30-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మాయా శత్రువు మీ ఎదురుగా ఉంది, అందుకే స్వయం చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ నడుస్తూ-నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటారు’’

ప్రశ్న:-
రాజయోగీ పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యము ఏమిటి?

జవాబు:-
చదవడము మరియు చదివించడము, ఇదే మీ ముఖ్య కర్తవ్యము. మీరు ఈశ్వరీయ మతముపై నడుస్తున్నారు. మీరేమీ అడవులలోకి వెళ్ళవలసిన పని లేదు. ఇంటిలో, గృహస్థములో ఉంటూ శాంతిగా కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. భగవంతుడు మరియు వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము, ఈ రెండు పదాలలోనే మీ చదువంతా ఇమిడి ఉంది.

ఓం శాంతి.
తండ్రి కూడా బ్రహ్మా ద్వారా - పిల్లలూ, గుడ్ మార్నింగ్ అని అనవచ్చు. కానీ పిల్లలు కూడా రెస్పాన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నది తండ్రి మరియు పిల్లల సంబంధము. కొత్తవారు ఎప్పటివరకైతే పక్కాగా అవ్వరో అప్పటివరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది ఒక చదువు. భగవానువాచ అని కూడా వ్రాసి ఉంది. భగవంతుడు నిరాకారుడు. ఈ విషయాన్ని బాబా ఇతరులకు అర్థం చేయించడం కోసమని బాగా పక్కా చేయిస్తారు ఎందుకంటే అటువైపు మాయ ప్రభావము ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆ విషయము లేదు. ఎవరైతే కల్పపూర్వము వారసత్వము తీసుకున్నారో వారు తమంతట తామే వచ్చేస్తారని తండ్రి భావిస్తారు. ఫలానా వ్యక్తి వెళ్ళిపోకుండా పట్టుకుందాము అని కాదు, వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. ఇక్కడైతే జీవిస్తూ మరణించవలసి ఉంటుంది. తండ్రి దత్తత తీసుకుంటారు. వారసత్వము ఇవ్వడము కోసమనే దత్తత తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు వారసత్వము పట్ల ఆశతోనే తల్లిదండ్రుల వద్దకు వస్తారు. షావుకారుని బిడ్డ ఎక్కడైనా పేదవారికి దత్తతవుతారా! ఇంత ధన-సంపదలు మొదలైనవి వదలి ఎలా వెళ్తారు. షావుకారులు దత్తత తీసుకుంటారు. బాబా మనకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారని ఇప్పుడు మీకు తెలుసు, కావున వారికి చెందినవారిగా ఎందుకు అవ్వరు. ప్రతి విషయములోనూ ఆశ ఉంటుంది కదా. ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ఎక్కువ ఆశ ఉంటుంది. తండ్రి మనల్ని అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడం కోసం దత్తత తీసుకున్నారని మీకు కూడా తెలుసు. తండ్రి కూడా అంటారు, మిమ్మల్నందరినీ నేను 5 వేల సంవత్సరాల క్రితం వలె మళ్ళీ దత్తత తీసుకుంటాను. మీరు కూడా అంటారు - బాబా, మేము మీ వారిమే. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీ వారిగా అయ్యాము. ప్రాక్టికల్ గా మీరు ఎంతమంది బ్రహ్మాకుమార, కుమారీలుగా ఉన్నారు. ప్రజాపిత కూడా ప్రసిద్ధమైనవారే. ఎప్పటివరకైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటివరకు దేవతలుగా అవ్వలేరు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది - మేము శూద్రులగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. సత్యయుగములో మనము రాజ్యము చేస్తాము. కావున ఈ పాత ప్రపంచ వినాశనము తప్పకుండా అవ్వాలి. పూర్తి నిశ్చయము ఏర్పడకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. కొంతమంది కచ్చాగా ఉన్నారు, వారు పడిపోతారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మాయా శత్రువు ఎదురుగా నిలబడి ఉంది కావున అది తనవైపుకు లాగేసుకుంటుంది. తండ్రి ఘడియ-ఘడియ పక్కా చేయిస్తూ ఉంటారు - మాయలో చిక్కుకుపోకండి, లేదంటే మీ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? అని తండ్రియే అడుగగలరు. ఇంకెవ్వరికీ ఇలా అడిగే ఆలోచనే రాదు. తండ్రి అంటారు, నేను కూడా మళ్ళీ గీతను వినిపించేందుకు రావలసి ఉంటుంది, వచ్చి రావణుడి జైలు నుండి విడిపించవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, పతిత రాజ్యము, ఇది అర్ధకల్పము నుండి ప్రారంభమయ్యింది. రావణుడికి 10 తలలు చూపిస్తారు. విష్ణువుకు 4 భుజులు చూపిస్తారు. వాస్తవానికి ఇటువంటి మనుష్యులెవ్వరూ ఉండరు. ప్రవృత్తి మార్గాన్ని ఆ విధంగా చూపించడం జరిగింది. ఆ విధంగా అవ్వడమే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. విష్ణుపురిని కృష్ణపురి అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికైతే రెండు భుజాలే చూపిస్తారు కదా. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. అదంతా భక్తి మార్గము. ఇప్పుడు మీకు జ్ఞానము ఉంది. నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ గీతా పాఠశాల ఉన్నదే జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోవడానికి. బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివుడిని రుద్రుడు అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు, ఈ జ్ఞాన యజ్ఞము కృష్ణుడిదా లేక శివుడిదా? శివుడిని పరమాత్మ అని అంటారు, శంకరుడిని దేవత అని అంటారు. కానీ వాళ్ళు శివుడు మరియు శంకరుడు ఒక్కరేనని అంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను వీరిలోకి ప్రవేశించాను. పిల్లలైన మీరు వీరిని బాప్ దాదా అని పిలుస్తారు. వాళ్ళు ఏమో శివశంకర అని పిలుస్తారు. వాస్తవానికి జ్ఞానసాగరుడు ఒక్కరే.

జ్ఞానము ద్వారా బ్రహ్మాయే మళ్ళీ విష్ణువుగా అవుతారని మీకు తెలుసు. విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చిత్రాన్ని కూడా కరక్టుగా తయారుచేస్తారు. కానీ దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మాకు చేతులలో శాస్త్రాలను చూపించారు కానీ వాస్తవానికి శాస్త్రాల సారాన్ని తండ్రి కూర్చుని వినిపిస్తారా లేక బ్రహ్మా వినిపిస్తారా? ఇతను కూడా మాస్టర్ జ్ఞానసాగరునిగా అవుతారు. ఎన్నో చిత్రాలను తయారుచేశారు కానీ అవేవీ యథార్థమైనవి కావు. అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. మనుష్యులేమీ 8-10 భుజాలు కలిగినవారిగా ఉండరు. అది కేవలం ప్రవృత్తి మార్గానికి చిహ్నముగా చూపించారు. రావణుడి అర్థాన్ని కూడా తెలియజేశారు. అర్ధకల్పము రావణ రాజ్యము, రాత్రి. అర్ధకల్పము రామ రాజ్యము, పగలు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరందరూ ఒక్క తండ్రికి పిల్లలు. తండ్రి బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారు మరియు మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తప్పకుండా సంగమములోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. ద్వాపరములో గీతను వినిపించారు అన్నది తప్పు. తండ్రి సత్యము వినిపిస్తారు. ఎంతోమందికి బ్రహ్మా మరియు శ్రీకృష్ణుడి సాక్షాత్కారము కలుగుతూ ఉంటుంది. బ్రహ్మాను శ్వేత వస్త్రాలతో చూపిస్తారు. శివబాబా అయితే బిందు స్వరూపుడు. బిందువు సాక్షాత్కారము కలిగినా వారు ఏమీ అర్థం చేసుకోలేరు. మీరంటారు, నేను ఒక ఆత్మను. వాస్తవానికి ఆత్మను ఎవరు చూశారు. ఎవ్వరూ చూడలేదు. ఆత్మ ఒక బిందువు. దానిని అర్థం చేసుకోగలరు కదా. ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తే వారికి వారి సాక్షాత్కారమే కలుగుతుంది. వేరే ఏ రూపమైనా సాక్షాత్కారమైతే వారు తికమకపడతారు. హనుమంతుడిని పూజించేవారికి హనుమంతుడే కనిపిస్తారు. గణేశుడి పూజారికి గణేశుడే కనిపిస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారుచేశాను, వజ్ర-వైఢూర్యాలతో పొదగబడిన మహళ్ళు ఉండేవి, మీ వద్ద లెక్కలేనంత ధనము ఉండేది, మీరు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయ్యారు, భిక్షము అడుగుతున్నారు, ఈ మాట తండ్రి అయితే అనవచ్చు కదా. తండ్రి వచ్చారని, మనం మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఈ డ్రామా అనాదిగా తయారుచేయబడినది. ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ పాత్రను అభినయిస్తున్నారు. కొందరు ఒక శరీరాన్ని వదలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటారు, ఇందులో ఏడవవలసిన విషయమేముంది. సత్యయుగములో ఎప్పుడూ ఏడవరు. ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు మొదలైనవారు మోహజీత రాజులు. అక్కడ మోహము ఉండదు. తండ్రి అనేక రకాల విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి నిరాకారుడు. మనుష్యులు వారిని నామ-రూపాలకు అతీతుడు అని అంటారు. కానీ నామ-రూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. మరి వారికి నామ-రూపాలు ఉన్నట్లే కదా. లింగాన్ని శివ పరమాత్మ, శివబాబా అని కూడా అంటారు. వారు నిజంగానే బాబా (తండ్రి) కదా. తండ్రికి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. నిరాకారుడిని నిరాకారీ ఆత్మలే బాబా (తండ్రి) అని పిలుస్తాయి. మందిరాలకు వెళ్ళినప్పుడు వారిని శివబాబా (తండ్రి) అని అంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి లౌకిక తండ్రిని కూడా తండ్రి అని అంటారు. మేము వారిని శివబాబా అని ఎందుకు అంటున్నాము అన్న అర్థాన్ని అర్థం చేసుకోరు! తండ్రి ఉన్నతోన్నతమైన చదువును రెండు పదాలలో చదివిస్తారు - అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము). భగవంతుడిని స్మృతి చేసినట్లయితే వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము మీదే. ఇది చాలా పెద్ద పరీక్ష. మనుష్యులు ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయిన తర్వాత దానికి ముందు చదివిన చదువు ఏమైనా గుర్తుంటుందా. చదువుతూ, చదువుతూ చివరికి దాని సారము బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే. మీరు చదువుతూ వచ్చారు. చివరిలో తండ్రి మన్మనాభవ అని అంటారు, దానితో దేహాభిమానము తొలగిపోతుంది. మన్మనాభవ అలవాటు ఉన్నట్లయితే అంతిమములో కూడా తండ్రి మరియు వారసత్వము గుర్తుంటాయి. ఇదే ముఖ్యమైనది. ఇది ఎంత సహజమైనది. ఈ రోజుల్లో ఆ చదువులలో కూడా ఏమేమో చదువుతూ ఉంటారు. ఏ రాజు ఉంటే అతను అతని విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంటారు. పూర్వము పావు, శేరు, మణుగులతో లెక్క తూచేవారు. ఇప్పుడు కిలోలు మొదలైనవేవేవో ఉపయోగిస్తున్నారు. ఎన్ని వేరు వేరు ప్రాంతాలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక్క శేరు రూపాయికి దొరికితే, బొంబాయిలో ఒక్క శేరు రెండు రూపాయలకు దొరుకుతుంది, ఎందుకంటే అవి వేరు-వేరు ప్రాంతాలు. మా ప్రాంతములో మేము కరువు రానివ్వకూడదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎన్ని గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి, ఎంత గందరగోళం ఉంది.

భారత్ ఎంత సంపన్నముగా ఉండేది, ఆ తర్వాత 84 జన్మల చక్రములో తిరుగుతూ నిరుపేదగా అయిపోయింది. వజ్ర సమానమైన జన్మను గవ్వల వెనుక పోగొట్టుకున్నారే అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు, మీరు గవ్వల వెనుక ఎందుకు పరిగెడుతున్నారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి, పావనముగా అవ్వండి. ఓ పతిత-పావనా రండి, వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. దీని బట్టి ఒకప్పుడు పావనముగా ఉండేవారని, ఇప్పుడు అలా లేరని నిరూపించబడుతుంది. ఇప్పుడు ఉన్నది కలియుగము. తండ్రి అంటారు, నేను పావన ప్రపంచాన్ని తయారుచేస్తే పతిత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది, దాని కోసమే ఈ మహాభారత యుద్ధము ఉంది, అది ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి ప్రజ్వలితమైంది. డ్రామాలో ఈ వినాశనమవ్వడము కూడా నిశ్చితమై ఉంది. మొట్టమొదటైతే బాబాకు సాక్షాత్కారము కలిగింది. ఇంత పెద్ద రాజ్యము లభించనున్నది అని చూసి ఎంతో సంతోషము కలిగింది. ఆ తర్వాత వినాశన సాక్షాత్కారము కూడా చేయించారు. మన్మనాభవ మరియు మధ్యాజీభవ - ఇవి గీతలోని పదాలు. గీతలోని కొన్ని-కొన్ని పదాలు సరైనవే. తండ్రి కూడా అంటారు, మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను, ఇది తర్వాత మళ్ళీ కనుమరుగైపోతుంది. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవని ఎవ్వరికీ తెలియదు. ఆ సమయములో జనసంఖ్య ఎంత తక్కువగా ఉండి ఉంటుంది, ఇప్పుడు ఎంత పెరిగిపోయింది! కావున ఈ మార్పు రావలసిందే. వినాశనము కూడా తప్పకుండా జరగవలసిందే. మహాభారత యుద్ధము కూడా ఉంది. తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. శివజయంతిని జరుపుకుంటున్నారంటే మరి శివబాబా వచ్చి ఏమి చేసారు? అది కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, గీత ద్వారా శ్రీకృష్ణుడి ఆత్మకు రాజ్యము లభించింది. గీతనే మాత-పిత అని అంటారు, దాని ద్వారా మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. గీతా జ్ఞానము ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని శ్రీకృష్ణుడు ఆ విధంగా అయ్యారు. కానీ వారు శివబాబా పేరుకు బదులుగా శ్రీకృష్ణుడి పేరును వేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ విషయము పట్ల మీరు లోలోపల పక్కా నిశ్చయము చేసుకోండి. ఎవ్వరూ తప్పుడు మాటలు వినిపించి మిమ్మల్ని పడేయకూడదు. చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది, అది ఎలా సంభవమవుతుంది అని అంటారు. అరే, అది నిర్వికారీ ప్రపంచముగా ఉండేదని, వారు సంపూర్ణ నిర్వికారులు అని మీరు స్వయం అంటారు కదా. మరి అక్కడ వికారాలు ఎక్కడి నుండి వస్తాయి. ఇప్పుడు మీకు తెలుసు, అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంటే మరి అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచము. కుంభమేళాకు ఎన్ని లక్షల మంది వెళ్తారు. అక్కడ ఒక నది గుప్తముగా ఉంది అని అంటారు. వాస్తవానికి నది గుప్తముగా ఉండగలదా? ఇక్కడ కూడా గౌముఖాన్ని తయారుచేసారు. గంగ ఇక్కడికి వస్తుంది అని అంటారు. అరే, గంగ తనదారిలో తాను ప్రవహిస్తూ సముద్రములోకి వెళ్తుందా లేక ఇక్కడ మీ వద్దకు ఈ పర్వతము మీదికి వస్తుందా. భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు ఉంటాయి. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము. ఒకటి హద్దులోని వైరాగ్యము, రెండవది అనంతమైన వైరాగ్యము. సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులలో ఉంటారు. ఇక్కడ అటువంటి విషయమేదీ లేదు. మీరు బుద్ధి ద్వారా మొత్తము పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. రాజయోగీ పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యము - చదవడము మరియు చదివించడము. రాజయోగము అనేది అడవులలోనేమీ నేర్పించబడదు. ఇది ఒక స్కూల్. దీని శాఖలు తెరవబడుతూ ఉంటాయి. పిల్లలైన మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివబాబా నుండి నేర్చుకున్న బ్రాహ్మణ, బ్రహ్మణీలు నేర్పిస్తూ ఉంటారు. శివబాబా ఒక్కరే కూర్చుని అందరికీ నేర్పించరు కదా. ఇది పాండవ గవర్నమెంటు. మీరు ఈశ్వరీయ మతముపై నడుస్తున్నారు. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చున్నారు. బయట అయితే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి అంటారు, పంచ వికారాలను దానము ఇస్తే గ్రహణము తొలగిపోతుంది. నా వారిగా అయినట్లయితే నేను మీ సర్వ కామనలను పూర్తి చేస్తాను. ఇప్పుడు మనము సుఖధామములోకి వెళ్తామని, దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నదని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలు వినాశన సాక్షాత్కారాన్ని కూడా పొందారు. ఇప్పుడు సమయము చాలా తక్కువగా ఉంది కావున స్మృతియాత్రలో నిమగ్నమైనట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఇచ్చే వారసత్వము యొక్క పూర్తి అధికారాన్ని తీసుకునేందుకు జీవిస్తూ మరణించాలి. తండ్రికి దత్తత అయిపోవాలి. ఎప్పుడూ కూడా మీ ఉన్నతమైన భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు.

2. ఏ తప్పుడు విషయాన్ని విని సంశయములోకి రాకూడదు. నిశ్చయము కొద్దిగా కూడా చలించకూడదు. ఈ దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నది, అందుకే దీని నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించాలి.

వరదానము:-
విశేషతల రూపీ సంజీవనీ మూలిక ద్వారా మూర్ఛితులను సుజాగృతులుగా చేసే విశేష ఆత్మా భవ

ప్రతి ఆత్మకు శ్రేష్ఠ స్మృతి మరియు విశేషతల స్మృతి రూపీ సంజీవనీ మూలికను తినిపించినట్లయితే వారు మూర్ఛితుల నుండి సుజాగృతులుగా అవుతారు. విశేషతల స్వరూపము రూపీ దర్పణాన్ని వారి ఎదురుగా ఉంచండి. ఇతరులకు స్మృతిని కలిగించడము ద్వారా మీరు విశేష ఆత్మగా స్వతహాగానే అయిపోతారు. ఒకవేళ మీరు ఎవరికైనా వారిలోని బలహీనతలను వినిపించినట్లయితే వారు వాటిని దాచిపెడతారు లేక మాట దాటేస్తారు. కానీ వారి విశేషతలను వినిపించినట్లయితే వారు స్వయమే వారిలో ఉన్న బలహీనతలను స్పష్టముగా అనుభవము చేసుకుంటారు. ఈ సంజీవనీ మూలిక ద్వారానే మూర్ఛితులను సుజాగృతులుగా చేసి ఎగురుతూ ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి.

స్లోగన్:-
పేరు, గౌరవము, ప్రతిష్ఠ మరియు సాధనాలను సంకల్పములో కూడా త్యాగము చేయడమే మహా త్యాగము.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

నిమిత్తులైన పిల్లలు విశేషముగా తమ ప్రతి సంకల్పముపైన అటెన్షన్ పెట్టాలి. ఎప్పుడైతే మీరు నిర్వికల్పులుగా, నిర్వ్యర్థ సంకల్పులుగా ఉంటారో, అప్పుడు బుద్ధి సరైన నిర్ణయము చేస్తుంది. నిర్ణయము సరిగ్గా ఉంటే నివారణ కూడా సహజముగా చేస్తారు. నివారణ చేయడానికి బదులుగా ఒకవేళ మీరే కారణము, కారణము అని అంటూ ఉంటే, మీ వెనకవారు కూడా ప్రతి విషయములోనూ కారణము చెప్తూ ఉంటారు.