25-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు మహావీరులు, మీరు మాయా తుఫానులకు భయపడకూడదు, ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ పట్టించుకోకుండా పవిత్రముగా తప్పకుండా అవ్వాలి’’

ప్రశ్న:-
పిల్లలలో ఏ ధైర్యము నిలిచి ఉన్నట్లయితే వారు చాలా ఉన్నతమైన పదవిని పొందగలరు?

జవాబు:-
శ్రీమతముపై నడుస్తూ పవిత్రముగా అయ్యే ధైర్యము. ఎన్ని గొడవలు జరిగినా కానీ, కష్టాలు సహించవలసి వచ్చినా కానీ, పవిత్రముగా తయారయ్యేందుకు తండ్రి ఏదైతే శ్రేష్ఠ మతాన్ని ఇచ్చారో, దానిపై నిరంతరము నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఏ విషయములోనూ భయపడకూడదు, ఏమి జరిగినా కానీ - నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు).

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
ఇది భక్తి మార్గము వారి పాట. జ్ఞాన మార్గములో పాటలు మొదలైనవాటి అవసరమేమీ లేదు ఎందుకంటే తండ్రి నుండి మనకు అనంతమైన వారసత్వము లభించనున్నదని అంటూ ఉంటారు. భక్తి మార్గము యొక్క ఆచారాలు-పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అవి ఇందులోకి రాలేవు. పిల్లలు కవితలు మొదలైనవి కూడా ఇతరులకు వినిపించేందుకని తయారుచేస్తారు. వాటి అర్థాన్ని కూడా మీరు అర్థం చేయించనంత వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు కావున సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి. తండ్రి 84 జన్మల చక్రము యొక్క జ్ఞానాన్ని కూడా వినిపించారు. మేము ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యాము, తండ్రి నుండి విష్ణుపురి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము - అని సంతోషముండాలి. నిశ్చయబుద్ధి కలవారే విజయంతి. ఎవరికైతే నిశ్చయముంటుందో, వారు సత్యయుగములోకైతే తప్పకుండా వెళ్తారు. కావున పిల్లలకు సదా సంతోషముండాలి - ఫాలో ఫాదర్. నిరాకార శివబాబా వీరిలో ప్రవేశించినప్పటి నుండి పెద్ద గొడవలు జరిగాయని పిల్లలకు తెలుసు. పవిత్రత విషయములో చాలా గొడవలు జరిగాయి. పిల్లలు పెద్దవారైతే, త్వరగా వివాహము చేసుకోండి, వివాహము చేసుకోకపోతే ఎలా అవుతుంది అని అంటారు. మనుష్యులు గీతను చదువుతారు కానీ దాని నుండి ఏమీ అర్థం చేసుకోరు. అందరికన్నా ఎక్కువగా బాబాకు అభ్యాసముండేది. ఒక్క రోజు కూడా గీతను చదవడము మిస్ చేసేవారు కాదు. గీతా భగవానుడు శివుడని తెలిసిన తర్వాత, నేను విశ్వానికి యజమానిగా అవుతానని నషా కలిగింది. ఇది శివ భగవానువాచ. ఆ తర్వాత పవిత్రత విషయములో కూడా చాలా గొడవలు జరిగాయి. ఇందులో ధైర్యము కావాలి కదా. మీరే మహావీరులు, మహావీరనీలు. ఒక్కరిని తప్ప ఇంకెవ్వరినీ లెక్క చేయవలసిన అవసరము లేదు. పురుషుడు రచయిత. రచయిత స్వయము పావనముగా అయినప్పుడు రచనను కూడా పావనముగా చేస్తాడు. కేవలం ఈ విషయము గురించే చాలామందితో గొడవలు అయ్యాయి. గొప్ప-గొప్ప ఇళ్ళ నుండి బయటకు వచ్చేశారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఎవరి భాగ్యములోనైతే లేదో, వారు ఎలా అర్థం చేసుకుంటారు. పవిత్రముగా ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పండి. అంతటి ధైర్యము కావాలి కదా. బాబా ఎదురుగా ఎన్ని గొడవలు జరిగాయి. బాబాను ఎప్పుడైనా చింతించడము చూశారా? అమెరికా వరకు వార్తాపత్రికలలో ప్రచురించారు. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఇది కల్పక్రితము వలె జరుగుతుంది, ఇందులో భయపడే విషయమేముంది. మనమైతే మన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మన రచనను రక్షించాలి. ఈ సమయములో మొత్తం రచన అంతా పతితముగా ఉందని తండ్రికి తెలుసు. నేనే అందరినీ పావనముగా చేయాలి. ఓ పతిత-పావనా, ముక్తిదాతా రండి అని అందరూ తండ్రినే పిలుస్తారు కనుక వారికే దయ కలుగుతుంది. వారు దయార్ద్ర హృదయుడు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఏ విషయములోనూ భయపడకండి. భయపడడము వలన అంతటి ఉన్నత పదవిని పొందలేరు. మాతలపైనే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది వస్త్రాపహరణం చేసారు అనేది దీనికే గుర్తు. తండ్రి 21 జన్మల కొరకు వివస్త్రగా అవ్వడము నుండి రక్షిస్తారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. ఈ సృష్టి పాతదిగా, పతితముగా, తమోప్రధానముగా అవ్వాల్సిందే. ప్రతి వస్తువు కొత్తది నుండి మళ్ళీ పాతదిగా తప్పకుండా అవ్వనున్నది. పాత ఇంటిని వదిలిపెట్టాల్సే ఉంటుంది. కొత్త ప్రపంచము బంగారు యుగము, పాత ప్రపంచము ఇనుప యుగము... ప్రపంచము సదా కొత్తగా ఉండదు. ఇది సృష్టి చక్రమని పిల్లలైన మీకు తెలుసు. దేవీ-దేవతల రాజ్యము మళ్ళీ స్థాపనవుతోంది. నేను మళ్ళీ మీకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తాను అని తండ్రి కూడా అంటారు. ఇక్కడ రావణ రాజ్యములో దుఃఖముంది. రామ రాజ్యమని దేనినంటారు అనేది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, నేను స్వర్గాన్ని అంటే రామ రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. పిల్లలైన మీరు అనేక సార్లు రాజ్యము తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలోనూ ఉంది. 21 జన్మలు మనము సత్యయుగములో ఉంటాము, దానిని 21 తరాలు అని అంటారు అంటే వృద్ధ అవస్థకు చేరుకున్నప్పుడు శరీరాన్ని వదిలేస్తారు. అకాలమృత్యువు ఎప్పుడూ జరగదు. ఇప్పుడు మీరు త్రికాలదర్శుల వలె అయ్యారు. శివబాబా ఎవరు అనేది మీకు తెలుసు. శివుని మందిరాలను కూడా ఎన్నో నిర్మించారు. మూర్తినైతే ఇంటిలో కూడా పెట్టుకోవచ్చు కదా. కానీ భక్తి మార్గము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుని మూర్తిని లేదా శివుని మూర్తిని ఇంటిలో కూడా పెట్టుకోవచ్చు. విషయము ఒక్కటే కదా. మరి అంత దూరదూరాల వరకు ఎందుకు వెళ్తారు. వారి వద్దకు వెళ్తే శ్రీకృష్ణపురి యొక్క వారసత్వము ఏమైనా లభిస్తుందా. జన్మజన్మలుగా మనము భక్తి చేస్తూ వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. రావణ రాజ్యము యొక్క ఆర్భాటము కూడా ఎంతగా ఉందో చూడండి. ఇది చివరి సమయములోని ఆర్భాటము. రామ రాజ్యమైతే సత్యయుగములో ఉండేది. అక్కడ ఈ విమానాలు మొదలైనవన్నీ ఉండేవి, తర్వాత అవన్నీ మాయమైపోయాయి. మళ్ళీ ఈ సమయములో అవన్నీ వెలువడ్డాయి. ఇప్పుడు వారు ఇవన్నీ నేర్చుకుంటున్నారు, నేర్చుకునేవారు ఎవరైతే ఉన్నారో, వారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు. అక్కడికి వచ్చి మళ్ళీ విమానాలను తయారుచేస్తారు. ఇవి భవిష్యత్తులో మీకు సుఖాన్ని ఇచ్చే వస్తువులు. ఈ సైన్స్ మీకు తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సైన్స్ దుఃఖము కోసమే ఉంది, తర్వాత అక్కడ సుఖము కోసం ఉంటుంది. ఇప్పుడు స్థాపన అవుతోంది. తండ్రి కొత్త ప్రపంచము కోసం రాజధానిని స్థాపన చేస్తున్నారు కావున పిల్లలైన మీరు మహావీరులుగా అవ్వాలి. భగవంతుడు వచ్చి ఉన్నారని ప్రపంచములోని వారికెవ్వరికీ తెలియదు.

తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి, ఇందులో భయపడే విషయమేమీ లేదు. మహా అయితే తిడతారు. నిందలైతే బాబాకు కూడా చాలా వచ్చాయి. అందుకే శ్రీకృష్ణుడు నిందలు పడినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు నిందలు పడరు. నిందలు కలియుగములోనే ఉంటాయి. ఇప్పుడు మీకు ఏ రూపమైతే ఉందో, అది కల్పము తర్వాత మళ్ళీ ఈ సమయములో ఉంటుంది. ఈ రూపము మధ్యలో ఎప్పుడూ ఉండదు. ప్రతి జన్మలోనూ ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి, ఈ డ్రామా నిశ్చితమై ఉంది. 84 జన్మలలో ఏ ముఖ కవళికలతో జన్మలు తీసుకున్నారో, మళ్ళీ అలాగే తీసుకుంటారు. బాబా యొక్క ఈ ముఖ కవళికలు మారి మరుసటి జన్మలో లక్ష్మీ-నారాయణుల ముఖ కవళికలు ఏర్పడతాయని మీకు ఇప్పుడు తెలుసు. మీ బుద్ధి తాళము ఇప్పుడు తెరుచుకుంది. ఇది కొత్త విషయము. బాబా కూడా కొత్తవారే, విషయాలు కూడా కొత్తవే. ఈ విషయాలు ఎవ్వరికీ త్వరగా అర్థం కావు. భాగ్యములో ఉంటే కొద్దిగా అర్థం చేసుకుంటారు. ఇకపోతే, ఎవరైతే ఎన్ని తుఫానులు వచ్చినా సరే కదలరో, వారిని మహావీరులు అంటారు. ఇప్పుడింకా ఆ అవస్థ లేదు. కానీ తప్పకుండా ఏర్పడనున్నది. మహావీరులు ఏ తుఫానులకూ భయపడరు. ఆ అవస్థ చివరిలో ఏర్పడనున్నది, అందుకే అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలనే అడగండి అని అంటూ ఉంటారు. పిల్లలైన మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా చేయడానికి తండ్రి వచ్చారు. కల్పక్రితము వలె నరకము యొక్క వినాశనము జరగాల్సిందే. సత్యయుగములోనైతే ఒకే ధర్మముంటుంది. ఏకత, ఏక ధర్మము ఉండాలని కోరుకుంటారు కూడా. రామ రాజ్యము, రావణ రాజ్యము వేర్వేరు అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రిపై పూర్తి నిశ్చయము ఉన్నట్లయితే మరి శ్రీమతముపై నడవవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి నాడిని చూడడము జరుగుతుంది. దాని అనుసారముగా సలహా కూడా ఇవ్వడము జరుగుతుంది. బాబా కూడా వారి కుమారుడితో ఇలా అన్నారు - ఒకవేళ వివాహము చేసుకోవాలనుకుంటే వెళ్ళి చేసుకో, చాలామంది మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కూర్చున్నారు, వాళ్ళు వివాహము చేయించేస్తారు, ఆ సమయములో వివాహము చేయించేందుకు ఎవరో ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరి నాడిని చూడడము జరుగుతుంది. బాబా, ఇదీ పరిస్థితి, మేము పవిత్రముగా ఉండాలనుకుంటున్నాము, మా సంబంధీకులు మమ్మల్ని ఇంటి నుండి పంపించేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని పిల్లలు అడుగుతారు. అరే, ఇది కూడా అడుగుతారా, పవిత్రముగా ఉండాలి, ఒకవేళ ఉండలేకపోతే వెళ్ళి వివాహము చేసుకోండి. అచ్ఛా, ఎవరిదైనా నిశ్చితార్థము జరిగిందనుకోండి, అవతలి వారిని ఒప్పించాలి, పర్వాలేదు. ముడి వేసే సమయములో ఈ పతి నీకు గురువు అని చెప్తారు. అచ్ఛా, మీరు ఆమె చేత వ్రాయించండి - నేను నీకు గురువును, ఈశ్వరుడిని అని నీవు నమ్ముతున్నావా, అయితే రాయు అని చెప్పండి. అచ్ఛా, ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, పవిత్రముగా ఉండాలి. ధైర్యము కావాలి కదా. గమ్యము చాలా ఉన్నతమైనది. ప్రాప్తి చాలా గొప్పది. ప్రాప్తి గురించి తెలియనప్పుడే కామము యొక్క అగ్ని అంటుకుంటుంది. తండ్రి అంటారు - ఇంత గొప్ప ప్రాప్తి కలుగుతున్నప్పుడు ఒక్క జన్మ పవిత్రముగా ఉంటే అది ఏమంత పెద్ద విషయము. నేను నీ పతిని, ఈశ్వరుడిని, నా ఆజ్ఞపై పవిత్రముగా ఉండవలసి ఉంటుంది అని చెప్పండి. బాబా యుక్తులను తెలియజేస్తున్నారు. భారత్ లో ఈ నియమము ఉంది - స్త్రీకి చెప్తారు, నీ పతి ఈశ్వరుడు, అతని ఆజ్ఞపై నడుచుకోవాలి అని. పతి పాదాలను ఒత్తాలి ఎందుకంటే లక్ష్మి కూడా నారాయణుడి పాదాలను ఒత్తారని భావిస్తారు కదా. ఆ అలవాటు ఎక్కడ నుండి వెలువడింది. భక్తి మార్గపు చిత్రాల నుండి. సత్యయుగములోనైతే ఇటువంటి విషయాలుండవు. లక్ష్మి, నారాయణుడి పాదాలను ఒత్తడానికి అసలు అతను ఎప్పుడైనా అలసిపోతారా. అలసిపోయే విషయమే ఉండదు. ఇది దుఃఖపు విషయము అవుతుంది. అక్కడ దుఃఖము, నొప్పి ఎక్కడ నుండి వస్తాయి. అందుకే బాబా, ఫోటో నుండి లక్ష్మి చిత్రాన్ని తొలగించారు. బాబాకు నషా అయితే ఎక్కుతుంది కదా. వారికి బాల్యము నుండే వైరాగ్యముండేది, అందుకే చాలా భక్తి చేసేవారు. కావున బాబా చాలా యుక్తులను తెలియజేస్తున్నారు. మనము ఒక్క తండ్రికి పిల్లలము కావున పరస్పరము సోదరీ-సోదరులము అయ్యామని మీకు తెలుసు. తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఓ పతిత-పావనా, సీతలందరి రామా అని తండ్రిని పతిత ప్రపంచములోనే పిలుస్తారు. తండ్రిని సత్యము అని అంటారు. వారు సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు. వారే మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల సత్యమైన జ్ఞానాన్ని మీకు ఇస్తారు. ఇప్పుడు మీ ఆత్మ కూడా జ్ఞాన సాగరునిగా అవుతుంది.

మేము బాబా శ్రీమతముపై నడవాలని మధురమైన పిల్లలు ధైర్యమును ఉంచాలి. అనంతమైన తండ్రి అనంతమైన రచనను స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. కావున పురుషార్థము చేసి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. బలిహారమవ్వాలి. మీరు వారిని మీ వారసునిగా చేసుకుంటే వారు మీకు 21 జన్మల కొరకు వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. పిల్లలంటారు - బాబా, ఈ తనువు-మనసు-ధనము అన్నీ మీవే, మీరు తండ్రి కూడా, కొడుకు కూడా. త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ... అని పాడుతారు కూడా. ఆ ఒక్కరి మహిమ ఎంత గొప్పది. వారినే సర్వుల దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు. సత్యయుగములో 5 తత్వాలు కూడా సుఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కలియుగములో 5 తత్వాలు కూడా తమోప్రధానమైన కారణముగా దుఃఖమునిస్తాయి. అక్కడైతే సుఖమే ఉంటుంది. ఈ డ్రామా తయారై ఉంది. ఇది అదే 5 వేల సంవత్సరాల క్రితము జరిగిన యుద్ధమని మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. కావున పిల్లలు సదా సంతోషముగా ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, ఇక పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరిస్తారు కూడా, చదివిస్తారు కూడా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా తండ్రి సమానముగా అయ్యే ధైర్యమును ఉంచాలి. తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి.

2. ఏ విషయములోనూ భయపడకూడదు. పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-
సమస్యలను ఎక్కే కళకు సాధనముగా అనుభవం చేస్తూ సదా సంతుష్టముగా ఉండే శక్తిశాలీ భవ

శక్తిశాలి ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు సమస్యలను ఎలా దాటివేస్తారంటే, ఏదైనా మంచిగా, నేరుగా ఉన్న దారిని సహజముగా దాటివేసినట్లు దాటివేస్తారు. సమస్యలు వారి కొరకు ఎక్కే కళకు సాధనముగా అవుతాయి. ప్రతి సమస్య తెలిసినట్లుగానే అనుభవమవుతుంది. వారు ఎప్పుడూ ఆశ్చర్యవంతులుగా అవ్వరు. సదా సంతుష్టముగా ఉంటారు. నోటి నుండి ఎప్పుడూ కారణము అన్న పదము వెలువడదు, అదే క్షణములో కారణమును నివారణలోకి మార్చివేస్తారు.

స్లోగన్:-
స్వ-స్థితిలో స్థితులై సర్వ పరిస్థితులను దాటివేయటమే శ్రేష్టత.

మాతేశ్వరిగారి అమూల్య మహావాక్యాలు -

‘‘పరమార్థము ద్వారా వ్యవహారము స్వతహాగా నిరూపణ అవుతుంది’’

భగవానువాచ ఏమిటంటే - మీరు నా ద్వారా పరమ అర్థాన్ని తెలుసుకున్నట్లయితే నా పరమ పదవిని ప్రాప్తి చేసుకుంటారు అనగా పరమార్థాన్ని తెలుసుకున్నట్లయితే వ్యవహారము నిరూపణ అవుతుంది. చూడండి, దేవతల ముందు ప్రకృతి అయితే పాద దాసిగా అయ్యి ఉంటుంది, ఈ పంచ తత్వాలు సుఖ స్వరూపముగా అయ్యి మనసు కోరుకునే సేవ చేస్తాయి. ఈ సమయములో చూడండి, మనసు కోరుకున్న సుఖము లభించని కారణముగా మనుష్యులకు దుఃఖము, అశాంతి కలుగుతూ ఉంటాయి. సత్యయుగములోనైతే ఈ ప్రకృతి మర్యాదపూర్వకముగా ఉంటుంది. చూడండి, దేవతల జడ చిత్రాలకే ఎన్నో వజ్ర-వైఢూర్యాలను ధరింపజేస్తారు, మరి చైతన్యములో ప్రత్యక్షమైతే ఆ సమయములో ఇంకెన్ని వైభవాలు ఉంటాయి? ఈ సమయములో మనుష్యులు ఆకలితో చనిపోతూ ఉన్నారు కానీ జడ చిత్రాలపై కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు. ఈ వ్యత్యాసము ఎందుకు! తప్పకుండా వారు అటువంటి శ్రేష్ఠ కర్మలేవో చేసి ఉంటారు, అందుకే వారి స్మృతిచిహ్నాలు తయారయ్యాయి. వారి పూజ కూడా ఎంత గొప్పగా జరుగుతుంది! వారు నిర్వికారీ ప్రవృత్తిలో ఉంటూ కూడా కమల పుష్ప సమానమైన అవస్థలో ఉండేవారు, కానీ ఇప్పుడు వారు నిర్వికారీ ప్రవృత్తికి బదులుగా వికారీ ప్రవృత్తిలోకి వెళ్ళిపోయారు. ఈ కారణము వలన అందరూ పరమార్థాన్ని మర్చిపోయి వ్యవహారము వైపు మనసు పెట్టారు, అందుకే రిజల్టు తారుమారైపోతూ ఉంది. ఇప్పుడు స్వయముగా పరమాత్మ వచ్చి మనల్ని వికారీ ప్రవృత్తి నుండి బయటకు తీసి నిర్వికారీ ప్రవృత్తిని నేర్పిస్తున్నారు, దీని వలన మన జీవితము సదాకాలము కొరకు సుఖమయముగా అవుతుంది, అందుకే ముందు కావాల్సింది పరమార్థము, ఆ తర్వాత వ్యవహారము. పరమార్థములో ఉండటము వలన వ్యవహారము దానికదే నిరూపణ అయిపోతుంది. ఓం శాంతి.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ఏ విధముగా డాక్టర్ ముందుగా పేషెంట్ కు నమ్మకము కలిగిస్తారు, ఈ డాక్టర్ చాలా మంచివారు, వీరి ద్వారా ఉపశమనము లభిస్తుంది అన్న నమ్మకము కలుగుతుంది. ఒకవేళ డాక్టర్ ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా వారిపై నమ్మకము లేకపోతే ఆ మెడిసిన్ యొక్క ప్రభావము ఉండదు. అలాగే ఆత్మిక డాక్టర్ గా అయ్యే విషయములో కూడా ఎటువంటి శక్తిశాలి స్టేజ్ ఉండాలంటే - ఇక్కడకు చేరుకున్నామంటే తప్పకుండా ఏదో ఒక ప్రాప్తి లభిస్తుంది అని అందరికీ నమ్మకము కలగాలి.