతే చదువుతున్నారో, అవి తండ్రికి తెలుసు. తండ్రి అంటారు, నేను ప్రజాపిత బ్రహ్మా ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని వచ్చి తెలియజేస్తాను. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చూపిస్తారు. ఎక్కడ వెలువడ్డారు? మనుష్యులైతే తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. వీరి నాభి నుండి బ్రహ్మా వెలువడ్డారు, ఆ తర్వాత భగవంతుడు కూర్చుని వీరి ద్వారా అన్ని వేద-శాస్త్రాల సారాన్ని వినిపించారు. వారు తమ నామ-రూప-దేశ-కాలాల గురించి కూడా అర్థం చేయించారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు కదా. ఈ వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనము ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. దీనిని వెరైటీ వృక్షమని అంటారు. అందరూ నంబరువారుగా తమ-తమ సమయములో వస్తారు. మొదటి నంబరులో దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తాను, ఆ ధర్మము ఇప్పుడు లేదు. తండ్రి అంటారు, ఎంత తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోయారు. దేవతలకు, లక్ష్మీ-నారాయణులకు పూజ చేస్తారు, కానీ వారి రాజ్యము ఈ సృష్టిపై ఎప్పుడు ఉండేది అనేది ఏ మాత్రము తెలియదు. ఇప్పుడు భారత్ యొక్క ఆ దేవతా ధర్మమే లేదు, కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి పతితులను పావనముగా తయారుచేసే సేవ చేయాలి. తండ్రి ఏదైతే అన్ని శాస్త్రాల సారాన్ని వినిపించారో, దానిని బుద్ధిలో ఉంచుకుని సదా హర్షితముగా ఉండాలి.

2. ఒక్క తండ్రి యొక్క శ్రీమతాన్నే ప్రతి క్షణము పాటించాలి. దేహపు ధర్మాలన్నింటినీ త్యజించి ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయాలి.

వరదానము:-
విస్తారాన్ని సారములో ఇమిడ్చి తమ శ్రేష్ఠ స్థితిని తయారుచేసుకునే తండ్రి సమానమైన లైట్-మైట్ హౌస్ భవ

తండ్రి సమానముగా లైట్-మైట్ హౌస్ గా అయ్యేందుకు ఏ విషయాన్ని చూసినా లేక విన్నా దాని సారాన్ని తెలుసుకుని ఒక్క క్షణములో ఇముడ్చుకునే లేక పరివర్తన చేసే అభ్యాసము చేయండి. ఎందుకు, ఏమిటి అనే విస్తారములోకి వెళ్ళకండి ఎందుకంటే ఏ విషయపు విస్తారములోకైనా వెళ్ళటము ద్వారా సమయము మరియు శక్తులు వ్యర్థముగా పోతాయి. కావున విస్తారాన్ని ఇముడ్చుకుని సారములో స్థితులయ్యే అభ్యాసము చేయండి - దీని వలన ఇతర ఆత్మలకు కూడా ఒక్క క్షణములో మొత్తము జ్ఞానము యొక్క సారాన్ని అనుభవము చేయించగలరు.

స్లోగన్:-
మీ వృత్తిని శక్తిశాలిగా తయారు చేసుకున్నట్లయితే సేవలో వృద్ధి స్వతహాగానే జరుగుతుంది.

అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ఒకవేళ నిశ్చయమనే పునాది పక్కాగా ఉన్నట్లయితే సహజయోగులుగా, నిర్మల స్వభావము కలవారిగా, శుభ భావనతో కూడిన వృత్తి మరియు ఆత్మిక దృష్టి కలవారిగా ఉంటారు. నడవడిక మరియు ముఖము ద్వారా ప్రతి సమయము సరళత అనే మెరుపు అనుభవమవుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకుని ఇతరులపై విశ్వాసము ఉంచినట్లయితే వారి మాటల భావము మారిపోతుంది.