20-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పుణ్యాత్ములుగా అవ్వాలంటే ఒక్క తండ్రిని స్మృతి చేయండి, స్మృతి ద్వారానే మాలిన్యము తొలగుతుంది, ఆత్మ పావనముగా అవుతుంది’’

ప్రశ్న:-
ఏ స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ విషయములోనూ తికమకపడరు?

జవాబు:-
డ్రామా. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడిక కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు... ఈ అనాది డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇందులో ఏ విషయములోనూ తికమకపడే అవసరము లేదు. కొంతమంది పిల్లలు - ఇది మా అంతిమ 84వ జన్మనో కాదో తెలియదు అని అంటారు, తికమకపడిపోతారు. బాబా అంటారు - తికమకపడకండి, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థము చేయండి.

ఓంశాంతి
పిల్లలకు ఓంశాంతి యొక్క అర్థమైతే తెలుసు - నేను ఆత్మను మరియు ఆత్మనైన నా స్వధర్మము శాంతి, ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతిధామ నివాసిని. ఈ పాఠాన్ని పక్కా చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? శివబాబా. స్మృతి కూడా శివబాబానే చేయాలి. వారికి తమ రథమంటూ లేదు, అందుకే వారికి ఎద్దును చూపిస్తారు. మందిరములో కూడా నందిని చూపించారు. దీనిని పూర్తి అజ్ఞానమని అంటారు. తండ్రి పిల్లలకు అనగా ఆత్మలకు అర్థం చేయిస్తారు. వీరు ఆత్మల తండ్రి శివుడు, వీరి పేర్లు అయితే అనేకమున్నాయి. కానీ అనేక పేర్లు ఉండడము వలన తికమకపడిపోయారు. వాస్తవానికి వీరి పేరు శివ. శివజయంతిని కూడా భారత్ లోనే జరుపుకోవడము జరుగుతుంది. వారు నిరాకార బాబా, వారు వచ్చి పతితులను పావనముగా తయారుచేస్తారు. కొంతమంది వారిని భగీరథుడని, కొంతమంది నంది అని అంటారు. వారు ఏ భాగ్యశాలి రథములోకి వస్తారు అనేది తండ్రియే తెలియజేస్తారు. నేను బ్రహ్మా తనువులో ప్రవేశిస్తాను. బ్రహ్మా ద్వారా భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాను. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని భారతవాసులైన మీ అందరికీ తెలుసు కదా. భారతవాసీ పిల్లలైన మీరంతా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, స్వర్గవాసులుగా ఉండేవారు. 5 వేల సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు, అందరినీ సతోప్రధాన స్వర్గానికి యజమానులుగా చేసాను. ఆ తర్వాత పునర్జన్మలు తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. తండ్రి ఎంత డైరెక్టుగా తెలియజేస్తారు. ఇప్పుడు జయంతిని జరుపుకుంటారు, (ఈ 2026లో 90వ శివజయంతి అని వ్రాస్తారు). బాబా అవతరించి నేటికి 90 సంవత్సరాలు అయింది, వారితో పాటు బ్రహ్మా-విష్ణు-శంకరుల అవతరణ కూడా జరిగింది. త్రిమూర్తి బ్రహ్మా జయంతిని ఎవ్వరూ చూపించరు, కానీ తప్పకుండా చూపించాలి ఎందుకంటే బాబా అంటారు - నేను బ్రహ్మా ద్వారా మళ్ళీ స్థాపన చేస్తాను, బ్రాహ్మణులను తయారుచేస్తూ ఉంటాను. కనుక బ్రహ్మా మరియు బ్రాహ్మణ వంశీయుల జన్మ కూడా జరిగినట్లు. ఆ తర్వాత మీరే విష్ణుపురికి యజమానులుగా అవుతారని చూపిస్తాను. తండ్రి స్మృతి ద్వారానే మీ మాలిన్యము తొలగుతుంది. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది, కానీ దానిని ఎవరు నేర్పించారు అనేది ఎవరికీ తెలియదు. స్వయంగా బాబా అంటారు - ఓ పిల్లలూ, మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. వారసత్వము మీకు నా నుండి లభిస్తుంది. నేను మీ తండ్రిని. నేను కల్ప-కల్పము వస్తాను, వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తాను, ఎందుకంటే మీరు దేవీ-దేవతలుగా ఉండేవారు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పతితులుగా అయ్యారు, రావణుడి మతముపై నడుస్తున్నారు. ఈశ్వరీయ మతము ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు.

తండ్రి అంటారు - నేను కల్పక్రితము కూడా వచ్చాను. ఏదైతే గడుస్తుందో, అది కల్ప-కల్పము జరుగుతూనే ఉంటుంది. తండ్రి మళ్ళీ వచ్చి వీరిలో ప్రవేశిస్తారు, ఈ దాదాను విడిపిస్తారు. ఆ తర్వాత వీరందరి పాలన చేయిస్తారు. మేమే సత్యయుగములో ఉండేవారమని మీకు తెలుసు. భారతవాసులమైన మనమే 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. మొట్టమొదట మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజా నంబరువారుగా ఉండేవారు. అందరూ రాజులుగా అయితే అవ్వలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - సత్యయుగములో మీకు 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు ఉంటాయి... మేము ఈ పాత్రలను అభినయించామని స్వయము గురించి ఈ విధముగా అర్థం చేసుకోండి. మొదట సూర్యవంశీ రాజధానిలో పాత్రను అభినయించాము, ఆ తర్వాత చంద్రవంశములో అభినయించాము, ఆ తర్వాత కిందకు దిగుతూ వామ మార్గములోకి వచ్చాము, అప్పుడు మనము 63 జన్మలు తీసుకున్నాము. భారతవాసులే పూర్తి 84 జన్మలను తీసుకున్నారు, ఇతర ధర్మాలవారెవ్వరూ ఇన్ని జన్మలు తీసుకోరు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలు అయ్యింది, సుమారుగా వారికి 12-14 జన్మలు ఉండవచ్చు, ఈ లెక్కను తీయడము జరుగుతుంది. క్రిస్టియన్లు 2 వేల సంవత్సరాలలో 60 పునర్జన్మలు తీసుకుని ఉండవచ్చు, వృద్ధి జరుగుతూ ఉంటుంది, పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. మేమే 84 జన్మలు అనుభవించాము, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి అని బుద్ధితో ఈ విధముగా ఆలోచించండి. ఏదైతే గడిచిందో, అది డ్రామా. ఏ డ్రామా అయితే తయారై ఉందో, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మిమ్మల్ని అనంతమైన చరిత్రలోకి తీసుకువెళ్తారు. మీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు 84 జన్మలను పూర్తి చేసారు. ఇప్పుడు మళ్ళీ బాబా స్మృతినిప్పించారు - మీ ఇల్లు శాంతిధామము. ఆత్మ రూపము ఏమిటి? బిందువు. అక్కడ బిందువుల వృక్షము వలె ఉంటుంది. ఆత్మల వృక్షము కూడా నంబరువారుగా ఉంటుంది. నంబరువారుగా కిందకు రావలసి ఉంటుంది. పరమాత్మ కూడా బిందువు, అంతేకానీ ఎంతో పెద్ద లింగము వలె ఉంటారని కాదు. తండ్రి అంటారు, మీరు నా పిల్లలుగా అవుతారు, అప్పుడు నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను, మొదట మీరు నా వారిగా అవుతారు, అప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తాను. బాబా, మేము మీ వారము అని అంటారు. దానితో పాటు చదువుకోవాలి కూడా. నా వారిగా అయిన వెంటనే మీ చదువు మొదలైపోయింది.

తండ్రి అంటారు, ఇది మీ అంతిమ జన్మ, కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి. పిల్లలు ప్రతిజ్ఞ చేస్తారు - బాబా, మేము మీ నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఎప్పుడూ పతితులుగా అవ్వము, 63 జన్మలైతే పతితులుగా అయ్యాము. ఇది 84 జన్మల కథ. ఏ విధముగా లౌకిక తండ్రి తెలియజేస్తారో, అదే విధముగా బాబా వచ్చి సహజము చేసి తెలియజేస్తారు. వీరు అనంతమైన తండ్రి, వీరు వచ్చి ఆత్మలతో - పిల్లలూ, పిల్లలూ అని అంటూ మాట్లాడుతారు. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా. అర్ధకల్పము పగలు మరియు అర్ధకల్పము రాత్రి ఉంటుంది. ఇప్పుడు ఇది రాత్రి యొక్క అంతిమానికి మరియు పగలు యొక్క ఆదికి మధ్యన సంగమము. భారత్ సత్యయుగముగా ఉన్నప్పుడు పగలుగా ఉండేది. సత్య, త్రేతాయుగాలను బ్రహ్మా యొక్క పగలు అని అంటారు. మీరు బ్రాహ్మణులు కదా. ఇప్పుడిది మన రాత్రి అని బ్రాహ్మణులైన మీకు తెలుసు. భక్తి తమోప్రధానముగా ఉంది. అంతటా భ్రమిస్తూ ఉంటారు, అందరినీ పూజిస్తూ ఉంటారు. మూడు దారుల కూడలిని కూడా పూజిస్తారు. మనుష్యుల శరీరాలను కూడా పూజిస్తారు. సన్యాసులు తమను తాము శివోహమ్ అని అనుకుంటూ కూర్చుండిపోతారు, అప్పుడు మాతలు వెళ్ళి వారిని పూజిస్తారు. బాబా చాలా అనుభవజ్ఞులు. బాబా అంటారు, నేను కూడా చాలా పూజలు చేసాను, కానీ ఆ సమయములో జ్ఞానము లేదు, మనుష్యులపై పుష్పాలు అర్పించేవాడిని, అభిషేకాలు చేసేవాడిని. ఇది కూడా మోసమే కదా. కానీ ఇదంతా మళ్ళీ జరుగుతుంది. భక్తుల రక్షకుడు భగవంతుడు, ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ద్వాపరము నుండి మొదలుకుని మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు మరియు భక్తి మార్గములో దిగిపోతూ వచ్చారు. ఇప్పటికీ సాధువులైతే సాధన చేస్తూనే ఉన్నారు. తండ్రి అంటారు, వారిని కూడా నేను ఉద్ధరిస్తాను. సంగమములో మీ సద్గతి జరుగుతుంది, ఆ తర్వాత మీరు 84 జన్మలు తీసుకుంటారు. తండ్రిని జ్ఞాన సాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్-చిత్-ఆనంద స్వరూపుడు అని అంటారు. వారెప్పుడూ వినాశనమవ్వరు, వారిలో జ్ఞానముంది. తండ్రి జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, తప్పకుండా వారి నుండి వారసత్వము లభించాలి. ఇప్పుడు పిల్లలైన మీకు వారసత్వము లభిస్తోంది. శివబాబా ఉన్నారు కదా, వారు కూడా తండ్రి, వీరు (బ్రహ్మా) కూడా మీకు తండ్రి. శివబాబా బ్రహ్మా ద్వారా మిమ్మల్ని చదివిస్తారు, అందుకే ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలని అంటారు. ఎంత ఎక్కువ మంది బి.కె.లు ఉన్నారు. మాకు తాతగారి నుండి వారసత్వము లభిస్తుందని అంటారు. బాబా మమ్మల్ని నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారని పిల్లలంటారు. తండ్రి అంటారు, ఓ పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ తలపై ఏదైతే పాపాల భారముందో, అదంతా భస్మమైపోతుంది. అప్పుడు మీరు సతోప్రధానముగా అయిపోతారు. మీరు సత్యమైన బంగారముగా, సత్యమైన ఆభరణముగా ఉండేవారు. ఆత్మ మరియు శరీరము, రెండూ సతోప్రధానముగా ఉండేవి. ఆత్మ మళ్ళీ సతో, రజో, తమోగా అయినప్పుడు శరీరము కూడా అటువంటి తమోగుణము కలదే లభిస్తుంది. తండ్రి మీకు సలహానిస్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేయండి, ఓ పతిత-పావనా రండి, అని నన్ను పిలుస్తారు కదా. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము ప్రసిద్ధమైనది. దానిని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను - నాతో యోగము జోడించినట్లయితే మీ మాలిన్యము భస్మమైపోతుంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా మాలిన్యము తొలగుతూ ఉంటుంది. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినదే. జ్ఞానాన్ని అయితే తండ్రి ఇచ్చారు - సత్యయుగములో యథా రాజా రాణి తథా ప్రజా అందరూ పవిత్రముగా ఉండేవారు, ఇప్పుడు అందరూ పతితముగా ఉన్నారు. తండ్రి అంటారు, వీరి అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. వీరిని భాగ్యశాలి రథమని అంటారు. వీరు చదువుకుని మొదటి నంబరులోకి వెళ్తారు. నంబరువారుగా అయితే అవుతారు కదా, ముఖ్యమైన పేరు ఒక్కరిదే ఉంటుంది. తండ్రి పిల్లలకు 84 జన్మల రహస్యాన్ని మంచి రీతిలో అర్థం చేయించారు. మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, అంతేకానీ హిందూ ధర్మానికి చెందినవారు కాదు. మీరు కర్మ శ్రేష్ఠులుగా, ధర్మ శ్రేష్ఠులుగా ఉండేవారు. ఆ తర్వాత రావణుడు ప్రవేశించడముతో ధర్మ భ్రష్ఠులుగా, కర్మ భ్రష్ఠులుగా అయిపోయారు. తమను తాము దేవీ-దేవతలుగా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపిస్తుంది, అందుకే హిందూ అని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు, పతితులుగా అయ్యారు. 84 జన్మల చక్రము భారతవాసుల కోసమే ఉంది. అందరూ అయితే తిరిగి వెళ్ళాల్సిందే. మొదట మీరు వెళ్తారు. ఊరేగింపు వెళ్తుంది కదా, అలా. శివబాబాను ప్రియుడని కూడా అంటారు. ప్రేయసులైన మీరు ఈ సమయములో ఛీ-ఛీగా, తమోప్రధానముగా ఉన్నారు, మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసి తీసుకువెళ్తారు. ఆత్మలను పావనముగా తయారుచేసి తీసుకువెళ్తారు. వారిని లిబరేటర్ (ముక్తిప్రదాత), గైడ్ (మార్గదర్శకుడు) అని అంటారు. అనంతమైన తండ్రి తీసుకువెళ్తారు. వారి పేరేమిటి? శివబాబా. పేరు శరీరానికి ఉంటుంది, కానీ పరమాత్మకు శివ అన్న పేరే ఉంటుంది. బ్రహ్మా-విష్ణు-శంకరులకైతే సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. శివబాబాకైతే ఏ శరీరమూ లేదు, వారిని శివబాబా అనే అంటారు. పిల్లలంటారు - ఓ మాత-పితా, మేము మీ పిల్లలుగా అయ్యాము. ఇతరులైతే ఇంకా పిలుస్తూనే ఉంటారు, ఎందుకంటే వారికి తెలియదు. ఒకవేళ అందరికీ తెలిసిపోయినట్లయితే ఇక ఏమి జరిగిపోతుందో తెలియదు. దైవీ వృక్షానికి కూడా ఇప్పుడు అంటు కట్టబడుతుంది. వజ్రము నుండి గవ్వ వలె అవ్వడానికి 84 జన్మలు పడుతుంది. మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు రిపీట్ అవుతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు పూర్తి 84 జన్మలను తీసుకున్నారు. 84 లక్షల జన్మలైతే కాదు, ఇది పెద్ద పొరపాటు. 84 లక్షల జన్మలని అనుకున్న కారణముగా కల్పము ఆయువును లక్షల సంవత్సరాలు అనేసారు. భారత్ ఇప్పుడు అసత్య ఖండముగా ఉంది, సత్య ఖండములో మీరు సదా సుఖీగా ఉండేవారు. ఈ సమయములో మీరు 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటారు. అంతా మీ పురుషార్థముపైనే ఆధారపడి ఉంది. రాజధానిలో ఏ పదవిని కావాలనుకుంటే, ఆ పదవిని తీసుకోండి, ఇందులో ఇంద్రజాలము మొదలైన విషయమేమీ లేదు. మనుష్యుల నుండి దేవతలుగా అయితే తప్పకుండా అవుతారు. ఇదైతే మంచి ఇంద్రజాలమే కదా. మేము బాబా పిల్లలుగా అయ్యామని మీరు సెకండులో తెలుసుకుంటారు. కల్ప-కల్పము బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. అర్ధకల్పము భ్రమిస్తూ వచ్చారు, స్వర్గవాసులుగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని యోగ్యులుగా చేస్తారు. తప్పకుండా ఇక్కడ మహాభారత యుద్ధము జరిగింది, అప్పుడు మీకు రాజయోగాన్ని నేర్పించారు. శివబాబా అంటారు - నేనే వచ్చి మీకు నేర్పిస్తాను, అంతేకానీ క్రైస్టు కాదు. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ, తికమకపడకండి. మీరు భారతవాసులు. మీ ధర్మము చాలా సుఖము ఇచ్చేటటువంటిది, ఇతర ధర్మాలవారైతే వైకుంఠములోకి రాలేరు. ఈ డ్రామా అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఈ డ్రామా ఎప్పుడు తయారయ్యింది అనేది చెప్పలేము, దీనికి అంతము లేదు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. ఇది సంగమయుగము, చిన్నని యుగము. బ్రాహ్మణులు పిలక వంటివారు. తండ్రి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తున్నారు, కనుక బ్రహ్మాకు సంతానముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. మీకు తాతగారి నుండి వారసత్వము లభిస్తుంది. ఎప్పటివరకైతే స్వయాన్ని బి.కె.లుగా భావించరో, అప్పటివరకు వారసత్వము ఎలా లభించగలదు. అయినా సరే, ఎవరైనా ఎంతోకొంత జ్ఞానాన్ని వింటే, సాధారణ ప్రజలలోకి వస్తారు, రావడమైతే తప్పకుండా వస్తారు. శివబాబా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారు. గీత తప్ప ఇంకొక శాస్త్రమేదీ లేదు. గీతయే దైవీ ధర్మము యొక్క సర్వోత్తమమైన శాస్త్రము, దీని ద్వారా 3 ధర్మాలు స్థాపనవుతాయి. బ్రాహ్మణులుగా కూడా ఇక్కడే అవ్వాలి, దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి ఒక్కరి నిశ్చితమై ఉన్న పాత్రను తెలుసుకుని సదా నిశ్చింతగా ఉండాలి. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది... డ్రామా విషయములో స్థిరముగా ఉండాలి.

2. ఈ చిన్నని సంగమయుగములో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్మృతి బలముతో మాలిన్యాన్ని తొలగించుకుని స్వయాన్ని గవ్వ నుండి వజ్రము వలె తయారుచేసుకోవాలి. మధురమైన వృక్షము యొక్క అంటులోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వాలి.

వరదానము:-
ఒక్క తండ్రి స్మృతిలో సదా నిమగ్నమై ఉంటూ ఏకరస అవస్థను తయారుచేసుకునే సాక్షీ దృష్టా భవ

ఇప్పుడు ఎటువంటి పరీక్షలు రానున్నాయంటే, అవి సంకల్పములో కానీ, స్వప్నములో కానీ ఉండి ఉండవు. కానీ మీ అభ్యాసము ఎలా ఉండాలంటే, హద్దులోని డ్రామాను సాక్షీగా అయ్యి చూస్తున్నట్లుగా చూస్తూ ఉండాలి. అప్పుడు భయంకరమైన దృశ్యమైనా లేక హాస్యము కలిగించే దృశ్యమైనా ఏమీ తేడా అనిపించదు. అలాగే కొందరిది రమణీకమైన పాత్ర ఉండవచ్చు లేదా స్నేహీ ఆత్మకు గంభీరమైన పాత్ర ఉండవచ్చు... ప్రతి పాత్రను సాక్షీ దృష్టాగా అయ్యి చూడండి. ఏకరస అవస్థ ఉండాలి. కానీ అటువంటి అవస్థ ఎప్పుడు ఉంటుంది అంటే, సదా ఒక్క తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉన్నప్పుడు.

స్లోగన్:-
దృఢ నిశ్చయము ద్వారా మీ భాగ్యాన్ని నిశ్చితము చేసుకున్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

కర్మ చేసే కన్నా ముందు - మా విజయమైతే లభించే ఉంది, మేము అనేక కల్పాలు విజయులుగా అయ్యాము అన్న నిశ్చయాన్ని పెట్టుకోండి. అనేక కల్పాలు, అనేక సార్లు విజయులుగా అయ్యి విజయమాలలో కూర్చబడేవారిగా, పూజ్యనీయులుగా అయ్యారు, కావున ఇప్పుడు అదే రిపీట్ చేయాలి. ఇంతకుముందు జరిగి ఉన్న కర్మను మళ్ళీ రిపీట్ చేయాలి. అందుకే ఏమంటారంటే - ముందే తయారై సిద్ధముగా ఉంది... అని. తయారై సిద్ధముగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి ‘తయారై సిద్ధముగా ఉన్నదే మళ్ళీ చేస్తున్నాము’ అన్న సామెతను పూర్తి చేయాలి.