17-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యాతి సత్యమైన సత్య కథను విని నరుని నుండి నారాయణునిగా అవుతారు, మీకు 21 జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది’’

ప్రశ్న:-
తండ్రి ఇచ్చిన ఏ ఆజ్ఞను పాటించే పిల్లలే పారసబుద్ధి కలవారిగా అవుతారు?

జవాబు:-
తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - దేహపు సర్వ సంబంధాలను మరచి, తండ్రిని మరియు రాజ్యాధికారాన్ని స్మృతి చేయండి. సద్గతి కోసం ఇదే సద్గురువు యొక్క శ్రీమతము. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాటిస్తారో అనగా దేహీ-అభిమానులుగా అవుతారో, వారే పారసబుద్ధి కలవారిగా అవుతారు.

పాట:-
ఈ రోజు మనుష్యులమైన మనము అంధకారములో ఉన్నాము...

ఓంశాంతి
ఇది కలియుగీ ప్రపంచము. అందరూ అంధకారములో ఉన్నారు. ఈ భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు ఈ భారత్ యే ప్రకాశములో ఉండేది. ఇప్పుడు తమను తాము హిందువులము అని చెప్పుకుంటున్న ఈ భారతవాసులే వాస్తవానికి దేవీ-దేవతలుగా ఉండేవారు. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు, అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు, ఒకే ధర్మము ఉండేది. స్వర్గము, వైకుంఠము, బహిష్త్, హెవెన్, ఇవన్నీ భారత్ యొక్క పేర్లే. భారత్ ప్రాచీనమైనదిగా, పవిత్రమైనదిగా, చాలా-చాలా సంపన్నముగా ఉండేది. ఇప్పుడైతే భారత్ నిరుపేదగా ఉంది ఎందుకంటే ఇప్పుడిది కలియుగము. అది సత్యయుగముగా ఉండేది. మీరందరూ భారతవాసులు. మనము అంధకారములో ఉన్నామని మీకు తెలుసు, స్వర్గములో ఉన్నప్పుడు ప్రకాశములో ఉండేవారము. స్వర్గములో లక్ష్మీ-నారాయణులు, రాజ రాజేశ్వర, రాజ రాజేశ్వరీలుగా ఉండేవారు. దానిని సుఖధామమని అంటారు. కొత్త-కొత్తవారు వస్తే తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తారు. తండ్రి నుండే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి, దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనములో ఉన్నారు. ముఖ్యముగా భారత్ మరియు మొత్తము ప్రపంచమంతా రావణుడి జైలులో, శోకవాటికలో ఉన్నారు. రావణుడు కేవలం లంకలో ఉండేవాడని మరియు రాముడు భారత్ లో ఉండేవారని మరియు రావణుడు వచ్చి సీతను అపహరించాడని కాదు. అవన్నీ కల్పితమైన కథలు. గీత ముఖ్యమైనది, అది సర్వశాస్త్రాల శిరోమణి. శ్రీమత్ అనగా భగవంతుడు వినిపించిన గీత. మనుష్యులైతే ఎవరికీ సద్గతినివ్వలేరు. సత్యయుగములో జీవన్ముక్త దేవీ-దేవతలు ఉండేవారు, వారు ఈ వారసత్వాన్ని కలియుగ అంతిమములో పొందారు. భారత్ కు ఈ విషయాలు తెలియవు, ఇవి ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలన్నీ భక్తి మార్గము కోసమున్నాయి. అదంతా భక్తి మార్గానికి చెందిన జ్ఞానము. సద్గతి మార్గము యొక్క జ్ఞానము మనుష్యమాత్రులలో లేదు. తండ్రి అంటారు, మనుష్యులు, మనుష్యులకు గురువులుగా కాలేరు. గురువులెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. ఆ గురువులు - భక్తి చేయండి, దాన పుణ్యాలు చేయండి అని చెప్తారు. భక్తి ద్వాపరము నుండి కొనసాగుతూ వచ్చింది. సత్య, త్రేతాయుగాలలో జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. అలాగని, అక్కడ కూడా ఈ జ్ఞానము కొనసాగుతుందని కాదు. భారత్ కు ఆ వారసత్వమేదైతే ఉండేదో, అది తండ్రి నుండి సంగమములోనే లభించింది. అది ఇప్పుడు మీకు మళ్ళీ లభిస్తుంది. భారతవాసులు నరకవాసులుగా, మహా దుఃఖితులుగా అయినప్పుడు, ఓ పతిత-పావనా, దుఃఖహర్త-సుఖకర్త అని పిలుస్తారు, ఎవరి దుఃఖము? సర్వుల దుఃఖము, ఎందుకంటే ముఖ్యముగా భారత్ లో మరియు మొత్తము ప్రపంచములో 5 వికారాలు ఉండనే ఉన్నాయి. తండ్రి పతిత-పావనుడు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమములో వస్తాను మరియు సర్వుల సద్గతిదాతగా అవుతాను. అబలలు, అహల్యలు, వేశ్యలు మరియు గురువులు, అందరి ఉద్ధరణను నేనే చేయాలి ఎందుకంటే ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. వారు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని ఈ భారతవాసులకు తెలియదు. పతిత ఖండము అనగా అసత్య ఖండము, పావన ఖండము అనగా సత్య ఖండము. భారత్ పావన ఖండముగా ఉండేది. లక్ష్మీ-నారాయణులది సూర్యవంశీ రాజ్యము. ఈ భారత్ అవినాశీ ఖండము, ఇది ఎప్పటికీ వినాశనము కాదు. వీరి రాజ్యము ఉన్నప్పుడు ఇంకే ఖండమూ ఉండేది కాదు. అవన్నీ తర్వాత వస్తాయి. శాస్త్రాలలో అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏమి చేసారంటే, కల్పము యొక్క ఆయుష్షును లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. తండ్రి అంటారు, కల్పానికీ లక్షల సంవత్సరాలు ఉండవు, సత్యయుగానికీ లక్షల సంవత్సరాలు ఉండవు. కల్పము యొక్క ఆయుష్షు 5 వేల సంవత్సరాలు. అలాగే, మనుష్యులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని అనేస్తారు. మనుష్యులను కుక్క, పిల్లి మొదలైనవిగా చేసేసారు. కానీ వాటి జన్మలు వేరు. 84 లక్షల రకాలు ఉన్నాయి. మనుష్యుల వెరైటీ ఒక్కటే, వారికే 84 జన్మలు ఉంటాయి.

తండ్రి అంటారు - పిల్లలూ, మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. భారతవాసులు తమ ధర్మాన్ని డ్రామా ప్లాన్ అనుసారముగా మర్చిపోయారు. కలియుగ అంతిమములో పూర్తిగా పతితముగా అయిపోయారు. మళ్ళీ తండ్రి వచ్చి సంగమములో పావనముగా తయారుచేస్తారు. దీనిని దుఃఖధామమని అంటారు. ఆ తర్వాత పాత్ర సుఖధామములో ఉంటుంది. తండ్రి అంటారు, ఓ పిల్లలూ, భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉండేవారు. తర్వాత మీరు 84 జన్మల మెట్లు దిగుతారు. సతో నుండి రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ అంతటి ధనవంతులుగా, సదా సంతోషముగా, సదా ఆరోగ్యవంతులుగా ఇంకెవ్వరూ ఉండరు. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. వజ్ర-వైఢూర్యాలైతే పెద్ద-పెద్ద రాళ్ళ వలె ఉండేవి, వాటిలో ఎన్ని విరిగిపోయాయి. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తున్నారు - మిమ్మల్ని ఎంత షావుకారులుగా చేసాను. మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజ... వారిని భగవాన్, భగవతి అని కూడా అనవచ్చు. కానీ తండ్రి అర్థం చేయించారు, భగవంతుడు ఒక్కరే, వారే తండ్రి. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అన్నా కూడా వారు సర్వాత్మలకు తండ్రి అన్నది గుర్తుకు రాదు. వారు అనంతమైన తండ్రి. వారు అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైన మీరు జయంతిని జరుపుతారు కానీ వాస్తవానికి తండ్రి ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. ఇనుపయుగానికి చెందినవారిగా, రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. పారసనాథులుగా ఉండేవారు, ఈ సమయములో రాతినాథులుగా ఉన్నారు. నాథుడు అని కూడా అనము ఎందుకంటే రాజు, రాణులుగా అయితే లేరు. పూర్వము ఇక్కడ దైవీ రాజస్థాన్ ఉండేది, తర్వాత ఆసురీ రాజ్యముగా తయారవుతుంది. ఇది ఆట. అది హద్దులోని డ్రామా. ఇది అనంతమైన డ్రామా. ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాల గురించి ఆది నుండి అంతిమము వరకు మీకు ఇప్పుడు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. భారత్ లో దేవీ-దేవతలు ఉన్నప్పుడు వారు మొత్తము సృష్టికి యజమానులుగా ఉండేవారు మరియు వారు భారత్ లోనే ఉండేవారు. తండ్రి భారతవాసులుకు స్మృతిని కలిగిస్తున్నారు. సత్యయుగములోని ఆది సనాతన దేవీ-దేవతలవి శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ కర్మలు ఉండేవి, తర్వాత 84 జన్మలు కిందకు దిగవలసి వచ్చింది. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ అని ఈ తండ్రి కూర్చుని కథను వినిపిస్తారు. ఇది ఒక్కరి విషయము కాదు. యుద్ధ మైదానము మొదలైనవేవీ లేవు. వీరి (లక్ష్మీ-నారాయణుల) రాజ్యముండేది అని కూడా భారతవాసులు మర్చిపోయారు. సత్యయుగము యొక్క ఆయుష్షును పెద్దదిగా చేయడము వలన చాలా దూరము తీసుకువెళ్ళిపోయారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుష్యులను భగవంతుడని అనలేము. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. సర్వుల సద్గతిదాత, పతితుల పావన కర్త ఒక్కరేనని నానుడి ఉంది. ఇది అసత్య ఖండము. సత్యమైన బాబా సత్య ఖండాన్ని స్థాపన చేసేటటువంటివారు. భక్తులు పూజ చేస్తారు కానీ భక్తి మార్గములో ఎవరినైతే పూజిస్తూ వచ్చారో, అందులో ఒక్కరి జీవిత చరిత్ర కూడా తెలియదు. శివజయంతినైతే జరుపుకుంటారు. తండ్రి కొత్త ప్రపంచము యొక్క రచయిత. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. సత్యయుగములో సుఖముండేది. దానిని ఎలా మరియు ఎవరు స్థాపన చేసారు? వారు నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసారు. భ్రష్టాచారులను శ్రేష్ఠాచారులైన దేవతలుగా తయారుచేసారు. ఇది తండ్రి కర్తవ్యమే. పిల్లలైన మిమ్మల్ని పావనముగా చేస్తాను. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారుచేస్తారు? ఈ రావణుడు. సుఖ-దుఃఖాలను ఈశ్వరుడే ఇస్తారని మనుష్యులు అనేస్తారు. తండ్రి అంటారు, నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను. అర్ధకల్పము మీరు ఇక తండ్రిని స్మృతి చేయరు, ఆ తర్వాత రావణ రాజ్యము వచ్చినప్పుడు అందరినీ పూజించడము ప్రారంభిస్తారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా, మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము అని అడుగుతారు. తండ్రి అంటారు, పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. మీరు 21 జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు అనగా సత్యమైన తండ్రి ద్వారా సత్యాతి సత్యమైన సత్య కథను, నరుని నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానాన్ని వింటారు. ఇది జ్ఞానము, అది భక్తి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమ ఆత్మ వచ్చి ఇస్తారు. పిల్లలు దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని నన్నొక్కరినే స్మృతి చేయండి. శివబాబా అయితే ఆత్మలందరికీ తండ్రి. ఆత్మలన్నీ పరంధామము నుండి పాత్రను అభినయించేందుకు శరీరములోకి వస్తాయి. దీనిని కర్మక్షేత్రమని అంటారు. ఇది చాలా పెద్ద ఆట. ఆత్మలో మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. దాని అనుసారముగానే మనుష్యులకు మంచి లేక చెడు జన్మ లభిస్తుంది. పావనముగా ఉన్న వీరే ఇప్పుడు పతితముగా ఉన్నారు, తతత్వమ్. తండ్రినైన నేను ఈ పరాయి రావణ ప్రపంచములోకి, పతిత శరీరములోకి రావలసి వస్తుంది. అది కూడా ఎవరైతే మొదటి నంబరులోకి వెళ్ళనున్నారో, వారిలోకే రావలసి ఉంటుంది. సూర్యవంశీయులే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇక్కడ ఉన్నది బ్రహ్మా మరియు బ్రాహ్మణులు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు, కానీ రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా చేయడము అంత సులువైన పనేమీ కాదు. ఓ ఆత్మలారా, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి, ఓ ఆత్మలారా, ఒక్క తండ్రిని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహపు సంబంధాలను విడిచిపెట్టినట్లయితే పారసబుద్ధి కలవారిగా అవుతారు. అందరూ మరణించవలసిందే. అందరిదీ ఇప్పుడు వానప్రస్థావస్థ. ఒక్క సద్గురువు తప్ప సర్వులకు సద్గతిదాతగా ఇంకెవ్వరూ అవ్వలేరు.

తండ్రి అంటారు, ఓ భారతవాసీ పిల్లలూ, మీరు ఇంతకుముందు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. ఆత్మ, పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు... అని అంటూ ఉంటారు. కావున మొట్టమొదట దేవీ-దేవతా ధర్మానికి చెందిన భారతవాసులైన మీరు వచ్చారు, ఇతర ధర్మాల వారు వెనుక వచ్చారు, కావున వారి జన్మలు కూడా తక్కువగానే ఉంటాయి. మొత్తము సృష్టి యొక్క వృక్షమంతా ఏ విధముగా తిరుగుతుంది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ధారణ చేయగలిగేవారికి ఇది చాలా సహజము. ఆత్మ ధారణ చేస్తుంది. పుణ్యాత్మగా మరియు పాపాత్మగా ఆత్మే అవుతుంది. ఇది మీ అంతిమ 84వ జన్మ. మీరు వానప్రస్థావస్థలో ఉన్నారు. వానప్రస్థావస్థలో ఉన్నవారు మంత్రము తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. మీరు ఇప్పుడు బయట మనుష్యులను గురువులుగా చేసుకోకూడదు. మీ అందరికీ నేను తండ్రి, టీచర్, సద్గురువును. ఓ పతిత-పావనా, శివబాబా అని నన్ను పిలుస్తారు. సర్వాత్మలకు వీరు తండ్రి అని ఇప్పుడు స్మృతి కలిగింది. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది ఎందుకంటే అది అమరమైనది. ఆత్మలన్నింటిలోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడైన కారణముగా ఏమంటారంటే, నాకు ఈ వృక్షమంతటి ఆదిమధ్యాంతాలు తెలుసు, కావుననే నన్ను జ్ఞాన సాగరుడు అని అంటారు. మీకు కూడా బీజము నుండి వృక్షము ఎలా వెలువడుతుంది అన్న పూర్తి జ్ఞానముంది. వృక్షము పెరగడానికైతే సమయము పడుతుంది. తండ్రి అంటారు, నేను బీజరూపుడను. అంతిమములో మొత్తము వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పుడు చూడండి, దేవీ-దేవతా ధర్మము యొక్క పునాది లేదు. అది కనుమరుగైపోయింది. ఎప్పుడైతే దేవీ-దేవతా ధర్మము మాయమైపోతుందో, అప్పుడు తండ్రికి రావలసి ఉంటుంది. ఒక్క ధర్మాన్ని స్థాపన చేసి మిగిలినవన్నీ వినాశనము చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా తండ్రి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారీ దేవతలుగా అయ్యేందుకు మీరు వచ్చారు. ఈ డ్రామా తయారై ఉంది, ఇది సమాప్తమవ్వదు. తండ్రి వస్తారు. ఆత్మలందరూ పరస్పరము సోదరులు, మూలవతనములో నివసించేటటువంటివారు. అందరూ ఆ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు... రావణ రాజ్యములో దుఃఖముంది. ఇక్కడ స్మరణ చేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఒక్కరే. ఇది వారి మహిమనే. తండ్రి రాకపోతే పావనముగా ఎవరు తయారుచేస్తారు. క్రిస్టియన్లు, ఇస్లాములు మొదలైన మనుష్యులంతా ఎవరైతే ఉన్నారో, అంతా ఈ సమయములో తమోప్రధానముగా ఉన్నారు. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవలసిందే. ప్రస్తుతము పునర్జన్మలు నరకములో ఉంటాయి. సుఖములోకి వెళ్ళిపోతారని కాదు. హిందూ ధర్మము వారు స్వర్గస్థులయ్యారని అంటారు అంటే తప్పకుండా అప్పటివరకు నరకములో ఉండేవారనే కదా. ఒకవేళ ఇప్పుడే స్వర్గములోకి వెళ్ళారనుకుంటే, మీ నోటిలో గులాబ్ జామున్. స్వర్గవాసులుగా అయినప్పుడు వారికి మళ్ళీ ఈ నరకములోని ఆసురీ వైభవాలను ఎందుకు తినిపిస్తారు! పిత్రులకు తినిపిస్తారు కదా. బెంగాల్ లో చేపలు, గుడ్లు మొదలైనవి తినిపిస్తారు. అరే, వారికి ఇవన్నీ తినవలసిన అవసరమేముంది! తిరిగి ఎవరూ వెళ్ళలేరు. మొదటి నంబరులోనివారు 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ జ్ఞానములో ఎటువంటి కష్టమూ లేదు. భక్తి మార్గములో ఎంత శ్రమ ఉంది. రామ-రామ అని జపిస్తూ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అదంతా భక్తి మార్గము. ఈ సూర్యుడు, చంద్రుడు మొదలైనవి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటివి, ఇవి దేవతలు కాదు. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారలు, ఇది ఇక్కడి మహిమనే. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ 84వ జన్మలో ఎటువంటి పాప కర్మలు (వికర్మలు) చేయకూడదు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. సంపూర్ణ పావనముగా అవ్వాలి.

2. మీ బుద్ధిని పారసబుద్ధిగా తయారుచేసుకునేందుకు దేహపు సంబంధాలన్నింటినీ మరచి దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయాలి.

వరదానము:-
పాత సంస్కారాలు మరియు విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునే సదా శక్తి సంపన్న భవ

ఏ విధమైన విఘ్నాల నుండైనా, బలహీనతలు లేక పాత సంస్కారాల నుండైనా ముక్తి కావాలనుకుంటున్నట్లయితే శక్తిని ధారణ చేయండి అనగా అలంకార రూపులై ఉండండి. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరింపబడి ఉంటారో, వారు భవిష్యత్తులో విష్ణువంశీయులుగా అవుతారు కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎటువంటి తమోగుణీ సంకల్పము లేక సంస్కారము టచ్ కూడా చేయలేదు. వారు పాత ప్రపంచము నుండి మరియు ప్రపంచములోని ఏ వస్తువు మరియు వ్యక్తుల నుండైనా సహజముగానే పక్కకు వెళ్ళిపోతారు, వారిని ఏ కారణము వల్ల అయినా కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు.

స్లోగన్:-
ప్రతి సమయము ప్రతి కర్మలోనూ బ్యాలెన్స్ ను ఉంచటమే సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు సాధనము.

అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ఇద్దరు మిత్రులు ఉన్నారనుకోండి, వారి మధ్యకు ఒకవేళ మూడో వ్యక్తి ఆ మిత్రులలో ఒకరిని నిందించడానికి వస్తే రెండవ మిత్రుడు అతని భావాన్ని మార్చివేస్తాడు. ఎక్కడైతే నిశ్చయము ఉంటుందో, అక్కడ మాటల భావము మారి అది సాధారణ విషయముగా అయిపోతుంది. కావున ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి, అప్పుడు అనేకులుగా ఉన్నప్పటికీ ఒక్కరుగా కనిపిస్తారు. ఏకమతముతో కూడిన సంగఠన ఏర్పడుతుంది. ఎవరైనా ఎవరి గురించైనా నిందింపజేసే విషయాలను వినిపించినట్లయితే, వారికి మద్దతునిచ్చేందుకు బదులుగా వినిపించేవారి మాటల యొక్క రూపాన్ని పరివర్తన చేయండి.