26-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు నిందా-స్తుతి, మానావమానాలు, సుఖ-దుఃఖాలు అన్నింటినీ సహనం చేయాలి, మీ సుఖము యొక్క రోజులు ఇప్పుడు సమీపముగా వస్తూ ఉన్నాయి’’

ప్రశ్న:-
తండ్రి తమ బ్రాహ్మణ పిల్లలకు ఏ ఒక్క వార్నింగ్ ఇస్తారు?

జవాబు:-
పిల్లలూ, ఎప్పుడూ తండ్రిపై అలగకండి. ఒకవేళ తండ్రిపై అలిగితే సద్గతిపై కూడా అలిగినట్లు అవుతుంది. తండ్రి వార్నింగ్ ఇస్తున్నారు - అలిగేవారికి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. పరస్పరంలో లేక బ్రాహ్మణిపై అలిగినా కూడా పుష్పాలుగా అవుతూ, అవుతూ ముళ్ళలా అయిపోతారు, అందుకే చాలా-చాలా జాగ్రత్తగా ఉండండి.

పాట:-
ఓర్పు వహించు మానవా...

ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు. పిల్లలైన మీ జన్మ-జన్మాంతరాల దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ దూరమైపోవాలి. ఈ పాటలోని లైన్ ను విన్నారు, ఇప్పుడు మన దుఃఖపు పాత్ర పూర్తవుతుందని మరియు సుఖపు పాత్ర ప్రారంభమవుతుందని మీకు తెలుసు. ఎవరికైతే పూర్తిగా తెలియదో, వారు ఏదో ఒక విషయములో దుఃఖాన్ని తప్పకుండా చూస్తారు. ఇక్కడకు బాబా వద్దకు రావడంలో కూడా ఏదో ఒక రకమైన దుఃఖము అనుభవమవుతుంది. చాలామంది పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉండవచ్చని బాబా అర్థం చేసుకోగలరు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక్కోచోట జనం చాలా ఎక్కువైపోతారు, వర్షాలు పడతాయి, ఒక్కోసారి తుఫానులు వస్తాయి. సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో, వారు ఏమంటారంటే - భగవంతుని వద్దకు వెళ్తున్నాము కదా, ఏం పర్వాలేదు. అక్కడ భగవంతుడు ఉన్నారు అని భావిస్తూనే యాత్రలకు వెళ్తారు. మనుష్యులకు లెక్కలేనంతమంది భగవానులు ఉన్నారు. ఆ యాత్రలకు వెళ్ళేవారిలో ఎవరైతే మంచి దృఢమైనవారు ఉంటారో, వారు ఏమంటారంటే - ఏం పర్వాలేదు, మంచి పనులలో ఎప్పుడూ విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, అంతమాత్రాన తిరిగి వెళ్ళిపోము కదా. కొందరైతే తిరిగి వెళ్ళిపోతారు కూడా. ఒక్కోసారి విఘ్నాలు కలుగుతాయి, ఒక్కోసారి కలుగవు కూడా. తండ్రి అంటారు - పిల్లలూ, ఇది కూడా మీ యాత్రయే. మీరు అంటారు - మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నాము, ఆ తండ్రి అందరి దుఃఖాలను హరించేవారు. ఈ నిశ్చయము ఉంది. ఈ రోజుల్లో చూడండి, మధుబన్ లో ఎంతమంది వస్తున్నారు! చాలామందికి ఇబ్బంది కూడా కలుగుతూ ఉండవచ్చేమోనని బాబాకు చింత ఉంటుంది, కింద పడుకోవలసి వస్తుంది. పిల్లలను కింద పడుకోబెట్టడం బాబాకు ఇష్టం ఉండదు కదా. కానీ డ్రామానుసారముగా చాలా ఎక్కువమంది వస్తుంటారు, అలా కల్పక్రితము కూడా జరిగింది, మళ్ళీ జరుగుతుంది, ఇందులో ఎటువంటి దుఃఖము కలుగకూడదు. చదువుకునేవారిలో కొందరు రాజులుగా అయితే కొందరు పేదవారిగా కూడా అవుతారని మీకు తెలుసు. కొందరికి ఉన్నతమైన పదవి, కొందరికి తక్కువ పదవి లభిస్తుంది, కానీ సుఖము తప్పకుండా ఉంటుంది. కొందరు చాలా అపరిపక్వముగా ఉన్నారని, వారు ఏమీ సహనం చేయలేరని కూడా బాబాకు తెలుసు. వారికి కాస్త ఇబ్బంది కలిగితే - మేము అనవసరంగా వచ్చామని లేక బ్రాహ్మణి మమ్మల్ని బలవంతంగా తీసుకువచ్చారని అంటారు. మమ్మల్ని బ్రాహ్మణి అనవసరంగా చిక్కులలో పడేసారని అనేవారు కూడా ఉంటారు. వారు విశ్వవిద్యాలయములోకి వచ్చారు అన్న పూర్తి పరిచయం వారికి ఉండదు. ఈ సమయములోని చదువు ద్వారా భవిష్యత్తులో కొందరు రాజులుగా అయితే, మరికొందరు పేదవారిగా కూడా అవ్వనున్నారు. ఇక్కడి రాజులు మరియు పేదవారికి, మరియు అక్కడి రాజులు మరియు పేదవారికి రాత్రికీ, పగలుకీ ఉన్నంత తేడా ఉంటుంది. ఇక్కడి రాజులు కూడా దుఃఖితులుగా ఉన్నారు మరియు పేదవారు కూడా దుఃఖితులుగా ఉన్నారు. అక్కడ ఇరువురూ సుఖముగా ఉంటారు. ఇక్కడ ఉన్నది పతిత వికారీ ప్రపంచము. కొందరి వద్ద ఎంతో ధనము ఉంది కానీ బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ ధన-సంపదలన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఈ శరీరము కూడా అంతమైపోతుంది. ఆత్మ అయితే మట్టిలో కలవదు. బిర్లా వంటి ఎందరో గొప్ప-గొప్ప షావుకారులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచము మారుతున్నది అని వారికేం తెలుసు. తెలిసి ఉంటే వెంటనే వచ్చేస్తారు. భగవంతుడు ఇక్కడకు వచ్చి ఉన్నారు అని అంటారు. ఎంతైనా వారు ఎక్కడికి వెళ్తారు? తండ్రి ద్వారా తప్ప ఎవ్వరికీ సద్గతి లభించదు. ఒకవేళ ఎవరైనా అలిగితే, వారు సద్గతిపై అలిగారు అని అంటారు. ఇలా ఎందరో అలుగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఆశ్చర్యము కలిగించేలా వింటారు, నిశ్చయము ఏర్పరచుకుంటారు... కొందరైతే - వీరు తప్ప వేరే ఏ దారీ లేదు, వీరి ద్వారానే సుఖ-శాంతుల వారసత్వము లభిస్తుంది, వీరు లేకుండా సుఖ-శాంతులు లభించడం అసంభవం అని భావిస్తారు. ధనము ఎంతో ఉంటే, అప్పుడే సుఖము లభిస్తుంది. ధనములోనే సుఖం ఉంటుంది కదా. అక్కడ (మూలవతనములో) ఆత్మలు శాంతిలో ఉంటాయి. మాకు పాత్ర లేకపోయి ఉంటే మేము సదా అక్కడే ఉండేవారము అని కొందరంటారు కానీ అలా అన్నంతమాత్రాన అది జరగదు. ఇది తయారై, తయారుచేయబడిన ఆట అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఏదో ఒక సంశయములోకి వచ్చి వదిలి వెళ్ళిపోయేవారు ఎందరో ఉన్నారు. బ్రాహ్మణిపై అలుగుతారు లేక పరస్పరం అలిగి చదువును వదిలివేస్తారు.

ఇప్పుడు మీరు ఇక్కడకు పుష్పాలుగా అయ్యేందుకు వచ్చారు. తప్పకుండా మనము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నాము అని మీకు అనుభవమవుతుంది. పుష్పాలుగా తప్పకుండా అవ్వాలి. కొందరికైతే కొన్ని సంశయాలు ఉన్నాయి. ఫలానావారు ఇలా చేస్తున్నారు, వీరు ఇలా ఉన్నారు, అందుకే మేము రాము అని అంటారు. ఇక అలిగి వెళ్ళి ఇంట్లో కూర్చుంటారు. తండ్రి అంటారు, మిగిలినవారందరిపైనా అలగండి కానీ ఒక్క తండ్రిపై మాత్రము ఎప్పుడూ అలగకండి. శిక్షలు చాలా కఠినమైనవి అని బాబా వార్నింగ్ ఇస్తారు. గర్భములో కూడా ఏ శిక్షలైతే లభిస్తాయో, వాటినన్నింటినీ సాక్షాత్కరము చేయిస్తారు. సాక్షాత్కారాలు లేకుండా శిక్షలు లభించవు. మీరు చదువుతూ, చదువుతూ పరస్పరం కొట్లాడుకుని, అలిగి చదువును వదిలేసారు అని ఇక్కడి విషయాలు కూడా సాక్షాత్కారమవుతాయి. మేము తండ్రి ద్వారా చదువుకోవాలి అని పిల్లలైన మీరు భావిస్తారు. చదువును ఎప్పుడూ వదలకూడదు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకే మీరు ఇక్కడ చదువుకుంటారు. ఇటువంటి ఉన్నతోన్నతమైన తండ్రి వద్దకు మీరు కలుసుకునేందుకు వస్తారు. ఒక్కోసారి ఎక్కువమంది కూడా వచ్చేస్తారు, డ్రామానుసారముగా కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. పిల్లలకు అనేక తుఫానులు వస్తాయి. ఫలానా వస్తువు లభించలేదు, ఇది దొరకలేదు, అది దొరకలేదు... ఇవి అసలు విషయాలే కావు. మృత్యువు యొక్క సమయము వచ్చినప్పుడు జ్ఞానములో లేని మనుష్యులు అంటారు - మేము ఏం అపరాధము చేసామని, అనవసరంగా మమ్మల్ని హతమారుస్తున్నారు. ఆ చివరి సమయములోని పాత్రనే రక్తసిక్తమైన పాత్ర అని అంటారు. అకస్మాత్తుగా బాంబులు పడతాయి. లెక్కలేనంతమంది మరణిస్తారు. అది రక్తసిక్తమైనట్లే కదా. అజ్ఞానీ మనుష్యులు ఆర్తనాదాలు చేస్తారు. పిల్లలైన మీరైతే చాలా సంతోషముగా ఉంటారు, ఎందుకంటే ఈ ప్రపంచ వినాశనము జరిగి తీరవలసిందేనని మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశనము జరగకపోతే మరి ఒక్క సత్యధర్మ స్థాపన ఎలా జరుగుతుంది. సత్యయుగములో ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. సత్యయుగ ఆదిలో ఏముండేదో ఎవరికేమి తెలుసు. ఇది పురుషోత్తమ సంగమయుగము. తండ్రి అందరినీ పురుషోత్తములుగా తయారుచేసేందుకే వచ్చారు. వారు అందరికీ తండ్రి కదా. డ్రామానైతే మీరు తెలుసుకున్నారు. అందరూ అయితే సత్యయుగములోకి రారు. ఇన్ని కోట్లమంది ఆత్మలు సత్యయుగములోకి రారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఏమీ అర్థం చేసుకోని పిల్లలు ఎందరో ఉన్నారు. భక్తి మార్గముకు అలవాటుపడిపోయి ఉన్నారు. జ్ఞానము బుద్ధిలో నిలువదు. భక్తి అలవాటైపోయింది. భగవంతుడు చేయలేనిది ఏముంది అని అంటారు! వారు చనిపోయినవారిని కూడా జీవింపజేయగలరు అని అంటారు. బాబా వద్దకు వస్తారు, వచ్చి ఏమంటారంటే - ఫలానా వ్యక్తి అయితే చనిపోయినవారిని కూడా జీవింపజేసారు, మరి భగవంతుడు అది చేయలేరా అని అంటారు. ఎవరైనా మంచి పని చేస్తే ఇక అతడిని మహిమ చేయడం మొదలుపెడతారు, ఇక అతనికి వేలాదిమంది అనుచరులుగా అయిపోతారు. మీ వద్దకైతే చాలా తక్కువమంది వస్తారు. స్వయంగా భగవంతుడే చదివిస్తుంటే మరి ఇంత కొద్దిమందే ఉన్నారేమిటి అని చాలామంది అడుగుతారు. అరే, ఇక్కడైతే మరణించవలసి ఉంటుంది. అక్కడ కేవలం కర్ణ రసమే ఉంది, కూర్చుని చాలా అట్టహాసముగా గీతను వినిపిస్తారు, భక్తులు వింటారు. ఇక్కడ కర్ణ రసము యొక్క విషయమేదీ లేదు. మీకు కేవలం - తండ్రిని స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది. గీతలో కూడా మన్మనాభవ అన్న పదము ఉంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి అంటారు - అచ్ఛా, బ్రాహ్మణిపై లేక సెంటర్ పై అలిగితే కనీసం ఈ పని చేయండి - ఇతర సాంగత్యాలన్నీ తెంచి స్వయాన్ని ఆత్మగా భావించండి, ఒక్క తండ్రినే స్మృతి చేయండి. తండ్రియే పతిత-పావనుడు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఈ మాత్రము స్మృతి చేసినా సరే స్వర్గములోకి తప్పకుండా వస్తారు. స్వర్గములో ఉన్నత పదవిని అయితే పురుషార్థానుసారముగానే పొందుతారు. ప్రజలను తయారుచేసుకోవలసి ఉంటుంది. లేకపోతే రాజ్యము ఎవరిపై చేస్తారు. ఎవరైతే బాగా కష్టపడతారో, ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు. ఉన్నత పదవి కొరకే ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. పురుషార్థము లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉన్నతోన్నతుడు, పతిత-పావనుడు ఒక్క తండ్రియే అని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు మహిమ చేస్తారు కానీ దాని భావాన్ని అర్థం చేసుకోరు. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. భారత్ స్వర్గము, ప్రపంచ అద్భుతము. ఈ ప్రపంచములో ఉన్న ఏడు వింతలు మాయ యొక్క అద్భుతాలు. మొత్తం డ్రామాలో ఉన్నతోన్నతమైనది స్వర్గము, నీచాతినీచమైనది నరకము. ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మధురమైన బాబా ఎంతో ఉన్నతోన్నతముగా పైకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మరి వారిని ఎవరు మర్చిపోగలరు. బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కానీ, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే శ్రీమతాన్ని ఇస్తున్నారు, అది భగవానువాచ, అంతేకానీ బ్రహ్మా భగవానువాచ కాదు.

అనంతమైన తండ్రి పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ, నేను మిమ్మల్ని ఎంతో షావుకారులుగా చేసి వెళ్ళాను, మరి మీ దుర్గతి ఏ విధంగా జరిగింది? కానీ ఎలా వింటారంటే ఏమీ అర్థం కావట్లేదు అన్నట్లుగా వింటారు. పిల్లలకు కాస్త ఇబ్బంది కలుగుతుంది, సుఖ-దుఃఖాలను, నిందా-స్తుతి అన్నింటినీ సహనం చేయవలసి ఉంటుంది. ఇక్కడి మనుష్యులు ఎలా ఉన్నారో చూడండి. ప్రధానమంత్రిని కూడా రాళ్ళతో కొట్టడానికి వెనకాడరు. స్కూల్ పిల్లలది కొత్త రక్తము అని అంటారు, వారిని ఎంతో మహిమ చేస్తారు. వీరు భవిష్యత్తు యొక్క కొత్త రక్తము అని భావిస్తారు. కానీ ఆ విద్యార్థులే తర్వాత దుఃఖము ఇచ్చేవారిగా అయిపోతారు, కాలేజీలకు నిప్పు అంటిస్తారు, ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి అని తండ్రి అర్థం చేయిస్తారు. డ్రామాలోని నటులై ఉండి కూడా డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి మరియు ముఖ్యమైన పాత్రధారులు మొదలైనవారి గురించి తెలియకపోతే మరి వారినేమంటారు! ఉన్నతోన్నతమైనవారు ఎవరు అంటూ వారి చరిత్రను గురించి తెలుసుకోవాలి కదా. కానీ వారి గురించి ఏమీ తెలియదు. బ్రహ్మా, విష్ణు, శంకరుల పాత్ర ఏమిటి, ధర్మ స్థాపకుల పాత్ర ఏమిటి అన్నది తెలియదు. మనుష్యులైతే అంధవిశ్వాసములోకి వచ్చి అందరినీ గురువులు అని అంటారు. ఎవరైతే సద్గతిని కలిగిస్తారో వారే గురువు. ఇప్పుడు సర్వుల సద్గతిదాత అయితే ఒక్క పరమపిత పరమాత్మయే. వారు పరమ గురువు కూడా, అలాగే వారు జ్ఞానాన్ని కూడా ఇస్తారు. వారు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు కూడా, వారి పాత్రయే అద్భుతమైనది. ధర్మ స్థాపనను కూడా చేస్తారు మరియు మిగిలిన అన్ని ధర్మాలను వినాశనము కూడా చేస్తారు. ఇతరులైతే కేవలం ధర్మ స్థాపనను మాత్రమే చేస్తారు. స్థాపన మరియు వినాశనమును చేసేవారినే గురువు అని అంటారు కదా. తండ్రి అంటారు, నేను కాలుడికే కాలుడిని. ఏక ధర్మ స్థాపన మరియు మిగిలిన అన్ని ధర్మాల వినాశనము జరుగుతుంది అనగా ఈ జ్ఞాన యజ్ఞములో స్వాహా అయిపోతారు. ఇక ఆ తర్వాత ఎటువంటి యుద్ధమూ ఉండదు, అలాగే ఎటువంటి యజ్ఞమూ రచింపబడదు. మీకు మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మిగిలినవారంతా తెలియదు, తెలియదు అని అంటూ ఉంటారు, కానీ మీరు అలా అనరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవి అర్థం చేయించలేరు. పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉండాలి కానీ మాయ ఎలా ఎదిరిస్తుందంటే, ఇక దానితో స్మృతే తొలగిపోతుంది. పిల్లలైన మీరు సుఖ-దుఃఖాలను, మానావమానాలను సహనము చేయాలి. వాస్తవానికి ఇక్కడ ఎవరినీ అవమానపర్చడం జరగదు, కానీ ఒకవేళ అటువంటి విషయమేదైనా ఉంటే తండ్రికి రిపోర్టు చేయాలి. రిపోర్టు చేయకపోతే ఎంతో పాపం అంటుకుంటుంది. తండ్రికి వినిపించడంతో వారిని వెంటనే అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఈ సర్జన్ నుండి దాచిపెట్టకూడదు. వీరు చాలా పెద్ద సర్జన్. ఇది జ్ఞాన ఇంజెక్షన్, దీని అంజనము అని కూడా అంటారు. అంజనమును జ్ఞానాంజనము అని కూడా అంటారు. ఇందులో ఇంద్రజాలము మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి అంటారు, నేను మీకు పతితము నుండి పావనముగా అయ్యే యుక్తిని తెలియజేయడానికి వచ్చాను. పవిత్రముగా అవ్వకపోతే ధారణ కూడా జరగదు. ఈ కామము కారణముగానే మళ్ళీ పాపాలు జరుగుతూ ఉంటాయి, దీనిపై విజయము పొందాలి. స్వయమే వికారాలలోకి వెళ్తూ ఉంటే ఇక ఇతరులెవరికీ చెప్పలేరు. అది మహా పాపమైపోతుంది. రామ, రామ అంటూ సాగరాన్ని కూడా దాటేయవచ్చు అని చెప్పే పండితుని కథను కూడా తండ్రి వినిపిస్తారు. మనుష్యులు అది నీటి సాగరము అని భావిస్తారు. ఏ విధంగా ఆకాశపు అంతాన్ని పొందలేరో, అలాగే సాగరము యొక్క అంతాన్ని కూడా పొందలేరు. అలాగే బ్రహ్మ మహాతత్వము యొక్క అంతాన్ని కూడా పొందలేరు. ఇక్కడ మనుష్యులు వాటి అంతాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు, కానీ అక్కడ ఎవ్వరూ ఈ పురుషార్థము చేయరు. ఇక్కడ ఎంత దూరము వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి వస్తారు. పెట్రోలే లేకపోతే ఎలా రాగలరు? ఇది సైన్స్ వారి అతి అహంకారము, దానితో వినాశనము చేసేస్తారు. విమానాల ద్వారా సుఖము కూడా ఉంది, అలాగే వాటి వల్ల అతి దుఃఖము కూడా ఉంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ కారణముగానూ చదువును వదలకూడదు. శిక్షలు చాలా కఠినమైనవి, వాటి నుండి రక్షించుకునేందుకు మిగిలిన సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అలగకూడదు.

2. జ్ఞానమనే ఇంజెక్షన్ ను లేక అంజనమును ఇచ్చేవారు ఒక్క తండ్రియే, ఆ అవినాశీ సర్జన్ నుండి ఏ విషయాన్నీ దాచకూడదు. తండ్రికి వినిపించడం ద్వారా వారిని వెంటనే అప్రమత్తం చేయడం జరుగుతుంది.

వరదానము:-
తనువు యొక్క ఆరోగ్యము, మనసు యొక్క సంతోషము మరియు ధనము యొక్క సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవాన్ భవ

సంగమయుగములో సదా స్వయములో స్థితులై ఉండటం ద్వారా తనువు యొక్క కర్మభోగము శూలము నుండి ముల్లులా అయిపోతుంది, తనువు యొక్క రోగమును యోగములోకి పరివర్తన చేసేస్తారు, అందుకే సదా ఆరోగ్యముగా ఉంటారు. మన్మనాభవగా ఉన్న కారణముగా సంతోషాల గనితో సదా సంపన్నులుగా ఉంటారు, అందుకే మనసు యొక్క సంతోషము కూడా ప్రాప్తిస్తుంది మరియు జ్ఞాన ధనము అన్ని ధనాలకన్నా శ్రేష్ఠమైనది. జ్ఞాన ధనము కలవారికి ప్రకృతి స్వతహాగానే దాసిగా అయిపోతుంది మరియు సర్వ సంబంధాలు కూడా ఒక్కరితోనే ఉన్నాయి, సంపర్కము కూడా హోలీహంసలతో ఉంది... అందుకే శ్రేష్ఠ భాగ్యవాన్ అన్న వరదానము స్వతహాగానే ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-
స్మృతి మరియు సేవ, ఈ రెండింటి బ్యాలెన్స్ యే డబుల్ లాక్.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఏ విధంగా అనేక జన్మల మీ దేహ స్వరూపపు స్మృతి న్యాచురల్ గా ఉండినదో, అలాగే మీ అసలైన స్వరూపపు స్మృతి యొక్క అనుభవమును కొద్ది సమయమైనా చెయ్యరా? ఈ మొదటి పాఠాన్ని పూర్తి చేయండి, అప్పుడు మీ ఆత్మ-అభిమానీ స్థితి ద్వారా సర్వాత్మలకు సాక్షాత్కారము చేయించేందుకు నిమిత్తులుగా అవుతారు.