26-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్వయంగా భగవంతుడే మనకు టీచర్ గా అయి చదివిస్తున్నారు అని సదా ఇదే సంతోషములో ఉండండి, మనము వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, ప్రజాయోగము కాదు’’

ప్రశ్న:-
ఈ చదువు యొక్క ప్రత్యేకత ఏమిటి? మీరు ఎప్పటివరకు పురుషార్థము చేయాలి?

జవాబు:-
ఎవరైతే ఈ చదువును చాలా సమయము నుండి చదువుతూ వస్తున్నారో, వారికన్నా కొత్త పిల్లలు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. 3 నెలల చురుకైన బుద్ధి కల (తీవ్ర పురుషార్థీ) కొత్త పిల్లలు పాతవారికన్నా ముందుకు వెళ్ళగలరు, ఇది కూడా ప్రత్యేకతే. ఎప్పటివరకైతే పూర్తిగా పాస్ అవ్వరో, కర్మాతీత అవస్థ ఏర్పడదో, అన్ని లెక్కాచారాలు సమాప్తమవ్వవో, అప్పటివరకు మీరు పురుషార్థము చేయాలి.

ఓంశాంతి
పిల్లలు ఎక్కడ కూర్చున్నారు? అనంతమైన తండ్రి స్కూల్లో కూర్చున్నారు. పిల్లలకు చాలా ఉన్నతమైన నషా ఉండాలి. ఎవరి పిల్లలకు? అనంతమైన తండ్రి పిల్లలకు అనగా ఆత్మిక పిల్లలకు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు, అంతేకానీ గుజరాతీలను లేదా మరాఠీలను చదివించరు. అవి నామ-రూపాలు అయినట్లు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. వారే మన అనంతమైన తండ్రి అని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు, వారినే భగవంతుడు అని అంటారు. భగవానువాచ అనేది తప్పకుండా ఉంది, కానీ భగవంతుడని ఎవరిని అంటారు - ఇది అర్థం చేసుకోరు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కూడా. పరమాత్మ అయితే ఒక్కరే. వారు ఉన్నతోన్నతమైన నిరాకారుడు. మిమ్మల్ని ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చదివించడము లేదు, ఇంతకుముందు కూడా వారు చదివించలేదు. ఆత్మలైన మన బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడైతే నిరాకారుడే. శివుని మందిరాలకు వెళ్తారు, వారిని పూజిస్తారు కూడా, అంటే తప్పకుండా వారు ఏదో అయి ఉంటారు. నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయము మొత్తం ప్రపంచములో ఎవరికీ తెలియదు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకోవడము మొదలుపెట్టారు. చాలా సమయము నుండి తెలుసుకుంటూ వచ్చారు. అలాగని చాలా సమయము నుండి వస్తున్నవారి కన్నా కొత్తవారు చురుకుగా వెళ్ళలేరని కాదు. ఇది కూడా ఒక ప్రత్యేకతే. 3 నెలల కొత్త పిల్లలు కూడా చాలా చురుకుగా ఉండగలరు. బాబా, ఈ ఆత్మ బుద్ధి చాలా చురుకుగా ఉంది అని వారి గురించి అంటారు. కొత్తవారు విన్నప్పుడు చాలా పులకరించిపోతారు. వాస్తవానికి అందరూ గాడ్లీ స్టూడెంట్స్ (ఈశ్వరీయ విద్యార్థులే). జ్ఞానసాగరుడైన నిరాకార తండ్రి చదివిస్తున్నారు. భగవానువాచ అని కూడా అంటూ ఉంటారు, కానీ అది ఎప్పుడు జరిగింది అనేది మర్చిపోయారు.

తమ తండ్రియే తమకు టీచర్ అన్నట్లు కూడా కొందరు ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కానీ అక్కడ వారు కేవలం ఒక్క సబ్జెక్టును మాత్రమే చదివిస్తారు, ఇంకొక సబ్జెక్టును వేరే టీచరు చదివిస్తారు. ఇక్కడైతే తండ్రి పిల్లలందరికీ టీచర్. ఇది అద్భుతమైన విషయము. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయము ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుడిని తండ్రి అని అనరు. శ్రీకృష్ణుడిని ఈ విధముగా టీచరు లేదా గురువు అని కూడా భావించరు. ఇక్కడ బాబా ప్రాక్టికల్ గా చదివిస్తున్నారు. రకరకాల విద్యార్థులైన మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీరు పాస్ అయ్యేంతవరకు, టీచర్ అయిన బాబా చదివిస్తూ ఉంటారు. కర్మాతీత అవస్థను పొందేంత వరకు పురుషార్థము చేయాలి. కర్మల లెక్కాచారాల నుండి విముక్తులుగా అవ్వాలి. బాబా మమ్మల్ని అటువంటి ప్రపంచములోకి తీసుకువెళ్తున్నారని మీకు లోలోపల చాలా సంతోషము ఉండాలి. పిల్లలు కూర్చుని పరంధామ నివాసి అయిన బాబా వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు అని భావించే స్కూల్ ఇంకేదీ ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని, మా అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించడానికి వస్తారు అని భావిస్తారు. కావున లోలోపల చాలా సంతోషముండాలి. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది ప్రజాయోగము కాదు, ఇది రాజయోగము. ఈ స్మృతితోనే పిల్లలకు సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష, కానీ మీరు ఎంత సాధారణముగా కూర్చుని ఉన్నారు. ముసల్మానులు పిల్లలను తివాచిపై కూర్చోబెట్టి చదివిస్తారు. మీరు నిశ్చయముతో ఇక్కడకు వస్తారు. ఇప్పుడు తండ్రి సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. నేను జ్ఞాన సాగరుడిని, నేను కల్ప-కల్పము వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను అని బాబా కూడా అంటారు. శ్రీకృష్ణుని 84 జన్మలని అన్నా లేదా బ్రహ్మా యొక్క 84 జన్మలని అన్నా, విషయము ఒక్కటే. బ్రహ్మాయే శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని బుద్ధిలో మంచి రీతిలో ధారణ చేయాలి. తండ్రి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మలమైన మనము ఆ తండ్రికి పిల్లలము, పరమపిత పరమాత్మ వచ్చి మనల్ని చదివిస్తారు. శ్రీకృష్ణుడైతే ఈ విధముగా చేయలేరు. శ్రీకృష్ణుడు ఈ విధముగా చదివించి ఉండరు. కిరీటము మొదలైనవి తీసేసి వచ్చి ఉంటారా! ఇప్పుడు ఇక్కడ చదివించేవారు వృద్ధుడు అయి ఉండాలి. తండ్రి అంటారు, నేను వృద్ధ తనువును తీసుకున్నాను, ఇది ఫిక్స్. శివబాబా బ్రహ్మా ద్వారానే చదివిస్తారు. తప్పకుండా పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు అని అంటారు కూడా. ఇప్పుడు బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు అనేది అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని పదే-పదే పిల్లలను మేలుకొలుపుతారు. మాయ మళ్ళీ పడుకోబెడుతుంది. ఇప్పుడు మీరు సమ్ముఖముగా కూర్చున్నారు, నేను మీ ఆత్మిక తండ్రిని అని మీరు అర్థం చేసుకుంటారు. నా గురించి మీకు తెలుసు కదా. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అని పాడుతారు కూడా. శ్రీకృష్ణుని గురించి ఇలా ఎప్పుడూ అనరు. అందరినీ ఒకేసారి చదివించలేరు కదా. మధుబన్ లో మురళీ నడుస్తుంది, అది మళ్ళీ అన్ని సెంటర్లకు వెళ్తుంది. మీరు ఇప్పుడు సమ్ముఖములో ఉన్నారు. కల్పక్రితం కూడా బాబా ఇలాగే చదివించారని మీకు తెలుసు. అప్పుడు గతించిన ఆ సమయము ఇదే. అది ఇప్పుడు మళ్ళీ వర్తమానముగా అవ్వనున్నది. భక్తి మార్గపు విషయాలనైతే ఇప్పుడు వదిలేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానము పట్ల ప్రీతి ఉంది, చదివించేవారి పట్ల ప్రీతి ఉంది. కొందరు టీచర్ నుండి చదువుకున్న తర్వాత ఆ టీచర్ కు కానుకను ఇస్తారు. ఈ బాబా అయితే తాను స్వయమే కానుకను ఇస్తారు. ఇక్కడకు వచ్చి - వీరు నా పిల్లలు అని సాకారములో పిల్లలను చూస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు అన్న జ్ఞానము కూడా పిల్లలకు ఉంది. ఎవరైనా ఒక్క జన్మే తీసుకున్నా సరే, అందులోనే సుఖ-దుఃఖాలను దాటుతారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. ఇది మనుష్య సృష్టి యొక్క వంశ వృక్షము. మొదటి నంబరులో ఉన్నవారు బ్రహ్మా-సరస్వతి, ఆదిదేవ్, ఆదిదేవి. తర్వాత అనేక ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వారు సర్వాత్మలకు బీజము. మిగిలినవారంతా ఆకులు. ప్రజాపిత బ్రహ్మా అందరికీ తండ్రి. ఈ సమయములో ప్రజాపిత హాజరై ఉన్నారు. వారు కూర్చుని శూద్రులను బ్రాహ్మణులుగా కన్వర్ట్ చేస్తారు. ఈ విధముగా ఎవరూ చేయలేరు. తండ్రియే మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి, ఆ తర్వాత దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. ఇది సహజ రాజయోగము యొక్క చదువు. రాజా జనకుడు కూడా క్షణములో జీవన్ముక్తిని పొందారు అనగా స్వర్గవాసిగా అయ్యారు. మనుష్యులు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు కానీ దీనిని అర్థం చేయించలేరు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. మీరు అశరీరిగా వచ్చారు, తర్వాత శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయించారు. మీరు తప్పకుండా 84 జన్మలను తీసుకున్నారు. తండ్రి సత్యమైనవారు, వారు సత్యాన్నే తెలియజేస్తారు. రాజధాని ఉంటుంది కదా. రాజయోగాన్ని ఒక్కరే నేర్చుకోరు కదా. మీరంతా ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ముల్లు మరియు పుష్పము అని ఎవరినంటారు - ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇది ఉన్నదే ఛీ-ఛీ ముళ్ళ ప్రపంచము. మనము 84 జన్మల చక్రములో తిరిగి నరకవాసులుగా అయ్యాము. మళ్ళీ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను రిపీట్ చేస్తాము. మనము మళ్ళీ తప్పకుండా స్వర్గవాసులుగా అవుతాము. ఇలా మనము కల్ప-కల్పము అవుతాము. ఇది పదే-పదే గుర్తు చేసుకోవాలి మరియు జ్ఞానాన్ని అర్థం చేయించాలి. ఈ లక్ష్మీ-నారాయణులు సూర్యవంశీయులుగా ఉండేవారు. క్రైస్టు వచ్చారు, వారి కంటే ముందు చాలా కొద్దిమంది ఉండేవారు, రాజధాని ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యయుగ రాజధానిని స్థాపన చేస్తారు. స్థాపన సంగమయుగములోనే జరుగుతుంది. ఇది సత్యాతి-సత్యమైన కుంభ మేళా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఆత్మలు అనేకమంది ఉన్నారు, పరమాత్మ ఒక్కరే. తండ్రి అయిన పరమాత్మ పిల్లలను పావనముగా చేయడానికి వారి వద్దకు వస్తారు. దీనినే సంగమయుగము యొక్క కుంభ మేళా అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా తయారుచేస్తారు, తర్వాత నరకములా ఉన్న పాత ప్రపంచపు వినాశనము తప్పకుండా జరుగుతుంది. కల్ప-కల్పము వినాశనము జరుగుతుంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా అవుతుంది. తప్పకుండా ఇలా జరుగుతుంది. కొత్తదానిని స్వర్గమని, పాతదానిని నరకమని అనడము జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది మనుష్యుల వృద్ధి జరుగుతుంది. ధాన్యము లభించకపోతే, మేము ఇక ముందు చాలా ధాన్యాన్ని పండిస్తాము అని భావిస్తారు, కానీ పిల్లలు ఎంతమంది జన్మిస్తూ ఉంటారు. మరి ధాన్యము ఎక్కడ నుండి తీసుకువస్తారు.

ఈ మొత్తం పాత ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు బాగా తెలుసు. మనుష్యులకు ఈ జ్ఞానము బాగా అనిపిస్తుంది కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. నరకము తర్వాత స్వర్గము వస్తుందని, సత్యయుగ దేవీ-దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారని మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు భారత్ కు యజమానులుగా ఉండేవారు, వారి చిత్రాలు ఉన్నాయి. సత్యయుగములో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. ఇప్పుడు తమను తాము దేవతా ధర్మమువారిగా చెప్పుకోరు, దానికి బదులుగా హిందువులని చెప్పుకుంటారు. మనము ఇలా (దేవీ-దేవతలుగా) అవుతున్నామని పిల్లలకు బాగా తెలుసు. బాబా మనల్ని ఈ కర్మేంద్రియాల ద్వారా చదివిస్తున్నారు. లేకపోతే నేను మిమ్మల్ని ఎలా చదివించాలి అని బాబా అంటారు. బాబా ఆత్మలనే చదివిస్తారు ఎందుకంటే ఆత్మలోనే మాలిన్యము చేరుతుంది. ఇప్పుడు మీరు సత్యమైన బంగారముగా అవ్వాలి, బంగారుయుగము నుండి వెండియుగములోకి వస్తారు అనగా వెండి యొక్క లోహము కలవడముతో మీరు చంద్రవంశీయులుగా అయిపోతారు. సత్యయుగములో బంగారుయుగములో ఉండేవారు, వారే తర్వాత కిందకు దిగుతారు, ఆ తర్వాత సంఖ్య కూడా వృద్ధి చెందుతుంది. మేము బంగారుయుగము, వెండియుగము, రాగియుగము మరియు ఇనుపయుగములో 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అనేక సార్లు ఈ పాత్రను అభినయించాము, ఈ పాత్ర నుండి ఎవ్వరూ విముక్తులుగా అవ్వలేరు. మాకు మోక్షం కావాలని అడుగుతుంది వాళ్ళు కానీ వాస్తవానికి విసుగు చెందే అవకాశమున్నది మీకు, ఎందుకంటే 84 జన్మల చక్రములో మీరు తిరిగారు. రావడము-వెళ్ళడము అనేది జరుగుతూనే ఉంటుంది, దీని నుండి మేమెందుకు విముక్తులుగా అవ్వకూడదు అని మనుష్యులు అనుకుంటారు. కానీ అలా జరగదు. మీరు మోక్షాన్ని పొందుతారు, బ్రహ్మతత్వాన్ని స్మృతి చేసినట్లయితే బ్రహ్మతత్వములో లీనమైపోతారు అని గురువులు కూడా చెప్తారు. అనేక మత-మతాంతరాలు భారత్ లోనే ఉన్నాయి. ఇతర ఏ ఖండాల్లోనూ ఇన్ని లేవు. అనేకానేక మతాలు ఉన్నాయి, ఒకటి మరొక దానితో కలవదు. మంత్ర-తంత్రాలు కూడా చాలా నేర్చుకుంటారు. కొందరు కుంకుమ పువ్వును తీస్తారు, కొందరు ఇంకేదో తీస్తారు... అది చూసి మనుష్యులు చాలా సంతోషపడతారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక తండ్రి ఆత్మలైన మన తండ్రి అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు. వారు వచ్చి సత్యనారాయణ కథను మరియు అమరకథను వినిపిస్తారు, దీని ద్వారా అమరలోకానికి యజమానులుగా తయారుచేస్తారు, నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. మళ్ళీ గవ్వ సమానముగా అయిపోతారు. ఇప్పుడు మీకు వజ్ర సమానమైన అమూల్యమైన జన్మ లభించింది, మరి గవ్వల వెనుక ఎందుకు పోగొట్టుకుంటున్నారు. అసలు ఈ ప్రపంచము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది! ఎన్ని గొడవలు-కొట్లాటలు జరుగుతూ ఉంటాయి, అందరూ సమాప్తమైపోతారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, ఇక తర్వాత ఇన్ని లక్షలు, కోట్లు ఎవరు కూర్చుని తింటారు. మరి వాటిని సఫలం ఎందుకు చేసుకోకూడదు! ఈ ఆత్మిక కాలేజ్ తెరవడముతో మనుష్యులు ఎవర్ హెల్దీగా, వెల్దీగా, హ్యాపీగా అవుతారు. ఇక్కడ హాస్పిటల్ మరియు యూనివర్సిటీ కంబైన్డ్ గా ఉన్నాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము ఉండనే ఉన్నాయి. తప్పకుండా యోగము ద్వారా దీర్ఘాయుష్షు లభిస్తుంది. మీరు ఎంతగా ఆరోగ్యవంతులుగా అవుతారు, అంతేకాక అనంతమైన ఖజానా కూడా లభిస్తుంది. అల్లా అవల్దీన్ నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. అల్లా, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని, అందులో చాలా సుఖముంటుందని మీకు తెలుసు. దాని పేరే స్వర్గము. మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు, తర్వాత మీరు మొట్టమొదట సుఖధామములోకి వచ్చారు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ కిందకు పడిపోతూ వచ్చారు. కల్ప-కల్పము నేను పిల్లలైన మీకు ఈ విధముగా కూర్చుని అర్థం చేయిస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను మీకు తెలియజేస్తాను. మీరు 84 జన్మలను తీసుకున్నారు, ఈ శరీరము పతితమైనది. ఆత్మ కూడా తమోప్రధానమైపోయింది. బాబా రైట్ చెప్తారు. బాబా ఎప్పుడూ రాంగ్ చెప్పరు. వారు సత్యము. సత్యయుగము నిర్వికారీ ప్రపంచము, ధర్మయుక్తమైన ప్రపంచము. తర్వాత రావణుడు అధర్మయుక్తముగా తయారుచేస్తాడు. ఇది అసత్య ఖండము. అసత్యమైన మాయ, అసత్యమైన కాయ, మొత్తం ప్రపంచమంతా అసత్యము... అని పాడుతారు కూడా. ఏ ప్రపంచము? ఈ పాత ప్రపంచమంతా అసత్యమైనది. సత్యయుగములో సత్యమైన ప్రపంచముండేది. ప్రపంచము ఒక్కటే, రెండు ప్రపంచాలు లేవు. కొత్త ప్రపంచమే మళ్ళీ పాతదిగా అవుతుంది. కొత్త ఇంటికి, పాత ఇంటికి వ్యత్యాసము ఉంటుంది కదా. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు, మేము కొత్త ఇంటిలో కూర్చుంటామని భావిస్తారు. ఇక్కడ కూడా పిల్లల కోసం కొత్త ఇంటిని తయారుచేస్తారు. చాలామంది పిల్లలు తయారవుతూ ఉంటారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషము ఉండాలి. తండ్రి అంటారు, జ్ఞానసాగరుడినైన నా పిల్లలందరూ కామ చితిపై కూర్చుని పాపం పూర్తిగా కాలిపోయారు, ఇప్పుడు మళ్ళీ వారిని జ్ఞాన చితిపై కూర్చోబెడతాను. జ్ఞాన చితిపై కూర్చోబెట్టి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. కామ చితిపై కూర్చోవడంతో పూర్తిగా నల్లగా అయిపోయారు. శ్రీకృష్ణునికి శ్యామసుందరుడు అన్న పేరును పెట్టారు. కానీ దాని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతున్నారు! తండ్రి గవ్వ నుండి వజ్ర సమానముగా తయారుచేస్తారు, కావున అంతటి అటెన్షన్ ను పెట్టవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ వజ్రతుల్యమైన అమూల్యమైన జీవితాన్ని గవ్వల వెనుక పోగొట్టుకోకూడదు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, అందుకే తమదంతా ఆత్మిక సేవలో సఫలం చేసుకోవాలి.

2. చదువు పట్ల మరియు చదివించేవారి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. భగవంతుడు మనల్ని చదివించడానికి వస్తారు, ఈ సంతోషములో ఉండాలి.

వరదానము:-
క్యాచింగ్ పవర్ ద్వారా తమ అసలైన సంస్కారాలను క్యాచ్ చేసి వాటి స్వరూపముగా అయ్యే శక్తిశాలి భవ

పురుషార్థానికి ముఖ్యమైన ఆధారము - క్యాచింగ్ పవర్. ఏ విధముగా శాస్త్రజ్ఞులు చాలాకాలం కిందటి శబ్దాన్ని క్యాచ్ చేస్తారో, అదే విధముగా మీరు సైలెన్స్ శక్తి ద్వారా మీ ఆది దైవీ సంస్కారాలను క్యాచ్ చేయండి, దీని కొరకు సదా ఇదే స్మృతి ఉండాలి - నేను అలా ఉండేవాడిని, మళ్ళీ అలా అవుతున్నాను. ఎంతగా ఆ సంస్కారాలను క్యాచ్ చేస్తారో, అంతగా వాటి స్వరూపముగా అవుతారు. 5 వేల సంవత్సరాల నాటి విషయము, నిన్నటి విషయమే అన్నంత స్పష్టముగా అనుభవమవ్వాలి. మీ స్మృతిని అంత శ్రేష్ఠముగా మరియు స్పష్టముగా తయారుచేసుకోండి, అప్పుడు శక్తిశాలిగా అవుతారు.

స్లోగన్:-
బ్రాహ్మణ జీవితము యొక్క శ్వాస సంతోషము. శరీరము పోయినా కానీ సంతోషము పోకూడదు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

ఒక్క వేటుతో ఒప్పందము కుదుర్చుకునేవారు ఒక్కరికి చెందినవారిగా ఉన్న కారణముగా సదా ఏకరసముగా ఉంటారు. మిగిలినవారు ఎవరైతే కొంచెం-కొంచెంగా ఒప్పందము కుదుర్చుకుంటారో, ఒక్కదానికి బదులుగా రెండు నావలపై కాళ్ళు పెట్టేవారిగా ఉంటారో, వారు సదా ఏదో ఒక తికమకతో కూడిన అలజడిలో ఉంటూ ఏకరసముగా అవ్వరు, అందుకే ఒప్పందము కుదుర్చుకోవాలంటే క్షణములో కుదుర్చుకోండి, అంతేకానీ మనసును ముక్కలు-ముక్కలుగా చేసుకోకండి.