27-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ అనంతమైన పాత ప్రపంచము యొక్క వినాశనము జరగనున్నది, కొత్త ప్రపంచము స్థాపనవుతూ ఉంది, అందుకే కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు పవిత్రముగా అవ్వండి’’

ప్రశ్న:-
పరమాత్ముని గురించి మనుష్యుల అవగాహనకు అందని ఏ అద్భుతమైన విషయము పిల్లలైన మీకు తెలుసు?

జవాబు:-
మీరు అంటారు - ఏ విధముగానైతే ఆత్మ జ్యోతిర్బిందువో, అదే విధముగా పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు. ఈ అద్భుతమైన విషయాలు మనుష్యుల అవగాహనకు అందనివి. ఎంతోమంది పిల్లలు కూడా ఈ విషయములో తికమకపడతారు. బాబా అంటారు - పిల్లలూ, తికమకపడకండి. ఒకవేళ చిన్న రూపాన్ని స్మృతి చేయలేకపోతే, పెద్ద రూపములో స్మృతి చేయండి. స్మృతి తప్పకుండా చేయాలి.

పాట:-
రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, అందుకే పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాలి. ఈ విధముగా మరెక్కడా అర్థం చేయించరు. ఏ సాధు-సత్పురుషులు ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని అర్థం చేయించరు. ఒక్క తండ్రి మాత్రమే ఇలా అర్థం చేయిస్తారు. ఇంకెవరికీ ఇలా చెప్పడము రాదు. ఈ యుక్తిని ఎవరూ తెలియజేయలేరు. మనము ఆత్మలము అని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఒకసారి బ్యారిస్టరుగా, మరోసారి డాక్టరుగా అవుతుంది. ఆత్మయే ఇప్పుడు పతితముగా అయ్యింది, మళ్ళీ పావనముగా అవుతుంది. ఆత్మలో జ్ఞాన ధారణ జరుగుతుంది. నిరాకారుడైన తండ్రి జ్ఞానసాగరుడు కనుక వారు తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. వారు పతిత-పావనుడు కనుక తప్పకుండా వచ్చి పావనముగా తయారుచేస్తారు. వారు సుప్రీమ్ పరమపిత పరమాత్మ. మీ తండ్రినైన నేను సుప్రీమ్ ను, నాలెడ్జ్ ఫుల్ ను. నాకు నా శరీరమంటూ లేదు. ఈ జ్ఞానమంతటినీ మీ ఆత్మ ధారణ చేస్తుంది, మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహాభిమానము ఉండకూడదు. వినేవారు మరియు వినిపించేవారు, ఇరువురూ దేహీ-అభిమానులుగా ఉండే స్థానము ఇంకేదీ లేదు. తండ్రి అయితే ఎలాగూ నిరాకారుడే. వారు వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. మిగితా మనుష్యులందరూ దేహాభిమానులు. ఈ లక్ష్మీ-నారాయణుల కొరకు ఏమంటారంటే - వీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు కానీ ఎంతైనా దేహ భానమైతే ఉంటుంది కదా. ఈ జ్ఞానాన్ని పరమపిత పరమాత్మయే వచ్చి ఇస్తారు. ఆత్మ ధారణ చేయాల్సి ఉంటుంది. ఆత్మకే పతితము నుండి పావనముగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పతనావస్థలో ఉంది, దీనిని మళ్ళీ ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వస్తారు. ఈ విషయము పిల్లలైన మీకు తెలుసు. పతనము అనగా వినాశనము, ఉన్నతి అనగా నిర్మాణము. స్థాపన మరియు వినాశనము. దేని స్థాపన? కొత్త ప్రపంచ స్థాపన, స్వర్గ స్థాపన మరియు పాత ప్రపంచము, నరకము యొక్క వినాశనము. వినాశనము మరియు నిర్మాణము. కలియుగము పాత ప్రపంచము, ఇది తప్పకుండా వినాశనము అవ్వాలి. వినాశనానికి గుర్తు - ఈ మహాభారీ మహాభారత యుద్ధము. మహాభారత వృత్తాంతాన్ని మహాభారత శాస్త్రములో చూపిస్తారు. తండ్రి, బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు కనుక తప్పకుండా కొత్త ప్రపంచాన్నే స్థాపన చేస్తారు కదా. ఇది అనంతమైన వినాశనము మరియు అనంతమైన స్థాపన. తండ్రియే పిల్లల కోసం కొత్త ఇంటిని నిర్మిస్తారు, తర్వాత పాతదానిని తప్పకుండా సమాప్తము చేయిస్తారు. బాబా ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. తమోప్రధానము నుండి మళ్ళీ సతోప్రధానముగా తయారుచేసేందుకు మనల్ని సిద్ధం చేస్తున్నారు. వినాశనము కొరకు మహాభారత యుద్ధము ప్రసిద్ధమైనది. ఇప్పుడిది ఆ సమయమేనని, మహాభారత సమయములో ఉన్న ఆ నక్షత్రాలే ఇప్పుడు మళ్ళీ కలిసాయని అంటారు. భారత్ యొక్క ఉన్నతి మరియు పతనానికి సంబంధించిన అద్భుతమైన కథ అని ఈ మెట్ల వరుస చిత్రములో కూడా వ్రాయబడి ఉంది. ఈ వాక్యములో ‘కల్ప-కల్పము’ అనే పదము కూడా రావాలి. ప్రారంభము నుండి అంతిమము వరకు మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు. ఈ విషయము కూడా మీ బుద్ధిలో ఉంది. మనుష్యుల బుద్ధికైతే పూర్తిగా గోద్రెజ్ తాళం వేయబడి ఉంది. ఈ విషయాలను మనుష్యులు తెలుసుకోవాలి. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఇక్కడ శరీరాలను ధారణ చేస్తారు. కనుక డ్రామా ఆదిమధ్యాంతాల గురించి, క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్లు మొదలైనవారి గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు డ్రామా ఆదిమధ్యాంతాల గురించి, ఎవరు ఏమిటి అని ప్రారంభము నుండి అంతిమము వరకు మొత్తం డ్రామా గురించి తెలిసింది. తండ్రి ద్వారా ఈ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. భౌతిక జ్ఞానాన్ని ఫిలాసఫీ అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మిక జ్ఞానాన్ని జ్ఞానమని అంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ పిల్లల బుద్ధిలో కూర్చోబెట్టారు.

ఇప్పుడు 84 జన్మల నాటకము పూర్తవుతోందని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము తిరిగి వెళ్తాము కానీ పతితులెవ్వరూ తిరిగి వెళ్ళలేరు. లేదంటే ఇన్ని జపతపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి ఎందుకు చేస్తారు. పవిత్రముగా అయ్యేందుకనే గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు కానీ వాటి వల్ల ఎవరూ పావనముగా అవ్వలేరు, అందుకే ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఫలానావారు నిర్వాణధామానికి వెళ్ళారని, జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని చాలా తప్పుగా చెప్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయించారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళరు. పాత్రధారులందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది కనుక అందరూ స్టేజిపై నిలబడి ఉన్నారు. ఇప్పుడు అందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారు ఎక్కడున్నారు అనేది మనుష్యులకు తెలియదు. ఏ ఆత్మలైతే పై నుండి ఇక్కడకు వచ్చారో, వారంతా ఈ సమయములో తమోప్రధానముగా ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా కల్పక్రితం కూడా అయ్యారు. తండ్రియే వచ్చి స్థాపన మరియు వినాశనము చేయిస్తారు. ఈ జ్ఞానము రాజులకే రాజులుగా తయారుచేస్తుందని కూడా అంటారు. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తానని ఈ అనంతమైన తండ్రి అన్నారు. శ్రీకృష్ణుడైతే స్థాపన చేయించరు. రచయిత తండ్రియే. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారు - సృష్టి పతితముగా అయినప్పుడే మీరు నన్ను పిలుస్తారు, అలాగని నేను కొత్త సృష్టిని రచిస్తానని కాదు. ప్రళయము జరిగినట్లుగా చూపిస్తారు కానీ అదంతా తప్పు. మనుష్యులు, ఓ పతిత-పావనా రండి, అనే పిలుస్తారు కనుక తప్పకుండా పతిత ప్రపంచములోకే వస్తాను కదా. తండ్రియే వచ్చి శ్రీకృష్ణపురి యొక్క సాక్షాత్కారాన్ని చేయిస్తారు. శ్రీకృష్ణుడు సాగరములో రావి ఆకుపై వచ్చారని చూపిస్తారు... ఇది కరక్టే. కొత్త ప్రపంచములో మొట్టమొదట శ్రీకృష్ణుడే వస్తారు. సాగరము నుండి కాదు, కానీ గర్భ మహలు నుండి వస్తారు. బొటనవేలు నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ చాలా ప్రశాంతముగా గర్భ మహలులో ఉంటారు. సత్యయుగములో ఉండే పిల్లలందరూ గర్భ మహలులో ఉంటారు. వారు గర్భ మహలులో ఉన్న విషయాన్ని సాగరములో ఆకుపై ఉన్నట్లుగా చూపించారు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. తండ్రి కూర్చుని ఈ శాస్త్రాలన్నింటి సారాన్ని అర్థం చేయిస్తారు. ఇక్కడ గర్భ జైలులో ఉంటారు, అందుకే - మమ్మల్ని బయటకు తీయండి, మేము ఇంకెప్పుడూ పాపాలు చేయము అని అంటారు. కానీ రావణుడి ప్రపంచములో పాపాలైతే జరుగుతూనే ఉంటాయి. కనుక మళ్ళీ పాపాలు చేయడము మొదలుపెడతారు. మీరు అర్ధకల్పము జైలు పక్షులుగా అయిపోతారు. దొంగలను జైలు పక్షులని అంటారు. వారు జైలు నుండి బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది, అందుకే వారిని జైలు పక్షులని అంటారు. తండ్రి అర్థం చేయించారు, ఇది రావణ రాజ్యము. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. అది ఉన్నదే రామ రాజ్యము. అక్కడ గర్భ జైలు ఉండదు మరియు స్థూలమైన జైలు కూడా ఉండదు. ఇక్కడైతే ఎంతమంది మనుష్యులు జైలులో పడి ఉంటారు. ఇక్కడ గర్భ జైలు కూడా ఉంది మరియు స్థూలమైన జైలు కూడా ఉంది. ఇక్కడ డబల్ జైలు. ఇది కలియుగాంతము కదా.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరు ఇప్పుడు నిర్మాణము చేస్తున్నారు. ఉన్నతి మరియు పతనము, ప్రతి కల్పము జరుగుతూనే ఉంటాయి. ప్రపంచమే ఉన్నతి చెందుతుంది మరియు పతనమవుతుంది. ఇందులో ముఖ్యమైన పాత్ర భారత్ కు ఉంది. ఆత్మ, పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు... అని పాడుతూ కూడా ఉంటారు. మరి దీనికి కూడా లెక్క ఉండాలి కదా. ఏ ఆత్మలు చాలాకాలం నుండి వేరుగా ఉన్నారు. మొట్టమొదట దేవీ-దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు ఆ దేవతలు లేరు. ఒకప్పుడు రాజ్యము చేసి వెళ్ళినవారి చిత్రాలు వారికి గుర్తుగా ఉంటాయి. రాజ్యమైతే సమాప్తమైపోయింది. స్వర్గము సమాప్తమైపోతే నరకము వస్తుంది, తర్వాత నరకము సమాప్తమైపోతే స్వర్గము తయారవుతుంది. కొత్త ప్రపంచ నిర్మాణము జరుగుతుంది మరియు నరకము యొక్క వినాశనము జరుగుతుంది. నిర్మాణము కోసం పిల్లలు కావాలి కదా. అక్కడ ఉండబోయేది కూడా మీరే. ముందుగా మీరు దైవీ గుణాలు కల దేవతలుగా అవ్వాల్సి ఉంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు అనే మహిమ కూడా ఉంది. మనుష్యులే అశుద్ధముగా అయ్యారు కదా. భగవానువాచ - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా అవ్వాలి. ఇది ఈ మృత్యులోకములోని అంతిమ జన్మ. ఇందులో పవిత్రముగా అవ్వాలి. ఈ విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయించాలి. మనము ఈ మృత్యులోకములోని అంతిమ జన్మలో పవిత్రముగా ఉంటాము. తండ్రి అంటారు - ఈ వికారాలపై విజయము పొందడముతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉందని పిల్లలు కూడా విని, తర్వాత ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇది అదే మహాభారత యుద్ధము, కామము మహాశత్రువు, అందుకే ప్రతిజ్ఞ చేయండి. మనము పవిత్రముగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ పాత ప్రపంచ వినాశనము తప్పకుండా జరగనున్నది, దాని కంటే ముందే పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. వినాశనము జరిగినప్పుడు హాహాకారాలు జరుగుతాయి, చాలా కఠినమైన మృత్యువు ఉంటుంది, ఇక అడగకండి. మీరు దానిని చూడలేరు కూడా. ఎవరికైనా ఆపరేషన్ జరిగేటప్పుడు, బలహీనమైనవారు అక్కడ ఉండలేరు, పడిపోతారు. అందుకే డాక్టర్లు పరివారము వారిని లోపలికి అనుమతించరు. మరి ఇక్కడ ఎంత భారీ ఆపరేషన్ జరగనున్నది. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. ఇది అశుద్ధ ప్రపంచము, ముళ్ళ అడవి. సత్యయుగాన్ని పూల తోట అని అంటారు. దేవతలు చైతన్యమైన పుష్పాలు కదా. స్వర్గములో ఏదో పూల తోట ఉంటుందని మనుష్యులు భావిస్తారు. వారు ఏది వింటే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. గార్డెన్ ఆఫ్ అల్లాహ్ (భగవంతుని పూలతోట) అని అంటారు కదా, కావున వారు ధ్యానములో కూడా పూలతోటనే చూస్తారు మరియు అల్లాహ్ నా చేతికి పుష్పాన్ని ఇచ్చారని అంటారు. బుద్ధిలో భగవంతుని పూలతోట ఉంటుంది. భక్తి మార్గములో సాక్షాత్కారాలు పొందేందుకు భక్తి చేస్తారు. సాక్షాత్కారము జరిగితే, సర్వవ్యాపి కదా అని అంటారు. ఏదైతే గతించిందో, అది మళ్ళీ జరుగుతుంది. పిల్లలు ఏ వస్త్రాలతో, ఎలా వచ్చారో, అవే వస్త్రాలతో మళ్ళీ కల్పము తర్వాత వస్తారు. డ్రామాను కొందరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. బాబా వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా అని బాబా అడుగుతారు. దానికి వారు - అవును బాబా, కల్పక్రితం కూడా మిమ్మల్ని కలిసాము, మీ నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని అంటారు. అప్పుడు తండ్రి, ఏ పదవిని పొందారు అని అడుగుతారు. బాబా-మమ్మా అని అంటున్నారంటే తప్పకుండా వారి వంశములోకి వస్తారు.

బాబా అంటారు, ఉన్నత పదవిని పొందగలిగే లాంటి పురుషార్థము చేయండి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. తప్పకుండా యుద్ధము కూడా జరుగుతుంది. నరకము యొక్క వినాశనమైతే జరగాల్సిందే. మీ వద్ద చాలా ఫస్ట్ క్లాస్ చిత్రాలు ఉన్నాయి. రెండు గ్లోబ్ లు కల శ్రీకృష్ణుని చిత్రాన్ని కూడా ముద్రించాలి, ఇందులో చాలా స్పష్టముగా ఉంది. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి మరియు నరకాన్ని కాలదన్నుతున్నట్లుగా ఉంటుంది. మీ ముఖము కూడా స్వర్గము వైపు ఉంది. ఇది చాలా ఏక్యురేట్ విషయము. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి కనుక ఇంటినే స్మృతి చేయాల్సి ఉంటుందని, పాత ప్రపంచాన్ని మర్చిపోవాల్సి ఉంటుందని మీకు తెలుసు. దీనినే అనంతమైన వైరాగ్యమని అంటారు. పాత ప్రపంచాన్ని వదిలి మనము బాబా వద్దకు వెళ్తాము. స్మృతియాత్ర ద్వారానే వెళ్తాము. ముఖ్యమైనది స్మృతి విషయమే. స్మృతి అయితే అందరూ చేస్తారు కదా. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి వచ్చి యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇది అవ్యభిచారీ స్మృతి, ఇది అర్థవంతమైనది. శివబాబా కూడా బిందువేనని మీకు తెలుసు. స్వయాన్ని కూడా ఆత్మ బిందువుగా భావించాలి, తండ్రిని కూడా బిందువుగా భావించాలి. ఇది కొత్త విషయము కావున మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని మరియు తమ ఇంటిని స్మృతి చేయాలి. అచ్ఛా, బిందువు చిన్నగా అనిపిస్తుంది, ఇల్లు అయితే పెద్దదే కదా. ఇంటిని స్మృతి చేయండి. బాబా కూడా అక్కడే ఉంటారు. తండ్రి ఎక్కడైతే ఉంటారో, నేను, మీరు అందరము అక్కడికే వెళ్తాము. బిందువు గుర్తుండకపోతే, సరే, కనీసం ఇల్లు అయినా గుర్తుంటుంది కదా. అది శాంతిధామము, మరొకటి సుఖధామము. ఇది దుఃఖధామము. ఇప్పుడు మీరు నంబరువారు పురుషార్థానుసారముగా చదువుకుంటున్నారు, తర్వాత సుఖధామములోకి వచ్చేస్తారు. మీరు తండ్రికి పిల్లలు కనుక తప్పకుండా స్వర్గ రాజ్యాధికారము కావాలి. కల్పక్రితం కూడా శివబాబా వచ్చారు, స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చారు. మీరు మర్చిపోయారు. తండ్రి అంటారు - ఇప్పుడు మళ్ళీ మీకు ఇవ్వడానికి వచ్చాను. ఎన్ని సార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. లెక్కలేనన్ని సార్లు వారసత్వాన్ని తీసుకున్నారు. అయినా సరే, ఇటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు! మాయా తుఫానుల వల్ల చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అందుకే, మాయ అటువైపుకు లాగుతున్నట్లుగా, ప్రభువు ఇటువైపుకు లాగుతున్నట్లుగా నాటకాన్ని కూడా చూపిస్తారు. జ్ఞానములో విఘ్నాలు కలగవు. స్మృతిలో విఘ్నాలు కలుగుతాయి. ఇందులోనే శ్రమ ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు - మహారథులుగా అవ్వండి. ఈ పాత ప్రపంచానికైతే నిప్పు అంటుకోనున్నది. ఈ యజ్ఞములో మొత్తం పాత ప్రపంచము స్వాహా అవ్వనున్నది. మహావీరులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీరు అఖండమైన, స్థిరమైన, అచంచలమైన రాజ్యాన్ని పొందాలి. మీ బుద్ధి యోగము తండ్రితో ఎలా ఉండాలంటే, ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే, మాయ ఏమీ చేయలేకపోవాలి. ట్రాన్స్ఫర్ అయ్యే సమయానికి ఇది మీ అంతిమ అవస్థ అవుతుంది. ఎలాగైతే స్కూల్లో పరీక్షలు చివరిలో జరుగుతాయో, అలా మీ మాల కూడా చివరిలో తయారవుతుంది. ఫలానావారు ఇలా అవుతారు, ఫలానావారు అలా అవుతారు అని మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఫలానావారు దాసిగా అవుతారు... ఇలా అన్నీ చెప్తారు. కానీ ఆ సమయములో ఏమీ చేయలేకపోతారు. అప్పుడిక - మేము ఇలా చేసామేమిటి, శ్రీమతముపై ఎందుకు నడుచుకోలేదు అని పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. కానీ అంతిమ సమయములో ఏమీ చేయలేకపోతారు. ఇలా చాలామంది పశ్చాత్తాపపడతారు. మనుష్యులు ఎవరినైనా హత్య చేసి, ఆ తర్వాత పశ్చాత్తాపపడతారు, కానీ అప్పటికి హత్య అయితే జరిగిపోయింది కదా, ఇక ఏం చేయగలరు. అందుకే తండ్రి అంటారు - నిర్లక్ష్యము చేయకండి, మీ పురుషార్థము చేస్తూ ఉండండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. 84 జన్మల నాటకము ఇప్పుడు పూర్తవుతుంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే ఆత్మాభిమానులుగా ఉంటూ పావనముగా అవ్వాలి. దేహాభిమానాన్ని తొలగించాలి.

2. అర్థ సహితముగా స్వయాన్ని ఆత్మ బిందువుగా భావిస్తూ బిందువైన తండ్రి యొక్క అవ్యభిచారీ స్మృతిలో ఉండాలి. మహావీరులుగా అయి తమ అవస్థను స్థిరముగా, అచంచలముగా చేసుకోవాలి.

వరదానము:-
వ్యర్థమనే లీకేజ్ ను సమాప్తము చేసి సమర్థులుగా అయ్యే తక్కువ ఖర్చుతో ఎక్కువ నషాను పొందేవారిగా కండి

సంగమయుగములో బాప్ దాదా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో, ఆ ఖజానాలన్నింటినీ వ్యర్థమవ్వకుండా పొదుపు చేసినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ నషాను పొందేవారిగా అవుతారు. వ్యర్థమవ్వకుండా పొదుపు చేయడము అనగా సమర్థులుగా అవ్వడము. ఎక్కడైతే సమర్థత ఉంటుందో, అక్కడ వ్యర్థమవ్వడము అనేది జరగదు. ఒకవేళ వ్యర్థమనే లీకేజ్ ఉన్నట్లయితే ఎంత పురుషార్థము చేసినా, ఎంత శ్రమ చేసినా కానీ శక్తిశాలిగా అవ్వలేరు, అందుకే లీకేజ్ ను చెక్ చేసుకుని సమాప్తము చేసినట్లయితే వ్యర్థముగా పోకుండా సమర్థులుగా అవుతారు.

స్లోగన్:-
ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రముగా ఉండటము - ఇదే యోగీ మరియు జ్ఞానీ ఆత్మలకు ఛాలెంజ్.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

పరమాత్మ జ్ఞానములోని నవీనత పవిత్రత. అగ్ని-దూది కలిసి ఉన్నా కూడా నిప్పు అంటుకోదు అని నషాతో అంటారు కదా. మీరు భాషణ ఇచ్చేటప్పుడు కూడా - పవిత్రత లేకుండా యోగ స్వరూపులుగా, జ్ఞాన స్వరూపులుగా అవ్వనే అవ్వలేరు అని చెప్తారు కదా. మరి ఈ ఛాలెంజ్ ను ఇప్పుడు ప్రాక్టికల్ రూపములోకి తీసుకురండి.