21-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆసురీ మతముపై నడవడం వల్ల చెల్లాచెదురైపోయారు, ఇప్పుడు ఈశ్వరీయ మతముపై నడిచినట్లయితే సుఖధామానికి వెళ్ళిపోతారు’’

ప్రశ్న:-
పిల్లలు తండ్రిపై ఏ ఆశను పెట్టుకోవచ్చు, ఏ ఆశను పెట్టుకోకూడదు?

జవాబు:-
మేము తండ్రి ద్వారా పవిత్రముగా అయి మా ఇంటికి మరియు రాజధానికి వెళ్ళాలి అన్న ఈ ఆశను మాత్రమే తండ్రిపై పెట్టుకోవచ్చు. బాబా అంటారు - పిల్లలూ, ఫలానావారు అనారోగ్యముగా ఉన్నారు, వారిని ఆశీర్వదించండి అనేటువంటి ఆశను నాపై పెట్టుకోకూడదు. ఇక్కడ కృప లేక ఆశీర్వాదము అనే విషయమే లేదు. నేను పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేసేందుకే వచ్చాను. ఇప్పుడు నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే, తద్వారా వికర్మలు జరగకుండా ఉంటాయి.

పాట:-
ఈ రోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని, తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది కూడా - ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా ఉంటారో అప్పుడే గుర్తుంటుంది. దేహాభిమానములో ఉంటే ఇది గుర్తుండదు కూడా. బాబా ఒక యాత్రికుడిలా వచ్చారని పిల్లలకు తెలుసు. మీరు కూడా యాత్రికుల వలె వచ్చారు. ఇప్పుడు మీ ఇంటిని మర్చిపోయారు. మళ్ళీ తండ్రి ఇంటిని గుర్తు తెప్పించారు మరియు ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎప్పటివరకైతే సతోప్రధానులుగా అవ్వరో అప్పటివరకు ఇంటికి వెళ్ళలేరు. బాబా నిజమే చెప్తున్నారని పిల్లలు భావిస్తారు. తండ్రి కూడా పిల్లలకు శ్రీమతము ఇస్తారు, అప్పుడు సుపుత్రులైన పిల్లలే దానిపై నడుస్తారు. మంచి మతాన్ని ఇచ్చే తండ్రి ఈ సమయములో ఇంకెవ్వరూ లేరు, అందుకే చెల్లాచెదురైపోయారు. శ్రీమతాన్ని ఇచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. వారి మతముపై కూడా కొందరు పిల్లలు నడవరు. ఇది ఆశ్చర్యము. లౌకిక తండ్రి మతముపై నడుస్తారు, అది ఆసురీ మతము. ఇది కూడా ఒక డ్రామాయే. కానీ బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు ఆసురీ మతముపై నడుస్తూ ఇటువంటి గతిని పొందారు, ఇప్పుడు ఈశ్వరీయ మతముపై నడిచినట్లయితే మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు. అది అనంతమైన వారసత్వము. తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. కావున పిల్లలు ఎంత హర్షితముగా ఉండాలి. అందరినీ అయితే ఇక్కడ కూర్చోబెట్టలేరు కదా. ఇంటిలో ఉంటూ కూడా స్మృతి చేయాలి. ఇప్పుడు పాత్ర పూర్తి కావస్తోంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనుష్యులు ఎంతగా మర్చిపోయి ఉన్నారు. ఇతడు తన ఇల్లు-వాకిళ్ళనే మర్చిపోయాడు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, ఇంటిని కూడా స్మృతి చేయండి, మీ రాజధానిని కూడా స్మృతి చేయండి. ఇప్పుడు ఇక పాత్ర పూర్తి కానున్నది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు ఈ విషయాన్ని మర్చిపోయారా ఏమిటి?

బాబా, డ్రామానుసారముగా మా పాత్రయే ఈ విధముగా ఉంది, మేము మా ఇళ్ళు-వాకిళ్ళను మర్చిపోయి పూర్తిగా భ్రమిస్తున్నాము అని పిల్లలైన మీరు ఈ విధముగా చెప్పవచ్చు. భారతవాసులే తమ శ్రేష్ఠ ధర్మాన్ని మరియు కర్మను మర్చిపోయి దైవీ ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. మీ ధర్మము, కర్మ ఇది అని ఇప్పుడు బాబా సావధానపరిచారు. అక్కడ మీరు ఏ కర్మలైతే చేసేవారో, అవి అకర్మలుగా అయ్యేవి. కర్మ, అకర్మ, వికర్మల గతిని తండ్రియే మీకు అర్థం చేయించారు. సత్యయుగములో కర్మలు అకర్మలుగానే అవుతాయి. రావణ రాజ్యములో కర్మలు వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి ధర్మ శ్రేష్ఠులుగా, కర్మ శ్రేష్ఠులుగా తయారుచేయడానికి వచ్చారు. కావున ఇప్పుడు శ్రీమతముపై శ్రేష్ఠ కర్మలను చేయాలి. భ్రష్ట కర్మలు చేసి ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. అది ఈశ్వరుని పిల్లల పని కాదు. ఏ డైరెక్షన్లు అయితే లభిస్తాయో, వాటిపై నడవాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. భోజనము కూడా శుద్ధమైనదే తీసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలా ఉంటే సలహా అడగండి. ఉద్యోగ వ్యవహారాలలో ఎక్కడైనా కొంత తినవలసి వస్తుందని కూడా అని బాబా అర్థం చేసుకుంటారు. యోగబలము ద్వారా మీరు రాజ్యాన్ని స్థాపన చేస్తారన్నప్పుడు, పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేస్తారన్నప్పుడు, మరి భోజనాన్ని శుద్ధముగా చేయడమనేది ఏమంత పెద్ద విషయము. ఉద్యోగమైతే చేయవలసిందే. తండ్రికి పిల్లలుగా అయ్యారంటే అన్నింటినీ వదిలేసి ఇక్కడకు వచ్చి కూర్చుండిపోవాలి అని కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఉండడానికి వీలు కాదు. అందరూ తమ గృహస్థ వ్యవహారాలలోనే ఉండాలి కానీ నేను ఒక ఆత్మను, బాబా వచ్చి ఉన్నారు, మనల్ని పవిత్రముగా తయారుచేసి మన ఇంటికి తీసుకువెళ్తారు, ఆ తర్వాత మనము రాజధానిలోకి వచ్చేస్తాము అని అర్థం చేసుకోవాలి. ఇది అయితే రావణుడి యొక్క ఛీ-ఛీ పరాయి రాజ్యము. డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు పూర్తిగా పతితులుగా అయిపోయారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని మేల్కొలిపేందుకు వచ్చాను కావున శ్రీమతముపై నడవండి. ఎంతగా శ్రీమతముపై నడుస్తారో అంతగా శ్రేష్ఠముగా అవుతారు.

ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, ఆ తండ్రినే మేము మర్చిపోయాము. ఇప్పుడు బాబా తీర్చిదిద్దేందుకు వచ్చారు కావున బాగా మారాలి కదా. ఎంతో సంతోషము కలగాలి. అనంతమైన తండ్రి లభించారు. ఏ విధముగా ఆత్మలైన మీరు పరస్పరము మాట్లాడుకుంటున్నారో, ఆ తండ్రి కూడా అదే విధముగా పిల్లలతో మాట్లాడుతారు. వాస్తవానికి వారు కూడా ఒక ఆత్మయే కదా. వారు పరమ ఆత్మ. వారికి కూడా పాత్ర ఉంది. ఆత్మలైన మీరు పాత్రధారులు. ఉన్నతోన్నతమైనవారి నుండి తక్కువలో తక్కువైనవారి వరకు పాత్ర ఉంది. ఈశ్వరుడే అంతా చేస్తారు అని భక్తి మార్గములో మనుష్యులు గానం చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, అనారోగ్యముగా ఉన్నవారిని నయం చేసే పాత్ర నాకు లేదు. నా పాత్ర ఏమిటంటే - మీరు పవిత్రముగా ఎలా అవ్వవచ్చు అనే దారిని చూపించడము. పవిత్రముగా అయితేనే మీరు ఇంటికి కూడా వెళ్ళగలరు, అలాగే రాజధానిలోకి కూడా వెళ్ళగలరు. నాపై ఇంకే ఆశా పెట్టుకోకండి. ఫలానావారు అనారోగ్యముగా ఉన్నారు, వారిని ఆశీర్వదించండి అని ఆశ పెట్టుకోకండి. అలా ఉండదు. ఆశీర్వాదము, కృప మొదలైన విషయాలు నా వద్ద ఏమీ లేవు. వాటి కొరకు సాధు-సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్ళండి. మీరు నన్ను పిలిచిందే - ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి, పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని. కావున తండ్రి అడుగుతున్నారు - నేను మిమ్మల్ని విషయ సాగరము నుండి బయటికి తీసి ఆవలి తీరానికి తీసుకువెళ్తున్నాను, మరి మీరు విషయ సాగరములో ఎందుకు చిక్కుకుంటారు. భక్తి మార్గములో మీ పరిస్థితి ఇలా అయ్యింది. జ్ఞానము, భక్తి మీ కొరకే ఉన్నాయి. సన్యాసులు కూడా జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని అంటారు. కానీ దాని అర్థమేమిటో వారికి తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది - జ్ఞానము, భక్తి, ఆ తరువాత వైరాగ్యము. కావున అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించేవారు కావాలి. తండ్రి అర్థం చేయించారు - ఇది ఒక స్మశానవాటిక, దీని తరువాత పరిస్తాన్ (స్వర్గము) తయారవ్వనున్నది. అక్కడ ప్రతి కర్మ అకర్మగా అవుతుంది. ఇప్పుడు బాబా మీకు ఎటువంటి కర్మలను నేర్పిస్తున్నారంటే, తద్వారా ఎటువంటి వికర్మలు జరగకుండా ఉంటాయి. మీరు ఎవరికి దుఃఖము ఇవ్వకూడదు. పతితుల భోజనాన్ని తినకండి. వికారాలలోకి వెళ్ళకండి. ఈ విషయములోనే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. మాయ విఘ్నాలు ఎలా వస్తుంటాయో మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ గుప్తముగా ఉంటాయి. దేవతలు మరియు అసురుల యుద్ధము జరిగిందని అంటారు. అలాగే పాండవులు మరియు కౌరవుల యుద్ధము జరిగిందని అంటారు. వాస్తవానికి ఈ రెండు యుద్ధాలు ఒకటే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను భవిష్య 21 జన్మల కొరకు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఇది మృత్యులోకము. మనుష్యులు సత్యనారాయణుని కథను వింటూ వచ్చారు కానీ దాని వల్ల లాభమేమీ లేదు. ఇప్పుడు మీరు సత్యమైన గీతను వినిపిస్తారు. రామాయణము కూడా మీరు సత్యమైనది వినిపిస్తారు. అది ఒక్క రాముడు, ఒక్క సీత యొక్క విషయము కాదు. ఈ సమయములోనైతే మొత్తం ప్రపంచమంతా ఒక లంకలా ఉంది. నలువైపులా నీరు ఉంది కదా. ఇది అనంతమైన లంక, ఇందులో రావణుడి రాజ్యము ఉంది. తండ్రి ఒక్కరే వరుడు, మిగిలినవారంతా వధువులే. మిమ్మల్ని ఇప్పుడు రావణ రాజ్యము నుండి తండ్రి విముక్తులుగా చేస్తారు. ఇది ఒక శోకవాటిక. సత్యయుగాన్ని అశోకవాటిక అని అంటారు. అక్కడ ఏ విధమైన శోకము ఉండదు. ఈ సమయములోనైతే అంతా శోకమే శోకము ఉంది. శోకము లేనివారు ఒక్కరు కూడా ఉండరు. అశోకా హోటల్ అని పేరైతే పెట్టుకుంటారు. తండ్రి అంటారు, మొత్తం ప్రపంచాన్ని ఈ సమయములో ఒక అనంతమైన హోటల్ గానే భావించండి. ఇది శోక హోటల్. మనుష్యుల ఆహార-పానీయాలు జంతువుల వలె ఉన్నాయి. తండ్రి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చూడండి. సత్యాతి-సత్యమైన అశోకవాటిక సత్యయుగము. హద్దులోని మరియు అనంతమైన విషయాలకు మధ్యన వ్యత్యాసాన్ని తండ్రియే తెలియజేస్తారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉండాలి. బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మనది కూడా అదే వ్యాపారము - అందరికీ దారిని తెలియజేయడము మరియు అంధులకు చేతికర్రగా అవ్వడము. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఏ విధముగా స్కూల్లో కూడా - ఇది ఫలానా దేశము అని చిత్రాలపై అర్థం చేయిస్తారో, అలా మీరు కూడా - మీరు ఒక ఆత్మ, అంతేకానీ శరీరము కాదు అని చిత్రాలపై అర్థం చేయిస్తారు. ఆత్మలు పరస్పరము సోదరులు. ఎంత సహజమైన విషయాన్ని వినిపిస్తారు. మనమందరమూ సోదరులము అని వారు అంటారు కూడా. తండ్రి అంటారు, ఆత్మలైన మీరందరూ పరస్పరము సోదరులే కదా. మీరు గాడ్ ఫాదర్ అని అంటారు కదా. కావున ఎప్పుడూ పరస్పరము గొడవపడటము, కొట్లాడటము చేయకూడదు. శరీరధారులుగా అయితే సోదరీ-సోదరులుగా అవుతారు. శివబాబా పిల్లలమైన మనమందరమూ పరస్పరము సోదరులము. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలుగా మనము సోదరీ-సోదరులము. మనము వారసత్వాన్ని తాతగారి నుండి తీసుకోవాలి, అందుకే తాతగారినే స్మృతి చేయాలి. ఈ బిడ్డను (బ్రహ్మాను) కూడా నేను నా వాడిగా చేసుకున్నాను మరియు ఇతనిలోకి ప్రవేశించాను. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు కొత్త దైవీ ప్రవృత్తి మార్గము స్థాపన అవుతోంది. బి.కె.లైన మీరంతా శివబాబా మతముపై నడుస్తారు. బ్రహ్మా కూడా వారి మతముపైనే నడుస్తారు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు సర్వ సంబంధాలను తేలికగా చేసుకుంటూ వెళ్ళండి. ఎనిమిది గంటలు స్మృతిలో ఉండాలి, మిగిలిన 16 గంటలలో విశ్రాంతి తీసుకోవడము లేక వ్యాపార-వ్యవహారాలు ఏవైతే చేసుకోవాలో, అవి చేసుకోండి. నేను బాబాకు బిడ్డను అన్న విషయాన్ని మర్చిపోకండి. అలాగని ఇక్కడకు వచ్చి హాస్టల్లో ఉండాలని కాదు. అలా కాదు. గృహస్థ వ్యవహారములో పిల్లా-పాపలతోనే ఉండాలి. బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారు. మధుబన్ యొక్క సాక్షాత్కారాన్ని పొందేందుకని మథుర, వృందావనానికి వెళ్తారు. అక్కడ చిన్న మోడల్ రూపములో ఆ దృశ్యాలను తయారుచేసి ఉంచారు. ఇప్పుడు ఈ అనంతమైన విషయము అర్థం చేసుకోవలసినది. శివబాబా బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచిస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మా సంతానమైన మనము బి.కె.లము. వికారాల విషయము ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సన్యాసులకు శిష్యులుగా అవుతారు, ఒకవేళ వారు సన్యాసుల వస్త్రాలను ధరించినట్లయితే పేరు మారుతుంది. ఇక్కడ కూడా మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు కావున బాబా మీకు పేర్లు పెట్టారు కదా. భట్టీలో ఎంతమంది ఉండేవారు. ఈ భట్టీ గురించి ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలోనైతే ఏవేవో విషయాలను వ్రాసారు, మళ్ళీ అదే విధముగా జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి చక్రము తిరుగుతుంది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారి కదా. వారికి సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. బాబాకు అయితే తన శరీరము కూడా లేదు. మీకు అయితే స్థూల శరీరము ఉంది. వారు పరమ ఆత్మ. ఆత్మయే స్వదర్శన చక్రధారి కదా. ఇప్పుడు ఆత్మకు ఈ అలంకారాలను ఎలా ఇవ్వాలి? ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు. తండ్రి అంటారు, వాస్తవానికి నేను స్వదర్శన చక్రధారిని. ఆత్మలో మొత్తము సృష్టి చక్రపు జ్ఞానమంతా వచ్చేస్తుందని మీకు తెలుసు. బాబా కూడా పరంధామ నివాసి, మనము కూడా అక్కడి నివాసులమే. తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు - పిల్లలూ, నేను కూడా స్వదర్శన చక్రధారినే. పతిత-పావనుడినైన నేను మీ వద్దకు వచ్చాను. మీరు వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేయండి, విముక్తులుగా చేయండి అనే నన్ను పిలిచారు. వారికి శరీరమైతే లేదు, వారు అజన్ముడు. వారు జన్మ తీసుకుంటారు కానీ అది దివ్య జన్మ. శివజయంతి లేక శివరాత్రిని జరుపుకుంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో అప్పుడే నేను వస్తాను, నేను పగలుగా తయారుచేయడానికి వస్తాను. పగలులో 21 జన్మలు తీసుకుంటారు, రాత్రిలో 63 జన్మలు తీసుకుంటారు. ఆత్మయే భిన్న-భిన్న జన్మలు తీసుకుంటుంది. ఇప్పుడు పగలు నుండి రాత్రిలోకి వచ్చారు, మళ్ళీ పగలులోకి వెళ్ళాలి. స్వదర్శన చక్రధారులుగా కూడా మిమ్మల్నే తయారుచేసారు. ఈ సమయములో నాకు ఈ పాత్ర ఉంది. మిమ్మల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తాను. అలా మీరు ఇతరులను తయారుచేయండి. 84 జన్మలు ఎలా తీసుకున్నారు అని ఆ 84 జన్మల చక్రాన్ని అయితే అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానముండేదా? అస్సలు లేదు. అజ్ఞానులుగా ఉండేవారు. బాబా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు, అదేమిటంటే - బాబా స్వదర్శన చక్రధారి, వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. వారు సత్యము, చైతన్యము. పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు పరస్పరము గొడవపడకండి, కొట్లాడకండి, ఉప్పునీరులా అవ్వకండి. సదా హర్షితముగా ఉండాలి మరియు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రినే అందరూ మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నిరాకార ఆత్మల కొరకు నిరాకారుడైన భగవంతుని ఉవాచ. వాస్తవానికి మీరు నిరాకారులే, తర్వాత సాకారులుగా అవుతారు. సాకారిగా అవ్వకుండానైతే ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోతే ఇక ఏ కదలిక ఉండదు. ఆత్మ వెంటనే వెళ్ళిపోయి ఇంకొక శరీరములో తన పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి, లోలోపల అభ్యాసము చేస్తూ ఉండండి. ఆత్మ అయిన మనము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. సత్యయుగపు వారసత్వము లభిస్తుంది. తప్పకుండా తండ్రియే భారత్ కు వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. ఆ వారసత్వాన్ని ఎప్పుడు ఇచ్చారు మరియు ఆ తర్వాత ఏమైంది, ఇది మనుష్యులకు అసలేమీ తెలియదు. ఇప్పుడు తండ్రి అంతా తెలియజేస్తారు. పిల్లలైన మిమ్మల్నే స్వదర్శన చక్రధారులుగా తయారుచేసాను, ఆ తర్వాత మీరు 84 జన్మలు అనుభవించారు, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను. ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయండి మరియు మధురముగా అవ్వండి. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. తండ్రి వకీలులకే వకీలు, వారు అన్ని గొడవల నుండి విడిపించేస్తారు. పిల్లలైన మీకు ఆంతరిక సంతోషము ఎంతగానో ఉండాలి. మనము బాబాకు పిల్లలుగా అయ్యాము. బాబా వారసత్వము ఇవ్వడానికి మనల్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడికి మీరు వచ్చేదే వారసత్వాన్ని తీసుకోవడానికి. తండ్రి అంటారు - పిల్లా-పాపలు మొదలైనవారిని చూసుకుంటూ బుద్ధి తండ్రి వైపు మరియు రాజధాని వైపు ఉండాలి. ఈ చదువు ఎంత సహజమైనది. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని మీరు మర్చిపోతారా. మొదట స్వయాన్ని ఆత్మగా అయితే తప్పకుండా భావించండి. ఈ జ్ఞానాన్ని తండ్రి సంగమములోనే ఇస్తారు ఎందుకంటే సంగమములోనే మీరు పతితుల నుండి పావనులుగా అవ్వాలి.

అచ్ఛా, మధురాతి మధురమైన బ్రహ్మా ముఖవంశావళి ఆత్మిక బ్రాహ్మణ కులభూషణులారా, ఇది దేవతల కన్నా ఉన్నతమైన కులము. మీరు భారత్ కు చాలా ఉన్నతమైన సేవను చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు పూజారులను పూజ్యులుగా, గవ్వ సమానమైనవారిని వజ్రతుల్యముగా తయారుచేస్తున్నారు. ఇటువంటి ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతముపై ఇప్పుడు ప్రతి కర్మను శ్రేష్ఠముగా చేయాలి, ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. తండ్రి ఇచ్చే డైరెక్షన్లపైనే నడవాలి.

2. సదా హర్షితముగా ఉండేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎప్పుడూ ఉప్పునీరులా అవ్వకూడదు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. చాలా-చాలా మధురముగా తయారవ్వాలి.

వరదానము:-
గౌరవాన్ని అడిగేందుకు బదులుగా అందరికీ గౌరవాన్ని ఇచ్చే సదా నిష్కామ యోగీ భవ

మీకు ఎవరైనా గౌరవాన్ని ఇచ్చినా, మిమ్మల్ని స్వీకరించినా, స్వీకరించకపోయినా, మీరు వారిని మధురమైన సోదరులుగా, మధురమైన సోదరీలుగా భావిస్తూ సదా స్వమానములో ఉంటూ స్నేహీ దృష్టితో, స్నేహ వృత్తితో ఆత్మిక గౌరవాన్ని ఇస్తూ వెళ్ళండి. వీరు గౌరవము ఇస్తే నేను ఇస్తాను - ఇది కూడా రాయల్ బికారీతనమే. ఇందులో నిష్కామ యోగులుగా అవ్వండి. ఆత్మిక స్నేహపు వర్షము ద్వారా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోండి. మీపైకి ఎవరైనా రాళ్ళు విసిరినా సరే, మీరు మాత్రము వారికి రత్నాలనే ఇవ్వండి, ఎందుకంటే మీరు రత్నాకరుడైన తండ్రికి పిల్లలు.

స్లోగన్:-
విశ్వ నవ నిర్మాణము చేసేందుకు రెండు పదాలను గుర్తు పెట్టుకోండి - నిమిత్తము మరియు నిర్మానము.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

సేవలో సఫలతకు ముఖ్య సాధనము - త్యాగము మరియు తపస్య. ఇటువంటి త్యాగులు మరియు తపస్వీలను అనగా సదా బాబా యొక్క లగనములో లవలీనులై ఉన్నవారిని, ప్రేమ సాగరములో ఇమిడిపోయి ఉన్నవారిని, జ్ఞానము, ఆనందము, సుఖము, శాంతి సాగరములో నిమగ్నమై ఉన్నవారిని తపస్వి అని అంటారు. ఇటువంటి త్యాగము, తపస్య కలవారినే సత్యమైన సేవాధారి అని అంటారు.