26-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ సంగమయుగము వికర్మలను వినాశనము చేసుకునే యుగము, ఈ యుగములో మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదు, పావనముగా తప్పకుండా అవ్వాలి’’

ప్రశ్న:-
అతీంద్రియ సుఖము యొక్క అనుభవము ఏ పిల్లలకు కలగగలదు?

జవాబు:-
ఎవరైతే అవినాశీ జ్ఞాన రత్నాలతో నిండుగా ఉంటారో, వారికే అతీంద్రియ సుఖము యొక్క అనుభవము కలగగలదు. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని జీవితములో ధారణ చేస్తారో, వారు అంతగా షావుకారులుగా అవుతారు. ఒకవేళ జ్ఞాన రత్నాల ధారణ జరగకపోతే వారు నిరుపేదల వంటివారు. తండ్రి మీకు భూత, భవిష్యత్, వర్తమానాల జ్ఞానాన్ని ఇచ్చి త్రికాలదర్శులుగా తయారుచేస్తున్నారు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
గతించినదే ఇప్పుడు వర్తమానముగా జరుగుతుంది, మళ్ళీ ఈ వర్తమానమే గతముగా మారిపోతుంది. మనుష్యులు గతించినదానిని గాయనము చేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. పురుషోత్తమ అన్న పదాన్ని తప్పకుండా వ్రాయాలి. మీరు వర్తమానాన్ని చూస్తున్నారు. గతము గురించి ఏదైతే గాయనముందో, అదే ఇప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతోంది. ఇందులో సంశయమేమీ రానివ్వకూడదు. ఇది సంగమయుగము కూడా మరియు కలియుగ అంతిమము కూడా అని పిల్లలకు తెలుసు. తప్పకుండా సంగమయుగము అయిదు వేల సంవత్సరాల క్రితం గతించింది, అదే ఇప్పుడు మళ్ళీ వర్తమానములో జరుగుతోంది. ఇప్పుడు తండ్రి వచ్చారు. ఏదైతే గతించిపోయిందో, అదే మళ్ళీ భవిష్యత్తుగా మారుతుంది. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, ఆ తర్వాత సత్యయుగములో రాజ్యాన్ని పొందుతారు. ఇప్పుడు ఇది సంగమయుగము. ఈ విషయము పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు ప్రాక్టికల్ గా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇది అత్యంత సహజమైనది. చిన్నపిల్లలు మరియు పెద్దవారంతా ఎవరైతే ఉన్నారో, వారందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి, అదేమిటంటే - తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. వికర్మలు వినాశనము చేసుకునే ఈ సమయములో మళ్ళీ వికర్మలు చేసేవారు ఎవరు ఉంటారు! కానీ మాయ వికర్మలు చేయిస్తూ ఉంటుంది, అప్పుడు - చెంపదెబ్బ తగిలింది, మా ద్వారా ఈ పెద్ద పొరపాటు జరిగిపోయింది అని భావిస్తారు. తండ్రిని - ఓ పతిత పావనా రండి అని పిలుస్తారు కదా! మరి ఇప్పుడు తండ్రి పావనముగా తయారుచేయడానికి వచ్చారు కావున పావనముగా అవ్వాలి కదా. ఈశ్వరునికి చెందినవారిగా అయిన తర్వాత మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. సత్యయుగములో అందరూ పవిత్రముగా ఉండేవారు. ఈ భారత్ యే పావనముగా ఉండేది. నిర్వికారీ ప్రపంచము మరియు వికారీ ప్రపంచము అని అంటూ ఉంటారు కూడా. ఏమంటారంటే - వారు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము, ఎందుకంటే మేము వికారాల్లోకి వెళ్తాము. వికారాలు అన్న పదమే అశుద్ధమైనది. మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని పతితులే పిలుస్తారు. క్రోధము కలవారు అలా పిలవరు. తండ్రి కూడా మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారముగా వస్తారు. కొద్దిగా కూడా తేడా రాదు. ఏదైతే గతించిపోయిందో, అదే మళ్ళీ ఇప్పుడు వర్తమానముగా జరుగుతోంది. భూత, భవిష్యత్, వర్తమానాలను తెలుసుకోవడము - దీనినే త్రికాలదర్శులుగా అవ్వడము అని అంటారు. దీనిని గుర్తుంచుకోవాలి. ఇవి చాలా శ్రమతో కూడుకున్న విషయాలు. ఘడియ, ఘడియ వీటిని మర్చిపోతూ ఉంటారు. లేదంటే పిల్లలైన మీకు ఎంత అతీంద్రియ సుఖము ఉండాలి. మీరు ఇక్కడ అవినాశీ జ్ఞాన ధనముతో చాలా చాలా షావుకారులుగా అవుతున్నారు. ఎవరి ధారణ ఎంత ఎక్కువగా ఉందో వారు అంత షావుకారులుగా అవుతున్నారు, కానీ కొత్త ప్రపంచము కొరకు అలా తయారవుతున్నారు. మనము ఏదైతే చేస్తున్నామో అదంతా భవిష్య కొత్త ప్రపంచము కొరకేనని మీకు తెలుసు. తండ్రి వచ్చిందే కొత్త ప్రపంచ స్థాపన చేయడానికి మరియు పాత ప్రపంచ వినాశనము చేయడానికి. కల్పపూర్వము ఏ విధంగా జరిగిందో ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుంది. పిల్లలైన మీరు కూడా చూస్తారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. భూకంపము వచ్చిందంటే ఇక సమాప్తము. భారత్ లో ఎన్ని భూకంపాలు జరుగుతాయి. ఇవన్నీ జరగవలసిందేనని మనము అంటాము. కల్పపూర్వము కూడా ఇవి జరిగాయి. అందుకే బంగారు ద్వారక కిందికి వెళ్ళిపోయింది అని అంటారు. మనము 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని తీసుకున్నాము అని పిల్లలకు బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఇందులో కొద్దిగా కూడా తేడా లేదు. బాబా, 5000 సంవత్సరాల క్రితము కూడా మేము మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, మేము అనేక సార్లు మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము అని అంటారు. ఎన్ని సార్లు అన్నది లెక్కించడానికి వీలవ్వదు. ఎన్ని సార్లు మీరు విశ్వానికి అధిపతులుగా అయ్యారు, మళ్ళీ నిరుపేదలుగా అయిపోతారు. ఈ సమయములో భారత్ పూర్తి నిరుపేదగా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారముగా ఇలా ఉంది అని మీరు వ్రాస్తారు కూడా. వారు డ్రామా అన్న పదాన్ని ఉపయోగించరు. వారి ప్లానే వేరుగా ఉంటుంది.

మీరు అంటారు, డ్రామా ప్లాన్ అనుసారముగా మేము 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ స్థాపన చేస్తున్నాము. కల్ప పూర్వము ఏ కర్తవ్యమునైతే చేసామో, దానినే ఇప్పుడు కూడా శ్రీమతము ద్వారా చేస్తున్నాము. శ్రీమతము ద్వారానే శక్తిని తీసుకుంటాము. శివశక్తి అన్న పేరు కూడా ఉంది కదా. కావున మీరు శివశక్తులైన దేవతలు, మీకు మందిరాలలో కూడా పూజ జరుగుతుంది. మీరే ఆ దేవీలు, మీరే మళ్ళీ విశ్వ రాజ్యాన్ని పొందుతారు. జగదాంబకు ఎంత పూజ జరుగుతుందో చూడండి. ఆమెకు అనేక పేర్లు పెట్టారు. వాస్తవానికి వారు ఒక్కరే. వాస్తవానికి అందరికీ తండ్రి కూడా ఒక్క శివుడే. మీరు కూడా విశ్వాన్ని స్వర్గముగా తయారుచేస్తారు కావున మీ పూజ జరుగుతుంది. అనేకమంది దేవీలు ఉన్నారు, లక్ష్మిని ఎంతగా పూజిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మికి పూజ చేస్తారు. ఆమె హెడ్ (ముఖ్యమైనవారు). మహారాజు మరియు మహారాణి, వీరిరువురినీ కలిపి మహాలక్ష్మి అని అంటారు. మహాలక్ష్మిలో ఇరువురూ వచ్చేస్తారు. మనము కూడా మహాలక్ష్మిని పూజించేవారము. ధనము వృద్ధి చెందితే మహాలక్ష్మి కృప చూపించారు అని భావిస్తారు. ఇక ప్రతి సంవత్సరము పూజిస్తూ ఉంటారు. అచ్ఛా, లక్ష్మి నుండి ధనాన్ని కోరుకుంటారు, మరి ఇతర దేవీల నుండి ఏం కోరుకుంటారు? సంగమయుగీ దేవీలైన మీరు స్వర్గము యొక్క వరదానాన్ని ఇచ్చేవారు. దేవీల ద్వారా స్వర్గము యొక్క మనోకామనలన్నీ పూర్తవుతాయని మనుష్యులకు తెలియదు. మీరు దేవీలు కదా. మీరు మనుష్యులకు జ్ఞాన దానమును ఇస్తారు, దాని ద్వారా వారి కోరికలన్నింటినీ పూర్తి చేస్తారు. అనారోగ్యము మొదలైనవి వచ్చినప్పుడు దేవీలను - నయం చేయమని, రక్షించమని అడుగుతుంటారు. అనేక రకాల దేవీలు ఉన్నారు. మీరు సంగమయుగము యొక్క శివశక్తి దేవీలు. మీరే స్వర్గము యొక్క వరదానమునిస్తారు. తండ్రి కూడా ఇస్తారు, అలాగే పిల్లలు కూడా ఇస్తారు. మహాలక్ష్మిని చూపిస్తారు, అక్కడ నారాయణుడిని గుప్తముగా ఉంచుతారు. తండ్రి పిల్లలైన మీ ప్రభావాన్ని ఎంతగా పెంచుతారు! దేవీలు 21 జన్మల కొరకు సుఖము యొక్క కామనలన్నింటినీ పూర్తి చేస్తారు. లక్ష్మి నుండి ధనాన్ని కోరుకుంటారు. ధనము కొరకే మనుష్యులు మంచి వ్యాపారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అయితే తండ్రి వచ్చి మొత్తం విశ్వానికి యజమానులుగా చేస్తారు, అపారమైన ధనాన్ని ఇస్తారు. శ్రీ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు రాజ్యము ఎలా చేసారు, మళ్ళీ ఏ విధంగా మెల్లమెల్లగా కిందికి దిగుతూ వచ్చారు అనేది మీకు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ, కళలు తగ్గుతూ, తగ్గుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి! ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారత్ ఎంత నిరుపేదగా ఉంది. ఇది రావణ రాజ్యము. ఇది ఎంత ఉన్నతముగా నంబర్ వన్ గా ఉండేది, ఇప్పుడు చివరి నంబర్ కు చేరుకుంది. చివరి నంబర్ కు చేరుకోకపోతే మళ్ళీ నంబర్ వన్ లోకి ఎలా వెళ్ళగలుగుతారు. లెక్క ఉంది కదా. ఒకవేళ ఓపికగా విచార సాగర మంథనము చేసినట్లయితే అన్ని విషయాలు వాటంతట అవే బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇవి ఎంత మధురాతి మధురమైన విషయాలు. ఇప్పుడైతే మీరు మొత్తం సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. చదువు అనేది కేవలం స్కూలులో మాత్రమే చదువుకోవడం జరగదు, టీచరు ఇంట్లో చదువుకునేందుకు కూడా పాఠము ఇస్తారు, దానిని హోంవర్క్ అని అంటారు. తండ్రి కూడా మీకు ఇంట్లో చదువుకునేందుకని పాఠము ఇస్తారు (హోంవర్క్ ఇస్తారు). పగలు సమయములో వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి ఎందుకంటే శరీర నిర్వహణ అయితే చేసుకోవాల్సిందే. అమృతవేళ అయితే అందరికీ ఖాళీ సమయము ఉంటుంది. ఉదయముదయమే రెండు, మూడు గంటల సమయము చాలా మంచిది. ఆ సమయములో లేచి తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి. ఈ వికారాలే మిమ్మల్ని ఆదిమధ్యాంతాలు దుఃఖితులుగా చేసాయి. రావణుడిని కాలుస్తారు కానీ దాని అర్థము కూడా ఏమాత్రము తెలియదు. కేవలం పరంపరగా రావణుడిని కాల్చే ఆచారము కొనసాగుతూ వచ్చింది. డ్రామానుసారముగా ఇది కూడా నిశ్చితమై ఉంది. రావణుడిని హతమారుస్తూ వచ్చారు కానీ రావణుడు మరణించనే మరణించడు. ఈ రావణుడిని కాల్చడం ఎప్పుడు ఆగుతుంది అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరు ఇప్పుడు సత్యాతి-సత్యమైన సత్యనారాయణుని కథను వింటారు. మాకు ఇప్పుడు తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది అని మీకు తెలుసు. తండ్రిని తెలుసుకోని కారణముగానే అందరూ అనాథలుగా ఉన్నారు. భారత్ ను స్వర్గముగా తయారుచేసే తండ్రి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మెట్లు దిగుతూ తమోప్రధానముగా అయ్యారు, కావుననే తండ్రి మళ్ళీ వచ్చారు. అయినా మనుష్యులు తమను తాము తమోప్రధానులుగా భావించరు. తండ్రి అంటారు, ఈ సమయములో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో సతోప్రధానులు ఒక్కరు కూడా లేరు. సతోప్రధానులు శాంతిధామము మరియు సుఖధామములోనే ఉంటారు. ఇప్పుడు అందరూ తమోప్రధానులుగా ఉన్నారు. తండ్రియే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలుపుతారు. అలాగే మీరు మళ్ళీ ఇతరులను మేల్కొలుపుతారు. అలా అందరూ మేల్కొంటూ ఉంటారు. మనుష్యులు మరణిస్తే, వారు ప్రకాశములోకి రావాలని వారి వెనుక జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు ఇది ఘోర అంధకారము, ఆత్మలు తిరిగి తమ ఇంటికి వెళ్ళలేవు. దుఃఖము నుండి విముక్తులవ్వాలని మనసు కలుగుతుంది, కానీ ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు.

ఏ పిల్లలకైతే పురుషోత్తమ సంగమయుగము యొక్క స్మృతి ఉంటుందో, వారు జ్ఞాన రత్నాలను దానమివ్వకుండా ఉండలేరు. ఏ విధంగా మనుష్యులు పురుషోత్తమ మాసములో ఎన్నో దానపుణ్యాలు చేస్తారో, అలాగే ఈ పురుషోత్తమ సంగమయుగములో మీరు జ్ఞాన రత్నాలను దానము చేయాలి. స్వయంగా పరమపిత పరమాత్మయే చదివిస్తున్నారని, శ్రీకృష్ణుడు కాదని కూడా అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు సత్యయుగము యొక్క మొదటి యువరాజు. అతను మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు. బాబా భూత, భవిష్యత్, వర్తమానాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. మీరు త్రికాలదర్శులుగా అవుతారు, ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ త్రికాలదర్శులుగా తయారుచేయలేరు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము తండ్రికే ఉంది, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. ఉన్నతోన్నతుడని ఒక్క భగవంతుడినే అంటారు, వారే రచయిత. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే పదములో చాలా స్పష్టముగా ఉంది. దాని అర్థమేమిటంటే - స్వర్గాన్ని స్థాపించేవారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేసారు, ఇది ఎవ్వరికీ తెలియదు. జయంతి అన్న పదము యొక్క అర్థమే తెలియనప్పుడు ఇక దానిని జరుపుకోవడములో ఉపయోగమేముంది. ఇదంతా కూడా డ్రామాలో ఉంది. ఈ సమయములోనే పిల్లలైన మీరు డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు, ఇంకెప్పుడూ తెలుసుకోరు. అది కూడా బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే తెలుసుకుంటారు. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది. భక్తి మార్గములో ఏముంది, దాని వల్ల ఏమీ లభించదు. ఎంతమంది భక్తులు గుంపులో ఎదురుదెబ్బలు తినేందుకు వెళ్తూ ఉంటారు. బాబా మిమ్మల్ని వాటన్నింటి నుండి విడిపించారు. మనము శ్రీమతము ద్వారా మళ్ళీ భారత్ ను శ్రేష్ఠముగా తయారుచేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. శ్రీమతము ద్వారానే శ్రేష్ఠముగా అవుతారు. శ్రీమతము సంగమములోనే లభిస్తుంది. అసలు మనము ఎవరము, మళ్ళీ ఇలా ఎలా తయారయ్యాము అనేది ఇప్పుడు మీకు యథార్థ రీతిగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థము చేస్తూ-చేస్తూ పిల్లలు ఎప్పుడైనా ఫెయిల్ అయినట్లయితే తండ్రికి సమాచారమివ్వండి. మళ్ళీ లేచి నిలబడేందుకు తండ్రి అటెన్షన్ ఇప్పిస్తారు. ఎప్పుడూ కూడా ఓడిపోయి కూర్చుండిపోకండి, మళ్ళీ లేచి నిలబడండి, చికిత్స చేసుకోండి. సర్జన్ అయితే కూర్చుని ఉన్నారు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు - 5 అంతస్తుల నుండి కింద పడటానికి మరియు 2 అంతస్తుల నుండి కింద పడటానికి ఎంత తేడా ఉంది. కామ వికారము 5 అంతస్తుల వంటిది. అందుకే బాబా అన్నారు - కామము మహాశత్రువు, అది మిమ్మల్ని పతితముగా తయారుచేసింది, ఇప్పుడు పావనముగా అవ్వండి. పతిత-పావనుడైన తండ్రియే వచ్చి పావనముగా తయారుచేస్తారు. తప్పకుండా సంగమయుగములోనే అలా తయారుచేస్తారు. కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమము ఇది.

తండ్రి ఇప్పుడు అంటు కడుతున్నారని, ఇదే మళ్ళీ మొత్తం ఒక వృక్షముగా పెరుగుతుందని పిల్లలకు తెలుసు. బ్రాహ్మణుల వృక్షము పెరుగుతుంది, ఆ తర్వాత సూర్యవంశము, చంద్రవంశములోకి వెళ్ళి సుఖము అనుభవిస్తారు. ఇది ఎంత సహజముగా అర్థం చేయించడం జరుగుతుంది. అచ్ఛా, మురళి లభించకపోతే తండ్రిని స్మృతి చేయండి. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే విష్ణు వంశములోకి వెళ్ళిపోతారు, ఇది బుద్ధిలో పక్కా చేసుకోండి. మొత్తం ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. కల్ప-కల్పము ఏ పురుషార్థమైతే చేసారో, ఖచ్చితంగా అదే మళ్ళీ నడుస్తుంది. అర్ధకల్పము దేహాభిమానులుగా అయ్యారు, ఇక ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. చదువైతే సహజమైనది, పావనముగా అవ్వడమే ముఖ్యమైన విషయము. తండ్రిని మర్చిపోవడమనేది పెద్ద పొరపాటు. దేహాభిమానములోకి రావడం వల్లే మర్చిపోతారు. శరీర నిర్వహణార్థము వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి 8 గంటలు చేయండి, మిగిలిన 8 గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేయాలి. ఆ అవస్థ అంత త్వరగా రాదు. అంతిమములో ఎప్పుడైతే ఆ అవస్థ ఏర్పడుతుందో అప్పుడు వినాశనము జరుగుతుంది. కర్మాతీత అవస్థ ఏర్పడిందంటే ఇక ఈ శరీరము నిలవదు, శరీరము నుండి విడిపోతారు, ఎందుకంటే ఆత్మ పవిత్రముగా అయిపోతుంది కదా. ఎప్పుడైతే నంబరువారుగా కర్మాతీత అవస్థకు చేరుకుంటారో, అప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది, అప్పటివరకు రిహార్సల్స్ అవుతూ ఉంటాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పురుషోత్తమ మాసములో అవినాశీ జ్ఞాన రత్నాలను దానము చేయాలి. అమృతవేళ లేచి విచార సాగర మంథనము చేయాలి. శ్రీమతము అనుసారముగా శరీర నిర్వహణార్థము అన్నీ చేస్తూ, తండ్రి ఏ హోంవర్కునైతే ఇచ్చారో దానిని కూడా తప్పకుండా చేయాలి.

2. పురుషార్థములో ఎప్పుడైనా ఆటంకము వస్తే తండ్రికి సమాచారాన్ని ఇచ్చి శ్రీమతము తీసుకోవాలి. సర్జన్ కు అన్నీ వినిపించాలి. వికర్మలు వినాశనము చేసుకునే సమయములో ఎటువంటి వికర్మలు చేయకూడదు.

వరదానము:-
అఖండ యోగము యొక్క విధి ద్వారా అఖండ పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ మహానాత్మా భవ

ఈ రోజుల్లో మహానాత్మలుగా పిలవబడేవారు ఎవరైతే ఉన్నారో, వారు అఖండానంద మొదలైన పేర్లను పెట్టుకుంటారు, కానీ అందరిలోనూ అఖండ స్వరూపులైతే మీరే - ఆనందములో కూడా అఖండము, సుఖములో కూడా అఖండము... కేవలం సాంగత్య దోషములోకి రాకండి, ఇతరుల అవగుణాలను చూస్తూ, వింటూ వాటిని డోంట్ కేర్ చేయండి (లెక్క చేయకండి), ఈ విశేషత ద్వారా అఖండ యోగిగా అవుతారు. ఎవరైతే అఖండయోగులో వారే అఖండ పూజ్యులుగా అవుతారు. మరి మీరు ఎటువంటి మహానాత్మలంటే అర్ధకల్పము స్వయం పూజ్య స్వరూపములో ఉంటారు మరియు అర్ధకల్పము మీ జడచిత్రాలకు పూజ జరుగుతుంది.

స్లోగన్:-
దివ్య బుద్ధియే సైలెన్స్ శక్తికి ఆధారము.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

ఎవరైతే తమ సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధిని హ్యాండిల్ చెయ్యగలరో, వారు ఇతరులను కూడా హ్యాండిల్ చెయ్యగలరు. అందుకే స్వయముపై కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉన్నట్లయితే అదే యథార్థమైన హ్యాండ్లింగ్ పవర్ గా అవుతుంది. అజ్ఞానీ ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేయడములోనైనా, లేక బ్రాహ్మణ పరివారములో స్నేహ సంపన్నమైన, సంతుష్టతా సంపన్నమైన వ్యవహారము చేయడములోనైనా - రెండింటిలోనూ సఫలత పొందుతారు.