31-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఉన్నత పదవిని పొందాలంటే సత్యమైన తండ్రితో సదా సత్యముగా ఉండండి, ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తండ్రి నుండి క్షమాపణలు తీసుకోండి, స్వయము యొక్క మతముపై నడవకండి’’

ప్రశ్న:-
ఎటువంటి ప్రియమైన పిల్లలు ఎప్పుడూ దాగి ఉండలేరు?

జవాబు:-
ఎవరికైతే ఈశ్వరీయ పరివారము పట్ల ప్రేమ ఉంటుందో, ఎవరికైతే రాత్రింబవళ్ళు సేవ యొక్క చింతే ఉంటుందో, అటువంటి ఆజ్ఞాకారులుగా మరియు నమ్మకస్తులుగా ఉన్న సేవాధారులు, ఎప్పుడూ మన్మతముపై నడవనివారు, తండ్రి పట్ల సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయము కలిగి ఉండేవారు, ఎప్పుడూ దాగి ఉండలేరు.

పాట:-
నీవే తల్లివి, తండ్రివి...

ఓంశాంతి
పాటలో గ్యారెంటీ ఎవరు ఇస్తున్నారు? బాబా, మాకైతే మీరొక్కరే, ఇంకెవ్వరూ లేరు అని మాతా-పితలకు పిల్లలు గ్యారెంటీ ఇస్తున్నారు. ఇది ఎంత ఉన్నతమైన గమ్యము. ఎవరైనా ఇటువంటి శ్రేష్ఠమైన తండ్రి శ్రీమతముపై నడుస్తే, వారు తప్పకుండా ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారని గ్యారెంటీ ఉంది. కానీ ఇది చాలా ఉన్నతమైన గమ్యముగా కనిపిస్తుందని బుద్ధి అంటుంది. కోట్లలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా కొంతమంది మాత్రమే మాలలో మణులుగా అవుతారు. నీవే తల్లి-తండ్రి అని అంటారు కూడా, కానీ మాయ ఎంత శక్తివంతమైనదంటే, ఎక్కడో ఎవరో కష్టము మీద గ్యారంటీపై నడవగలుగుతారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవచ్చు - నేను నిజంగా మాతా-పితలకు చెందినవానిగా అయ్యానా? బాబా అంటారు, అలా లేరు. అలాంటివారు చాలా కొద్దిమందే ఉన్నారు, అందుకే చూడండి, మాల ఎంతమందిది తయారవుతుంది? ఎన్ని కోట్లలో కేవలం 8 మందిది మాత్రమే వైజయంతి మాల తయారవుతుంది. చాలామంది ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు, అందుకే తండ్రి కూడా అంటారు, ఇది ఎంత విచిత్రమో చూడండి. బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు, కానీ సుపుత్రులైన పిల్లలు (మాలలోని మణులు) చాలా కొద్దిమందే వెలువడుతారు. పిల్లల్లో శ్రీమతముపై నడవగలిగే అంతటి శక్తి లేదు, అందుకే తప్పకుండా రావణుడి మతముపై ఉన్నారు, అందుకే అంతటి పదవిని పొందలేరు. ఎవరో అరుదుగా మాలలోని మణులుగా అవుతారు, అటువంటి ప్రియమైన పిల్లలు దాగి ఉండరు. వారు హృదయాన్ని అధిరోహించి ఉంటారు. వారికి రాత్రింబవళ్ళు సేవ చేయాలి అన్న చింతే ఉంటుంది. ఈశ్వరీయ సంబంధాల పట్ల ప్రేమ ఉంటుంది. వారి బుద్ధి బయటకు ఎక్కడికీ వెళ్ళదు. దైవీ పరివారము పట్ల అటువంటి ప్రేమ ఉండాలి. అజ్ఞాన కాలములో కూడా పిల్లలకు తండ్రి పట్ల, సోదరీ-సోదరులకు పరస్పరములో ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. ఇక్కడైతే కొంతమందికి కొద్దిగా కూడా తండ్రితో యోగము లేదు. గ్యారెంటీ మాత్రం చాలా ఇస్తారు. భక్తి మార్గములో పాడుతారు, ఇప్పుడైతే పిల్లలు సమ్ముఖములో ఉన్నారు. భక్తి మార్గములో ఎవరైతే పాడుతూ ఉంటారో, వారు ఎంత ప్రేమగా స్మృతి చేస్తూ ఉంటారు అనేది ఆలోచించడము జరుగుతుంది. ఇక్కడైతే అసలు స్మృతే చేయరు. బాబాకు చెందినవారిగా అవ్వడముతో మాయ శత్రువుగా అవుతుంది. బుద్ధి బయటకు వెళ్ళినట్లయితే మాయ బాగా కింద పడేస్తుంది. మేము ఏదైతే చేస్తున్నామో, ఇదంతా కింద పడిపోయేందుకే చేస్తున్నామని వారు స్వయము అర్థం చేసుకోరు. తమ సొంత మతముపై నడుస్తూ పడిపోతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారనేది వారికి అసలు అర్థమే కాదు. పిల్లల్లో ఎన్నో కొన్ని లోపాలైతే ఉన్నాయి కదా. ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. నిజానికి తండ్రి నుండి ఎంత ఉన్నతమైన వారసత్వము లభిస్తుంది. సత్యతతో తండ్రి సేవలో ఎంతగా నిమగ్నమవ్వాలి. కానీ మాయ ఎంత శక్తివంతమైనది. కోట్లలో కొందరు మాత్రమే తండ్రిని పూర్తిగా గుర్తిస్తారు. తండ్రి అంటారు, కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. పూర్తి నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారులుగా ఉండని కారణముగా పాపం వారి పదవి అలా అయిపోతుంది. బాబా, మేము రాజయోగాన్ని నేర్చుకుని నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతాము, సీతా-రాములుగా అవ్వము అని అంటారు కూడా, చేతులు కూడా ఎత్తుతారు, కానీ నడవడిక కూడా అలా ఉండాలి కదా. అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు, వారి శ్రీమతముపై ఎంతగా నడుచుకోవాలి. చాలామంది ఎలా ఉన్నారంటే, మేము శ్రీమతముపై నడవనే నడవము అని ప్రతిజ్ఞ చేసినట్లుగా కూర్చున్నారు. వారు దాగి ఉండరు. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ముందుగా దేహాభిమానము చెంపదెబ్బ వేస్తుంది, ఆ తర్వాత కామము. ఒకవేళ కామము లేకపోతే క్రోధము, లోభము ఉంటాయి. వాస్తవానికి అన్నీ శత్రువులే కదా. మోహము కూడా ఎటువంటిదంటే, అది పూర్తిగా సర్వనాశనము చేసేస్తుంది. లోభము కూడా తక్కువేమీ కాదు. ఇవి చాలా కఠినమైన శత్రువులు. పైసకు కూడా కొరగాని వస్తువులను దొంగిలిస్తారు. ఇది కూడా లోభమే కదా. దొంగతనము చేయడమనేది చాలా చెడ్డ అలవాటు. మేము పాపము చేస్తూ ఉన్నట్లయితే ఏం పదవిని పొందుతాము, శివబాబా యజ్ఞములోకి వచ్చి బాబా వద్ద మేము ఇలాంటి పనులు ఎలా చేయగలము అని లోలోపల మనసు తింటూ ఉండాలి. మాయ చాలా తప్పుడు పనులు చేయిస్తుంది. ఎంత అర్థం చేయించినప్పటికీ అలవాట్లు తొలగడము లేదు. కొందరు నామ-రూపాలలో చిక్కుకుంటూ ఉంటారు. దేహాభిమానము కారణముగా నామ-రూపాలలోకి కూడా వచ్చేస్తారు. ప్రతి సెంటరు గురించి బాబాకు అంతా తెలిసి ఉంటుంది కదా. బాబా కూడా ఏమి చేస్తారు, అర్థం చేయించవలసి ఉంటుంది. ఎన్ని సెంటర్లు ఉన్నాయి. బాబా వద్దకు ఎన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. చింత అయితే ఉంటుంది కదా. ఇక అర్థం చేయించవలసి ఉంటుంది - మాయ తక్కువేమీ కాదు, అది చాలా విసిగిస్తుంది అని. పెద్దవారు అని అనిపించుకోవడము అంటే పెద్ద దుఃఖాన్ని పొందడము అని మంచి-మంచి పిల్లలకు చెప్పడము జరుగుతుంది. ఇక్కడైతే దుఃఖము యొక్క విషయమేమీ లేదు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని తెలుసు. ఈశ్వరునికి చెందినవారిగా అయిన తర్వాత కూడా మళ్ళీ మాయకు వశమైపోతారు. ఏదో ఒక వికర్మ చేసేస్తారు, అప్పుడు తండ్రి అంటారు - చాలామంది పిల్లలు, బాబా, మేము మీ శ్రీమతముపై తప్పకుండా నడుచుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు కానీ నడుచుకోరు, అందుకే చూడండి, మాల ఎంత చిన్నది తయారవుతుంది, మిగిలినవారంతా ప్రజలు. ఇది ఎంత గొప్ప గమ్యము, దీని కోసం మనసు చాలా శుద్ధముగా ఉండాలి. సత్యమున్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది అన్న నానుడి కూడా ఉంది. ఒకవేళ తండ్రితో సత్యముగా నడుచుకుంటూ ఉన్నట్లయితే, సత్యయుగములో శ్రీకృష్ణునితో కలిసి నాట్యము చేస్తారు. సత్యయుగములో శ్రీకృష్ణుని నాట్యమే ప్రసిద్ధమైనది. రాసలీల రాధా-కృష్ణులదే చూపిస్తారు. దాని తర్వాత రామలీలను చూపిస్తారు. కానీ రాధా-కృష్ణుల రాసలీల నంబరువన్, ఎందుకంటే ఈ సమయములో వారు తండ్రితో చాలా సత్యముగా ఉంటారు, కావున ఎంతటి ఉన్నత పదవిని పొందుతారు. చేతులైతే చాలామంది ఎత్తుతారు కానీ మాయ ఎలా ఉంది. ప్రతిజ్ఞ చేసినప్పుడు మరి దానిపై నడుచుకోవాలి కదా. మాయా భూతాలను పారద్రోలాలి. దేహాభిమానము వెనుక అన్ని భూతాలు అతుక్కుపోతాయి. బాబా అంటారు, దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. అది కూడా ఉదయముదయమే కూర్చుని మాట్లాడండి. బాబా మహిమను చేయండి. భక్తి మార్గములో స్మృతి చేస్తారు కానీ మహిమ అయితే ఎవ్వరికీ లేదు. శ్రీకృష్ణుడిని స్మృతి చేస్తారు. వెన్న దొంగిలించారని, వారిని అపహరించారని, అకాసురుడిని, బకాసురుడిని హతమార్చారని, అది-ఇది చేశారని వారి మహిమను చేస్తారు. అంతే, ఇంకేమంటారు. అదంతా అసత్యము. సత్యము ఇసుమంత కూడా లేదు. అటువంటప్పుడు మార్గాన్ని ఏమి చూపిస్తారు! ముక్తి అంటేనే తెలియదు. ఈ సమయములో పూర్తి విశ్వముపై రావణుడి రాజ్యముంది. అందరూ ఈ సమయములో పతితముగా ఉన్నారు. మనుష్యులకు భ్రష్టాచారము యొక్క అర్థం కూడా తెలియదు. సత్యయుగములో నిర్వికారీ దేవతలు ఉండేవారని కూడా తెలియదు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని పాడుతారు కూడా. కానీ, అక్కడ కూడా రావణుడు, కంసుడు, జరాసంధుడు మొదలైనవారు ఉండేవారని అనేస్తారు. పవిత్రముగా అవ్వండి అని చెప్తే మరి దేవతలకు కూడా పిల్లలు ఉండేవారు కదా అని అంటారు. అరే, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మీరు పాడుతారు కదా, మరి వికారాల విషయము ఎలా ఉండగలదు. మీరు కూడా నిర్వికారులుగా అయినట్లయితే సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది, పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. మందిరాలకు వెళ్ళి మహిమను పాడుతారు. ఇంటికి వచ్చాక ఆ మహిమను కూడా మర్చిపోతారు. మీరు చెక్ చేసి చూడండి. ఇంటికి వెళ్ళి అర్థం చేయిస్తే ఒప్పుకోరు. అక్కడి మాట అక్కడే ఉండిపోతుంది. పవిత్రముగా అవ్వమని చెప్తే - వాహ్, అది లేకుండా ప్రపంచమెలా నడుస్తుంది అని అంటారు. నిర్వికారీ ప్రపంచమెలా నడుస్తుంది అనేది వారికి తెలియనే తెలియదు.

పిల్లలు పాటను కూడా విన్నారు. మీ మతముపై నడుస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు ఎందుకంటే శ్రీమతముపై నడవటములోనే కళ్యాణముంది. తండ్రి అయితే చెప్తూ ఉంటారు - శ్రీమతముపై నడవండి, లేకపోతే చివరికి మృత్యువు వచ్చేస్తుంది. అప్పుడు మీరే ఈ పాపాలు చేశారు అని న్యాయసభలో అంతా చెప్పవలసి ఉంటుంది. మీ సొంత మతముపై నడిచినట్లయితే కల్ప-కల్పానికి మచ్చ ఏర్పడిపోతుంది. ఒక్కసారి ఫెయిల్ అయితే ఆ తర్వాత సంవత్సరమో, ఆ తర్వాత సంవత్సరమో చదువుకోవచ్చని కాదు. అలా కాదు. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్ప-కల్పము అలాగే జరుగుతూ ఉంటుంది, అందుకే పురుషార్థము చాలా చేయాలి. అడుగడుగు శ్రీమతముపై నడవండి. లోపల ఎటువంటి మురికి ఉండకూడదు. హృదయాన్ని శుద్ధముగా చేసుకోవాలి. నారదునికి కూడా తన ముఖాన్ని అద్దములో చూసుకోమని చెప్పారు కదా. అప్పుడు చూసుకుంటే, నేను కోతి వలె ఉన్నానే అని కనిపించింది. ఇది ఒక ఉదాహరణ. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను ఎంతవరకు శ్రీమతముపై నడుస్తున్నాను? బుద్ధియోగము బయట ఎక్కడా భ్రమించడము లేదు కదా? దేహాభిమానములోనైతే లేను కదా? దేహీ-అభిమానులైతే సేవలో నిమగ్నమై ఉంటారు. అంతా యోగముపై ఆధారపడి ఉంది. భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది. ఇది నిరాకార తండ్రియే నిరాకార పిల్లలకు అర్థం చేయిస్తారు. దీనిని సహజ రాజయోగమని అంటారు. నిరాకార తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించారని వ్రాసి కూడా ఉంది. కేవలం శ్రీకృష్ణుని పేరును వేసేశారు. మేము ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలని మీకు తెలుసు. పుణ్యాత్ములుగా తయారవ్వాలి. పాపము యొక్క విషయమేమీ లేదు. తండ్రి స్మృతిలోనే ఉంటూ వారి సేవలో ఉండాలి. ఇంత ఉన్నతమైన పదవిని పొందాలంటే ఎంతోకొంత శ్రమ అయితే చేస్తారు కదా. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండటము అసంభవమని సన్యాసులు మొదలైనవారు అంటారు. సంపూర్ణముగా అవ్వడములో చాలామంది ఫెయిల్ అయిపోతారు, ఎందుకంటే వారు స్మృతి చేయలేకపోతారు. ఇప్పుడు ప్రాచీన యోగాన్ని తండ్రి నేర్పిస్తున్నారు. తండ్రి అంటారు, యోగాన్ని అయితే నేను స్వయమే వచ్చి నేర్పిస్తాను, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. మీరు నా వద్దకు రావాలి. ఇది స్మృతియాత్ర. అది మీ స్వీట్ సైలెన్స్ హోమ్. మనమే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని పొందుతామని కూడా మీకు తెలుసు. కావున తండ్రి పదే-పదే అర్థం చేయిస్తున్నారు, ప్రతిజ్ఞను పూర్తిగా నిలబెట్టుకోండి. పొరపాటు జరిగినట్లయితే తండ్రిని క్షమాపణలు కోరుకోవాలి.

చూడండి, ఈ బిడ్డ క్షమాపణలు కోరుకునేందుకని విశేషముగా బాబా వద్దకు ఒక రోజు కోసం వచ్చారు. చిన్న పొరపాటు జరిగింది, వెంటనే పరుగెత్తుకుని వచ్చారు, ఎందుకంటే మనసు తింటూ ఉంటుంది, కావున సమ్ముఖములోకి వెళ్ళి బాబాకు వినిపించాలని అనుకున్నారు. వీరికి బాబా పట్ల ఎంత గౌరవముంది. చాలామంది పిల్లలు ఇంతకన్నా ఎక్కువ వికర్మలు చేస్తూ ఉంటారు కానీ అసలు తెలియను కూడా తెలియదు. నేనైతే - వాహ్, ఈ బిడ్డ చాలా మంచివాడని అంటాను. చిన్న పొరపాటు చేసినా క్షమాపణలు కోరుకోవడానికి వచ్చాడు. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పొరపాటు ఏమి జరిగిందో చెప్పి క్షమాపణలు కోరుకోండి, లేకపోతే ఆ పాపాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కింద పడిపోతారు. ముఖ్యముగా యోగముతోనే రక్షింపబడగలరు. ఆ యోగము చాలా తక్కువగా ఉంది. జ్ఞానమైతే చాలా సహజము. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యముండేది, ఎలా రాజ్యము చేశారు, ఎంత సమయము చేశారు, ఆ తర్వాత రాజ్యము చేస్తూ-చేస్తూ ఎలా వికారాలలో చిక్కుకున్నారు - ఇదంతా ఒక కథ వంటిది. మీపై ఎవరూ దాడి చేయలేదు. మీరు వైశ్యులుగా అయిన తర్వాత దాడి జరిగింది. మీ నుండి రావణుడు రాజ్యాన్ని లాక్కున్నాడు. మీరు మళ్ళీ రావణుడిపై విజయము పొంది రాజ్యాన్ని తీసుకుంటారు, ఇది కూడా ఎవరి బుద్ధిలోనైనా కష్టము మీద కూర్చుంటుంది. మీరు తండ్రికి పూర్తిగా నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారులుగా ఉండాలి. అజ్ఞానకాలములో కూడా కొందరు నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారులుగా ఉంటారు. కొందరు నౌకర్లు కూడా చాలా నిజాయితీపరులుగా ఉంటారు. లక్షల రూపాయలు అక్కడ అలా పడి ఉన్నా కూడా ఎప్పుడూ ఒక్క రూపాయిని కూడా ముట్టుకోరు. సేఠ్ గారు, మీరు తాళంచెవులు వదిలి వెళ్ళారు, నేను జాగ్రత్తగా తీసి ఉంచాను అని చెప్తారు. ఇటువంటివారు కూడా ఉంటారు. తండ్రి అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తూ ఉంటారు. ఫలానా కారణము వలన మాలలోని మణులుగా అవ్వరని వివేకము చెప్తుంది. ఇక అక్కడకు వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. చదువుకోకపోతే తప్పకుండా ఇటువంటి పరిస్థితే ఏర్పడుతుంది. శ్రీమతముపై నడవరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీ గమ్యమంతా యోగానికి సంబంధించినది. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుని యోగము కుదరకుండా చేస్తుంది. యోగము ఉన్నట్లయితే సేవ చాలా బాగా చేస్తారు. పాపాల భయము ఉంటుంది. ఉదాహరణకు, ఈ బిడ్డ చాలా మంచివాడు, సత్యత అంటే ఇలా ఉండాలి. మంచి-మంచి పిల్లల కన్నా ఇతని పదవి బాగుంటుంది. మరియు ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, వారు ఎక్కడో ఒకచోట చిక్కుకుని ఉంటారు. ఏమీ చెప్పరు. ఒకవేళ వదలమని చెప్పినా వదలరు. పాటలో చూడండి, ఏమి జరిగినా కానీ ఇటువంటి పొరపాటు ఇక ఎప్పటికీ చేయమని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైన విషయము దేహాభిమానానికి చెందినది. దేహాభిమానము వలనే పొరపాట్లు జరుగుతాయి. చాలా పొరపాట్లు చేస్తారు, అందుకే సావధానపరుస్తూ ఉంటారు. బాబా పని అర్థం చేయించడము. అర్థం చేయించకపోతే మాకు ఎవరూ అర్థం చేయించలేదని అంటారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. పిల్లలూ, జాగ్రత్తగా ఉండండి అని తండ్రి కూడా అంటారు. లేకపోతే చాలా శిక్షలు తినవలసి ఉంటుంది. మళ్ళీ, మాకు ఎందుకు అర్థం చేయించలేదని అనకండి. కొంచెం పాపము చేసినా కానీ అది చాలా వృద్ధి చెందుతుందని బాబా స్పష్టముగా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత బాబా ఎదురుగా తల ఎత్తుకోలేరు కూడా. అబద్దము చెప్పినట్లయితే పశ్చాత్తాపపడి, భగవంతుడిని క్షమాపణలు కోరుకుని ఇంకెప్పుడూ ఆ పాపము చేయమని ప్రతిజ్ఞ చేయాలి. శివబాబా మమ్మల్ని చూడటము లేదు కదా అని అనుకోకండి. అరే, అజ్ఞానకాలములో కూడా వారికి అన్నీ తెలుసు, అందుకే కదా పాప-పుణ్యాల ఫలాన్ని ఇస్తారు. మీరు పాపము చేసినట్లయితే మీకు చాలా కఠినమైన శిక్ష ఉంటుందని వారు స్పష్టముగా చెప్తున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు, దానికి బదులుగా రెండు చెవులు కట్ అయ్యేలా జరగకూడదు కదా. చెప్పడము ఒకటి చెప్తారు, కానీ ఇతరులను స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేయకపోతే వారి గతి ఏమవుతుందో చెప్పండి. సత్యమే తినాలి, సత్యమే మాట్లాడాలి, సత్యమే ధరించాలి... ఇది కూడా ఇప్పటి విషయమే. బాబా వచ్చి నేర్పిస్తున్నప్పుడు వారితో ప్రతి విషయములోనూ సత్యముగా ఉండాలి. అచ్ఛా!

ఇటువంటి సత్యమైన నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారులుగా ఉన్న పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యతతో తండ్రి సేవలో నిమగ్నమవ్వాలి. పూర్తిగా నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారులుగా అవ్వాలి. ఈశ్వరీయ పరివారము పట్ల సత్యమైన ప్రేమ కలిగి ఉండాలి.

2. శ్రీమతములో మన్మతాన్ని మరియు రావణుడి మతాన్ని మిక్స్ చేయకూడదు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు - ఈ గ్యారంటీలో పక్కాగా ఉండాలి. హృదయాన్ని శుద్ధముగా, పవిత్రముగా తయారుచేసుకోవాలి.

వరదానము:-
ఆత్మిక సుగంధము యొక్క ఆధారముతో సర్వులకు పరమాత్ముని సందేశాన్ని ఇచ్చే విశ్వ కళ్యాణకారీ భవ

ఆత్మికత యొక్క సర్వ శక్తులను స్వయములో ధారణ చేసినట్లయితే ఆత్మిక సుగంధము సహజముగానే అనేక ఆత్మలను తనవైపుకు ఆకర్షిస్తుంది. ఏ విధముగా మనసా శక్తి ద్వారా ప్రకృతిని తమోప్రధానము నుండి సతోప్రధానముగా చేస్తారో, అలా మీ ముందుకు రాలేని విశ్వములోని అనేక ఆత్మలకు, వారు దూరముగా ఉన్నా కూడా మీ ఆత్మికతా శక్తి ద్వారా తండ్రి పరిచయాన్ని లేక ముఖ్య సందేశాన్ని ఇవ్వగలరు. ఈ సూక్ష్మ మెషినరీని తీవ్రతరము చేసినప్పుడు తపిస్తున్న అనేక ఆత్మలకు అంచలి లభిస్తుంది మరియు మీరు విశ్వ కళ్యాణకారులుగా పిలువబడతారు.

స్లోగన్:-
మీ వద్ద శుద్ధమైన మరియు శ్రేష్ఠమైన సంకల్పాలను ఇమర్జ్ చేసి పెట్టుకున్నట్లయితే వ్యర్థము సహజముగానే మర్జ్ అయిపోతుంది.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ఏ సమయములోనైనా ఏదైనా పరిస్థితి వస్తే తండ్రిని సహచరునిగా చేసుకున్నట్లయితే - నేను ఒంటరివాడిని కాను, నాతో పాటు విశేషమైన శక్తి ఉంది అని అనుభవము చేస్తారు. ఎక్కడైతే తండ్రి ఉంటారో, అక్కడ ఎన్ని తుఫానులు ఉన్నా కానీ అవి కానుకలుగా అయిపోతాయి. నిశ్చయబుద్ధి విజయంతి - ఈ టైటిల్ యొక్క స్మృతితో విజయులుగా అవ్వండి మరియు విజయీ సంవత్సరాన్ని జరుపుకోండి.